మధురలో కుబ్జకు సౌందర్య ప్రదానము చేసిన విధానము క్రియాయోగ ప్రక్రియ. శరీరములో సకలేంద్రియములను వశములో ఉంచుకునే ఒక కేంద్రమున్నది. దానిని వశములో ఉంచుకొన్న యోగి స్పర్శదృగింద్రియములను ప్రభావితము చేసి, ఒకరూపమును మనసులో భావించి, ఆవ్యక్తిని స్పృశించినప్పుడు ఆ వ్యక్తికి ఈ రూపము ప్రాప్తిస్తున్నది. పద్మాసనములో కూర్చునిచేసేవి,పడుకొని చేసేది వంటి క్రియాయోగప్రక్రియలు ఉన్నాయి. మూలాధారమందు గణపతిని, సహస్రారమందు అనంతుని (వేయిపడగల ఆదిశేషుని) భావించాలి. మూలాధారమునుండి సహస్రారమువరకు జీవుని ప్రయాణము. ఈ సహస్రారమునే సహస్ర దళకమలమని యోగులు అంటారు. పురుష సూక్తములో "సహస్రాక్ష సహస్రపాత్" అంటే ఇదే. అనంతుడైన ఆదిశేషునిపై శయనించిన మహావిష్ణుపాదములవద్ద లక్ష్మి ఉన్నది. ఇప్పుడు జీవుడు తనలోని ప్రకృతిని లక్ష్మివద్ద వదలిపెట్టాలి. ఈ లక్ష్మియే మూలప్రకృతి. ప్రకృతిని విసర్జించిన జీవుడు పరిశుద్ధుడు అవుతాడు. ఇంకమిగిలినది పరమాత్మలో ఐక్యమే. అనంతమైన ఆదిశేషువు అంటే ఆద్యంతములులేనివాడు. జగత్తు అనంతముగా ఉన్నది. ఆదిశేషువే అది. కృష్ణుడు చెప్పిన క్రియాయోగరహస్యము ఇదే.
యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని దయకు పాత్రులైనవారిలో ఘంటాకర్ణుడనే గంధర్వుని వృత్తాంతము ఉన్నది. అతడు ఉత్తరదిశలోనున్న కుబేరుని రాజ్యంలో ఉండేవాడు. కుబేరుడు, ఘంటాకర్ణుడు కూడా గొప్ప శివభక్తులు. కొన్ని దినములకు కుబేరునికి ఘంటాకర్ణుడు తనకంటె గొప్ప శివభక్తుడేమోనని అనుమానం వచ్చినది. కొంత అసూయతో ఘంటాకర్ణుని శపిస్తాడు. "నీ శరీరము దుర్భరమైన చర్మ వ్యాధితో, దుర్గంధముతో, రక్తస్రావముతో నిండి ఉంటుంది. అప్పుడు నీవు శివపూజ, ధ్యానాదులు చేయలేక పడిఉంటావు" ఇది కుబేరుని శాపం. ఘంటాకర్ణుడు ఆ స్థితిలోకూడా మనస్సుని శివునిపై నిలుపుకొని ఉండిపోయినాడు. శివుడు ప్రత్యక్షమై " నీకు శాప విముక్తి కలుగుతుంది. నీవు ఊహించని ఒక సంఘటన జరుగుతుంది" అని చెబుతాడు.
అది శ్రీకృష్ణుడు భూమిపై సంచరిస్తున్న కాలము. కైలాస పర్వతము సమీపములో తపస్సుచేసి శివదర్శనము చేయాలని శ్రీకృష్ణుడు గంధర్వదేశానికి వెడతాడు. అక్కడ ఘంటాకర్ణుడు అతనికి కనబడుతాడు. కృష్ణునితో "నేను తమకు అనువైన ప్రదేశం కైలాస సమీపములో చూపిస్తాను. అసూయతో నాప్రభువైన కుబేరుని శాపం వలన రోగగ్రస్తమైన ఈ శరీరముతో కైలాసమునకు రాలేను" అని చెప్పగానే కృష్ణుడు విషయముగ్రహించి, దయతో తన వేణు దండముతో అతనిని కదిలించి స్పృశించాడు. అతని జీవుడు మరియొక అద్బుతమైన సుందరశరీరమును ధరించినది. శరీరము తేజోవంతమై, సుగంధము వెదజల్లినది. కృష్ణుడు గంధర్వునికి విష్ణువుగా దర్శనమిచ్చి "నీవు నాకు ఏమి ఇస్తావు?" అని అడిగాడు. "అక్కడ దుర్గంధపూరితమై పడిఉన్న ప్రాణములేని పూర్వ కళేబరమును తమకే సమర్పిస్తాను" అంటాడు. "నీవు దానిని దహనముచేయుము" అని చెప్పి శ్రీకృష్ణుడు తనదారిన వెళతాడు. (ఈ కథ ఉత్తర హరివంశము లోనిది.) ఆ పూర్వ శరీరమును దహించినప్పుడు కూడా సుగంధము వచ్చినది.
ఈ కథలో గురుతత్త్వము నిరూపితమౌతున్నది. గురువు నీపూర్వ శరీరమును దహింపజేసి వెనుకకు తిరిగి చూచినప్పుడు దాని పూర్వపు స్థితి జ్ఞాపకములేకుండా చేస్తాడు. ఒకవేళ అలాగ చూడగలిగినా, ఒకప్పుడు ప్రపంచములో నీ ఉనికిని గుర్తించి దానిని ఒక వింతగాచూడగలవేగాని అదిభోగ్యమైన స్వప్నముగా కనుపించదు. తన పూర్వ శరీరమును గురువుకు ఇస్తున్నాను అనడములో తన గతమును ఇస్తున్నాడు. ఆంటే గతజీవితమును వదలివేస్తున్నాడని అర్థము. తన గురువు ఇచ్చిన నూతన దేహమును వదలుకొనక గురువు నిర్దేశించిన నూతన మార్గములో పయనిస్తాడు.
ఘంటాకర్ణుడు మంత్రరూపుడైనాడు. భూతప్రేత పిశాచములను వదలించుకోడానికి ఘంటాకర్ణ మంత్రమును జపిస్తారు.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment