What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 24 July 2014

కష్టసుఖాలు వచ్చీపోయే అతిథులు. అయినప్పటికీ కష్టం వచ్చినప్పుడు కృంగిపోవడం మానవ సహజం. ఆ స్థితిలో అంతా శూన్యంగా తోచడం కూడా జరుగుతుంది. దానితో వెంటనే ఈ జీవితాన్ని చాలించాలనిపిస్తుంది.


"చనిపోతే బాగుండును" అని ప్రతి వ్యక్తీ ఏదో ఒక సందర్భంలో అనుకుంటాడు. ’ఒక’ మాత్రమే కాదు ’అనేక’ సందర్భాలలో అలా అనిపిస్తుంది. తనంత తాను మరణించాలని ప్రయత్నించడమే ఆత్మహత్యా యత్నం.
తన ఉనికియే లేకపోతే - ఇంక ఏ బాధా ఉండదు కదా...అనే భావన చేత ఏర్పడే మనః స్థితి అది.
కానీ ఆ సమయంలో మన ప్రాచీన సంస్కృతి చెప్పిన కొన్ని అంశాలను స్ఫురణకు తెచ్చుకుంటే ఆ మానసిక వైకల్యం నుండి బయటపడగలం.
మనిషి మూడు ఉద్రేకాల వల్ల తన ఇంగితాన్ని కోల్పోతారు:
౧. శోకోద్రేకం ౨. క్రోధోద్రేకం ౩. మోహోద్రేకం
ఉద్రేకం వల్ల విచక్షణ పనిచేయదు. ఆ సమయంలో విచక్షణని మేల్కొలిపే వివేకం శాస్త్ర గ్రంథాల సాయంతో లభిస్తుంది.
శ్రీ మద్రామాయణంలో జీవితపు విలువను చాలా రమ్యంగా ప్రతిష్ఠించాడు వాల్మీకి.
’బ్రతకాలి - ఎలాగైనా బ్రతకాలి. బ్రతికుంటేనే భద్రాలను పొందగలం’.
హనుమంతుడు సీతాన్వేషణార్థం లంకకు చేరుకున్నాడు. నగర వీధులనీ, గృహాలనీ, అంతఃపురాన్నీ, వనాలనీ, విహారస్థలాలనీ....దేనినీ విడిచిపెట్టకుండా గాలించాడు. అయినా సీతజాడ కానరాలేదు.
’ఎలాగైనా సీతను దర్శిస్తాను’ అని ఆత్మ విశ్వాసంతో ధైర్యంగా బయలుదేరిన ఆంజనేయ స్వామికి - తన ఆశ అడియాసగా మారే సూచనలు కనిపించాయి. ఇంక వెతకవలసినది మిగలలేదు. ఇంకేమిటి కర్తవ్యం!
"తిరిగి వెళ్ళి ’సీత కనబడలేదు’ అని చెప్తే ఎన్నో ప్రమాదాలు ఎదురు కావచ్చు. సీత జాడ తెలియనందున శ్రీరాముడు జీవించలేడు. ఆయన లేనప్పుడు లక్ష్మణాదులు ఉండలేరు. తన మాటను సాధించలేనందుకు సుగ్రీవుడు సైతం జీవితాన్ని త్యజిస్తాడు. ఇలా ఉభయులను దెబ్బతీసిన వాడను అవుతాను. అందుకే తిరిగి కిష్కింధకు వెళ్ళడం మంచిదికాదు.
ఈలంకలోనే జీవితాన్ని చాలించాలి. ఇక్కడే తమంత తాముగా లభించిన ఫలజలాలను స్వీకరిస్తూ కాలం గడపాలి. లేదా - చితిని ఏర్పరచుకొని దూకాలి. లేదా - సముద్రంలో పడిపోవాలి.
అదీ కుదరనప్పుడు - నియమబద్ధుడనై తాపసినై ఇక్కడే ఉండాలి...." అనినిర్ణయించుకుంటాడు. అలా ఉద్రేకంలో తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో అన్న సందేహంతోఆ నిర్ణయాన్ని కొద్దికాలం వాయిదా వేస్తాడు. క్రమంగా అతనిలోని వివేకం మేల్కొంటుంది. ఆలోచనా సరళి మారుతుంది....
అగ్నిలో దూకడం, సముద్రంలో పడడం తగని పనులు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితాన్ని విడువరాదు.
వినాశేబహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి!
తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః!!
’నశించిపోవడంలో అన్నీ దోషాలే. జీవించితేనే శుభాలను చూడగలం. అందుకే ప్రాణాలను ధరిస్తాను. బ్రతికుంటే ఎప్పటికైనా సీతమ్మ కలవవచ్చు.
ఇంకా వెతుకుతాను. ఆ అన్వేషణ కర్మను మానను. నా ప్రయత్నం నేను ఆచరిస్తాను’ అని నిశ్చయించుకున్నాడు హనుమ.
ఇందులో ’వినాశే బహవో దోషాః...’ శ్లోకం నిత్యం స్మరణలో ఉంచుకోవలసినది. ముఖ్యంగా - బేల మనస్సుతో ఆత్మహత్యా ప్రయత్నాలకు ఒడిగడుగున్న విద్యార్థులు సమస్యను ఎదుర్కొనలేని స్త్రీపురుషులు తమ నివాసపు గోడల మీదనో, టేబుల్ పైనో ఈ శ్లోకాన్ని భావంతో సహా వ్రాసి పెట్టుకోవాలి. బలహీనత ఏర్పడినప్పుడు, ఈ శ్లోకాన్ని ఒక్కసారి చదువుకోవాలి.
దీని తాత్పర్యం:
ఒక కష్టం మనం కోరితే రాలేదు. అలాగే మనం కోరకుండానే సుఖమూ రావచ్చు. ఇవాళ జీవితాన్ని భరించలేనంత కష్టం వచ్చినట్లే, ’ఇంకా జీవించాలి’ అనే ఆశను పెంచే సుఖమూ భవిష్యత్తులో రావచ్చు. ఇప్టి మేరకే మన దృష్టిని నిలిపి జీవితాన్ని నశింపజేసుకుంటే, రేపటి సుఖానికి మనం మిగలం కదా!
హనుమంతుడు అప్పుడే హతాశుడై నిస్పృహతో జీవితాన్ని పూర్తి చేసుకొని వుంటే - సీతాదర్శనం, రావణవధ, లోకకళ్యాణం జరిగి ఉండేవా? అందుచేతనే-
’ఆపదలందు ఓర్మియును - (ఓరిమి - సహనం)
అంచిత సంపదలందు ధైర్యము’ - చాలా అవసరమని సుభాషితకారుని బోధ.
జీవితంలో ఒక ద్వారం మూసుకున్నా, మరెన్నో ద్వారాలున్నాయి. అన్నింటికంటే విలువైనది జీవితం. దానిని ఎప్పుడూ చేజార్చుకోకూడదు.
ఇదే రామాయణం - సుందరకాండలో మరొక చక్కని సన్నివేశం తారసపడుతుంది....
హనుమంతుడు అశోకవృక్షంపై కూర్చొని గమనిస్తున్నాడు.
రావణుని ప్రేలాపన, సీతమ్మ సమాధానం! అంత దైన్య స్థితిలోనూ ధైర్యంగానే సమాధానమిచ్చింది సీత. ’వృత్తశాండీర్య గర్వితా’ అంటారు వాల్మీకి. ప్రవర్తన, శీలం వలన ఏర్పడిన ఆత్మ విశ్వాసం ఆమెకు ధైర్యాన్నిచ్చింది. ధర్మం ఉన్నచోట - ఎంత దైన్య పరిస్థితులున్నా, అంతర్గతంగా గొప్ప ధైర్యం ఉంటుంది. భౌతికంగా ఎంత రక్షణ ఉన్నా, అధర్మపరుని అంతరంగంలో భయం సహజం. అందుకే ధర్మం వల్ల ఏర్పడిన స్థైర్యంతో తల్లి జానకి గట్టిగానే సంభాషించింది.
కోపోద్రిక్తుడైన దశకంఠుడు రెండు మాసాలు గడువు విధించి వెళ్ళాడు. రాక్షస స్త్రీలు అనేక మాటలతో సీతను నొప్పించారు.
తరువాత రాక్షస వనితలు నిద్రించాక, సీతాదేవి దుఃఖితురాలై జీవితాన్ని చాలించదలచుకుంది. అప్పటికే లంకలో పది నెలలు బంధింపబడింది. ఎక్కడా రాముని జాడగానీ, వార్తగానీ లేవు. ఆశకి అవకాశం కనిపించడం లేదు. రావణుడు విధించిన గడువు రెండు నెలలే. ఈ రెండు నెలల్లో రాముడు వచ్చే జాఖలేమీ లేవు. తాను రాక్షసుల వల్ల మరణించడం కన్నా, తనంత తానే బ్రతుకును ముగించుకోవడం మంచిది...ఇలా ఆలోచించింది సీతమ్మ. పరిస్థితుల ప్రభావం చేత ఇలాంటి నైరాశ్యం ఏర్పడడం సహజమే.
చివరకు తన జడను చెట్టుకొమ్మకు వేలాడవేసి, ఉరిపోసుకుందామని ప్రయత్నించింది. అప్పుడే ఆంజనేయుడు రామకథాగానంతో అమ్మ మనసును మరల్చి, తాను చెట్టు దిగి రాముని సందేశాన్ని వినిపించాడు. దానితో - రాహువు వదలిన చంద్రునిలా జానకమ్మ వదనం శోభించింది.
అప్పుడు సీతాదేవి -
కళ్యాణీ బత గాథేయం లౌకికీ ప్రతిభాతి మా!
ఏతి జీవంతమానందో నరం వర్షశతాదపి!!
’లోకంలో అనుకునే మంచిమాట నిజమని తెలుస్తోంది. మనిషి బ్రతికుంటే వందేళ్ళకైనా, ఎప్పటికైనా ఆనందాన్ని పొందగలడు’ అని స్పష్టం చేసింది.
ఆ క్షణంలో ఆమెకు జీవితం విలువ తెలిసింది. జీవించాలి. ఎప్పటికైనా సుఖపడగలం. ఈ ఆశావాదం చాలా ప్రధానం. ఆమె తొందరపడి ఉన్నా, హనుమ ఆలస్యం చేసినా కళ్యాణకరమైన రామకథకి అవకాశమే లేదు.
ఈ వృత్తాంతం కూడా బ్రతుకు విలువను తెలియజేస్తోంది. పై శ్లోకంలో రెండవ వాక్యం ఎప్పుడూ గుర్తుంచుకోదగినది.
ప్రతికూల పరిస్థితులు, అపరాధభావన కూడా ఆత్మహత్యలకు దారితీస్తాయి. ప్రతి సమస్యకీ పరిష్కారం ఉంది. పశ్చాత్తాప పడితే, ప్రతి అపరాధానికీ ప్రాయశ్చిత్తం ఉంది.
ఈ జీవితాన్ని మనం తెచ్చుకోలేదు. మనకి ఇవ్వబడింది. పుట్టుక మన ప్రమేయం లేకుండా జరిగినట్లే ముగింపు కూడా మన ప్రమేయంతో ముడిలేనిదే.
ఈ లోకం మిశ్రలోకం. పాపపుణ్య, సుఖదుఃఖాది ద్వంద్వాల మిశ్రమమిది. అవకాశాలు అనంతాలు. దుఃఖాన్ని కలిగించేలా, ఒక అవకాశం కోల్పోయినా - సుఖాన్ని కలిగించే మరొక అవకాశాన్ని మనమే అన్వేషించుకోగలం.
’శరీరమాద్యం ఖలు ధర్మ సాధనమ్...
శరీరమంటూ ఉంటేనే ఏదైనా సాధించగలం. ధర్మసాధనము బయటి పరికరాల కన్నా ముందు, మన ఇంద్రియాలే ప్రథమ పరికరాలు. ఇవ్వబడిన శరీరం మనకి ధర్మ పరికరం మాత్రమే. కేవలం భోగయంత్రం కాదు.
ఈ ధర్మ పరికరాన్ని మనంతట మనం నశింపజేయడం మహాపాపం. ఈ శరీరం పోయినంత మాత్రాన, మన కర్మానుభవం పోదు. ఆ సుఖదుఃఖాలను తరువాతి జన్మలోనైనా అనభవించక తప్పదు. అప్పుడు ఈ ఆత్మహత్యా పాప ఫలాన్ని కూడా అనుభవించవలసి వస్తుంది. ఈ విధంగా - పాప పుణ్య విచక్షణతో చూసినా ఆత్మహత్య దోషమే.
ఆశావాదాన్నీ, జీవితం గొప్పదనాన్నీ చెప్పిన గ్రంథాలు మన పురాణేతిహాసాలు. వాటిని నిరంతరం మననం చేయడం వల్ల సందర్భానుగుణంగా సరియైనవి స్ఫురించి సక్రమ మార్గంలో నడుపుతాయి.






No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML