What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 22 July 2014



సర్వప్రవర్తకుడైన పరమేశ్వరుడు ఈ భూమిపై గురువుగా అవతరించి ఏది క్షేమమో, ఏది యోగమో, ఏది మంచిదో, ఏది కాదో ఎందుకు జీవించవలెనో, అనేక మార్గములలో ఎటువంటి గుణదోషములు ఉన్నవో అన్నీ విశ్లేషణ చేసి మార్గదర్శకుడైనప్పుడే గురుతత్త్వమనే వ్యవస్థ మన భూలోకములో అవతరించినది. అందుకే మనము ఆది గురువుగా శ్రీ కృష్ణపరమాత్మనే చెప్పుకుంటాము. అతడే గురువని మనకు తెలియజెప్పినవారు వ్యాస భగవానులు. ఆయన గ్రంధములవలననే, బోధల వలననే మనకు శ్రీకృష్ణ తత్త్వము అవగతమైనది. గురు పూర్ణిమ నాడు మనము వ్యాసుని తలచుకుంటాము. "భూమిపై అవతరించిన ఈ కృష్ణ భగవానుడే మీకు గురువు. ఇతనినే మీరు అనుసరించాలి" అని చెప్పిన వారు వ్యాసదేవుడు.
సృష్టి రహస్యములు తెలిసిన వాడు, ప్రకృతి లక్షణములు తెలిసిన వాడు, తానే భగవంతుడైన వాడు. ముక్తికి అత్యంత సులణోపాయమును తెలిపి, బంధమోచనము చేసి ముక్తికి తీసుకువెళ్ళగలిగిన వానినే జగద్గురువు అని వ్యవహరించాలి. అలా కానప్పుడు కేవలము ఒక సాంప్రదాయమునకు చెంది, వారి మార్గములే ఉత్తమములని బోధించే వారు జగద్గురువులు కాలేరు. ఆర్య సంస్కృతిలో భగవంతుని చేరుటకు అనేక మార్గములున్నవి. అందుకై శ్రీకృష్ణుడు అవతరించి వాటిని సమన్వయ పరచి మనము వాటిని ఎలా స్వీకరించవలెనో, మన బాధ్యతలు ఏమిటో చెప్పవలసిన అవసరం వచ్చినది. జగత్తుని గురించి, లోకాతీత జ్ఞానమును గురించి అధికారికముగా ఒకే సమయములో చెప్పగలిగినది భగవంతుడే. అతడే జగద్గురువు. ఎవరినైనా ఉద్ధరించగల సమర్థుడు.
జగద్గురువు పదమునకు రెండు అర్థములున్నవి. జగత్తు ఉన్నంత వరకు ఉండే గురువని ఒక అర్థము. సృష్టికి పూర్వమే జీవులకు ముక్తి మార్గము ఏర్పరచినవాడు జగద్గురువు. సృష్టి లోనే జీవులయందు అనుగ్రహము ఉన్నది. జీవులకు చీకటి నుండి వెలుగులోనికి, అజ్ఞానమునుండి జ్ఞానములోనికే వెళ్ళే అవకాశము సృష్టివలననే ఏర్పడుతున్నది. ఈ విధముగా భగవంతుడు జీవులను తనలోనికి తీసుకుంటున్నాడు. దేవతలకు కూడా జగద్గురు తత్త్వము అవసరమే. మహర్షులు కూడా మౌనియైన దక్షిణామూర్తిని పొంది యున్నారు. ఇతడే ప్రప్రథమ జగద్గురువు. అత్రిమహర్షిపుత్రుడు, త్రిమూర్తుల అంశలతో జన్మించిన దత్తాత్రేయుడు మరొక జగద్గురువు . అతని తరువాత భూమిమీద అన్నిమార్గములను సమన్వయముచేసిన జగద్గురువు శ్రీకృష్ణుడు. సామాన్యులమైన మనకు మనస్థితికి తగిన బోధలు ఇవ్వగలవారిని జగద్గురువు తత్త్వములోని ఒక మెట్టుగా పరిగణించాలి.
శ్రీకృష్ణునికి ముందు తపస్సు ద్వారా, లేదా యజ్ఞ యాగాది క్రతువుల ద్వారా దేవతలను మెప్పించి ఊర్ధ్వలోకములు లేదా క్రమ ముక్తి పొందే విధానములే విరివిగా ఉండేవి. కాని కాలగతిలో కలియుగ ప్రవేశము నాటికి పూర్వ వేద విహిత విధానములకు కావలసిన మనోదారుఢ్యము, ఇంద్రియ నిగ్రహము, శరీర స్థైర్యము మనుష్యులలో క్షీణించినది. అందువలన జగత్తుకు మూలకారణమైన శుద్ధచైతన్యమును వినియోగించుకునే పద్ధతిగా యోగమును శ్రీకృష్ణుడు ప్రప్రథమముగా ఈ లోకమున ప్రవేశ పెట్టుట జరిగినది. కృష్ణుడు ఇంద్రాదులైన దేవతలకు కూడా తన యోగ సిద్ధులను చూపించినాడు. భగవద్గీతలో సాంఖ్య యోగము, కర్మయోగము, జ్ఞానయోగము, భక్తియోగము మొదలైన మార్గములన్నిటినీ యోగములుగానే నిర్వచించినాడు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML