కనకదుర్గా ఆలయంలో అమ్మవారిని అన్నపూర్ణ అలంకారంతో భావించి ఆరాధించడం సంప్రదాయంగా వస్తున్నది. అన్నపూర్ణ అన్నటువంటి భావనయే చాలా ఉత్కృష్టమైనది. అన్నపూర్ణ మంత్ర విశేషములు చాలా మనకి శాస్త్ర గ్రంథాలలో, ఆగమాలలో కనపడుతూన్నాయి. ఉపాసనా సంప్రదాయంలో అన్నపూర్ణ ఉపాసన ప్రత్యేకించి ఉన్నది. ఏవిధంగా అయితే శారదా ఉపాసన, లలితా ఉపాసన ఉన్నాయో అన్నపూర్ణ ఉపాసన ప్రత్యేకించి ఒకటి ఉన్నది. శ్రీవిద్యలో అయితే అమృత శక్తిగా ఈ తల్లిని చెప్తారు. అమృతేశ్వరీ దేవి, అన్నపూర్ణా దేవి – ఈ రెండు స్వరూపములు ఒకటే. ఈ అన్నపూర్ణ భావన మనకి క్షేత్రాలలో చూస్తే కాశీక్షేత్రంలో ప్రధానంగా కనపడుతున్నది. అదేవిధంగా ద్రవిడ దేశాలలో కొన్నిచోట్ల అన్నపూర్ణ క్షేత్రాలున్నాయి. అన్నపూర్ణ, విశాలాక్షి – ఈ రెండూ కూడా ఒకే తల్లియొక్క రెండు నామములు. అంతేకానీ విశాలాక్షి వేరు, అన్నపూర్ణ వేరూ కాదు. కాశీక్షేత్రంలో విశ్వనాథుడు తండ్రిగానూ, అన్నపూర్ణమ్మ తల్లిగానూ చెప్పబడుతూ సర్వజీవులనూ కూడా కాపాడుతున్న తల్లిదండ్రులు వారు అనే భావనతో
మాతాచ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః!
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్!!
అని ప్రసిద్ధిచెందిన శ్లోకం ఉన్నది. ఆ పార్వతీ దేవి అమ్మ. అమ్మ అనడంలోనే అన్నపూర్ణత్వం అందులో కనపడుతోంది. ఈ అన్నపూర్ణ అన్న మాటలో ప్రతివారికీ ఆకలి బాధ లేకుండా చేసే తల్లి ఆవిడ. ఈ దృష్టితో చూస్తే విశ్వవ్యాపకమైన భగవచ్ఛక్తి సృష్టిలో అందరికీ ఆహారాన్నిస్తోంది. అన్నప్రదాయని ఆవిడ. అందుకే ఎవరైనా సరే అన్నం తినేటప్పుడు ఆ పెట్టినటువంటి తల్లిని జగన్మాతను ఒక్కసారి తలంచుకొని తింటే అంతవరకు అన్నపదార్థం అప్పుడు అన్న ప్రసాదం అవుతుంది. అందుకే ఎవరు ఏది తిన్నా జగన్మాత వడ్డిస్తున్నది అన్న భావనతో ఆరగించగలగాలి. అలా తిన్న అన్నము చిత్తశుద్ధిని కలిగించి జ్ఞాన వైరాగ్యాలు ఇస్తుంది. అందుకే
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణ వల్లభే!
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతీ!!
అనే ప్రసిద్ధ శ్లోకం ఉన్నది. అయితే దీని ప్రసిద్ధి ఎంతో తత్త్వం కూడా అంత గొప్పగా ఉంటుంది. ఆవిడ అన్నపూర్ణ. సమస్తములైన అన్నములు నిండుగా ఉన్నాయిట ఆవిడ దగ్గర. సృష్టిలో అనేకమంది జీవులు ఇప్పుడున్న వాళ్ళు, తరువాత వచ్చేవాళ్ళు, అందరికీ అన్నం పెడుతున్నప్పటికీ ఆమె దగ్గరున్న అన్న భాండాగారం తగ్గదు, తరగదు. అలాంటి అన్నపూర్ణ. పైగా ఎప్పుడూ అది నిండుగా ఉంటుంది కనుక సదాపూర్ణే. పైగా శంకర ప్రాణవల్లభే – శివునియొక్క ప్రాణప్రియ. ఇలా ఎప్పుడైనా అమ్మవారిని తలంచుకున్నప్పుడు అయ్యవారిని కూడా తలంచితే అది ఉత్కృష్టమైన ఫలితములనిస్తుంది. అది ఒక శివశక్త్యాత్మకమైన ఉపాసన ఇస్తుంది. అలాంటి తల్లి ఇచ్చిన అన్నాన్ని మనం తింటున్నాం. ఆ అమ్మ వడ్డించింది అన్న భావన కలిగితే మనస్సు పసితనమంత నిర్మలమౌతుంది. అందుకే తల్లీ! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం – అమ్మ పెట్టిన ప్రసాదం వల్ల చిత్తం శుద్ధమై జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి. జ్ఞాన వైరాగ్యం కలిగిందా అది మోక్షహేతువు అవుతుంది. అందుకు జ్ఞాన వైరాగ్యదాయకమైన అన్న ప్రసాదాన్ని ప్రసాదించవలసిందిగా అన్నపూర్ణమ్మను ప్రార్థిద్దాం.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment