ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 - ఘ్రుశ్నేశ్వర జ్యోతిర్లింగం - ఎల్లోరా గుహలకు దగ్గరలో, మహారాష్ట్ర.
శ్లో.
ఇళాపురే రమ్య విశాలకే2స్మిన్, సముల్ల సంతం చ జగద్వరేణ్యం |
వందే మహోదరతర స్వభావం, ఘ్రుశ్నేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ||
రమ్యము, విశాలమైన ఇళాపురము (ఏలా పురము) లో ప్రకాశిస్తున్నవాడు, జగద్వరేణ్యుడు, అతి ఉదారమైన స్వబావము కలవాడు అయిన ఘ్రుశ్నేశ్వరుని శరణు వేడుచున్నాను.
ఇక్కడి అమ్మవారు ఘ్రుశ్నేశ్వరి - ఈ ఇలా (ఏలా) పురము దగ్గర ఉన్న దేవగిరి అను దుర్గము దేవతలకు నిలయమని ప్రసిద్ధి.
పురాణగాథ:
దేవగిరి దుర్గమునందు 'సుధర్ముడ'ను బ్రాహ్మణుడు 'సుదేహ' అను తన భార్యతో నివసిస్తూ, నిత్య-నైమిత్తిక కర్మలతో, అతిథి అభ్యాగతుల ఆదరణతో పవిత్రమైన గృహస్థ ధర్మమును ఆచరిస్తున్న ఈ బ్రాహ్మణ దంపతులకు సంతానము లేక బాధపడేవారు. ఒక రోజున ఆ గ్రామమునకు ఒక యతి రాగా, అతనిని తన ఇంటికి భోజనమునకు రమ్మని ఆహ్వానించి, భక్తితో భోజనము వడ్డిస్తున్న సమయమున, మీకు పిల్లలెంతమందని అడిగితే, వారు తమకు పిల్లరు లేరని విచారము వ్యక్తము చేసారు. భోజనము లేనివారింట భోజనము చేయని నియమం కల ఆ యతి, లేచి వెళ్ళిపోవ సన్నద్ధము కాగా, సుధర్ముడు కాళ్ళపైబడి, భోజనము చేయకుండా పోవద్దని బ్రతిమాలాడు. యోగద్రుష్టితో చూసిన ఆ యతి, సుధార్మున్ని ఓదార్చి, కాలాంతరమున నీకు కుమారుడు కలుగునని దీవించెను. అది విని అతని భార్య సుదేహ తనకు చిన్నతనమున జ్యోతిష్కులు సంతానము కలుగారని చెప్పిన మాట గుర్తుకు వచ్చి, ఆలోచించి, తన చెల్లెలైన ఘ్రుశ్నాను పెండ్లియాడమని సుధర్ముని బలవంతము చేయ, అతను సమ్మతించి అటులనే చేసెను. మహా పతివ్రత మరియు శివ భక్తురాలు అయిన ఆమే తన అక్కను, భార్తకును శుశ్రూష చేస్తూ ప్రతి దినము 101 పార్థివ లింగములను పూజించి దగ్గర ఉన్న చెరువులో నిమజ్జనము చేస్తూ ఉండేది. ఇట్లు లక్షల సంఖ్యలో పార్థివ లింగముల పూజ పూర్తియగుసరికి ఆమె గర్భవతియై ఒక సుపుత్రుని కన్నది.
కాలము గడిచినకొలది సుదేహ మనస్సున అసూయ పెరిగి, ఒకనాటి రాత్రి, నిద్రిస్తున్న బాలుని కత్తితో నరికి దేహభాగములను దగ్గరలో ఉన్న చెరువులో పారవేసి, ఏమీ ఎరుగనట్లు ఇంటికి వచ్చి నిద్ర నటించగా, ఘ్రుష్ణ మామూలు ప్రకారం పార్థివలింగములను పూజించి చెరువులో నిమజ్జనం చేయుటకు నీట అడుగు పెట్టగానే నీటి నడుమ బాలుడు ఈదుకొని వచ్చి తల్లి కాళ్ళు పట్టుకొని, 'అమ్మా! నేను మరణించి మరల మల్లి బ్రతికినటుల రాత్రి కల వచ్చింది, అది నిజమగునా?' అని ప్రశ్నింప, ఘ్రుశ్నకు ఆశ్చర్యము కలిగి, ఇంట్లో పడుకొని యున్న బాలుడు నీటిలోకెలా వచ్చాడు అని తలచి, ఇదంతా శివ మహిమ అనుకొనుచు, బాలును ఎత్తుకొని ఇంటికి వచ్చుచుండ, శివుడు ప్రత్యక్షమై 'స్వాధ్వీ! నీ అక్క అసూయతో నీ బిడ్డను చంపి చెరువులో పారవేసినను, నీ భక్తీ, ప్రాతివత్యములు బిడ్డను బ్రతికించినవి అని పలుకుచు సుదేహను శిక్షించెను. అప్పుడు, ఘ్రుశ్న శివుని కాళ్ళపైబడి, 'మహాదేవా! కరుణాముర్తీ! పుత్రభిక్షపెట్టి నన్ను కాపాడి, మా వంశమును నరకమునుండి తప్పించితివి. మా అక్క అమాయకురాలు, ఆమే కదా నాకు తన భర్తతో వివాహమాడునట్లు చేసినది. అసూయ వలన ఆ పాపముచేసినది కాన, ఆమెను క్షమించమని ప్రార్థించగా, పరమేశ్వరుడు ఘ్రుశ్న సహనమునకు మరియు ఔదార్యమును మెచ్చుకొని, 'అమ్మా! ఈ నాటినుండి నీ పేరుమీదుగా ఘ్రుశ్నేశ్వరునిగా నేనిక్కడ వెలిసెదను, నీవు నీభర్తతో సుఖముగా జీవించి, అంత్యమున నా లోకము చేరుదువని పలికి అంతర్ధానమయ్యెను. సుధర్ముడు, సుడిగా, గ్రామస్థులు చేరి జ్యోతిర్లింగమును గాంచి ఘ్రుశ్నాను వేనోళ్ళ పొగిడిరి. అక్క సుదేహ తన అపరాధమును మన్నించమని వేడుకొనగా, ఘ్రుశ్న అక్కను కౌగలించుకొని ఓదార్చినది. సుధర్ముడు ఘ్రుశ్నేశ్వరునికి ఆలయమును కట్టించి, భార్యా-బిడ్డలతో ప్రతిరోజు శివుని ఆరాధిస్తూ అంత్యమున మోక్షమును పొందిరి.
ఘ్రుశ్నేశ్వరుని దర్శించి ఆరాధించువారికి అకాల మరణముండదు. సంతాన నష్టము నుండి విముక్తులగుదురు.
చరిత్ర:
ఈ క్షేత్రము ఛత్రపతి శివాజీ పూర్వికుల స్వగ్రామముగా చెప్పబడుచున్నది. మాలోజీభోస్లే (శివాజి తాత), అతని తమ్ముడు విఠోజీ ఈ క్షేత్రాభివ్రుద్ధికి యెంతో క్రుషి చేసారు. తరువాత 1765-1795 ప్రాంతంలో ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కార్ ఘ్రుశ్నేశ్వర మందిరాన్ని పునర్నిర్మించి బాగా అభివృద్ధి చేసింది.
దర్శనీయ స్థలాలు:
1. శ్రీ ఘ్రుశ్నేశ్వరాలయం :: ఆలయ ప్రాంగణం చాలా విశాలమై చుట్టూ పెద్ద ప్రహరీతో ఉంది. శ్రీ స్వామి వారి గర్భాలయం భూమిలోపలికి ఉంటుందు. అమ్మవారు కూడ గర్భాలయంలోనే ఉంది. దేవాలయ గోడలపై మంచి శిల్పములు ఉన్నాయి.
2. శివాలయం (కోనేరు) :: దేవాలయ సమీపంలో ఉంది. దీనిలోనే ఘ్రుశ్న పార్థివ లింగాలను నిమజ్జనం చేసేది.
3. ఎల్లోరా గుహలు :: ఘ్రుశ్నేశ్వరాలయానికి 1-1/2 కి.మీ. దోరంలో ఉన్నాయి. 17 గుహలలో హిందూ ఆలయాలు, 12 గుహలలో బౌద్ధాలయాలు, 5 గుహలలో జైన ఆలయాలు ఉన్నాయి. ఈ 34 గుహలు క్రీ.శ. 600-1000 మధ్య నిర్మింపబడ్డాయి. గుహలలోని శిల్పకళ అత్యంత రమణీయంగా ఉంటుంది. ఘ్రుశ్నేశ్వరాలయం గల గ్రామాన్ని 'వెరుల్' అని పిలుస్తారు.
రైలు మార్గము ::
సికింద్రాబాద్ - పర్భని - ఔరంగాబాద్ - బస్ రూట్ - ఎల్లోరా - ఘ్రుశ్నేశ్వర్
చెన్నై - గూటి - గుంతకల్ - సికింద్రాబాద్ - పర్భని - ఔరంగాబాద్ - బస్ రూట్ - ఎల్లోరా - ఘ్రుశ్నేశ్వర్
సమీప విమానాశ్రయం ::
ఔరంగాబాద్

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment