చిలుకూరు బాలాజీ దేవాలయం :
చిలుకూరు బాలాజీ దేవాలయం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని
చిలుకూరు గ్రామంలో ఉంది. బాలాజీ వెంకటేశ్వరుని అనేక నామాల్లో ఒకటి.
ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా, సీదా సాదాగా ఉంటుంది. భక్తులు పెద్ద
సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొంటుంటారు. మ్రొక్కుగా ప్రదక్షిణలు
చేస్తుంటారు. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలామంది నమ్మకం.
అందుకే ఇక్కడి బాలాజిని వీసా బాలాజీ అని పిలుస్తారు.
ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడొకాయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి
ఏడుకొండల స్వామిని దర్శించుకొనేవాడు. ఒకమారు అనారోగ్యకారణంగా ఆయన తిరుపతి
యాత్ర చేయలేకపోయాడు. ఆయనకు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, చింతించవద్దు.
నీ సమీపంలోని అడవిలోనే నేనున్నాను అని చెప్పాడు. కలలో కనిపించిన స్థలానికి
వెళ్ళి, ఆ భక్తుడు అక్కడి పుట్టను త్రవ్వుతుండగా పలుగుకు రాతి విగ్రహం
తగిలి రక్తం కారసాగింది. అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి పాలతో కడగమని
వాణి వినిపించింది. అలా చేయగా పుట్టనుండి శ్రీదేవీభూదేవీ సమేతుడైన
శ్రీవేంకటేశ్వరుని విగ్రహం బయల్పడింది. ఇలా మూడు మూర్తులు ఒకే విగ్రహంలో
ఉండడం అరుదు. ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్టించి, మందిరాన్ని
నిర్మించారు. ఇలా స్వయంభూమూర్తిగా ఉభయ నాంచారులతో వెలసిన శ్రీవేంకటేశ్వరుని
భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు.
1963లో రాజ్యలక్ష్మి
అమ్మవారిని ప్రతిష్టించారు. అమ్మవారు మూడు చేతులలో పద్మాలు ధరించి ఉంటారు.
నాలుగవ చేయి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఉంటుంది.
హైదరాబాద్ లోని మెహిదీపట్నం నుండి చిలుకూరుకు బస్సులు కలవు. అవేకాక
హైదరాబాద్ వివిధ ఏరియాల బస్ స్టేషన్ల నుండి బస్సులు నడుస్తున్నవి.
మెహిదీపట్నం నుండి 288డి బస్సు ఎక్క వలెను. ప్రయాణ సమయం గంట.
ఇక్కడ దేవాలయం గురించి ప్రభుత్వానికి మరియు ప్రస్తుత నిర్వాహకులకు మధ్య
కొంత వివాదం ఉన్నది. దీనిని ప్రభుత్వం వారు ‘యాదగిరి గుట్ట’ దేవాలయానికి
అనుసందానం చేయాలనుకొన్నారు. అయితే ఇక్కడ దేవాలయాన్ని కార్యకలాపాలు
నిర్వహిస్తున్న ట్రస్టీలు దానిని వ్యతిరేకించారు. దేవాలయాల నిర్వహణను
వ్యాపారీకరించడాన్ని ఈ ఆలయపు అర్చకులు దృఢంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ
ఆలయంలో ‘హుండి’ లేదు. గుడి నిర్వహణ గుడి బయట కల కొందరు దుకాణదారుల మరియు
ఊరి ప్రముఖుల ద్వారా జరుపబడుతున్నది. ఇక్కడ దర్శనానికి ధనిక, పేద, అధికార
తారతమ్యాలు లేవు. అందరూ ఒకే వరుసలో వేచి ఉండి భగవంతుని దర్శించుకోవాలి
అనేది ఇక్కడి పద్దతి.(గతంలో ఉండేదేమో తెలియదు కాని, ఇప్పుడు మాత్రము అలా
లేదు. ముఖ్యమైన వారు వచ్చిన సందర్భంలో వారికి ప్రత్యేక దర్శనము
చేయిస్తున్నారు). కొంతకాలం వరకూ కనీస రవాణా సౌకర్యాలు సైతం లేని ఈ దేవాలయం
భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో
నడుస్తున్న రోడ్డు రవాణా సంస్థ వారిచే ప్రత్యేక బస్సులు నడిపించే స్థాయికి
చేరుకొన్నది.
ఇక్కడ ప్రదక్షిణలు చేయడం ఒక ముఖ్య ఆచారం. భక్తులు
మొదటిసారి వచ్చినప్పుడు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తారు. తమ కొరికలు
తీరిన తరువాత ఇంకోసారి వచ్చి 108 సార్లు ప్రదక్షిణలు చేసి, తమ మొక్కు
తీర్చుకొంటారు.
దేవుని విగ్రహాన్ని కనులు మూసుకొకుండా చూడాలి అని చెబుతారు. దేవాలయం అర్చకులు "వాక్" అనే ధార్మిక మాసపత్రికను ప్రచురిస్తున్నారు.
క్రీ.శ.1067లో అప్పటి రాజు అసగ మారస నేతృత్వంలో నిర్మించిన ఈ చిలుకూరు
దేవాలయాల గూర్చి పూర్తి స్థాయిలో బులెమోని వెంకటేశ్వర్లు సుమారు మూడు
సంవత్సరాలపాటు పరిశోధన చేసి, నాటి శిలా శాసనాలు, వాటి వివరాలు సహా
ప్రచురించిన ఈ గ్రంథాన్ని 25 మార్చ్ 2005న విడుదల చేశారు.
No comments:
Post a Comment