What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 29 December 2013

వసిష్ఠుడు ఇక్ష్వాకువంశక్రమం చెప్పుట -శ్రీ రామాయణం

వసిష్ఠుడు ఇక్ష్వాకువంశక్రమం చెప్పుట -శ్రీ రామాయణం

దశరథుడు మిథిలకు వెళ్ళి పూజితుడు కావడం

జనకుని వార్తాహరులు అయోధ్య చేరుకొని ద్వారపాలకులు ప్రవేశపెట్టగా మహారాజును దర్శనం చేసుకున్నారు. దశరథ మహారాజును చూసి మహారాజా! జనక మహారాజు విశ్వామిత్రుని అనుమతి మీద 'రాజేంద్రా! ఇదివరలో నేను నా కుమార్తెయైన సీత వీర్యశుల్క అని ప్రకటించాను. రాజులు చాలా మంది వచ్చి నిర్వీర్యులయిపోయి వున్నారు. ఇదంతా నీకు తెలిసిందే. అలాంటి నా కూతురు, విశ్వామిత్రాదులతో కలిసి యధాలాభంగా యిక్కడికి వచ్చిన నీ కొడుకులవల్ల జయించబడ్డది. నా దగ్గర ఉండిన ఆ గొప్ప ధనస్సు మహాజనసమూహంలో, రాముడు ఎక్కుపెట్టగా మధ్యకి విరిగిపోయింది. మా సీత వీర్యశుల్క అని నేను ప్రతిజ్ఞ చేశాను. కనుక ఆమెను రామునికి ఇవ్వదలుచుకున్నాను. నీకు భద్రం అగుగాక! అందరితో కలిసి శీఘ్రంగా వచ్చి నువ్వు రామలక్ష్మణులను చూడాలి ' అని మీతో చెప్పమన్నారు. ఈ మాటలన్నీ జనకమహారాజు విశ్వామిత్రుని అనుజ్ఞ పొంది పురోహితుడైన శతానందుని సమక్షంలో అన్నవి" అని చెప్పారు.

ఆ మాటలు విని దశరథమహారాజు చాలా సంతోషించి వసిష్ఠుని వామదేవుని సమ్మతం తీసుకొని ఆ మరునాడు మిథిలకు బయలుదేరారు. గొప్ప చతురంగబలం వారివెంట వెళ్ళింది. నాలుగు దినములకు అందరూ విదేహదేశం చేరుకున్నారు. జనకుడు! "దశరథ మహారాజా! నీకు స్వాగతం. మాభాగ్యం వల్ల నువ్విక్కడకు దయచేశావు. వసిష్ఠ మహర్షీ! ఎందరో బ్రాహ్మణులను వెంటబెట్టుకొని దేవతలతో కూడిన మహేంద్రుడులాగ నువ్వు దయచేశావు. కార్యం నిర్విఘ్నంగా నెరవేరుతుంది. మహారాజా, దశరథా! రేపు తెల్లవారేక, అప్పటికి యజ్ఞం అయిపోతుంది కనుక, ఋషి సమ్మతంగా వివాహం జరిపించు" అని చెప్పి చాలా ఆదరించాడు.

జనకుడు యజ్ఞం ముగించుకొని, కూతుళ్లతో కూడా అంకురార్పణం మొదలైనవి నెరవేర్చుకుని రాత్రి గడిపారు.

వసిష్ఠుడు ఇక్ష్వాకువంశక్రమం చెప్పడం :

తెల్లవారగానే మహర్షులతో స్నానసంధ్యాద్యనుష్ఠానాలన్నీ ముగించుకొని జనకుడు పురోహితుడైన శతానందుణ్ణి చూసి, "నా తమ్ముడు అతిధార్మికుడైన కుశధ్వజుడు సాంకాశ్యపట్నంలో వుండి రాజ్యం పాలిస్తున్నా డు. నా యజ్ఞానికి అతనే రక్షకుడు. ఇప్పుడు సీత వివాహసంబంధమైన ఆనందం అతనున్నూ అనుభవించాలి అని చెప్పాడు. దూతలు వెళ్ళి కుశధ్వజుణ్ణి తీసుకువచ్చారు. తరువాత అన్నదమ్ములిద్దరూ సుదామనుడనే మంత్రిని చూసి "నువ్వు త్వరగా వెళ్ళి అమిత తేజశ్శాలి అయిన దశరథమహారాజును కొడుకులతోనూ మంత్రులతోనూ తీసుకురా" అని పంపారు. అతను వెళ్ళి మగపెళ్ళివారిని వైభవంగా తీసుకువచ్చాడు. ఉచిత మర్యాదలు జరిగాక దశరథుడు "జనకమహారాజా! భగవంతుడైన వసిష్ఠమహర్షి ఇక్ష్వాకు వంశీయులకు కులదైవం అనీ, మాకు సంబంధించిన సమస్త వ్యవహారాలలోనూ వక్త అతనే అనీ నీకు తెలుసు. విశ్వామిత్రమహర్షి సెలవు పొందీ, ఈ మునీంద్రుల అనుజ్ఞపొందీ ఆ మహర్షి యిప్పుడు మా వంశక్రమం అంతా వివరిస్తారు" అని చెప్పి వూరుకున్నాడు.

అప్పుడు వసిష్ఠుడు ప్రారంభించాడు.

"అవ్యక్తప్రభువుడూ, శాశ్వతుడూ, నిత్యుడూ, నాశరహితుడూ అయిన బ్రహ్మకు మరీచి పుట్టాడు. మరీచికి కాశ్యపుడూ, కాశ్యపునికి సూర్యుడూ, సూర్యునికి మనువూ పుట్టారు. ఆ మనువే మొదటి రాజయినాడు. మనువు కొడుకు ఇక్ష్వాకుడు. అయోధ్యలో వుండి ప్రజాపాలనం ప్రారంభించినవాడు ఆ ఇక్ష్వాకుడే. అతని కొడుకు కుక్షి. కుక్షి కొడుకు వికుక్షి. వికుక్షికొడుకు మహాతేజశ్శాలీ, మహ ప్రతాపవంతుడూ అయిన బాణుడు. బాణుని కొడుకు అతనికి తగ్గవాడే అనరణ్యుడు. అనరణ్యుని కొడుకు పృథువు. పృథువు కొడుకు త్రిశంకుడు. త్రిశంకుని కొడుకు గొప్ప యశశ్శలి అయిన దుందుమారుడు. అతనికే యువనాశ్వుడని మారుపేరు. యువనాశ్వుని కొడుకు మాంధాత. మాంధాత కొడుకు సుసంధి. సుసంధికి ధ్రువసంధి ప్రసేనజిత్తు అని యిద్దరు కొడుకులు. వారిలో ధ్రువసంధి కొడుకు భరతుడు. భరతుని కొడుకు అసితుడు. అసితుణ్ణి హైవాయులూ తాలజంఘులూ, శశిబిందువులూ శత్రువులై ఎప్పుడూ బాధపెడుతూ వుండేవారు. వారితో యుద్ధం చేస్తూ అసితుడు ఒకమాటు ఓడిపోయి, కొద్దిబలం మాత్రం మిగలగా దానితోనూ మంత్రులతోనూ హిమవత్పర్వత శిఖరాలలో వొకటయిన భృగుప్రస్రవణం మీద నివసించాడు. అతని కిద్దరు భార్యలు. అప్పుడు వారిద్దరూ గర్భవతులయారు. అందులో వొకామె గర్భం చెడగొట్టాలని తన సవతికి గరం అనగా విషం కలిపిన పిండివంటలు పెట్టింది. సరిగా ఆ సమయాన భార్గవచ్యవనుడు అసితుణ్ణి రక్షించ దలచి అక్కడికి వచ్చాడు. విషం తిన్న రాజపత్ని తనకి కొడుకు పుట్టాలని కోరుకుంటూ దేవవర్చస్సు గల చ్యవనునికి పాదాభివందనం చేసింది. అది చూసి రెండో రాజపత్ని కాళింది కూడా మునికి నమస్కరించింది. అయితే, చ్యవనుడు విషంతిన్న ఆమెను చూసి 'మహాభాగురాలా! నీ కడుపులో పురుష శిశువు ఉన్నాడు. కొద్దిదినాల్లోనే అతను పుడతాడు. అతను మహాబలశాలి. మహాతేజశ్శాలీ అవుతాడు. అతనికి విషం తగిలింది. అయినా భయపడకు' అని చెప్పాడు. పతివ్రతా, పట్టపుదేవీ అయిన మొదటి ఆమె, తరువాత చనిపోయిన భర్తను తలుచుకొని శోకిస్తూనే కొడుకును కన్నది. ఆ బాలుడు గరంతో కూడా పుట్టడం వల్ల సగరుడైనాడు. సగరునికి అసమంజుడూ, అసమంజునికి అంశుమంతుడూ, అంశుమంతునికి దిలీపుడూ, దిలీపునికి భగీరథుడూ. భగీరథునికి కకుత్థ్సుడూ, కకుత్థ్సునకు రఘువూ పుట్టారు. రఘువునకు ప్రవృద్ధుడు పుట్టాడు. అతనికి వసిష్ఠుని శాపం సంభవించింది. దానివల్ల ప్రవృద్ధుడు పురుషాదు డనే రాక్షసు డయిపోయినాడు. తనకు శాపం యిచ్చినందుకు కోపించి అతను తానుగూడా వసిష్ఠుణ్ణి శపించాలని చేతిలో నీళ్లు పోసుకున్నాడు; కాని 'తప్పు తప్పు అని భార్య నివారించింది. ఆ నీళ్ళు అతని కాళ్ల మీదే వేసుకున్నాడు. అందువల్ల అతను కల్మాషపాదుడైనాడు. కల్మాషపాదుని కొడుకు శంఖణుడు. శంఖణుని కొడుకు సుదర్శనుడు. సుదర్శనుని కొడుకు అగ్నివర్ణుడు. అగ్నివర్ణునికి శీఘ్రగుడూ, శీఘ్రగునకు మరుడూ, మరునకు ప్రశుశ్రుకుడూ, ప్రశుశ్రుకునకు అంబరీషుడూ, అంబరీషునకు నహుషుడూ పుట్టారు. నహుషుని కొడుకు యయాతి. యయాతి కొడుకు నాభాగుడు. నాభాగుని కొడుకు అజుడు. అజుని కొడుకు దశరథుడు. ఈ దశరథుని కొడుకు లీ రామలక్ష్మణులు. జనకరాజర్షీ! ఇలాగ ఆదినుంచీ పరమ పవిత్రమూ అద్వితీయమూ అయిన గొప్ప వంశంలో పుట్టి పరమధార్మికులూ మహావీరులూ, సత్యవ్రతులూ అయిన యిక్ష్వాకు వంశీయుల సంతతివారయిన ఈ రామలక్ష్మణులకు నీ కూతుళ్ళనిమ్మని కోరుతున్నాను. నీకూతుళ్ళకు వీరూ, వీరికి నీ కూతుళ్ళూ తగినవారు కనుక. వీరికి నీ కూతుళ్ళ నివ్వడం చలా మంచిది".

గమనిక: ఈ నహుషుడూ, యయాతీ సూర్యవంశీయులు. చంద్రవంశంలో కూడా తరువాత ఈ పేరుగలవారు పుట్టారు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML