What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 2 December 2013

అష్టాదశ పురాణములు

పురాణములు
అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణమహర్షి కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.
పురాణ వాఙ్మయం ఆవిర్భావం
"పురాణ" శబ్దానికి "పూర్వ కాల కథా విశేషం" అన్న అర్ధం నిరూఢమై ఉంది. క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం నాటికే ఈ వాఙ్మయం ప్రస్తుతం లభిస్తున్న రూపు సంతరించుకొంది కాని వేదవాఙ్మయ కాలానికే దీని మౌలిక రూపం ఏర్పడి ఉండాలి. యజ్ఞసమయంలో ఋక్సామచ్ఛందాలతో పాటు ఉచ్చిష్ట రూపమై పురాణం ఆవిర్భవించిందని అధర్వణ వేదంలో తొలిసారిగా ప్రస్తావింపబడింది. శతపథ బ్రాహ్మణం, బృహదారణ్యకోపనిషత్తు, గోపథ బ్రాహ్మణం వంటి గ్రంధాలలో పురాణ ప్రశంసలున్నాయి. ఆదికాలంలో ఇది వేదాధ్యయనానికి ఒక సాంగ సాధన ప్రక్రియగా ఉండేదని, కాలక్రమంలో ప్రత్యేక శాఖగా పరిణమించి మతసాహిత్యంగా రూపుదిద్దుకొందని విమర్శకుల ఊహ. సుదీర్ఘ కాలం జరిగే యజ్ఞయాగాది కార్యాల సమయంలో నడుమ నడుమ విరాళ వేళలలో ఇష్ట కధా వినోదంగా ఇది మొదలై ఉండవచ్చును. ఆ యజ్ఞాలు చేసే రాజుల వంశాల చరిత్రను, యజ్ఞానికి లక్ష్యమైన దేతల కధలను ఇలా చెబుతూ ఉండవచ్చును. మొదటి కాలంలో బహుశా యఙ్నాన్ని నిర్వహించే పండితులే ఈ కధాకాలక్షేపం జరిపి ఉండవచ్చును కాని ఇది ప్రధాన కార్యక్రమం కాదు గనుక క్రమంగా సూత పౌరాణికులకు (క్షత్రియునకు బ్రాహ్మణ స్త్రీయందు జన్మించిన సంతానం) ఈ విధి సంక్రమించి ఉండవచ్చును. ఇలాంటి ఐతిహ్యం వాయు బ్రహ్మాండ విష్ణు పురాణాలలో కనిపిస్తుంది.[1]
వ్యాస మహర్షి పురాణ సంహితను నిర్మించి తన సూత శిష్యుడు రోమహర్షునికి ఉపదేశించాడు. అతడు దానిని భాగాలుగా చేసి సుమతి, అగ్నివర్చుడు, మిత్రాయువు, శాంశపాయనుడు, అకృతవర్ణుడు, సావర్ణి అనే ఆరుగురు శిష్యులకు బోధించాడు. వీరిలో అకృతవర్ణుడు, సావర్ణి, కాశ్యప శాంశపాయనులు వేరువేరుగా మూడు పురాణ సంహితలను రూపొందించారు. రోమహర్షుని మాతృకతో కలిసి ఈ గ్రంధజాతమంతా పురాణ వాఙ్మయానికి మూలమయింది. ఈ విధంగా పరిశీలిస్తే అప్పటి యాఙ్ఞికులైన బ్రాహ్మణుల అధీనంలో ఉన్నవాఙ్మయాన్ని వ్యాసుడు విషయ క్రమం ప్రకారం పునర్వ్వస్థీకరించి, కాలానుగుణంగా అవుసరమైన మార్పులతో లోకులకు తెలియజేయమని బ్రాహ్మణేతరులైన సూతులకు అప్పగించాడు. ఆపస్తంభ ధర్మ సూత్రాలలోని ప్రస్తావనల ఆధారంగా క్రీ.పూ. 600-300నాటికే పురాణ వాఙ్మయం ఒక ప్రత్యేక శాఖగా రూపుదిద్దుకొందని, కాలానుగుణంగా ఉపదేశికుల బోధలను సంతరించుకొంటూ క్రీ.శ. 12వ శతాబ్దివరకూ మార్పులు చెందుతూ వచ్చిందని ఊహించవచ్చును[1].

ప్రణవం వేదాలు పురాణాల పుట్టుక
పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని పన్నెండవ స్కందం చెప్తుంది. బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయగృహ నుండి ఒక అనాహత శబ్ధం వెలువడింది. ఆ శబ్ధంలో నుండి అ కార ఉకార మకార శబ్ధాలు కూడిన ఓంకారశబ్ధం ఆవిర్భవించింది. "అ" నుండి "హ" వరకు గల అక్షరాలు ఆశబ్ధంనుండి ఉద్భవించాయి. ఓంకారం సకల మంత్రాలకు బీజాక్షరం అయింది. ఓంకారం నుండి నాలుగు వేదాలను ఉద్భవించాయి. ఆ 'అ'కార, 'ఉ'కార 'మ'కారములనుండి సత్వ,రజో,తమో అనే త్రిగుణాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనే చతుర్వేదాలు, భూ॰భువ॰సువ॰ అనే త్రిలోకాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు జనించాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తనకుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి.

వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసుడు వేద ఉపనిషత్తు సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించాడు. పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమహర్షణుకి చెప్పాడు. రోమహర్షుడు తిరిగి వాటిని తన శిష్యులైన త్రైయారుణి, కశ్యపుడు, సావర్ణి లాంటి శిష్యులకు అందించాడు. ఆ తర్వాత అలా ఒకరి నుండి ఒకరికి సంక్రమించాయి.
పురాణం లక్షణాలు
ప్రతి పురాణం కుడా పురాణాల ముఖ్యమైన లక్షణాలను మొదటి సర్గలలో చెబుతుంది. కూర్మపురాణంలో చెప్పబడిన పురాణ ఉపోద్ఘాతము ప్రకారం
సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ
వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం
సర్గము, ప్రతి సర్గము, వంశము, మన్వంతరము, వంశాలచరిత్ర అనే పంచలక్షణాలు కలిగినదే పురాణం.
• సర్గము - సర్వ ప్రపంచ సృష్టిని విస్తరించేది
• ప్రతి సర్గము - సకల ప్రపంచము లయమయ్యే లక్షణం తెలిపేది (ప్రళయం)
• వంశము - పృథు, ప్రియ వ్రతాదుల వంశోత్పత్తిని వివరించుట
• మన్వంతరము - ఏ కల్పంలో ఏ మనువు కాలంలో ఏమి జరిగిందో తెలుపుట
• వంశాలచరిత్ర
భాగవతంలో పురాణ లక్షణాలు పది చెప్పబడ్డాయి
సర్గోప్యశ్చ విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ
వంశో వంశానుచరితం సంస్థాహేతు రపాశ్రయ
దశభిర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదో విదు:
అనగా సర్గము (సృష్టి), ప్రతిసర్గము (ప్రళయము), వృత్తి (వ్యాపారము), రక్షా (పరిపాలవ), అంతరము (మన్వాదుల కాలము), వంశము (వంశాదుల విషయము), వంశానుచరితము (సూర్య, చంద్ర వంశస్థుల కధనాలు), సంస్థా (స్థితి), హేతువు (కారణము), అపాశ్రయము (ఆశ్రయ విషయాలు) అనే పదీ పురాణ లక్షణాలు. కొంతమంది ఇలా పది లక్షణాలున్నవి మహాపురాణాలని, ఐదు లక్షణాలున్నవి పురాణాలని వర్గీకరిస్తున్నారు. [2]
పురాణాల విభజన
పురాణాల పేర్లు చెప్పే శ్లోకం
సత్రయాగం జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందము లో చెప్పబడింది.
మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్
పైన చెప్పిన వాటిలో:
• "మ" ద్వయం -- మత్స్య పురాణం, మార్కండేయ పురాణం
• "భ" ద్వయం -- భాగవత పురాణం, భవిష్య పురాణం
• "బ్ర" త్రయం -- బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం
• "వ" చతుష్టయం -- విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం
మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:
• అ -- అగ్ని పురాణం
• నా -- నారద పురాణం
• పద్ -- పద్మ పురాణం
• లిం -- లింగ పురాణం
• గ -- గరుడ పురాణం
• కూ -- కూర్మ పురాణం
• స్కా -- స్కాంద పురాణం
అష్టాదశ పురాణములలో శ్లోకాలు 
1. బ్రహ్మ పురాణం - బ్రహ్మదేవుడు మరీచికి బోధించినది. 10,000 శ్లోకములు కలది.
2. పద్మ పురాణము - బ్రహ్మదేవునిచే చెప్పబడినది. 55,000 శ్లోకములు కలది.
3. విష్ణు పురాణం - పరాశరుని రచన. దీనిలో 63,000 (8,000?) శ్లోకములు ఉన్నాయి.
4. శివ పురాణం - వాయుదేవునిచే చెప్పబడినది. ఇందులో 24,000 శ్లోకాలున్నాయి.
5. లింగ పురాణము - నందీశ్వరుని రచన. 11,000 శ్లోకాలు ఉన్నది.
6. గరుడ పురాణం - విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పిన ఈ పురాణంలో 19,000 (16,000?) శ్లోకాలున్నాయి.
7. నారద పురాణము - నారద మహర్షి రచన. 24,000 (25,000?) శ్లోకములు కలది.
8. భాగవత పురాణం- శుకమహర్షి పరీక్షిత్తునకుపదేశించినది. 18,000 శ్లోకములు కలది.
9. అగ్ని పురాణం - భృగుమహర్షిచే చెప్పబడినది. 16,000 (8,000?) శ్లోకములు కలది.
10. స్కంద పురాణం - కుమారస్వామిచే చెప్పబడినది. 80,000 (లక్ష?) ఇందు శ్లోకములు ఉన్నాయి.
11. భవిష్య పురాణం లేదా భవిష్యోత్తర పురాణం - శతానీకుడు సుమంతునకు బోధించినది. 14,500 (31,000?) శ్లోకములు ఉన్నాయి.
12. బ్రహ్మవైవర్త పురాణం - వశిష్ట మహర్షి అంబరీషునకు ఉపదేశించినది. 18,000 (12,000) శ్లోకములు కలది.
13. మార్కండేయ పురాణం - పక్షులు క్రోష్టి(జైమిని)కి చెప్పినట్లుగా మార్కండేయమహర్షి రచించెను. 9,000 (32,000?) శ్లోకములు ఉన్నది.
14. వామన పురాణము - బ్రహ్మదేవుని రచన - 14,000 శ్లోకములు కలది.
15. వరాహ పురాణం - శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించినది. ఇందు 24,000 శ్లోకములు ఉన్నాయి.
16. మత్స్య పురాణం - శ్రీమత్స్యావతారుడైన విష్ణువు మనువునకు ఉపదేశించెను. దీనిలో 14,000 శ్లోకాలున్నాయి.
17. కూర్మ పురాణం - శ్రీకూర్మావతారుడైన విష్ణువు ఉపదేశించెను. దీనిలో 17,000 (6,000) శ్లోకాలున్నాయి.
18. బ్రహ్మాండ పురాణం - బ్రహ్మదేవుని రచన- 1,100 (12,200?) శ్లోకములున్నది.
దేవతాప్రాముఖ్యాన్ని గుణాన్ని చెప్పే శ్లోకం
ఈ క్రింది శ్లోకం అష్టాదశ పురాణాలను మూడు విధాలుగా విభజిస్తూ వైష్ణవ, శైవ, బ్రహ్మ పురాణాలుగా చెబుతుంది.
వైష్ణవం నారదీయం చ తధా భాగవతం శుభం గారుడంచ తధా పాద్మం
వరాహం శుభదర్శనే సాత్వికాని పురాణాని విష్ణ్వేయాని శుభానిదై
బ్రహ్మాండం బ్రహ్మ వైవర్తం మార్కండేయం తధైవ చ భవిష్యం వామనం బ్రహ్మరాజ నిబోధతే
మాత్స్య కౌర్మం తధా లైంగ శైవం స్కౌందం ఆగ్నేయంచ షడేతాని తామసాని భోధమే

ఇలాంటిదే మరొక శ్లోకం

బ్రాహ్మం పాద్వం వైష్ణవంచ శైవం వైంగం చ గారుడమ్
నారదీయం భాగవతం ఆగ్నేయం స్కాంద సంజ్ఞికమ్
భవిష్యం బ్రహ్మవైవర్తం మార్కండేయం చ వామనమ్
వారాహం మత్స్య కౌర్మాణి బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్

• వైష్ణవ పురాణాలు - సాత్విక గుణాన్ని
• బ్రహ్మ పురాణాలు - రాజస గుణాన్ని
• శైవ పురాణాలు - తామస గుణాన్ని ప్రధానంగా కలిగి ఉంటాయి అని పై శ్లోకం అర్థం
ఉపపురాణాలు
ఈ అష్టాదశపురాణాలే కాకుండా ఉపపురాణాలు కూడా 18 ఉన్నాయి. అవి:
1. సనత్కుమార పురాణం
2. నరసింహ పురాణం
3. శివధర్మ పురాణం
4. దౌర్వాస పురాణం
5. నారదీయ పురాణం
6. కాపిల పురాణం
7. మానవ పురాణం
8. ఔసనశ పురాణం
9. బ్రంహాండ పురాణం
10. వారున పురాణం
11. కౌశిక పురాణం
12. లైంగ పురాణం
13. సాంబ పురాణం
14. సౌర పురాణం
15. పారాశర పురాణం
16. మారీచ పురాణం
17. భార్గవ పురాణం
18. స్కాంద పురాణం

--
kishore always with u....!


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML