అపరిచిన్నమైనది పరమాత్మ తత్త్వం
యది మన్యసే సువేదేతి దహరమేవాపి
నూనం త్త్వం వేత్థ బ్రహ్మణో రూపమ్ |
యదస్య త్వం యదస్య దేవేష్వథ ను
మీమాంస్యేమేవ తే మన్యే విదితమ్ || (1వ మంత్రం)
"యది మన్యసే సువేదేతి" భగవంతుని గురించి విన్న వారికి భగవంతుడి గురించి తెలిసిపోయింది అనిపించిందంటే ఏమీ తెలియలేదని అర్థం. భగవంతుడి గురించి తెలియలేదంటే మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. "దహరమేవా", ఎంత తెలుసునూ అనుకున్న వాడికి కూడా ఆ తెలిసింది కొంచం మాత్రమే అని గుర్తించు. భగవంతునిలో అనేక అంశలు ఉన్నాయి, సముద్రంలో ఒక నీటి బిందువు వలె. ఇది మనకే కాదు పై లోకాల్లో ఉండే దేవతలకు కూడా. ఆ దేవతలకు పైన ఉన్న చతుర్ముఖ బ్రహ్మకు కూడా తెలిసింది ఎంత అంటే, "దహరమేవాపి నూనం" వాళ్ళకి తెలిసింది కూడా కొంతే, తెలియవలసింది ఇంకా ఎంతో ఉంటుంది.
దేవతలకి రాజు ఇంద్రుడు, రాక్షసులకి రాజు విరోచనుడు. ఇద్దరూ ఆధిపత్యం కోసం బ్రహ్మ విద్య నేర్వాలని బ్రహ్మ వద్దకి వెళ్ళారు. అక్కడ ముప్పైయేండ్లు బ్రహ్మ చర్యం చేసి ఉపదేశం పొందారు. కంటిలో కనిపించేదేదో అదే బ్రహ్మ తత్త్వం అని గురువు గారు ఉపదేశం చేసారు. ఇద్దరూ ఇక తెలిసింది అనుకుంటూ బయలుదేరారు. విరోచనుడు ఎవ్వరి కంటిలో చూసినా తానే కనబడ్డాడు, నేనే పరం బ్రహ్మ తత్త్వాన్ని అనుకుంటూ వెళ్ళిపోయి లోకాన్ని హింసించటం ప్రారంభించాడు. ఇంద్రుడికి కూడా అలాగే అనిపించాలి కానీ మార్పులు చెందే వాణ్ణి నేను కనుక నేనేలా పరం బ్రహ్మనవుతాను అని ఇంద్రుడికి మాతం సందేహం కలిగింది. ఈ ఉపదేశంలో ఏదో రహస్యం ఉండే ఉంటుంది అని మళ్ళీ బ్రహ్మ వద్దకి వెళ్ళి మొత్తం నూటా ఇరవై సంవత్సరాలు శుశ్రూష చేసి, "అపహతపాత్మా విజరః విమృత్యుః .." అంటూ ఉపదేశం పొంది బ్రహ్మ తత్త్వాన్ని గుర్తించాడు. బ్రహ్మ జ్ఞానం కలగడం అనేది ఏదో వింటేనో తెలిసిపోయేది కాదు, చాలా కష్టపడాల్సి ఉంటుంది. జ్ఞానం కలుగుతూ ఉంటుంది కానీ అది సరియైన జ్ఞానాన్ని ఇవ్వక పోవచ్చు. నీరు ఒకటే అయినా అది ముత్యపు చిప్పలో పడితే ముత్యముగా వస్తుంది, మరొక దాంట్లో పడితే ఆల్చిప్పగా వస్తుంది. నీరు వేడిని పుట్టించటానికి పనికి వస్తుంది, అదే నీరు వేడిని ఆర్పివేయటానికీ పనికి వస్తుంది. ఒకటే జ్ఞానం మనం బాగుపడటానికి పనికొస్తుంది, తెలిసిపోయింది అని అహంకరిస్తే పాడు అవ్వటానికి పనికొస్తుంది. విన్న ఉపదేశం ఒకటే అయినా విరోచనుడికి విపరీత జ్ఞానం కలిగింది. అదే ఇంద్రుడిలో మరింత జిజ్ఞాస కలిగింపజేసి సరియైన జ్ఞానాన్ని ఇచ్చింది. కనుక బ్రహ్మ జ్ఞానం కలగడం అనేది చాలా కష్టం.
లోకంలో భగవంతుని కొన్ని రూపాల గురించి వింటుంటాం, కానీ అది భగవంతుని గురించి పరిపూర్ణంగా తెలుసుకున్నట్లు కాదు. "యది మన్యసే సువేదేతి దహరమేవాపి నూనం త్వం వేత్థ బ్రహ్మణో రూపమ్", పరమాత్మ గురించి ఎవరెవరు ఎంతేంత తెలిసినది అన్నా అది చాలా కొంచమే. చతుర్ముఖ బ్రహ్మ చాలా సార్లు తనకి తెలుసునూ అని అనుకుఉన్నా, తిరిగి నాకు తెలియదు అని చెప్పుకున్నాడు. కనుక భగవంతుని గురించి పరిపూర్ణంగా ఎవ్వరికీ తెలియదు. ఆకాశం ఇంత అని చెప్పగలమా? అట్లానే పరమాత్మ అంటే అపరిచిన్నమైన తత్త్వం అది.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment