What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 31 August 2014

అర్ధనారీశ్వరుడు

అర్ధనారీశ్వరుడు

శివుడు అర్ధనారీశ్వరుడుగా ఎందుకు అవతరించవలసి వచ్చింది? ఈ అవతరణం వెనుక ఉన్న రహస్యమేమిటి? అర్ధనారీశ్వరతత్వం మానవాళికి ఇచ్చే మహాసందేశమేమిటి? అనే విషయాలను విరించే కథ శివపురాణంలోని శతరుద్ర సంహితంలో కనిపిస్తుంది. నందీశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడికి ఈ కథను వివరించాడు. పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయడం కోసం తనదైన పద్ధతిలో సృష్టిని చేయసాగాడు. కానీ అలా తానొక్కడే ప్రాణులను రూపొందిస్తూ జీవంపోస్తూ ఎంతకాలంగా తన పనిని తను చేసుకుపోతున్నా అనుకున్నంత సంఖ్యలో ప్రజావృద్ధి జరగలేదు. ఇందుకు ఎంతగానో చింతిల్లిన బ్రహ్మదేవుడు పరమేశ్వరుని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. బ్రహ్మ చేసిన కఠిన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రసన్నుడయ్యాడు. అయితే బ్రహ్మకు ఆ క్షణాన ప్రసన్నమైన శివుడు అంతకు ముందులా కాక ఒక తేజోవంతమైన విచిత్ర స్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. సగం పురుషుడు, సగం స్త్రీ రూపంగల దేహంతో ఆ శివస్వరూపం వెలుగొందసాగింది. పరమశక్తితో కూడి ఉన్న ఆ శంకరుడిని చూసి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేసి అనేక విధాల స్తుతించాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మసృష్టికి సహకరించటానికే అర్ధనారీశ్వర రూపాన్ని తాను ధరించి వచ్చినట్లు చెప్పాడు. అలా పలుకుతున్న శివుడి పార్శ్వభాగం నుండి ఉమాదేవి బయటకు వచ్చింది. బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను స్తుతించి సృష్టి వృద్ధి చెందటం కోసం సర్వసమర్ధమైన ఒక రూపాన్ని ధరించమని తనకుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రార్ధించాడు. ఆమె బ్రహ్మను అనుగ్రహించింది. ఆ వెంటనే భవానీదేవి కనుబొమ్మల మధ్య నుండి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్యశక్తి అక్కడ అవతరించింది. అప్పుడా శక్తిని చూసి పరమేశ్వరుడు బ్రహ్మతపస్సు చేసి మెప్పించాడు. కనుక ఆయన కోర్కెలను నెరవేర్చమని కోరాడు. పరమేశ్వరుని ఆ ఆజ్ఞను ఆమె శిరసావహించింది. బ్రహ్మదేవుడు కోరినట్లుగానే అనంతరం ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది. ఆనాటి నుంచి ఆలోకంలో నారీ విభాగం కల్పితమైంది. స్త్రీ, పురుష సమాగమ రూపమైన సృష్టి ఆనాటి నుండి ప్రవర్తిల్లింది. స్త్రీశక్తి సామాన్యమైనది కాదని ప్రతివారు స్త్రీమూర్తులను గౌరవించి తీరాలని ఆది దేవుడు, ఆది పరాశక్తి ఇద్దరూ సమానంగా ఎంత శక్తి సామర్ధ్యాలు కలిగి ఉన్నారో ఈ లోకంలో ఉండే పురుషులతో స్త్రీలు కూడా అంతే శక్తిసామర్ధ్యాలు కలిగి ఉన్నారనే విషయాన్ని ఈ కధాసందర్భం వివరిస్తుంది. అంతేకాక సృష్టి స్థితి, లయ కారకులో సృష్టికర్తా అయిన బ్రహ్మదేవుడు తొలుత తాను ఒంటరిగా సృష్టిని ప్రారంభించిన, దానివల్ల ఎక్కువ ఫలితం కలుగలేకపోయిందని పరమేశ్వర అనుగ్రహంతో స్త్రీత్వం అవతరించిన తర్వాతే సృష్టి విశేషంగా పరివ్యాప్తమైందని ఈ కథ వివరిస్తుంది. స్త్రీశక్తి విశిష్టతను తెలియజెప్పేందుకు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి అర్ధనారీశ్వర రూపంలో అవతరించాడు. కనుక పురుషాధిక్యాన్ని ప్రదర్శించటం కానీ, స్త్రీలను, స్త్రీ శక్తిని కించపరచటం కానీ ఎంతమాత్రమూ దైవ హితం కాదనే విషయాన్ని ఈ కధలో మనం గమనించవచ్చు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML