What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 31 August 2014

జగన్మాత

జగన్మాత

సకలచరాచర జగత్తుకు మూలాధారమేది? ఎవరివల్ల ఈ సృష్టి అంతా జరుగుతుంది? ఎవరైనా రక్షణ కోసం ఎవరిని ఆశ్రయించాలి? అనే సందేహాలు సాక్షాత్తూ సృష్ఠికర్త అయిన బ్రహ్మదేవుడికే కలిగాయి. ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాల సారం దేవీభాగవతం తృతీయ స్కంధంలో మనకు కనిపిస్తుంది. జనమేజయుడు తన మనసులోని ఈ సందేహాలను వ్యాసుడి దగ్గర ప్రస్తావించాడు. వ్యాసుడికి కూడా ఇటువంటి సందేహాలు కలిగితే వాటిని నారద మహర్షి దగ్గర ప్రస్తావించాడు. నారదుడు ఆ ప్రశ్నలన్నింటినీ విని తనకే ఆ సందేహాలు వచ్చాయని వాటిని గురించి తన తండ్రి అయిన బ్రహ్మదేవుడిని అడిగినప్పుడు ఆయన తనకు సందేహనివృత్తి చేసి త్రిమూర్తులకు కలిగిన దివ్యానుభూతులను వివరించాడని, కథాక్రమాన్నంతా చెప్పాడు. ఒకప్పుడు ప్రళయం సంభవించింది. ఆ ప్రళయ కాలంలో చుట్టూ జలం, మధ్యలో ఒక మహాపద్మం, ఆ పద్మం దుద్దుమీద బ్రహ్మదేవుడు ఒంటరిగా కూర్చొని తానెవరు? తానిప్పుడు ఏంచేయాలి? అనే విషయాలను గురించి తీవ్రంగా ఆలోచించటమేగాక అసలు తానున్న పద్మం ఎక్కడ నుంచి ఉద్భవించింది? అని కూడా తెలుసుకోవాలనుకున్నాడు. అలా అనుకొని పద్మానికున్న కాడను పట్టుకొని జలంలోకి బయలుదేరాడు. ఎంతకాలం వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా బ్రహ్మకు ఆ కాడ అంతమూ, భూమి ఎక్కడా ఆనవాళ్ళే కనిపించలేదు. దాంతో వెంటనే ఆయన మళ్ళీ పద్మంలో ఉన్న దుద్దు మీదకు వచ్చి చేరాడు. ఇంతలో మధు, కైటభులనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మను సంహరించటానికి బయలుదేరి వచ్చారు. వారి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక బ్రహ్మ పద్మం కాడ లోపలికి ప్రవేశించాడు. అలా ఆ మార్గాన ఎంతోదూరం వెళ్ళగా ఒకచోట శేషతల్పం మీద యోగనిద్రలో శయనించి ఉన్న శ్రీ మహావిష్ణువు కనుపించాడు. కొద్ది సమయం ఆగి బ్రహ్మ నిద్రాదేవిని స్తుతించాడు. వెంటనే ఆమె శ్రీ మహావిష్ణువును వీడి గగనంలో నిలిచింది. ఆ వెంటనే విష్ణువు మెల్లగా కళ్ళు తెరిచి బ్రహ్మను చూశాడు. విషయమంతా తెలుసుకొని మధు, కైటభులను తన విశాలమైన తొడమీద పెట్టుకొని సంహరించాడు. ఇంతలో అక్కడకు రుద్రుడు వచ్చాడు. బ్రహ్మ, విష్ణు, రుద్రులు ముగ్గురూ కలిసి జగదాంబను స్తుతించారు. జగదాంబ వారి స్తుతులకు ఆనందించి రాక్షస సంహారం అయింది కనుక ఇక ఎవరి విధులను వారు నిర్వర్తించమని బ్రహ్మకు ప్రత్యేకంగా సృష్టిని చెయ్యమని చెప్పింది. అయితే బ్రహ్మ చుట్టూ నీరు తప్ప మరెక్కడా భూమి కానీ, మరేమీ కానీ లేవని మరి సృష్టి ఎలా చేయటం? అనే సందేహాన్ని వ్యక్తపరిచాడు. అప్పుడు జగదాంబ తాను ఏ పలుకు పలికినా పూర్వాపరాలు లేకుండా, ఆధారాలు లేకుండా వృధాగా ఎప్పుడూ పలకనని నిరూపించటానికి, అలాగే తాను ఏదిచెప్పినా వెంటనే చేసితీరాలనికానీ సందేహపడకూడదనే విషయాలను నిరూపించటానికి తన శక్తేమిటో, తానెవరో మరోమారు త్రిమూర్తులకు వివరించటానికి ఒక విషయాన్ని వారికి చూపించాలనుకుంది. ఆమె చిరునవ్వు నవ్వగానే ఒక దివ్యవిమానం వారిముందు వాలింది. ఆ విమానంలో బ్రహ్మ, విష్ణు, రుద్రులు, జగన్మాత అందరూ ఎక్కి కూర్చున్నారు. అప్పుడు ఆ దివ్యవిమానం సర్వలోకాలను చుట్టిరావాలన్న దేవీ సంకల్పంతో బయలుదేరింది. లోకాలన్నీ సంచరిస్తూ స్వర్గలోకానికి, అలాగే వైకుంఠానికి, కైలాసానికి, సత్యలోకానికి బయలుదేరి వెళ్ళింది. చాలా విచిత్రంగా త్రిమూర్తుల లోకాలు త్రిమూర్తులకు మళ్ళీ వారి రూపాలలో ఒక్కొక్కరు కనిపించసాగారు. ఆ మాయ ఏమిటో, అలా ఎందుకు జరుగుతుందో బ్రహ్మ, రుద్రులకు త్వరగా అవగతం కాలేదు. అయితే విమానంలో ఉన్న శ్రీమహావిష్ణువు మాత్రం కొంత ముందుగా విషయాన్ని గ్రహించగలిగాడు. తమ చెంత ఉన్న జగన్మాత ఈ సకల సృష్టికి మూలస్వరూపిణి అని, అంతకుముందు ప్రళయకాలంలో వటపత్రశాయిగా ఉన్న తనను తల్లిగా లాలించి, పోషించింది కూడా ఆ జగన్మాతే అని గ్రహించగలిగాడు విష్ణుమూర్తి. అలా ఆ దివ్యవిమానం మెల్లగా కదులుతూ పాలసముద్రంలో ఉన్న ఒక అద్భుత ద్వీపానికి చేరుకుంది. ఎన్నెన్నో అమూల్య సుందర సౌధాలు, వనాలు వారికక్కడ కనిపించాయి. ఆ ద్వీపంలో ఒకచోట శివాకారంలో ఒక ప్రదేశం కనిపించింది. ఆ ప్రదేశంలో ఓ దివ్యమైన స్త్రీమూర్తి ఎర్రని వస్త్రాలు ధరించి, ఎర్రని పూలమాలలు, ఎర్రచందనం, విశాలంగా ఉండి ఎర్రబారిన కళ్ళతోనూ, పెదవులతోనూ, మిరుమిట్లు గొలిపే కాంతితో ప్రకాశిస్తుంది. చిరునవ్వులు చిందిస్తున్న ఆ దివ్యసుందరమూర్తిని ఎందరెందరో దేవకన్యలు సేవిస్తూ ఉన్నారు. అటువంటి దివ్యసుందరమూర్తి ఎవరై ఉంటుందా? అని త్రిమూర్తులంతా నివ్వెరపోతూ చూస్తూ ఉన్న సమయంలో మళ్ళీ విష్ణుమూర్తే ఆమె సాక్షాత్తూ తమకందరికీ కారణభూతురాలైన మహాదేవి అని గుర్తించాడు. మహావిద్య, మహామాయ, పూర్ణప్రకృతి, అవ్యయ, యోగగమ్య, ఇచ్ఛారూపిణి, నిత్యానిత్య స్వరూపిణి, విశ్వేశ్వరి, వేదగర్భ అన్నీ ఆమేనని విష్ణుమూర్తి గ్రహించాడు. సకల జీవకోటి చిహ్నాలు ఆమె శరీరంలో కనిపించసాగాయి. ఆ విషయాలను విష్ణువు తన పక్కన ఉన్న బ్రహ్మకు కూడా చెప్పాడు. ఇంతలో ఓ విచిత్రం జరిగింది. విమానం దిగి ఆ మహాశక్తి ముంగిట నిలచిన ముగ్గురు దేవతలు ఆ మహాదేవిని చూసి స్తుతిస్తూ నమస్కరించారు. ఆ మహాదేవి కూడా చిరునవ్వు నవ్వుతూ త్రిమూర్తులవంక చూసింది. క్షణంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు స్త్రీమూర్తులుగా మారిపోయారు. ఈ విచిత్రం ఆ ముగ్గురికి ఆశ్చర్యాన్ని కలిగించింది. త్రిమూర్తులు నానారత్న శోభితమై ప్రకాశిస్తున్న ఆ దేవి పాదపీఠాన్ని అలా చూస్తు నిలుచుండిపోయారు. దేవి చుట్టు ఉన్న సఖీజనం వింజామరులు వేస్తూ, మంగళఘోషతో అమ్మవారికి ఆనందం కలిగిస్తున్నారు. మరోక్షణంలో త్రిమూర్తుల చూపులు ఆమె పాదాలపైన ప్రత్యేకించి బొటనవేలి గోరుపైన పడ్డాయి. తళతళలాడుతూ అద్దంలా ఉన్న ఆ బొటనవేలి అద్దంలాంటి గోరులో సకల జగత్తు, బ్రహ్మాండం, సూర్యచంద్రులు, గ్రహతారకలు, సముద్రాలు, దేవతలు ఒకటేమిటి సృష్టిలో ఉన్నదంతా కనిపించంది. ఆ మహాత్వాన్ని చూసి బ్రహ్మ, విష్ణు, రుద్రులు ఒక్కొక్కరు విడివిడిగా దేవిని స్తుతించి తమకు జ్ఞానోదయమైందని పలికారు. అనంతరం జగదాంబ కరుణారస దృక్కులతో త్రిమూర్తులకు వారివారి రూపాలు వచ్చాయి. దేవిజగన్మాత పలుకు పలికినా అది శిరోధార్యమేనని అనుకున్నారు. తమవెంట విమానంలో ఉన్న జగన్మాత ఈ ఆదిపరాశక్తిగా ఇక్కడ భాసిల్లుతోందని గ్రహించారు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML