What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 28 August 2014

శ్రీకృష్ణుడు ఉద్దవునికి వివిధ మార్గముల గురించి వివరించుట :

శ్రీకృష్ణుడు ఉద్దవునికి వివిధ మార్గముల గురించి వివరించుట :


ఉద్దవా! మానవుడు, యీ లోకమందు జీవించి యున్నంతవరకు మూడు విధములైన తాపత్రయములు అతనిని వేధించును. ఈ తాపత్రయముల నుండి తప్పించుకొనలేడు. ఈ తాపత్రయములు మూడు ఆధ్యాత్మికము, ఆధిదైవికము, ఆధిభౌతికము. ఈ మూడును మొదట లేవు, చివర నుండవు. ఈ మూడును, మాయ ప్రపంచములో ఆత్మ యున్నంతవరకు నుండుటచేత, యివి మాయా జనితములుగా పరిగణించవచ్చును. ఈ మూడు వికారములకు పుట్టుక, కొంతకాలముండుట, తరువాత నశించుట సంభవించును. నిజమైన జ్ఞానవంతులను అవి యేమియు చేయలేవు. నీవు శుద్ధ చైతన్యమూర్తివను ఎరుక గలిగినపుడు, నీవు ఈ మూడు తాపత్రయముల గురించి భయపడనవసరము లేదు. నీ సత్యాన్వేషణ మార్గమునకు అడ్డు తగలవు.
కాబట్టి ,ఉద్దవా! నిజమైన జ్ఞానము పొందుటకు కృషి చేయుము. ఈ యజ్ఞము పొందినట్లయితే, నీలోని ప్రత్యగాత్మ బ్రహ్మమని గుర్తించెదవు. నీవు చేయవలసిన యజ్ఞము జ్ఞానయజ్ఞం బ్రహ్మస్థితి నందుకొనుటకు ఈ యజ్ఞమును చేయవలెను. ఈ జ్ఞాన యజ్ఞము భక్తిచేత పునీతమగును. నీకు నాయందున్న పరిపూర్ణమైన భక్తిచేత నీ ఆలోచనలు, మనస్సు పరిశుద్దమగును. ఆ విధముగా పరిశుద్దమైన మనస్సుతో జ్ఞాన మార్గమందు పయనించిన, నీవు గమ్యము చేరగలవు.
కృష్ణుడు చెప్పిన విధానము ఉద్దవునికి సరిగా అర్ధము కాలేదు. అప్పుడు ఉద్దవుడు, కృష్ణా! కేవలము భక్తీ నభ్యసించుట చేత నిన్ను చేరగలిగినచో, జ్ఞాన విజ్ఞాన వైరాగ్యముల గురించి ఆలోచించు టెందులకు? నాకు సవివరముగా తెలుపుము అని కోరెను.
అప్పుడు కృష్ణుడు, ఉద్దవా? ప్రకృతి, పురుషుడు, మహతత్త్వము, అహంతత్వము అను అయిదు తన్మాత్రులు కలిసి మొత్తము తొమ్మిది, అయిదు కర్మేంద్రియములు, అయిదు జ్ఞానేంద్రియములు, మనస్సు కలిసి మొత్తం పదకొండు, పంచమహాభూతములు, సత్వరజోతమో గుణములు కలిసి మొత్తం తొమ్మిది. ఇవి అన్నియు కలిసి యిరువది ఎనిమిది వీనిచేత ఈ మాయలోకము ప్రకటితమగుచున్నది. ప్రకటితమైన యీ మాయ ప్రపంచమునకు ఆవలయున్న సత్యమును బుద్ధి గ్రహించినపుడు, ఒకేఒక పరమాత్మా వీనన్నింటియందు వ్యాపించియున్నాడని తెలుసుకొనినపుడు, ఈ వస్తు ప్రపంచము నందలి కార్యకారణములకు మూలము బ్రహ్మమని గుర్తించినపుడు, అదియే జ్ఞానమని తెలియదగును.

ఈ లోకములో జరుగు కార్యములు ఒకదానితో నొకటి గోలుసువలె ముడిపడియున్నవని, వీటన్నిటికిని మూలకారణము పరబ్రహ్మమని, త్రిగుణములతో యేర్పడిన సంసారము అనగా మన చుట్టును నున్న ప్రపంచమునకు పుట్టుక, మనుగడ, మరణము గలవని గుర్తించి గ్రహించవలెను. దీని పర్యవసానా మేమనగా, ఈ లోకము అశాశ్వతము, అనిత్యము మూలకారణము మార్పులు చెందుచున్నట్లు గోచరించును. ప్రారంభములో ఒక రూపము కలిగి తరువాత కాలచక్రములో వివిధ పరిణామాలు పొంది, చివరలో మొట్టమొదటి రూపమునకు భిన్నముగా రూపొందుచున్నది. మహాప్రళయము కాలమందు మూలకారణము(పరమాత్మ) మాత్రమే మిగిలియుండును. అదియే శాశ్వతమైనది. అది ఒక్కటియే సత్యము ఆ సత్యాన్వేషణమే, అనగా మాయకు మూలకారణమేదో తెలుసుకొనుటే విజ్ఞానము.

మరియు బుద్దిచేత ఈ విశ్వమునకు మూలము గలదని, ఈ విశ్వమునకు అంతము గలదని నీవు తెలుసుకొనగలవు. సర్వమును బ్రహ్మమయమనియు, బ్రహ్మము కానిది మాయ అను సారము కూడ నీవు నేర్చుకొని యుండవచ్చును. సత్యమును బుద్దిచేత అర్థము చేసుకొనుట ఒకయెత్తు. అనుభవముచేత గ్రహించుట మరియొక ఎత్తు. ఈ వస్తుప్రపంచము మాయతో కూడినది అను జ్ఞానము ‘పరోక్ష జ్ఞానము’ ఈ విశ్వము ఆవిర్భవించుటకు మూలకారణము ఉన్నదను సత్యమును నీవెరుగుదువు నీవు దీని వెనుకవున్న సత్యమును అనుభవపూర్వకముగా గ్రహించిన తర్వాత ఈ జ్ఞానము కలుగును దీనిని ‘అపరోక్ష జ్ఞానము’ అందురు. దీనికొరుకు చేయు సాధన దాని విజయమును జ్ఞాన విజ్ఞానము లందురు.

ఇపుడు నీకు వైరాగ్యము గురించి చెప్పెదను. శృతి, ప్రత్యక్ష, అనుమాన ప్రమాణములను మూడును మానవుని వైరాగ్యమార్గమునకు తీసుకువెళ్ళును. పవిత్ర శాస్త్ర గ్రంధములు బ్రహ్మమే సత్యమని వచించుచున్నవి. ఇదియే శ్రుతి, వేదములు ఉపనిషత్తులు ఈ సత్యమును బోధించినవి. మనము వస్త్రమును చూచినపుడు అది అనేక దారములతో నేసినదని తెలుసుకొందుము పలు దారముల కలయిక చేత వస్త్రముగా గోచరించుచున్నది. నిజముగా యెంచి చూచినచో వస్త్రము దారముల సముదాయము తప్ప యితరమేదియు గాదు. అయితే ఉన్నటువంటి దారములు ఒకదానితో నొకటి చేరి యున్నప్పుడు దానిని వస్త్ర మనుచున్నాము. ఇందు ముఖ్యమైన దానిని అవగాహన చేసుకున్నచో దారములు నిత్యమని, వస్త్రములు అనిత్యమని తెలియును. వస్త్రమును చింపి దారములను దేనికి దానిని విడదీసినపుడు వస్త్రము తన స్వరూపమును గోల్పోవును. దీనిని ప్రత్యక్ష ప్రమాణమందురు.
మహామేధవులు చెప్పిన విషయములు వినుతచేత, తానూ స్వయంగా యోచించుటచేతను, విజ్ఞాని యీ వస్తు ప్రపంచమంతయు మాయ యని గ్రహించును. యీ మాయ ప్రపంచము త్రిగుణములతో పంచమహాభూతములతొ అనేక విధములుగా మిళితమై యుండుటచేత ఏర్పడుచున్నదనియు నిజముగా బ్రహ్మము తప్ప ఇంకేదియు శాశ్వతము కాదనియు గ్రహించును. ఈ విధముగా గ్రహించుటచేత మానవుడు వైరాగ్యము నలవరచుకొనును. అనగా వస్తు ప్రపంచము అశాశ్వతమను విశ్వాసముతో దానిపై అనుబంధము పెంచుకొనక యుండును. విధి నిర్ణీతమైన కర్మలు చేసి అందుమూలముగా స్వర్గ సౌఖ్యములు పొందినప్పటికీ ,అది అంతయు మిధ్యయని విరాగి తెలుసుకొనును.

ఓం నమో పరమాత్మయే నమః

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML