దేవాలయాల పరిరక్షణ ఎవరిది...
హిందువులకు ఆధ్యాత్మిక కేంద్రాలు దేవాలయాలు. ప్రతి హిందువు తన జీవన
చక్రంలో పడి ప్రతి నిత్యము దేవాలయానికి పోలేకపోవచ్చును. కాని వారంలో ఏదో ఒక
రోజున మాత్రం దేవాలయానికి వెళ్ళటం భగవద్దర్శనం చేసుకోవడం జరుగుతుంది.
ప్రతినిత్యం వెళ్ళేవారు కూడా లేకపోలేదు. దేవాలయానికి వెళ్ళిన ప్రతి భక్తుడు
తన శక్తికొలది కానుకలను భగవంతునికి సమర్పించుకుంటాడు. భక్తులు భగవంతునికి
కానుకలు సమర్పించడానికి అనుకూలంగా ఒక హుండీని ఏర్పాటుచేస్తారు. హుండీ
ద్వారా వచ్చిన కానుకలను భగవంతుడికి ప్రతినిత్యం జరుపబడే కైంకర్యాలకు
ఖర్చుచేస్తారు. మిగిలిన డబ్బును దేవాలయ అభివృద్ధికి ఉపయోగిస్తారు. హిందూ
సంప్రదాయంలో మొక్కుల ప్రహసనం అనాదిగా కొనసాగుతున్నది. ప్రత్యేక మొక్కులు
తీర్చుకొనే భక్తులు దేవీదేవతల విగ్రహాలకు విలువైన ఆభరణాలు చేయిస్తుంటారు.
వీటి ద్వారా దేవాలయాలకు అధిక సంపద చేకూరుతుంది.
మన రాష్ట్రంలో హిందూ
దేవాలయాలు వేల సంఖ్యలో ఉన్నప్పటికి వందల సంఖ్యలో దేవాలయాలలో మాత్రమే అధిక
సంపద ఉన్నది. వేల సంఖ్యలో దేవాలయాలు జీర్ణావస్థలో ఉన్నాయి. అధిక సంపద
వస్తున్న హిందూ దేవాలయాలను మాత్రం మన
రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంటు పేరుతో తమ ఆధీనంలో పెట్టుకొని అజమాయిషీ
చేస్తుంది. సంపద వస్తున్న దేవాలయాలపైన చూపిస్తున్న అధికారం సంపద లేని
జీర్ణావస్థలో ఉన్న దేవాలయాల పునరుద్ధరణకు ఎందుకు బాధ్యత వహించరు. అనేక
హిందూ దేవాలయాలలో దొంగతనాలు, దోపిడీలు జరుగుతున్నాయ. హుండీలను
దోచుకోవడం,దేవతామూర్తులపై ఉన్న విలువైన ఆభరణాలను దోచుకోవడం జరుగుతున్నది.
దేవాలయాలలోని విలువైన విగ్రహాలను కూడా దోచుకుంటున్నారు. గుప్త నిధుల పేరుతో
దేవాలయాలను కూల్చుతున్నారు. దేవతామూర్తులను ధ్వంసం చేస్తున్నారు. హిందూ
దేవాలయాలు వివిధ రకాల విధ్వంసాలకు గురౌతున్నా, అపవిత్రం చేయబడుతున్నా,
దేవాలయాలపై ఆధిపత్యం కలిగి ఉన్న ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవడంలేదు.
దోపిడీలకు, విధ్వంసాలకు గురౌతున్న దేవాలయాల పరిరక్షణకు ప్రభుత్వం
అసెంబ్లీలో చర్చలు జరిపి తగిన చర్యలు తీసుకోకపోవడంవల్ల మనోభావాలు
దెబ్బతిన్న హిందువులు ఏ దిశలో ప్రయాణించాలో తెలియక మల్లగుల్లాలు
పడుతున్నారు. ఈ విషయంలో దేవాదాయశాఖ, పీఠాధిపతులు, హిందూ ధార్మిక సంస్థలు,
హిందూ శాస్త్ర సాంకేతిక నిపుణులు పరిష్కరించే దిశలో ఆలోచించాలి..@ బహుజన
బంధు.
No comments:
Post a Comment