రామానుజాచార్యుడు
రామానుజాచార్య లేదా రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 )
విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి.
రామానుజాచార్యుడు త్రిమతాచార్యుల లో ఒకడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన
ధైర్యానికి, దేవుని పై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిలేని
భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆచార్యుడు
తన జీవితంలో సాధించిదలచిన(సాధించిన) ముఖ్య ఉద్దేశ్యాలు:
• మొదటిది,
ప్రబలంగా కొనసాగుతున్న, బౌధ్ధ, జైన, శైవ, వైష్ణవ సాంప్రదాయాలన్నీ అనాదిగా
వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఈ మతాలు దేవుడిని
కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ, వైదిక మతానికి బదులుగా
పాటించవలసినవి కాదని నిరూపించటం.
• రెండవది, ఆదిశంకరుని అద్వైత సిద్ధాంతం లోని లొసుగులను సరిదిద్ది, విశిష్టాద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించటం.
• ప్రస్థాన త్రయాన్ని సాధారణ జనానికి అందించడం.
తన జీవితం ద్వారా ఈ ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలు ఇవి:
• ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి
సామాజిక పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై
వాటిని మానటమో, మార్చటమో చేయటం బ్రాహ్మణుని లేదా ఆచార్యుని ప్రధమ కర్తవ్యం.
• దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం, మానవుడిగా జన్మించిన ప్రతి
ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు. దేవుని
దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం
మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం.
• మునుపు గురువులు
చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని
తర్కానికి గురిచేసి అది ఒప్పో, తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో
అధైర్యపడవలసిన పనిలేదు.
• ఒక పనివల్ల పదిమందికి మేలు
జరుగుతున్నప్పుడు, తమకు కీడు జరిగినా, పదిమందికి జరిగే మేలుకై, తమ కీడును
లెక్కచేయవలసిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు
కాదు.
దేశకాల పరిస్థితులు[మార్చు]
రామానుజుల జన్మసమయానికి దక్షిణభారత దేశాన ఉన్న రాజవంశాలు, వారి మతసంబంధిత రాజకీయాలను ఈ క్రింది విధంగా సంక్షిప్త పరచవచ్చు:
• చోళులు - చోళులు శైవమత అనుచరులైనప్పటికీ, వైదికమత విధివిధానాలను
వ్యతిరేకించలేదు. చోళరాజ ప్రముఖులలో ఒకడైన రాజరాజ నరేంద్ర చోళుడే
వైదికమతకర్మలను, వర్ణాశ్రమాలనూ, ప్రోత్సహించి, పలు యజ్ఞయాగాదులు చేయించాడు.
ఒకటవ కుళోత్తుంగ చోళుడు కూడా ఎందరో వైదిక బ్రాహ్మణులను ఆదరించి,
దానధర్మాలు చేశాడని చరిత్రలో ఋజువులు ఉన్నాయి.[1]
• చాళుక్యులు -
చాళుక్యులు మొదట శైవులైనప్పటికీ, రానురాను జైనమతాన్ని ఆదరించారని చరిత్ర
చెబుతోంది. తూర్పు, పశ్చిమ చాళుక్య రాణులు అనేకమంది జైనమత ప్రభావానికి లోనై
తమ రాజులను ఆ మతాన్ని ఆదరించేటట్లుగా మార్చి ఉన్నారని శిలాశాసనాలద్వారా
తెలుస్తోంది. వేంగీ ( ఏలూరు) ప్రాంతాధిక్యతకై చోళ చాళుక్యుల మధ్య జరిగిన
యుద్ధాలలో అనేక మార్లు చోళులు చాళుక్య జైన ఆరామాలను, మందిరాలను ధ్వంసం
చేశారని ఋజువులు ఉన్నాయి.[2]
• హోయసళ రాజులు - నేటి ఉత్తర కర్ణాటక
ప్రాంతాలైన బేలూరు, బాదామిలను రాజధానులుగా చేసికొని, కర్నాటక ప్రాంతాన్ని
పరిపాలించిన హోయసళ రాజులు జైన, వీరశైవ మతాలను ఆదరించారు. బిత్తిదేవన్ లేక
బిత్తిగ లేక విష్ణు అను పేరున్న హోయసళ రాజును రామానుజాచార్యుడు జైనమతానుసరణ
నుంచి వైష్ణవానికి మరల్చినట్టుగా చారిత్రక ఆధారాలున్నాయి.[3]
ఇవియే
కాక, ఈ క్రింది మతసంబంధిత విషయాలను కూడా మనసులో ఉంచుకోవటం వల్ల,
రామానుజాచార్యుని జీవితాన్ని, ఆయన చేసిన సేవను మరింత హర్షించవచ్చు.
•
రామానుజుల కాలానికి మౌర్యరాజులు (ముఖ్యంగా అశోకుడు) ఆదరించిన బౌధ్ధమతం
క్షీణదశలో ఉండినది. దీనికి ఆదిశంకరులవారి అద్వైత వేదాంతము కూడా కొంత కారణమై
ఉండవచ్చు.
• రాజాదరణ పొంది, ప్రాబల్యాన్ని పుంజుకొన్న జైన, శైవ మతాలు,
స్థానిక ఆచారవ్యవహారాలతో కలసి అనేక శాఖలుగా విభజితమైనవి [4]. ఈ వేర్వేరు
శాఖలు, వేర్వేరు సిధ్ధాంతాలను ప్రతిపాదిస్తూ, తమ తమ శాఖలే గొప్పవని
ఉటంకిస్తూ, మూల ఉపనిషత్సారాన్ని ప్రజలకు అందించలేక పోయాయి.[5]
• ఈ
కాలంలో భక్తిమార్గానికి చాలా ప్రాబల్యం ఉండినది. భక్తిమార్గానికీ,
విగ్రహారాధనకూ ఉన్న సంబంధం వలన పైన పేర్కొన్న రాజులందరూ, ఎన్నో దేవాలయాలు
నిర్మించి, ఆ మార్గాన్ని ప్రోత్సహించటం జరిగింది. రాముడు, కృష్ణుడు, శివుడు
(వేర్వేరు రూపాలలో) దేవుళ్ళుగా ఆరాధనలను అందుకోవటం ఈ కాలం యొక్క
విశిష్టమైన మతసంబంధితమైన మార్పుగా చెప్పుకోవచ్చు.[6]
జీవితకాల నిర్ణయం
సాంప్రదాయక జీవితచరిత్రకారుల ప్రకారం, రామానుజాచార్యులు క్రీ.శ. 1017 -
1137 సంవత్సరాల మధ్య తన జీవితాన్ని కొనసాగించాడు. వీరి ప్రకారం ఆచార్యుల
జీవితకాల వ్యవధి నూట ఇరవై సంవత్సరాలు (120 సం.). వంద సంవత్సరాలకు పైచిలుకు
మనిషి బ్రతికే అవకాశం తక్కువ. కనుక ఈ నూట ఇరవై సంవత్సరాల వ్యవధి కొంత
అనుమానాస్పదమౌతుంది. సాంప్రదాయక ఆధారాల ప్రకారం రామానుజాచార్యులు తమిళ
'పింగళ' సంవత్సరంలో జన్మించి, మరో 'పింగళ' సంవత్సరంలో పరమపదించారు.[7] తమిళ
కాలమానం ప్రకారం ఒకే పేరుగల సంవత్సరం మళ్ళీ రావటానికి అరవై సంవత్సరాల కాలం
పడుతుంది. దీన్ని బట్టి మనం రామానుజాచార్యుల జీవితం అరవై లేక నూట ఇరవై
సంవత్సరాలు ఉండవచ్చని భావించవచ్చు.
క్రీ.శ. 1917 లో టి.ఏ. గోపీనాథ్ ,
సాంప్రదాయక మూలాల ఆధారంగా, రామానుజాచార్యులను శైవమతాధిక్యతను
ఒప్పుకొనేందుకు బలవంతం చేసిన రాజును, ఒకటవ కుళోత్తుంగ చోళునిగా గుర్తించి,
ఆచార్యుల మేలుకోట ప్రవాసం క్రీ.శ. 1079 - 1126 ప్రాంతంలో జరిగినట్టుగా
అనుమానించారు. ప్రవాస కాలం నలభై ఏడు సంవత్సరాలు కావటం, ఒకటవ కుళోత్తుంగ
చోళుడు వైష్ణవమత ద్వేషి కాకపోగా వైదికమత ఆదరణలో భాగంగా ఎన్నో దానాలను
చేసినట్టుగా చారిత్రక ఆధారాలుండటం, ఈ జీవితకాల నిర్ణయానికి ఆక్షేపాలని
చెప్పుకోవచ్చు.
టి.యన్. సుబ్రమణియన్ అనే మద్రాసు ప్రభుత్వ ఉద్యోగి,
'రామానుజాచార్య దివ్య చరితై' అనే తమిళ సాంప్రదాయక జీవితచరిత్రలో
ఉల్లేఖించిన శ్రీభాష్య రచనా సమాప్తి కాలం (క్రీ.శ. 1155-1156) ప్రకారం,
రామానుజుల జీవితకాలం క్రీ.శ. 1077 - 1157 మధ్య ఉండవచ్చని అంచనా వేశారు. ఈ
జీవితకాలం 80 సంవత్సరాలు కావటం, వైష్ణవ ద్వేషి ఐన రెండవ కుళోత్తుంగ చోళుడు
ఇదే సమయంలో రాజ్యమేలటం, ఈ అంచనా సరియైనదేననటానికి ఋజువులుగా చెప్పుకోవచ్చు.
'విష్ణువర్ధనుడు' అనే పేరు గల హోయసళ రాజు (హోయసళ రాజులు) ఇదే సమయంలో
కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించటం కూడా గమనించదగ్గ విషయం(ఇతడే పైన
చెప్పుకొన్న భిత్తిగ దేవుడు అయి ఉండవచ్చు). ఐతే దేవాలయ శిలాశాసనాలు,
రామానుజాచార్యుడు మరియు అతని శిష్యులు మేలుకోటలో క్రీ.శ. 1137 కు ముందే
నివాసమున్నట్లు తెలుపుతుండటం ఈ జీవితకాల నిర్ణయానికి ఆక్షేపంగా
చెప్పుకోవచ్చు.
జన్మవృత్తాంతం
జన్మ స్థలం, నక్షత్రం మరియు ఇతర వివరాలు
మద్రాసు కు 30 మైళ్ళ దూరంలో ఉన్న శ్రీపెరుంబుదూరు లో శ్రీమాన్ ఆసూరి
'సర్వక్రతు' కేశవ సోమయాజి దీక్షితార్ మరియు కాంతిమతి అను పుణ్య దంపతులు
ఉండేవారు. వేదాలలో చెప్పబడిన అన్ని యజ్ఞాలనూ పూర్తిచేసి 'సర్వక్రతు'
బిరుదును పొందిన కేశవ సోమయాజి, ఎంతకాలానికీ తమకు సంతానం కలుగక పోవటంతో,
భార్య కాంతిమతితో కలసి, తిరువళ్ళిక్కేణి (ట్రిప్లికేన్) ఒడ్డున ఉన్న
పార్థసారథి స్వామి దేవాలయంలో యజ్ఞాల ద్వారా ఆ స్వామిని మెప్పించి సంతానం
పొందే ఉద్దేశ్యంతో శ్రీపెరుంబుదూరు ను వదిలి వెళ్ళారు. ఆ స్వామి అనుగ్రహం
వల్ల వీరిరువురికి ఒక సంవత్సరం అనంతరం జన్మించిన శిశువు
రామానుజాచార్యుడు.[8] 'శ్రీ వైష్ణవ ఆచార్య పరంపర' అను సాంప్రదాయక గ్రంథం
ప్రకారం, ఈ పుణ్యదినం కలియుగ సంవత్సరం 4118, పింగళ వర్షం, చైత్ర మాసం,
తిరువాదిరై రాశి(ఆరుద్ర నక్షత్రం), శుక్లపక్ష పంచమి, శుక్రవారం. ఆంగ్ల
కాలమానం ప్రకారం ఈ తేదీ క్రీ.శ. 1017, ఏప్రిల్ 13.[9].
నామకరణం
శిశువు యొక్క జనన మాసం, మరియు రాశి దశరథ పుత్రులైన లక్ష్మణ శత్రుఘ్నుల జన్మ
మాస రాశులతో సరితూగటం వల్ల, శిశువు మామ అయిన పెరియ తిరుమల నంబి
(శ్రీశైలపూర్ణుడు), ఆ శిశువు ఆదిశేషు ని అవతారమని భావించి, "ఇళయ పెరుమాళ్"
అనే నామధేయాన్ని నిర్ధారిస్తాడు. [10] [11] శిశువు శరీరంపైన ఉన్న కొన్ని
పవిత్రమైన గుర్తులను గమనించిన పెరియ తిరుమల నంబికి, నమ్మాళ్వార్ తన
'తిరువోయ్మోళ్ళి' అను గ్రంథంలో పేర్కొన్న శ్రీవైష్ణవ సాంప్రదాయాభివృధ్ధికి
పాటుపడగల గొప్ప సన్యాసి, గురువు, ఈ శిశువేనన్న నమ్మకం కుదిరింది.[12]
బాల్యం, వివాహం, విద్యాభ్యాసం
కంచిపూర్ణుడు[మార్చు]
ఇళయ పెరుమాళ్ చిన్నతనంలో 'కంచిపూర్ణుడు' అనే భక్తుడు రోజూ కాంజీవరం(నేటి
కంచి) నుంచి శ్రీపెరుంబుదూరు మీదుగా 'పూణమ్మెల్లె' అను గ్రామంలో ఉన్న
దేవాలయానికి పూజకై వెళ్ళేవాడు. అతడి శ్రధ్ధాభక్తులు చిన్ని ఇళయ పెరుమాళ్ను
ఎంతగానో ఆకర్షించాయి. ఒకరోజు పూజ పూర్తి చేసుకుని తిరిగి వెడుతున్న
కంచిపూర్ణుడిని ఇళయ పెరుమాళ్ తన ఇంటికి సాదరంగా అహ్వానించి, అతడి
భోజనానంతరం అతడి కాళ్ళుపట్టడానికి ఉద్యుక్తుడైనాడు. కానీ, నిమ్నకులానికి
చెందిన కంచిపూర్ణుడు తత్తరపాటుతో వెనక్కు తగ్గి, ఉత్తమ బ్రాహ్మణ కులంలో
జన్మించిన ఇళయ పెరుమాళ్ సేవను నిరాకరించాడు. భగవంతునిపైనున్న అతడి
భక్తిశ్రధ్ధలు కేవలం అలంకారప్రాయమైన జంధ్యానికంటే ఉన్నతమైనవని, అందుచేత
'కంచిపూర్ణుడు' తనకు గురుసమానుడని వాదించి, ఇళయ పెరుమాళ్ అతడిని
ఆకట్టుకున్నాడు. ఆనాటి నుంచి వారిద్దరిమధ్య పరస్పర గౌరవమర్యాదలు, ప్రేమ
ఏర్పడ్డాయి. భక్తిలోని మొదటి పాఠాలు ఇళయ పెరుమాళ్ కంచిపూర్ణుడి వద్దనే
అభ్యసించాడని చెప్పుకోవచ్చు.[13] [14]
యాదవప్రకాశుడు
ఇళయ
పెరుమాళ్కు పదహారవ ఏట రక్షమాంబ లేక తంజమ్మాళ్తో వివాహం జరిగింది.
వివాహానంతరం తండ్రి కేశవ సోమయాజి పరమపదించటంతో, కుటుంబ సమేతంగా, ఇళయ
పెరుమాళ్ కాంచీ నగరానికి తరలివెళ్ళాడు. నాటికి కంచిలో పేరుపొందిన
'యాదవప్రకాశ' ఆచార్యుని వద్ద విద్యాభ్యాసం చేయసాగాడు. యాదవప్రకాశుడు
అద్వైతం లోనూ భేదాభేద వేదాంతం లోనూ పాండిత్యాన్ని గడించి, అనేకమంది
శిష్యులనాకర్షించి, వారికి విద్యనొసగుతుండినాడు. ఇళయ పెరుమాళ్ వంటి
అసామాన్య ప్రతిభగల శిష్యుడు దొరికినందుకు పరమానందభరితుడైన యాదవప్రకాశుడు
అనతి కాలంలోనే ఇళయ పెరుమాళ్ యొక్క 'భక్తి' పరమైన ఆలోచనావిధానాన్ని
గమనించాడు. యాదవప్రకాశుని ఉపనిషద్వ్యాఖ్యలు అకర్మికము, అనాస్తికములుగా
ఉండటం ఇళయ పెరుమాళ్ ను బాధించేది.[15] తత్కారణంగా అతడు తన గురువుతో తరచుగా
వాగ్వాదానికి దిగేవాడు.
ఒకనాడు 'ఛాందోగ్యోపనిషత్తు' పై ఆదిశంకరుని
వ్యాఖ్యానంలో 'కప్యాసం పుణ్డరీకమేవమక్షిణి' అనే వాక్యాన్ని ఆదిశంకరుడు
'ఎర్రనైన కోతి పిరుదులను పోలిన(కప్యాసం) కమలాలవంటి కన్నులుగలవాడు' అని
అనువదించినట్లుగా యాదవప్రకాశుడు తన శిష్యులకు చెప్పాడు. అదివిన్న ఇళయ
పెరుమాళ్ కన్నులలో ధారగా నీరుకారసాగింది. యాదవప్రకాశుడు కారణమడుగగా అది
సరైన వ్యాఖ్య కాదని బదులిచ్చాడు ఇళయ పెరుమాళ్. ఆగ్రహించిన యాదవప్రకాశుడు
వేరొక వ్యాఖ్యను చేయమని హేళన చేయగా 'కప్యాసం' అనే పదానికి 'కం జలం పిబతి
ఇతి కపిః' (నీటిని గ్రహించువాడు, అనగా సూర్యుడు) అని నూతనార్థాన్ని చెప్పి
'కప్యాసం పుణ్డరీకమేవమక్షిణి' అనే వాక్యాన్ని 'నీటిని గ్రహించిన సూర్యుని
కిరణాలతో పుష్పించిన(కప్యాసం) కమలాలవంటి కన్నులుగలవాడు' అని భావాధిక్యతనూ,
ఆస్తికత్వమునూ ఉటంకించే అర్థాన్ని చెప్పాడు. మరొకమారు 'సత్యం జ్ఞానం అనంతం
బ్రహ్మా' అనే మహావాక్యంపై జరుగుతున్న వాదంలో సత్యం, జ్ఞానం, అనంతం
బ్రహ్మయొక్క గుణాలనీ, అవే బ్రహ్మ కాదనీ యాదవప్రకాశునితో వాదించాడు. [16]
ఈ వాదోపవాదాలలో ఇళయ పెరుమాళ్ యొక్క పాండిత్యం, ఆస్తికత్వంతో కూడిన ఆ
ర్ద్రతాభావం, మరియు భక్తిపూరితమైన వ్యాఖ్యానం యాదవప్రకాశుడికి కంటగింపు
కాసాగింది. అహంకారపూరితమైన మనస్సుతో, ఈర్ష్యతో, అతడు ఇళయ పెరుమాళ్ను
హతమార్చటానికి పన్నాగం పన్నాడు. గోవిందుడనే శిష్యుని ద్వారా ఈ విషయాన్ని
తెలుసుకొన్న ఇళయ పెరుమాళ్ సమయానికి తప్పించుకోగలిగాడు. సాంప్రదాయక గ్రంథాల
ప్రకారం, ఈ తరుణంలో కంచిలో వెలసిన 'వరదరాజ స్వామి' దంపతులు మారువేషంలో
వచ్చి ఇళయ పెరుమాళ్కు కంచి దారి చూపించి అతడిని రక్షించారని తెలుస్తుంది.
తరువాత కొంత కాలానికి ఇళయ పెరుమాళ్ వాదనలను అంగీకరించలేని యాదవప్రకాశుడు,
అతడిని తన శిష్యరికం నుంచి విముక్తుణ్ణి చేస్తాడు.
ఏది ఏమైనప్పటికి,
బ్రహ్మసూత్రాలనూ, ఉపనిషత్తులనూ, పురాణగ్రంథాలను, ఎంత తప్పుగా
వ్యాఖ్యానిస్తున్నారో తెలుసుకోవటానికి యాదవప్రకాశుడి శిష్యరికం ఎంతగానో
దోహదపడిందనటంలో అతిశయోక్తి లేదు. వేదాంతానికి కొత్త అర్థం చెప్పవలసిన సమయం
ఆసన్నమైనదని నిర్ణయించుకోవటానికి, ఇళయ పెరుమాళ్కు యాదవప్రకాశుడి శిష్యరికం
సహకరించింది.
యమునాచార్యుడు
'ఆళవందార్' అను నామధేయముతో
ప్రసిద్ధుడైన యమునాచార్యుడు, వైష్ణవ సాంప్రదాయంలో పేరుగాంచిన గురువు. ఈయన
తిరుచిరాపల్లి (నేటి తిరుచ్చి) జిల్లాలో ఉన్న శ్రీరంగం లో శ్రీరంగనాథస్వామి
దేవస్థానంలో తన సేవలనందించేవారు. యాదవప్రకాశుని శిష్యరికంలో ఉన్న ఇళయ
పెరుమాళ్ యొక్క గొప్పతనాన్ని, తెలివి తేటలను, భక్తి పరమైన వ్యాఖ్యలను చూసి,
అతడిని తన శిష్యునిగా చేసుకోవాలని ప్రయత్నించాడు. ఈ విషయంగా ఇళయ
పెరుమాళ్ను కలుసుకోవాలని ఈయన కాంచీపురాన్ని సందర్శించాడు కూడా. కానీ
కారణాంతరాల వల్ల ఇళయ పెరుమాళ్ను కలవలేక, నిరాశతో వెనుదిరిగాడు.
యాదవప్రకాశుడు తన శిష్యగణం నుంచి ఇళయ పెరుమాళ్ను తొలగించిన విషయం
తెలియగానే, అతడిని తన శిష్యునిగా చేసుకోవాలనే ఉద్దేశ్యాన్ని 'మహాపూర్ణుడు'
అనే శిష్యుని ద్వారా తెలియచేశాడు.
మహాపూర్ణుడు ఇళయ పెరుమాళ్ను
కలుసుకొని శ్రీరంగం తీసుకువెళ్ళే లోపల యమునాచార్యుడు తన ఆఖరిశ్వాసను
విడిచాడు. ఇళయ పెరుమాళ్ మరియు మహాపూర్ణుడు వచ్చే సమయానికి యమునాచార్యుల
భౌతిక కాయం అంత్యక్రియలకు సిధ్ధపరచబడి ఉంటుంది. కాని ఆయన కుడి చేతి మూడు
వేళ్ళు ముడుచుకొని ఉండటం ఇళయ పెరుమాళ్ గమనిస్తాడు. ఆ మూడు వేళ్ళూ తను
చేయవలసిన మూడు పనులకు సంకేతమని భావించిన ఇళయ పెరుమాళ్ ఈ క్రింది మూడు
శపథాలను చేస్తాడు.
• వైష్ణవ సాంప్రదాయాలకు సంకేతమైన, పంచ సంస్కార కర్మ,
నాలాయిర దివ్య ప్రబంధ బోధన, శరణాగతి తో కూడిన మత ప్రతిపాదన మరియు ప్రచారం,
అనే ఈ మూడు కర్తవ్యాలను విధి తప్పక నిర్వర్తించటం.
• వేదాంతానికి మూలస్తంభాలవంటి వేదాంత సూత్రాల కు సరిక్రొత్త వ్యాఖ్యానం వ్రాయటం.
• భాగవత, విష్ణుపురాణాల ను రచించిన వేదవ్యాస, పరాశర మునుల అంశలతో
జన్మించిన ఇద్దరు శిశువులను గుర్తించి, వారికా నామధేయాలను ప్రసాదించి,
వ్యాస, పరాశరులకు నివాళులు అర్పించటం.
గోష్టిపూర్ణుడు
ఈయన తన
గురువు తనకు ఉపదేశించిన అత్యంత గోప్యమైన అష్టాక్షరీ మంత్రాన్ని శ్రీరంగం
లోని రాజగోపురం పైకి ఎక్కి, అందరికీ ఉపదేశిస్తాడు. గురువు 'నీవు నరకానికి
వెడతావేమో' నని అంటే అందరూ స్వర్గానికి వెడతారని బదులిస్తాడు
No comments:
Post a Comment