కర్మఫలం
కర్మఫలాన్ని ఈ జన్మలో కాకపోతే మరుజన్మలో అయినా అనుభవించాల్సిందే. అందుకే
సత్కర్మలనే చేయాలంటారు పెద్దలు. బుద్ధుడు జేతవనంలో వున్నప్పుడు చక్షుపాలుడు
అనే భిక్షువు ఆయనను చూడటానికి వచ్చి, రాత్రిపూట ఆయన కుటీరం ముందు అటూ ఇటూ
తిరుగుతూ కళ్లుమూసుకుని ఆలోచిస్తూ గడుపుతాడు. ఆయన కాళ్ల కింద పడి చాలా
క్రిమికీటకాదులు చనిపోతాయి. బుద్ధుని శిష్యులు అది చూసి ఆగ్రహిస్తారు.
చక్షుపాలుడి గురించి బుద్ధుడికి ఫిర్యాదు చేస్తారు. కావాలని చేయలేది ఆబట్టి
దాంట్లో అతని తప్పేం లేదంటాడు గౌతముడు. పైగా అతడు ముక్తిపురుషుడని
చెబుతాడు బుద్ధుడు. అలాంటి వ్యక్తి గుడ్డివాడిలా ఎందుకు
ప్రవర్తిస్తున్నాడని ప్రశ్నిస్తారు శిష్యులు.
కొంతసేపు మౌనం... గౌతముడి
కళ్లముందు చక్షుపాలుడి గత జన్మగోచరించింది. ఆ వివరాలు శిష్యులకు ఇలా
చెప్పారు. ఈ చక్షుపాలుడు ముందు జన్మలలో నేత్రవైద్యుడు. చూపులేని ఒక మహిళ
అతని వద్దకు వెళ్లి ఎలాగైనా చూపు తెప్పించమని, చూపు వస్తే జీవితాతం మీకు
సేవ చేసుకుంటానని చెబుతుంది. కొంతకాలం వైద్యం తరువాత అమెకు చూపు వస్తుంది.
కానీ వైద్యుడికి ఉచితంగా సేవచేయాల్సి వస్తుందనే ఆలోచనతో చూపువచ్చినా
రానట్లు నటిస్తుంది ఆ మహిళ. ఆ విషయాన్ని గ్రహించిన ఆ వైద్యుడు మందు మార్చి
ఇస్తాడు. దాంతో ఆమె చూపు పోతుంది. కావాలని ఆ మహిళకు చూపు లేకుండా
చేసినందుకు చక్షుపాలుడు ఎన్నో జన్మలు గుడ్డివానిగా బాధపడ్డాడు. ఈ జన్మలో
కూడా అతడిని కర్మశేషం అలా నడిపించింది అని వివరించాడు గౌతమ బుద్ధుడు.
కాబట్టి మనసును మలినం చేసుకుని మాట్లాడినా, అలాంటి కర్మలు చేసినా ఆ ఫలాన్ని
అనుభవించాల్సిందే
No comments:
Post a Comment