హిందువులకు పవిత్రమైన క్షేత్రం గుజరాత్ లోని సోమనాథ్ దేవాలయం. ఈ జ్యోతిర్లింగ ఆలయంలో ఒకప్పుడు ప్రతి నిత్యం వేయిమంది పూజారులు అర్చనలు చేసేవారట. నైవేద్య సమయంలో మోగించే గంటను 200 మణుగుల బంగారంతో తయారు చేశారట. ఇక్కడ నవరత్నాలు పొదిగిన 56 స్తంభాలుండేవి. స్వామి పూజకు ప్రతి దినం గంగాజలం, కాశ్మీరు పూలు తెప్పించేవారు. క్రీ.శ. 1035లో గజనీ మహమ్మద్, 1300లో అల్లాఉద్దీన్ ఖిల్జీ 1707లో ఔరంగజేబు దండయాత్రల్లో ఆలయం ధ్వంసమైంది. రాణీ అహల్యాబాయి 1860లో సోమనాథ్ ఆలయాన్ని 20 మెట్ల దిగువన భూగర్భంలో పునర్ని ర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. ఇక్కడ నిత్యం అఖండ దీపం వెలుగుతూనే ఉండటం విశేషం.
స్వామి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది.
బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్షప్రజాపతికి అశ్విని నుంచి రేవతి వరకు 27 కుమార్తెలున్నారు. తన కుమార్తెలను చంద్రునికి ఇచ్చి ఘనంగ వివాహం జరిపించాడు దక్షుడు. అయితే చంద్రుడు రోహిణిని మాత్రం అనురాగంతో చూస్తూ, మిగిలినవారిని అలక్ష్యం చేయసాగాడు. మిగిలినవారు తండ్రితో ఈ విషయాన్నీ మొరపెట్టుకోగా, దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు. అయినప్పటికీ, చంద్రుని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో, క్షయరోగగ్రస్తుడవు కమ్మని చంద్రుని శపిస్తాడు దక్షుడు. ఫలితంగా చంద్రుడు క్షీణించసాగాడు. చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు, పుష్పాలు ఫలించలేదు. ఈ
పరిస్థితిని చూసిన సమస్తలోకవాసులు, తమ కష్టాలు తీరేమార్గం చూపమని బ్రహ్మ దేవుని ప్రార్థించారు. బ్రహ్మ ఆదేశాన్ననుసరించి ప్రభాసక్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా శంకరుని ఆరాధించిన చంద్రుడు, పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించగా, శంకరుడు ప్రత్యక్షమై, చంద్రుని రోగ విముక్తుని గావించి, కృష్ణపక్షంలో చంద్రకళలు రోజు రోజుకీ తగ్గుతాయనీ, శుక్లపక్షంలో దిన మొక కళ చొప్పున పెరుగుతుందని అనుగ్రహించాడు. ఆనాటి నుండి చంద్రుని కోరిక మేర, అతని కీర్తిదిశదిశలా వ్యాపించేందుకై చంద్రుని పేరుతో సోమనాథునిగా, కుష్టు వంటి మహా రోగాలను తగ్గించే సోమనాథ్ జ్యోతిర్లింగరూపునిగా పార్వతీదేవిసమేతంగా వెలసి భక్తులను కరుణిస్తున్నాడు.
No comments:
Post a Comment