What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 29 December 2013

అంతర్వేది


అంతర్వేది

అంతర్వేది (Antarvedi), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, తూర్పు గోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామము. అందమైన బంగాళాఖాతపు సముద్రమున గోదావరి నదీశాఖయైన వశిష్టానది సంగమము చెందు ప్రశాంత ప్రాంతము అంతర్వేది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంకు సమీపములో కల ఈ త్రికోణాకారపు దీవి పై ప్రసిద్ది చెందిన లక్ష్మీనరసింహస్వామి వారి పురాతన ఆలయం. భౌగోళికంగా అంతర్వేది అక్షాంశ, రేఖాంశాలు ఇది దాదాపు సముద్రమట్టంలో ఉంది.

స్థలపురాణం

కృతయుగంలో వశిష్ట మహాముని గోదావరిలోని ఓ పాయను తెచ్చి సాగరసంగమం గావించి ఇదే ప్రాంతంలో తపస్సు చేస్తుంటాడు. అయితే విశ్వామిత్రుని ప్రోద్భలంతో రక్తవిలోచనుడు అనే రాక్షసుడు వశిష్టుని తపస్సుకు భంగం కల్గించడమే కాకుండా, అతని కుమారులను హతమారుస్తూ ఉంటాడు. అప్పుడు వశిష్టుడు నరసింహస్వామిని ప్రార్ధించగా, ఆయన ప్రత్యక్షమై రక్తవిలోచనుడితో యుద్ధం చేస్తాడు. ఆ రాక్షసుడిని భూమిపై పడే ప్రతీ రక్తపు బొట్టూ, ఓ రాక్షసుడిగా మారుతుంటుంది. అప్పుడు నరసింహుడు అశ్వరూఢాంబికా అనే మాయాశక్తిని రప్పించి, రాక్షసుడి రక్తం నేలపై పడకుండా నాలుక చాచాలని సూచిస్తాడు. స్వామి ఆదేశం మేరకు ఆమె నాలుక చాచగా, రాక్షసుడిని నరసింహుడు సంహరిస్తాడు. ఆపై, వశిష్టుని కోరిక మేరకు నరసింహాస్వామికి ఇక్కడ కొలువైనట్లు ప్రతీతి.

క్షేత్ర నామం

బ్రహ్మ రుద్రయాగము చేసిన ప్రదేశము (కమలము)
ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చేయాలని నిశ్చయించి , యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొంటాడు. వేదిక గా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది (అంతర్, వేదిక) అనే పేరు వచ్చింది అని చెబుతారు.

రక్తవలోచనుని కధ

ఒకానొక సమయం లో రక్తావలోచనుడు (హిరణ్యాక్షు ని కుమారుడు) అనే రాక్షసుడు వశిష్ఠ గోదావరి నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి, శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం, రక్తావలోచనుని శరీరం నుండి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలని కోరుకొంటాడు. ఈ వరగర్వం తో లోక కంటకుడై రక్తావలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఇది ఇలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడు కి వశిష్ఠుడు కి ఆసమయం లో జరిగిన సమరం లో విశ్వామిత్రుని ఆజ్ఙ పై ఈ రక్తావలోచనుడు వచ్చి భీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు కుమారులను సంహరిస్తాడు.

వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువు ను ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై, గరుడవాహనం పై నరహరి రూపుడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు. నరహరి సుదర్శనము ను ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా భీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, తన మాయాశక్తి ని ఉపయోగించి, రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నది లోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామి గా వెలిశాడు. ఈ రక్తకుల్య లోనే శ్రీమహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధము ను శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్య లో పవిత్రస్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి అని చెబుతారు.

ఆలయ నిర్మాణ విశేషాలు

రాత్రిసమయంలో ప్రధాన గోపురపు వెలుగులు.
మొదటి ఆలయము శిధిలపరిస్థితిలో ఉన్నపుడు ఆలయ జీర్ణోర్ధరణకు పాటు పడిన వారిలో ముఖ్యులు శ్రీ కొపనాతి కృష్టమ్మ. ఈయన అంతర్వేది పరిసరాలలో ఒక జమీందారు. ప్రస్తుతపు ఆలయ నిర్మాణము ఈయన విరాళాలు మరియు కృషి ద్వారానే జరిగినది. ఆలయ ప్రధాన ముఖద్వారమునకు ముందు ఈయన శిలా విగ్రహము కలదు. ఈ ఆలయము చక్కని నిర్మాణశైలితో కానవచ్చును. దేవాలయము రెండు అంతస్తులుగా నిర్మించారు. దేవాలయ ప్రాకారముగా వరండా(నడవా) మాదిరి నిర్మించి మద్యమద్య కొన్ని దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసినారు. ప్రాకారము సైతము రెండు అంతస్తుల నిర్మాణముగా ఉండి యాత్రికులు పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకొనుటకు ప్రకృతి తిలకించుటకు అనువుగా నిర్మించినారు. ఆలయమునకు దూరముగా వశిష్టానది కి దగ్గరగా విశాలమైన కాళీస్థలమునందు కళ్యాణమండపము నిర్మించినారు. ఈవిదంగా కొన్ని వేలమంది స్వామివారి కళ్యాణము తిలకించే ఏర్పాటు చేసినారు. ఈ ఆలయం క్రీ.శ.300 కు పూర్వం నిర్మింపబడినదని అక్కడి కొన్ని విగ్రహలు చెపుతున్నాయి .


నీటిలో కల వశిష్టాశ్రమ ప్రధాన కట్టడం

వశిష్టాశ్రమము
అంతర్వేది దేవాలయమునకు కొంచెం దూరంగా సముద్రతీరమునకు దగ్గరగా ఈ వశిష్టాశ్రమము కలదు. మొదట తగిన పోషకులు లేకుండుటచే ఆశ్రమ సముదాయమున సరియైన సౌకర్యాలు లేకుండెను. తదుపరి దాతల సహకారములు, దేవస్థాన సహాయములతో ఇక్కడ అందమైన ఆశ్రమము నిర్మించబడినది. ఈ ఆశ్రమము వికసించిన కమలము మాదిరిగా నాలుగు అంతస్తులుగా నిర్మించినారు. చుట్టూ సరోవరము మద్య కలువపూవు ఆకారమున ఈ ఆశ్రమము అత్యంత అద్భుతమైన కట్టడము. దీనికి సమీపముగా ద్యానమందిరం, పఠనాశాల, యోగశాల, విశ్రాంతి మందిరం మొదలగునవి కలవు. యాత్రికుల విశ్రాంతి కొరకు నిర్మించిన పర్ణశాలల వంటి అందమైన కట్టడములు కలవు.

(గుర్రాలక్క) ఆలయము

నరసింహస్వామి సోదరిగా భావించే అశ్వరూడాంభిక ఆలయం ప్రదాన దేవాలయమునకు ఒక కిలోమీటరు దూరములో కలదు. స్థల పురాణ రెండవ కధనం ప్రకారం రక్తావలోచనుడు వరగర్వంతో పాపాలు చేస్తున్నపుడు నరహరిఆతన్ని సంహరించేందుకు వస్తాడు. నరహరి సుదర్శనము ను ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా భీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, పార్వతి అంశతో ఒక మాయాశక్తిని సృష్టిస్తాడు. రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా ఆ మాయాశక్తి అశ్వరూపంలో తన నాలుకను విశ్వవ్యాపితం చేసి పడిన రక్తబిందువులను పడినట్లుగా పీల్చేస్తూ రక్తవలోచనుని మరణంలో శ్రీమహావిష్ణువుకు సహాయం చేస్తుంది. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామి గానూ మాయాశక్తి అశ్వరూడాంభిక గానూ వెలిశారు.

అన్న చెళ్ళెళ్ళ గట్టు
సముద్రములో వశిష్ట నది కలిసే చోటును అన్న చెళ్ళెళ్ళ గట్టు అంటారు. ఇక్కడ సముద్ర నీటి మద్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుకమేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్చంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్ర ఆటు పోటులలో కూడా ఇలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

సముద్రతీరం

వశిష్టానది సముద్రంలో కలిసే ప్రాంతం నుండి మొదలయ్యే అంతర్వేది సముద్రతీరం దాదాపు నాలుగు కిలోమీటర్లమేర ఉంటుంది. సర్వితోటలు, సముద్రపు మొక్కలతోనూ అందంగా ఉండే తీరం ఇది. ప్రయాణ సౌకర్యాల కొరత వలన, బీచ్ వరకూ సరియైన రహదారి లేకుండుట చేత దీనిని పెద్దగా అభివృద్ది పరచలేదు. కాని ఇవే కారణాల వలన తీరం పొడవునా పరిశుబ్రంగానూ, స్వచ్చంగానూ ఉండి మనసుకు ఆహ్లాదం కల్పిస్తుంది. తీరంలో వరుసగా వశిష్టాశ్రమం, అన్న చెళ్ళెళ్ళ గట్టు, లైట్ హౌస్, గుర్రలక్క గుడి, నరసింహస్వామి దేవస్థానాలు కొద్దికొద్ది దూరాలలో ఉంటాయి.

ఇతర ఆలయాలు
లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం పరిసరప్రాంతములలోనూ, అంతర్వేది గ్రామములోనూ, సముద్రతీరమునకు వెళ్ళు రహదారినందూ పలు చిన్నా పెద్దా ఆలయములు కలవు. వాటిలో ప్రసిద్దమైనవి. విఘ్నేశ్వరస్వామి, అభయాంజనేయస్వామి, షిర్డీసాయి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు కలవు.


రవాణా సౌకర్యాలు
తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలలో అంతర్వేది ఒకటి. అంతర్వేది సఖినేటి పల్లి మండలంలో ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే నరసాపురం వెళ్లి అక్కడ పడవ ఎక్కి సఖినేటి పల్లిలో దిగి ఆటో, బస్సులో వెళ్ళవచ్చు. ఈ
మార్గంలో అంతర్వేది నరసాపురం నుంచి 7 కిలోమీటర్లు దూరం. లేదా, చించినాడ బ్రిడ్జి మీదుగా రోడ్ మార్గంలో వెళ్లి దిండి, కేశవదాసుపాలెం మీదుగా అంతర్వేది చేరవచ్చు. ఈ మార్గంలో నరసాపురం నుంచి అంతర్వేది 20 కిలో మీటర్లు ఉంటుంది.

రైలు
హైదరాబాదు నుండి నరసాపూర్ ఎక్స్‌ప్రెస్ ద్వారా నరసాపురం చేరవచ్చు.

సౌకర్యాలు
అంతర్వేదిలో వసతి కొరకు దేవస్థాన సత్రం కలదు. కుల ప్రాతిపదికన బయటి వారి ద్వారా నడుపబడు ఇతర సత్రాలు పది వరకూ కలవు. రెండు ప్రైవేటు లాడ్జిలు కలవు. ఇంకనూ మంచి వసతుల కొరకు నరసాపురం, రాజోలు పట్టణాలకు వెళ్ళవచ్చు.

దేవాలయపు పండుగలు, ఉత్సవాలు

* మాఘ శుద్ద సప్తమి- మాఘ బహుళ పాడ్యమి - బ్రహ్మోత్సవాలు
* మాఘ శుద్ధ దశమి- కళ్యాణం
* మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మైకాశి) - రథోత్సవం
* జేష్ఠ శుద్ధ ఏకాదశి - శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం
* వైశాఖ శుద్ధ చతుర్దశి - నృసింహ జయంతి
 
 
Read More

బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే దత్తాత్రేయుడు :

బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే దత్తాత్రేయుడు :

ఆయన బ్రహ్మదేవుని మానసపుత్రుడు. అత్రి మహర్షి, బ్రహ్మదేవుని దివ్య నయనాల్లోంచి జన్మించాడట. అత్రి మహర్షి సతీమణి మహాసాత్వి అనసూయ. నారదుడు త్రిలోక సంచారం చేస్తూ అక్కడి విశేషాలు, ఇక్కడ, ఇక్కడి విశేషాలు అక్కడ చెప్తూ ఉండేవాడు. అలా ఆయన ఒకసారి అనసూయ గొప్పతనం గురించి చెప్పగా లక్ష్మి, పార్వతి, సరస్వతి అసూయ చెందారు. ఆమెను పరీక్షించమని త్రిమూర్తులను పంపారు.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అత్రి మహర్షి ఇంటికి వెళ్లారు. వారు వెళ్ళిన సమయానికి అత్రి ఇంట్లో లేకపోవడంతో అనసూయ అతిథి మర్యాదలు చేసేందుకు నడుం బిగించింది. భోజనం సిద్ధం చేసి పిలవగా, వారు ''నీవు వివస్త్రగా వడ్డిస్తేనే తింటాం'' అన్నారు. అనసూయ చలించకుండా , త్రిమూర్తులను బాలులుగా మార్చి, వారు కోరినట్లుగానే వడ్డించింది. అదీ ఆమె ఔన్నత్యం. సంతోషించిన త్రిమూర్తులు తమ ముగ్గురి అంశతో వారికి ఒక బాలుడు పుడతాడని దీవించి వెళ్లారు. అలా అత్రి, అనసూయలకు జన్మించిన పుత్రుడే దత్తాత్రేయుడు.

కనుక, దత్తాత్రేయుడు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారం. గురుస్వరూపుడు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ‘గురువు' అంటే దత్తాత్రేయుడే! గురువు, దేవుడు ఒకరిలోనే ఉండడం విశేషం. శాస్త్రాలు, ఉపదేశాలు, పూజలు, జపాలు ఏవైనా సరే, గురుముఖంగా ఉపదేశమైనప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు, రాణింపు కలుగుతాయి. అలాంటి విశిష్ట రూపంగా అవతరించాడు దత్తాత్రేయుడు. కనుకనే దత్తాత్రేయుడు గురుదేవుడయ్యాడు.

దత్తాత్రేయుడు భక్తవత్సలుడు. భక్తులపై అంతులేని కారుణ్యాన్ని కురిపిస్తాడు. దత్తాత్రేయుని ఆరాధించేందుకు ఆర్భాటాలూ, ఆడంబరాలు అక్కర్లేదు. నిండు మనస్సుతో, నిష్కల్మషమైన హృదయంతో ప్రార్థిస్తే చాలు, ప్రత్యక్షమై వరాలు కురిపిస్తాడు. అందుకే దత్తాత్రేయుని ‘స్మృతిగామి’ అంటారు.

దత్తాత్రేయుడు విశిష్టమైన ఆచార్యస్థానం ఆక్రమించాడు. ఈ విశిష్టమైన స్థానం ఇంత తేలిగ్గా లభించిందా అని ఆశ్చర్యపోనవసరం లేదు. సాక్షాత్తూ దేవదేవుడైన దత్తాత్రేయుడు 24 మంది గురువుల వద్ద విద్యను అభ్యసించాడు. కనుకనే దత్తాత్రేయుని పరమ గురువుగా కొలుస్తున్నాం.

వివేకంతో, విచక్షణతో, ఆలోచనల్ని అంతర్ మధించి అసలైన జ్ఞానాన్ని అందింపుచ్చుకోవాలి. అది మన కర్తవ్యం. అలాంటి విచక్షణాపరులుగా రూపొందాలి. సాధారణంగా ప్రతి మనిషికీ వివేకం, విచక్షణ, వితరణ – ఈ మూడింటిని అందించగలిగేవాడు గురువు. అందుకే సృష్టిలో కన్నవారి తరువాత ఆ స్థానాన్ని ఆక్రమించినవాడు గురువు.

దత్తాత్రేయుడు గురువులకే గురువు విజ్ఞాన ఖని. అయినప్పటికీ సాధారణ వ్యక్తిలా గురువుల వద్ద వినయంగా విద్యను అభ్యసించిన సద్గుణ సంపన్నమూర్తి. సకల వేదస్వరూపుడు. జ్ఞానామృతాన్ని జగత్తుకు పంచిన సద్గురు చక్రవర్తి. మౌనముద్రతోనే శిష్యుల సందేహాలను నివృత్తి చేసి గురుస్థానం దక్కించుకున్న దత్తాత్రేయుడు విశ్వానికే గురువయ్యాడు. అందుకే నిరంతరం దత్తాత్రేయుని ప్రార్దిస్తాం. జన్మ సంసార బంధనాల్ని తేలిగ్గా తెంచగలిగిన మహానుభావుడు, జ్ఞానానందాన్ని పంచగలిగిన ప్రేమమూర్తి, ముక్తిపథంలో నడిపించి మోక్షాన్ని ప్రసాదించగలిగిన పరమ యోగీశ్వరుడు దత్తాత్రేయుడు.

మనసా స్మరించినంత మాత్రాన సాక్షాత్కరించే దయాసింధువు దత్తాత్రేయుడు మనకు లభించడం మన అదృష్టమే. కనుక ఎల్లవేళలా దత్తాత్రేయుని ధ్యానించుకుందాం.
దత్తాత్రేయుడు విశ్వమంతా పరచుకుని ఉన్నాడు. ఆయన గుప్తంగా దాగివుంటాడు. తనను కొలిచే వారిని కనిపెట్టుకుని ఉంటాడు. తన అనుగ్రహానికి పాత్రులైన వారిని గుర్తించి వరాలు ప్రసాదిస్తాడు. అంతటి కరుణామూర్తి దత్తాత్రేయుడు. అంతేనా, మనిషిలోని అసలు మనిషిని వెలికితీయగల మహిమాన్వితుడు
Read More

వసిష్ఠుడు ఇక్ష్వాకువంశక్రమం చెప్పుట -శ్రీ రామాయణం

వసిష్ఠుడు ఇక్ష్వాకువంశక్రమం చెప్పుట -శ్రీ రామాయణం

దశరథుడు మిథిలకు వెళ్ళి పూజితుడు కావడం

జనకుని వార్తాహరులు అయోధ్య చేరుకొని ద్వారపాలకులు ప్రవేశపెట్టగా మహారాజును దర్శనం చేసుకున్నారు. దశరథ మహారాజును చూసి మహారాజా! జనక మహారాజు విశ్వామిత్రుని అనుమతి మీద 'రాజేంద్రా! ఇదివరలో నేను నా కుమార్తెయైన సీత వీర్యశుల్క అని ప్రకటించాను. రాజులు చాలా మంది వచ్చి నిర్వీర్యులయిపోయి వున్నారు. ఇదంతా నీకు తెలిసిందే. అలాంటి నా కూతురు, విశ్వామిత్రాదులతో కలిసి యధాలాభంగా యిక్కడికి వచ్చిన నీ కొడుకులవల్ల జయించబడ్డది. నా దగ్గర ఉండిన ఆ గొప్ప ధనస్సు మహాజనసమూహంలో, రాముడు ఎక్కుపెట్టగా మధ్యకి విరిగిపోయింది. మా సీత వీర్యశుల్క అని నేను ప్రతిజ్ఞ చేశాను. కనుక ఆమెను రామునికి ఇవ్వదలుచుకున్నాను. నీకు భద్రం అగుగాక! అందరితో కలిసి శీఘ్రంగా వచ్చి నువ్వు రామలక్ష్మణులను చూడాలి ' అని మీతో చెప్పమన్నారు. ఈ మాటలన్నీ జనకమహారాజు విశ్వామిత్రుని అనుజ్ఞ పొంది పురోహితుడైన శతానందుని సమక్షంలో అన్నవి" అని చెప్పారు.

ఆ మాటలు విని దశరథమహారాజు చాలా సంతోషించి వసిష్ఠుని వామదేవుని సమ్మతం తీసుకొని ఆ మరునాడు మిథిలకు బయలుదేరారు. గొప్ప చతురంగబలం వారివెంట వెళ్ళింది. నాలుగు దినములకు అందరూ విదేహదేశం చేరుకున్నారు. జనకుడు! "దశరథ మహారాజా! నీకు స్వాగతం. మాభాగ్యం వల్ల నువ్విక్కడకు దయచేశావు. వసిష్ఠ మహర్షీ! ఎందరో బ్రాహ్మణులను వెంటబెట్టుకొని దేవతలతో కూడిన మహేంద్రుడులాగ నువ్వు దయచేశావు. కార్యం నిర్విఘ్నంగా నెరవేరుతుంది. మహారాజా, దశరథా! రేపు తెల్లవారేక, అప్పటికి యజ్ఞం అయిపోతుంది కనుక, ఋషి సమ్మతంగా వివాహం జరిపించు" అని చెప్పి చాలా ఆదరించాడు.

జనకుడు యజ్ఞం ముగించుకొని, కూతుళ్లతో కూడా అంకురార్పణం మొదలైనవి నెరవేర్చుకుని రాత్రి గడిపారు.

వసిష్ఠుడు ఇక్ష్వాకువంశక్రమం చెప్పడం :

తెల్లవారగానే మహర్షులతో స్నానసంధ్యాద్యనుష్ఠానాలన్నీ ముగించుకొని జనకుడు పురోహితుడైన శతానందుణ్ణి చూసి, "నా తమ్ముడు అతిధార్మికుడైన కుశధ్వజుడు సాంకాశ్యపట్నంలో వుండి రాజ్యం పాలిస్తున్నా డు. నా యజ్ఞానికి అతనే రక్షకుడు. ఇప్పుడు సీత వివాహసంబంధమైన ఆనందం అతనున్నూ అనుభవించాలి అని చెప్పాడు. దూతలు వెళ్ళి కుశధ్వజుణ్ణి తీసుకువచ్చారు. తరువాత అన్నదమ్ములిద్దరూ సుదామనుడనే మంత్రిని చూసి "నువ్వు త్వరగా వెళ్ళి అమిత తేజశ్శాలి అయిన దశరథమహారాజును కొడుకులతోనూ మంత్రులతోనూ తీసుకురా" అని పంపారు. అతను వెళ్ళి మగపెళ్ళివారిని వైభవంగా తీసుకువచ్చాడు. ఉచిత మర్యాదలు జరిగాక దశరథుడు "జనకమహారాజా! భగవంతుడైన వసిష్ఠమహర్షి ఇక్ష్వాకు వంశీయులకు కులదైవం అనీ, మాకు సంబంధించిన సమస్త వ్యవహారాలలోనూ వక్త అతనే అనీ నీకు తెలుసు. విశ్వామిత్రమహర్షి సెలవు పొందీ, ఈ మునీంద్రుల అనుజ్ఞపొందీ ఆ మహర్షి యిప్పుడు మా వంశక్రమం అంతా వివరిస్తారు" అని చెప్పి వూరుకున్నాడు.

అప్పుడు వసిష్ఠుడు ప్రారంభించాడు.

"అవ్యక్తప్రభువుడూ, శాశ్వతుడూ, నిత్యుడూ, నాశరహితుడూ అయిన బ్రహ్మకు మరీచి పుట్టాడు. మరీచికి కాశ్యపుడూ, కాశ్యపునికి సూర్యుడూ, సూర్యునికి మనువూ పుట్టారు. ఆ మనువే మొదటి రాజయినాడు. మనువు కొడుకు ఇక్ష్వాకుడు. అయోధ్యలో వుండి ప్రజాపాలనం ప్రారంభించినవాడు ఆ ఇక్ష్వాకుడే. అతని కొడుకు కుక్షి. కుక్షి కొడుకు వికుక్షి. వికుక్షికొడుకు మహాతేజశ్శాలీ, మహ ప్రతాపవంతుడూ అయిన బాణుడు. బాణుని కొడుకు అతనికి తగ్గవాడే అనరణ్యుడు. అనరణ్యుని కొడుకు పృథువు. పృథువు కొడుకు త్రిశంకుడు. త్రిశంకుని కొడుకు గొప్ప యశశ్శలి అయిన దుందుమారుడు. అతనికే యువనాశ్వుడని మారుపేరు. యువనాశ్వుని కొడుకు మాంధాత. మాంధాత కొడుకు సుసంధి. సుసంధికి ధ్రువసంధి ప్రసేనజిత్తు అని యిద్దరు కొడుకులు. వారిలో ధ్రువసంధి కొడుకు భరతుడు. భరతుని కొడుకు అసితుడు. అసితుణ్ణి హైవాయులూ తాలజంఘులూ, శశిబిందువులూ శత్రువులై ఎప్పుడూ బాధపెడుతూ వుండేవారు. వారితో యుద్ధం చేస్తూ అసితుడు ఒకమాటు ఓడిపోయి, కొద్దిబలం మాత్రం మిగలగా దానితోనూ మంత్రులతోనూ హిమవత్పర్వత శిఖరాలలో వొకటయిన భృగుప్రస్రవణం మీద నివసించాడు. అతని కిద్దరు భార్యలు. అప్పుడు వారిద్దరూ గర్భవతులయారు. అందులో వొకామె గర్భం చెడగొట్టాలని తన సవతికి గరం అనగా విషం కలిపిన పిండివంటలు పెట్టింది. సరిగా ఆ సమయాన భార్గవచ్యవనుడు అసితుణ్ణి రక్షించ దలచి అక్కడికి వచ్చాడు. విషం తిన్న రాజపత్ని తనకి కొడుకు పుట్టాలని కోరుకుంటూ దేవవర్చస్సు గల చ్యవనునికి పాదాభివందనం చేసింది. అది చూసి రెండో రాజపత్ని కాళింది కూడా మునికి నమస్కరించింది. అయితే, చ్యవనుడు విషంతిన్న ఆమెను చూసి 'మహాభాగురాలా! నీ కడుపులో పురుష శిశువు ఉన్నాడు. కొద్దిదినాల్లోనే అతను పుడతాడు. అతను మహాబలశాలి. మహాతేజశ్శాలీ అవుతాడు. అతనికి విషం తగిలింది. అయినా భయపడకు' అని చెప్పాడు. పతివ్రతా, పట్టపుదేవీ అయిన మొదటి ఆమె, తరువాత చనిపోయిన భర్తను తలుచుకొని శోకిస్తూనే కొడుకును కన్నది. ఆ బాలుడు గరంతో కూడా పుట్టడం వల్ల సగరుడైనాడు. సగరునికి అసమంజుడూ, అసమంజునికి అంశుమంతుడూ, అంశుమంతునికి దిలీపుడూ, దిలీపునికి భగీరథుడూ. భగీరథునికి కకుత్థ్సుడూ, కకుత్థ్సునకు రఘువూ పుట్టారు. రఘువునకు ప్రవృద్ధుడు పుట్టాడు. అతనికి వసిష్ఠుని శాపం సంభవించింది. దానివల్ల ప్రవృద్ధుడు పురుషాదు డనే రాక్షసు డయిపోయినాడు. తనకు శాపం యిచ్చినందుకు కోపించి అతను తానుగూడా వసిష్ఠుణ్ణి శపించాలని చేతిలో నీళ్లు పోసుకున్నాడు; కాని 'తప్పు తప్పు అని భార్య నివారించింది. ఆ నీళ్ళు అతని కాళ్ల మీదే వేసుకున్నాడు. అందువల్ల అతను కల్మాషపాదుడైనాడు. కల్మాషపాదుని కొడుకు శంఖణుడు. శంఖణుని కొడుకు సుదర్శనుడు. సుదర్శనుని కొడుకు అగ్నివర్ణుడు. అగ్నివర్ణునికి శీఘ్రగుడూ, శీఘ్రగునకు మరుడూ, మరునకు ప్రశుశ్రుకుడూ, ప్రశుశ్రుకునకు అంబరీషుడూ, అంబరీషునకు నహుషుడూ పుట్టారు. నహుషుని కొడుకు యయాతి. యయాతి కొడుకు నాభాగుడు. నాభాగుని కొడుకు అజుడు. అజుని కొడుకు దశరథుడు. ఈ దశరథుని కొడుకు లీ రామలక్ష్మణులు. జనకరాజర్షీ! ఇలాగ ఆదినుంచీ పరమ పవిత్రమూ అద్వితీయమూ అయిన గొప్ప వంశంలో పుట్టి పరమధార్మికులూ మహావీరులూ, సత్యవ్రతులూ అయిన యిక్ష్వాకు వంశీయుల సంతతివారయిన ఈ రామలక్ష్మణులకు నీ కూతుళ్ళనిమ్మని కోరుతున్నాను. నీకూతుళ్ళకు వీరూ, వీరికి నీ కూతుళ్ళూ తగినవారు కనుక. వీరికి నీ కూతుళ్ళ నివ్వడం చలా మంచిది".

గమనిక: ఈ నహుషుడూ, యయాతీ సూర్యవంశీయులు. చంద్రవంశంలో కూడా తరువాత ఈ పేరుగలవారు పుట్టారు.
Read More

శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు. జ్ఞానదృష్టి-

శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు.

జ్ఞానదృష్టి-

ఒకానొక దేశమున ఒకరాజు కలడు. అతడు తన దేశప్రజల యెడల ఎంతయో దాక్షిణ్యము కలవాడై, దయార్ద్రహృదయముతో వారలను చక్కగా పరిపాలించుచుండెను. ఇట్లుండ కొంతకాలమునకు ఆ రాజునకు తీవ్రమైన నేత్రవ్యాధి సంభవించెను. ఎండలోనికి వచ్చుటయే తడువుగా అతని నేత్రములనుండి నీరు కారజొచ్చెను. ఆ వ్యాధి వలన మిక్కుటమగు బాధనొంది రాజు ఎందరో నిపుణులగు వైద్యులను పిలువనంపించి వారిచే కండ్లను పరీక్షచేయించుకొని, వారి ఇచ్చిన ఔషధములను సేవించుచు బహుకాలము చికిత్స గావించుకొనెను. కాని దురదృష్టవశముచే వ్యాధి ఏమాత్రము శమించలేదు. పైగా కంటి బాధ ఇనుమడింపజొచ్చెను. రాజునకు ఏమిచేయవలేనో తోచలేదు. 'శరీరమాద్యంఖలుధర్మసాధనమ్‌' అని పెద్దలు చెప్పినట్లు దేహము ఆరోగ్యముగ నుండిననే గదా ఏవైనా ధర్మకార్యములు సాధించుటకు వీలుపడును! నేత్రజనిత సంతాపముచే విసుగెత్తి జీవితము పైననే విరక్తిని బొందిన ఆ రాజు ఆరోగ్యముకొరకై మార్గాంతరములను యోచించుచుండెను.

"సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్‌" అనునట్లు ఇంద్రియములన్నిటిలో నేత్రము ప్రధానమై యుండుటవలన, నేత్రబాధవలన అన్ని రాచకార్యములందును రాజు నిరుత్సాహమును చూపుచుండెను. మంత్రులతోను సామంతులతోనూ అతడు సరిగా మాట్లాడుటలేదు. ప్రజాప్రతినిధులను తనభవనములోనికి రానిచ్చుటలేదు. ఈప్రకారముగ రాజుగారి నేత్రవ్యాధి రాచక్కార్యము లన్నింటికిని పెద్ద అవరోధముగా పరిణమించెను.

ఇట్లుకొంతకాలము గడిచిన పిమ్మట ఒకానొక దినమున ఒక భిషగ్వర్యుడు నృపాలుని సమీపించి, 'మహారాజా! నీ నేత్రబాధను నేను ఉపశమింపజేసెదను. నేను చెప్పినట్లు మీరు తప్పక ఆచరించ వలెను' అని చెప్పగా బాధోపశమనమునకై పరితపించుచున్న భూపతి అందులకు సమ్మతించెను. అపుడు వైద్యశేఖరుడిట్లు సెలవిచ్చెను - మహాత్మా! ఆకుపచ్చరంగు కంటికి చాల ఇంపుగా నుండును. అది కంటికి చలువను కలుగజేయును. కాబట్టి ఓరాజా! మీరు ఉదయము నిద్రలేచినది మొదలు మరల పరుండువరకును ఆకుపచ్చ వస్తువులను తప్ప అన్యమును వేనిని చూడవద్దు. అట్లుచూచితిరా, మరల వ్యాధి ముదిరిపోవును' అని సలహా నొసంగగా రాజు మిగుల సంతసించి వ్యాధీనివారనమునకు చక్కటి సదుపాయము లభించినదికదా యని సంతుష్టాంతరంగుడై తత్‌క్షణమే అమాత్యశేఖరుని పిలిపించి ఆతనితోనిట్లు పలికెను - మంత్రిగారూ! నానొప్పి తగ్గుటకు, నేత్రవ్యాధి ఉపశమించుటకు వైద్యుడు ఆకుపచ్చవస్తువులనే చూచులాగున చెప్పి యుండెను. కాబట్టి ఉదయము నిద్రలేచినది మొదలు రాత్రి పరుండు వరుకును నాదృష్టి పథమున పడు సమస్త పదార్థములకును భవనములకును వాహనములకును ఆకుపచ్చరంగు వేయించుడు. ఇక్కార్య సాధనమున ఎంత ద్రవ్యమును వినియోగించుటకైనను నేను సంసిద్ధముగా నున్నాను. మీరు మాత్రం వెనుకంజవేయకుడు, అన్యథా భావింపకుడు. నేను చెప్పినట్లు చేయుడు.'

రాజుయొక్క ఆ వాక్యములను విని, అతని ఆదేశమును శిరసావహించి మంత్రులు కొన్ని లక్షల రూప్యములను ఖర్చుచేసి బండ్ల నిండుగా ఆకుపచ్చ రంగు తెప్పించి పట్టణములోని ఇండ్లకు, రాజప్రసాదములకు దానిని పూయించుచుండిరి. ఈపని నిమిత్తము సుదూర ప్రాంతముల నుండి కొన్ని వేలమంది కార్మికులు రప్పించబడిరి. వారు అహోరాత్రులు కృషిచేయుచు రంగు పూయుటలో నిమగ్నులై యుండిరి.

సరిగా అదే సమయమున ఒక సాధువుగారు ఆపట్టణమునకు వచ్చుట తటస్థించెను. రంగుపూయుచున్న ఆ దృశ్యమంతయు చూచి అతడు ఆశ్చర్యచకితుడై, దీనికి కారణమేమి? ప్రజల సొత్తును ఈ ప్రకారముగ రాజు దుర్వినియోగ పరచుట న్యాయమేనా? అని యోచించి నేరుగా 'రాజు వద్దకు వెళ్ళి రాజా! ప్రజల ద్రవ్యమును ఈప్రకారముగ వ్యర్థము చేయుట మీవంటి పెద్దలకు తగునా?' అని ప్రశ్నింప అందులకు రాజు తన నేత్రవ్యాధిని గూర్చియు, వైద్యుల సలహాను గూర్చియు చెప్పగా సాధువుగారు ముక్కుమీద వ్రేలు వేసికొని 'రామ రామ, ఎంత అవి వేకముతో గూడిన పనిని మీరు చేసితిరి? వస్తువులకు ఆకుపచ్చరంగు వేయవలెనా? ఆకుపచ్చ అద్దములు గల కండ్లజోడును ధరించినచో ప్రపంచమంతయు ఆకుపచ్చగా కనబడును గదా! ఎంతడబ్బు వృథా చేసితిరి!' అని హితవు చెప్పి వెడలిపోయెను. రాజు సాధువరేణ్యుని సమయస్పూర్తిని మెచ్చుకొని ఆకుపచ్చని కండ్లజోడును ధరించి తన నేత్రవ్యాధిని తొలగించుకొనుటయే కాక రంగుకొట్టుటను ఆపుటచేసి మిగిలిన ధనమును సద్వినియోగపరచి ప్రజల యొక్క మన్ననలకు పాత్రుడయ్యెను.

నీతి: మనుజుడు తన దృష్టిని జ్ఞానమయముగ నొనర్చుకొని ప్రపంచమును బ్రహ్మమయముగ గాంచుచు పరమశాంతిని అనుభవించవలయును.

దృష్టిం జ్ఞానమయీం కృత్వా
పశ్యేత్‌ బ్రహ్మమయం జగత్‌

ప్రపంచము ఎట్లున్నను తన దృష్టిని పవిత్ర మొనర్చుకొనినచో చాలును; విశ్వమంతయు ఆనందమయముగ గోచరించును.
Read More

దండధరుడు - దైవభక్తుడు

దండధరుడు - దైవభక్తుడు

దండధరుడనగా యమధర్మరాజు. పూర్వము ఒకానొక భక్తుడు భగవద్ధ్యానమందు మిక్కుటమగు ఆసక్తి కలిగి ఏకాంతస్థలము నభిలషించినవాడై తన గ్రామము వదిలి బహుదూరము పాదచారియై పోవుచుండ ఒకచోట చక్కని నవప్రదేశము, సమీపముననే నిర్మలజలముతో గూడి ప్రవహించుచున్న నది అతనికి దృగ్గోచరమైనది. ధ్యానమునకు దైవచింతనకు అనువైన ప్రదేశము లభించెనుగదా అని అతడు పరమానంద భరితుడై ఆ నదితీరమున ఒక పర్ణశాలను నిర్మించుకొని, వన మందలి ఫలాదులను ఆహారముగ గైకొనుచు తపస్సు చేసికొనిచుండెను.

ఒకనాడతని చిత్తఫలకమున అకస్మాత్తుగ ఒక ఆలోచన పొడమెను. బొందితో వైకుంఠమునకు ఎవరును పోలేరా? ఈ శరీరముతోనే భగవంతుని ప్రత్యక్షముగా చూడలేరా? ఏమైనను సరియే! ఆపనిని నేను సాధించి తీరవలెను. ఆరు నూరైనను అక్కార్యమును నేను వదలను. దానిని నెరవేర్చుటకు కంకణము కట్టుకొందును. ప్రయత్నశీలునకు, తీవ్రఅధ్యవసాయము కలవానికి లోబడనిపని ప్రపంచమున ఏదియు నుండజాలదని పెద్దలవాక్యము. కావున భగవంతుని ఈశరీరముతోనే ప్రత్యక్షముగా గావించుటకు యత్నించెదను' అని దృఢనిశ్చయము గావించుకొని, అక్కార్యమును సాధించుటకై అకుంఠిత దీక్షవహించి తపస్సున కుపక్రమించెను.

కొంతకాలము గడచిన మీదట ఒకదినము ఆ భక్తుడు తన నిత్యదైవకార్యక్రమమును పూర్తి చేసికొని ధ్యానమును విరమించి కన్నులను తెరచి చూడగా కట్టెదుట ఒక బ్రహ్మాండాకారము కలిగిన వ్యక్తి చేత గదను ధరించి నిలబడి యుండుటను చూచెను. భక్తునకు అత్యాశ్చర్యము కలిగెను. ఈతడెవడు? ఇట్టి ఏకాంతస్థలమునకు ఏల వచ్చెను?" అని తనలో వితర్కించుకొని సంభ్రమచిత్తుడై కొంతసేపటికి తెప్పరించుకొని ధైర్యమును కుడకట్టుకొని "నీ వెవరవు?" అని భక్తుడు అగంతకుని ప్రశ్నించెను. వెంటనే ఆ పర్వతాకారుడగువ్యక్తి ఓయీ "నేను యముడను. నీ ఆయుస్సు తీరినది. కాబట్టి నీప్రాణములను అపహరించుకొని పోవుటకు వచ్చినాను, అని గంభీరముగ పలికెను. ఆ వాక్యములను విని భక్తుడు 'మహాత్మా! అట్లేయగుగాక! కాని బహుకాలమునుండి నేనొక ఉద్దేశ్యముతో తపంబొనరించుచున్నాను. దానిని తాము నెరవేర్చగలరని నా నమ్మకము. శరీరముతో భగవంతుని సాక్షాత్తుగా దర్శింపవలెననే నాయభీష్టము. దయచేసి తామట్టివరమును నాకు ప్రసాదించ ప్రార్థన. తమవంటి మహనీయులకిది అలవికాని పని కాదు. భక్తుని మొరయాలకించి దండధరుడు సంతసించినాడై ఓయీ నీ తీవ్రతపస్సునకు నేను మెచ్చినాను. నీ కోర్కెను నెరవేర్చెదను. నా వెంటరమ్ము. ఇపుడే నీకు ఈ తనువుతో భగవద్దర్శనమును గావింపజేసెదను' అని పలికెను.

వైవస్వతుని వాక్యములు భక్తుని కర్ణపుటములందు బడగనే ఆతడు అమితానందముచే ప్రపుల్లహృదయుడై, అట్లే తమ వెంట వచ్చెదననిచెప్పి యమధర్మరాజును అనుసరింపదొడగెను. యముడు గదను ధరించి ముందు చనుచుండ వెనుక భక్తుడు వినయ విధేయతలతో నడచుచుందెను. కొంత దూరమేగిన పిదప భక్తుడు యముని సంబోధించి మహాత్మా! తమచేతిలోని గదను చూచుచుండినకొలది నాగుండె బ్రద్ధలగుచున్నది. భయకారణమున నా నడక తొట్రుపడుచున్నది. కాబట్టి దయచేసి ఆ గదను నాచేతికిచ్చినచో నేను నిర్భయముగ తమవెంట వచ్చుటకు వీలుండును అని వచించెను. భక్తుని వింతధోరణి చూచి యముడు లోలోన నవ్వుకొని, గద అతనికిచ్చినచో వచ్చిన నష్టమేమి అని భావించుకొని, గదను భక్తునకొసంగి తాను ముందు పోవుచుండెను. భక్తుడు గధాధరుడై వెనుక వచ్చుచుండెను.

ఇంతలో వైకుంఠము సమీపించెను. యముడు భక్తునితో 'నాయనా! ఇది వైకుంఠము. నీవు పురములోనికి వెళ్ళి భగవంతుని సందర్శించుకొని త్వరితముగా రమ్ము. నేను బయట నీకొరకు కనిపెట్టుకొని ఉందును. జాగుచేయకుము అనిచెప్పి పంపెను. భక్తుడు అట్లే వైకుంఠ పురములోనికి ప్రవేశించి భగవంతుని దర్శించి అతని సన్నిధానమందే కూర్చొనెను. దైవసాన్నిధ్యశ్రీని అనుభవించుచు పరమానందమును బడయుచు అతడు బాహ్యజగత్తునే విస్మరించెను. ఈప్రకారముగ చాలాసేపు గడచినది. భక్తుని కొరకు వేచివేచి యమునకు విసుగెత్తి పోయినది. ఎంతసేపు చూచినను భక్తుడు బయటకు రాడయ్యే. చివరకు యమధర్మరాజు తానే స్వయముగా లోనికేగి చూడ భక్తుడు దైవసన్నిధిలో నిర్భీకుడై కూర్చొని యుండెను. యముడతనిని సంజ్ఞ చేసి పిలిచెను. కాని భక్తుడు యముని వైపు ముఖమైనను త్రిప్పక దైవసాన్నిధ్యజనిత మహదానంద సాగరమున గ్రుంకులిడుచు నుండెను. ఇక లాభము లేదనుకొని యముడు తెగించి లోనికేగి బయటకు రమ్మని సంబోధించెను. ఆ వాక్యమును విని భక్తుడు "మహాత్మా! ఇంతటి చక్కని వాతావరణమును విడిచి పెట్టి నేను ఏట్లురాగలను? మందారకమకరందమాధుర్యమునుగ్రోలు మధుపంబు దానిని విడిచి పెట్టి నీరసస్థానము లకు చనునా? ఆహా! ఈ వైకుంఠమున భగవత్సాన్నిధ్యమున ఎంతటి ఆనందము! నా జీవితము ధన్యమైనది. ఇట్టి స్థానము విడిచిపెట్టుటకు నా మనస్సు ఒప్పుటలేదు. ఓయమధర్మరాజుగారూ! క్షమించుడు! నేను శ్రీమన్నారాయణుని చరణసాన్నిధ్యమును విడిచి రాజాలను. తమరు దయచేయవచ్చును.

భక్తుని యావాక్యములను విని దండధరుడు ఆశ్చర్యచకితుడై భక్తుని తనవెంట పంపులాగున నేరుగా భగవంతునితోనే మొరపెట్టుకొనెను. శ్రీమహావిష్ణువు యమునితో 'ఓ యమధర్మరాజా! నా లోకమునకు వచ్చి నా శరణ్యమును బొందిన భక్తునకు ఇక మృత్యుభయమెక్కడిది! ఈతడిచటనే శాశ్వతానందము నొందుచుండును. కాబట్టి ఇక మీరు వెళ్లవచ్చును'. అని పలుకగా యముడు గత్యంతరము లేక వెడలిపోయెను. కొంతదూరమేగిన పిదప గదమాట జ్ఞాపకమునకు వచ్చి వెనుకకు తిరిగి వెల్లి యముడు భక్తునితో తన గద ఇచ్చివేయమని యడుగగా 'ఈ గదా మీకిచ్చినచో అందరిని బాధించెదరు. కాబట్టి నేను ఇవ్వనే ఇవ్వను' అని భక్తుడు పలికెను. అంతట విష్ణుభగవానుడు భక్తునకు హితవుచెప్పి ఆగదను దండధురునకు ఇప్పించి "ఓ యమధర్మరాజా! ఇక మీదట ఎపుడును జనుల ప్రాణములు తీయుటకై మీరు వెడలు నపుడు వారికి కనిపించరాదు. అట్లు కనిపించినందు వలన గదా మీకిట్టి అవమానము తటస్థించినది!" అని యమునితో పలికెను. ఆ వాక్యములను విని యమధర్మరాజు వైకుంఠమును విడిచెను. అప్పటి నుండియు దండధరుడు ఎవరికిని కనిపించకుండా వచ్చి ప్రాణములు పెకలించుకొని పోవుచుండెను.

నీతి: భగవంతుని ఆశ్రయించినవారికి మృత్యుభయముగాని మరి ఏలాటి ఇతర క్షేశములుగాని ఉండజాలవు.
Read More

గోదానం, భూదానం, సువర్ణదానం అన్నదానం. వీటిలో ఏది గొప్పది ??

గోదానం, భూదానం, సువర్ణదానం అన్నదానం. వీటిలో ఏది గొప్పది అంటే చాలామంది ఘంటాపదంగా చెప్పేది ఒకేఒక్క దానం. అన్నదానం. కాని నూటికి 90మంది చెప్పేవారే గాని చేయరు. మన సంప్రదాయాల కోసం లోకం గాలిస్తానంటారు. కాని ఇది మన సంప్రదాయం అంటే మాత్రం ఆ నిజాన్ని జీర్ణించుకోలేరు.

దానలన్నిటిలో కెల్లా గోప్పదానం భూదానం. దీనివల్ల తరతరాలను తరింపజేస్తుంది. ఏలోటు ఉండదు. ఎందుకంటే భూమిలో సువర్ణం,(బంగారం), భీజం(ఆహారం), నీరు, నిప్పు, పెట్రోలియం. ఇలా మనవ వనరులు మొత్తానికి ఆధారం భూమి మాత్రమే. చివరిని నువ్వు చస్తే పాతిపెట్టాల్సింది ఈభుమిలోనే. ఇది కాకుండా ఇంకేదైనా గొప్పది ఉంటె చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. మనం కొత్త శాస్త్రాలు సృష్టిద్దాం.
సువర్ణదానం : ఇది ఆయుష్షుని పెంచుతుంది. దీర్గాయువు ఇస్తుంది. రేపో మాపో చనిపోయేవారు పేరు మీద సువర్ణం దానం ఇస్తే ఆరోగ్యం మెరుగుపడి ఆయుష్షు పెరుగుతుందని శాస్త్రం చెప్తుంది.

అన్నదానం : ఇది మనకి ఆహారం, వస్త్రం కొరతరాకుండా చేస్తుందని శాస్త్రం.

ఒక్క విషయం గుర్తుంచుకోండి. నాకు నచ్చిందే సాంప్రదాయం అనుకునేవారిని, కులాచారాలు పాటించని వారిని ఎవరు భాగుచేయలేరు. శాస్త్రాన్ని, ఆచారాలని అనుసరించి జీవించేవారికి సాక్షాత్తు ఆదైవమే తోడుండి నడిపిస్తుంది.
Read More

శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు.= జితేంద్రియ వంశము-

శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు.

జితేంద్రియ వంశము-

ఒకానొక పట్టణమునకు బహుదూరమున గల వనప్రదేశమందు ఒక తపస్వి ఒక చక్కటి కుటీరమును నిర్మించుకొని ధ్యానాది కార్యములను ఒనర్చుకొనుచుండెను. ఆ కుటీరము చుట్టును తలసి మొక్కలు, మారేడు చెట్లు, ఇతర ఫలవృక్షములు విరివిగ నుండుటచే ఆప్రదేశమంతయు పవిత్రముగను శోభాయమానముగను ఒప్పారుచుండెను. ఏకాంతస్థల మగుటవలనను విక్షేపజనకములైన పరిస్థితు లెవ్వియు లేకుండుట చేతను ఆ తపస్వి తన ధ్యానానుష్టానములను నిరాటంకముగ కొనసాగించు కొనుచు, పరమార్థ వాతావరణమునందు ఆనందముగ జీవితమును కొనసాగించుచుండెను.

ఇట్లుండ ఒకనాడు మిట్టమధ్యాహ్నము ఒక రాజకుమారుడు ఆరణ్యములలో సంచారము సల్పుచు దప్పికగొని నీరు త్రావుటలై ఆ తపస్వి యొక్క కుటీరమునకు వచ్చెను. తాపసి రాకుమారునికి దాహోదకము నొసంగి ఉపశాంతిని కలుగజేసెను. అనంతరము అతనితో ఆతపస్వి "మీరెవరు? ఎచటనుండి వచ్చుచున్నారు?" అని ప్రశ్నింప ఆతడిట్లు ప్రత్యుత్తర మొసంగెను. "మహాత్మా! నేనొక రాజకుమారుడను. మా తండ్రి ఈ సమీపప్రాంతమున కంతటికిని మహారాజు. మాది జితేంద్రియ వంశము. నాపేరు జితేంద్రియకుమార్‌. మా తండ్రి పేరు జితేంద్రియ మహారాజ్‌, మా తల్లి పేరు జితేంద్రియరాణి. నా ధర్మపత్ని పేరు జితేంద్రియదేవి!

రాజకుమారుని ఆ వాక్యములను వినగానే తపస్వికి ఆశ్చర్యము గలిగి, 'వారి వంశీయులు వాస్తవముగ జితేంద్రియులా! లేక నేతిబీరకయవలె పేరుకుమాత్రము గొప్పగా అట్లు చెప్పుకొనుచున్నారా! పరీక్షింపవలె' నని ఉద్దేశముతో రాజకుమారుని తన కుటీరమందే కొంత తడవు ఉండులాగున చెప్పి తాను హుటాహుటిగ రాజప్రాసాదమునకు పయనమై పోయెను. తదుపరి రాజును సమీపించి, అతనితో నిట్లనెను - ఓ భూసురోత్తమా! నీకు ఒక్కడే కుమారుడు. అతడు భీకరారణ్యములో సంచరించుచున్నాడు. ఒకవేళ హింస జంతువులచే అతనికేదైన ప్రమాదము వాటిల్లి అకసాత్తుగా దేహవియోగ మైనచో మీరేమి చేయుదురు?" ఆ వాక్యములను విని నృపాలుడు ఏమాత్రము ఆవేదన పడక తపస్వితో గంభీరముగ నిట్లు పలికెను. - 'ఓ తాపసోత్తమా! విధివిలాసమును ఎవరు తప్పించగలరు? పుట్టిన వస్తువునకు చావు తప్పదు. జన్మించిన దాదిగ మృత్యువు జీవుని వెంబడించుచునే యుండును. ఈనాడో, రేపో లేక వత్సరములో ఏనాడైనను పుట్టిన ప్రాణి చావకమానదు.

మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహజాయతే |
అద్యవాబ్ధశతాంతేషు మృత్యుర్వై ప్రాణినాం ధ్రువమ్‌ ||

జన్మించువారికి మృత్యువు వెనువెంటనే యుండును. ఎప్పటికైనను జీవునకు మరణము ఖాయము. ఇందు దిగులు పొందవలసినదేమియును లేదు. బ్రతికిన నాలుగురోజులు భగవంతుని స్మరించుచు పుణ్యము నార్జించుటయే జీవుని కర్తవ్యము!

భూపాలుని యా విజ్ఞతాపూర్వక వచనములను విని తాపసుడు లోలోన సంతసించి, రాణియొద్దకు వెల్లి "అమ్మా! నీ కుమారుడు ప్రమాదవశాత్తు ఎపుడైన మరణించినచో ఏమిచేయుదువు? అని ప్రశ్నింప ఆమె జంకుగొంకు లేకుండ ఈ ప్రకారము పలికెను.

జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రుం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి ||

మహాత్మా! పుట్టిన ప్రాణి చావకమానడు. చచ్చిన ప్రాణి కర్మశేషమున్నంత వరకు పుట్టక మానడు. ఇక శోకించుట దేనికి? బ్రతికి యున్న నాలుగు రోజులు రామా, కృష్ణాయని భగవన్నామస్మరణ చేయుచు పుణ్యమును సంపాదించుకొనుటయే మానవుని కర్తవ్యము!

రాణియొక్క మహత్త్వపూర్ణములగు యాతాత్త్విక వచనములను విని తపస్వి ఆనందభరితుడై రాజకుమారుని సతీమణి యొద్దకు వెళ్ళి "అమ్మా! నీపతి అరణ్యప్రాంతములందు ఏకాకిగ సంచరించుచున్నాడు. ప్రమాద వశాత్తు అతనికి దేహవియోగ మైనచో ఏమి చేతువు?" అని ప్రశ్నింప, ఆమె గంభీరముగ నిట్లు ప్రత్యుత్తర మిచ్చెను. మహాశయా! తమకు తెలియని దేమున్నది? ఈ ప్రపంచమున పిపీలికాది బ్రహ్మ పర్యంతము గల సమస్తము ఒకానొక మహత్తరశక్తికి లోబడియే పని చేయుచున్నది. విధిని ఎవరు తప్పించగలరు? బంధువులు, మిత్రులు, కుటింబీకులు ధర్మసత్రమునందు యాత్రికులవలె కలిసికొని మరల విడిపోవునట్లు కొలది కాలము ఒకచోట కలిసికొని మరల ఎవరిదారిన వారు పోవుచుందురు.

ఏకవృక్ష సమారూఢా నానాజాతివిహంగమాః |
ప్రభాతే విదిశో యాంతి కా తత్రపరిదేవనా ||

సాయంకాలమున ఒకచెట్టుపై రకరకముల పక్షులన్నియు గుమిగూడి మరల తెల్లవారగనే ఎచటికో ఎగిరిపోవు చందమున ఋణానుబంధముచే జీవులున్ను ఒక కుటుంబమున కలిసికొని మరల ఎవరికి వారు వేరైపోవుచుందురు. ఇది ప్రకృతి ధర్మము. జగన్నియమము. ఇక శోకింపనేల?"

రాజకుమారిని సహధర్మచారిణి యొక్క యావిజ్ఞతాపూర్వక వాక్యములను విని తపస్వి లోలోన పరమానంద పడుచు తిరిగి తన కుటీరము యొద్దకు వెళ్లి తనకొరకై అచట వేచియున్న రాజకుమారునితో "నాయనా! మీరాజ్యముపై శత్రువు లెపుడైన దండెత్తి వచ్చి రాజవంశమునంతను చిత్తుగనాశన మొనర్చివైచినచో నీవేమి చేయుదువు?" అని ప్రశ్నింప, అతడేమాత్రము కినుక వహింపక ధైర్యపూర్వకముగ నిట్లు పలికెను - "తాపసోత్తమా! ఈ ప్రపంచమున ఏది శాశ్వతము? ఇంతవరకెందరు రాజులు రాలేదు! పోలేదు! వారందరును ఏమైరి? ఎవరైన స్థిరముగ నుండగలిగిరా? కాలప్రవాహమున బడి ఎందరో ప్రాణులు అహర్నిశము కొట్టుకొని పోవుచున్నారు. నదీ ప్రవాహమున కొన్ని కట్టెపుల్లలు ఒకచోట కలిసికొని మరల తరంగముల తాకిడికి వేరైపోవునట్లు ఒక కుటుంబమునగాని, ఒక వంశమునగాని కొందరు జీవులు కలిసికొని కొంతకాలము వ్యవహారము సలిపి మరల మృత్యుముఖమున పడి ఎవరిదారిన వారు పోవుచున్నారు.

ఇదం కాష్ట మిదం కాష్టం నద్యాం వహతి సంగతః |
సంయోగాచ్చ వియోగాచ్చ కా తత్ర పరిదేవవా ||

కాబట్టి వియోగమందు దుఃఖపడనేల? బ్రతికిన కొలదిరోజులు జగత్ర్పభువగు పరమాత్మను సేవించి, ధ్యానించి, పవిత్రజీవితమును గడుపుటయే జీవులకు శరణ్యము.

రాజకుమారుని యాగంభీరార్థ బోధకములగు వాక్యములను విని తపస్వి ఆనందడోలికలలో నూగులాడుచు జితేంద్రియ వంశమును పేరునకు తగినట్లుగనే కుటుంభసభ్యు లందరును గొప్ప ఆధ్యాత్మికాను భూతి కలిగియున్నారని సంతసించి రాజకుమారుని ఆశీర్వదించి పంపివైచెను.

నీతి: మానవుడు జితేంద్రియుడై, మనస్సును తనస్వాధీనములో నుంచుకొని, కష్టసుఖములందు సమభావము కలిగి క్షణికములగు దృశ్య వస్తువులపై ప్రాకులాడక, దేహాదులందు బంధ్వాదులందు అభిమానమును వదలి, ధైర్యముతో జీవితలక్ష్యమగు ఆత్మసాక్షాత్కారమునకై తీవ్రతర యత్నము సలుపుచు ఈ జీవితమందే అద్దానినిబడసి కృతకృత్యుడు కావలయును.
Read More

వ్యాసమహర్షి జన్మ వృత్తాంతం -శ్రీ మహాభారతం

వ్యాసమహర్షి జన్మ వృత్తాంతం -శ్రీ మహాభారతం
పరాశర మునీంద్రుడికి, సత్యవతికి జన్నించినవాడు వ్యాసుడు. సత్యవతి అసలు పేరు కాళి. మత్స్యగంధి అని కూడా అంటారు. బెస్త పిల్ల .

చేది దేశపు రాజు ఒకసారి వేటకని అడవికి వెళ్లాడు. అక్కడ క్రీడిస్తున్న జంతువుల జంటను చూసి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయాడు. కాశిందీ నదీతీరాన జరిగిందిది. శాపవశాన చేపరూపాన ఆ నదిలో వున్న అద్రిక అనే దేవకన్య ఆ రేతస్సును స్వీకరించింది.చేప గర్భం ధరించింది. కడుపుతో వున్న చేప కదల్లేక మెదల్లేక బెస్త వాడి వలకు చిక్కింది.తీరా దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి కోస్తే ఆ చేప కడుపులో ఇద్దరు పసికందులున్నారు. ఆ ఇద్దరిలో మగ పిల్లవాణ్ణి బెస్త రాజుగారికే ఇచ్చేశాడు. ఆడ పిల్లను తానే అల్లారుముద్దుగా పెంచుకున్నాడు.ఆ ఆమ్మయికి 'కాళి' అని పేరు పెట్టాడు.కాళి పెరిగి పెద్దదైంది. పెళ్ళీడు పిల్లైంది.

పరాశర మహర్షి ఒక రోజు కాళిందీ నది దగ్గరకు వచ్చి ఆవలి ఒడ్డుకు వెళ్ళేందుకు పడవకోసం చూస్తున్నాడు. ఆ సమయంలో కాళి తండ్రి నది ఒడ్డున అప్పుడే చద్ది మూట విప్పుకొని భోజనానికి కూర్చోవడం వల్ల మహర్షిని ఆవలి ఒడ్డుకు తీసుకెళ్ళమని కూతుర్ని పురమాయించాడు. మత్స్య గంధి సరేనంది. మహర్షి పడవలోకి ఎక్కాడు. పడవ నడుస్తోంది. ఎగిసిపడే అలలు,ఎగిరెగిరిపడే చేప పిల్లలు,పడవ నడిపే వయ్యారి - పరాశరుడికి చిత్తచాపల్యం కలిగించాయి.

కామోద్రేకంతో ఆమెను సమీపించాడు. ముని పుంగవుని కోరికను పసిగట్టి దూరంగా జరగింది కాళి. పరాశరుడు వినలేదు. పడవ చుట్టూ పొగమంచు సృష్టించాడు. కాళి శరీరం నుంచి కస్తురి పరిమళాలు గుప్పుమనేట్టు చేసాడు. నది మధ్యలో ఒక దీవిని సృష్టించాడు. ఇద్దరూ అక్కడికి వెళ్ళి అమర సుఖాలు అనుభవించారు. కాళి గర్భం ధరించింది. పరాశారుడు ఆమెను ఓదారుస్తూ," నీవు గర్భం ధరించినా నీ కన్యత్వానికేమీ దూషణ వుండదు. నీకు పుట్టబోయే పిల్లవాడు విష్ణు అంశతో్ జన్మిస్తాడు. సద్గుణశీలుడు, సర్వవిద్యాపారంగతుడు అయి ముల్లోకాల్లోనూ కీర్తింపబడతాడు. జగద్గురువవుతాడు. ఏక రాశిగా వున్న వేదాలను విభాగం చేసి వాటికి సూత్రభాష్యాలు రచిస్తాడు. మహా తపస్వీ, మహా మహిమాన్వితుడూ అవుతాడు. ఇప్పుడు నీ ఒంటికి అబ్బిన కస్తూరి పరిమళం శాశ్వతమై నువ్వు 'యోజనగంధి' వి అవుతావు " అని దీవించాడు.

మహర్షి అన్నట్టుగానే కాళింది పండంటి పిల్లవాణ్ణి కన్నది. అతను చిన్నతనం నుంచే దైవభక్తితో పెరిగాడు. పెద్దల ఎడల వినయ విధేయతలతో మెలిగాడు. పెద్దయ్యాకా, " తల్లీ! నా గురంచి విచారించకు. తపస్సు చేసుకునేందుకు నేను అడవులకు వెళ్తున్నాను. నీకు ఎప్పుడైనా దుఃఖం కలిగినా,కష్టం కలిగినా, లేదా చూడాలనిపించినా నన్ను తలచుకో. నేను నీ ముందుకు వచ్చి నిలుస్తాను " అని చెప్పి అడవులకు వెళ్ళిపోయాడు. అతనే కృష్ణ ద్యైపాయనుడయ్యాడు. అతని తల్లే చంద్రవంశానికి చెందిన శంతనుడను మహారాజును పెళ్ళి చేసుకుంది. ఆ విధంగా కురుపాండవులకు చాలా దగ్గరవాడు వ్యాసుడు. ఇరువర్గాలకు ఆధ్యాత్మిక గురువు కూడా ఆయనే. పరిపాలనా సంబంధమైన విషయాలలో కురుపాండవులు కృష్ణ ద్వైపాయనుడి సలహాలు తేసుకునేవారు. అయితే ఆయన హస్తినాపురంలో కన్నా అడవులలో తపస్సు చేసుకుంటూ వున్న కాలమే చాలా ఎక్కువ.
Read More

వ్యాసుడు సిద్ధివినాయకుణ్ణి ప్రార్ధించుట -శ్రీ మహాభారతం

వ్యాసుడు సిద్ధివినాయకుణ్ణి ప్రార్ధించుట -శ్రీ మహాభారతం
కురుపాండవ సంగ్రామం ముగిసిన తరువాత ఆయన భారతగాధ ఆమూలాగ్రం ఊహించాడు.కాని దీనిని గ్రంధస్తం చేసి లోకంలో చదివించడం ఎలా, ఈ కధను వ్రాసేవారెవరు అన్న ప్రశ్న వచ్చింది. వెంటనే సృష్టికర్త అయిన బ్రహదేవుణ్ణి ధ్యానించాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు.

" మహర్షీ!నీకేం కావాలి? " అని బ్రహ్మ అడిగాడు.

వ్యాసమహర్షి పరమేష్థికి నమస్కరించి తన మనోవేదన వెల్లడించాడు.అప్పుడు బ్రహ్మ " మహర్షీ! ఈ కధ వ్రాయడానికి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించు.నీవు సంకల్పించిన గ్రంధం వ్రాయగలవాడు గణపతి ఒక్కడే. నీ కోరిక సిద్ధిస్తుంది " అని చెప్పి అంతర్ధానమయ్యాడు.

అప్పుడు వ్యాసుడు సిద్ధి వినాయకుణ్ణి ప్రార్ధించాడు. వెంటనే ఆయన ప్రత్యక్షమయ్యాడు.వ్యాసమహర్షి గజాననుడికి నమస్కరించి " లంబోదరా! మహాభారత మహా గ్రంధాన్ని నేను మనస్సులో ఊహించుకున్నాను.అది నేను చెబుతూవుంటే మీరు వ్రాసుకుపోతు వుండాలి.ఏమంటారు స్వామీ " అని అడిగారు.

అందుకు వినాయకుడు ఒక షరతు పెట్టాడు." నేను వ్రాస్తూ వున్నప్పుడు నా లే్ఖిని క్షణమైనా ఆగడానికి వీలు లేదు.అలా నీవు ఆపకుండా చెప్పుకుపోగలవా? " అని అడిగాడు.

ఇది చాలా కఠినమైన నిబంధన. అయినా వ్యాసుడు ఒప్పుకున్నాడు. బదులగా, " దేవా! నేను చెప్పేదాన్ని భావం సంపూర్ణంగా తెలుసుకుని వ్రాసుకుపోతుండాలి. అందుకు తమరు సిద్ధమేనా " అని ఎదురు ప్రశ్నించాడు మహర్షి.

గణనాధుడు చిరునవ్వు నవ్వి "సరే" అన్నాడు.

ఆ విధంగా వ్యాసుడు చెబుతూవుంటే వినాయకుడు వ్రాయడం వలన మహాభారత కధ గ్రంధస్ధమై అలరారింది. దానిని మొట్ట మొదట తన కుమారుడైన శుకుడికి చెప్పాడు మహర్షి. ఆ తరువాత ఆయన శిష్యులు అనేకులు ఈ కధ చెప్పుకున్నారు.

ఈ కధను దేవలోకంలో దేవతలకు వినిపించినవాడు నారదుడు.గంధర్వులకు, యక్షులకు, రాక్షసులకు చెప్పినవాడు శుకయోగీంద్రుడు. ఇక ఈ మహాభారత పుణ్యకధను మానవలోకానికి చెప్పిన మహనీయుడు వ్యాసులవారి ముఖ్య శిష్యుడు వైశంపాయనుడు.

మహాసముద్రంతో పోల్చదగిన మహాభారతంలో లేని ధర్మసూక్ష్మ మంటూ లేదు.ధర్మజ్ఞులు దీనిని ధర్మశాస్త్ర మన్నారు. ఆధ్యాత్మిక తత్త్త్వవిదులు దీనిని వేదంతసార మన్నారు. నీతికోవిదిలు నీతిశాస్త్రమని, కవి పండితులు మహా కావ్యమని, లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని, ణతిహసికులు మహా ఇతిహాసమని, పౌరాణికులు సకల పురాణాశ్రయమని శ్లాషించారు.

విద్యలకు వేలుపు అయిన వినాయకుడు వ్రాయడం వలన భారత కధ సావధానచిత్తులై వినినవారికి ధర్మార్ధ సంసిద్ధి కలుగుతుందని ప్రసిద్ధి.
Read More

అంబ -శ్రీ మహాభారతం

అంబ -శ్రీ మహాభారతం
శంతనుని వల్ల సత్యవతికి చిత్రాంగదుడు,విచిత్రవీర్యుడు అనే ఇద్దరు పిల్లలు కలిగారు. వాళ్ళు చిన్నవాళ్ళుగా ఉండగానే శంతనుడు మరణించాడు. అన్న మాట ప్రకారం దేవవ్రతుడు చిత్రాంగదుణ్ణి సింహాసనం ఎక్కించాడు. ఇతను అధికారదర్పంతో, అహంకారంతో కన్నూ,మిన్నూ గానకుండా ప్రవర్తించి చివరకు ఒక గంధర్వుడి చేతిలో చావు దెబ్బ తిన్నాడు. అనంతరం విచిత్రవీర్యునుకి పట్టం కట్టారు. తమ్మునికి పెళ్ళి చేయాలనుకున్న భిష్ముడు కాశీరాజు స్వయంవరం ప్రకటిస్తే విచిత్రవీర్యుణ్ణి అక్కడకు తీసుకుపోయాడు.

కాశీరాజుకు ముగ్గురు కూతుళ్ళు .

అంబ,అంబిక,అంబాలిక అని వాళ్ళకు పేర్లు.

వాళ్ళ కోసం అక్కడకు చేరిన రాజులందరూ పోట్లాడుకోవాడం మొదలుపెట్టారు. భీష్ముడు వాళ్ళందర్నీ ఓడించి రాజకుమార్తెలు ముగ్గుర్నీ రధమెక్కించుకుని హస్తినాపురానికి తీసుకువచ్చాడు.

వెంటనే పెళ్ళికి ఏర్పాటు చెయ్యమని మంత్రుల్ని అదేశించాడు. అంబ నీళ్ళు నిండిన కళ్ళతో భీష్ముడి దగ్గరకు వెళ్ళి " గాంగేయా! నా మనసంతా సాళ్వభూపతి మీద ఉంది. నాకు యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచి అతనే నా భర్త కావాలని కోరుకుంటున్నాను. అతనే నా ప్రాణనాయకుడు. అతనే నా సర్వస్వం. మనసు లేని మనువు క్షేమం కాదు. నా మాట విను. మనసులు కలవని దాంపత్యం వల్ల ప్రయోజనం లేదు. నన్ను సాళ్వుని దగ్గరకు చేర్చు. నా చెల్లెళ్ళిద్దర్నీ నీ తమ్ముడుకిచ్చి పెళ్ళి చెయ్యి" అని వేడుకుంది. భీష్ముడు సరేనని అంబను సాళ్వదేశానికి పంపాడు.

సాళ్వుడు అంబను చూస్తూనే " నువ్వంటే నాకూ ఇష్టమే. నిన్ను పెళ్ళి చేసుకోవాలని నేనూ అనుకున్నాను. కాని రాజులందరూ చూస్తూవుండగా భీష్ముడు నిన్ను రధమెక్కించుకుని తీసుకుపోయాడు. అప్పటినుంచి అక్కడే ఉన్నావు. ఉన్నట్టుండి ఇప్పుడెందుకొచ్చావో తెలీదు నాకు. విచిత్రవీర్యుణ్ణి పెళ్ళాడబోయి అతని ఇంట్లో కొన్నాళ్ళు గడిపొచ్చిన నిన్ను ఏ ముఖం పెట్టుకుని పెళ్ళి చేసుకోమంటావు?" అని పరుషంగా అన్నాడు. అంబ ఏడుస్తూ భీష్ముడి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పింది. " నీ వల్లే నాకు అపకారం జరిగింది. నా ప్ర్ణయనాధుడు నాకు కాకుండా పోయాడు. నా చిర సంకల్పం భగ్నమైంది. ఇంక చేసేదేంలేదు. వచ్చిన అపవాదు ఎలాగో వచ్చింది. నీ తెమ్ముణ్ణే పెళ్ళి చేసుకుంటా" అంది.

భీష్ముడు ఒప్పుకోలేదు.

" సాళ్వుడే నా ప్రియుడని బాహాటంగా ప్రకటించిన పిల్లవు. నా తమ్ముణ్ణెలా చేసుకుంటావు? మనసొకచోట మనువొకచోట కుదరదని నువ్వేగా చెప్పావు. కాబట్టి నీకూ మా తమ్ముడికీ పొసగదు. నీ దోవన నువ్వు పోవడం మంచిది" అన్నాడు. అంబ మొహంలో నెత్తురుచుక్క లేకుండా పోయింది. భీష్ముడి కంఠంలో కఠినతకు అమె కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. నెమ్మదిగా తల పైకెత్తి, "నా కలలన్నీ చిరిగి పీలికలవడానికి నువ్వే కారణం నా బ్రతుకు అల్లరి పాలు కావడానికి నువ్వే మూలం. నీ మీద ప్రతీకారం తీర్చుకోకపోతే నేను కాశీరాజు కూతుర్నే కాదు" అని వెళ్ళిపోయింది. అడవుల్లోకి వెళ్ళి తపస్సు ప్రారంభించింది.

ఒక రోజు హొత్రవాహనుడనే రాజర్షి వచ్చి, అంబ సంగతంతా విని ఆమె తన కూతురి బిడ్డ అని తెలుసుకుని విచారించాడు. ఆమెను ఓదార్చి మహేంద్రపర్వతానికి వెళ్ళి పరశురాముణ్ణి ఆశ్రయిస్తే తగిన సహాయం చేస్తాడని చెప్పడు. ఆమె బయలుదేరే సమయంలో పరశురామ శిష్యుడు అకృతవ్రణుడనేవాడు వచ్చి, హొత్రవాహనుడ్ని చూసేందుకు పరశురాముడే అక్కడికి వస్తున్నాడని చెప్పాడు.

అంబ ఆగిపోయింది. మర్నాడే పరశురాముడు వచ్చాడు. అంబ ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి తన కధంతా చెప్పుకుంది. ఆయన జాలిపడి "అమ్మా! నీకు రెండువైపులా పరాభవం కలిగింది. సాళ్వుణ్ణి చక్క చెయ్యమంటావా? భీష్ముడికి నచ్చ చెప్పమంటావా?" అని అడిగాడు.

" మహర్షి ! సాళ్వుడెలాగా నన్ను అంగీకరించడు. భీష్ముడంటే కోపంగా ఉంది నాకు. అతణ్ణి సాధించడానికే తపస్సు చేస్తున్నాను" అంది.

"అమ్మా!తపస్సు చేసేటంత కష్టమెందుకు నీకు! భీష్ముడు నా మాట వినకపోతేగా?" అని అంబను భీష్ముడి దగ్గరకు తీసుకువెళ్ళాడు పరశురాముడు.

"గాంగేయా! ఈ పడుచును బలవంతంగా తీసుకువచ్చావు. ఇప్పుడు కాదనడం ధర్మంకాదు. ఈ పిల్లను నీ తెమ్ముడికిచ్చి పెళ్ళి చెయ్యి" అన్నాడు.

"పరపురుషుని మీద వ్యామోహం ఉన్న కన్యను నా తమ్ముడికిచ్చి వివాహం చేయ్యడం మాత్రం ధర్మమా మహాత్మా" అన్నాడు భీష్ముడు.

"ఏమో అదంతా నాకు తెలీదు. నేను చెప్పింది చెయ్యడమే నీ కర్తవ్యం. లేకపోతే నిన్ను, నీ స్నేహితుల్నీ, నీ బంధువుల్నీ కూడా చంపుతాను" అన్నాడు పరుశురాముడు.

"అయ్యా! ఇది అధర్మం" అన్నాడు భీష్ముడు చేతులు జోడిస్తూ.

"నాకు ధర్మాధర్మాలు నేర్పేవాడవయ్యావా?" అని మండిపడ్డాడు పరశురాముడు.

"స్వామీ! మీరు నాకు విలువిద్య నేర్పిన గురువులు. నిష్కారణంగా శిష్యుడి మీద కోపగించుకోవడం న్యాయం కాదు." అన్నాడు భీష్ముడు. ఆ మాటలతో మరింత కోపం వచ్చిందాయనకు.

" నేను గురువునని తెలిసినా,నా మాట తిరస్కరిస్తున్నావు? పైగా ఏవేవో ధర్మాలు బోధిస్తున్నావు నాకు. మాటల వల్ల ప్రయోజనం లేదు. ఈ అమ్మాయిని మీ తమ్ముడికిచ్చి పెళ్ళిచేస్తే నా కోపం చల్లారుతుంది. లేదా..." అని పరశురాముడు ఇంకా ఏదో అంటుండగానే " అధర్మకార్యం మాత్రం నేను చెయ్యను" అన్నాడు భీష్ముడు.

దానితో ఇద్దరూ యుద్ధానికి దిగారు.

పరశురాముడు బాణాలవర్షం కురిపించాడు. భీష్ముడు తెలివిగా రధాన్ని ఆకాశానికి ఎత్తేసరికి ఆయన మొహం పాలిపోయింది.పరశురాముడు ఏ అస్త్రం ప్రయోగించినా భీష్ముడు దాన్ని తిప్పికొడుతున్నాడు.ఇంతలో జమదగ్ని మహాముని పితృదేవతలతో సహా వచ్చి "నాయనా!భీష్ముణ్ణి జయించడం ఎవరికీ సాధ్యం కాదు. నారాయణసఖుడైన నరుడు అర్జునుడై పుట్టి ఈ భీష్ముణ్ణి చంపుతాడు. నువ్వూరుకో" అని పరశురాముణ్ణి శాంతింపజేశాడు. పరశురాముడు భీష్ముణ్ణి కౌగిలించుకుని గౌరవించాడు.

భీష్ముడు క్రౌర్యం విడిచి గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేసాడు.

పరశురాముడు అంబను పిలిచి " అమ్మాయీ! నన్ను భీష్ముడు గెలిచాడు. ఇంక నేనేం చేయ్యలేను. నీ ఇష్టం మరి" అన్నాడు. అంబ మౌనంగా రోదిస్తూ వెళ్లిపోయింది.

ఆ తరువాత యమునా తీరంలో కుటీరం ఏర్పరచుకుని తీవ్రంగా తపస్సు చేసింది. ఒకనాడు గంగాదేవి కనిపించి "ఏమిటింత కఠినంగా తపస్సు చేస్తున్నావు?" అని అడిగేసరికి " వచ్చే జన్మలో భీష్ముణ్ణి చంపాలి అందుకూ ఈ తపస్సు " అంది అంబ.

"నువ్వు కుటులసంచారిణివి. కనుక ఈ శరీరం విడిచి ఏరై ప్రవహించు. అంతకంటే ఇంకేం చెయ్యలేవు నువ్వు" అంది కోపంగా గంగ.

అంబ తన తపఃప్రభావంలో సగం ధారపోసి అంబానదిగా ప్రవహించి మిగిలిన సగభాగంతోనూ తన శరీరాన్ని నిలబెట్టుకుంది. చివరకు ఆమె తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై "మరుజన్మలో భీష్ముణ్ణి చంపగలవు" అని సెలవిచ్చాడు.

"స్వామీ! అదెలా సంభవం?" అని అంబ అడిగింది.

"నువ్వీ శరీరం విడిచి ద్రుపదుడికి మొదట కూతురివై పుడతావు. తరువాత కొడుకుగా మారి శిఖండి అనే పేరుతో ప్రసిద్ధికెక్కి గాంగేయుని వధిస్తావు" అని చెప్పి అంతర్ధానమయ్యాడు శివుడు.

అంబ చితి పేర్చుకొని 'వచ్చే జన్మలో భీష్ముణ్ణి చంపుదునుగాక' అంటూ అగ్నిలో ప్రవేశించింది. అదీ అంబ కధ.
Read More

విదురుడు -శ్రీ మహాభారతం

విదురుడు -శ్రీ మహాభారతం
విదిరుడు ధర్మశాస్త్రంలోనూ,రాజనీతిలోనూ బాగా ఆరితేరినవాడు. కోపతాపాలు, ఈర్ష్యాసూయలు లేని మహాత్ముడు. పెద్దలందరిచేతా మంచివాడనిపించుకున్నాడు. ధృతరాష్ట్ర మహారాజుకు మహామంత్రిగా పనిచేసాడు. విదురుడికి సాటివచ్చే విజ్ఞానవంతుడు,ధర్మనిష్ఠ్డుడూ ముల్లోకాల్లోనూ ఎవరూ లేరు.

పాండవులతో జూదం ఆడడానికి దుర్యోధనుడు తన తండ్రి అనుమతి కోరినపుడు విదురుడు ధృతరాష్ట్రుడి చేతులు పట్టుకుని, "మహారాజా! మీరు ఈ జూదానికి ఒప్పుకోవద్దు. ఈ జూదం వల్ల అన్నదమ్ముల మధ్య విరోధం వస్తుంది. కౌరవ రాజ్యానికే దీనివల్ల ముప్పు కలుగుతుంది" అని ఎన్నో విధాల చెప్పాడు.

ధృతరాష్ట్రుడికి విదురిడిమీద అపారమైన నమ్మకం. అందుచేత అతను చెప్పిన మాటలు విని కొడుకుతో, "అబ్బాయీ! ఈ జూదం మనకు వద్దు. పాచికలతో పరాచికాలు కాదని విదురుడు చెబుతున్నాడు. అతడు ఏది చెప్పినా మన మేలుకోరి చెబుతాడు.అతడు చెప్పిన ప్రకారం చేస్తే మనకు శుభం జరుగుతుంది. బుద్ధిలో బృహస్పతిలాంటివాడు. జరిగిందీ,జరగబోయేదీ అన్నీ చెప్పగలడు. ఈ జూదం వల్ల మీ అన్నదమ్ముల మధ్య తగాదా వస్తుందని విదురుడు చెబుతున్నాడు.అది సుతారమూ నాకిష్టం లేదు" అని శతవిధాల చెప్పాడు.

కాని అవేవీ దుర్యోధనుడి చెవికెక్కలేదు. కుమారుడి మీద గల మితిమీరిన ప్రేమకొద్దీ దృతరాష్ట్రుడు చివరికి తప్పనిసరై అతను జూదమాడటానికి సరేనన్నాడు.

ఆ తరువాత విదురుడు చెప్పినట్టే జరిగింది. కౌరవ వంశమంతా నాశనమైంది. చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు.

అసలింతకీ ఈ విదురుడు ఎవరంటే.....

ఊరికి దూరంగా ఒక వనంలో ఆశ్రమం కట్టుకుని మాండవ్య మహాముని జీవిస్తుండేవాడు. ఒకనాడు ఆయన తన ఆశ్రమం వెలుపల తపస్సు చేసుకుంటూ వుండగా కొందరు దొంగలు అటువైపు వచ్చారు. వారిని కొందరు రాజభటులు తరుముకొస్తున్నారు. వారిని తప్పించుకునేందుకు దొంగలు మాండవ్యముని ఆశ్రమంలోకి జొరబడ్డారు. దోచుకు తెచ్చిన సొమ్ములన్నీ ఓ మూల పడేసి మరోమూల వాళ్ళు దాక్కున్నారు.

రాజభటులు దొంగలు పారిపోయిన జాడ కనిపెట్టి ఆ దారినే ఆశ్రమం వద్దకు వచ్చారు.
అక్కడ తపస్సు చేసుకుంటున్న మాండవ్యముని కనిపించాడు వాళ్ళకు.

"ఏమయ్యా ఇప్పుడే కొందరు దొంగలు ఇటు వచ్చారే, నువ్వేమైనా చూశావా? వాళ్ళు ఎటు వెళ్ళారు?" అని అడిగారు. ధ్యానంలో నిమగ్నమైన మాండవ్యుడు బదులు చెప్పలేదు.

రాజభటులు మళ్ళీ గట్టిగా అడిగారు.

సమాధానంలేదు.

ఇంతలో కొందరు రాజభటులు ఆశ్రమంలోకి వెళ్ళి సోదా చెయ్యడం మొదలుపెట్టారు. లోపల ఓ మూల దొంగలెత్తుకొచ్చిన నగలు,డబ్బు కనిపించాయి.మరోమూల దొంగలు కూడా కనిపించారు.

'ఒహో! ఇదా కధ! ఈ బ్రాహ్మణుడు కపట సన్యాసన్నమాట. దొంగల నాయకుడు బహు గొప్పగా ముని వేషం వేసుకుని ఉలక్కుండా పలక్కుండా వున్నాడు. ఇతడి సలహా మీదనే ఈ దొంగతనం జరిగి వుంటుంది' అని రాజభటులు తీర్మానించుకుని వాళ్ళ చేతులకు బేడీలు వేశారు. వెంటనే ఈ విషయం రాజుగారికి చెప్పారు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. కపట సన్యాసిని వెంటనే శూలానికి గుచ్చి కొరత వెయ్యండని ఆజ్ఞాపించాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం మాండవ్యుణ్ణి శూలానికి గుచ్చి , ఆశ్రమంలో దొరికిన సొమ్మంతా రాజుగారికి అప్పగించారు. ఇంత జరుగుతున్నా దొంగలు నోరు మెదపలేదు. కాని, మాండవ్యముని ధ్యానంలో వుండటం వల్ల శూలంపోట్లు ఆయనను ఏమీ చెయ్యలేకపోయాయి.

ప్రాణం నిలిచే వుంది. అడవిలో వున్న మునులందరికీ ఈ విషయం తెలిసి ఆయనను చూడటానికి వచ్చారు.

"ఇంతటి ఘోరానికి ఒడికట్టిందెవరు మహానుభావా?" అని దుఃఖిస్తూ అడిగారు.

"ఎవరని చెప్పను నాయనా? ఎవరి ధర్మం వాళ్ళు నెరవేర్చారు. రాజభటులు పట్టుకున్నారు, రాజుగారు నాకీ శిక్ష విధించారు" అని మాండవ్య ముని సమాధానం చెప్పారు. శూలనికి వ్రేలాడుతున్న మనిషి అన్నం,నీళ్ళూ లేకపోయినా ఇంకా అలాగే ప్రాణాలతో బ్రతికి వుండటం రాజుగారికి ఆశ్చర్యం కలిగించింది. ముని మహానీయుడని గ్రహించాడు.వెంటనే ఆయన్ను శూలం నుంచి దింపమని భటులను ఆజ్ఞాపించాడు.

మహాముని కాళ్ళమీద పడి క్షమించమని వేడుకున్నాడు.

ఇంత జరిగినా మాండవ్య మునికి రాజుగారిమీద కోపం రాలేదు.

తిన్నగా యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి " స్వామీ! ఇంతటి కఠిన శిక్షను నాకెందుకు విధించారు?" అని అడిగాడు.

యమధర్మరాజు మాండవ్యుడికి కలిగిన కష్టానికి విచారిస్తూ, "మహామునీ! మీరు చిన్న పిల్లవాడుగా వున్నప్పుడు పక్షులను,తుమ్మెదలను హింసించారు. పాపం ఎంత కొద్దిగా చేసినా దాని ఫలం చాలా ఎక్కువగా అనుభవించాలి" అన్నాడు.

"పసితనంలో తెలియక చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష విధిస్తావా? సరే - నువ్వు చేసిన పాపానికి భూలోకంలో మానవుడవై జన్మించు" అని ముని యమధర్మరాజుని శపించాడు.

ఆ విధంగా ధర్మదేవత మాండవ్యముని శాపం వల్ల అంబాలిక దగ్గర వున్న దాసీవనిత కడుపున పుట్టాడు. అతడే విదురుడు.

అందుకని ధర్మదేవత అవతారమే ధర్మకోవిదుడైన విదురుడని పెద్దలు చెబుతారు.
Read More

శ్రీవేంకటేశ ప్రపత్తి

శ్రీవేంకటేశ ప్రపత్తి

రచన: ప్రతివాధి బయంకరమ్ అన్న వేదంతాచారి

ఈశానాం జగతో‌உస్య వేంకటపతే ర్విష్ణోః పరాం ప్రేయసీం
తద్వక్షఃస్థల నిత్యవాసరసికాం తత్-క్షాంతి సంవర్ధినీమ్ |
పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్ ||

శ్రీమన్ కృపాజలనిధే కృతసర్వలోక
సర్వఙ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ |
స్వామిన్ సుశీల సుల భాశ్రిత పారిజాత
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || 2 ||

ఆనూపురార్చిత సుజాత సుగంధి పుష్ప
సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ |
సౌమ్యౌ సదానుభనే‌உపి నవానుభావ్యౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || 3 ||

సద్యోవికాసి సముదిత్త్వర సాంద్రరాగ
సౌరభ్యనిర్భర సరోరుహ సామ్యవార్తామ్ |
సమ్యక్షు సాహసపదేషు విలేఖయంతౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || 4 ||

రేఖామయ ధ్వజ సుధాకలశాతపత్ర
వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రైః |
భవ్యైరలంకృతతలౌ పరతత్త్వ చిహ్నైః
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || 5 ||

తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ
బాహ్యైర్-మహోభి రభిభూత మహేంద్రనీలౌ |
ఉద్య న్నఖాంశుభి రుదస్త శశాంక భాసౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || 6 ||

స ప్రేమభీతి కమలాకర పల్లవాభ్యాం
సంవాహనే‌உపి సపది క్లమ మాధధానౌ |
కాంతా నవాఙ్మానస గోచర సౌకుమార్యౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || 7 ||

లక్ష్మీ మహీ తదనురూప నిజానుభావ
నీకాది దివ్య మహిషీ కరపల్లవానామ్ |
ఆరుణ్య సంక్రమణతః కిల సాంద్రరాగౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || 8 ||

నిత్యానమద్విధి శివాది కిరీటకోటి
ప్రత్యుప్త దీప్త నవరత్నమహః ప్రరోహైః |
నీరాజనావిధి ముదార ముపాదధానౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || 9 ||

“విష్ణోః పదే పరమ” ఇత్యుదిత ప్రశంసౌ
యౌ “మధ్వ ఉత్స” ఇతి భోగ్య తయా‌உప్యుపాత్తౌ |
భూయస్తథేతి తవ పాణితల ప్రదిష్టౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || 10 ||

పార్థాయ తత్-సదృశ సారధినా త్వయైవ
యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి |
భూయో‌உపి మహ్య మిహ తౌ కరదర్శితౌ తే
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || 11 ||

మన్మూర్థ్ని కాళియఫనే వికటాటవీషు
శ్రీవేంకటాద్రి శిఖరే శిరసి శ్రుతీనామ్ |
చిత్తే‌உప్యనన్య మనసాం సమమాహితౌ తే
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || 12 ||

అమ్లాన హృష్య దవనీతల కీర్ణపుష్పౌ
శ్రీవేంకటాద్రి శిఖరాభరణాయ-మానౌ |
ఆనందితాఖిల మనో నయనౌ తవై తౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || 13 ||

ప్రాయః ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ
మాతుః స్తనావివ శిశో రమృతాయమాణౌ |
ప్రాప్తౌ పరస్పర తులా మతులాంతరౌ తే
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || 14 ||

సత్త్వోత్తరైః సతత సేవ్యపదాంబుజేన
సంసార తారక దయార్ద్ర దృగంచలేన |
సౌమ్యోపయంతృ మునినా మమ దర్శితౌ తే
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || 15 ||

శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయ భావే
ప్రాప్యేత్వయి స్వయముపేయ తయా స్ఫురంత్యా |
నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యం
స్యాం కింకరో వృషగిరీశ న జాతు మహ్యమ్ || 16 ||
Read More

తులసి స్తోత్రం

తులసి స్తోత్రం


Read More

తులసి షో డశ నామాని

తులసి  షో డశ నామాని

Read More

లంచం ఇలా నిర్ములించ వచ్చును

లంచం ఇలా నిర్ములించ వచ్చును
Read More

తులసి కవచం


తులసి కవచం

Read More

రిక్తహస్తములు- --- శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు.

 శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు.

రిక్తహస్తములు-

పూర్వము గ్రీసుదేశమున అలెగ్జాండరు అను గొప్ప రాజు కలడు. అతడు తన శౌర్యధైర్య పరాక్రమములచే పెక్కు పరిసర రాజ్యములను జయించి తదుపరి ఆసియాదేశముపై దండెత్తెను. ఆసియా ఖండమున గూడ అనేక రాజ్యములను కొల్లగొట్టి, ధన మంతయు దోచుకొని, తాను సంపాదించిన యా సిరిసంపదలను, సువర్ణంబును, రత్నరాసులను గేనెలందు, పెట్టెలందు వైచికొని తిరిగి తన స్వస్థానమగు పశ్చిమ దేశములకు పయనమయ్యెను.

పూర్వకాలమున రైలుబండ్లు గాని, విమానములుగాని లేవు. కావున గుర్రములపై ఏనుగులపై ఆ సామాగ్రినంతను మెల్లగ తరలించు కొని పోవుచుండెను. అక్కడక్కడ కొన్ని మజిలీలు ఏర్పాటుచేసికొని మంత్రులు సైనికులు మొదలైనవారు వెంటరాగా కొన్ని గుడారములు వేసికొని మార్గమధ్యమున సేదదీర్చికొనిచు అలెగ్జాండరు విజయోత్యాహముతో స్వదేశమునకు చనుచుండెను.

ఇట్లుండ ఒకనాడు అలెగ్జాండరు చక్రవర్తికి అరోగ్యము క్రమముగ క్షీనింపదొడగెను. అత్తరి అందరును ప్రయాణకార్య క్రమమును నిలిపివైచి తమ ప్రభువు యొక్క స్వాస్థ్య విషయమందే దృష్టిని నిలిపి అతనికి ఆరోగ్యము కలుగుటకై పరిపరివిధముల ప్రయత్నములు చేయదొడంగిరి, గొప్ప గొప్ప వైద్యులను పిలిపించిరి. పేరుగొన్న హకీములను రప్పించిరి. ఒక వైద్యమేమి, అన్నిరకలముల వైద్యములను చేయించిరి. అన్ని మందులను వాడిచూచిరి. కాని విధి బలీయమైనది. ఎంతటి రాజాధిరాజైనను తన కర్మఫలితమును అనుభవించక తీరదుకదా!

రాజుగారికి శరీరములో ఉష్ణము ప్రబలుచుండెను. వైద్యులు నిరాశను ప్రకటింపదొగడిరి. మంత్రులు, సామంతులు కింకర్తవ్య విమూఢులై ఏమిచేయుటకును తోచక రాజుచెంత తదేకదృష్టితో నిలబడియుండిరి. ఇక అవసానకాలము సమీపించినదనియే అందరును తలంచిరి. అత్తరి అలెగ్జాండరు తన మంత్రులను దగ్గరకు పిలిచి ఈ ప్రకారముగ వారల నాదేశించెను - ఓ మంత్రులారా! నా ఆరోగ్యము దినదినము క్షీణించుచున్నది. మీరు నా విషయమై చేయవలసిన కార్యము లన్నిటిని చక్కగా చేయుచున్నారు. కాని నా కర్మఫలితము మరియొక విధముగ నున్నది. జరుగవలసినది జరిగియే తీరును. ఇక నేనెక్కువ దినములు జీవించు అశలేదు. కఫవాత పిత్తములు నాదేహము నాక్రమించి స్మృతిజ్ఞానము లోపింపక పూర్వమే మీకొక చిన్న సలహా చెప్పదలంచినాను.

ఏమనగా "ఈ శరీరము నుండి ప్రాణవాయువు వెడలిపోయిన వెంటనే సంప్రదాయానుసారము దీనిని ఒక పెట్టె (Coffin)లో పెట్టి శ్మశానమునకు తీసికొనివెళ్ళి మీరు ఖననము చేయుదురు. నేను మహారాజును కాబట్టి సామాన్యమానవునివలె కాక పెద్ద ఆటోపముతో ఈ శరీరమును ఊరేగించి శ్మశానమునకు తోసికొని పోవుదురు. ఆ విషయము నాకు ముందుగనే బాగుగ తెలియును. అయితే నేను మీకు చెప్పుసలహా ఏమనగా, నా మృతశరీరమును ఉంచునట్టి పెట్టెను తయారుచేయించునపుడు అందు చేతులు పెట్టుచోట రెండు పెద్ద రంధ్రములను ఏర్పాటుచేయుడు."

ఆ వాక్యములను వినగానే మంత్రులు సంభ్రమచిత్తులై ఏ కారణముచే రాజిట్లు నుడువుచున్నాడో తెలియక తికమక పడుచుండిరి. పెట్టెలో ఆ ప్రకారముగ రంధ్రములు ఏర్పాటుచేయుడని చెప్పుటలో గల అంతర్యమేమి? దీనియందేదియో గొప్పకారణ మిమిడియుండవలెను. ఆ కారణమును ప్రభువు జీవించియున్నపుడే ఆతని వలన మనము తెలిసికొనుట యుక్తము అని మంత్రులందరు యోచించుకొని ఎట్టకేలకు ధైర్యము వహించి అలెగ్జాండరు చక్రవర్తిని సమీపించి యిట్లడిగివైచిరి -

"మహాప్రభో! ఇంతవరకు చరిత్రలో కని విని యెరుగని విశేషమును తాము సెలవిచ్చితిరి. ఎవరైనను చనిపోయినచో ఒక పెట్టెలో పరుండబెట్టి శ్మశానమునకు తీసికొనిపోవుదురు. అంతియే కాని ఆ పెట్టెకు చేతులయందు రంధ్రములు వేయించరు. కాని తాము రంధ్రములు వేయుంచులాగున చెప్పిరి. ఇదియొక అపూర్వ విషయము. అట్లెందుల కానతిచ్చిరో సెలవియ్య ప్రార్థన."

మంత్రుల ఆ వినయాన్విత వాక్యములను విని అలెగ్జాండ రిట్ల్లు ప్రత్యుత్తర మొసగెను.

"ఓ మంత్రులారా! ప్రయోజనము లేక ఎవరును కార్యమును చేయుట కుపక్రమించరు. నేను మృతినొందిన వెనుక మీరు నన్ను పెట్టెలో పరుండబెట్టి మూతవేసి ఊరేగించెదరు. వేలకొలది జనులు ఆ ఊరేగింపును తిలకించెదరు. శ్మశానము వరకు కోలాహలముగా నుండును. పెట్టెలో నన్ను పరుండ పెట్టి ఊరేగించునపుడు చేతులుండు చోట పెట్టెకు రంధ్రము లున్నచో ఆ రంధ్రములో గుండ నా చేతులు బయటకు వచ్చి వ్రేలాడును. ఇంతవరకు జనులలో గొప్ప అపోహ ఒకటి వ్యాపించియున్నది. అదియేదనగా, దేశదేశములలో అలెగ్జాండరు కొల్లగొట్టిన ధనమునంతను పరలోకమునకు తీసికొని వెళ్ళుచున్నాడేమో యని జనులు తలంచుచున్నారు. అట్లేమియు తీసికొనివెళ్లుట లేదని నేను వారికి ఋజువుపరచ వలసి యున్నది. నా చేతులు బయటకు కనిపించినచో ఆ రిక్తహస్తములను జూచి జనులందరును ఓహో అలెగ్జాండరు ఒట్టిచేతులతోనే పరలోకమునకు బోవుచున్నాడే కాని ధనమును, సంపదను వెంటగైకొని వెళ్లుటలేదు. కోట్లకొలది ధనరాసులను వజ్రవైడూర్యములను జీవితములో సంపాదించి నప్పటికి అంత్య కాలములో, పరలోక ప్రయాణకాలములో ఒక్క చిల్లిగవ్వైనా వెంట తీసికొని వెళ్లుటలేదు అని నిశ్చయించుకొనగలరు. ఈ ప్రకారము సత్యము నవగత మొనర్చుకొని వారు జీవితమును నావలె ధనకనక వస్తువాహన రాజ్యాది విభవములందు ధారబోయక సత్యవస్తు సంపాదనమున వినియోగింప గలరు" -

ప్రభువు యొక్క ఆ వాక్యములను శిరసావహించి మంత్రులందరు కొద్దిరోజులలో సంభవించిన అలెగ్జాండరు మరణానంతరము ఆ ప్రకారమే చేసిరి. అలెగ్జాండరు తన యీచర్య ద్వారా లోకమునకొక గొప్ప నీతిని బోధించెను. భౌతిక సంపద ఏదియు జీవునకు శాశ్వతము కాదని అతడు ప్రపంచమునకు చాటెను. కావున జనులు సావధాన చిత్తులై తమకు శాశ్వతముగ ఉపకరించునట్టి సత్యదయాధర్మములను జేపట్టి అసత్యములగు దృశ్యపదార్థములందు విరక్తిని, శాశ్వతమగు దైవమందు ఆసక్తిని కలుగజేసికొని జీవితమును ధన్యమొనర్చు కొందురు గాక!

నీతి: మరణించునపుడు ప్రాపంచిక పదార్థమేదియు మనుజుని వెంటరాదు. కాబట్టి విషయభోగముల యెడల విరాగము కలిగి వెంట వచ్చు పుణ్యమును అధిక మొనర్చుకొనవలెను.
Read More

ద్రోణుడు -శ్రీ మహాభారతం

ద్రోణుడు -శ్రీ మహాభారతం
భరద్వాజ మహాముని పుత్రుడు ద్రోణుడు. వేద వేదాంగాలన్నీ అభ్యసించాడు. ధనుర్విద్య ఆసాంతం నేర్చుకున్నాడు. పాంచాలదేశపు రాజకుమారుడు ద్రుపదుడు కూడా ద్రోణుడితోపాటూ చిన్నప్పుడు అస్త్రవిద్య నేర్చుకున్నాడు. దానితో వారిద్దరికీ గాఢ స్నేహం కుదిరింది. ఆ స్నేహం కొద్దీ, తాను రాజ్యం చేపట్టిన వెంటనే తన రాజ్యంలో సగభాగం ఇస్తానని ద్రుపదుడు ద్రోణుడికి మాట ఇచ్చాడు.

ఆశ్రమవాసం పూర్తి అయిన తరువాత ద్రోణుడు కృపాచార్యుడి చెల్లెలిని పెళ్ళి చేసుకున్నాడు. అశ్వత్ధామ అనే కుమారుణ్ణి కన్నాడు. ద్రోణుడికి భార్య అన్నా, కొడుకు అన్నా అపరిమితమైన ప్రేమ. కాని బీదరికం వల్ల వాళ్ళను సుఖపెట్టలేక పోయాడు. అందువల్ల ఏదో ఒక విధంగా ధనం సంపాదించి వాళ్ళను సంతోషపెట్టాలనే ఆశ ద్రోణుడ్ని పీడిస్తూ వుండేది. పరశురాముడు తన ధనమంతా బ్రాహ్మణులకు దానం ఇస్తున్నాడని తెలిసింది. కొండంత ఆశతో ఆయన దగ్గరకు వెళ్ళాడు. కాని అంతకు కొంచెం ముందే పరశురాముడు తన దానధర్మాలన్నీ పూర్తి చేసి అరణ్యాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ద్రోణుడ్ని చూసి, "స్వామీ! నాకున్నదంతా అయిపోయింది. ఇక మిగిలిందల్లా ఈ శరీరమూ,నేను నేర్చిన అస్త్రవిద్యలూ మాత్రమే. ఆ విద్యలు నేర్పమంటారా?" అని అడిగాడు.

"ఆ అస్త్ర విద్యలు చాలు, అవే బోధించండి నాకు"అన్నాడు ద్రోణుడు.

పరశురాముడు సమస్త విద్యలూ ద్రోణుడికి నేర్పాడు.

కొంతకాలానికి పాంచాల దేశపు రాజు పరమపదించాడు. ద్రుపదుడు రాజయ్యాడు. ద్రోణుడు పట్టరాని ఆనందంతో ద్రుపదరాజు ఆస్తానానికి వెళ్ళి తనను తాను ఫలానా అని పరిచయం చేసుకున్నాడు. ద్రుపదుడు ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఐశ్వార్య మదంతో కన్నూ మిన్నూ గానక ద్రోణుడ్ని ఏవగించుకున్నాడు. " నువ్వెవరో నాకు తెలీదు. అయినా ఏమిటి సాహసం? నీకూ నాకూ స్నేహమంటున్నావు. సింహాసనం ఎక్కిన మహారాజుకూ, అదృష్టం, ఐశ్వర్యం లేని అష్టదరిద్రుడికీ స్నేహమంటే ఎవరైనా నమ్ముతారా? ఏదో చెప్పి నా జట్టు కలవాలని చూస్తున్నావు. దరిద్రుడికీ, ధనికుడికీ, మూర్ఖుడికీ విద్వాంసుడికీ, పిరికివాడికీ వీరుడికీ ఎలా మైత్రి కుదురుతుందనుకున్నావు?" అన్నాడు.

ద్రోణుడు పరాభవంతో వెనక్కి వెళ్ళాడు.

ఇలా వుండగా హస్తినాపురంలో ఒకనాడు రాకుమారులు నగరం వెలుపల ఉద్యానవనంలో బంతి ఆట ఆడుకుంటున్నారు. ఆటలో బంతి వెళ్ళి అక్కడున్న బావిలో పడింది. దానితో పాటూ ధర్మరాజు వేలి ఉంగరం కూడా పడిపోయింది. అందరూ బావి చుట్టూ చేరారు. ఇంతలో ఆ సమయానికి ఒక బ్రాహ్మణుడు వచ్చడు అక్కడికి. " రాకుమారులారా! మీరు క్షత్రియులు కదా! నీళ్ళలోపడిన బంతిని పైకి తీయలేకపోతున్నారే! నేను ఒకే ఒక్క బాణంతో ఆ బంతిని పైకి తీస్తాను. మరి నాకేమిస్తారు?" అని అడిగాడు ఆ బ్రాహ్మణుడు.

" కృపాచార్యుల వారింట్లో మీకు షడ్రసోపేతమైన భోజనం పెట్టిస్తాం" అన్నారు.

బ్రాహ్మణుడు నవ్వుతూ ఒక పుల్ల తీసుకుని మంత్రించి నీళ్ళలో వున్న బంతిని గురిపెట్టి విసిరాడు. అది బాణంలా రివ్వున వెళ్ళి బంతిని కొట్టుకుంది. అలా ఒకదానికొకటి గుచ్చినట్టు పుల్లలను విసిరేటప్పటికి అది తాడులా తయారైంది. దాన్ని పట్టుకుని పైకిలాగి బంతిని రాకుమారులకిచ్చాడు. రాకుమారులందరూ ఆశ్చర్యపోయారు.

ఉంగరం కూడా తీసిపెట్టమని బ్రతిమాలారు.

అప్పుడు ఆయన ఒక బాణాన్ని నీళ్ళలోకి వేసేటప్పటికి అది సూటిగా వెళ్ళి ఉంగరానికి గుచ్చుకుని పైకి తేలివచ్చింది. రాకుమారులు ఈ విచిత్రం చూసి విస్తుపోయారు. "స్వామీ! మీరెవరు? మా వల్ల కాదగిన ఉపకారం ఏదైనా వుంటే చెప్పండి చేస్తాం" అన్నారు.

" భీష్ముణ్ణి అడగండి. నేనెవరో ఆయనకు తెలుసు." అని పిల్లల్ని పంపించేశాడు.

రాకుమారులు చెప్పిన లక్షణాల్ని బట్టి ఆ బ్రాహ్మణుడు ద్రోణాచార్యుడని గుర్తించిన భీష్ముడు ఆయనను సకల మర్యాదలతో రప్పించాడు. తన నూట అయిదుగురు మనవళ్ళకూ అస్త్రవిద్యలు నేర్పమని కోరాడు. అలా ద్రోణాచార్యుడి వద్ద కౌరవ పాండవులు అస్త్రవిద్యలన్నీ నేర్చుకున్నారు. చివరికి గురువుగారు దక్షిణ కోరుతూ ద్రుపదరాజును ప్రాణాలతో పట్టితెచ్చి అప్పగించవలసినదని కర్ణుణ్ణీ,ధుర్యోధనుణ్ణీ పంపారు. కాని వాళ్ళ వల్ల ఆ పని కాలేదు. తరువాత ద్రోణుడు అర్జునుడ్ని పంపాడు. అతను ద్రుపదరాజుని మంత్రితో సహా కట్టితెచ్చి ఆచార్యుల వారిముందు నిలబెట్టాడు.

"ద్రుపదరాజా! నీ ప్రాణాలకేమీ మంప్పు లేదు,భయపడకు. చిన్నతనంలో నాతో ఎంతో స్నేహంగా ఉన్నావు. తరువాత రాజ్యాధికారం రాగానే నన్ను అవమానించావు. రాజుతో స్నేహం చెయ్యడానికి రాజే కావాలన్నావు. కయ్యానికైనా వియ్యానికైనా సమాన హోదా ఉండాలన్నావు. ఆ కారణం వల్లనే ఇప్పుడు నేను నీతో యుద్ధం చేయవలసి వచ్చింది. కాని మళ్ళీ నేను నీతో స్నేహంగా ఉండాలనుకుంటున్నాను. నేను నీతో స్నేహం చెయ్యాలంటే నువ్వు అష్ట దరిద్రుడుగా ఉండటానికి వీల్లేదు. అందుకని నీ దగ్గర గెలుచుకున్నదాంట్లో సగం రాజ్యం ఇస్తాను తీసుకో" అన్నాడు ద్రోణుడు.

ద్రుపదరాజు అవమానంతో తల దించుకున్నాడు. చేసిన పరాభవం చాలనుకుని ద్రోణుడు అతడిని ఉచితరీతిన సత్కరించి సాగనంపాడు.
Read More

అర్జునుడు -శ్రీ మహాభారతం

అర్జునుడు -శ్రీ మహాభారతం
అర్జునుడు పాండవులలో మూడవవాడు. అతను పిట్టినప్పుడు "కుంతీ! నీ కుమారుడు పరమశివునితో సరితూగేటంత శక్తిమంతుడౌతాడు. ఇంద్రుని వలే అజేయుడౌతాడు. రాజులందర్నీ జయించిన తరువాత మూడుసార్లు అశ్వమేధం చేస్తాడు. శివుడ్ని ప్రసన్నం చేసుకుని పాశుపతదివ్యాస్త్రాన్ని సంపాదిస్తాడు" అని అశరీరవాణి పూలవానలు కురిపిస్తూ పలికింది.

పాండవులు చిన్నప్పుడు కౌరవులతో కలసి హస్తినాపురంలో వుంటుండేవారు. బాల్యంలోనే అర్జునుడు అస్త్రవిద్య, సంగీతం, నాట్యం, క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. మొట్టమొదట అర్జునుడికి ధనుర్వేదంలో పాఠాలు చెప్పిందీ, బాణాలు వేయడం నేర్పిందీ శుకమహర్షి. తరువాత కృపాచర్యుడు, ఆ తరువాత ద్రోణుడు అర్జునుడ్ని మేటి విలుకాడుగా మలచారు.

ఓ సారి ద్రోణుడూ,ఆయన శిష్యులూ గంగానదిలో స్నానం చేస్తుండగా ఆచార్యుని కాలు ఒక తిమింగలం పట్టుకుంది. శిష్యులందరూ ఎంత ప్రయత్నించినా తిమింగలం పట్టు నుంచి గురువుగార్ని విడిపించలేకపోయారు. చివరికి అర్జునుడు వేసిన బాణంతో తిమింగలం ద్రోణుణ్ణి వదలి పలాయనం చిత్తగించింది. ద్రోణుడు సంతోషించి అర్జునుడికి "బ్రహ్మశిరాస్త్రం" ఉపదేశించాడు. ఆ అస్త్రాన్ని మానవుల మీద ప్రయోగించడానికి వీల్లేదు. మానవాతీతమూర్తుల మీదే అది పనిచేస్తుంది.

ఇలా వుండగా దుర్యోధనుడికి పాండవులందర్నీ హతమార్చి రాజ్యం మొత్తం చేజిక్కించుకోవాలన్న దురాశ కలిగి వాళ్ళందర్నీ 'వారణావతం' అనే పట్టణానికి పంపాడు. పాండవులకి దుర్యోధనుడి కుట్ర తెలిసిపోయింది. అక్కడ నుంచి యుక్తిగా తప్పించుకుని వాళ్ళందరూ బ్రాహ్మణ వేషాలలో ఏక చక్రపురం చేరారు. ఆ సమయంలో పాంచాల రాజు ద్రుపదుడు తన కుమార్తె దౌపదికి స్వయంవరం చాటించాడు.

స్వయంవరమంటపం ఎంతో సొగసుగా నిర్మించారు. ఉక్కు తీగలతో పురిపెట్టిన అల్లెత్రాడు గల పెద్దవిల్లు ఒకటి వేదిక మీద ఉంచారు. ఆ విల్లు వంచి, నారిని సంధించి, బాణం ఎక్కుపెట్టి, పైన చాలా ఎత్తులోవున్న చేపను ఒకేదెబ్బలో కొట్టాలి. మధ్యలో ఒక చక్రం గిర్రున తిరుగుతూ వుంటుంది. దానికి ఏ మాత్రం తగలకుండా, దాని మధ్యగుండా బాణం వేయాలి. అలా వేయగలిగిన యోధుడ్ని దౌపది పెళ్ళాడుతుంది. దుర్యోధనుడు, కర్ణుడు, శిశుపాలుడు, జరాసంధుడు, వంటి యోధానుయోధులు ఆ స్వయంవర మహోత్సవానికి హాజరయ్యారు. బ్రాహ్మణ వేషాలలో వున్న పాండవులూ వెళ్ళారు. క్షత్రియ వీరులూ, రాకుమారులూ ప్రయత్నించి విఫలమయ్యారు. కర్ణుడు విర్రవీగుతూ వెళ్ళి వెల్లకిలా పడ్డాడు. చివరికి మారువేషంలో వున్న అర్జునుడు ధనస్సు ఎత్తి చాలా తేలికగా లక్ష్యాన్ని కొట్టగలిగాడు. పాంచాలి అర్జునుడి మెడలో వరమాల వేసింది.

అర్జునుడి కపికేతనం గురించి చిత్రమైన కధ వుంది. ఒక సారి దేశయాత్రకు వెళ్ళిన అర్జునుడు రామేశ్వరం నుంచి లంక వరకూ శ్రీ రాముడు నిర్మించిన వారధిని చూసి విస్తుపోయాడు. అయితే వంతెన నిర్మాణానికి కోతుల సాయం తీసుకోవాడం మాత్రం అర్జునుడికి నచ్చలేదు. 'గొప్ప ధనుర్విద్యా నిపుణుడైన శ్రీ రామచంద్రుడు బాణాలతో వంతెన నిర్మించుకోవలసింది' అనుకున్నాడు. సముద్ర తీరాన కూర్చుని రామాయణం పఠిస్తున్న ఒక పండితుడి దగ్గరకు వెళ్ళి ఇదే ప్రశ్న వేశాడు. అయినా సరైన సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడొక కోతిపిల్ల వచ్చి "శ్రీ రాముడు బాణాలతో వంతెన నిర్మిస్తే, కోతులన్నీ దాని మీదనుంచి నడిచివుంటే ఆ వారధి ఆనాడే కుప్పకూలి వుండేది" అని సమాధానమిచ్చింది.

"శ్రీ రాముడు బాణాలతో వంతెన నిర్మిస్తే కోతుల బరువుకే అది కూలటమా!" అని సవ్యచాచి బిగ్గరగా నవ్వాడు. పిల్లకోతికీ, అతనికీ మధ్య వాదోపవాదం చెలరేగింది.

" రాముడి సంగతి అలా వుంచు. నేను బాణాలతో వంతెన కడతాను. నువ్వు పడగొట్టగలిగితే నేను అగ్నిలో దూకి ప్రాణాలు విడుస్తాను. నేను జయిస్తే ఎప్పటికీ మీ వానరజాతి అంతా నాకు బానిసలుగా, సేవకులుగా వుండాలి. సరేనా?" అన్నాడు.

సరేనంది మర్క్టటం.

అర్జునుడు బాణాలతో వంతెన ఏర్పరిచాడు. కోతి అడుగు పెట్టగానే అది పుటుక్కుమంది. మళ్ళీ వంతెన కట్టాడు. మళ్ళీ కూలిపోయీంది. అర్జునుడు మంట చేసి ఆ జ్వాలల్లోకి దూకటానికి సంసిద్ధుడయ్యాడు. ఇంతలో ఒక బాలుడు వచ్చి, "న్యాయమూర్తిగా వ్యవహరించే పెద్ద మనిషి లేకుండా మీరు వేసుకున్న పందెం ధర్మసమ్మతం కాదు. నీ ఆత్మ త్యాగం చెల్లదు" అన్నాడు అర్జునుడితో.

అర్జనుడు అతని మాటలు వినకుండా మంటల్లోకి దూకబోతుండగా "సరే, మరోసారి పందెం కాయండి, ఈసారి నేను న్యాయం చెబుతాను. అప్పుడు కూడా ఓడిపోతే మీ యిష్టం" అన్నాడు బాలుడు. వానరం,అర్జునుడు అందుకు సరేనన్నారు.

అర్జునుడు మళ్ళీ వంతెన నిర్మించాడు. పిల్లకోతి చక చకా ఎక్కి నిలబడింది. ఈ సారి వంతెన చెక్కుచెదరలేదు. పిల్లకోతి శరీరాన్ని పెంచింది. పర్వతమంత ఎత్తు ఎదిగింది. అయినా వంతెన తొణకలేదు. కోతికి అర్ధమైంది "రామచంద్రప్రభో!" అంటూ వెళ్ళి బాలుడికి పాదాభివందనం చేసింది. "శ్రీకృష్ణా!" అంటూ వెళ్ళి పార్ధుడు బాలుడి పాదాలు పట్టుకున్నాడు.

పిల్లవాడు చిరునవ్వు నవ్వుతూ ఇద్ధర్న్నీ లేవనెత్తి "ఇకమీదట అర్జునుడి పతాకం మీద నీ గుర్తు వుంటుంది" అని కోతిని ఆశీర్వదించాడు.
Read More

శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు. దుష్కర్మ ఫలితము -

శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు.

దుష్కర్మ ఫలితము -

పూర్వకాలమున ఒకానొక పట్టణ ప్రాంతమున గజదొంగ ఒకడు కాపురముండెను. అతడు దొంగతనమున ఆరితేరినవాడు. ప్రజల సొత్తు క్రమముగ హరించి, దారి దోపిళ్లు చేసి, పలువురను వధించి ఎన్ని పర్యాయములో జైలుశిక్ష అనుభవించినవాడు. ఆతని హృదయమున దయాదాక్షిణ్యములకు చోటేలేదు. అతనికి రాత్రి పగలువంటిది. నిర్భయముగ భీకరారణ్యములందు, నిర్జన పర్వతప్రాంతములందు నిశీథసమయమున సంచరించుచుండెను. అమాయకులను దోచుకొనుటలో అందెవేసినచేయి అతడు. ఈ ప్రకారముగ అతడు తన జీవితమును భ్రష్ఠ మొనర్చుకొనుచు, పాపమును మూటగట్టుకొనుచుండెను.

ఇట్లుండ ఒకనాడు ఒకానొక హరికథ జరుగుచుండగా, జనులు తండోపతండములుగ అచటకు వచ్చి నిశ్చలభక్తితో భగవత్కథాశ్రవణము గావించుచుండగా, తాళమృదంగాదులు భక్తుల వీనులకుసోకి తన్మయ మొనర్చుచుండగా, ఆ వేడుక గాంచుటకై వచ్చిన జనులమధ్య ఆ దొంగ కొద్దిసేపు కూర్చుండెను. అత్తరి ధర్మమును గూర్చిన ప్రసంగము నడుచుచుండెను. అమూల్యమైన మానవ జీవితమును పాపభూయిష్టమైన కార్యములందు వ్యర్థము చేసినచో, తత్ఫలితముగ జీవుడు ఘోరయమయాతలను అనుభవించవలసి వచ్చునను సిద్ధాంతమును కథకుడు మనోరంజకముగ ప్రతిపాదించుచుండెను. ఆ వాక్యములు వినగనే తస్కరుని హృదయమందు ఒకింత పరిణామము కలుగ నారంభించెను. " ఈ పాపపు బ్రతుకేల? జానెడు పొట్టకొరకై అవినీతికరములైన కార్యముల నాచరించుట సిగ్గుచేటు. భవిష్యత్కాలమున ఏది శ్రేయమును ఒనగూర్చునో, ఏది శాశ్వతసుఖమొసంగునో దానినే ఆశ్రయించవలెనుగాని నీచకార్యములకు గడంగి ఒకింత ప్రాపంచిక సుఖమును తాత్కాలికముగ సంపాదించుటకై యత్నింపరాదు. పాపముయొక్క భయంకర పరిణామములను ఇప్పుడే యోచించుకొని సత్ఫథమున జనుటకై కృతనిశ్చయులు కావలయును - అని ఈ ప్రకారముగ ఆ చోరశిఖామణి తనలో తాను వితర్కించుకొనుచుండెను.

కాని మాయ బలీయమైనది. ఘనవాసనలు తొలగుట కష్టము. అవి యున్నచోట మందవైరాగ్యములు పనిచేయవు. బహుకాలము చిత్తమున ఘనీభవించియున్న పాపసంస్కారములు అకస్మాత్తుగ తొలగుట మాటలా? అవి ఒక రాగాన జీవుని వదలవు. పెద్దల సహవాసముచే ఒకింత పరమార్థ గంధము అంటినను అది నిలుచుట కష్టము. వాసనాప్రాబల్యముచే ప్రాతసంస్కారములు జనులందు ఎగిరెగిరి పడుచుండును. అదేవిధముగ మన గజదొంగకును హరికథా శ్రవణముచే ఒకింత ధర్మబుద్ధి ఉదయించినను బహుకాలము చిత్తకుహరమున రూఢిపడియున్న దొంగబుద్ధి అతనిని పూర్తిగ విడువలేదు. అందుచే అతడొక నిశ్చయము కావించుకొనెను. "ఇప్పటికి నా జీవితమున ఎన్ని వందల పర్యాయములో దొంగతనము చేసితిని. దొంగతనము పాపపు విషయము అని ఇపుడు ఖాయమైపోయినది. ఇకమీదట అట్టి పాపకృత్య మెన్నడును చేయరాదను సంకల్పముకూడ నాయందు కలుగుచున్నది. కాని పొరపాటు బహుకాలగ్రహపాటుచే అలవాటుగా మారి యున్నది. కాబట్టి ఒక్కసారిగా అమాంతముగ ఈ దుర్వ్వసనమును వదలలేకున్నాను. అందుచేత ఇప్పుడు ఒక్క పర్యాయము మాత్రము ఒకానొక పెద్దదొంగతనము చేసి ఇక మీదట దానిని పూర్తిగ మానివేసెదను. లోకమున అందరికంటె శ్రీమంతుడు రాజు. కాబట్టి నేటిరాత్రి రాజుగారి ఇంట్లో దొంగతనము చేసి, అదియే నా జీవితములో చివరి దొంగతనమని భావించి, ఇకమీదట దానికి భరతవాక్యమును పలికెదను.

అని ఈ ప్రకారముగ నిశ్చయించి ఆ తస్కరశిరోమణి ఒక జ్యోతిష్యుని యొద్దకు వెళ్లి "మహాత్మా! రాజుగారింటియందు దొంగతనము చేయుటకు ఒక చక్కని ముహూర్తమును, తాము నిర్ణయించి చెప్పవలెను. అందులకు యోగ్యమగు కట్నమును చెల్లించెదను" - అని పలుకగా జ్యోతిష్యుడు కన్నెర్రచేసి, "ఓయీ! మేము పెండిండ్లకు, గృహ ప్రవేశములకు లగ్నములు పెట్టువారమే కాని దొంగతనములకు కాదు. నీ వాక్యములను ఎవరైన వినినచో నిన్ను, నన్ను కూడ శ్రీకృష్ణజన్మ స్థానమునకు తీసికొని వెళ్లెదరు. కావున ఇక నీ ప్రసంగమును కట్టిపెట్టి శీ్ఘ్రముగ ఇచ్చోటు వదలి పొమ్ము" అని గద్దించి చెప్పెను. వెంటనే గజదొంగ జ్యోతిష్యుని చెవిలో ఏదియో రహస్యముగ చెప్పెను. ఆ మాటలు వినగానే జోతిష్యుడు పరమానందముతో చిందులు త్రొక్కుచు తనయొద్దనున్న జ్యోతిష్య గ్రంథము లన్నిటిని తిరుగవేయదొడగెను. జ్యోతిష్యుని చెవిలో దొంగ చెప్పినది - "చెరిసగము స్వాహా" అను యుక్తివాక్యము. అనగా "ఓ జ్యోతిష్కుడు గారూ! రాజుగారింట్లో దొంగలించిన ధనములో నీకు సగం, నాకు సగం." ఆ వాక్యము వినగనే సిద్ధాంతి ఆనందడోలికలలో ఊగులాడుచు, తనకు రాజుగారి సంపదలో కొంతభాగము తప్పక రానున్నదని సంతసించి, తిథి వార వర్జ్యములను లెక్కగట్టుచు ఒక చక్కనిముహూర్తమును నిశ్చయించి దొంగకు చెప్పెను. "నేటిదినము అర్థరాత్రి 12గం||ల 9 నిముషములకు నీవు రాజుగారింట్లో ప్రవేశించినచో అద్భుతమగు కార్యఫల్యము సిద్ధించును." అని సిద్ధాంతి పలుకగా దొంగ ఆ సమయమును గుర్తుపెట్టుకొని వెడలిపోయెను.

అది నిశీథసమయము, అర్థరాత్రి సమీపించుచుండెను. అంధకారము నలుదిసల దట్టముగా వ్యాపించియుండెను. రాజభవనమున అందరును గాఢనిద్రలో నుండిరి. ఆ ముహూర్తబల మేమియోకాని, రాజప్రసాదముయొక్క ద్వారపాలకులు కూడ అత్తరి నిద్రలో తన్మయులై యుండిరి. అందుచే దొంగ నిరాకంటముగ లోనికి ప్రవేశింపగల్గెను. జాగ్రత్ర్పపంచము యొక్క స్పృహయే ఎవరికిని లేనందున దొంగ నిరాఘాటముగ తనపని సాగించుకొని పోవుచుండెను. తాను తెచ్చిన సంచులనిండా బంగారపు పాత్రలను, విలువగల ఆభరణాదులను వేసికొని ముటగట్టుచుండెను. మరల ఇట్టి సుముహూర్తము, ఇట్టి మహదవకాశము దొరకుట దుర్లభమని భావించి దొంగ చాలసేపు దొంగతనను చేయనారంభించెను. ఇంతలో తెల్లవారెను. రక్షకభటులు నిద్రలేచి దొంగను పట్టుకొనిరి. వానిని పాశములచే బంధించివైచి రాజుగరి యొద్దకు గొనిపోయిరి. నృపాలు డంతయు విచారించి వీపుపై బెత్తములతో నూరుదెబ్బలు అతనిని కొట్టునట్లు ఆజ్ఞాపించెను.

రాజాజ్ఞ ననుసరించి భటు లాతనిని దూరముగ తీసికొని వెళ్లి వీపుపై ప్రహారములు సల్పుచు దెబ్బలకు లెక్క పెట్టుచుండిరి. ఏబది దెబ్బలు తినిన మీదట దొంగ భటులతో 'ఓయీ! ఇక నన్ను కొట్టవద్దు. నా భాగస్తుడొకడున్నాడు. తక్కిన యాభైదెబ్బలు అతనిని కొట్ట వలయును. మేము చేసికొనిన ఒడంబడిక ప్రకారము సగము ఆస్తి అతనికి దక్కవలయును!' ఆ వాక్యములను వినినతోడనే భటులు నివ్వెరపోయి, జరిగిన వృత్తాంతమంతయు తెలిసికొని, దొంగతనమునకు లగు పెట్టిన జ్యోతిష్యుని చెవి మెలిపెట్టి అచటకి తీసికొనివచ్చి వీపు వంచి తక్కిన యాభైదెబ్బలు అతనిచే తినిపించిరి. పాపమార్గమును ప్రోత్సహించిన కారణముచే పాపఫలితమగు దుఃఖమును జ్యోతిష్కు డనుభవింప వలసివచ్చెను.

కర్తా కారయితా చైవ ప్రేరకశ్చనుమోదకః |

పుణ్యకార్యే పాపకార్యే చత్వార స్సమభాగినః ||

అనునట్లు పుణ్యకార్యమందుగాని, పాపకార్యమందుగాని చేసినవాడు, చేయించినవాడు, ప్రోత్సహించినవాడు, ఆమోదించినవాడు - నలుగురు కూడ సమానముగ ఫలితమును బొందుదురు. పుణ్యకార్య తత్పరులు సుఖమును సమానముగ పంచుకొందురు. పాపాచరణ శీలురు దుఃఖమును సమానముగ పంచుకొందురు. కథయందు దొంగతనము చేసిన గజదొంగ దొంగతనమును ప్రోత్సహించిన జ్యోతిష్కుడు ఇరువురును శిక్షను సమానముగ అనుభవించిరి. కాబట్టి పాపకార్యముల నెవరును చేయరాదు. వానిని ప్రోత్సహించను రాదు. దుష్కర్మలయొక్క దారుణ ఫలితములను ముందుగనే ఊహించి ఆ పాపకర్మలకు శాశ్వతముగ తిలోదకము లొసంగవలెను. కర్మ సిద్ధాంతము అప్రతిహతమైనది. కావున జీవుడు తాను చేయుకర్మ పవిత్రవంతమై, దైవగంధయుతమై, పాపరహితమై, పరోపకారయుక్తమై యుండులాగున చూడవలెను. అపుడే జీవితము చక్కగ రాణించును. భగవదను గ్రహమున్ను జీవునకు సంప్రాప్తమగును. మానవత్వము సార్థకమగుట కిట్టి సదాచారము జనులాశ్రయించవలెను. దుష్కృత్వములను ఏకాలమందును దరికి జేర్చరాదు. సంసారదుఃఖ మంతరించుట కిదియే ఏకైక మార్గము.

నీతి: పాపము యొక్క ఫలితము దుఃఖమని యెరిగి పాప కర్మను లనలేశమైనను చేయరాదు.
Read More

గురు దక్షిణ -శ్రీ మహాభారతం

గురు దక్షిణ -శ్రీ మహాభారతం
ద్రోణుడు పరుశురాముడి శిష్యుడు. ఆయన దగ్గర శస్త్రాస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నాడు. భీష్ములవారు ద్రోణాచార్యుడి ధనుర్విద్యాశక్తిని గురించి విని ఆయనను పిలిపించి కురుపాండవులకు శిక్షణ ఇప్పించాడు.

హస్తినాపురంలో ద్రోణాచార్యులు ధనుర్విద్య నేర్పుతున్న సంగతి ఆ నోటా ఆ నొటా అందరికీ తెలిసింది. కర్ణుడు కూడా విద్యాభ్యాసం కోసం వచ్చాడు.

అందరూ ఎంతో శ్రమపడి విద్య నేర్చుకుంటున్నా, అందరికంటే దీక్షగా అర్జునుడు చేసే సాధన ఆచార్యునికి సంతోషం కలిగించింది. అందుకని మరింత ఓపికతో, ప్రేమతో అతనికి పాఠాలు చెప్పావారు. ఒకనాడు భోజన సమయంలో పెనుగాలికి దీపం ఆరిపోయింది. అయినా అలవాటు ప్రకారం అర్జునుడు భోజనం ముగించి చీకటిలో కూడా విద్యాభ్యాసం ఆరంభించాడు. నిద్రపోతున్న గురువుగారు అర్జునుడి ధనుష్ఠంకారం విని లేచాడు. శిష్యుడి ఏకాగ్రతకు, దీక్షకు పరవశించి గాఢాలింగనం చేసుకుని " అస్త్రవిద్యలో నీ అంతటివాడు వండడు" అని వెన్ను తట్టారు.
రోజులు గడుస్తున్నాయి.

కురుపాండవుల విలువిద్యాశక్తిని పరిశీలించేందుకు ద్రోణాచార్యులవారు ఒకనాడు ఓ పరీక్ష పెట్టారు.ఒక పిట్ట బొమ్మని తయారు చేయించి దానిని ఒక చెట్టు చిటారుకొమ్మకు కట్టి శిష్యులందరినీ పిలిపించారు. ముందుగా ధర్మరాజును పిలిచి "చిటారుకొమ్మన పక్షిని చూశావా? నేనూ, నీ సోదరులూ, చెట్టూ కనిపిస్తున్నాయా?" అని అడిగారు. అన్నీ చూస్తున్నానన్నాడు ధర్మరాజు.అలాగే దుర్యోధనాదులందరినీ పిలిచి అడిగాడు.అందరూ గొప్పగా తలలూపారు.చివరికి అర్జునుడ్ని పిలిచి అడిగితే "ఆచార్యా! పక్షి తప్ప మరేమీ కనిపించడం లేదు నాకు" అన్నాడు.

"ఆ పక్షి అవయవాలు ఎలా వున్నాయి?" గురువుగారు మరో ప్రశ్న వేశారు.
"దాని శిరస్సు తప్ప మరే అవయవమూ నా దృష్టిలో లేదు" అన్నాడు అర్జునుడు.
దాని శిరస్సు పడగొట్టమన్నాడు ద్రోణుడు.అనటమే ఆలస్యం- అర్జునుడి ధనస్సు నుండి బాణం దూసుకుపోయింది. పక్షి తల నేల రాలింది.ద్రోణుడు శిష్యుడ్ని గాఢాలింగనం చేసుకున్నాడు.అర్జునుడు గురువుగారికి పాదాభివందనం చేశాడు.

అయితే, ఆ రోజుల్లోనే అర్జునుడికి దీటైనవాడు మరొకడు ధనుర్విద్యలో ఆరితేరాడు. అతను హిరణ్యధన్వుడనే ఎలుకరాజు కుమారుడు ఏకలవ్యుడు. అతను ధనుర్విద్య నేర్పమని ద్రోణాచార్యులవారిని బ్రతిమాలితే ఆయన తిరస్కరించాడు. అయినా బాధపడక గురువుగారి పాదాలకు నమస్కరించి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళాకా ద్రోణుని విగ్రహం ఎదుట వుంచుకుని, ఆ ప్రతిమనే గురువుగా భావించి పూజిస్తూ ధనుర్విద్య అభ్యసించటం మొదలు పెట్టాడు.

ఒకనాడు కురుపాండవులు వేటకు వెళ్ళి అడవి జంతువులను సంహరిస్తుండగా వారి వేటకుక్క ఏకలవ్యుడ్ని చూసి మొరిగింది. అది నోరు తెరచి మొరుగుతున్న క్షణంలో ఏకలవ్యుడు ఒకేసారి దాని నోట్లోకి ఏడు బాణాలు వదిలాడు.అది అలాగే పాండవుల దగ్గరికి వెళ్ళింది.పాండవులకు ఆశ్చర్యం కలిగింది.

అంతటి విలుకాడెవరా అని వెదికి వెదికి చివరకు ఏకలవ్యుడని తెలుసుకున్నారు. కుతూహలం చంపుకోలేక "నీ గురువు పేరేమిటి?" అని అడిగారు పాండవులు. "ద్రోణాచార్యులు" అని వినయంగా సమాధానం చెప్పాడు అతను. అతను కూడా ద్రోణుని శిష్యుడే అని తెలియగానే హస్తినాపురం వస్తూనే అర్జునుడు నేరుగా గురువుగారి దగ్గరకు వెళ్ళాడు. "ఆర్యా! మీ శిష్యులలో నన్ను మించినవాడు లేడన్నారు. కాని మీ శిష్యుడు ఏకలవ్యుడు విలువిద్యలో నాకంటే ఆరితేరాడు" అనగా, ద్రోణుడు అర్జునుడితో అడవికి వచ్చి ఏకలవ్యుణ్ణి చూశాడు. ఆ వీరుడు ద్రోణుడికి నమస్కరించి గురుదక్షిణగా ఏం కావాలన్నా యిస్తానన్నాడు. వెంటనే కుడిచేతి బొటనవేలు కోసి యిమ్మన్నాడు. ఏకలవ్యుడు సంతోషంగా గురువు కోరిన ప్రకారం దక్షిణ అర్పించాడు.

"నిన్ను మించిన విలుకాడు ఉండటానికి వీల్లేదు" అని ద్రోణుడు అర్జునుడికి చేసిన వాగ్ధానం కోసం ఏకలవ్యుని అంగుష్ఠం గ్రహించి తిరిగి వచ్చాడు.
Read More

కాశికి వెళ్ళినప్పుడు చూడండి

కాశికి వెళ్ళినప్పుడు చూడండి  అద్బుత దేవాలయం మీద మసీద్ మనలను వెక్కిరిస్తూ కనబడుతుంది ... మనసుని చంపుకుని ఈ దేశం లో హిందువులకు ఈ గతి పట్టించిన వారి మీద ఎలాంటి కోపమైన వస్తే ఎందుకు వస్తుందో ,వచ్చిందో ప్రశ్నిoచుకుని ఏమి చేయాలో కార్యరూపం ఇవ్వండి .. లేక పోతే నీకు నువ్వే నిత్యం మోసం చేసుకునే ఒక ఆత్మవంచనకు ప్రదముడి గా నిలుస్తావు ఇది వేలాది ఏళ్ల చరిత్ర వున్న''కాశి విశ్వేశ్వర దేవాలయం '' కాని అక్కడ శివుడు గేంటి వేయబడి ఇంకో గుడి లో కొలువయ్యాడు ..కాని దానిని ఆక్రమించిన ముస్లిం లు ఇంకా నమాజు చదువుతూ మసీద్ నిర్వహిస్తున్నారు .. వేలాది దేవాలయాల నడుమ 5 పూట ల నమాజు వినవలసి వస్తుంది ..దానికి ప్రబుత్వ పహారా .. కించిత్ సిగ్గు కూడా లేకుండా కుహనా లౌకుక్క వాదులు నిజాలను వెక్కిస్తూనే వున్నారు .జాగొ భారతీయుడా ... నీ మానసిక బలహీనత ప్రపంచం లో నీ శక్తిని హేళన చేయబడుతుంది ... ఇంకా ఎందుకు నిద్ర ..లే

Read More

ధ్రువ అరుంధతి నక్షత్రాల దర్శనము

ధ్రువ అరుంధతి నక్షత్రాల దర్శనము



Read More

పరశురాముడు -శ్రీ మహాభారతంలో జరిగిన విషయములు

పరశురాముడు -శ్రీ మహాభారతంలో జరిగిన విషయములు

పరశురాముడి చరిత్ర చాలా చిత్రమైనది. పరశురాముడి తాత బుచీకుడనే ఋషి. ఆయన గాధిరాజు దగ్గరకు వెళ్ళి రాకుమారి సత్యవతిని తనకిచ్చి పెళ్ళి చేయమని కోరాడు. తాపసికి పిల్లనివ్వటం ఇష్టం లేక, నల్లటి చెవులున్న తెల్లటి గుర్రాలను వేయింటిని తెచ్చి కానుకగా ఇస్తే తన కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తానని షరతు పెట్టాడు గాధిరాజు. బుచీకుడు ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుని అశ్వసహస్రాన్ని సాధించి తెచ్చి సత్యవతిని పెళ్ళిచేసుకన్నాడు.

తరువాత ఒకసారి గాధిరాజదంపతులు పుత్రసంతానం కోసం ఏమేమి పూజలు చేయాలో చెప్పమని బుచీకుడ్ని అర్ధించాడు. అప్పుడాయన రెండు రకాల హోమద్రవ్యాలు తయారు చేసాడు.

" ఇదిగో చూడు! ఈ హవ్యం తింటే క్షత్రియ నాశకుడు, అజేయుడు అయిన క్షత్రియ కుమారుడు పుడతాడు. ఇది మీ అమ్మకు ఇవ్వు. ఇలా చూడు, ఈ హవ్యం నీ కోసం ప్రత్యేకంగా తయారుచేసాను. ఇది తింటే తపస్సు, శమదమాలు గల ఉత్తమ ద్విజుడు పుడతాడు" అని భార్యతో చెప్పి బుచీకుడు స్నానానికి వెళ్ళాడు.

అతను వెళ్ళిన కాసేపటికి అత్తమామలు రానే వచ్చారు. సత్యవతి తల్లికి భర్త చేసిన హవ్యాలు చూపించింది. వాటి ప్రభావం వర్ణించింది. ఆమె సంతోషించి శుచిగా స్నానం చేసి వచ్చి పొరపాటున తాను సేవించవలసిన హవ్యం కూతురికి ఇచ్చి, కూతిరి వంతు హవ్యం తాను తిన్నది. బుచీకుడు ఆశ్రమానికి వచ్చి దివ్యదృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు.

" ఈ పొరపాటు వల్ల నీ తల్లికి బ్రహ్మతేజం గల పుత్రుడు , నీకు పరమ క్రూరుడయిన కొడుకు పుడతారని" బుచీకుడు భార్యతో చెప్పాడు.

సత్యవతి బాధపడింది. బుచీకుడు జాలిపడి ఆ క్రౌర్యం తన మనుమడికి వచ్చేటట్టు అనుగ్రహించాడు.

బుచీకుని హోమద్రవ్య ఫలంగా గాధిరాజుకు జన్నించిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు.

బుచీకిని కొడుకు జమదగ్ని మహాముని. అతనికి పరశురాముడు పుట్టి క్రూరత్వానికి మారుపేరై సంహారకాండ కావించాడు.

ఒకప్పుడు పరశురాముడి తల్లి రేణుకాదేవి చిత్రరధుడనే గంధర్వున్ని చూసి లిప్తకాలం మోహపడింది.

అందుకు జమదగ్ని ఆగ్రహించి భార్యను చంపవలసిందిగా అక్కడ వున్న కుమారుల్ని ఆదేశించాడు. వాళ్ళు ఆ పని చెయ్యలేమన్నారు. అంతలో పరశురాముడు అక్కడికి వచ్చాడు. కోపంతో కణకణలాడుతున్న తండ్రిని సంగతేమిటని అడిగాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం తల్లినీ, సోదరుల్నీ పరశువుతో నరికి చంపాడు. ఆ తరువాత, శాంతించిన తండ్రి అనుగ్రహంతో మళ్ళీ వారందరినీ బ్రతికించుకున్నాడు.

వీరాధివీరుడు కార్తవీర్యార్జునుడు హైహయ వంశీయుడు, మాహిష్మతీ పురాధీశుడు. వెయ్యి చేతులున్నాయతనికి. అగ్ని దేవుడు వెళ్ళి అడిగితే గిరులూ, నగరాలూ, అరణ్యాలూ, గ్రామాలూ, కొండల కింది కుగ్రామాలూ ఆహారంగా ఇచ్చాడాయనకు. అవన్నీ దహిస్తూ, ఒకనాడు, వశిష్టుడు లేని సమయంలో, ఆయన ఆశ్రమం వున్న అరణ్యాన్ని దహించసాగాడు అగ్నిదేవుడు . ఆ అగ్నిని రక్షిస్తూ కాపలా కాస్తున్నాడు కార్తవీర్యుడు. ఇంతలో వశిష్టుడు వచ్చాడు. " ఇతర వనాలతో సమానంగా భావించి నా తపోవనాన్ని దహింపచేశావు. నీ సహస్ర బాహువులు పరశురాముడి చేత నరకబడుగాక" అని శపించాడు.

ఒకనాడు పరశురాముడు లేని సమయంలో కార్యవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. తన వద్ద ఉన్న కామధేనువు దయతో రాజపరివారానికి షడ్రసోపేతంగా విందు చేశాడు మహర్షి. రాజు ఆ గోవును తన కిమ్మన్నాడు. మహర్షి కాదనేసరికి బల ప్రయోగంతో కార్యవీర్యార్జునుడు ధేనువును మహీష్మతీ పురానికి తీసుకెళ్లాడు.

పరశురాముడికి సంగతి తెలిసింది. కోపోద్రిక్తుడై కార్యవీర్యార్జునుడి మీదకి దండెత్తి వెళ్ళి అతని వేయి చేతులూ ఖండించి శిరచ్చేదం చేశాడు.

అందుకు ఆగ్రహోదగ్రులైన కార్యవీర్యుడి కొడుకులు పదివేల మందీ పరశురాముడు లేనప్పుడు దండెత్తి వచ్చి, జమదగ్నిని చంపి పగ తీర్చుకున్నారు.

పరశురాముడు రాగానే జరిగినదంతా చెప్పి భోరున ఏడ్చింది తల్లి రేణుకాదేవి.

పరశురాముడు మాట్లాడలేదు.

గొడ్డలి చేత పట్టుకున్నాడు.

ఆమడ దూరానికో అడుగు వేస్తూ కదలివెళ్ళాడు.

మాహీష్మతీపురం ఒక్కటే కాకుండా మారుమూల ఉన్న పల్లెలతో సహా వెదకి వెదకి గర్భాలలొ వున్న పిండాలతో సహా క్షత్రియులందర్నీ నాశనం చేశాడు.

తరువాత అశ్వమేధయాగం చేసి భూమినంతటినీ కశ్యపమహర్షికి దక్షిణగా ఇచ్చాడు. అప్పటినుండి భూమికి 'కశ్యపి' అనే పేరు వచ్చింది.

"భూమిని నాకిచ్చేశావు. ఇంక దీని మీద హక్కు లేదు నీకు. దక్షిణ సముద్రతీరానికి వెళ్ళు" అన్నాడు కశ్యపుడు. పొరపాటున తప్పించుకున్న రాజవంశపు మొలకలు ఏమైనా మిగిలితే వాటిని రక్షించవచ్చన్న ఉద్ధేశంతో ఆయన అలా ఆదేశించాడు.

సరేనన్నాడు పరశురాముడు.

అతనికి భయపడి దక్షిణ సముద్రం చీలి చాటంత ప్రదేశాన్ని ఆయనకు సమర్పించింది.

క్షత్రియులు లేకపోవటం వల్ల మిగిలిన జాతులు అవధులు దాటి ప్రవర్తించసాగాయి. ఆరాజ్యకత్వ దోషంతో ధర్మకాంతి క్షీణించింది. అధర్మాన్ని సహించలేక భూమి పాతాళానికి కృంగిపోతుంటే కశ్యపుడు తన తొడ ఆధారంగా చేసి భూమిని నిలబెట్టాడు. ఉరుములతో ఎత్తబడినందుకే దానిని 'ఉర్వి' అన్నారు.

"మహాత్మా! పరశురాముని బారినుంచి కొందరు రాజకుమారుల్ని రక్షించి నాలో దాచుకున్నాను. వాళ్ళందరూ ఉత్తమ జాతి క్షత్రియులే. వాళ్ళను పిలిపించి నాకు అధిపతుల్ని చేస్తే నేను సుఖంగా ఉంటాను" అంది భూదేవి.

కశ్యపుడు వాళ్ళందర్నీ పిలిపించి ఆమె చెప్పినట్లే అభిషిక్తుల్ని చేశాడు.

నేలతల్లి సంతోషించింది.
Read More

నీటి వాక్యం

Read More

శిబి చక్రవర్తి -శ్రీ మహాభారతంలో జరిగిన విషయములు

శిబి చక్రవర్తి -శ్రీ మహాభారతంలో జరిగిన విషయములు

భృగుతుంగ పర్వతం మీద ఓ సారి పెద్ద ఎత్తున యజ్ఞం చేసాడు శిబి చక్రవర్తి. ఎందరో మహర్షులు ఆ యజ్ఞానికి హాజరయ్యారు.

అందరికీ ఘనంగా మర్యాదలు జరిగాయి. అందర్నీ గొప్పగా సత్కరించాడు చక్రవర్తి. ఆయన ఔదార్యానికి, దాననిరతికి తాపసులందరూ ఆశ్చర్యపోయారు.

శిబి చక్రవర్తి దానశీలతను పదే పదే ప్రజలందరూ ప్రశంసించారు. ఈ వార్త ఇంద్రుడి వరకూ వెళ్ళింది.

ఆయన చక్రవర్తి ఔదార్యాన్ని పరీక్షిద్దామనుకున్నాడు.

యజ్ఞ వేదిక మీద కూర్చుని ఉన్న శిబి చక్రవర్తి ఒడిలో ఒక పావురం వాలింది. అది మనుష్యభాషలో, "మహారాజా! రక్షించు! నన్ను ఒక డేగ తరుముకొస్తుంది. నన్ను చంపి తినాలని చూస్తుంది. దాని బారీనుంచి నన్ను కాపాడు, నాకు ప్రాణభిక్ష పెట్టు" అని దీనంగా వేడుకుంది.

శిబి చక్రవర్తి పావురాన్ని ప్రేమగా నిమురుతూ, "నిన్ను కాపాడే బాధ్యత నాది. నీకు ఎవరినుంచీ ప్రమాదం రాదు" అని హామీ ఇచ్చాడు.

పావురం మనసు కుదుటపడింది.

అంతలో అక్కడికి డేగ వచ్చింది.

రాజుగారికి ఎదురుగా ఎత్తయిన చోట వాలి పావురం వైపు కొరకొర చూసింది.

పావురం భయంతో వణికింది.

డేగ కూడా మానవభాషలో, " మహారాజా! ఈ పావురం నా ఆహారం. తప్పించుకుని వచ్చి మీ శరణుజొచ్చింది. దయతో దానిని నాకు వదలిపెట్టండి" అంది. రాజుగారికీ, సభలో వున్నవారికీ అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి పావురమూ, డేగా రెండూ మనుష్యభాషలో మాట్లాడుతున్నాయని.

"ఈ పావురానికి నేను అభయమిచ్చాను. ఆడినమాట తప్పను. అయినా నీకు మాత్రం అంత పట్టుదల ఎందుకు? దీన్ని వదలి మరో ఆహారం వెతుక్కో" అన్నాడు శిబి చక్రవర్తి.

"రాజా! నీవు ధర్మప్రభువువి, న్యాయంగా ఆలోచించు. నేను ఆకలితో ఉన్నాను. ఈ పావురం దొరికినట్లే దొరికి తప్పించుకుని పారిపోయి నీ దగ్గరకు వచ్చింది. నోటి ముందరి ఆహారాన్ని తీసివేయడం ధర్మం కాదు. మహాపాపం కూడా! నా కోరికేమీ అన్యాయమైనది కాదు. పావురాలను డేగలు తినటం సహజమే . ఇప్పుడు ఈ ఆహారం లేకపోతే నేను ఆకలి బాధతో మరణిస్తాను. కనుక నా ఆహారాన్ని నాకు విడిచిపెట్టండి" అంది డేగ.

డేగ మాటలకు సభలోని వారంతా ఆశ్చర్యపోయారు.

శిబి చక్రవర్తి కూడా ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ "ఓ శ్యేనరాజమా! చూడబోతే నీవు ధర్మాధర్మ విచక్షణ తెలిసిన దానిలా ఉన్నావు. శరణన్న వారిని రక్షించటం రాజ ధర్మం. నీ ఆకలిబాధ తీరడానికి ఏ ఆహారం కావాలో చెప్పు. నువ్వు కోరిన ఆహారాన్ని నీకు ఇస్తాను. ఈ పావురాన్ని మాత్రం నీకు వదలిపెట్టను" అన్నాడు.

"నేను కోరిన ఏ ఆహారమైనా ఇస్తారా" అని గట్టిగా అడిగింది డేగ

"నిరభ్యంతరంగా!"

"అలాగైతే రాజా! నీ శరీరంలో ఈ పావురమంత మాంసాన్ని కోసి నాకివ్వు" అంది డేగ.

శిబి చక్రవర్తి నవ్వుతూ,"అలాగే! నీకు సంతోషం కలిగించటం కంటే నాకేం కావాలి?" అని అప్పటికప్పుడు ఒక కత్తి , త్రాసు తెప్పించాడు.

సదస్యులందరూ నిశ్చేష్టులయ్యారు.

శిబి చక్రవర్తి ఆ పదునైన కత్తిని తీసుకన్నాడు. తన శరీరం నుంచి మాంసాన్ని కోసి త్రాసులో వేశాడు. పావురం బరువుకు సరికాలేదు. మరికొంత మాంసం కోసి వేశాడు.అప్పుడూ సరిపోలేదు. మరికొంత జోడించాడు. ప్రయోజనం లేకపోయింది.అది చూడలేక సభలోని వారంతా కళ్ళు మూసుకున్నారు.

ముఖంలో బాధను కనబడనీయకుండా చిరునవ్వు నవ్వుతూ చక్రవర్తి మరికొంత మాంసాన్ని కోసి త్రాసులో వేశాడు. ఫలితం లేకపోయింది. రాజుగారి శరీరం రక్తం ఓడుతుంది.చివరకు తానే వెళ్ళి పళ్ళెంలో కూర్చున్నాడు. తనను తానే దానంగా సమర్పించుకున్నాడు.

అప్పుడు ప్రత్యక్షమయ్యారు - ఇంద్రుడు, అగ్ని

"రాజా! నీ దానగుణం నిరుపమానమైంది. నీవంటి ఉత్తముడు ఇంతవరకూ ఈ పుడమిపై పుట్టలేదు. నీ ఔదార్యాన్ని పరీక్షించడానికి నేను డేగగా, అగ్ని పావురంగా వచ్చాము. నీ కీర్తి చిరస్ధాయిగా వర్ధిల్లుతుంది" అని ఆశీర్వదించాడు ఇంద్రుడు.

ఆయనకు మళ్ళీ తేజోరూపం ప్రసాదించాడు. కృతజ్ఞతగా శిబి చక్రవర్తి చేతులు జోడించాడు. అప్పటికీ, ఇప్పటికీ దానం విషయంలో శిబి చక్రవర్తికి సాటి వచ్చేవారు లేరు.
Read More

కచుడు - దేవయాని -శ్రీ మహాభారతంలో జరిగిన విషయములు

కచుడు - దేవయాని -శ్రీ మహాభారతంలో జరిగిన విషయములు

దేవతలకు గురువు బృహస్పతి . వేదమంత్రాలన్నీ ఆయన గుప్పిట్లో ఉన్నాయి.
రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు. జ్ఞానమంతా ఆయన కాచి వడపోశాడు. యుద్ధంలో చనిపోయిన వాళ్ళందర్నీ శుక్రాచార్యుడు ' మృత సంజీవని ' విద్య వల్ల మళ్ళీ బ్రతికించేవాడు. దానితో మరణించిన రాక్షసులందరూ లేచి కూర్చుని దేవతలతో మళ్ళీ యుద్ధానికి దిగేవారు.ఇలా లాభం లేదనుకుని దేవతలంతా బృహస్పతి కుమారుడైన కచుడి దగ్గరకు వెళ్ళారు.

" నాయనా! నీవు మెల్లగా శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్ళి ఆయన అనుగ్రహం సంపాదించాలి. ఎలాగైనా సరే ఆయన వద్ద ఉన్న మృత సంజీవనీ విద్యను నేర్చుకుని రావాలి" అని బ్రతిమాలారు.కచుడు సరేనన్నాడు.వెంటనే శుక్రాచార్యుని ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళి, " మహాత్మా! నేను అంగీరస మహర్షి మనుమణ్ణి. బృహస్పతి కుమారుణ్ణి. నా పేరు కచుడు . మీ వద్ద శుశ్రూష చేసి విద్య నేర్చుకుందామని వచ్చాను" అన్నాడు.శుక్రాచార్యుల వారికి కచుడి వినయ విధేయతలు నచ్చాయి. వెంటనే శిష్యుడిగా స్వీకరించారు.

అలా శుక్రుడి అనుగ్రహంతో కచుడు ఆశ్రమంలో ఉంటూ, విద్యాభ్యాసంతో పాటు, గురువుగారి కమార్తె దేవయాని చెప్పిన అన్ని పనులూ చేస్తూ ఆమెను ఆటపాటలతో సంతోష పెడుతూ కాలం గడుపుతున్నాడు.

మృత సంజీవనీ విద్య కోసం కచుడు తమ గురువుగారి వద్ద శిష్యుడుగా చేరాడని రాక్షసులు గ్రహించారు. ఒకనాడు కచుడు అడవిలో గురువుగారి ఆవులను మేపుతూ వుండగా అతణ్ణి పట్టుకుని చంపి ముక్కలు ముక్కలు చేసి కుక్కలకూ, నక్కలకూ వేశారు.

ఎంతసేపటికీ కచుడు ఆశ్రమానికి తిరిగి రాకపోయేసరికి దేవయాని కంగారుపడింది. తండ్రి దగ్గరకు వెళ్ళి," నాన్నగారూ చీకటి పడింది. ఆవులు ఇంటికి వచ్చాయి. కాని, ఇంతవరకూ కచుడు రాలేదు. అతనికేదో ఆపద వచ్చి వుంటుంది. అతన్ని మీరే రక్షించాలి" అంది.

శుక్రాచార్యులవారు మంత్రం జపించి," నాయనా కచా! ఎక్కడికి వెళ్ళావు? వెంటనే ఆశ్రమానికి రా!" అని గట్టిగా పిలిచారు. మంత్రప్రభావంతో కచుడు జంతువుల కడుపులు చీల్చుకుని ఎప్పటిలాగా వచ్చి గురువుగారి ఎదుట నిలబడ్డాడు.

" ఏమయింది?" అని అడిగింది దేవయాని.

" ఆవుల్ని తోలుకు వస్తుంటే రాక్షసులు నా చుట్టూ చేరి ' ఎవరు నువ్వు? ' అని అడిగారు. ' బృహస్పతి కమారుణ్ణి ' అని చెప్పాను. వెంటనే నా మీద పడి నన్ను చంపారు" అని చెప్పాడు కచుడు.

ఇంకోసారి, దేవయాని కోసం పూలు తీసుకుని రావడానికి కచుడు అడవికి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ రాక్షసులు అతడ్ని పట్టుకున్నారు. అతన్ని కొట్టి, చంపి శరీరాన్ని పొడి చేసి సముద్రంలో కలిపారు.

కచుడు ఎంతకూ ఇంటికి రాకపోయే సరికి మళ్ళీ దేవయాని తండ్రితో మొరపెట్టుకుంది. మునిపటి లాగే ఆచార్యూలవారు సంజీవనిని ప్రయోగించారు. దాంతో బతికి బయట పడ్డాడు కచుడు.

ఇక లాభం లేదనుకుని ఈసారి రాక్షసులు కచుని శరీరాన్ని కాల్చి, బూడిద చేసి మద్యంలో కలిపి అది తమ గురువుకే తాగమని ఇచ్చారు. ఆ మద్యం శుక్రాచార్యుడు సేవించాడు.

మేతకు వెళ్ళిన ఆవులు తమ దారిన తాము తిరిగి వచ్చాయి. కాని కచుడు రాలేదు. దేవయాని తండ్రిని సమీపించి కంటతడి పెట్టింది.

" అమ్మా! ఇప్పటికి రెండుసార్ల్లు కచుణ్ణి బతికించాను. ఎన్నిసార్ల్లు బతికించినా రాక్షసులు అతనిని హతమార్చాలని పట్టు పట్టినట్లుంది. అయినా ఎవరో మరణిస్తే నువ్వు ఏడవటం ఏమిటి? కాలం ఖర్మం మూడితే ఎవరైనా చావక తప్పదు" అని ఆచార్యుడు కూతుర్ని ఓదార్చాడు.

అయినా సరే, కూతురు మంకు పాట్టు విడువలేదు. కచుడు వచ్చేవరకూ అన్నపానాలు ముట్టనంది. శుక్రాచార్యులవారు గత్యంతరం లేక సంజీవనీ మంత్రం జపించి కచుడ్ని రమ్మని పిలిచాడు. మంత్రబలం వల్ల కచుడికి ప్రాణం వచ్చింది.

" గురుదేవా! అనుగ్రహించండి. నేను తమరి పొట్టలోనే వున్నాను" అన్నాడు. శుక్రాచార్యుల వారికి ఆశ్చర్యం వేసింది. అప్పుడు గర్భస్ధ శిష్యుడు జరిగిన కధంతా గురువుగారికి విన్నవించాడు.

మహానుభావుడూ, మహాతపశ్శాలి అయిన శుక్రాచార్యుడు తన తప్పు తెలుసుకున్నాడు. సురాపానం మూలంగా తను మోసపోయినట్టు గ్రహించాడు. " ఎంతటి దారుణానికైనా ఒడిగట్టించే ఈ మద్యపానాన్ని నేటినుంచి నిషేధిస్తున్నాను. ఎవరైతే జ్ఞానం లేకుండా మద్యపానం చేస్తారో వారి నుంచి ధర్మం తప్పుకుంటుంది. వాళ్ళను అందరూ అసహ్యించుకుంటారు. ఈసడిస్తారు. ఇది నా ఆజ్ఞ . దీనిని ప్రజలందరూ పాటించాలి. పాటించని వాళ్ళు పతనమౌతారు" అన్నారు శుక్రాచార్యులవారు.

" నాయనా! దేవయాని కోసం నేను నిన్ను బతికించాలి. నిన్ను బతికిస్తే నాకు మరణం తప్పదు. ఇందుకు ఒకటే మార్గం. నేను నీకు ఇప్పుడే సంజీవనీ విద్య ఉపదేశిస్తాను. నీవు అది నేర్చుకున్న తరువాత నా పొట్ట చీల్చుకుని బయటకు రా. తిరిగి నీ విద్య వల్ల నన్ను బతికించు" అన్నాడు.కచుడు సరే అన్నాడు. చెప్పినట్లే చేశాడు.

తరువాత చాలా కాలం అక్కడే విద్యాభ్యాసం చేసి గురువుగారి వద్ద సెలవు తీసుకుని దేవలోకానికి బయల్దేరి వెళ్ళాడు.
Read More

సఫల ఏకాదశి
































Read More

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం-శ్రీ మహాభారతంలో జరిగిన విషయములు

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం-శ్రీ మహాభారతంలో జరిగిన విషయములు

చాలా ఏళ్ల క్రితం మన దేశమంతా అరణ్యాలతో నిండి వుండేది. ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణం చెయ్యడమంటే చాలా కష్టంగా వుండేది. ఎందుచేతనంటే ఆ అరణ్యాలు రాక్షసులకు, క్రూరజంతువులకు పునికి పట్టుగా వుండేవి.

దక్షిణ హిందూ దేశంలోని అడవుల్లో వాతాపి, ఇల్వలుడు, అనే ఇద్దరు భయంకరులైన రాక్షసులు నివసిస్తూ వుండేవారు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. మనుష్యులను చంపి తింటుండేవారు. ఆ చంపి తినే పద్ధతి కూడా చాలా చిత్రంగా ఉండేది. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి ఆ అడవి వెంబడి వెళ్ళే ప్రయాణికులని, తన ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని వనయంగా అడిగేవాడు. పాపం వాళ్ళు ఇల్వలుడి మాటలు నమ్మి అతని ఇంటికి వెళ్ళేవారు. వాళ్ళని స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పి వంట చేయడానికని ఇల్వలుడు వంటింట్లో దూరేవాడు. అక్కడ వాతాపిని చంపి ముక్కలు చేసి ఆ మాంసంతో వంటకాలు చేసేవాడు. వంట అయిపోయాకా అతిధుల్ని పిలిచి స్వయంగా వడ్డించేవాడు. ఇల్వలుడు వడ్డించిన పదార్ధాలన్నీ బాటసారులు సుష్టిగా తినేవారు. భోజనం పూర్తి చేసి వాళ్ళు పీటమీద నుంచి లేవబోయే సమయానికి ఇల్వలుడు వాళ్ళముందు నిలబడి, " వాతాపీ! ఓ వాతాపీ! రా! త్వరగా బయటికి రా" అని పిలిచేవాడు. అతిధుల కడుపులో మాంసరూపంలొ వున్న వాతాపి ఈ పిలుపు వినగానే మళ్ళీ ప్రాణం పోసుకుని వాళ్ళ పొట్టలు చీల్చుకుని బయటకు వచ్చేవాడు. పాపం! ఆ అతిధులు పొట్ట పగిలి చనిపోయేవారు. అప్పుడు అన్నదమ్ములిద్దరూ చనిపోయిన అతిధుల మాంసాన్ని లొట్టలేసుకుంటూ తినేవారు.

చాలాకాలం వరకు ఈ మోసాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. కొన్నాళ్ళకు ఈ రహస్యం బయటకు పొక్కింది. అప్పుడు ఆ అరణ్యాలలో వుండే మునులంతా అగస్త్యమహర్షి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు. అగస్త్యమహర్షి గొప్ప పండితుడు, జ్ఞాని. చాలా మంత్రశక్తులు, ఉండేవి ఆయనకు. మహాసముద్రాలను, పర్వతాలను కూడా శాసించగలిగే వాడు. అగస్త్యడు వెంటనే ఇల్వలుడు, వాతాపి ఉండే ప్రదేశానికి బయలుదేరాడు.

మహర్షిని చూడగానే ఇల్వలుడు యధాప్రకారం బ్రాహ్మణ రూపంలో ఎదురు వెళ్ళి ఆ రోజుకు తన అతిధిగా వుండమని కోరాడు. అగస్త్యుడు వెంటనే అంగీకరించాడు. ఇల్వలుడు ఇల్లు చేరగానే వినయంగా చేతులు కట్టుకుని, " మహాత్మా! తమరు స్నానం చేసి జపం చేసుకుంటూ వుండండి. నేను క్షణంలో వంట చేస్తాను" అన్నాడు. తరువాత వంటింట్లోకి వెళ్ళి ఎప్పటిలాగే వాతాపిని చంపి ఆ మాంసంతో వంటకాలు చేశాడు.

తర్వాత ఇల్వలుడు మహర్షిని విందుకు పిలిచాడు. కొసరి కొసరి తను వండిన వంటకాలన్నీ వడ్డించాడు. తను ఏం తింటున్నదీ మహర్షికి తెలియకపోతే కదా!
ఆనందంగా భోజనం చేసి ఎడం చేత్తో పొట్టమీద రాసుకుంటూ మెల్లగా "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం" అనుకున్నాడు.

అది ఇల్వలుడికి వినపడలేదు.ఆయన చెయ్యి కడుక్కోడానికి లేచి నిలబడగానే ఇల్వలుడు " వాతాపీ! ఓ వాతాపీ! బయటకు రా!" అని గట్టిగా పిలిచాడు. కాని ఎంతసేపటికీ వాతాపి బయటకు రాలేదు. ఇల్వలుడికి భయం వేసింది. అగస్త్యుడు చిరునవ్వు నవ్వుతూ " ఏ వాతాపిని నాయనా నువ్వు పిలుస్తున్నావు? నీ తమ్ముడే అయితే అతను ఎప్పుడో నా పొట్టలో జీర్ణమై పోయాడు" అన్నాడు. తన ఎదుట వున్నది అగస్త్యులవారనీ, ఆయనకు మహత్తరశక్తులు ఉన్నాయనీ అప్పుడు అర్ధమయింది ఇల్వలుడికి. ఒణికిపోతూ మహర్షి కాళ్ళమీద పడి " మహాత్మా! దయచేసి నన్ను ప్రాణాలతో విడిచి పెట్టండి. మరెప్పుడూ ఇటువంటి పాపం చెయ్యను" అన్నాడు.తాపసి దయతలచి సరే అన్నాడు.ఇల్వలుడు మరెప్పుడూ ఎవర్నీ చంపనని ప్రమాణం చేసి, ఆ అడివి వదలి పెట్టి వెళ్ళిపోయాడు.

"ఇల్వల" అంటే చెడునడత గలిగన మనసు అని అర్ధం.

"వాతాపి" పేరు సర్వప్రాణుల్నీ హరించేవాడు అనే అర్ధాన్నిస్తుంది. అంటే 'మరణం' అన్నమాట.

ఇల్వలుడనే చెడు మనసు గల వాని జిత్తులు జ్ఞాని అయిన అగస్త్యుణ్ణి ఏమీ చెయ్యలేక పోయాయి.
Read More

నీతి వాక్యం

Read More

అహం వినాశకారి -శ్రీ మహాభారతంలో జరిగిన విషయములు

అహం వినాశకారి -శ్రీ మహాభారతంలో జరిగిన విషయములు

పిల్లలు చిన్న తనం నుంచీ విధేయతలు నేర్చుకోవాలి. మర్యాద తప్పకూడదు. మనకంటే గొప్పవాళ్ళు లేరని విర్రవీగకూడదు. పెద్దల యెడ భయభక్తులు కలిగి ఉండాలి.మనిషిలో గర్వం పెరిగితే ఎప్పుడో ఒకప్పుడు దెబ్బతింటాడు.

భరద్వాజమహర్షి కుమారుడు యవక్రీతుడు. వేద విద్యలన్నీ నేర్చుకున్నాడు. గొప్ప పండితుడయ్యాడు.

' నేను గదా తపస్సు చేసి ఇంద్రుడి వల్ల వరం సంపాదించి ఇంత పాండిత్యం పొందాను ' అని ఎప్పుడూ గర్వపడుతూ ఉండేవాడు. కమారుడి ప్రవర్తన భరద్వాజుడికి నచ్చేది కాదు. తన స్నేహితుడు రైభ్యుడితోను, అతని పిల్లలతోనూ ఏ క్షణాన తగాదా పెట్టుకుని విరోధం తెచ్చుకుంటాడో అని భయపడేవాడు. ఆ భయం కారణంగానే ఒక రోజు భరద్వాజుడు కుమారుడికో కథ చెప్పాడు. అదేమంటే...

అప్పుడెప్పుడో చాలా ఏళ్ళ క్రితం బాలదిహి అనే ఒక ముని ఉండేవాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయనకు ఒక్కడే కొడుకు. పాపం ఆ కొడుకు కాస్తా ఉన్నట్టుండి చనిపోయాడు. దాంతో ఆ ముని చాలా దఃఖపడ్డాడు. ఈ సారి చావు లేని కుమారుణ్ణి పొందాలనుకుని ఘోర తపస్సు చేసాడు.

" మనిషై పుట్టాకా ఎప్పుడో ఒకప్పుడు చనిపోవల్సిందే. అసలు చావే లేకుండా వరం పొందటం కుదరదు. అందుచేత ఈ సారి నీకు పుట్టబోయే కొడుకు ఎన్నాళ్ళు జీవించాలనుకూంటున్నావో చెప్పు, అన్నేళ్ళు ఆయుష్షు ఇస్తాం" అన్నారు దేవతలు.

" సరే! అలాగైతే - అదిగో ఆ ఎదురుగా కొండ ఉందే- అది ఉన్నంతకాలం నా బంగారుకొండ బతికుండాలి" అని బాలదిహి కోరుకున్నాడు. దేవతలు అలాగే వరం ఇచ్చారు. తరువాత వరప్రభావంతో మునికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి "మేధావి" అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచాడు ముని.

' నా ప్రాణానికి ముప్పు లేదు. కొండలాగా స్థిరంగా ఎంత కాలమైనా బతకొచ్చు ' అనే గర్వం కలిగింది మేధావికి. దాంతో పెద్దాచిన్నా తారతమ్యం లేకుండా అందరితోనూ పొగరుగా ప్రవర్తించేవాడు.

ఒకరోజు ధనుసాక్షరి అనే మహాత్ముణ్ణి మేధావి తూలనాడాడు. అతని పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. ధనుసాక్షరి భగ్గున మండిపడి, " నీవు భస్మమైపోతావు పో!" అని శపించాడు.

కాని మేధావికి శాపం తగల్లేదు.

కొండలా ఉన్నాడు.

అప్పుడు ధనుసాక్షరి మేధావికి గల వరాన్ని జ్ఞాపకం తెచ్చుకుని వెంటనే తపోమహిమ వల్ల తానొక అడవి దన్నుగా మారిపోయి కొండను దభీమని ఢీకొట్టి దాన్ని బద్దలు చేసాడు. కొండ చీలిపోతూనే మేధావి తల కూడా రెండు ముక్కలైంది.

ఈ కథ వల్ల మనం తెలుసుకోవలసిన విషయాలు చాలా వున్నాయి.

వరాలు పొందామని ఎప్పుడూ గర్వపడకూడదు ;

పెద్దల్ని యిష్టమొచ్చినట్లు మాట్లాడకూడదు. అందర్నీ గౌరవించడం నేర్చుకోవాలి.

ఇదీ భరద్వాజుడు కొడిక్కి చెప్పింది.
Read More

Thursday, 26 December 2013

కొన్ని నిత్య సత్యాలు

కొన్ని నిత్య సత్యాలు


Read More

ప్రతి హిందువు తెలుసుకోవలసిన చట్టం ...మత పరమయిన చట్టాలు తెలుసుకో, నీ జీవితమును సంతోషముగా మలుచుకో

మత పరమయిన చట్టాలు తెలుసుకో, నీ జీవితమును  సంతోషముగా మలుచుకో

https://fbcdn-sphotos-b-a.akamaihd.net/hphotos-ak-ash4/1479263_334039176734373_98673091_n.jpg
Read More

షిరిడీలో సాయి విగ్రహ ప్రతిష్ఠ చేసిందెవరో మీకు తెలుసా?

షిరిడీలో సాయి విగ్రహ ప్రతిష్ఠ చేసిందెవరో మీకు తెలుసా?
గుజరాత్ లో 1889వ సంవత్సరంలో జన్మించిన స్వామి సాయిచరణ్ మొట్టమొదట సాయిబాబాను తన తండ్రితో కలిసి 1911లో బాబాను దర్శించుకున్నారు. ఒక కుండ చేత్తో పట్టుకుని కుష్ఠురోగులకు సపర్యలు చేస్తూ కనిపించిన బాబాను చూసి ఆశ్చర్యపోయిన ఆనంద్ తండ్రి ఆజ్ఞతో బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు బాబా ఆనంద్ తో ఇలా అన్నారు ... "దేవుడు వున్నాడు ... లేడు అని అనకు''. అటు తరువాత 1912 జులై గురుపూర్ణిమ రోజున బాబా ఆనంద్ కలలో కనిపించి "నువ్వంటే నాకు చాలా ఇష్టం'' అని చెప్పారు. అది మొదలు ఆనంద్ షిరిడీలోనే ఉండిపోయాడు. బాబా భక్తుల దగ్గర దక్షిణ తీసుకోవడాన్ని చాలా సార్లు గమనించాడు. ఆ పరిశీలన, బాబా సాహచర్యంలో ఆనంద్, బాబా జీవితంలో అద్భుతాలు, ప్రబోధాలు పేర్కొంటూ ఒక పుస్తకాన్ని, తాను బాబాకు సన్నిహితంగా వుంటూ పరిశీలించినప్పటి విషయాలను పేర్కొంటూ మరొక పుస్తకాన్ని రచించాడు. బాబా మహాసమాధి అయిన తరువాత సాయి సంస్థానంలోని కార్యకలాపాల్లో ఆనంద్ చురుగ్గా పాల్గొనేవారు. 1954లో షిరిడీ సమాధి మందిరంలో బాబా పాలరాతి విగ్రహ ప్రతిష్ఠ ఆనంద్ చేతుల మీదనే జరిగింది. ఆనంద్ 1963లో సన్యాసం స్వీకరించి స్వామి సాయి చరణ్ ఆనంద్ జీ గా మారి అందరి మన్ననలు పొందారు.





Read More

అల్లూరి సీతా రామ రాజు ఆఖరి చిత్రం. మన మన్యం వీరుని నిజమయిన చిత్రం

అల్లూరి సీతా రామ రాజు ఆఖరి చిత్రం. మన మన్యం వీరుని నిజమయిన చిత్రం 

https://fbcdn-sphotos-e-a.akamaihd.net/hphotos-ak-prn1/q71/1525594_232735986908029_1861998770_n.jpg
Read More

Powered By Blogger | Template Created By Lord HTML