What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 14 May 2014

అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503),వైశాఖ మాసం పౌర్ణమి రోజున ఆయన జన్మించారు.

అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503),వైశాఖ మాసం పౌర్ణమి రోజున ఆయన జన్మించారు. తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు . అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.
కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. (సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉన్నది. ). త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు. అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు. ఈ గ్రంథం 1948లో లభ్యమై ముద్రింపబడింది.

అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారం.

నందవరీకులు క్రీ.శ. 10వ శతాబ్ధంలో కాశినుండి ఆంధ్ర దేశానికి వలస వచ్చిన శుద్దవైదిక బ్రాహ్మణులని పరంపరాయాత ప్రతీత.
నేటి కర్నూలు జిల్లాలోని "నందవరం" అనే గ్రామాన్ని నందుడనే రాజు పాలించేవాడు. ఈ రాజు కాశియాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులు చాముండేశ్వరీ ఉపాసకులు పరిచయం అయ్యారని, ఆ సమయంలో వారణాసిలో క్షామం రాగా ఆ బ్రహ్మణ కుటుంబాలు కొన్ని ఆంధ్రదేశానికి వలసివచ్చి నంద రాజు ఆశ్రయంలో స్ధిరపడ్డారనీ, నందరాజుచే తీసుకొని రాబడిన వైదికిలు కావడంచే నందవైదికులుగా ప్రచారం పొందారని జనవాక్యం. కాలక్రమాన వీరు నేటి కర్నూలు, కడప జిల్లాలో స్ధిరపడ్డారని పరిశోధకులు అభిప్రాయం.

తాళ్ళపాక గ్రామ నామం అన్నమయ్య వంశస్ధులకు ఇంటిపేరుగా నిలిచినది. అన్నమయ్య కూడా నందవరీకుడే. ద్విపద కావ్యం ప్రకారం అన్నమయ్య తాత నారాయణయ్య. చదువు అబ్బక, గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకొన్నాడట. వూరిలో గ్రామ దేవత చింతలమ్మ గుడివద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో మూడవతరంలో హరి అంశతో ఒకబాలుడు జన్మిస్తాడని చెప్పింది అని ప్రతీతి. కడప జిల్లా రాజంపేట తాలూకా పొత్తిపి నాడు మండలం నడిబొద్దున తాళ్లపాక గ్రామం విరాజిల్లుతుండేది.
ఆ గ్రామంలో వెలసిన చెన్నకేశవస్వామి, సిద్ధేశ్వరస్వామి కరుణాకటాక్షములతో ఆ గ్రామజనులు సుఖవంతులై జీవనం సాగించేవారు. ఇచ్చట చెన్నకేశవస్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చెసాడు. సస్యశ్యామలమై విరాజిల్లే ఈ గ్రామం సన్మునులకు, అఖిల దేవతలకు నిజవాసమై వుండేదని అంటారు స్థలగ్యులు.ఈ చెన్నకేశవస్వామిని దేవతలు, ఋషులు, సిద్దులు ప్రతి రోజు పూజిస్తారు. ఈ చెన్నకేశవస్వామి గుడిని ఆశ్రయించుకొని కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు జీవించేవి. ఆ గ్రామ వాసులు తలపక ఇందిరారమణపదైక మానసులుగా జీవనం సాగించేవారు. వాళ్లల్లొ నారాయణయ్య చాల ప్రసిద్దుడు. ఇతని నాలుగోతరంలో మరో నారాయణయ్య వుండేవాడు. అన్నమయ్య పిత్రు పితామహులు నారాయణయ్య, విఠలయ్యలు విష్నుభక్తిరతులై తాళ్ళపాక చెన్న కేశవస్వామిని సేవించుకొంటు జేవితం గడిపేవారు.

ఈ నారాయణయ్య కథ తోనే మన అన్నమయ్య కథ మొదలౌతుంది. నారాయణయ్యకు చిన్నతనంలో ఎంతకీ చదువు రాలేదు. తండ్రి విఠలయ్య నయాన భయాన చెప్పి చూశాడు. లాభం లేక పోయింది. తన వద్ద ప్రయోజనం లేదని ప్రక్కనే వున్న ఊటుకూరులో తన బంధువుల వద్ద వుంచాడు. ఊటుకూరు నేడు కడపజిల్ల రాజంపేట తాలూకాలో ఉన్నది. అక్కడ బళ్ళో ఉపాధ్యాయులు శతవిధాల ప్రయత్నించారు. గురువులు నారాయణయ్యను చతుర్విధ ఉపాయాలకు గురి చేశారు. అయినా బాలునికి చదువుపట్ల శ్రద్ధకలుగలేదు. నారాయుణిని కళ్లల్లో నీళ్లే తప్ప నోట సరస్వతి పలకలేదు. వాళ్లు విసిగిపోయి బాలుని రకరకాల శిక్షలకు గురిచెశరు. చివరకు గురువు నారాయణయ్యను కోదండమున వ్రేలాడదీశారు. కోలగగ్గెర విధించారు. గుంజిళ్లు తీయించారు. కోదండం అంటే దూలానికి తాడు కట్టి వ్రేలాడతీయడం. నారాయాణయ్యను అయ్యవార్లు ఇంతటి కఠిన పరీక్షలకు గురిచెసినప్పటికి నారాయణయ్య లేత మనస్సు గాయపడింది.
నలుగురూ అవహేళన చేస్తున్నారు. సిగ్గుతో, అవమానంతో క్రుంగిపోయాడు. ఇంతకంటె చావు మేలను కున్నాడు. నారాయాణయ్య ఊటుకూరు గ్రామశక్తి అయిన చింతలమ్మగుడి సమీపాన పుట్టలో పాముందని ఎవరో చెబుతుండగా విన్నాడు. నారాయాణుడు ఒంటరిగ గుడి చేరి పుట్టలో చేయి పెట్టాడు. పాము కరవలేదు సరికదా ! నారాయాణయ్యకు త్రికాల వేదినియైన చింతలమ్మ ప్రత్యక్షమైంది.

నారాయాణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఓళ్ళో చేర్చుకొని వూరడించింది."ఎందుకు బాబు ఈ అఘ్హాయిత్యం. నీ మూడోతరంలో గొప్ప హరి భక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి వెళ్ళు,తాళ్ళపాక చెన్నకేశవస్వామే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు" అని నారాయాణయ్యను అనుగ్రహించి అంతర్ధానమైనది. అమ్మవారి ఆదేశం ప్రకారం నారాయాణయ్య తాళ్ళపాకచేరి ఆశ్రితక్లేశనాశకుడైన చెన్నకేశవస్వామిని సేవించి స్వామి అనుగ్రహించే వేదవేదాంగ పారంగతుడై సకలవిద్యలు పొందగలుగుతాడు. సర్వజ్ఞుడని కీర్తి పొందుతాడు. ఈ నారాయాణయ్య కుమారుడే నారాయణసూరి.

అన్నమయ్య తండ్రి అయిన నారాయణసూరి గొప్ప కవి, పండితుడు, సకల విద్యాధురంధరుడుగా ప్రసిద్దికెక్కినవాడు. అన్నమయ్య తండ్రి పేరు 'నారాయణసూరి' గా చిన్నన్న పేర్కొనడాన్నిబట్టి తాళ్ళపాకవారు అన్నమయ్య జననానికి ముందే పండిత వంశస్ధులుగా కీర్తించబడేవారని భావించవచ్చును. నారాయణసూరి ధర్మపత్ని లక్కమాంబ, మహా భక్తురాలు. చెన్నకేశవస్వామి ఈమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడట. భాగవతసేవా పరాయణులైన నారాయణసూరి, లక్కమాంబ లకు సంతానం లేకపోవడం తీవ్రవ్యధకు గురిఅయినారు. ఈ పుణ్య దంపతులు సంతానం కోసం చేయని వ్రతం లేదు, కొలవని దేవుడు లేడు.

"మాకు మంచి కొడుకును ప్రసాదించు స్వామీ" అని ఏడుకొండలస్వామికి మ్రొక్కుకున్నారు. ముడుపులు కట్టుకున్నారు. ఒక మంచిరోజు చూసి ఇద్దరూ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రయాణమయ్యారు. లక్కమాంబ, నారాయణసూరి తిరుమల చేరారు. స్వామి మందిరం ప్రవేశించారు. గరుడగంభం వద్ద సాగిలి మ్రొక్కారు. వాళ్ళకేదో మైకం కమ్మినట్లైంది. కళ్లు మిరుమిట్లు గొలిపే తేజస్సు కనిపించి ధగధగ మెరిసే ఖడ్గాన్ని వాళ్ల చేతుల్లో పెట్టి అద్రుశ్యమైంది. వేంకటేశ్వరస్వామి తన నిజ ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్య దంపతులకు ప్రసాదించాడు. వాళ్ళు పరమానంద భరితులయ్యారు. వేంకటపతిని దర్శించి స్తుతించారు. సంతోషంతో తాళ్లపాకకు తిరిగి వచ్చారు.

ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాధ. కొండలయ్య తాను ధరించే "బిరుదు గజ్జియల ముప్పిడి కఠారాన్ని" వారికందజేశాడట. అలా పుట్టిన శిశువే అన్నమయ్య. లక్కమాంబ గర్భవతి అయింది. వైశాఖమాసం విశాఖ నక్షత్రంలో ఒక శుభలగ్నంలో మూడు గ్రహాలు ఉన్నత దశలో వుండగా నారాయణసూరి, లక్కమాంబలకు నందకాంశమున పుత్రోదయమైనది, మగశిశువు ఉదయించాడు. సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు కడప జిల్లా లోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు.

8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్షనొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడింది. నారాయణసూరి ఆ శిశువునకు ఆగమోక్తంగా జాతకర్మ చేశాడు. "అన్నం బ్రహ్మేతి వ్యజనాత్" అనే శ్రుతి ప్రకారం నారాయణసూరి పరబ్రహ్మ వాచకంగా తన పుత్రునకు అన్నమయ్య అని నామకరణం చేశాడు. అన్నమయ్యకు అన్నమయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నయగురు, అన్నయార్య, కోనేటి అన్నమయ్యంగారు అనే నామాంతరాలు తాళ్ళపాక సాహిత్యంలోను, శాసనాల్లోను కనిపిస్తాయి. శ్రీమహావిష్ణువు వక్షస్ధలమందలి కౌస్తుభమే శఠకోపయతిగా, వేంకటేశ్వరస్వామి గుడి ఘంట వేదాంతదేశికులుగా స్వామి హస్తమందలి నందకమనే ఖడ్గాంశలో పేయాళ్వారులు, అన్నమయ్యలు అవతరించారని ప్రాజ్గ్యుల విశ్వాసం.


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML