What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 28 May 2014

సాక్షాత్తు కైలాస శంకరులే కాలడి శంకరులుగా అవతరించారు

సాక్షాత్తు కైలాస శంకరులే కాలడి శంకరులుగా అవతరించారు. కైలాసమునందుండే శంకరుడెవరున్నారో ఆయనే భూలోకంలో కలియుగంలో శంకరభగవత్పాదుల రూపంలో అవతరించారు.
"నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ. జటాజూటంతో ఉండే పరమేశ్వరుడు వ్యుప్తకేశుడై - ముండిత శిరస్కుడై ఈ భూమిమీద నడయాడాడు. చేతిలో ఒక ఆయుధాన్ని పట్టుకొని ధర్యవ్యతిరేకమైనటువంటి వాళ్ళని చంపడానికి అవకాశమైనటువంటి స్థితి కాదు కలియుగప్రారంభం. మహాభారత యుద్ధం జరిగిన రోజులలో కృష్ణపరమాత్మ ప్రతిజ్ఞచేశాడు. 
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం!
ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే!!
నేను ధర్మాన్ని పాడుచేసేటటువంటి వాళ్ళని మట్టుపెట్టడానికి, ధర్మాన్ని మళ్ళీ సువ్యస్థితం చేయడానికి, అవతార స్వీకారం చేస్తూంటాను. కానీ ధర్మ వ్యతిరేకులైన వారందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతే కలియుగంలో అసలు మనుష్యుడన్నవాడు మిగలడు. కలియొక్క ఉద్ధతి అటువంటిది. కాబట్టి ఇప్పుడు చేతిలోఒక అస్త్రాన్ని/శస్త్రాన్ని పట్టుకొని ఎవరు ధర్మవ్యతిరేకులుగా ఉన్నారో వారందరినీ చంపేయడం తేలిక మార్గం కాదు. అనుసరణీయం కాదు. మనసులను ఆవహించి ఉన్నటువంటి కలిని తొలగగొట్టాలి. అందరినీ ధర్మ మార్గంలో నడిపించాలి. కృష్ణపరమాత్మ చేసిన ప్రతిజ్ఞకు కొనసాగింపుగా పరమశివుడు ఈ భూమండలం మీద అవతరించాడు. భారతదేశం నలుచెలగులా పాదచారియై మూడు పర్యాయములు పర్యటించారు. కేవలం 32 సంవత్సరములు మాత్రమే వారు శరీరంతో ఉన్నప్పటికీ అవైదికమైన వాదనలన్నింటినీ ఖండించారు. వేదంయొక్క ప్రమాణాన్ని సువ్యస్థితం చేశారు. అద్వైత మార్గము శంకరాచార్యుల వారు క్రొత్తగా కనిపెట్టినది కాదు. అద్వైత మార్గము వేదాంతర్గతమైన పరమసత్యము. వారి జీవితంలో వారు చేసిన ప్రబోధమంతా అదే. అద్వైతము వేదాంతర్గతమై యున్నది. దానిని ప్రచారం చేశారు. కేవలం సిద్ధాంత ప్రచారం చేయడం వారి లక్ష్యం కాదు. అవైదికమైన వాదనలను ఖండించారు. వేదముయొక్క ప్రమాణమును నిలబెట్టి షణ్మత స్థాపనాచార్యులై మనుష్యులు భక్తి మార్గంతో నడవడానికి కావలసిన వ్యవస్థనంతటినీ యేర్పాటు చేశారు. ఎవరు యే స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో భగవంతుణ్ణి పట్టుకోవడానికి వీలైనటువంటి మార్గాలను చూపించారు. అందుకే యదార్థమునకు ఆదిశంకరాచార్యుల వారు లేకపోతే సనాతన ధర్మానికి మనుగడయే ప్రశ్నార్థకమైయుండేది. అంతటి క్లిష్ట పరిస్థితులలో వచ్చినటువంటి అవతారం శంకరావతారం. అవైదిక వాదనలు ఈ దేశంలోకి ప్రవేశించి వేద ప్రామాణ్యమును పాడుచేయకూడదని నాలుగు దిక్కులా నాలుగు పీఠములను పెట్టి కాపుదలగా ఉంచారు. తూర్పున జగన్నాథ్ లో గోవర్థన పీఠం, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదా పీఠము - ఉంచి నాలుగు వేదములయొక్క ఆమ్నాయములను యేర్పాటు చేసి అక్కడ పీఠాధిపతుల పరంపర కొనసాగేటట్లుగా, ఆ పీఠాధిపతుల ధర్మ ప్రచారము చేత వేదము ప్రమాణముగా ఉన్నటువంటి సనాతన ధర్మమునకు యేవిధమైనటువంటి వైక్లబ్యము కలగకుండా కొనసాగింపు పొందేటట్లుగా చక్కటి వ్యవస్థను యేర్పాటు చేసినటువంటి మహాపురుషులు జగద్గురువులు శంకర భగవత్పాదుల వారు. అటువంటి శంకరులు ప్రస్థాన త్రయానికి (భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు) భాష్యం ఇచ్చారు. అవి చదువుకోలేరేమో అన్నవారి కోసం తరువాతి స్థాయిలో అందుకోవడానికి వీలుగా భగవత్సంబధమైన భక్తి జ్ఞానములను యేర్పాటుచేసుకొని వైరాగ్యమును పొందడానికి వీలుగా శివానంలహరి, సౌందర్యలహరి వంటి గ్రంథాలను రచించి లోకానికి అందించారు. శంకరాచార్యులవారు ఈ దేశానికి చేసినటువంటి మహోపకారం యేమిటంటే అందరు దేవతలమీద వివిధ వృత్తాలలో స్తోత్రములను రచన చేశారు. వారు స్పృశించని దేవతా స్వరూపం లేదు. స్తోత్రాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే యే స్తోత్రంలో కూడా నేను చేస్తున్నాను అన్న భావన వచ్చేటట్లుగా చేయలేదు. ఎక్కడెక్కడ లోకానికి ప్రయోజనం కలగాలని స్తోత్రాన్ని అందించారో అక్కడక్కడ వారు రెండు మాటలను ప్రయోగించారు. "మః, మాం" - సంస్కృతంలోఈ రెండు మాటలకి ఒక ప్రత్యేకతమైన స్థాయి. మాం - నన్ను, మః - మమ్ములను అని. ఎందుకలా చేశారంటే ఆ స్తోత్రముల వల్ల శంకరుల వారు లబ్ధిపొందడం ఆయనయొక్క ఉద్దేశ్యం కాదు. రేపటిరోజున ఈ స్తోత్రాన్ని ఎవరు చదువుకుంటాడో వాడు భగవంతుడి ముందు కూర్చొని ఆ స్తోత్రం చదివితే ’మాం, మః’ అన్నప్పుడు ఆ రక్షణ వాడికి కలగాలి. అందుకే వారు స్తోత్ర రచన చేసి ఫలితాన్ని మనకి కట్టబెట్టారు. ఇది ఒక తండ్రి కొడుకు కొరకు ఎలా యేర్పాటు చేస్తాడో అలా మనకొరకు కాలంలో ఎన్ని దశాబ్దాలు, శతాబ్దములు గడిచిపోయినా మళ్ళీ దేవతారాధనలో స్తోత్రాన్ని చెప్పగలమో లేదోనని శంకరభగవత్పాదుల వారు మనకొరకు అత్యద్భుతమైన స్తోత్రములనందించారు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML