వేదానికి పరమతాత్పర్యమైన వేదాంత విజ్ఞానాన్ని పునః ప్రతిష్ఠ చేయడానికై అవతరించిన అపర శంకరులు. వేదాంతామనే కట్టుకొయ్యని స్థాపిమ్చి, చెల్లాచెదురైన వేద ధర్మధేనువుల్ని ఆ కొయ్యతో అనుసంధించి, ఒకే ఆర్ష హృదయశాలలో నెలకొల్పిన సమన్వయ చక్రవర్తి.
ఆయన వేదాంత హృదయాన్ని - ’అంతా ఒకటే పరబ్రహ్మము’ అని స్పష్ట పరచి,భిన్నత్వం కల్పితమేనని నిరూపించి జ్ఞాన మార్గాన్ని సుష్ఠుపరచారు.
అన్ని రకాల స్థాయిల వారిని అర్థం చేసుకుని, సనాతన ధర్మ పథాలైన కర్మ, భక్తి, విచారణామార్గాలను ఆయా అధికారులకు అనుగుణంగా అమర్చి పెట్టారు. ఉపాసనా మార్గాన్ని సంస్కరించారు. తంత్ర విద్యల వలన ప్రబలిన రాజస, తాస ప్రవృత్తుల ప్రకోపాలను పరిహరించి, సాత్త్విక మార్గంలో తాత్త్విక ప్రయోజనంతో పలు ఉపాసనా పద్ధతులను అందించారు.
’చిత్తశుద్ధి, ఈశ్వరార్పణబుద్ధి’ కలిగినకర్మ ’యోగమై’, భక్తిని కలిగించి క్రమంగా జ్ఞానం ప్రాప్తిస్తుందనీ - ’సర్వం ఈశావాస్యం’ అన్నదే జ్ఞానమనీ, అది అనుభవానికి రావడమే మోక్షమనీ తేల్చిచెప్పి తేటపరచిన పరిపూర్ణ గురువు.
ప్రస్థాన త్రయ (భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు) భాష్యం, వేదాంత ప్రకరణ గ్రంథాలు, స్తోత్ర సాహిత్యం....ఇలా అపార వాజ్ఞ్మయాన్ని సృష్టించారు. వ్యాస, శంకరులు లేనిదే భారతీయ ధర్మం లేదు. ఈ సంస్కృతి ఆ హరిహర స్వరూపుల చలువ.
కవి - దార్శనికుడు - తపస్వి - ధర్మ విగ్రహుడు - మహాయోగి - మంత్ర సిద్ధుడు - తాత్త్వికుడు ఇలా పలు కోణాలలో పరిపూర్ణులు శంకరులు.
వారు ఏ సంప్రదాయాన్నీ నిరసించలేదు. అన్నిటినీ సమన్వయించారు. అన్నీ జ్ఞానం వైపు పయనించాలని దిశానిర్దేశం చేశారు. దేశమంతా యోగశక్తితో ముమ్మారు పర్యటించారు. ప్రపంచ మేధావులు, విజ్ఞాన వేత్తలు, తత్త్వవేతలు శిరోధార్యంగా స్వీకరించే సర్వ మతానుమోదమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిష్ఠించారు.
అన్ని ఉపాసనా సంప్రదాయాలను అధ్యయనం చేసి - ఆరు వైదిక మతాలుగా విభజించి - వాటిని కలిి ఉపాసించాలని "దేవతార్చనా విధానాన్ని" పంచాయతన పూజగా ఏర్పాటు చేశారు. ’షణ్మత స్థాపకులు’గా నిలిచారు. శివ, శక్తి, విష్ణు, గణనాథ, అంబిక, సూర్య, స్కంద దేవతల ఆరాధనలను సమైక్యపరచి, అభీష్టదైవాన్ని కేంద్రంగా మిగిలిన దేవతలను చుట్టూ ఉంచి ఆరాధించె విధానాన్ని ఏర్పరచారు. వామాచార విధానాలతో తామసికంగా తయారైన తంత్రాలను కూడా సంస్కరించి, సాత్త్విక వైదిక పద్ధతిలో దక్షిణాచారాన్ని ప్రసిద్ధి చేశారు. శ్రీవిద్య శిష్టుల ఉపాసనా విద్యగా పునః ప్రతిష్ఠను పొందినది వారివలననే.
భక్తి మార్గంలో, జ్ఞానమార్గంలో, ధర్మమార్గంలో కూడా ఆయనే ఆచార్యులై నిలిచారు. సాధన దశలో ద్వైత విశిష్టాద్వైతాలను అంగీకరిమ్చి, ఆ సంప్రదాయాలను కూడా క్షుణ్ణంగా పరిపుష్టి చేశారు.
అనంత దయానిధియై తన కృపాదృష్టితో కనకధారను వర్షింపజేసిన మహిమ సంపన్నుడు, తన అపార మేధాశక్తితో భారత దేశాన్ని సమైక్య పరచి ’సనాతన ధర్మమ’నే ఏకాధారంపై నిలిపి, అవైదిక, నాస్తిక సిద్ధాంతాలను కనుమరుగయ్యేలా చేసిన జ్ఞానభాస్కరుడు, దేశభక్తుడు.
నాలుగు దిక్కులు, నాలుగు పీఠాలను, నాలుగు వేదాల సంకేతాలుగా నిలిపిన సువ్యవస్థాశిల్పి "ఒక పరిపూర్ణమైన అవతార మూర్తి ఇతడు" అనిపించే అద్భుత వ్యక్తిత్వంతో, కేవలం 32 ఏళ్ళలోనే అనితర సాధ్య ధర్మ ప్రతిష్ఠను చేశారు.
అధిక సంఖ్యలో రామాయణాలు వచ్చినట్లే, ’శంకర విజయాు’ ఎన్నో వెలువడ్డాయి.ఎక్కడా ఆవేశోన్మాదాలు లేని ప్రశాంత శాస్త్రచర్చ, లోకశంకర లక్షణం వారి దివ్య చరిత్ర ప్రబోధిస్తోంది.
ఆది శంకరుల తపశ్శక్తి ఎంత గొప్పదంటే - ఇప్పటికీ వారి పీఠాలనధిష్ఠిస్తూ, పరంపరాగతంగా వేదాంత మతాన్ని ప్రతిష్ఠిస్తున్న మహాత్ములు సైతం వారివలె అపూర్వ జ్ఞాన సంపత్తిని పండిస్తున్నారు. శంకరుల అనంతరం విద్యారణ్యస్వామి వంటివారు శతాధిక వర్షాలు జీవించి శంకర విభూతిని దీపింపజేశారు.
భారత జాతికి సమన్వయాన్ని బోధించిన మహాత్ములు శంకరులు. వారి బలోపేతమైన వైదిక సౌధంలో...మళ్ళీ క్రమంగా రకరకాల సంప్రదాయాలు ఉజ్జీవితాలయ్యాయి.
వారు జనించిన వైశాఖ శుద్ధ పంచమి సనాతన ధర్మానికి సూర్యోదయం. జగతిలో సమైక్యాన్ని ప్రతిష్ఠించిన ఆదిశంకరులు - సమన్వయ సిద్ధాంతానికి ఆచార్యులై, జగద్గురువులై భాసించారు. వారిని స్మరించుకొని, మిగిలిన జ్ఞానమూర్తుల మేలి మాటలని స్వీకరించి, సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మతత్త్వాన్ని సాధించుకోవాలి.
సృష్టిలో అనేకత్వం వ్యవహారంలో సహజం. పరమార్థ దృష్టితో ఏకత్వాన్ని దర్శించగలిగితే, విభిన్నతలను చక్కగా సమన్వయించుకోగలం. ఆ దృష్టినిచ్చిన శివగురువులు శంకరులు.
విదితాఖిల శాస్త్ర సుధాజలధే
మహితోపనిషత్ కథితారథనిధే!
హృదయే కలయే విమలం చరణం
భవశంకర దేశిక! మే శరణమ్!!

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment