What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 27 November 2014

చిదంబరం ఆలయం మరియు దాని ప్రతీకాత్మకత



చిదంబరం ఆలయం మరియు దాని ప్రతీకాత్మకత

చిదంబరంతో పెనవేసుకుపోయిన పుణ్య పురుషుడైన తిరుమూలర్ యొక్క పురాణాన్ని, అతని యొక్క తిరుమంతిరంలో చెబుతాడు.


మనుదరక్కై వడివు శివలింగం
మనుదరక్కై వడివు చిదంబరం
మనుదరక్కై వడివు సదాశివం
మనుదరక్కై వడివు తిరుక్కూతే

అర్ధం: "మానవ శరీరం యొక్క స్వరూపమే శివలింగం; అలాగే చిదంబరం ; అలాగే సదాశివం ; మరియు అలాగే అతని యొక్క దివ్య నృత్యం".

ఆలయానికి తొడుగులను పోలిన ఐదు ప్రాకారాలు ఉన్నాయి.
బంగారపు పైకప్పు కలిగిన చిత్ సభ (మందిరం)అని పిలువబడే గర్భగుడి నుంచి నటరాజ స్వామి దర్శనమిస్తాడు.
కప్పు మీద 26,000 బంగారపు పలకలు (చిత్రం చూడండి) కలిగి, ఒక రోజులో ఒక వ్యక్తి తీసే శ్వాసల సంఖ్యని సూచిస్తుంది.
ఈ పలకలను చెక్కతో చేసిన పైకప్పుకి బిగించుటకు ఉపయోగించిన 72,000 మేకులు నాడుల సంఖ్యని సూచిస్తాయి (శరీరంలోని వివిధ అవయవాలకు శక్తిని చేరవేసే నరాలు)
శరీరంలో గుండె ఎడమ వైపుకి ఉన్నట్లుగా, చిదంబరంలోని గర్భగుడి కూడా కొంచెం ఎడమ వైపుగా ఉంటుంది.
చిత్ సభ కప్పు మీద ఉన్న తొమ్మిది కలశాలు (రాగితో చేయబడినవి)- తొమ్మిది శక్తులను ప్రదర్శిస్తుంది.
కప్పుకి 64 అడ్డ దూలాలు ఉండి 64 కళలను సూచిస్తాయి.
అర్ధ మండపానికి ఉన్న ఆరు స్తంభాలు ఆరు శాస్త్రాలను సూచిస్తాయి
అర్ధ మండపానికి ప్రక్కనున్న మండపానికి పద్దెనిమిది స్తంభాలు, పద్దెనిమిది పురాణాలకి ప్రతీక.
కనక సభ నుంచి చిత్ సభకి దారి తీయు ఐదు మెట్లు సూచించేది
ఐదు అక్షరాల పంచాక్షర మంత్రం (న మ శి వ య)
చిత్ సభ పైకప్పుకి ఊతమిచ్చే నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీకలు.

నటరాజ స్వామి యొక్క ప్రతీకాత్మకత

నటరాజ స్వామి యొక్క నృత్యం ఐదు దివ్య కార్యాలను సూచిస్తుంది, అవి:
సృష్టి- నటరాజు యొక్క ఒక కుడి చేతిలో ఢమరుకం అని పిలువబడే చిన్న డోలు ఉంటుంది. ఈశ్వరుడు అంటే నాద బ్రహ్మ. ఆయన అన్ని శబ్దాల (నాదం)కు మూలం.ఇది విశ్వ వృక్షం యొక్క ఆవిర్భావానికి విత్తనం.
రక్షణ (కార్యకలాపాలు)- మరొక కుడి చేతి తో చూపెడుతున్న 'అభయముద్ర', కి అర్ధం ఆయన దయగల రక్షకుడు.
నిర్మూలన; ఎడమ చేతులలో ఒకదానికి ఉన్న నిప్పు, నిర్మూలనకి ప్రతీక.అన్నింటినీ అగ్ని నాశనం చేయగా మిగిలే బూడిదని, స్వామి తన శరీరానికి రాసుకొంటాడు.
క్రింద ఉంచిన పాదం దాచి ఉంచే కార్యాన్ని సూచిస్తుంది.
ఎత్తిన పాదం అర్పించే కార్యాన్ని సూచిస్తుంది.
నటరాజస్వామికి ఎడమ ప్రక్కన దేవీ శివకామ సుందరి విగ్రహం ఉంటుంది. ఇది అర్ధనారీశ్వర , ' ఎడమ భాగంలో స్త్రీని కలిగి ఉన్న స్వామి'కి ప్రతీక. ఆయనకి కుడి ప్రక్కన ఒక తెర ఉన్నది. దీపారాధన సమయంలో దీపాలను స్వామికి మరియు ఎడమ వైపుకి చూపెడతారు, అప్పుడు తెరని తొలగించగా ఐదు నిట్టనిలువుగా వ్రేలాడుతున్న బంగారపు విల్వ పత్రాల యొక్క వరుసలు కనబడతాయి. వాటికి వెనుక ఏమీ కనబడదు. శివకామి సగుణ బ్రాహ్మణుడైన (ఆకారం కలిగిన భగవంతుడు) నటరాజుని చూపుతుంది. సగుణ బ్రాహ్మణుడు, మనల్ని నిర్గుణ బ్రాహ్మణుడి (నిరాకార స్వరూపుడైన భగవంతుడు లేదా నిరాకారత్వాన్ని తన రూపంగా కల భగవంతుడు) కి దారి తీస్తుంది. దీనినే 'చిదంబర రహస్యం' అని దీక్షితార్లు, సనాతనంగా ఉన్న ఆలయ పూజారులు చెబుతారు.
శివుని యొక్క నృత్యాన్ని విశ్వ నృత్యమని పండితులు పిలుస్తారు. చిదంబరంలో, ఈ నృత్యాన్ని 'ఆనంద తాండవ' అని అంటారు.
శ్రీ మహావిష్ణువు కూడా ఈ దివ్య నృత్యాన్ని వీక్షించాడు. దగ్గరలోనున్న చిత్రకూట మంటపంలో, మహా విష్ణువు, యోగనిద్ర భంగిమలో శేషసాయితల్పం మీద శయనించి దర్శనమిస్తాడు. నారాయణుడికి ఎదురుగానున్న ఒక చిన్న పద్మం చెక్కబడిన రాతిపలక మీద నుంచుని చూస్తే తన కుడి చేతి పక్కన నటరాజుని కూడా చూడవచ్చు.
చిదంబరంలో నటరాజు యొక్క నృత్యాన్ని పతంజలి మరియు తిరుమూలర్ వంటి యోగులు కూడా చూశారు. వాటి యొక్క చిత్రాలు చిత్ సభ యొక్క వెండి తలుపుల మీద చిత్రించబడి ఉంటాయి.

చిదంబర రహస్యం

చిదంబరంలో పూజించబడే పరమశివుడు నిరాకార స్వరూపుడై సాక్షాత్కారిస్తాడు. స్వామి తన సతీమణి శక్తి లేదా శివగామి తో కలసి ఆద్యంతరహితమైన చిద్విలాసంతో "ఆనంద తాండవ" నృత్యాన్ని నిరంతరంగా చేస్తుంటాడు. ఈ ప్రదేశాన్ని కప్పి ఉంచే తెరని తొలగించగా వ్రేలాడదీసిన బంగారు 'బిల్వ' పత్రాల వరుసలు స్వామి యొక్క సమక్షాన్ని సూచిస్తూ కనబడతాయి. తెరకి బైట వైపు నల్లగా ఉండి (అజ్ఞానాన్ని సూచిస్తుంది) మరియు లోపలి వైపు ప్రకాశవంతమైన ఎరుపులో ఉండి (జ్ఞానాన్ని మరియు ఆనందాన్ని సూచిస్తుంది).
చిదంబరం లోని చిట్ సభలో నున్న నటరాజ స్వామి. విగ్రహంకి ఎడమ ప్రక్కన వున్నది చిదంబర రహస్యం- ప్రాతినిధ్యం వహించేది కట్టబడిన బంగారు విల్వ ఆకులు.కుడి ప్రక్కన వున్నది భార్య శివగామసుందరరి దేవత విగ్రహం.

రోజు వారీ క్రతువులలో, ఆ రోజు ప్రధాన పూజారి, తనని తాను భగవత్స్వరూపుడిగా - శివోహం భవ (శివ - దైవం, సంధి రూపంలో - శివో- , అహం – నేను /మనం, భావ - మనస్థితి), భావిస్తూ తెరని తొలగించుట, అజ్ఞానాన్ని పారద్రోలుటను మరియు ప్రదేశాన్ని వెల్లడి చేస్తూ స్వామి సమక్షాన్ని సూచిస్తుంది.

చిదంబర రహస్యం అనగా, ఆ సమయంలో భగవంతుడికి పూర్తిగా లొంగి, ఆయనను మనలో లీనం చేసుకొని మరియు అజ్ఞానాన్ని తొలగించుకొని, భగవంతుడి సమక్షాన్ని 'చూసి మరియు అనుభవించి' అందువలన కలిగే బ్రాహ్మానందాన్ని పొందుతారు.

చిదంబరం లేక చిత్తంబళము

తమిళనాడులోని ద్రావిడ రీతుల్లో నిర్మించబడిన దేవాలయాల్లో చిదంబరం ఒక మణిపూస. చిదంబరం అంటే విజ్ఞానాంబరము అని అర్ధము. దక్షిణ ఆర్కాట్‌లోని చిదంబరంకు ముఖ్యకేంద్రం. 13 హెక్టార్ల చదరంలో పరచుకొని ఉన్న ఈ ఆలయ సమూహము అతి పురాతనమైనదిగా ప్రసిద్ధి. అందులో ప్రళయతాండవం చేస్తున్న పరమశివుని విగ్రహం కలదు చాలా పెద్ధది. నలువైపులా 4 గోపురాలు ఉన్నాయి. ఉత్తర దక్షిణ గోపురాలు 49 మీ. ఎత్తున ఉన్నాయి. మిగతా 2 గోపురాల మీదా తాండవ నృత్యమాడే నటరాజస్వామి శాస్త్రీయ భంగిమలు 108 చెక్కించబడి ఉన్నాయి. ఆలయంలో విశేషంగా చెప్పుకోదగినవి నృత్యమందిరం. ఒక చిత్ర రధాకృతిలో నున్న పెద్ద సభా భవనంలో మధ్య ఒక చిన్న మందిరంలో నటరాజ స్వామి విగ్రహం ఉండి అంతా తానై వెలసి ఉన్న భావం గోచరిస్తుంది. మరొకటి ముఖ్యమైనది వేయి స్థంబాల మంటపం. ఆలయ ప్రాంగణంలోని పార్వతీ దేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలతో పాటు శ్రీ మహావిష్ణువుకు అంకితమైన మరో ఆలయం ఉంది. శివకేశవులకు అభేదత్వమును కల్పిస్తూ శివుని దర్శించడానికి వెళ్ళిన వానికి విష్ణువు, విష్ణువును దర్శించడానికి వెళ్ళినవానికి శివుడు కనపడుతూ సర్వజగత్తుకు భగవంతుడు ఒక్కడే అనే భావం మన మనస్సులో మెదిలేట్టు చేస్తుంది. అసలు చిదంబర రహస్యం అనే నానుడి ఎప్పట్నుంచో వాడుకలో ఉంది. అంతూ, దరి తెలియని విషయాన్ని చిదంబర రహస్యం అనడం పరిపాటి. ఇక్కడ ఈ ఆలయంలో కూడా పంచ లింగాల్లో ఒకటైనటువంటి ఆకాశలింగమును చూడటానికి రుసుం చెల్లించి లోపలికి వెళ్ళినపుడు ఇది మనకి అనువైకవేద్యమవుతుంది. ఆకాశలింగం అంటేనే దీనికి ఆకారం ఉండదు. ఆలయపు గోడలో బంగారు రేకుమీద యంత్రంతో బిగించబడి ఉంటుంది. దాని ఎదుట ఒక తెరవేసి ఉంటుంది. లోపలకు వచ్చిన తరువాత ఆ తెర తీసి చూపిస్తారు. అంటే మనకు కనపడనిది చిదంబర రహస్యం అనుకోవాలి.

ఈ చిదంబరం 907 నుండి 1310 వరకూ చోళరాజుల రాజధాని. వీరచోళరాజ కాలంలో నటరాజ ఆలయం వ్యవస్థీకరించబడినట్లుగా ఉన్నత పాఠాలు చెప్తున్నాయి. వీరచోళరాజు కాలం క్రీ.శ. 927 నుండి 997 వరకు ఆలయ పట్టణం మధ్య నుండి 5 ప్రాకారాలు కలిగి ఉన్నది. మొదటి ప్రాకారంలోనే 4 సింహ ద్వారాల మీద గోపురములు ముందు చెప్పిన 4 గోపురాలు ఇవే. చిదంబరం నటరాజస్వామి వారి ఆలయంలో వేంచేసియున్న శ్రీ నందీశ్వరుని విగ్రహం చాలా పెద్దది ఒకటియున్నది. దాని యెదయందు గంటలు, దానిపై జీను వగయిరాలు చూస్తే రాతితో చెక్కబడినది కాదు సజీవంగా ఉన్నట్లు అనిపిస్తుంది. హిందూ దేశాల్లో నంది వాహనాలు అన్నింటిలోకంటే పెద్దది. శివగంగ వేయి స్తంభముల మంటపమునకు పడమటగా అమరి యున్నది కోనేరు. దీనికి సువర్ణ కోనేరు అనే పేరు ఉన్నది. చక్కగా చెక్కిన రాతితో మెట్లున్నవి. పూర్వం ఒకానొకప్పుడు వర్మచక్రుడనే రాజు స్నానం చేస్తే అతన్ని భాదిస్తున్న కుష్ఠురోగం పోయిందని చెప్తారు. ఇంక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో చూడదగినది- పెద్ద నెమలి విగ్రహం, స్వామి వారి మయూర వాహనం, వినాయక దేవాలయంలోని వినాయకుని విగ్రహం, హిందూ దేశం మొత్తం మీదనే చాలా పెద్దది అంటారు. శిల్పులు ప్రతి అంగుళంలోనూ చూపిన నిపుణత్వం కౌశల్యము మనకు ఆశ్చర్యము, ఆనందాన్ని కలిగిస్తాయి. చిదంబర నటరాజస్వామి పుండరీ పురంలోని పాండురంగని వలె అనేక మంది భక్తులను, కవులను కాపాడి తనలో ఐక్యం చేసికొన్న భక్తసులభుడు. ఈయన లీలలను తిరువాచకమనే గ్రంధం పేర మణికవచుడు అనే ఆయన వ్రాశాడు. స్వామి అనుగ్రహంతో ఇలా ఎంతో మంది మహాగ్రంధకర్తలు స్వామి అనుగ్రహాన్ని పొంది తరించారు. అనపాయచోరుడు అనే రాజు వైరాగ్యము పొందిన పిదప తన జీవిత శేషాన్ని ఆలయ ప్రాంగణంలోనే నడిపాడు. ఆయన గౌరవార్ధం "జ్ఞానవాసి" అనే చిరు దేవాలయం కూడా ఉంది. ఇంకా చిదంబరంలో చూడదగినవి తిల్లైఅమ్మన్ దేవస్థానము శ్రీరాజ అన్నామలై చిట్టియార్‌ గారి పరిపోషణలో రూపుదిద్ధుకొన్న అణ్ణామలై విశ్వవిద్యాలయము చూడదగినది. చిదంబరంలోని శివాలయంలో ఉన్న తిరుచ్చిత్రకూటము ఒక దివ్యదేశంగా పరిగణించబడుతుంది. శ్రీ గోవిందరాజస్వామి పెరుమాళ్ళు, పుండరీకవల్లీ తాయారు, కుల, తిరుమంగయాళ్‌వార్ల మగయాళ్‌శాస్త్రం వైష్ణవులకు పవిత్రమైన క్షేత్రం.



No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML