What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 28 November 2014

మహర్షి అన్ని కాండలకీ సంబంధించిన పేర్లు మనకి అర్థం అయేటట్లు పెట్టారు.

మహర్షి అన్ని కాండలకీ సంబంధించిన పేర్లు మనకి అర్థం అయేటట్లు పెట్టారు. బాలకాండలో రాముని జననము, రాముని బాల్యము స్పృశింపబడింది. బాలుడు, జ్ఞాని, పిశాచము వీళ్ళందరినీ ఒకటిగా చెబుతారు. అపారమయిన జ్ఞాని, బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుని కథ విశేషంగా చెప్పబడింది. అయోధ్యాకాండకు - అయోధ్యలో రామచంద్రమూర్తి జీవితానికి సంబంధించిన విశేషాలను వర్ణించింది. కాబట్టి అయోధ్యాకాండ అని పేరు పెట్టారు. తదనంతరం సీతారాముల అరణ్య వాసం గురించి వర్ణించిన కాండ అరణ్య కాండ. తదనంతరం కిష్కింధలో జరిగిన విశేషములను వర్ణించిన కాండ కనుక దానికి కిష్కింధకాండ అని పేరు పెట్టారు. యుద్ధకాండ సరే తెలిసిపోతుంది. అదంతా రామరావణ యుద్ధానికి సంబంధించిన కాండ. లేదా రాక్షస వానర సంగ్రామమునకు సంబంధించిన కాండ. కాని సుందరకాండ దగ్గరకు వచ్చేసరికి మహర్షి ఒక గమ్మత్తు చేశారు. కథకు సంబంధించిన పేరు పెట్టలేదు. పెట్టకుండా దీనిని సుందరకాండ అని పిలిచారు. సుందరకాండ అని పిలిచారు కాబట్టి అందులో ఒక సుందరుడికి సంబంధించిన కథ ఉండి ఉండాలి. ఎవరా సుందరుడు? మనకి సుందరకాండలో ప్రధానంగా కనపడే వారు స్వామి హనుమ. అందుకని హనుమ సుందరుడనాలా? రామచంద్రమూర్తి సుందరుడనాలా? లేకపోతే సీతమ్మ తల్లి సుందరి అనాలా? ఎందువల్ల అది సుందరకాండ? దీనికి పెద్దలు మనకి ఒక గమ్మత్తయిన జవాబు చెప్పారు. వారు ఏమన్నారంటే

సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథా
సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిః
సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం?!!

అందులో ఉన్న రామచంద్ర ప్రభువు సుందరాతిసుందరుడు. సరే సీతమ్మ తల్లి సంగతి చెప్పనే అక్కర్లేదు. ఆమె సాక్షాత్తు బాలాత్రిపుర సుందరీ స్వరూపం. స్వామి హనుమ ఆత్మదర్శనం చేసిన యోగి స్వరూపుడయిన సౌందర్యరాశి. అశోకవనం మిక్కిలి సౌందర్యవంతమయింది. లంకాపట్టణం మిక్కిలి సుందరమయినది. మంత్రం సుందరం. ఇంక అందులో సుందరం కానిదేముంది? అన్నీ సౌందర్య భరితములే. అయితే మనకి అనుకోవడానికి మాత్రం రెండు ప్రధానమయిన తేడాలు కనపడతాయి. బాలకాండ ప్రారంభంనుంచి కిష్కింధకాండ చివరి వరకు రామచంద్రమూర్తిని ప్రధానంగా పెట్టుకొని, మిగిలిన పాత్రలన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాని సుందరకాండ దగ్గరకు వచ్చేసరికి గమ్మత్తు ఏమిటంటే ఇక్కడ రాముడు కనపడడు. సుందరకాండలో ఎక్కడా రామునికి సంబంధించిన విశేషం ఉండదు. అంటే రాముని ప్రత్యక్షమయిన కదలిక మనకి కనపడడు. కాని రామకథ, రామనామము, రాముని సౌశీల్యము వీటికి సంబంధించిన గొప్పతనమేమిటో మనకి వర్ణింపబడుతుంది. అందుకే మహర్షి ప్రారంభం చేస్తూనే ఒక గమ్మత్తు చేశారు. కిష్కింధకాండ చివరలో, రామకార్యం మీద వెడుతున్న వానరులకి రామచంద్రమూర్తి ఇల్లాలయిన సీతమ్మతల్లి జాడ చెప్పడంలో మాటసాయం చేసినంత మాత్రం చేత, సంపాతికి కాలిపోయిన రెక్కలు వచ్చాయి. రామ కథా బలం ఎటువంటిదో, రామనామానికి ఉన్న బలం ఎటువంటిదో, రామ కార్యానికి రామకార్యంలో వెడుతున్న వారికి చేసే సహాయం, ప్రతిఫలం ఎంత స్థితిలో వుంటుందో మనకి నిరూపిస్తుంది కిష్కింధకాండ చిట్టచివరి స్థితి. కిష్కింధకాండలో అంతటి పునాదివేస్తే ఇక సుందరకాండలో రామకథ గొప్పతనం ఎన్నిమాట్లు చెప్పబడుతుందో చూడండి! అందుకే సుందరకాండ గొప్పతనం అంతా శ్రీ రామోపాసనలో ఉంది.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML