ఒకానొక చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై సవనం చేసేందుకు సమాయత్తుడయ్యాడు. హరిహరులతో సహా సర్వదేవతలూ, మునులూ కూడా కలిసి ఒక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ దీక్ష ఇవ్వడానికి నిర్ణయించి కర్త యొక్క కళత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురుపంపారు. అయినా సరస్వతి సమయానికి అక్కడికి చేరుకోలేదు.
దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వల్ల భ్రుగుమహర్షి ''హే విష్ణుమూర్తీ! సరస్వతి ఎందుకు రాలేదో తెలీదు. ముహూర్తం దాటిపోతోంది. ఇప్పుడేమిటి గతి?'' అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ ''సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరొక భార్య అయిన గాయత్రి దీక్షాపతిగా విధించండి'' అని సలహా ఇచ్చాడు.
ఆ సలహాను శివుడు కూడా సమర్ధించడంతో భ్రుగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణభాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరిచాడు. ఈవిధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్ష ఇవ్వడం పూర్తిచేయగానే సరస్వతి అక్కడికి చేరుకుంది. తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన సవతి గాయత్రిని చూసి మత్సరంచెంది ''ఎక్కడైతె పూజార్హత లేనివారు పూజింపబడుతున్నారో, పూజనీయులు పూజింపబడటం లేదో అక్కడ కరువు, భయము, మరణము - అనే మూడు విపత్తులు కలుగుతాయి. ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన ణా స్థానంలో ఉపవిష్టురాలిన ఉవిద ప్రజలకు కనిపించనటువంటి రహస్యనదీ రూపం పొందుగాక. ఓ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా! మీరందరూ ఈ యజ్ఞ వాటికలో ఉండి కూడా ణా సింహాసనాన నా కన్నా చిన్నదాన్ని ఆసీనురాలీని చేశారు. గనుక మీరు కూడా జడీభూత నదీరూపాలను పొందండి'' అని శపించింది.
సరస్వతీ క్రుద్ధ వచనాలను వింటూనే చివ్వున లేచిన గాయత్రి దేవతలు వారిస్తున్నా వినకుండా ''ఈ బ్రహ్మ నీకు ఎలా భర్తో, నాక్కూడా అలాగే భర్తేనని విస్మరించి అకారణంగా శపించావు గనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు'' అని ప్రతిశాపం ఇచ్చింది.
ఈ లోపల హరిహరులు అక్కడికి వచ్చి ''మేం నదులం అయినట్లయితే లోకాలన్నీ అతలాకుతలం అయిపోతాయి. కనుక, అవివేకమైన నీ శాపాన్ని మళ్ళించుకో'' అన్నారు. కానీ ఆమె వినలేదు. ''యజ్ఞం మొదట్లో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడంవల్లనే నా కోప రూపంగా యాగం విఘ్నపడి ఆగమయింది. పలుకుల పడతినైన నా మాట తప్పదు. మీరందరూ నదీరూపాలను ధరించి, మీ అంశలు జడత్వాన్ని వహించవలసిందే. నేను, గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాం'' అని చిప్పింది. ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలూ జడాలుగానూ, రూపాలు నదులుగానూ పరిణమించాయి.
ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను, మిగిలినవారు ఇతరేతర నదీ రూపాలుగానూ మారిపోయారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నదులై తూర్పుముఖంగానూ, వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగానూ ప్రవహించ ఆరంభించారు. గాయత్రీ, సరస్వతీ నదీ రూపాలు సావిత్రీ అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి.
ఈ యజ్ఞంలో ప్రతిష్టితులైన శివ, కేశవులు మహాబలుడు, అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు. సర్వపాపహారిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా, విన్నా, వినిపించినా వారి వంశమంతా నదీ దర్శన స్నాన పుణ్యఫలవంతమై తరించిపోతుంది.
No comments:
Post a Comment