What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 25 December 2014

సంపద శుక్రవార వ్రతం



సంపద శుక్రవార వ్రతం

ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఉన్నారు. వారందరికీ వివాహాలయి భార్యలు కాపురానికి రావడంతో వారంతా వేరే ఇళ్ళల్లో కాపురాలు పెట్టారు. ఒకనాడు ఉదయం శుక్రవారం మహాలక్ష్మీ సంచారం చేయుచూ ఆ బ్రాహ్మణుని కోడళ్ళ ఇళ్ళకు వెళ్లింది. ఒక కోడలు ఉదయాన్నే పిల్లలకు భోజనముపెట్టి తాను కూడా తినుచుండెను. ఇంకొక ఆమె పాచి వాకిలో పేడవేసుకొనుచుండెను. వేరొక కోడలు పాతగుడ్డలను కుట్టుచుండెను. మరొక కోడలు పాచి వాకిలిలో వడ్లు దంపుచుండెను. మరో కోడలు కటికచీకటియందే తలదువ్వు కొనుచుండెను. వేరే కోడలు పాచి వాకిలి యందే పిల్లలకు తలంటి తాను కూడా తలంటుకొనెను.

ఇట్లు ఆరుగురు చేయుటను చూచి శుక్రవారపు మహాలక్ష్మీ వారి ఇళ్ళల్లోకి వెళ్ళక పెద్ద కోడలి ఇంటికి వచ్చెను. ఆమె ఇల్లు అలుక్కొని, వాకిట కళ్లాపునుజల్లి, స్నానం చేసి, పసుపురాసుకొని, బొట్టు పెట్టుకొని, కట్టుకున్న బట్ట భర్తకిచ్చి తలుపు వెనుక కూర్చుండెను. అక్కడ శుభ్రతకు మెచ్చుకుని శుక్రవారపు మహాలక్ష్మీ ఆరుగురుమీద కూర్చుని ‘‘అమ్మాయి! బయటకొకసారి రా’’ అని పిలిచింది. లోపలినుండి పెద్దకోడలు ‘‘నేను వచ్చుటకు వీలులేదు. మేము చాలా బీదవాళ్ళం అది నాకొకటే బట్ట ఉండుటచే దానిని నా భర్తకిచ్చి ఆయన నాయవారమునకు పంపి నేను తలుపు చాటున ఉన్నాను’’ అని తెలియజేసింది. అప్పుడు ‘శుక్రవారం’ మహాలక్ష్మీ తన బట్టలో సగమామెకు కట్టబెట్టి తనకొక సోలెడు బియ్యం వార్చి పెట్టమని కోరింది.

mahalakshmiఅందుకాయిల్లాలు నొచ్చుకొని తన భర్త వచ్చువరకు నింటబియ్యముండవని చెప్పింది. అప్పుడామె ‘‘శుక్రవారపు మహాలక్ష్మీ మాయింటికి వచ్చినది ఆమెకు ఇవి కావలెనని వర్తకులతో చెప్పి తీసుకురా’’ అని చెప్పింది. ఆమె కోమటి యింటికివెళ్ళి తనయింటికి శుక్రవారపు మహాలక్ష్మీ వచ్చినదని తెలిపి, పప్పుబియ్యము మున్నగు వంటకు కావలసిన పదార్ధాలు ఇవ్వమని కోరగా, అతడు వాటినన్నిటిని యిచ్చెను. తరువాత ఆమె అదే విషయం చెప్పి తెలుకల వాని యింటిదగ్గర తెలగపిండిని నూనెను కంచరి యింటిదగ్గరి పాత్ర సామగ్రిని, సాలెవాని యింటిదగ్గర బట్టలను తీసుకుని యింటికివెళ్ళి నాలుగు పిండివంటలతో నవకాయ పచ్చళ్ళతో శుక్రవారపు మహాలక్ష్మీకి వడ్డించెను. అంతలో ఆమె భర్త ఎడమూట పెడమూటలతో సంతోషంగా ఇంటికివచ్చెను.

ఆ దినమున అతనికి సంతృప్తికరంగా నాయవారము దొరకెను. అతనికామె భోజనంవడ్డించగా దానిని భుజించి అతడివి యెట్లు వచ్చినవని తెలిపెను. అంతలో శుక్రవారపు మహాలక్ష్మీ తానింక వెళ్ళెదనని చెప్పగా ఆమె ఆరాత్రి భోజనంచేసి వెళ్ళవలసినదని కోరెను. అందులకామె అంగీకరించి రాత్రి భోజనమైన తర్వాత వెళ్ళెదననెను. అప్పుడా బ్రాహ్మణి ‘‘అమ్మా! ఇంత చీకటిలో ఎలా వెళ్ళగలవు? రేపటి దినమున వెళ్ళవచ్చు’’ అనెను. అందుకామె సమ్మతించి, నిదురపోయి కొంతరాత్రికి లేచి, తనకు కడుపు నొప్పిగా ఉన్నదని తెలిపి వెలుపలికి వెళ్ళివచ్చెదనని చెప్పెను.

అందుకా బ్రాహ్మణి ‘‘చీకటిలో వీధిలోనికి వెళ్ళవద్దు ఆ మూల కూర్చొను’’ మనెను. మహాలక్ష్మీ అట్లే నాలుగు మూలలందును కూర్చొ ని, తెల్లవారువేళకు మాయమైపోయెను. ఆ బ్రాహ్మణి నిద్ర మేల్కొని, యిల్లు బాగు చేయుటకు చీపురును, చేటను బట్టి గది మూలలను చూచెను. నాలుగుమూలలందు నాలుగు బంగారు కుప్పలుండుటను చూచి, ఆమె మహదా నందం నొంది, భర్తకు ఆ విషయాన్ని తెలిపిం ది. అతడు లక్ష్మీకి తనపైనున్న దయనుదలచి, భార్యతో సంపద శుక్రవారం నోమును నోపించి, భాగ్యముల బడసి భక్తి విడువక సంతోషంగా ఉండెను. ప్రతి శుక్రవారం ఉదయమే స్నానం చేసి లక్ష్మీని కొలిచి, ఒంటిపూట భోజనం చేయ వలెను. అట్లు అయిదేండ్లయిన తరువాత ఒక శుక్రవారం నాడు ఐదుగురు పేరంటాండ్రకు తలంటి నీళ్ళుపోసి భోజనం పెట్టి ఐదు రవికె గుడ్డలను దక్షిణ తాంబూలాలతో ఇవ్వవ లెను. పద్ధతి తప్పినను ఫలముతప్పదు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML