What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 25 December 2014

నేటి రోజుల్లో భక్తి కూడా ఒక వ్యాపారంగా మారిపోతోంది. భగవంతుని యందు భక్తిలో కూడా వ్యాపార సూత్రాలను పాటిస్తున్నారు.

నేటి రోజుల్లో భక్తి కూడా ఒక వ్యాపారంగా మారిపోతోంది.
భగవంతుని యందు భక్తిలో కూడా వ్యాపార సూత్రాలను పాటిస్తున్నారు.
భగవద్భక్తితో చేసే వాగ్దత్తములకు (మొక్కుబడులు చెల్లించుటకై చేసే నమస్కారములకు) కూడా షరతులు వర్తిస్తాయట !
కొందరు భక్తులు, కండీషన్లతో కూడిన మొక్కుబడులను చేస్తూ వాగ్దత్త దోషమును పొందుతున్నారు.
అటువంటి వాగ్దత్త దోషముల పట్ల అవగాహన లేనివారై, అనేక కష్ట నష్టములను అనుభవిస్తున్నారు.
నిత్య జీవితంలో, భగవంతునియందు చేస్తున్న వాగ్దత్తములలో కొన్ని దోషాలను గమనిద్దాం.
కొందరు భక్తులు భగవంతునికి చేసే నమస్కారములు :
నాకు ఉద్యోగం వస్తే - మొదటి నెల జీతంలో 10 % మొక్కుబడిగా (కమీషన్) చెల్లిస్తాను.
నాకు ఆస్తి కలిసొస్తే - నీ మీద నాకున్న విపరీతమైన భక్తికి సాక్ష్యంగా ఒక బంగారు ఆభరణం చేయిస్తాను.
నాకు మంచి మార్కులు వస్తే - నీ గుడికి నడిచొచ్చి నిన్ను పలకరించి వెళతాను.
కొందరైతే మరీ విచిత్రం.
ఒక దేవుడితో పని కాలేదంటూ వేరే దేవుడికి పార్టీ మార్చేస్తారు.
అలా చేయటమే కాకుండా, దాని గురించి గొప్పగా ప్రచారం కూడా చేసుకుంటూ వుంటారు.
అన్నింటా వ్యాపార సూత్రాలను పాటించే ఇటువంటి భక్తులను చూసి, దేవతలకు కూడా ఆశ్చర్యం కలుగక మానదేమో.
ఇటువంటి సగంభక్తి కల్గినవారు గమనించవలసిన కొన్ని విషయములు :
మనం మొక్కుబడి చెల్లిస్తున్నామా లేక మన పని చేయటానికి దేవుడికి కమీషన్ ఇస్తున్నామా ?
మన పనులు కావాలంటే, దేవుడికి కమీషన్ (మొక్కుబడులు) ఇవాల్సిందేనని ఎక్కడా చెప్పలేదు కదా ?
మరి ఈ షరతులతో కూడిన మొక్కుబడులు చేల్లిస్తామంటూ, భక్తిని ఒక వ్యాపారంగా ఎందుకు మారుస్తున్నాము ?
ఆ లెక్కన మనల్ని మనుష్యులుగా పుట్టించినందుకు, భగవంతుడు ఎంత కమీషన్ (అదే ..... మొక్కుబడి) అడగాలో మరి ?
ఇటువంటి మితిమీరిన తెలివితేటలను చూసి, భగవంతునికి కూడా విసుకు కల్గేలోపు మన ఆలోచనల్లో మార్పు తెచ్చుకుంటే బాగుంటుందేమో.
కండీషన్స్ తో కూడిన మొక్కుబడులు ఎంతవరకు అవసరం ?
ఇటువంటివాటి వలన దేవతలు నిజంగా సంతుష్టులవుతున్నారా ?
దేవతలయందు మంచివాళ్ళు/చెడ్డవాళ్ళు, తొందరగా అనుగ్రహించేవాళ్ళు/ఆలస్యంగా అనుగ్రహించేవాళ్ళు, పరీక్షలు పెట్టేవాళ్ళు/సులువుగా కనికరించేవాళ్ళు అని విడివిడిగా వుండరేమో కదా.
నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తి కల్గినవారికి అన్ని విధములా శుభఫలములు కల్గుతాయనటంలో ఏ విధమైన సందేహమూ లేదు.
మనకు లభించే ఫలితములు అన్నీ, మనం చేసుకున్న పూర్వకర్మ ఫలములే అని కనీస అవగాహన కల్గివుందాం.
మొక్కుబడులు చెల్లించటం భగవంతునికి దగ్గర అవ్వటానికి ఒక చక్కటి మార్గమని తెలుసుకుందాం.
మనకు అవకాశంలేని సమయంలో మాత్రమే, "'స్వామీ ! నీ దర్శనము చేసుకోవటానికి మాకు ప్రస్తుతము శక్తి లేదు కనుక, వీలైనంత త్వరగా నీ దర్శనము చేసుకొని, మొక్కును తీర్చుకుంటాము" అని నమస్కారం చేసుకొనవచ్చును.
అందుకు గుర్తుగా ఒక ముడుపుని కట్టి, వీలైనంత త్వరగా స్వామి సన్నిధికి వెళ్లి, ఆ మొక్కును తీర్చుకొనవచ్చును.
ఆ విధంగా చేయటం ద్వారా భగవదనుగ్రహం లభిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
ప్రియమైన భగవద్భక్తులారా !
ఒక్కక్షణం ఆలోచించండి.
మనమే భగవంతుణ్ణి పోషిస్తున్నామనే సంకుచిత భావన నుండి బయటకు రావటానికి ప్రయత్నం చేద్దాం.
మనం అనుభవిస్తున్న సంపదలో కొంత భాగాన్నైనా దేవునికి వినియోగించాలనే విచక్షణ కల్గివుందాం.
దైవభక్తిని కల్గివుండటం, దేవాలయములను వైభవంగా ఉండేట్లు చూసుకోవటం మన కనీస బాధ్యతని తెలుసుకుందాం.
మన ఆలోచనల్లో మార్పు తెచ్చుకొని, భగవద్భక్తిలో కండీషన్లను తొలగించటానికి ప్రయత్నిద్దాం.
నిస్వార్థమైన భక్తిని కల్గినవారమై, భగవదనుగ్రహముచేత ఆనందమగు జీవితాన్ని పొందుదాం.
శ్రీ పార్వతీ పరమేశ్వరుల పరిపూర్ణ కృపా కటాక్షములచేత, అందరికీ శుభ ఫలములు కల్గును గాక !

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML