పాశురం 11
కట్రుక్క ఱ వైక్కణంగళ్ పలక ఱన్దు
శట్రార్ తి ఱలళియచ్చెన్రు శెరుచ్చెయ్యుమ్
కుట్రమొన్రిల్లాద కోవలర్తమ్ పొర్కొడియే
పుట్రరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుట్రత్తుతోళిమా రెల్లారుమ్ వన్దునిన్
ముట్రమ్ పుహున్దు ముగిల్వణ్ణన్ పేర్పాడ
శిట్రాదే పేశాదే శెల్వప్పెణ్ణాట్టి ! నీ
ఎట్రుక్కు రంగమ్ పొరుళేలో రెమ్బావాయ్.
ఇందులో మేల్కొల్పబడుతున్నటువంటి గోపికని సంబోధిస్తూ గొప్ప వంశంలో పుట్టినదానా! అన్నారిక్కడ. వంశంయొక్క వైభవాన్ని ఎక్కువ వర్ణించారు. ఏమిటా వంశం? - గోప వంశం. అంటే గోపకుల వంశంలో పుట్టినటువంటి గోపిక. పైగా ఈ గోపిక శెల్వప్పెణ్ణాట్టి ! - అంటే సంపన్నురాలా! అని అర్థం. సంపన్నురాలైన ఓ అమ్మా! అని. ఏమిటా సంపద? అంటే భగవత్ గుణ సంపద కలిగి ఉండడమే గొప్ప సంపద. భక్తి సంపద కలిగిన భక్తురాలు ఈవిడ. ఈ సంపదలన్నీ కూడా బాహ్య వర్ణనలు లేవు. ఇవన్నీ కూడా దివ్యమైన భక్తి సంపదలనే వర్ణిస్తున్నారు. ఎటువంటి వంశంలో పుట్టావు నువ్వు అంటే అది కపటము లేని, దోషము లేని వంశము.
కుట్రమొన్రిల్లాద కోవలర్తమ్ పొర్కొడియే - కుట్రమొన్రిల్లాద - అంటే ఏవిధమైన దోషమూ లేనటువంటి; కోవలర్తమ్ - గోపాల వంశంలో; పొర్కోడియే - బంగారు తీగలా పుట్టినటువంటిదానా! బంగారు తీగలా ఉందిట ఆమె. బంగారు తీగ అంటే శుద్ధమైన, ప్రకాశవంతమైన జ్ఞాన తత్త్వమే ఇక్కడ సువర్ణము. అలాంటి తీగలా ఉన్నది.
కట్రుక్క ఱ వైక్కణంగళ్ పలక ఱన్దు - దూడలు ఎన్నో కలిగినటువంటి అనేకములైన ఆవుల మందలని పితికేటటువంటి సమర్థత గలవారు అని అర్థం. గోపకులలో నిపుణత్వం ఏమిటి? - అతి తేలికగా అతి తక్కువ సమయంలో ఎక్కువ ఆవుల పాలు పితకగలగాలి. అటువంటి వారు. పైగా ఆవులు ఎటువంటివి? గొప్ప దూడలు కలిగినటువంటి ఆవులు. ఇందులో ఉన్న ప్రత్యేకతను పరిశీలిద్దాం. అయితే కేవలం పాలు పితకడమే కాదు. వాళ్ళు శౌర్యవంతులు కూడా.
శట్రార్ తి ఱలళియచ్చెన్రు శెరుచ్చెయ్యుమ్ - దీనియొక్క బావం ఏమిటంటే శత్రువులయొక్క బలం తరిగిపోయేలాగ వాళ్ళపై దాడిచేసి యుద్ధం చేయగల నైపుణ్యం కలిగినటువంటి వారు. అంటే పాలు పితికేటటువంటి సమర్థతా ఉంది, వాళ్ళను బాధించే శత్రువులని ఎదుర్కొనగలిగే ప్రతాపము కూడా ఉన్నది. ఆ రెండూ ఉన్నది. ఇక్కడ చెప్పడంలో ఆ గోపకుల వంశ వైభవాన్ని చెప్పడమే కాదు ఆ గోపకులలో ఒకడైన వాడు కృష్ణపరమాత్మ. ఆయన ఎటువంటి వాడు? ఆయన పాలూ పితక గలడు, అవసరమైతే శత్రువులను అవలీలగా సంహరించగలడు. అలాంటి గోపనాధుడైన కృష్ణపరమాత్మకు చెందినదానా! ఇందులో బావాన్ని పరిశీలిద్దాం. గోవులు అన్న మాటకి శాస్త్ర సిద్ధమైన అర్థం ఏమిటంటే వేదమంత్రములే గోవులు. ఆ వేదమంత్రములకు దూడలు ఉన్నారుట. దూడలు అంటే ఋషులు అని అర్థం. భాగవతంలో మనకు ఈ పరిభాష కనపడుతూ ఉంటుంది. అందుకు వేదమంత్రములు గోవులు, ఋషులు దూడల వంటి వారు. అంటే ముందు దూడలు చేపితేనే మనకు పాలు దొరుకుతాయి. అలాగే ఋషుల వల్లనే మంత్రములు దివ్యమైన ఫలాలు మనకిస్తాయి. ఆ భావనతో ఇక్కడ చెప్తున్నారు. అందుకు అనేకమంది ఋషులు కలిగినటువంటి ఈ వేదమంత్రములు అంటే గోవుల సారాన్ని వాళ్ళు పిండారు. అంటే వేదమంత్రముల యొక్క సార స్వరూపమైన భగవత్ జ్ఞానాన్ని వాళ్ళు పొందారు అని అర్థం. అంతేకాదు సాధన చేసి జ్ఞానం పొందడమే కాదు శత్రువుల బలాల్ని వాళ్ళు తృణీకరించి ఓడించారు. దీని అర్థం ఏమిటంటే జ్ఞాన సాధనలో ఉండవలసినది శత్రువులను జయించగలగటం. ఇక్కడ శత్రువులు అంటే బాహ్యమైనటువంటి పెద్ద పెద్ద యోధులు అని అర్థం కాదు ఇక్కడ. ఇక్కడ శత్రువులు అంటే కామక్రోధలోభాది దుర్వికారాలు. ఇక్కడ దివ్యమైన వేదవాక్యముల ద్వారా భగవత్తత్వాన్ని తెలుసుకొని వాళ్ళు ఈ కామక్రోధాధి శత్రువులను జయించారు అని అర్థం. అసుర ప్రవృత్తులను జయించారు. అటువంటి వారు మహాత్ములు, గోపకులు. అలాంటి వారి వంశంలో ఈమె కలిగినది. అంటే భాగవత పరంపర కలిగినది. పైగా కుట్రమొన్రిల్లాద - ఏమాత్రం దోషం లేని అర్థం. భాగవతులు నిష్కపటమై, నిర్మలమైన శుద్ధమైన చిత్తవృత్తి కలిగినటువంటివారు. అలా నిర్మలమైన ఆ భాగవత పరంపరకి చెందిన ఓ తల్లీ! నువ్వు బంగారు తీగవి. పొర్కొడియే - అంటే బంగారు తీగె అనడంలోనే అక్కడ సువర్ణమయమైనటువంటి దివ్య తత్త్వాన్ని చెప్తున్నారు. ఇక్కడ సంబోధనలో పరాకాష్టకు చెందిన శబ్దం వాడింది తల్లి గోదాదేవి.
పుట్రరవల్ గుల్ పునమయిలే - అంటే ఒక పుట్టలో పాము ఎలా ఉంటుందో అలాంటి నితంబము కలిగిన దానా! అని. నితంబము అంటే పిరుదులు అని అర్థం. ఇక్కడ మనం భావన పరిశీలిస్తే చక్కని జడ, ఆ జడ పిరుదుల దాకా ఉందిట. ఇలా చెప్పడమే కాదు. మరొకవైపు అందమైన మాట పునమయిలే - అంటే విచ్చుకున్న పింఛంతో ఉన్నటువంటి నెమలి వంటి దానా! అని. పింఛం విచ్చుకున్నట్లుగా ఉన్నది. అలాంటి ఒక మహాయోగినియై కుండలినీ యోగ సిద్ధి పొందినటువంటి యోగీశ్వరి వంటి ఓ గోపికా! పోదరాయ్ - వెళదాం పద. ఎక్కడికి? దివ్యమైన స్నాన వ్రతానికి మనం ఇప్పుడు బయలుదేరదాం. పైగా నీయొక్క దివ్య తత్త్వముకి మేము పరవశించి ఇక్కడికి వచ్చాం. నీయొక్క చెలులము, నీయొక్క బంధువులము. శుట్రత్తుతోళిమా - శుట్రము - దీనినుంచే మనకు చుట్టము అనే మాట వచ్చింది. ఈ చుట్టాలు ఇక తోళిమార్ అంటే తోడు ఉన్నటువంటి చెలులు, వీళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చి గానం చేస్తున్నారు. ఎక్కడ అంటే నీ ముంగిట. నీ ముంగిటకి చేరుకొని
పుహున్దు ముగిల్వణ్ణన్ పేర్పాడ - ఇక్కడకి వచ్చి నీ ముంగిట నిల్చొని గానం చేస్తున్నాం. మేఘవర్ణునియొక్క; పేర్పాడ - నామములను కీర్తన చేస్తూ ఉన్నా ఇంకా
శిట్రాదే పేశాదే - కదలవేమి? మాట్లాడవేమిటి? అలా కదలకుండా మాట్లాడకుండా
నీ ఎట్రుక్కు రంగమ్ పొరు - నీయొక్క నిద్రకు ఏమిటమ్మా అర్థము? అంటున్నారిక్కడ.
No comments:
Post a Comment