నేడు మహాశివరాత్రి పర్వదినం
ఈరోజు అర్ధరాత్రి లింగోద్భవకాలమని ఉపవాసం ఉంటే మంచిదని , అభిషేకం చేస్తే
పుణ్యమని మనఅందరికి తెలిసిన విషయమే ! అలాంటి పరమ పవిత్రమైన రోజున ఒక్కసారి
ఈశ్వరతత్వాన్ని గురించి తెలుసుకుందాం .
త్రిమూర్తులలో అందరికంటే
సులభంగా భక్తులకు వశమయ్యేవాడు పరమేశ్వరుడు.విష్ణువు భక్తులను ఎంతో పరీక్ష
పెట్టిగాని అనుగ్రహించడు.కానీ శివుడు అలాకాదు.భక్తుడు ఎప్పుడు,ఏమి
అడుగుతాడా,ఎప్పుడు అతను అడిగినవన్నీ ఇచ్చేద్దామా అని పాపం ఆయనే
ఎదురుచూస్తూఉంటాడు.అంత మంచివాడు ఆయన.
ఒక్కసారి త్రిమూర్తుల బాధ్యతలు తెలుసుకుందాము .బ్రహ్మ ,విష్ణు,మహేశ్వరులు వరుసగా సృష్టి,స్థితి,లయ కారకులని మనకు తెలుసుకదా !
ఇహలోకంలో మన కష్టసుఖాల బాధ్యత విష్ణుమూర్తిది.అందుకు ఆయనను ప్రార్ధించాలి.
కానీ పరలోకంలో సుఖాలను అందించేవాడు పరమేశ్వరుడు.ఆయన మోక్షప్రదాత కూడా!ఒక్కసారి ఆయన ఎవరెవరిని ఎలా అనుగ్రహించాడో చూద్దాం !
దురుద్దేశ్యంతో అడిగినా , తన భక్తుడిని నిరాశతో పంపకూడదని ముందువెనుకలు
ఆలోచించకుండా భస్మాసురుడికి వరం ఇచ్చేసాడు.ఇదొక్కటి చాలు ఆయనకు భక్తులు
అంటే ఎంత ఇష్టమో తెలియడానికి.
గాండీవంతో తలపగలకొట్టినవాడికి పాశుపతాస్త్రం ఇచ్చేసాడు.
అల్పాయుష్కుడిని ,అవసానదశలో కేవలం తన లింగాన్ని కౌగలించుకున్న కారణాన్ని చూబించి చిరంజీవిని చేసేసాడు .
తిండిదొరక్క పస్తు ఉంటే నాకోసం ఉపవాసం ఉన్నాడు అనుకుంటాడు . దొంగతనం చేస్తే నా ప్రసాదం తిన్నాడు అంటాడు .
ఉమ్మి వేసి మాంసం ముక్కలు పెడితే , అతని నిష్కల్మషమైన మనస్సు చూడమంటాడు .
రావణాసురుడికి అత్మలింగాన్నే ఇచ్చేసాడు .
క్షీరసాగరమధనంలో అందరూ మంచిమంచివన్నీ తీసుకుంటే ఈయనమాత్రం
విశ్వశ్రేయస్సును దృష్టిలోపెట్టుకుని ఏమాత్రం సంకోచించకుండా విషం తాగేసాడు.
సాలెపురుగులూ ఈయనకే కావాలి.
పాములూ ఈయనకే కావాలి.
ఏనుగులూ ఈయనకే కావాలి.
అందరూ మంచివాళ్ళే అనుకునే చిన్నపిల్లవాడి స్వభావం.
ఎప్పుడూ తనగురించి పట్టించుకోడు మహానుభావుడు.నేను ఎక్కడున్నా ఫరవాలేదు,ఏమి
కట్టుకున్నా,ఏమి తిన్నాఫరవాలేదు,ఎలావున్నా ఫరవాలేదు,కానీ నావాళ్ళందరూ
బాగుండాలి అనుకునే అతిమంచి దేవుడు.
మనం కష్టపడడం అస్సలు చూడలేడు.నాకు మడి,దడి వద్దంటాడు.స్నానం చేస్తే నాకు పడదు అంటే,వద్దులే,కొంచం విభూది రాసుకో చాలు అంటాడు.
పులిహోర , చక్రపొంగలి ,దధ్యోజనం , ఇలాంటివన్నీ చేసే ఓపిక నాకు లేదు
అంటే,అవన్నీ నేను అడిగానా,కాసిన్ని నీళ్ళు నామీద పొయ్యి చాలు,అదే నాకు
సంతోషం అంటాడు.
చాలా SIMPLICITY ఉన్న దేముడు.గిట్టని వాళ్ళు ముక్కోపి,తిక్కశంకరయ్య అంటారుగానీ,అవన్నీ అబద్ధాలే !
తనకు ఎవరిమీద కోపం ఉండదు.తన భక్తులను మాత్రం ఏమైనా అంటే అప్పుడు
చూపిస్తాడు తన ప్రతాపం.దక్షయజ్ఞంలో కూడా తనను ఎంత అవమానించినా
పట్టించుకోలేదు.కానీ తన భక్తురాలైన సతిదేవిని అవమానిస్తే సహించలేకపోయాడు.
పైగా మనకు SPECIAL OFFERS ఇస్తాడు.శివరాత్రి నాడు మనం ఒక్కసారి` ఓం నమశ్శివాయ`అంటే లక్షసార్లు అన్నట్టు FEEL అవుతాడు.
ఆయన ఎప్పుడూ తను భగవంతుడు , మనం భక్తులం అనుకోడు . మనము,ఆయన అంత ఒకటి అనుకుంటాడు.అంత మంచివాడు.
మరెందుకు ఆలస్యం ! ఈరోజు కొంచం ఆయన జపం చేసి , కాస్త అభిషేకం చేసి చూడండి ! ఎంత పరవశించిపోతాడో !
ఓం నమః శివాయ.
హర హర మహాదేవ శంభో శంకరా.
No comments:
Post a Comment