What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 30 October 2015

విష్ణుమాయ - శ్రీ శివ మహాపురాణము. హిందూ ధర్మచక్రం.

విష్ణుమాయ - శ్రీ శివ మహాపురాణము. హిందూ ధర్మచక్రం.
శివుని ప్రేరణ వల్లనే విష్ణువుకు అటువంటి అభిప్రాయం కలిగిందనడం సమంజసం! శివమాయా ప్రెరితుడై శ్రీహరి, ఒక మాయా మహానగరి సృష్టించాడు. దానికొక రాజు - శీలనిధి. అతడికి అపారమైన అనుచరవర్గం... అతనికో కూతురు - పేరు శ్రీమతి. ఇలా అంతా సహజం అనిపించేటంత భ్రాంతిమయ మంత్రనగరి నారద సంచారానికి అతి చేరువలొ ఉండేలా నిర్మితమైంది.
తనకు తెలిసిన లోకాలే కాక, ఈ నగరి ఎక్కడ్నుంచొచ్చింది? అనే ఊహ అయినా చేయకుండా నారదుడా నగరిలో అడుగుపెట్టాడు. అదే మాయా విలసనం అంటే!
నారదుని రాకకు పరమానంద భరితుడైన ఆ మహా ఇంద్రజాల నగరి రాజు శీలనిధి స్వాగత సత్కార్యాలు యధావిధిగా చేసి, అంతఃపుర మందిరంలోకి ఆయనను తోడ్కుని వచ్చాడు. వేయి అప్సర స్త్రీల రూప లావణ్యాల్ని తిరస్కరించేటంత జగజ్జేగీయమాన సౌధర్యంతో రాజిల్లుతున్న తన కుమార్తె శ్రీమతిని చూపించి, ఆమె చేత మునీంద్రులకు నమస్కరింపజేశాడు. ఈమెకు త్వరలో స్వయంవరం ఏర్పాటు కానున్నది. ఉత్తముడైన భర్తను పొందే భాగ్యం కలిగించండి! దీవించండి! అన్నాడు.
సమవిభక్తాంగయై, సమ్మోహకారంగ పరిస్ఫుట సౌందర్య రాశియై, రతీమన్మథుల జంట ఏకరూపమై వెలిగినంత శృంగారోద్దీపకమై, వయ్యారాలుపోతూ తన ఎదుటనిలిచిన ఆ లీలా లలనామణిని చూసేసరికి, నారదునుకి మతి అదుపుతప్పింది. చిత్తచాంపల్యం అధికమైంది. అస్తు! అస్తు! అన్నాడే గాని , ఆమె అందాన్ని విస్తుపోయి చూస్తూ కన్నార్పకుండా కళ్లతోనే ఆ వనితారత్న సౌందర్యాన్ని గ్రోలుతున్నాడు నారదుడు.
శివ తపోభూమిలో, శివుడానవల్ల కాముణ్ణి దూరం తరిమిన నారద తపోనిష్ట, ఆ తపోభూమి వెలుపల నిష్పలమైంది. కామకేళీ మనో లగ్నత ఓడించింది. పెళ్లాడితే ఇటువంటి కన్యనే పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు.
కానీ, ఎలా?!... చూడబోతే తాను జడదారి. ఆమెవంటి అపురూప సౌందర్యరాశి తనబోటి మునిమ్రుచ్చు నెట్లువరిస్తుంది? శౌర్య పరాక్రమ విలసితమై, మదన సమ్మోహరూప సముపేతమై అలరారే ఎందరెందరో క్షత్రియ, దేవ , గంధర్వ కుమారులు... ఇందరిని కాదని - ఆమె తనదాకా వచ్చేదెలా? ఈ ఆలోచన కలగగానే, తనకు ఈ విషయంలో సహాయం చేయగలవా రెవ్వరా అని క్షణం యోచించాడు.
నారద గర్వభంగం-శ్రీ శివ మహాపురాణము
తనను సరిగ్గా అర్థం చేసుకోగలవాడు ఆ శ్రీహరి ఒక్కడే అని స్ఫురించడంతో, వైకుంఠం దారిపట్టి - శ్రీ మహా విష్ణువుకు తన మానసాన్ని వివరించాడా బ్రహ్మపట్టి.
'అందమైన రూపంలో నీకు సాటిరాగలవా రెవ్వరూలేరు ' అని జనార్థనుని పొగిడి - 'నీ రూపాన్ని నాకు ప్రసాదించి, పెళ్ళయ్యేవరకు అనుగ్రహించు! అ తర్వాత నా పాట్లేవో నేనుపడతాను ' అని వేడుకున్నాడు. కామమహిమ అంతటిది! కేవలం బాహ్యమైన ఆకర్షణ కలిగించే రూపం కోసం ప్రాధేయపడి యాచించాల్సిన పరిస్థితిని కల్పించింది.
లోలోన గుంభనగా నవ్వుకున్న నారాయణుడు సరేనన్నాడు. ఒక్క ముఖం తప్ప, మిగతా శరీరమంతా పురుషులకే సమ్మోహం కలిగించేటంత అందంగా మార్చి ముఖం మాత్రం వానరరూపంలో కనిపించేలా ఉంచేశాడు. ఎవరి ముఖం సంగతి వారికి తెలియదు కనుక, ఆ వీలును ఇలా ఉపయోగించు కన్నాడు విష్ణువు.
శ్రీహరినే నెరనమ్మిన నారదుడు, మారుని తలపులే మదిలో సందడి చేస్తుంటే మరో ఆలోచన లేకుండా, అత్యుత్సాహంతో స్వయంవరానికి బయల్దేరాడు. నారదుడు స్వయంవర సభామంటపంలో ప్రవేశించగానే, శివమాయా ప్రేరితులై రుద్రగణాధినేత లిరువురు చెరోపక్కా ఆయన్ను అనుసరిస్తూ (బ్రాహ్మణ వేషధారులై వున్నందున) నారదునికి అనుమానం రాకుండా మెలగసాగారు. చివరికి నారదుడు కూర్చున్న చోటికే వచ్చి ఇరువైపులా ఆశీనులయ్యారు.
శ్రీమతి పుష్పమలాధారిణి అయి, స్వయంవర సభావేదికను సమీపించింది. సభలోని అందర్నీ కలయజూసింది. కోతి ముఖంతో వచ్చిన నారదుని చూసే సరికి ఆమెకు అప్రయత్నంగా నవ్వురాగా, కామతప్తుడై వున్న నారదునికి ఆమె నవ్వు సుప్రసన్నంగా - తనపట్ల పరవశంగా వునట్లు తోచింది. తన ముఖారవిందాన్ని మరింత విప్పార్చి, ఆమెనే అలా చూస్తుండిపోయాడు నారదుడు.
ఆమె దగ్గరగా వచ్చి, మరోసారి తన ముఖాన్ని చూసి నవ్వడంతో అదంతా సుముఖంగానే వునట్లు భ్రాంతి చెందిన నారదునికి ఆశాభంగం కలిగిస్తూ తనను దాటి వెళ్లిపోయింది శ్రీమతి.
ఈలోగా మాధవుడు, అపర మన్మథుడిలా అక్కడికి రావడం - శ్రీమతి వరమాల అతడి కంఠసీమ నలంకరించడం వెన్వెంటనే జరిగిపోయాయి. హతాశుడయ్యాడు నారదుడు.
బ్రాహ్మణ వేషధారులై ఉన్న రుద్రగణాధిపు లిద్దరూ నారదుని అవస్థ కనిపెట్టి, "దేనికయ్యా అంత ఆందోళన?! ఆమె ఎవరికి చెందాలో వారికే చెందిందిలే! అయినా.. అందుకోడానికి నీకేం అర్హతవుంది? అందమైన లేదుకదా! అసలు నీముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా?" అంటూ ఎద్దేవా చేశారు.
సందేహిస్తూనే, తన ప్రతిబింబాన్ని అక్కడే వున్న కాచఫలకంలో చూసుకున్నాడు. వానర ముఖాకృతి అచ్చుగుద్దినట్లు కనిపించేసరికి, గ్రద్ద వాహనారూఢుడి మోసం గమనించి నొచ్చుకున్నాడు.
తనకు ఇరువైపులా చేరి వేళాకోళం చేస్తున్న ఇద్దరిని బ్రాహ్మణులుగానే భావించుకున్న నారదుడు, "సాటి బ్రాహ్మణుని సమయా సమయాలు గానక, పరిహసిస్తున్న మీరు బ్రాహ్మణ బీజాన రాక్షసులై జన్మించెదరు గాక!" అని శపించి, క్రోధావేశం చల్లారక వైకుంఠవాసుని కొంటె చేష్టను కడిగి పారేయ్యాలని వైకుంఠం దిక్కుగా పయనమయ్యాడు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML