అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణానికి ఎంతో ప్రత్యేకత ఉంది . పద్దెనిమిధి(18) పురాణాలలో గరుడపురాణం అతి ముఖ్యమైనది దీనిని వేదవ్యాసుడు రచించాడు .
ఇది విష్ణు మహత్యమును దెలుపు వైష్ణవ పురాణము . విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతునికి ఒకసారి మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు? ఆ జీవుడికి ఏయే గతులు కలుగుతాయి... తదితర సందేహాలు కలిగాయట. వాటన్నింటికీ విష్ణువే సమాధానాలు చెప్పి, గరుడుని సందేహ నివృత్తి చేశాడట.
గరుడుని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణం అని పేరొచ్చింది. అలాగే చనిపోయాక పాపులు దాటవలసిన వైతరణీ నది గురించి ఈ గరుడపురాణంలో స్పష్టంగా చెప్పబడినది .
ఈ పురాణంలోని విషయాలు గరుత్మంతుడి సందేహాలను తీర్చడానికి శ్రీమహావిష్ణువు చెప్పే సమాధానాలు మనకు అందులోని సారాంశాన్ని తెలియజేస్తుంది . దేహాన్ని వదిలిన అనంతరం ఆత్మ ప్రయాణం ... జీవికి ఎదురయ్యే పరిస్థితులు ఈ పురాణంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షణ భారతదేశంలోని కొన్ని కుటుంబాల్లో శ్రార్ధ సమయాల్లో గరుడ పురాణం చదవడం ఆనవాయతీగా వస్తోంది.
ఇలాంటి సందర్భాల్లో గరుడపురాణం చదవడం వలన చనిపోయిన తమ కుటుంబ సభ్యులకు ఉత్తమగతులు కలగడానికి తాము చేయవలసిన విధుల,ఆ సమయంలో చేయవలసిన ప్రధమ కర్తవ్యం గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అంతే కాకుండా తాము ఎలాంటి పనులు చేయకూడదనే విషయాలు కూడా బోధపడతాయి.
పరలోకంలో ఆత్మగా జీవుడు కొనసాగించే యాత్ర గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే వ్యాసభగవానుడు దానిని రచించాడు కనుక, నిస్సందేహంగా ఈ పురాణాన్ని చదవచ్చు.
ఆచార్యవాణి సంపుటములలో _ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ జగద్గురు
శంకరాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహా స్వామి వారు పురాణముల గురించి
మాట్లాడుతూ గరుడ పురాణం గురించి ఇలా చెప్పారు అని ఉంది.
"గరుడ పురాణం పితృలోకాల గురించీ, మనిషి గతించిన తరవాత ఆత్మ సంతృప్తికై
జరుపవలసిన శ్రాద్ధకర్మాదుల గురించీ చెప్తుంది. ఆ కారణం చేతనే శ్రాద్ధ
కర్మల తర్వాత, పితృకార్యాల తరవాత గరుడపురాణాన్ని చదవటం పరిపాటి."
నారద పురాణములో దీనిని గురించి - " మరీచే శృణు వచ్మద్య పురాణం గారుడం శుభమ్. గరుడా యాబ్ర వీత్ పృష్నో భగవాన్ గరుడాసనః" అని శుభమును గలిగించు పురాణముగా చెప్ప బడినది .
గారుడ కల్పములో విశ్వాండము నుండి గరుడుడు జన్మించుటను ,అతని చరిత్రమును పురస్కరించుకుని ఈ గరుడ పురాణము వెలసినది అని మత్స్య పురాణములో చెప్పబడినది .
అగ్ని పురాణము వలెననే ఈ పురాణము గూడా విజ్ఞాన సర్వస్వమని చెప్పవచ్చును. దీనిలో అనేక విషయములున్నవి .
అన్ని పురాణములలో వలెనె దీనిలోను బ్రహ్మాదుల సృష్టి ,వారు చేసిన ప్రతి సృష్టి ,వంశములు , మన్వంతరములు , వంశములలోని ప్రసిద్దులైన రాజుల కధలు ఉన్నవి .యుగ ధర్మములు ,పూజావిధానములు విష్ణుని దశావతారములు ,అనేక ధర్మములు, ఆయుర్వేదము, చికిత్సా విధానములు , చందశ్శాస్త్ర ప్రశంశ ,వ్యాకరణము ,గీతా సారాంశము మొదలగునవి అన్నియు వర్ణింప బడినవి.
గరుడ పురాణం భారతీయ విజ్ఞాన సర్వస్వం:
ఈ పురాణములో 2 ఖండములు ఉన్నవి ఈ కాండలొక దాని నుండి మరొకటి విస్తారంగా విభిన్నాంశాలతో వుంటాయి. అధ్యాయాల సంఖ్యలో కూడ పోలిక లేదు.,
పూర్వ ఖండము :
ఇందులో ఆచార్యకాండ లేదా ఖర్మకాండ అనే భాగం వస్తుంది.
ఆచార్యకాండ లేదా ఖర్మకాండ:
పూర్వఖండంలో బ్రహ్మాదుల ఆవిర్భావం, రాజుల కథలు, వ్యాకరణం, ఛందస్సు, యుగధర్మాలు, విష్ణువు దశావతారాలు వంటివి ఉన్నాయి.
ఆచారకాండలో 240 అధ్యాయాలు ఉన్నాయి.
ఆచారకాండలోని అధ్యాయాలలో 14 పురాణ లక్షణాలపై, 48 వైద్యంపై,
61 ధర్మశాస్త్రాలపై, 8 నీతులపై, 13 రత్నశాస్త్రంపై,
43 ఖగోళ, పదార్థతత్త్వ, వ్యాకరణాది విభిన్న విషయాలపై విజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి.
ఉత్తర ఖండము :
ఇందులో బ్రహ్మకాండ (మోక్షకాండ) ప్రేతకాండ (ధర్మకాండ) అనే భాగాలు వస్తాయి .
ఉత్తర ఖండంలోని ప్రథమాధ్యాయంలో "ప్రేతకల్పం" అనే భాగం ఉంది. అందులో మరణానంతరం జీవుడు ఏం చేస్తాడు... వంటి విషయాలుంటాయి. ఇంటిలో ఎవరైనా గతించినప్పుడు పఠించేది ఈ అధ్యాయాన్నే! ద్వితీయాధ్యాయాన్ని ఎవరైనా, ఎప్పుడైనా చదువుకోవచ్చు
ఈ ఖండంలోని ప్రధమ భాగము ప్రేత కల్పము అని చెప్పబడును.
చనిపోయిన వారి ఆత్మ శాంతి కై చేయదగిన కార్యములన్నియు అందులో చెప్పబడినవి. కావున దానిని ఆ పది రోజులలో చదువుట ఆచారముగా నున్నది. తక్కిన భాగములన్నియు పవిత్రముతో అన్ని పురాణముల వలెనె ఎప్పుడు కావలసిన అప్పుడు ఇంటిలో చదువుకొనుటకు వీలుగా నున్నవే .
నైమిశారణ్యము లోని శౌనకాది మునీంద్రులు సూతు నడుగగా ,వారి కతడీ గరుడ పురాణము నిట్లు వివరించెను.
ధర్మ లేదా ప్రేతకాండం:
ప్రేతకాండలో 50 అధ్యాయాలు,
ఇందులో మృతి, జీవాత్మ మరణానంతర ప్రయాణం, కర్మ, కర్మ నుండి విడుదల - అనే విషయాలు కూలంకషంగా చర్చించబడ్డాయి.
ఇందులో మరణానికి ముందు కనిపించే శకునాలూ, నరకానికి మార్గమూ, ప్రేత జీవనమూ, నారకీయ శిక్షలూ, స్వప్న శకునాలూ, అపరకర్మకాండాదులూ మరే పురాణంలోనూ లేనంతగా వర్ణింపబడ్డాయి. కర్మకాండ విధింపబడింది. ప్రేతాలు చెప్పిన స్వీయకథలూ ఉన్నాయి. బౌద్ధుల ప్రేతకథ కూడ చెప్పబడడం విశేషం. సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే పరమశివాదులకు ఈ విషయాలను వివరించం వల్ల ఇది పరమ పవిత్రత నాపాదించుకున్నది.
బ్రహ్మలేదా మోక్షకాండ :
బ్రహ్మకాండలో 30 అధ్యాయాలు ఉన్నాయి
శ్రీకృష్ణ గరుడ సంవాదరూపంలోనున్న బ్రహ్మలేదా మోక్షకాండ ఉపాధి, మాయ, అవిద్యలను ఖండించి నిజమైన జ్ఞానాన్ని ప్రతిపాదిస్తుంది. మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతాన్ని బలపరుస్తుంది. గయాక్షేత్రం వర్ణనను అనిందాపూర్వంగా ఈ పురాణం చేసింది.
తిరుపతి - తిరుమల అనే మాటలనైతే వాడలేదు గాని శ్రీనివాసుడు ఆయన కొలువైన కొండలన్నిటినీ కోనేటి పరంపరతో సహా ఈ పురాణం వర్ణించింది. ఇంకా ఎన్నో ఇతర క్లేశాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఈ కాండలు కలిగిస్తాయి.
ప్రతిమనిషికి భయం ఉండాలి. అది దైవభీతి కావచ్చు, పాపభీతి కావచ్చు... ఏదైనా. ఆ భయం లేకుంటే మనిషికి, మృగానికి భేదం లేకుండా పోతుంది. అందుకే ఋషులు ఎంతో ముందుచూపుతో పురాణాలను రచించి మానవజాతికి అందించారు.
ఈ పురాణాలన్నింటిలోనూ అది చేస్తే పాపం, ఇది చేస్తే పాపం అని భయపెడుతున్నట్లే ఉంటుంది. దాంతో వాటిని పక్కన పడేస్తాం. వాస్తవానికి మనిషిని సద్వర్తనలోకి నడిపించాలంటే భయం కూడా అవసరమే. అందుకే మన పెద్దలు అంతగా భయపెట్టారు. గరుడ పురాణంలో అన్నీ ఇలాంటి విషయాలే ఉంటాయి. మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.
No comments:
Post a Comment