What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 13 October 2013

మహిషాసుర మర్దిని


మహిషాసుర మర్దిని

పూర్వము దేవాసురులకు శతవర్షములు ఘోరమగు పోరు జరిగెను. దేవతలకు ఇంద్రుడు, రక్షసులకు మహిషాసురుడు నాయకత్వము వహించిరి. మహా పరాక్రమ సంపన్నులగు రాక్షసుల ముందు దేవసైన్యము పటాపంచలై పోయెను. దేవతలను జయించిన అనంతరము మహిషాసురుడు ఇంద్రపదవిని అధిష్ఠించెను. పరాభూతులైన దేవతలు త్రిమూర్తులకడ కరిగి తమకు సంభవించిన దుస్థితిని సవిస్తరముగా ఎరిగించిరి. దురాత్ముడగు మహిషాసురుని పాలనలో దేవతలెట్లు మర్త్యులవలె సంచరించవలసి వచ్చినదో తెలిపి శరణుకోరిరి. దేవతల దీనాలాపములు విని విష్ణుమూర్తి, శివుడు కోపఘూర్ణితనేత్రులైరి. వారి ముఖములు భయంకరములయ్యెను. వారి వదనముల నుండియు, ఇంద్రాది దేవతల శరీరములనుండియు మహాతేజస్సు వెలువడెను.

ఇట్లు వెలువడిన తేజోరాశి అంతయూ కలిసి ఒక స్త్రీ రూపమును ధరించెను. శివుని తేజస్సు ఆమె ముఖముగా రూపొందెను. విష్ణుమూర్తి తేజస్సు బాహువులుగాను, బ్రహ్మ తేజస్సు ఆమె పాదములుగునై శుభమూర్తియగు దేవిగా రూపొందెను. శివుడు ఆమెకు శూలము నిచ్చెను. విష్ణువు చక్రమును ప్రసాదించెను. ఇంద్రుడు వజ్రాయుధమును సమకూర్చెను. వరుణుడు పాశము నిచ్చెను. బ్రహ్మదేవుడు ఒక అక్షమాలను, కమండలువును ఇచ్చెను. హిమవంతుడు సింహమును వాహనముగా ఇచ్చెను. ఇట్లు సర్వదేవతలచే ఆయుధ భూషణాదులు సమర్పింపబడి ఆ దేవి మహాట్టహాసము చేసెను.

దేవతలు పరమానందంతో ఆ సింహవాహన మెక్కి అసురవధకై బయలుదేరగానే జయ జయ నాదములు చేసిరి. త్రిలోకములను గడగడలాడించిన అసుర సైన్యమునకు దేవికి యుద్ధము ఆరంభమయ్యెను. మహిషాసురుని పక్షమున అతని సేనానియగు చిక్షురుడును, చతురంగబల సమేతముగా సమరస్థలికి కదలివచ్చెను. ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, భాష్కలుడు, బిడాలుడు మున్నగు సురారులు యుద్ధములో పోరాడారు. దేవిని చంపుటకై వారు ఆమెను ఖడ్గములతో కొట్టిరి. చండికాదేవి వారి శస్త్రాస్త్రములను అవలీలగా ఖండించి వేసెను. దేవి వాహనమైన సింహము జూలు విదిల్చుచూ దావాగ్నివలె అసుర సైన్యమును నాశనమొనర్చెను. దేవి త్రిశూలముతోనూ, గదతోను రాక్షసులను వధించెను. సమరాంగణమంతయు ఖండములైన మొండెములతో, చేదింపబడిన శిరస్సులతో, తెగిపోయిన బాహువులతో భీభత్సముగా ఉండెను. మహిషుని సేనానియగు చిక్షురుడు అంబికపై ఆగ్రహముతో యుద్ధమునకు వచ్చెను. మేరు పర్వతము పై వర్షము కురిసినట్లు దేవి వానిపై బాణ వర్షము కురిపించి వాని సారధిని చంపి, చిక్షురుని శరీరమును బాణములతో గ్రుచ్చి వైచెను. సర్వ రాక్షస సైన్యము హతమయ్యెను.

అనంతరం మహిషాసురుడు తనగిట్టలతో భూతలమును దద్ధరిల్లునట్లు చేసి, కొమ్ములతో పర్వతములను ఎగురవైచుచు, భయంకరమైన రంకెలు వేయుచు దేవిని ఎదుర్కొనెను. తన పైకి వచ్చిన మహిషుని దేవి తన పాశముతో బంధించెను. వాడు అంత తన మహిషరూపము విడి సింహరూపము ధరించెను. అంబిక దాని శిరస్సును ఖండించి వైచెను. వెంటనే అతడు ఖడ్గహస్తుడైన మానవ రూపము ధరించెను. తత్ క్షణమే ఆ పురుషుని చేదించెను. అతడు వెంటనే పెద్ద ఏనుగు రూపమును ధరించెను. చండిక ఆ గజము యొక్క తొండమును ఖండించి వేసెను. ఆ మహాసురుడు తన మహిషరూపమును మరల దాల్చి ముల్లోకములను తల్లడిల్ల చేసెను. అప్పుడు జగన్మాతయగు చండిక క్రోధముతో "ఓరీ మూఢుడా! మరియొక క్షణములో నీకు అంతము తప్పదు." అని గర్జించుచు ఆ మహాసురునిపై విజృంభించి పాదముతో అతని కంఠమును త్రొక్కిపట్టి శూలముతో వానిని పొడిచెను. అతడు దేవి పాదము క్రింద చిక్కుకుని తన మహిష ముఖములో నుండి యధార్థ స్వరూపముతో సగము వెలువడెను.ఇట్లు సగము వెలువడి తన నిజ రూపముతో పోరాడుచున్న ఆ మహిషాసురుని శిరశ్చేద మొనర్చి కూల్చి వేసెను. దేవగణ మంతయు పరమ హర్షముతో దేవిని స్తుతించిరి.

సర్వదేవతా సమారాధితయగు దేవి అమంగళములను నశింపజేసి భక్తులకు మోక్షమును ప్రసాదించు జగన్మాత. ఆమె చరితము అద్భుతము.
 
https://fbcdn-sphotos-a-a.akamaihd.net/hphotos-ak-frc3/q71/1380658_459230350864137_1708100241_n.jpg

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML