సృష్టి, స్థితి, లయలకు కారకులు త్రిమూర్తులు. వీరు తమ భక్తులకు ఇచ్చు వరాలకు ఏదేని విపరీతాలు సంభవిస్తే, దాని వలన మానవాళికి హాని కలిగితే, తిరిగి వీరే ఏదో ఒక అవతారాన్ని ఎత్తి వారిని హతమార్చి సర్వమానవ సౌబ్రాత్రుత్వానికి మేలు చేస్తారు. అందులో భాగంగానే ఈ 'దశావతారాలు' అనగా పది అవతారములు. మొదటిది మత్స్యావతారం, రెండవది కూర్మావతారం, మూడవది వరాహావతారం, నాల్గవది నరశిం హావతారం, అయిదవది వామనావతారం, ఆరవది పరశురామావతారం, ఏడవది రామావతారం, ఎనిమిదవది కృష్ణావతారం, తొమ్మిదవది బుధ్ధావతారం, పదవది కల్కి అవతారం. దశావతారములలో విశిష్టమైన 'వామనావతారము గురించి తెలుసుకొందాము.
శ్రీ మహావిష్ణువు దుష్టశిషణ, శిష్టరక్షణా చేసేందుకై ప్రతి యుగంలోనూ ఒక అవతారరూపందాల్చి తన ఉనికిని చాటుకొంటాడు. అన్నీ అవతారాలలోకీ వామనావతారం విశిష్టమైనదిగా చెప్పవచ్చు. అప్పటివరకూ సృష్టిలోని జీవరాసులన్నిటియందూ తనను తాను ప్రతిష్టించుకొన్న ఆ శ్రీహరి ప్రధమంగా మానవావతారాన్ని ధరించిన రూపమే వామనావతారం.
అమృతపానం చేసిన దేవతలు రాక్షసులతో యుధ్ధం చేసి ఎంతో మందిని సంహరించారు. మరెందరినో ఓడించారు. ప్రహ్లాదుని మనుమడు వరోచనుడు. ఆ వరోచనుని కుమారుడు బలి. ఇంద్రునిచే ఓడించబడి, గురువైన శుక్రాచార్యుల వారివద్దకు వెళ్ళి తనకు కలిగిన అవమానాన్ని విన్నవించి కన్నీరు పెట్టుకొన్నాడు. శుక్రాచార్యులవారు బలి చేత 'విశ్వజిత్ ' అనే యాగం చేయించాడు. ఆ యాగంలో హోమాగ్ని నుండి బంగారు రధం, ఇంద్రుడి గుర్రాల వంటి గుర్రాలు, సింహం గుర్తువున్న ధ్వజం, దివ్య ధనస్సు, అక్షయాలైన అమ్ముల పొదలు, దివ్యమైన కవచం మొదలైనవి బలికి లభించినవి. బ్రహ్మ ఎప్పుడూ వాడిపోని మాలికలను ఇచ్చాడు. శుక్రుడు శంఖాన్ని ఇచ్చాడు. రాక్షసులకీ బలమూ, తేజస్సు, లభించిది. యుధ్ధ పరికరాలన్నిటినీ పొందిన బలి, దానవ సైన్యాన్ని కూడగట్టుకొని తిరిగి ఇంద్రుని మీదకు యుధ్ధానికి బయలుదేరాడు. రాక్షసుల ధాటికి దేవతలు భయపడి పోయి చెల్లాచెదురై పోయారు. ఇంద్రుడి రాజధానిని బలి చక్రవర్తి ఆక్రమించాడు. "శుక్రాచార్యుడు విశ్వజిత్తనే యాగం జరిపించి రాక్షసులకు ఎంతో శక్తిని సంపాదించిపెట్టాడు. వాళ్ళనిప్పుడు జయించడం చాలా కష్టం. మంచి రోజులు వచ్చేంతవరకు మీరెక్కడైనా తలదాచుకొని కాలం గడపండి" అని హితవు చెప్పాడు దేవతల గురువైన బృహస్పతి.
బలిచక్రవర్తి అన్నిలోకాలను తనవిగా చేసుకొని పాలించసాగెను. అనేక అశ్వమేధ యాగాలు చేశాడు. అతని కీర్తి ముల్లోకాలలో ప్రసిధ్ధమైనది. అడిగిన వారికి లేదనకుండా ఏదైనా ఇచ్చే దానగుణం గలవాడు బలి. అతని ధర్మపాలనలో ఎవరికీ ఏ కష్టాలూ కలగలేదు. అదితి తన కుమారులైన దేవతలు సర్వ సంపదలూ కోల్పోయి బాధపడుతుంటే కుమిలిపోయింది. భర్త కశ్యప ప్రజాపతి చెప్పినట్లు పయోవ్రతాన్ని ఆచరించి, వాసుదేవుని ఆరాధించింది. ఆమె భక్తికి మెచ్చి శ్రీమన్నారాయణుడు సాష్షాత్కరించాడు అదితికి పుత్రుడై పుట్టి దేవతలకు మేలుచేస్తానని వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు శ్రీమహావిష్ణువు. అదితి గర్భవతి అయినది. భాద్రపద శుధ్ధద్వాదశినాడు శ్రవణా నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీహరి జన్మించెను. అదితి, కశ్యపుల ఆశ్రమం పై పుష్పవృష్టి కురిసింది. గంధర్వులు గానం చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. అదితి కశ్యపులు చూస్తుండగానే వామనరూపంలో 'వటు ' వేషాన్ని స్వీకరించాడు శ్రీహరి. మహర్షులు వామనుడైన ఆ వటువుకు ఉపనయనాది సంస్కారాలు గావించారు. సవిత అతనికి గాయత్రిని ఉపదేశించింది. బృహస్పతి యఙ్ఞోపవీతాన్ని ఇచ్చాడు. భూమి కృష్ణా జపాన్ని, సోముడు దండాన్ని, తల్లి అదితి కాపీనాన్ని, దృలోకం చ్చత్రాన్ని, బ్రహ్మ కమండలాన్ని, సప్తరుషులు దర్బలను, సరస్వతి అక్షరమాలను, కుబేరుడు బిక్ష్కాపాత్రను ఎచ్చాడు. పార్వతి భిక్ష్క ఇచ్చింది.
వామనుడు బ్రహ్మ వర్చస్సుతో ప్రకాశిస్తూ అగ్నిహోత్రాన్ని ఆరాధించాడు. పురోహితులచే బలి అశ్వమేధయాగం చేస్తున్నాడని విని, వామనుడు అక్కడికి బయలుదేరాడు. నర్మాదానది ఉత్తరతీరాన, భ్రుగకచ్చము, అనే క్షేత్రములో బలి యఙ్ఞంసాగుతుంది. అంతదూరం నుంచి సూర్యతేజస్సుతో వస్తున్న వామనుణ్ణి చూసి ఎదురేగి తీసుకువచ్చారు. రుత్వికులు, బలి మనోహరుడైన ఆ బాల బ్రహ్మచారికి స్వాగతం చెప్పి ప్రక్షాళనం చేశాడు. పాపహరణం, మంగళకరమైన ఆ పవిత్ర జలాన్ని ప్రోక్షించుకొన్నాడు. "బ్రాహ్మణోత్తమా! తమరి దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైనది. మీకేది కావాలంటే అది అడగండి. తప్పక ఇస్తాను" అన్నాడు. అప్పుడు వామనుడు "నా పాదంతో మూడు అడుగుల నేల నాకిస్తే చాలు. అంతకంటే వేరేదీ కోరను." అన్నాడు.బలి, వామనుడి కోరిక ననుసరించి మూడు అడుగులనేలను ఇవ్వడానికి జలకలశాన్ని తీసుకొని దానంచేయడానికి సిద్దమైయ్యాడు. గురువైన శుక్రాచార్యుడు, శ్రీ మహావిష్ణువే వామనావతారునిగావచ్చాడని తెలియజేశాడు. "గురుదేవా సంపదలు శాశ్వతం కాదు. కీర్తి ఒక్కటే శాశ్వతం. ఆ మహావిష్ణువే ఈ రూపంలో నన్ను కరుణించడానికి వచ్చాడంటే అది నాభాగ్యం. యఙ్ఞాలు, క్రతువులచేత మహాపురుషులు శ్రీ మహావిష్ణువును ప్రార్ధిస్తుంటారు. మూడు అడుగుల నేల ఇవ్వడం చేతనే నాకా భాగ్యం లభిస్తుంది. ఆయన ఆరాధనయే నాబాద్యత" అంటూ విన్నవించుకొన్నాడు. అంత తన భార్య వింధ్యావళి సువర్ణ కలశంతో జలం పోస్తుండగా వామనమూర్తి పాదాలను కడిగి ఆ జలాన్ని శిరస్సు మీద ప్రోక్షించుకొన్నాడు బలి. ఆ సమయంలో ఆకాశం నుండి పూలవాన కురిసింది. దేవదుందుభులు మ్రోగాయి. బలి చక్రవర్తి దానగుణాన్ని లోకాలన్నీ ప్రకాశించాయి. బలి, వామనమూర్తి చేతిలో నీటిని పోసి దానం చేస్తుండగా శిష్యునిమీద వాత్సల్యంతో శుక్రాచార్యుడు దాన జలధార వామనుని చేతిలో పడకుండా పురుగు రూపంలో కలశ రంధ్రానికి అడ్డుపడ్డాడు. వామనుడు అది గ్రహించి కలశ రంధ్రంలో దర్భతో పొడిచాడు. శుక్రాచార్యుడికి అప్పటినుంచి ఒక కన్ను పోయింది. ఆటంకం తొలగిపోయి దానజలధార వామనుడి చేతిలో పడటంతో వామనుడు ఒక్కసారిగా తన ఆకారాన్ని ఆకాశందాకా పెంచాడు. శ్రీమన్నారాయణుని త్రివిక్రమావతారాన్ని తిలకించిన మహర్షులు, దేవతలు పులకించిన హృదయాలతో వేదమంత్రాలతో స్తుతించారు.
బలిచక్రవర్తిచే పాలించబడిన భూమండలాన్ని ఒకపాదంతో, రెండో పాదాన్ని పైలోకంపై మోపి, తనమూడో పాదం ఎక్కడ వేయమంటావని ప్రశ్నించాడు శ్రీహరి. సత్యవాక్పరి పాలకుడైన బలిచక్రవర్తి శిరస్సును వంచి "దేవదేవా! నీ మూడో పాదం నాశిరస్సుపై వుంచు." అని విన్నవించుకొన్నాడు. శ్రీ హరి ఆప్రకారమే చేస్తూ "దానవులలో శ్రేష్డమైన బలీ, నీ దానగుణానికి ఎంతో సంతోషిస్తున్నాను. నువ్వు సావర్ణి మన్యంతరంలో ఇంధ్ర పదవిని అధిరోహిస్తావు. అప్పటివరకూ విస్వకర్మచేత నిర్మించబడిన సుతలానికి అధిపతివై విరాజిల్లు." అని పలికాడు.
బలి సంతోషంతో "ధన్యోస్మి స్వామీ!" అంటూ శ్రీమహావిష్ణువు పాద భారంతో సుతలానికి వెళ్ళిపోయాడు. ఇంధ్రునికి తన పదవి దక్కింది. ఉపేంధ్రుడిగా, వామనుడిగా అవతారం దాల్చి సృష్టి పాలనను క్రమబధ్ధం చేసిన శ్రీ మహావిష్ణువు అవతారాలలో వామనావతార గాధను విన్ననూ, చదివిననూ జన్మ ధన్యమై, జీవితం ఆనందమయమై పోతుందని పురాణ ప్రాశస్త్యము.
No comments:
Post a Comment