శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సందర్భంలో జరిగిన ఒక విచిత్రమైన కథ ఇది.
భరతుడు శ్రీరామచంద్రుడి పాదుకలను గ్రహించి వెళ్ళిన తరువాత రాముడు, సీతా,
లక్ష్మణుడు చిత్రకూట పర్వతానికి చేరారు. ఆ పర్వత ప్రాంతంలో సీతారాములు
సుఖమయంగా జీవిస్తున్న రోజుల్లో ఒక రోజున ఆ
కొండకు ఈశాన్య దిక్కున కింది భాగంలో ఉన్న సెలయేళ్ళు ప్రవహించాయి. సుందర
ప్రదేశానికి సీతారాములు చేరుకున్నారు. అనేక పరిమళ పుష్పభరితమైన తరువులతో,
పండ్లతో నిండి ఉన్న చెట్లతో ఆ ప్రదేశమంతా అలరారుతుంది. సీతాదేవి ఆ
సెలయేటిలో స్నానం చేసి పక్కనే ఉన్న కొండ బండ మీద బట్టలను తడి
ఆర్చుకుంటున్నప్పుడు ఇంద్రుడి పుత్రుడు గర్వంతోనూ, మూర్ఖత్వంతోనూ కాకి
రూపంలో అక్కడకు వచ్చి సీతాదేవి వక్ష స్థలం మీద ముక్కుతో పొడిచాడు. ఆమె
పక్కనే వున్న మట్టి గడ్డలను తీసి ఆ కాకి మీద విసిరి కొట్టింది. అయినా మరి
కొద్దిసేపు దూరంగా వెళ్ళినట్టే వెళ్ళి ఆ కాకి మళ్ళీ వచ్చి సీతాదేవిని ఇంతకు
ముందు బాధించిన చోటే బాధించసాగింది. సీతాదేవి ఆ కాకి నుండి తనను తాను
కాపాడు కోవటానికి ఎన్నోరకాల ప్రయత్నాలు చేసింది. కానీ ఆ కాకి మళ్ళీ, మళ్ళీ
వచ్చి సీతను బాధించటతో ఆమె భయ వివ్వాలురాలు అవుతున్నప్పుడు శ్రీరాముడు
వచ్చి ఆమెను ఓదార్చాడు. రాముడు రాగానే కాకి ఎటో వెళ్ళిపోయింది. ఆ ప్రశాంత
వాతావరణంలో కొద్దిసేపు సీతారాములిద్దరూ ముచ్చటించుకున్నారు. మంద్రమలయ
మారుతం వీస్తుండగా రాముడికి మెల్లగా కునుకు పట్టింది. సీత ఆయనకు తలను తన
ఒడిలో పెట్టుకొని నిద్ర పుచ్చుతున్నప్పుడు కాకి మళ్ళీ దురాగతం
ప్రారంభించింది. కాకి తన ముక్కుతో, కాళ్ళతో సీతను రక్కి పొడిచింది. ఆ గాయం
నుండి స్రవించిన రక్త బిందువులు శ్రీరాముడి మీద పడ్డాయి. వెంటనే ఆయనకు
మెలకువ వచ్చింది. తన మీద రక్తపు బొట్లు పడటానికి కారణం తెలుసుకోవటానికి
ఆయనకు ఎంతో సమయం పట్టలేదు. తన ఎదురుగా ముక్కుకు, గోళ్ళకు రక్తం అంటి ఉన్న
కాకిని చూసి తాను కూర్చున్న దర్భాసనం నుండి ఒక దర్బను తీసి దాన్ని
మంత్రించి బ్రహ్మస్త్రంగా కాకి మీదకు ప్రయోగించాడు. ఆ బ్రహ్మస్త్రం
కాలాగ్ని లాగా జ్వలిస్తూ కాకిని వెంటబడి తరమసాగింది. అప్పుడు ఆ కాకి తనను
తాను రక్షించుకోవటానికి దేవేంద్రుడి దగ్గరకు మిగిలిన అన్ని లోకాలకు
తిరిగింది. కానీ రాముడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకుని కాకిని
రక్షించే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. అప్పుడా కాకి లోకాలన్నీ తిరిగి తిరిగి
చివరకు రాముడి వద్దకే వచ్చి ఆయన పాదాల మీద పడి శరణు వేడింది. శరణన్న వారిని
రక్షించే తత్వం ఉన్న శ్రీరామ చంద్రుడు ఆకాకికి అభయమిచ్చాడు. కానీ అంతలోనే
మరి తాను ప్రయోగించిన బ్రహ్మస్త్రానికి తిరుగుండదని మరి ఆ అస్త్రం
మాటేమిటని కాకిని అడిగాడు. అప్పటికి కానీ గర్వాంధుడు, మూఢుడు ఆయిన కాకికి
తాను చేసిన తప్పేమిటో పూర్తిగా తెలిసివచ్చింది. ఎంతో మంచి మనసుతో తనకు
అభయమిచ్చిన శ్రీరామ చంద్రుడు ప్రయోగించిన బ్రహ్మస్త్రాన్ని తాను గౌరవించటం
తన విధి అని అలా చేసయినా తనవల్ల జరిగిన తప్పునకు కొంతవరకైనా పరిహారాన్ని
చెల్లించుకోవాలన్న ఒక ఆలోచనకు ఆ కాకి వచ్చింది. వెంటనే రాముడి పాదాల మీద తన
తలను వాల్చి బ్రహ్మస్త్రం వ్యర్ధం కాబోదని అది తన కుడి కన్నును
తీసుకోవచ్చని కాకి వినయంగా రాముడికి చెప్పింది. కాకి అన్నట్లుగానే రాముడు
ప్రయోగించిన బ్రహ్మస్త్రం కాకి కుడి కన్నును దహించి వేసింది. దాంతో చావు
తప్పి కన్ను లొట్టపోయినట్లుగా అయి ఎలాగో ఒకలాగా ప్రాణాలను దక్కించుకుంది ఆ
కాకి. తాను ఇంద్రుడి కొడుకునన్న ఒక అహంభావం వల్ల ఆ కాకి చివరకు అలా తన
కన్నును పోగొట్టుకోవలసి వచ్చింది. రామాయణ కథలో కనిపించే ఎంత చిన్న సంఘటన
అయినా మానవాళికి నిత్యం ఏదో ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చేదిగా ఉండి
తీరుతుందనటానికి ఈ కథ ఒక చక్కని ఉదాహరణ

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment