కశ్యప ప్రజాపతి భార్యలలో అథితి దితి అని ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరిలో అథితికి దేవతలు పుట్టారు. దితికి రాక్షసులు జన్మించారు.. ఈ రాక్షసులని దేవేంద్రుడు ఘోరమైన యుద్ధం చేసి సంహరించాడు.. ఈవిషయం తెలుసుకున్న దితి ఇంద్రుడిని సంహరించే కొడుకుని కనాలి అని అలోచించి తనభర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్లి నిత్యం ఆయనకి సకల ఉపచారాలు చేస్తూ, సమయనూకూలంగా మాట్లాడుతూ, ఒగలు పోతూ, వివిధమైన శృంగార చేష్టలలో ఓలలాడిస్తూ, చల్లని వెన్నెల కురిపించేలా పలుకుతూ సేవలు చేస్తూ ఉంది..మృదు మధుర భావాలతో హృదయాన్ని రంజింపజేసింది. భక్తీ ప్రపత్తులతో కూడి పొగడ్తలతో సరస సంభోగాలతో మెప్పించింది. అపురూపమైన ఉపచారాలతో మగడి మనస్సు లోంగదీసుకుంది. అఖిలము ఎరిగిన కశ్యపుడంతటి వాడిని, హితవులు తలకెక్కే హొయల చేత వశం చేసుకుంది. పతుల మతులను బ్రమింపజేయలేని సతులు ఈలోకంలో ఉన్నారా?
ఏ తలపు ఎరుగకుండా ఉన్న పురుషులను చూసి బ్రహ్మదేవుడు పురుషుల మనస్సులు ప్రీతి కలిగించడానికి యువతులను సృజించాడు.అటువంటి మగువలకు వశం కాని మగవారు అరుదే! ఈవిధంగా తన సతి చేత లాలింపబడి.. ఆమె సేవలకి పొంగిపోయి వెనకాముందు ఆలోచించకుండా ఇలా అన్నాడు..
ఓ లతాంగి! నీ సేవలకి సంతుష్టుడిని అయ్యాను. నీకు ఏమి వరం కావాలో కోరుకో! భర్త సంతోషిస్తే భార్యలకు ఏమి కొరత ఏముంటుంది? సతులకు పతియే దైవం. సహలజీవుల హృదయేశ్వరుడు ఆ వాసుదేవుడు, నామ రూపాలు కల్పించబడిన ఇతర దేవతామూర్తులు, పురుషులు భర్త రూపంలో ఉన్న భగవంతుడినే ఆరాధిస్తూ ఉంటారు. అందువల్ల పతివ్రతలైన కాంతమణుల శ్రేయస్సు అకంక్షించినవారై ఏకాగ్రభావంతో ప్రాణేశ్వరుడైన పరమేశ్వరుడిని సేవిస్తూ ఉంటారు.. అటువంటి భావం నీలో కలిగినందు వలన నీకు వరం ఇస్తున్నాను. చెడునడత కలిగిన కద్రువ వినతలకు దుర్లభమైన వరాన్ని నీకు ప్రసాదిస్తున్నాను.. కోరుకోమనగా!
వరం కోరవచ్చిన నాకు వరమీయదలిస్తే ఇంద్రుడిని సంహరించగా అధిక తేజోవంతుడిని, బలవంతుడిని, సమర రంగంలో అజేయుడిని కుమారుడిగా ప్రసాదించు అని అనగా! ఉట్టిపడునట్టి వరం ఈ కటినురాలు ఇంత క్రూరంగా వరం కోరిందే! అని ఉలిక్కిపడి కశ్యపుడు తల్లడిల్లి! ఎటువంటి చంచల స్వభావం లేని నేను విధివశాన కర్మబద్ధుడనైతిని కదా! నేడు ఈ వికట సభావం గల మగువ మాయకు లోనై ఇంద్రియ నిగ్రహం కోల్పోయి పిచ్చివాడినైనాను.. ఇంద్రియలోలుడైన మానవుడు చిత్తము మలినం చేసుకొని పాతకములలో కూలకుండా ఉంటాడా? లోలితాత్ముడినైన నన్ను చూసి దైవం నవ్వదా? ఆహా! స్త్రీల విలాసాలు ఎంత విచిత్రమైనవి? కలకండతో సమానమైనటువంటి పలుకులతో, పద్మవిలాసం ఏర్పరచే మోముతో, చంద్ర కళల వంటి కళలతో, తులతూగే చెలులు క్రొత్త నెత్తురు ఉరకలెత్తించి, నిలువెల్లా కరిగించు నేర్పుతో, పువ్వులకు కూడా అరుదైన సుతిమెత్తని వలపులతో, తమకాన్ని రెట్టింపు చేసే తీయటి తలపులు ఉన్న తమ అందరాని గుండె లోతులతో ఎటువంటి దీరోదాత్తులను కూడా వశం చేసుకుంటారు.. ఈవిధమైన కాంతల చిత్తవృత్తి కాటువేయడానికి కాచుకున్న కాలసర్పం వంటిది..
కోరి సతులకు ఆత్మీయులంటూ ఎవరూ ఉండరు.. పతులైనన, సుతులనైనా, హితులనైనా బలవంతంగా అయినా, పరుల సాయంతో అయినా తమ ఆత్మతృప్తి కొరకు హింసపెట్టి తమపని నెరవేర్చుకుంటారు. అని చింతించి ఈమెకు నేనేమని బదులు చెప్పాలి? నావాక్కు వ్యర్థంకాదు. త్రిలోకాలు పరిపాలించే వాడైన ఇంద్రుడిని సంహరించగల కుమారుడిని వేడుతుంది. ఇంద్రుడు వదార్హుడు కాదు. అని తర్కించి.. ఏది జరిగితే అది జరుగుతుంది అని ఇలా చెప్పాడు..
నీవు కోరిన వరం సిద్ధించాలి అంటే ఒక ఏడాదిపాటు నియమంతో కూడిన వ్రతం చేయాలి. (ఇది మీకు కూడా ఉపయోగ పడుతుంది. ప్రయత్నం చేయండి.. మీరు కోరుకున్న సంతానం కలుగుతుంది. కాకపోతే వక్రమార్గం గల సంతానాన్ని మాత్రం కాంక్షించకండి). ఆ వ్రతవిధానం ఇది.. కశ్యపప్రజాపతి తన భార్య యైన దితికి చెప్పాడు..
ఎవ్వరియందు హింసాభావం పనికిరాదు. (మాంసాహారం కూడా తీసుకోకూడదు), పెద్దగా మాట్లాడకూడదు, కోపం అసత్యం కూడదు, గోళ్ళు, వెంట్రుకలు కత్తిరించుకొరాదు. ఎముకలు, కపాలాలు మొదలైన అమంగళ కరమైన వాటిని తాకరాదు. నదులలో సరస్సులలో తప్ప బావి నీళ్ళతో స్నానం చేయరాదు. నీచ్యులతో, దుష్టులతో మాట్లాడరాదు. విడిచిన చీర కట్టుకోకూడదు. మడిచిన పూలు పెట్టుకోకూడదు. ఎంగిలి అన్నం తినకూడదు. కాళీ మాతకు నివేదించిన అన్నం ముట్టరాదు. వెంట్రుకలు వచ్చిన అన్నం కాని, కుక్క, పిల్లి, పక్షులు, చీమలు ముట్టిన అన్నం తినరాదు. ఎల్లప్పుడూ శుచిగా ఉండాలి. దోసిటతో నీళ్ళు త్రాగరాదు. సంధ్యాసమాయాలలో జుట్టు విరబోసుకొని ఉండరాదు. అతిగా మితభాషినియై (తక్కువగా మాట్లాడాలి) ఉండాలి. అలంకారాలు లేకుండా ఉండకూడదు. ఆరుబయట సంచరించకూడదు. కాళ్ళు కడుక్కోకుండా పడుకోరాదు. తడి కాళ్ళతో పడుకోరాదు. పడమటి వైపు పడుకోరాదు. దిశమొలతో(వివస్త్రయై) పడుకోరాదు. సంధ్యా సమయాలలో పడుకోరాదు. ఎల్లప్పుడూ ఉడికిన వస్త్రాలు మాత్రమే ధరించి, మంగళకరమైన ద్రవ్యాలు ధరించి శుచిగా ఉండాలి. ప్రాతఃకాలంలో తూర్పు ముఖంగా కూర్చుని లక్ష్మి నారాయణులను ఆరాధించాలి. ఆహ్వాన, ఆర్ఘ్య, పాద్య, స్నాన, యజ్నోపవేత, అలంకార, పుష్ప, దీప, ధూపాది షోడశోపచారాలతో అర్చించాలి. ద్వాదశాగ్నులతో హోమకార్యం నెరవేర్చి నమస్కరించాలి. పదిమార్లు భగవన్నామాన్ని జపించాలి. గంధ, పుష్ప అక్షతలతో ముత్తైదువులను పూజించాలి. భక్తితో భర్తను సేవిస్తూ పుత్రుడు గర్భంలో ఉన్నట్లు భావించాలి.
ఈవిధంగా మార్గశిర మాస శుక్లపాడ్యమి మొదలుకొని ఈ వ్రతాన్ని ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని ఆచరించి చిట్టచివరి రోజు వ్రత ఉద్యాపనం తీసుకోవాలి.. పుంస్యవనం అనే ఈవ్రతాన్ని పన్నెండు మసాలా పర్యంతం పొరబాటు వాటిల్లకుండా ఆచరించినట్లయితే నీవు కోరుకున్న కొడుకు పుడతాడు. అని కశ్యప ప్రజాపతి చెప్పిన పలుకులు విని వ్రతం ఆచరించి గర్భవతి అయింది..
No comments:
Post a Comment