త్రిమతాలు
హిందూమతంలో దక్షిణ భారతదేశంలో భగవంతుని గురించి మూడు ముఖ్యమైన సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. వాటిని త్రిమతాలు అంటారు. ఆయా మతాలను ప్రతిపాదించిన ఆచార్యులను త్రిమతాచార్యులు అంటారు.
అద్వైతం లేదా స్మార్తం
విశిష్టాద్వైతం లేదా వైష్ణవం
ద్వైతం లేదా మధ్వం
పై పట్టికలో అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము అనే పదాలను సిద్ధాంతాలకూ; స్మార్తం, వైష్ణవం, మధ్వం అనే పదాలను ఆచారాలకూ ఎక్కువగా వాడుతారు.
వేదముల ఉత్తరభాగము ఆధారముగా వెలువడినది ఉత్తరమీమాంసా దర్శనము. దీనినే వేదాంత దర్శనమనీ, బ్రహ్మసూత్రములనీ అంటారు. ఇది వేదముల చివరి భాగమైన ఉపనిషత్తులనుండి ఉద్భవించినది. ఈ దర్శనము జీవాత్మకు, పరమాత్మకు గల సంబంధమును ప్రతిపాదించును. వ్యాస మహర్షి రచించిన బ్రహ్మసూత్రములను వేర్వేరు భాష్యకారులు వ్యాఖ్యానించిన విధముపై వేర్వేరు శాఖాభేదములు ఏర్పడినవి. ఆ విధంగా అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము - అనే మూడు ప్రముఖమైన సిద్ధాంతములు ఏర్పడినవి. మూడు ఆరాధనా మార్గములకూ ప్రబలమైన సాహిత్యమూ, సంప్రదాయమూ ఉన్నాయి. వాటికి అంకితమైన భక్తజనం కూడా అశేషంగా ఉన్నారు.
ఇక్కడ గుర్తించవలసిన విషయమేమంటే మూడు సిద్ధాంతాలూ వేదాలనూ, ఉపనిషత్తులనూ, బ్రహ్మసూత్రాలనూ ప్రమాణంగా అంగీకరిస్తాయి. ముగ్గురు సిద్ధాంతకర్తలూ అసాధారణ పండితులు. తమ భాష్యాలతోనూ, వాదాలతోనూ సమకాలీన పండితులను మెప్పించి, ప్రతివాదులను ఓడించి తమ సిద్ధాంతములకు గుర్తింపు, మన్నన సాధించారు. వారికి రాజులనుంచి లభించిన ఆదరణ అంతంతమాత్రమే. కనుక ఈ మూడు సిద్ధాంతాల ప్రావిర్భావమూ హిందూమతంలో సత్యశోధనకూ, పాండిత్యానికీ ఉన్న గుర్తింపుగా అంగీకరించవలసి ఉన్నది. మూడు తత్వములకూ ఉన్నతమైన గురు పరంపర, సుసంపన్నమైన సాహితీసంప్రదాయము, దృఢమైన ఆచారములు ఉన్నాయి.
అద్వైతం
ఇది ఆదిశంకరులుగా ప్రసిద్ధులైన శంకర భగవత్పాదులు ప్రతిపాదించిన సిద్ధాంతము.మూడింటిలోను మొదటిది. హిందూమతముపై అత్యంత ప్రభావము కలిగిన ఆలోచనామార్గములలో ఇది ఒకటి.
బ్రహ్మమొకటే సత్యము. మిగిలినదంతా మిధ్య. జీవాత్మకు, పరమాత్మకు (బ్రహ్మమునకు) భేదము లేదు. అలాగే అందరి లోని ఆత్మ బ్రహ్మ మయమే. మాయవలన అజ్ఙానము, దానివలన భేదభావము కలుగుచున్నవి. త్రాడును చూచి పాము అనుకొన్నవానికి భయము కలుగును. అది తాడు అని తెలియగానే భయము తొలగిపోవును. అలాగే జ్ఞానము వల్ల మాయను అధిగమించి, మోక్షము పొందుట సాధ్యము.
విశిష్టాద్వైతం
ఇది రామానుజాచార్యులు ప్రతిపాదించిన మార్గము. నిత్యానపాయినియై, నారాయణునితో సదా కలసి ఉండే లక్ష్మీదేవికి వారిచ్చిన ప్రాధాన్యత వల్ల ఈ సిద్ధాంతమును శ్రీవైష్ణవమని అంటారు. నారాయణారాధనలో కులవివక్షతను పూర్తిగా త్రోసిపుచ్చిన మార్గమిది.
జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు - మూడూ సత్యములని విశిష్టాద్వైతము అంగీకరిస్తున్నది. 'చిత్' అనబడే జీవునితోను, 'అచిత్' అనబడే ప్రకృతితోను కూడియే ఈశ్వరుడుండును. శరీరములో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉండును. ఆజ్ఞానవశమున జీవుల సంసారబంధమున చిక్కుకొందురు. భగవదనుగ్రహమువలన, సద్గురుకృప వలన, భగవంతునకు శరణాగతులైనవారు అజ్ఞానమునుండి విముక్తులై, మరణానంతరము మోక్షము పొందుదురు. అలా నారాయణ సాన్నిధ్యము పొందినవారికి మరుజన్మలేదు.
ద్వైతం
ఇది మధ్వాచార్యులు (ఆనందతీర్ధులు) ప్రతిపాదించిన తత్వము. మూడింటిలో చివరిది. పై రెండు సిద్ధాంతములనూ క్షుణ్ణముగా అధ్యయనం చేసిన తరువాత ప్రతిపాదింపబడినది.
జీవుడు, జగత్తు, దేవుడు - ఈ మూడూ వేరు వేరనీ, వాటి మధ్య భేదం ఎప్పుడూ ఉంటుందని ప్రతిపాదించింది. సకల కల్యాణ గుణ సచ్చిదానంద మూర్తియైన శ్రీమహావిష్ణువే సమస్తమునకు ఆధారము. వారివారి గుణకర్మలననుసరించి జీవులు తమోయోగ్యులు, నిత్య సంసారులు, ముక్తియోగ్యులు అను మూడు విధములు. దేవునకు, జీవునకు గల సంబంధము యజమానికి, దాసునకు మధ్య గల సంబంధము వంటిది.
ద్వైతం
మధ్వాచార్యులు ప్రవచించిన మతం. జీవాత్మ, పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతుంది. సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ కంటికి కనిపించని పరమాత్మ వాసుదేవుడి మీద ఆధారపడి ఉంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది.
'స్వతంత్రమస్వతంత్రంచ ద్వివిధమ్ తత్వ మిష్యసి' - స్వతంత్రము, అస్వతంత్రము అని తత్వము రెండు విధములు
మధ్వాచార్యుల చే స్థాపించబడిన మతము కాబట్టి దీన్ని మధ్వ మతము అని కూడ వ్యవహరిస్తారు
జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.
మధ్వమతము పంచ భేదములను ప్రవచిస్తుంది. అవి
1. జీవుడు వేరు బ్రహ్మము వేరు (జీవ - దేవ భేదము)
2. ఒక జీవుడుకి, ఇతర జీవులకు భిన్నత్వం ఉంది (జీవ - జీవ భేదము)
3. జీవుడికి, జడ జగత్తుకు భేదం ఉంది (జీవ - జడ భేదము)
4. జడ జగత్తు వేరు, బ్రహ్మము వేరు (జడ - దేవ భేదము)
5. జడ జగత్తులో ఒక వస్తువుకి, ఇతర వస్తువులకు భేదం ఉంది (జడ - జడ భేదము)
ఈ భేదాలు నిత్యం, శాశ్వతం. జీవుడు ముక్తి పొందిన తర్వాత కూడా ఆ భేదాలు కొనసాగుతాయి.
జగత్తు మిథ్య కాదు. సత్యం, ఎందుకంటే అది ప్రత్యక్షంగా మన ఎదుట కనిపిస్తుంది. అది అశాశ్వతమైనంత మాత్రాన లేదా నిరంతర పరిణామం చెందుతున్నంత మాత్రాన లేకుండా పోదు. ఒక వస్తువును పోలి మరొకటి ఉండదు. అన్నింటా భేదం ఉంది. ప్రతి వస్తువులోను ఇతర వస్తువుల లక్షణాలుండటం జరుగదు.
బ్రహ్మం సర్వోత్తమం. సమస్త సద్గుణాలు బ్రహ్మంలో ఉన్నాయి. బ్రహ్మం ఆనంద స్వరూపం. ఆనందం కారణంగానే దానిచే ప్రేరణ పొంది బ్రహ్మం తన లీలానిమిత్తం ఈ జగత్తును సృష్టించింది. జగత్తు బ్రహ్మంయొక్క వ్యక్తరూపం. సృష్టికిముంది జదజగత్తు సూక్ష్మరూపంలో అవ్యక్తంగా బ్రహ్మంలో ఉంటుంది. సృష్టి సమయంలో అది స్థూలరూపం పొంది వ్యక్తమవుతుంది. బ్రహ్మం తనను తాను వ్యక్తం చేసుకునే విధానమే ఆ సమస్త జగత్తు. అయితే బ్రహ్మం జగత్తుకు అతీతం. బ్రహ్మం లేదా ఈశ్వరుడు సర్వ స్వతంత్రుడు, సర్వజ్ఞుడు, సర్వ శక్తిశాలి, సర్వవ్యాపి.
జడజగత్తువలె జీవాత్మ కూడా స్వతంత్రుడు కాదు. కర్త కాదు. ఈశ్వరుడు మాత్రమే కర్త. జీవాత్మ తానే కర్త అనుకుంటాడు. అది భ్రాంతి. తాను కర్తను కానని, నిమిత్త మాతృడనని గ్రహించి ఈశ్వరునికి తనను తాను సంపూర్ణంగా అర్పించుకుని నిష్కామ కర్మ చేస్తే అది జీవునికి బంధనం కాబోదు. తాను కర్తను అని అహంకారంతోను, మమకారంతోను భ్రమ చెందడం వల్లనే జీవాత్మ సుఖదుఃఖాలకు తలవొగ్గవలసివస్తుంది.
§భక్తితోనే ముక్తి
భక్తి ఒక్కటే ముక్తిదాయకం. అది జ్ఞానపురస్కృతమైన భక్తి అయి ఉండాలి. జీవాత్మ తన స్వస్వరూప జ్ఞానం పొందిన తర్వాత సర్వకర్త అయిన ఈశ్వరుడిపట్ల పెంచుకునే భక్తి మాత్రమే ముక్తికి కారణం అవుతుంది.
జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత - ఈమూడూ వేర్వేరు. జ్ఞాత (తెలుసుకునేవాడు) లేకుండా జ్ఞానం ఉండదు. అలాగే జ్ఞేయం (తెలుసుకోబడే విషయం). జ్ఞాత, జ్ఞేయం లేకుండా జ్ఞానం లేదు. నిర్గుణ బ్రహ్మం, కేవల జ్ఞానం అనేవి లేవు.
జీవులు మూడు విధాలు. ఒక వర్గం భగవద్భక్తులై ధార్మిక జీవనం గడుపుతూ ముక్తులవుతారు. రెండవ వర్గం ఎప్పటికీ ముక్తులు కాలేరు. జననమరణ సంసార చక్రంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. మూడవ వర్గం భగద్విరోధులై శాశ్వత నరకం పొందుతారు.
ముక్తి నాలుగు విధాలు. ఒకటి సాలోక్యం - జీవాత్మ భగవంతుని లోకంలో భగవంతునితోపాటు నివసించడం, రెండు సామీప్యం - భగవంతుడి సన్నిధానంలో నివసిస్తూ కామితార్థాలను అనుభవించడం, మూడు సారూప్యం - భగవంతుని రూపం పొంది ఇష్టభోగాలు అనుభవిస్తూ ఆనందించడం, నాలుగు సాయుజ్యం - భక్తుడు భగవంతునిలో లీనమైనా ఆయన కంటే వేరుగా ఉంటూనే ఆయన ఆనందంలో పాలుపంచుకోవటం.
§మరికొన్ని సూత్రాలు
శ్రీమన్ మధ్వమతే హరి: పరతర: సత్యం జగతత్వతో
భేదో జీవగణా హరేరనుచరా: నీచోచ్చభావంగతా
ముక్తిర్నైజ సుఖానుభూతిరమలా భక్తిశ్ఛ తత్సాధనం
హెక్షాది త్రితయం ప్రమాణమఖిలాం నాయైకవెద్యో హరి
మాధ్వ దర్శనాన్ని ఈ క్రింది సూత్రాలు చాల చక్కగా వివరిస్తాయి.
1. హరియే సర్వోత్తముడు. మిగిలిన వారంతా తమ అర్హతను బట్టి పూజింపబడతారు.
అనగా తారతమ్య పధ్ధతి లో విలువకలిగి ఉన్నారు. (వారి వారి యోగ్యతను అనుసరించి ఒకరి తరువత ఒకరు పూజనీయులు) ఉదాహరణకు దేవతలలో హరి తరువాత లక్ష్మి, బ్రహ్మ-సరస్వతి,వాయు మూర్తి, భవుడు-భవాని, శేష, గరుడ, ఇంద్ర, మన్మథ, గురు, చంద్ర, సూర్య, వరుణ, అగ్ని,మను, యమ, కుబేర,విఘ్నేశ్వర వరుసగా పూజార్హులు (తమ సతులతో సహా).
2. పంచ బేధములు కలిగి ఉన్నందు వల్లనే ఈ విశ్వాన్ని మనము ప్రపంచము అని పిలుస్తాము.
3. ఈ జగత్తు ప్రవాహత సత్యము. అనగా, ప్రవాహములో పాత నీటి స్థానంలో క్రొత్త నీరు నిరన్తరంగా వచ్చి చేరుతునే ఉంటుంది. ఈ క్షణం లో మనం చూసిన నీరు మరు క్షణం ఉండదు. అంత మాత్రం చేత ముందు చూసిన నీటిని మనం అసత్యమని చెప్పుటకు వీలు లేదు. మనం ఏ క్షణం లో ఆ నీటిని చూసామో (గమనించామో) ఆ సమయములొ ఆ నీరు అక్కడ ఉన్నది కాబట్టి, ఆ క్షణానికి అది సత్యం.
4. జీవుడు హరి కన్న భిన్నుడు. స్వతంత్రము లేనివాడు. (జీవుడు దేవుడు ఒకరు కాదు, వేరు వేరు), హరి సేవ వలననే ముక్తిని/మోక్షాన్ని పొందుతాడు (స్వ-స్వరూప-ఆనంద-సంప్రాప్తి/ ముక్తిర్నైజ సుఖానుభూతి).
5. సద్భక్తి యే స్వ-స్వరూప-ఆనందానికి (ముక్తికి) సాధనం. (దేవుని పట్ల/విష్ణువు పై సద్భక్తి మాత్రమే మోక్షానికి సాధనము).
6. ప్రత్యక్షము (experience), అనుమానము(guess), ఆగమము(The Vedas, Upanishads) అనే 3 ప్రమాణములు అనుసరించి పై సూత్రములు నిర్ధారింపబడినవి.
7. హరి సర్ర్వోత్తమత్వము వేదములు తెలుపుతున్నవి.
విశిష్టాద్వైతం
విశిష్టాద్వైతం అనేది 11వ శతాబ్దిలో రామానుజాచార్యుడు ప్రతిపాదించిన వేదాంత దర్శనము. సాకారుడైన నారాయణుడు పరబ్రహ్మమైన భగవంతుడు అని ఈ తత్వము ప్రతిపాదించింది. నిత్యానపాయినియై, నారాయణునితో సదా కలసి ఉండే లక్ష్మీదేవికి వారిచ్చిన ప్రాధాన్యత వల్ల ఈ సిద్ధాంతమును శ్రీవైష్ణవమని అంటారు. నారాయణారాధనలో కులవివక్షతను పూర్తిగా త్రోసిపుచ్చిన మార్గమిది.
జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు - మూడూ సత్యములని విశిష్టాద్వైతము అంగీకరిస్తున్నది. 'చిత్' అనబడే జీవునితోను, 'అచిత్' అనబడే ప్రకృతితోను కూడియే ఈశ్వరుడుండును. శరీరములో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉండును. ఆజ్ఞానవశమున జీవుల సంసారబంధమున చిక్కుకొందురు. భగవదనుగ్రహమువలన, సద్గురుకృప వలన, భగవంతునకు శరణాగతులైనవారు అజ్ఞానమునుండి విముక్తులై, మరణానంతరము మోక్షము పొందుదురు. అలా నారాయణ సాన్నిధ్యము పొందినవారికి మరుజన్మలేదు.
దక్షిణ భారతదేశంలో భగవంతుని గురించి మూడు ముఖ్యమైన సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. వాటిని త్రిమతాలు అంటారు. ఇవన్నీ హిందూమతంలోని తాత్విక భేదాలు సూచించే సిద్ధాంతాలే. ఆయా మతాలను ప్రతిపాదించిన ఆచార్యులను త్రిమతాచార్యులు అంటారు.
అద్వైతం లేదా స్మార్తం
విశిష్టాద్వైతం లేదా వైష్ణవం
ద్వైతం లేదా మధ్వం
వేదముల ఉత్తరభాగము ఆధారముగా వెలువడినది ఉత్తర మీమాంసా దర్శనము. దీనినే వేదాంత దర్శనమనీ, బ్రహ్మసూత్రములనీ అంటారు. ఇది వేదముల చివరి భాగమైన ఉపనిషత్తుల నుండి ఉద్భవించినది. ఈ దర్శనము జీవాత్మకు, పరమాత్మకు గల సంబంధమును ప్రతిపాదించును. వ్యాస మహర్షి రచించిన బ్రహ్మసూత్రములను వేర్వేరు భాష్యకారులు వ్యాఖ్యానించిన విధముపై వేర్వేరు శాఖాభేదములు ఏర్పడినవి. ఆ విధంగా అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము - అనే మూడు ప్రముఖమైన సిద్ధాంతములు ఏర్పడినవి. మూడు సిద్ధాంతాలూ వేదాలనూ, ఉపనిషత్తులనూ, బ్రహ్మసూత్రాలనూ ప్రమాణంగా అంగీకరిస్తాయి. మూడు తత్వములకూ ఉన్నతమైన గురు పరంపర, సుసంపన్నమైన సాహితీసంప్రదాయము, దృఢమైన ఆచారములు ఉన్నాయి. పెక్కు అనుయాయులు ఉన్నారు.
విశిష్టాద్వైత ప్రవర్తకుడైన రామానుజాచార్యుడు క్రీ.శ. 1017లో జన్మించాడు. 1049లో సన్యాసం స్వీకరించాడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవునిపై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిరాని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆచార్యుడు తన జీవితంలో సాధించిదలచిన(సాధించిన) ముఖ్య ఉద్దేశ్యాలు రెండు:
మొదటిది, ప్రబలంగా కొనాసాగుతున్న, బౌధ్ధ, జైన, శైవ, వైష్ణవ సాంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఈ మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ, వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించటం.
రెండవది, ఆదిశంకరుని అద్వైత సిద్ధాంతంలోని లొసుగులను సరిదిద్ది, విశిష్టాద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించటం.
తన జీవితం ద్వారా ఈ ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలు:
సాంప్రదాయంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి వాటిని మానటమో మార్చటమో చేయటం ఆచార్యుని ప్రధమ కర్తవ్యం.
దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం.
మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది సరో తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యం చేయవలసిన పనిలేదు.
ఒక పని వల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు, తమకు కీడు జరిగినా, పదిమందికి జరిగా మేలుకై, తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు.
రామానుజాచార్యుడు 1137వ సంవత్సరంలో విష్ణుసాయుజ్యం పొందాడని కథనం. అనగా 120 సంవత్సరాల జీన కాలం. ఈ సంవత్సరంపై కొన్ని సందేహాలున్నాయి.
§ప్రధాన సిద్ధాంతం
విశిష్టాద్వైతం లేదా శ్రీవైష్ణవం ప్రకారం భగవంతుడు ఒక్కడే. అతడు సాకారుడు. అతడే నారాయణుడు. నిత్యానపాయిని అయిన లక్ష్మీదేవి నారాయణునినుండి వేరు కాదు. నిర్మలజ్ఞానానంద స్వరూపుడు. ఆ దేవదేవుడొక్కడే స్వతంత్రుడు. జీవి, ప్రకృతి పరతంత్రులు. పరమాత్మ నుండి ఆత్మ జన్మిస్తుంది. జీవాత్మ పరమాత్మ సన్నిధి చేరడమే మోక్షం. మోక్షానికి సాధనం అచంచలమైన విష్ణుభక్తి. భక్తితో పాటు ప్రపత్తి, అనగా మనసా వాచా కర్మణా భగవంతుని శరణాగతి పొందడం కూడా అత్యవసరం. మానవులందరూ సమానులు. మోక్షానికి అందరూ అర్హులు. కుల లింగ విచక్షణ లేకుండా లక్ష్మీనారాయణులను పూజించి చక్రాంకితాలు చేయించుకొని, మంత్రోపదేశం పొంది ఊర్ధ్వపుండ్ర ధారణ చేసినవారందరూ శ్రీవైష్ణవులే.[1].
నారాయణుడే సృష్టి స్థితి లయాలకు మూలము. చిత్తు జీవుడు. అచిత్తు ప్రకృతి. ఇవి రెండూ ఆయన శరీరము. సూక్ష్మ చిదచిద్విశిష్టుడుగా ఉన్న పరమేశ్వరుడు స్థూల చిదచిద్విశిష్టుడు కావడమే సృష్టి. ప్రకృతి మూలంగానే ఈ జగత్తు అంతా సృజింపబడుతున్నది. శ్రీ మహావిష్ణువు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే చతుర్వ్యూహాలు దాల్చుతాడు. వాసుదేవుడు తన భక్తులపట్ల వాత్సల్యంతో ఐదు మూర్తులుగా గోచరిస్తాడు. అవి
అర్చావతారము - దేవాలయాలలోని ప్రతిమలు
విభవావతారములు - రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు.
వ్యూహావతారములు - వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు.
సూక్ష్మావతారము - సంపూర్ణ షడ్గుణ సంపన్న పరబ్రహ్మము.
అంతర్యామి - సకల జీవనాయకుడు.
భగవంతుని అనుగ్రహానికి భక్తి ప్రపత్తులు ముఖ్యం. అందుకు ఉపాసనా విధానాలు.
అభిగమనము
ఉపాదానము
ఇజ్యము
స్వాధ్యాయము
యోగము
§ముఖ్య విషయాలు
త్రిమతములలో ఒకటి. ఈ మతమునందు చిత్తు, అచిత్తు, ఈశ్వరుఁడు అని పదార్థములు మూఁడు.
అందు చిత్తు అనఁగా ఆత్మ. ఆ ఆత్మ జ్ఞానేంద్రియ మనోబుద్ధి విలక్షణమై అజడమై ఆనందరూపమై నిత్యమై అణువై నిరవయమై నిర్వికారమై జ్ఞానాశ్రయమై ఈశ్వరునికి శేషమై ఉండునది. అజడము అనఁగా స్వయంప్రకాశము జ్ఞానాంతరాపేక్ష లేక తనకు తానే ప్రకాశించునది. అణువు అనఁగా అత్యల్ప పరిమాణము కలది. అట్టి పరిమాణము కలిగి ఒక్కచోట ఉన్నను శరీరము నందంతట సుఖదుఃఖానుభవము కలుగుట, దీపము ఒక్కచోటు ఉన్నను దానిప్రభ అంతట వ్యాపించునట్లు వ్యాపించునట్టి జ్ఞానముచే కలుగుచు ఉన్నది. శేషము అనఁగా లోపడినది. జ్ఞానాశ్రయము అనఁగా జ్ఞానమునకు ఆశ్రయమైనది. ఈజ్ఞానము ధర్మభూతము అని చెప్పఁబడును. ఇది సుషుప్తి మూర్ఛాదులయందు ప్రసరణము లేనందున ప్రకాశింపదు.
ఆత్మబద్ధుఁడు, ముక్తుఁడు, నిత్యుఁడు అని మూడుభేదములు కలవాఁడు. బద్ధుఁడు అనఁగా జననమరణాదిరూపసంసారమును అనుభవించెడి మన యాత్మ. ముక్తుఁడు అనఁగా భగవద్భక్తిచే సంసారము వదిలి మోక్షమును పొందిన యాత్మ. నిత్యుఁడు అనఁగా ఒకప్పుడును సంసార సంబంధములేని అనంత గరుడ విష్వక్సేనాదుల యాత్మ. ఈ ముత్తెఱంగులు కల ఆత్మలు ప్రత్యేకములు.
అచిత్తు అనఁగా జ్ఞానశూన్యమై వికారాస్పదమై ఉండునది. జలమునకు అగ్ని సంబంధముచేత వేడిమి కలుగునట్లు ఈ బద్ధాత్మకు అచిత్సంబంధముచేత అవిద్యాకర్మవాసనారుచులు కలుగుచు ఉన్నవి. అవిద్య అనఁగా అహంకార మమకారములు. కర్మము పుణ్యపాపములు. వాసన కర్మములచేత కలిగెడు సంస్కారము. రుచి విషయములయందు ఇచ్ఛ. ఆత్మకు విషయభోగములును తత్సాధన ప్రవృత్తులును అచిత్సంసర్గముచేత కలుగుచు ఉన్నవి. ఈశ్వరారాధన ప్రవృత్తియు తద్గుణానుభవములును తజ్జన్యపరమానందమును స్వాభావికములు.ఈ అచిత్తు శుద్ధసత్వము, మిశ్రసత్వము, సత్వశూన్యము అని మూఁడు విధములుకలది. అందు రజస్తమస్సులు కలియని కేవల సత్వగుణము కలది శుద్ధసత్వము. అది నిత్యమై జ్ఞానానందప్రకాశమై కేవల భగవదిచ్ఛ చేత గోపుర ప్రాకారాదిరూపముగా పరిణమించి అధోదేశమున ఎల్ల కలిగి ఊర్ధ్వభాగమునందును ప్రక్కలయందును ఎల్ల లేనిదిగా ఉండును. ఇది నిత్యవిభూతి అని పరమపదము అని చెప్పఁబడుచున్నది. మిశ్రసత్వము సత్వాదిగుణములు మూఁడును కలది. ఇది బద్ధుల జ్ఞానానందములచే కప్పుచు విపరీతజ్ఞానమును పుట్టించుచు, నిత్యమై మహదాది వికారముల పుట్టించునదియై ఈశ్వరునకు క్రీడాసాధనముగా ఉన్నది.
మఱియును ఈ అచిత్తు ప్రకృతి అని, అవిద్య అని, మాయ అని చెప్పఁబడుచు ఉన్నది. ఇది చతుర్వింశతి తత్వమయముగా ఉన్నది. అందు మొదటి తత్వము ప్రకృతి. దీనికి సత్వరజస్తమస్సులు గుణములు. ఇవి ప్రకృతికి సహజములై ప్రకృతిత్వావస్థయందు అప్రకాశములై కడమ అవస్థలయందు ప్రకాశములై ఉండును. సత్వము జ్ఞానసుఖములను వానియందు ఇచ్ఛను పుట్టించుచున్నది. రజస్సు రాగతృష్ణలయందు సంగమును పుట్టించుచున్నది. తమస్సు విపరీతజ్ఞానమును నిద్రాలస్యాదులను పుట్టించుచున్నది. ఈగుణములు ప్రకృతియందు సమములై ఉండినను ఈశ్వరునకు జగముల సృజియింప వలయునని ఇచ్ఛ కలుగఁగా వైషమ్యము పొందును. ఆవల ఆప్రకృతి నుండి మహత్తు అను తత్వము కలుచుచున్నది. అది సాత్వికము, రాజసము, తామసము అని మూఁడువిధములు కలది. అందుండి వైకారికము, తైజసము, భూతాది అని మూడు అహంకార తత్వములు కలుగుచున్నవి. వైకారికము అను సాత్వికాహంకారమువలన జ్ఞానకర్మేంద్రియములును, అంతరింద్రియమైన మనస్సును పుట్టుచున్నవి. భూతాది అనెడు తామసాహంకారమువలన శబ్దతన్మాత్ర పుట్టుచున్నది. అందుండి ఆకాశమును స్పర్శతన్మాత్రయును పుట్టుచున్నవి. ఆతన్మాత్రనుండి వాయువును రూపతన్మాత్రయు పుట్టుచున్నవి. ఆతన్మాత్రనుండి తేజమును రసతన్మాత్రయు పుట్టుచున్నవి. ఆతన్మాత్రనుండి అప్పును గంధతన్మాత్రయు పుట్టుచున్నవి. అతన్మాత్రనుండి పృథివి పుట్టుచున్నది. తన్మాత్రలు అనఁగా భూతముల సూక్ష్మావస్థలు. తైజసము అనెడి రాజసాహంకారము కడమ రెండు అహంకారములు కార్యముల పుట్టించుచున్నప్పుడు తోడుపడి ఉండును.
సత్వశూన్యము కాలము. ఇది ప్రకృతి పరిణామములకు ఎల్లహేతువై క్షణదినాది రూపముగా పరిణమించుచు నిత్యమై ఈశ్వరునకు క్రీడాపరికరమై శరీరభూతమై ఉండును. ఇది సర్వవ్యాపకము.
ఈశ్వరుఁడు నిఖిలహేయ ప్రత్యనీకుఁడై అనంతుఁడై జ్ఞానానందైక స్వరూపుఁడై జ్ఞానశక్త్యాదికల్యాణగుణ పరిపూర్ణుఁడై సకలజగముల సృష్టిస్థితిలయములకు కర్తయై చతుర్విధపురుషార్థప్రదుఁడై విలక్షణ విగ్రహముక్తుఁడై శ్రీ భూమి నీళానాయకుఁడై ఉండును. నిఖిలహేయప్రత్యనీకుఁడు అనఁగా అంధకారమునకు తేజమువలె వికారాది దోషములకు విరోధిగా ఉండువాఁడు. విలక్షణ విగ్రహమూర్తుఁడు అనఁగా అప్రాకృత దివ్యశరీరము కలవాఁడు. ఇతనికి సృష్ట్యాది వ్యాపారములకు ప్రయోజనము కేవలలీల.
ఈశ్వరుఁడు విచిత్రరూపముగా పరిణమించునట్టి ప్రకృతిని అధిష్ఠించి ఉండుటఁజేసి జగములకు ఉపాదానకారణము అని చెప్పఁబడును. అతనికి చిత్తును, అచిత్తును శరీరములు అని వేదములు చెప్పుచున్నవి. మన దేహములను ఆత్మ అధిష్ఠించి ఉండునట్లు, ఈశ్వరుఁడు ఆత్మలను శరీరాదులను అధిష్ఠించి ఉన్నాఁడు. ఆత్మకు ఆత్మ ఐనందున పరమాత్మ అని చెప్పఁబడుచున్నాఁడు.
ఈమతమునందు (మృత్తు ఘటాదిరూపముగ పరిణమింపఁగా ఆమృద్ఘటములకు నామభేదములు కాక వేరుభేదము లేనియట్లు) ఒక బ్రహ్మమే కార్యకారణాలను అధిష్ఠించి ఉండుటవలన కారణవిశిష్టబ్రహ్మమునకును కార్యవిశిష్ట బ్రహ్మముకును భేదములేదు. ఇదియే విశిష్టాద్వైతము అనఁబడుచున్నది. విశిష్టము అనఁగా కూడినది.
ఈశ్వరునకు పరవ్యూహవిభవాంతర్యామ్యర్చలు అని అయిదురూపములు కలవు. పరము అన నిత్యవిభూతియందు శుద్ధసత్వమయమై ఉండునట్టి దివ్యమంగళవిగ్రహము. వ్యూహము అన సృష్టిస్థితిసంహారాద్యర్థమై ప్రతిగ్రహించిన సంకర్షణ ప్రద్యుమ్నానిరుద్ధ రూపములు. విభవము రామకృష్ణాద్యవతారములు. అంతర్యామి అన జీవులలో ప్రవేశించి ఉండునదియు శుభాశ్రయమైన విగ్రహముతోడ వారికి ధ్యానముచేయతగి వారి హృదయకమలములయందు వాసము చేయునదియును అయిన రూపము. అర్చ అన ఆశ్రితులకు అభిమతములు అయిన ద్రవ్యములయందు మంత్రమూలముగా ఆవిర్భవించి ఉండునట్టి ఉనికి.
ఈమతమునందు సర్వపదార్థములును సత్యములు. కలలో కన్న అర్థములు సత్యములు. ఈశ్వరుఁడు ప్రాణుల యదృష్టానురూపముగా అస్థిరములైన పదార్థములను సృజించుచున్నాఁడు అని శ్రుతులు చెప్పుచున్నవి. సర్వజ్ఞానములును యధార్థములు.
బద్ధజీవుఁడు విషయవైరాగ్యాదుల చేత మోక్షేచ్ఛ కలిగి సదాచార్యునివలన వేదాంతార్థములను విని మననము చేసి వర్ణాశ్రమోచిత కర్మజ్ఞానములతో కూడిన నిధిధ్యాసనరూప భగవదుపాసనముచేత సంసారమువదలి అర్చిరాదిమార్గముగా పోయి నిత్యవిభూతికిని లీలావిభూతికిని నడుమను ఉండెడి విరజ అనునదిలో స్నానముచేసి దివ్యశరీరమును పొంది నిత్యవిభూతిని చేరి నిత్యముక్తులతోడ ఈశ్వరుని కల్యాణగుణములను అనుభవించుచు సర్వవిధకైంకర్యములను చేయుచు పునరావృత్తిలేని నిరతిశయానందమును అనుభవించుచున్నాఁడు.
ఇది వైష్ణవ విశిష్ణాద్వైతమత స్వరూపము. శైవమతము సహితము విశిష్టాద్వైతమేను. అందు సర్వము శివపరత్వము అని చెప్పుచున్నది. చిత్తు, అచిత్తు, ఈశ్వరుఁడు అనుటకు బదులుగా పశువు, పాశము, పతి అని చెప్పఁబడుచున్నది. వైకుంఠమునకు బదులు కైలాసము మోక్షస్థానమై ఉండును.
§వివరణ
ఆచార్య రామానుజాచార్యుడు చిత్ (జీవులు), అచిత్ (జడము), ఈశ్వరుడు (పురుషోత్తముడు) అను మూడు పదార్ధములను ఒప్పుకొనుచున్నాడు.అనంత సంఖ్యాకులగు జీవులును, ఈజగత్తును కలసి ఈశ్వరుని శరీరము; ఈజీవజగద్యుక్తమగు శరీరమునకు ఈశ్వరుడె ఆత్మ.1.స్థూల సూక్ష్మ చేతనాచేతన,బ్రహ్మముల ఏకత్వము, 2.ద్వైతాద్వైత శ్రుతుల అవిరోధము 3. బ్రహ్మముయొక్క సగుణత్వ సవిశేషత్వ, విభుత్వములు 4. బ్రహ్మముయొక్క నిర్గుణత్వ నిర్విశేషఖంఢనము 5.జీవుని అనుత్వ, బ్రహ్మస్వభావత్వ, దాసత్వములు 6. జీవుని బంధకారణమగు అవిద్య 7. మోక్షోపాయమగు విద్య 8. భక్తియొక్క మోక్షకారణత్వ, శ్రేష్ఠతలు 9. బ్రహ్మైక్యనిరాసన 10. అనిర్వచ్నీయవాదఖంఢనము 11. జగత్తుయొక్క సత్యత్వస్థాపన, 12. జీవజగత్తుల ఈశ్వర శరీరత్వము అను విషయములు ఇందు ఆలోచింపబడినవి.
రామానుజమతమున పదార్ధములన్నియు ప్రమాణ ప్రమేయబేధముల రెండు విధములు.అందు ప్రమాణములు ప్రత్యక్ష, అనుమాన, శబ్దములని విభజింపబడినవి.ప్రమేయము ద్రవ్యద్రవ్యములని రెండు విధములు. ద్రవ్యము జడాజడములని రెండు విధములు.జడము ప్రకృతి కాలమను రెండు విధములు.ప్రకృతి చతుర్వింశతిత్త్వాత్మకము.కాలము భూత, భవిష్యత్, వర్తమాన రూపము.అజడములు ప్రాక్, ప్రత్యక్ అను రెండు రూపములు. ప్రత్యక్ జీవేశ్వర భెధముల ద్విరిధము.జెవులు నిత్య, బద్ధ, ముక్తులని మూడు విధములు. అందు బద్దులు బుభుక్షు, ముముక్షు వులని రెండు విధములు. బుభుక్షులు అర్ధకామ పరులు, ధర్మకామ పరులని రెండు విధములు. ముముక్షువులు కైవల్య పరులు, మోక్షపరులుగా విభజింపబడుచున్నారు. భక్త, ప్రపన్న లని మోక్షపరులు రెండు తెగలు కలరు. ప్రపన్నలు మరల ఐకాంతికి, పరమైకాంతికి గా బేధముకలదు. పరమైకాంతికులు దృప్తులు, ఆర్యులు.ఈశ్వరుడు పర,వ్యూహ, విభు, అంతర్యామి, అర్చావతారమను ఐదు తెగలుగా విభజించినాడు.పరుడు నారాయణుడు.వ్యూహము వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధు లని చతుర్విధము, కేశవాదులు తదితర వ్యూహములు.మత్స్యాది, అవతారములు విభవములనబడెను. శ్రీరంగాది ఆలయములలో పూజింపబడు మూర్తివిశేషములు అర్చావతారములు. అద్రవ్యము సత్వ, రజః, తమః, శబ్ద, స్పర్స, రూప, రస, గంధ,సంయోగ, శాక్తులని పది విధములు.
ప్రమేయనిరుక్తి : యధావస్థిత వ్యవహారాను గునమగు జ్ఞానమే ప్రమేయమని నిర్వచించినాడు. అనగా, అన్యధాజ్ఞాన, విపరీతజ్ఞాన రహితమని భావము.దీనికి సాధనమగునదియే ప్రమాణము. ఈప్రమాణము ప్రత్య్క్ష, అనుమాన, శబ్దములని మూడు విధములు. ప్రత్యక్ష నిర్వికల్ప, సవికల్పములని రెండు విధములు. ఈ రెండును విశిష్ట విషయకములు. నిర్విశేషమగు జ్ఞానము అసంభవము. స్మృతి, ప్రత్యభిజ్ఞ భావాంతర రూపమగు అభావజ్ఞానము, యోగజజ్ఞానము, ప్రత్యక్ష-అంతర్గతములు. భ్రమ, స్వప్నాది జ్ఞానములు కూడా జ్ఞానములే. కనుక, 'సర్వం జ్ఞానం సత్యం సవిశేషవిషయంచ'. ఉపమానము, అర్ధాపత్తులు అనుమానాంతర్గతములు. అపౌరుషేయము నిత్యము అగు వేదవ్యాక్యమే శబ్దప్రమాణము.
శంకర మతమున జ్ఞానము నిరపేక్షము. రామానుజుమతమున అపేక్షికము. అద్వైతుల జ్ఞానము స్వప్రకాశము, నిర్విశేషము. మరియు ఈ జ్ఞానము ప్రత్యగాత్మ స్వరూపము. రామానుజుమతమున జ్ఞానము సవిశేష విషయకము, నిర్విశేషవస్తుజ్ఞానము అసంభవము. నిర్విశేషవస్తువే జ్ఞానస్వరూపమని శాంకరమతము.
అధికారి- కర్మఫలా నిత్యజ్ఞానమును బడసినవాడే బ్రహ్మ జిజ్ఞాసకు అధికారి. ధర్మానుష్ఠానానంతరము మోక్షేచ్చ. జ్ఞానకర్మలకు కార్యకారణ భావమున్నది. నిష్కామకర్మ వలన చిత్త శుద్ధి లభించును, పిదప జ్ఞానోదయమగును. కర్మజ్ఞానము లేకున్న బ్ర్మహ్మజిజ్ఞాసకు అధికారములేదు. మరియు ఈ జ్ఞానము సర్వాశ్రమ ధర్మాపేక్షము. శాంకర మతమున కర్మమీమాంస, బ్రహ్మ మీమాంసలు వేర్వేరు శాస్త్రములు. కర్మ జ్ఞానము లేకున్నను, సాధన చతుష్టయ సంపన్నుడైన, బ్రహ్మజ్ఞానాధికారము. కర్మలు చిత్త సుద్ధి కలిగించి, పారంపర్యముగ మోక్షకారణమగుచున్నవే కాని, సాక్షాత్కారణములు కావు. జ్ఞానమే మోక్షకారణము. ఈ భేధమువలన విశిష్టాద్వైతులు జ్ఞాన-కర్మసముచ్చయవాదులని, అద్వైతులు కేవలజ్ఞానవాదులని చెప్పబడుచున్నారు.
విషయము- స్థూల సూక్ష్మ చేతనాచేతన విశిష్టమగు బ్రహ్మమే రామానుజదర్శన విషయము. ఆ బ్రహ్మమే పురుషోత్తముడనబడు నారాయణుడు.ఈ బ్రహ్మము శబ్దగమ్యమని చెప్పబడుటవలన, నిర్విశేషము కాజాలదు.
సంబధము- రామానుజుడు శాస్త్రమును ప్రతిపాదకమగును, పురుషోత్తముని ప్రతిపాద్యమగును పేర్కొనుచున్నాడు. కేవలము శాస్త్రప్రమాణము వలననే బ్రహ్మమును మనము గ్రహింప వలెను. బ్రహ్మము సశరీరియా లేక అశరీరియా? ఇటువంటి ప్రశ్నలకి వేదమే ప్రమాణమని నిర్వచించినాడు.
ప్రయోజనము - అవిద్యా నివృత్తియే ప్రయోజనము అని నిర్వచించినాడు. ఉపాసనా బలమున బ్రహ్మ సాక్షాత్కారమైన జీవుని అవిద్య తొలగును. ముక్తుడు, ఈశ్వరదాసత్వరూపమున వెలయుచు, అపారమగు లీలానందమున ఆస్వాదించును.
పై నాలుగింటిని అనుబంధ చతుష్టయములు గా నిర్వచించెను.
బ్రహ్మము- ఏవంగుణ విశిష్టుడగు ఈశ్వరునికి అద్వైతవాదమున చోటున్నది కాని, ఈయన పర బ్రహ్మకాదు. ఈ గుణములలో కొన్నింటిని వారు, బ్రహ్మముయొక్క తటస్థలక్షణముగ అంగీకరించినారు. పర- బ్రహ్మమును ఆశ్రయించి పెంపొందిన వివర్తము. అద్వైతులకు ఈశ్వరుడుకూడా మాయాంతర్గతుడు, జీవుల వలే బద్దుడు కాడు, మాయాధీశుడు. నిర్గుణ బ్రహ్మము యొక్క ప్రతిబింబము.పారమార్ధిక దశయందు, శాస్త్రమువలే, ఈయన ఉనికి కూడా విలోపమందును.
ఈశ్వరుడు-పరుడు - రామానుజుని ఈశ్వరుడు పర,వ్యూహ, విభవ, అంతర్యామి, ఆర్చాభెదముల పమచ విధముల వెలయుచున్నాడు. శంఖ, చక్ర, గదా, పద్మధారి- చతుర్భుజుడు, కిరీటాదిభూషణ భూషితుడై, వైకుంఠవాసియగు నారాయణుడే ఈశ్వరుడు, పరుడు.
వ్యూహము - ఈయనయే సృష్ట్యాది నిమిత్తము వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులను వ్యూహరూపమున వెలయుచున్నాడు. వాసుదేవుడు షడ్గుణ పరిపూర్ణుడు. సంకర్షుణుడు జ్ఞానబలయుక్తుడు. ప్రద్యుమ్నుడు ఐశ్వర్య వీర్యయతుడు. అనిరుద్ధుడు వీర్య, శక్తి యుక్తుడు.
జీవుడు - జీవుడు బ్రహ్మముయొక్క శరీరము. కాని అణుపరిమాణ యుక్తుడు. బ్రహ్మము, జీవులకు సజాతీయ, విజాతీయ భేదములు లేవు, స్వగత భెదమున్నది. జీవులు బద్ధ, ముక్త, నిత్యులని మూడు విధములుగ చెప్పబడుచున్నారు. సంసార నివృత్తిని పొదనివారు బద్దులు, దేవ, మనుష్య, తిర్యక్, స్థావరములుగాగల జీవులదరు బద్దులే.
సాధన - ధ్యానము, ఉపాసనలను ముక్తిసాధనాలుగ గ్రహించినాడు. భక్తియే మోక్షోపాయము, జ్ఞానము కాదు. బంధము పారమార్ధికమగుట వలన,పరమమపురుషుని ప్రసాదమువలననే తొలగును. వేదనా, ధ్యాస ఉపాసనాశబ్దవాచ్యమగు నదియే భక్తియగును, దాని స్వరూపము తైలధారనుబోలు ధ్రువానుస్మృతి. ఇయ్యది, ఆశ్రయాది త్రివిధ దోషరహితమైన ఆహార శుద్ధ్యాదులవలన విశిద్ధతను పొందినవాని పక్షమున ప్రత్యక్షమూ పరణమించును.
ప్రపత్తి - ప్రతికూల విర్జనమును, అనుకూల సంకల్పపూర్వకమును, సర్వతోభావమును నగు ఆత్మసమర్పణయే ప్రపత్తి అనబడు న్యాసవిద్య.
ఉత్క్రాంతి-ముక్తి - ప్రాకృత దేహము తొలగి, అప్రాకృత దేహమున వైకుంఠమున కరిగి సమానభోగమును, బ్రహ్మామును, నారాయణుని ఆశ్రయించుటయే ముక్తి.ముక్తికి అర్హుడగు జీవుడు సుక్ర్తములను హితులకును, దుష్కృతములను శత్రువులకును, సంపదను దాయాదులకును వదలి వాక్కును మనస్సునను, మనస్సును హృదయమున నిలిపి, ముక్తిద్వారమగు సుషుమ్నానాడి యందు ప్రవేశించి, బ్రహ్మరంధ్రద్వారమున నిర్గతుడగును. పిదప సూర్య కిరణములను ఆశ్రయించి దిన, పక్ష, ఉత్తరాయణ, సంవత్సరాభిమానులగు దేవతల మార్గమున సత్కరింపబడి, సూర్యమండలమును భెదించుకొని కరుగును. అట, చంద్ర, విద్యుత్, వరుణ, ఇంద్ర, ప్రజాపతులను ఆతివాహిక -ప్రధప్రదర్శకుల సాయమును బడసి క్రమముగ విరజానాదిని చేరుకొనును. అట, సూక్ష్మ శరీరమును పరిత్యజించి దివ్య దేహమును బడసి ఇంద్ర ప్రజాపతులను ద్వారపాలకుల ఆదేశమున వైకుంఠమును ప్రవేశించి ఐరమ్మదమను సరోవరమును, సోమసవనమను అశ్శ్వత్థ వృక్షమును గాంచి అప్సరసలచే అభినందితుడగును. పిదప అనంత, గరుడ , విష్వక్సేనులకును, అచార్యులకును ప్రణమిల్లి భగవత్పర్యంక సమీపమునకు పోవును. ఆ పర్యంకమున ధర్మ పీఠమున, ఆసీనుడైయున్న నారాయణుడికి దాస్యానంద అనుభవమును పొందును. ఈ నిర్గమనమును ఉత్క్రాంతి లేదా గతి అనబడును.
అద్వైతం
అద్వైతం ( సంస్కృతం : अद्वैत वेदान्त ); వేదాంతానికి చెందిన ఒక ఉపశాఖ లేదా తాత్విక వాదం. హిందూ తత్వశాస్త్రాల ప్రకారం దీని అర్థం "వేదముల లక్ష్యము".[1] వేదాంతాల ఇతర ఉపశాఖలు ద్వైతం మరియు విశిష్టాద్వైతం. అద్వైతం అనగా భాషాపరంగా అర్థం "ద్వైతం"కానిది, జీవాత్మ, పరమాత్మల ఏకత్వ భావనే అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక.[2] ఆది శంకరాచార్యులు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.[3]
ఉపనిషత్తులలో జీవుడు, బ్రహ్మం, జగత్తును గురించి గురుశిష్యుల నడుమ చర్చలుగా వ్రాసి ఉన్నాయి[4]. ఈ ఉపనిషత్తులలో అనేక చోట్ల సాక్షాత్తు అద్వైతం అన్న పదం వాడకపోయినా జీవుడు బ్రహ్మ ఒకటే అన్న విషయాన్ని ప్రస్తావించబడినది. సుమారు క్రీ. శ. 600 లో రచించిన బృహదరణ్యకోపనిషత్ లో అద్వైతసూత్రాలు చాలా కనబడతాయి. క్రీ. శ 6 వ శతాబ్దంలో జీవించిన గౌడపాదులు ఈ ఉపనిషత్తుల సారం అద్వైతం అని వారు రచించిన మాండూక్య కారికలో చెప్పారు[5]. అద్వైతం అంటే "రెండవది-లేని" అని అర్థం. బ్రహ్మం, జీవుడు, జగత్ అని మూడు విషయాలు లేవు. ఉన్నదంతా ఒకటే, అది బ్రహ్మమే అని అర్థం. ఆయన శిష్యుడు గోవింద భగవత్పాదులు. వారి శిష్యుడు శంకరాచార్యులు[6].
ఇది స్మార్తమతము. ఇందు బ్రహ్మమని అవిద్యయని రెండుపదార్థములు కలవు. అందు బ్రహ్మము సత్యము, జ్ఞానానందాత్మకము, నిర్వికారము, నిరవయవము, నిత్యము, నిర్దోషము, విభువు. (సత్యము = కాలత్రయముచే బాధింపఁదగనిది. నిర్వికారము = రూపాంతరములు లేనిది. నిరవయవము = అవయవములు లేనిది. నిత్యము = కాలత్రయములయందు ఉండునది. విభువు = వ్యాపనము కలిగి ఉండునది.)
అవిద్య అపారమార్థికము, సదసద్విలక్షణము, జడము, సవికారము, సావయవము, అనాది సాంతము, అజ్ఞానరూపము. (అపారమార్థికము = మిథ్యా భూతము. బ్రహ్మతత్వజ్ఞానముచేత నివర్తించునది. ఇది వ్యావహారికసత్త అని చెప్పఁబడుచున్నది. వ్యవహారదశలో సత్తుగా తోఁచును కాని పరమార్థము కాదు. సదసద్విలక్షణము = సత్తనఁగా బ్రహ్మము, అసత్తనఁగా తుచ్ఛమయిన శశశృంగాది; పారమార్థికసత్తయిన బ్రహ్మముకంటెను ప్రమాణసిద్ధముగాని తుచ్ఛముకంటెను విలక్షణమైనది. బ్రహ్మమువలె పారమార్థికము కాదు, తుచ్ఛమువలె ప్రమాణములకు అవిషయమును కాదు.)
ఈయవిద్య సత్వరజస్తమోరూపగుణత్రయాత్మకము. దీనికి ఆచ్ఛాదకశక్తి, విక్షేపశక్తి అని రెండుశక్తులు ఉన్నవి. ఆచ్ఛాదక శక్తికల యవిద్యచేత ఆవరింపఁబడిన బ్రహ్మమునకు చీఁకటిలో ఉన్నమనుష్యునకువలె స్వస్వరూపజ్ఞానము చెడి విక్షేపరూపమయిన దేవతిర్యఙ్మనుష్యాది భేదజ్ఞానము కలుగుచున్నది. ఈదేవాదిభేదములు అన్నియు అవిద్యాపరిణామములుగాని పరమార్థములు కావు.
ఈచైతన్యరూపమయిన బ్రహ్మము శుద్ధ చైతన్యము, మాయావచ్ఛిన్నచైతన్యము, అంతఃకరణావచ్ఛిన్నచైతన్యము, వృత్త్యవచ్ఛిన్నచైతన్యము, విషయావచ్ఛిన్నచైతన్యము అని అయిదు భేదములుగలది. శుద్ధమైన బ్రహ్మస్వరూపమునకు ఈభేదములు అవిద్య మొదలుగాఁగల యుపాధులచేత కలుగుచున్నవి.
అందు శుద్ధచైతన్యము అనునది శుద్ధబ్రహ్మస్వరూపము.
మాయావచ్ఛిన్నచైతన్యము అనునది ఈశ్వరుఁడు. అతఁడె జగత్సృష్ట్యాదికర్త, సర్వాంతర్యామి, సగుణ బ్రహ్మము.
అంతఃకరణావచ్ఛిన్నచైతన్యము అనునది జీవుఁడు. ఆకాశగతములయిన సూర్యాదితేజములు తటాకాదులయందు ప్రతిబింబించునట్లు తేజోమయమయిన బ్రహ్మచైతన్యము అవిద్యాపరిణామములయిన అంతఃకరణములయందు ప్రతిఫలించుచున్నది. ఇందు బ్రహ్మము బింబము, అంతఃకరణములయందు తోఁచునట్టివి ప్రతిబింబములు, అవియె జీవులు. సూర్యాదిబింబములకును జలములయందు తోఁచునట్టి ప్రతిబింబములకును భేదము లేనట్లు, బ్రహ్మజీవులకు భేదము లేదు. ప్రతిబింబభూతజీవులకును అంతఃకరణ రూపోపాధిభేదమే కాక స్వరూపభేదము లేదు.
వృత్త్యవచ్ఛిన్నచైతన్యము అనునది అంతఃకరణ పరిణామరూపవృత్తులయందు ప్రతిఫలించు చైతన్యము. ఇదియె జ్ఞానము అని చెప్పఁబడుచున్నది. ఇది ప్రత్యక్షాదిభేదములచే అనేకవిధములు కలదిగా ఉన్నది.
విషయావచ్ఛిన్నచైతన్యము ఘటపటాదులు.
ఇందు మాయావచ్ఛిన్నచైతన్యమైన యీశ్వరుఁడు మొదట సృజింపఁగల ప్రాణివర్గముల తారతమ్యమునకు హేతువగు కర్మములను తోడుచేసికొని అపరిమితశక్తియుక్తమైన మాయను వశపఱిచికొని నామరూపాత్మకమైన సకలప్రపంచమును సృజియింప సంకల్పించి మొదట ఆకాశాది పంచభూతములను అపంచీకృతములను పుట్టించెను. అందు ఆకాశమునకు శబ్దమును, వాయువునకు శబ్దస్పర్శములను, తేజస్సునకు శబ్దస్పర్శరూపములను, అప్పునకు శబ్దాదులతోడ రసమును, పృథివికి శబ్దాదులతోడ గంధములును గుణములు.
పృథివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశమును అను నీపంచభూతములును, గుణత్రయాత్మకమయిన యవిద్య యొక్క కార్యములుగాన ఇవియు త్రిగుణాత్మకములు. సత్యగుణయుక్తములు అయిన యీభూతములచేత త్వక్చక్షుశ్శ్రోత్ర జిహ్వాఘ్రాణములు అనెడి జ్ఞానేంద్రియములు, మనోబుద్ధ్యహంకారచిత్తములు అనెడి యంతఃకరణ పరిణామములును పుట్టుచున్నవి. రజోగుణయుక్తములు అయిన యీభూతములచేత వాక్పాణిపాదపాయూపస్థములు అనెడి కర్మేంద్రియములు పుట్టుచున్నవి. రజోగుణముతో కూడిన భూతముల చేత ప్రాణాపాన వ్యానోదాన సమానములు అను పంచప్రాణములు పుట్టుచున్నవి.
ఈ పంచభూతములుచేతను, జ్ఞానకర్మేంద్రియముల చేతను, పంచప్రాణముల చేతను, మనోబుద్ధుల చేతను సూక్ష్మశరీరము పుట్టుచున్నది. ఈశరీరము లింగ శరీరము అని చెప్పఁబడును. ఈశరీరము పరలోక యాత్రకు అనుకూలమై మోక్షపర్యంతము ఉండునది.
తమోగుణముతోడ కూడిన యపంచీకృత భూతములచేత పంచీకృతభూతములు పుట్టుచున్నవి. పంచీకరణము అనఁగా ఆకాశాది పంచభూతములను మొదల ప్రత్యేకము రెండుగాభాగించి అందు ఒక్కొక్క యంశమును నాలుగేసిగా భాగించి ఆనాలుగింటిలో ఒక్కొక్క భాగమును భాగింపని యొక్కొక్క సగముతో చేర్చి కలపఁగా పంచీకృతభూతములు ఏర్పడియె. అందు ఆకాశార్ధమును కడమభూతములలో ఎనిమిదింట ఒక్కొక్కభాగమును చేర్పఁగా పంచీకృతాకాశము. ఇట్లు వాయ్యాదులను ఊహింపవలయును.
ఈ పంచీకృత భూతములచేతనే అండములును, వానికి లోఁబడిన పదునాలుగులోకములును, జరాయుజాది దేహములను పుట్టుచున్నవి. (జరాయుజములు = జరాయువువలనపుట్టునవి = మనుష్యాదులు. జరాయువు = గర్భముతిత్తి. అండజములు = అండమువలన పుట్టునవి = పక్షిసర్పాదులు, అండము = గ్రుడ్డు. స్వేదజములు = చెమటవలన పుట్టునవి = నల్లి మొదలయినవి. ఉద్భిజ్జములు = భూమిని చీల్చుకొని పుట్టునవి = వృక్షాదులు.)
ఇట్టి ప్రపంచమునకు మూలప్రకృతి పరిణామ్యుపాదానకారణము. ఘటమునకు మన్ను వంటిది. పరిణామి అనఁగా ఒక రూపము నుండి మఱియొక రూపమును పొందునది. బ్రహ్మము ప్రపంచమునకు వివర్తోపాదానకారణము; అనఁగా వెండి అను భ్రాంతికి శుక్తి వలె ప్రపంచభ్రమమునకు అధిష్ఠానము. (అధిష్ఠానము = స్థానము.) పరమార్థమయిన బ్రహ్మమునందు ప్రపంచమునకు అధ్యాసము గలుగుచున్నది. (అధ్యాసము = భ్రమము.)
ఇట్టి ప్రపంచరూపకార్యముల నాశము ప్రళయము అనఁబడును. అది నిత్యప్రళయము, నైమిత్తిక ప్రళయము, ప్రాకృతప్రళయము, ఆత్యంతికప్రళయము అని నాలుగువిధములు కలది. అందు ఆత్యంతిక ప్రళయము బ్రహ్మసాక్షాత్కారముచేత అవిద్యారూప కారణముతోడ సకల ప్రపంచనివృత్తి. (బ్రహ్మసాక్షాత్కారము = తనకును బ్రహ్మమునకును ఐక్యప్రత్యక్షము.) ఈసాక్షాత్కారము శ్రవణ మనన నిదిధ్యాసనములతోఁగూడిన వేదాంతవాక్యములచేత కలుగుచున్నది. (శ్రవణము = ఆచార్యునివలన న్యాయయుక్తములు అయిన యర్థములను వినుట. మననము = విన్నయర్థములందు విరోధశంకలు కలుగునప్పుడు దానిని పోఁగొట్టునట్టి మానసికమగు యుక్తివిచారము. నిదిధ్యాసనము = అనాదివాసనచేత విషయములయందు ప్రవర్తించి ఉండునట్టి మనసును విషయముల నుండి యీడ్చి ఆత్మయందు కదలనీక నిలుపుట.) ఇది సాక్షాత్కారరూపమయిన బ్రహ్మైక్యజ్ఞానమునకు చేరిన కారణము. ఈ జ్ఞానము పాపక్షయముచేత కలుగుచున్నది. కర్మానుష్ఠానముచేత పాపక్షయము గలుగును.
ఈ శ్రవణాదులయందు మోక్షేచ్ఛగలవారికే అధికారము. ఆమోక్షేచ్ఛయందు నిత్యానిత్యవస్తువివేకము, విషయఫలవైరాగ్యము, శమదమోపరతి, తితిక్ష, సమాధానము, శ్రద్ధ అనునవి ప్రయోజకములు. (శమము = అంతరింద్రియనిగ్రహము. దమము = బహిరింద్రియనిగ్రహము. ఉపరతి = చాంచల్యము లేమి. తితిక్ష = ఓర్పు. సమాధానము = ఒకచోటనే మనసు నిలుపుట. శ్రద్ధ = గురువులయందును శాస్త్రముల యందును విశ్వాసము.)
నిర్విశేషమయిన బ్రహ్మమును సాక్షాత్కరింప సామర్థ్యము లేనివారు సవిశేవిబ్రహ్మోపాసనము చేయవలయు. వీరికి సగుణబ్రహ్మోపాసనముచేత మనసు స్వాధీనపడఁగానే నిర్విశేష బ్రహ్మము తానే తోఁచును. సగుణబ్రహ్మోపాసనము చేయువారు అర్చిరాది మార్గముగా బ్రహ్మలోకమును పొంది అందు శ్రవణాదులచేత సాక్షాత్కారము కలిగి బ్రహ్మతోడ మోక్షమును పొందుచున్నారు. కర్మనిష్ఠులు ధూమాది మార్గముగా పితృలోకమును పొంది అందు సుఖానుభవములు చేసి మరల పుణ్యపాపానురూపముగ మనుష్యాది యోనులయందు పుట్టుచున్నారు. నిషిద్ధకర్మములను ఆచరించువారు రౌరవాదినరకములను పొంది అందు పాపానురూపంబుగా దుఃఖములను అనుభవించి మరల కుక్క నక్క మొదలుగాఁగల తిర్యగ్యోనులయందు స్థావరాదియోనులయందును పుట్టి నశించుచున్నారు. నిర్గుణ బ్రహ్మోపాసనము చేయువారు ప్రారబ్ధ కర్మములను మాత్రము అనుభవించి కడమ పుణ్యకర్మములను మిత్రులయందును పాపకర్మములను శత్రువులందును విడిచి కైవల్యమునుపొంది, నిరతిశయానందమును అనుభవించుచున్నారు.
ముందు గురువులు అద్వైతం గురించి చెప్పినా, శంకరాచార్యులు అద్వైతాన్ని క్రమబద్ధీకరించి, తర్కంతో ఋజువు చేసారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత -- ఈ మూడింటినీ కలిపి ప్రస్థానత్రయి అన్నారు. వీటికి అన్నిటికీ సమన్వయం చేకూర్చి, వాటి భావం అద్వైతం అని చాటారు. అప్పటి నుండి అద్వైతం బాగా ప్రచారంలోకి వచ్చింది. కేరళ నుండి ఉత్తరభారతదేశం వరకూ ప్రయాణించి చాలా మంది వేదాంతులతో వాదించి అద్వైతాన్ని నిలబెట్టారు[7]. దేశం నలుమూలలా మఠాలను స్థాపించి ఆయన శిష్యులైన పద్మపాదులు (తూర్పున పూరి లో), హస్తామలకులు (పడమరన ద్వారకలో), తోటకాచార్యులు (ఉత్తరాన జ్యోతిర్మఠంలో), సురేశ్వరాచార్యులు (దక్షిణంలో శృంగేరి లో) దేశం నలువైపులా మఠాలను ఏర్పరిచారు. ఆ తఱువాత ఆ మఠాలలో ప్రతీ గురువు ఒక శిష్యుడికి ఉపదేశం చేసి గురుపరంపర కొనసాగిస్తున్నారు.
అద్వైతాన్ని క్లుప్తంగా చెప్పే శంకరుని వచనాలు -
బ్రహ్మ సత్యం జగన్మిధ్య
జీవొ బ్రహ్మైవ నా పరః
బ్రహ్మమొక్కటే సత్యం. జగత్తు మిధ్య. ఈ జీవుడే బ్రహ్మం. జీవుడు, బ్రహ్మము వేరు కాదు. - ఇదే శంకరుని మాయావాదంగా ప్రసిద్ధమైనది. అయితే కంటికి కనిపిస్తున్న జగత్తు మిధ్య కావడమేమిటి? ఏనుగు తరుముకొస్తుంటే పారిపోవక తప్పదు కదా? - ఇందుకు మాయావాదం వివరణ : జగత్తులో జీవిస్తున్నంతకాలం దాని ఉనికి అనే భావనకు తగినట్లుగానే (అనగా అది యదార్ధమన్నట్లుగానే) ప్రవర్తించాలి. ఎప్పుడైతే ఇదంతా మిధ్య అన్న జ్ఞానం గోచరమౌతుందో అపుడు అందుకు అనుగుణమైన ప్రవర్తన దానంతట అదే వస్తుంది.
భారతీయ తత్వవేత్తలందరిలాగానే శంకరుడు కూడా జగత్తును దుఃఖమయమైన సంసార బంధనంగా దర్శించాడు. ఈ జీవితంలో సుఖం అనిపించేది ఒక భ్రమగా భావించాడు. మరి ఈ ఎడతెరిపి లేని దుఃఖానికి కారణం ఏమిటి? "ఆత్మానాత్మ వివేకం" అనే ప్రకరణ గ్రంధంలో శంకరుడు ఇలా వివరించాడు -
ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది?
పూర్వ జన్మ లలోని కర్మ వలన.
కర్మ ఎందుకు జరుగుతుంది?
రాగం (కోరిక) వలన.
రాగాదులు ఎందుకు కలుగుతాయి?
అభిమానం (నాది, కానాలి అనే భావం) వలన.
అభిమానం ఎందుకు కలుగుతుంది?
అవివేకం వలన
అవివేకం ఎందుకు కలుగుతుంది?
అజ్ఞానం వలన
అజ్ఞానం ఎందుకు కలుగుతుంది?
అజ్ఞానానికి కారణం లేదు. అది అనాదిగా ఉన్నది. (వెలుగు లేని చోట చీకటి ఉన్నట్లుగా. అందుకు కారణం ఉండదు.) దాని పుట్టుక ఎవరూ ఎరుగరు. అది మాయ. త్రిగుణాత్మకం. జ్ఞానానికి విరోధి. అదే అజ్ఞానం.
అనగా అజ్ఞానం వలన అవివేకం, అవివేకం వలన అభిమానం, అభిమానం వలన రాగాదులు, రాగాదుల వలన కర్మలు, కర్మల వలన పునర్జన్మ (శరీర ధారణ), అందువలన దుఃఖం కలుగుతున్నాయి.
ఆది శంకరాచార్యుడు
సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యుడు (Adi Shankaracharya). ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడే ఈ ఆచార్యుడు హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రధముడు. గొప్ప పండితుడు, గురువు, మహాకవి. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788 – 820 మధ్య కాలంలో శంకరుడు జీవించాడని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి.[1] శంకరుడు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది.
దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః
దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (- శివరహస్యము నుండి).
కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా
శ్రౌత,స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి,వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించాడు. (కూర్మపురాణం నుండి).
హిందూ మతంపై శంకరుని ప్రభావం అసమానమైనది. శంకరుడు సాధించిన ప్రధాన విజయాలు:
బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి, శంకరుడు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించాడు.
ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు వ్రాశాడు. తరువాత శంకరుని అనుసరించినవారికీ, శంకరునితో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయుక్తమయ్యాయి.
శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠాలను స్థాపించాడు. అవి శంకరుని సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి.
గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకథారా స్తోత్రం,శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్ధనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.
శంకరుని జీవితానికి సంబంధించిన వివిధ గాధలు, నమ్మకాలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి "చరిత్ర"లలో కొన్ని - [2][3] శంకరుని జీవిత గాధలో ఎన్నో అసాధారణమైన, అధిభౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి.
మాధవీయ శంకర విజయం - 14వ శతాబ్దికి చెందిన మాధవుని రచన
చిద్విలాస శంకర విజయం - 15 - 17 శతాబ్దుల మధ్యకాలంలో చిద్విలాసుని రచన
కేరళీయ శంకర విజయం - 17వ శతాబ్దికి చెందిన రచన
వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగారు.
సదాశివుడే ఆదిశంకరుని రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ,శివగురువు లకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడి లో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్ కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ,శివగురువు లు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్ధించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందారు. పార్వతీ దేవి, సుబ్రహ్మణ్య స్వామి కి ఏవిధంగా జన్మనిచ్చిందో, ఆర్యమాంబ శంకరునికి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకరవిజయం చెబుతోంది. శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితి లో ఉండగా జన్మించారు. ఆదిశంకరుని జన్మ సంవత్సరం గురించి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు క్రీ.శ. 788 లో జన్మించారు, కంచి మఠం ప్రకారం స్వామి రెండు వేల సంవత్సరాలకు పూర్వం, క్రీ.పూ. 509 సంవత్సరంలో [4] జన్మించారు.
శంకరుని బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరుడు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకథారా స్తోత్రాన్ని చెప్పారు. కనకథారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేస్తుంది.
ఒకరోజు శంకరుని తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు.
సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరుడు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరుడు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరాడు. దానికి ఆమె అంగీకరించింది. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది.
గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, "ప్రాత:కాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను" అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.
తల్లి అంగీకారం తీసుకుని శంకరులు కాలడి విడిచి, గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్ళారు. నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం లభించింది. వ్యాసమహర్షి కుమారుడైన శుకుని శిష్యుడు గౌడపాదులు. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే శంకరునికి అడవులనుండి నడచి వచ్చిన అలసట అంతా ఒక్కసారిగా తీరిపోయింది. గౌడపాదుల శిష్యులైన గోవింద భగవత్పాదులకు నమస్కారం అని స్తోత్రం చెయ్యగా గోవింద భగవత్పాదుడు ఎవరునువ్వు అని అడిగారు. శంకరులు దశశ్లోకి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు.
న భూమిర్నతోయం న తేజో నవాయుర్మఖంనేంద్రియం వా న తేషాం సమూహః
అనైకాంతి కత్వా త్సుషుష్త్యైక సిద్ధిస్తదేకోవ శిష్ట శ్శివ: కేవలోహం
నేను నింగిని కాదు, భూమిని కాదు,నీటినికాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తం గాని లేనివాడిని. నేను శివుడను. విభజనలేని జ్ఞాన సారాన్ని.
ఆటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరుని, గోవిందభగవత్పాపాదుడు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అన్నాడు. - "స ప్రాహ శంకర స శంకర ఏవ సాక్షాత్" (సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన పరమశివుడే ఈ శంకరుడు.)
శంకరులు వెంటనే గోవిందపాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తోంది. గురుసేవ తోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వప్రపంచానికి వెల్లడి చేశారు. గోవిందపాదులు శంకరునికి బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహావాక్యాలుగా బోధించారు. ఒకరోజు నర్మదా నదికి వరద వచ్చి, పొంగి పొర్లుతూ, గోవిందపాదుల తపస్సుకు భంగం కల్గించబోతుండగా శంకరులు తన ఓంకార శక్తితో నదిని నిరోధించారు. గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు ఆజ్ఞతో బ్రహ్మసూత్రా లకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసి చేరుకున్నారు.
వారాణసిలో శంకరులు
గురువునాజ్ఞతో శంకరులు వారాణసి చేరుకొని పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానమాచరించి, విశ్వేశ్వరుని సన్నిధిలో కొంతకాలం గడిపారు. అయస్కాంతం ఇనుపరజనును ఆకర్షించినట్లు, వేదసూక్ష్మాలు శంకరునికి వారణాసిలో బాగా అవగతమయ్యాయి. వారణాసిలోనే సదానందుడు అనే బ్రహ్మచారి శంకరునికి ప్రధమ శిష్యుడయ్యాడు.
మనీషా పంచకం
ఒకరోజు మాధ్యాహ్నికం (మధ్యాహ్నకాలకృత్యాలు) తీర్చుకోవడానికి గంగా నది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో నాలుగు శునకాలతో ఒక ఛండాలుడు అడ్డువస్తాడు. అప్పుడు శంకరులు, ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ ఛండాలుడు ఈ విధంగా అడిగాడు.
అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవచైతన్యాత్
ద్విజవర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛతి
సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలోనైనా, బ్రాహ్మణుడి లోనైనా ఒకేవిధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా, లేక లోపలనున్న ఆత్మనా? ఆవిధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు
ఆ మాటలువిన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశాడు. శంకరునికి పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈవిధంగా వివరించాడు: "వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు, అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలు మూలలకూ శిష్యులను పంపాలి." ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయ్యాక, నన్ను చేరుకుంటావు అని చెప్పి, శివుడు అంతర్ధానమయ్యాడు.
ప్రస్థానత్రయం
అలా శివుని అనుగ్రహంతో గంగలో పుణ్యస్నానం ఆచరించి, కాశీ నుండి బదరి కి బయలు దేరారు. బదరి లో ఉన్న పండితుల సాంగత్యంతో, పండితగోష్ఠులతో పాల్గొంటూ పన్నెండేళ్ళ వయస్సులో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాశారు. వారణాసిలో ఉన్నపుడే ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలుకు భాష్యాలు రాశారు. దీనినే ప్రస్థానత్రయం అంటారు. అనంతరం బదరి నుండి కాశీకి తిరిగి వెళ్ళి, ఆ భాష్యాల సారమైన అద్వైతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు. శంకరాచార్యులు సనత్ సుజాతీయం, నృసింహతపాణి, విష్ణుసహస్రనామ స్తోత్రము మరియు "లలితా త్రిశతి"లకు కూడా భాష్యాలు వ్రాశారు.
వ్యాసమహర్షి
ఒకరోజు శంకరుడు గంగా నది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల చర్చ తరువాత, ఆ వచ్చింది సాక్షాత్తూ వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి, అ విషయం శంకరునికి చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరుడు మాత్రమేనని ప్రశింసించాడు.
వేదవ్యాసుడు నిష్క్రమించ బోవడం చూసి, శంకరుడు 'నేను చెయ్యవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించ'మని వ్యాసుని కోరుతాడు. అప్పుడు వ్యాసుడు "లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులనేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే, నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్నివ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకిచ్చిన 8 సంవత్సరాల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరో 16 ఏళ్ళు అయుష్షు లభించుగాక" అని దీవిస్తాడు.
శంకరాచార్యుని శిష్యులు
శంకరునికి అనేకులు శిష్యులుగా ఉండిరి. ఆయన ప్రజ్నాపాఠవాలకు కొందరు. చర్చలద్వారా ఓడింపబడిన వారు మరికొందరు ఇలా అనేకులు ఆయన శిష్యులుగా ఉండేవారు వారిలో అతి ముఖ్యులు కొందరు కలరు
పద్మపాదుడు
పూర్తి వ్యాసం పద్మపాదాచార్యులు
శంకరుని కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి ఆయన వద్దకు వచ్చి నేను బ్రహ్మణుడను, నా పేరు సనందుడు. నాది చోళదేశం మహాత్ములను దర్శించి జ్నానాన్ని ఆర్జించాలని వచ్చాను. మీ వద్ద శిష్యునిగా ఉండే వరమిమ్మని ప్రార్ధించాడు. అలా శంకరునుకు అత్యంత ఆత్మీయునిగా మారాడు.సదానందుడు శంకరునికి అత్యంత సన్నిహితంగా ఉండడంవల్ల తోటి శిష్యులకు కొద్దిగా అసూయగా ఉండేది. అది శంకరుడు గ్రహించి వారిలోని ఆ అసూయను పోగట్టదలచారు. ఒకరోజు గంగానదికి ఆవల ఉన్న సదానందుడ్ని పిలిచారు. వెంటనే సదానందుడు నది మీద నడుచుకొంటూ ఈవలకు వచ్చాడు. నది మీద సదానందుడు అడుగు వేసినచోటల్లా మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి. అది చూసిన తోటి శిష్యులు, సదానందుడిపై అసూయ పడినందుకు సిగ్గుపడ్డారు. అప్పటి నుండి సదానందుడు పద్మపాదుడు అయ్యాడు. పద్మపాదునికి సంబంధంచిన మరొక కథ. శ్రీ శంకరులు శ్రీ శైల పరిసరములలో చాలా కాలం తపస్సు చేసారు. శంకరులు తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో హిందూ ధర్మ ప్రచారము చేయుచున్నకాలమందు శంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందిచు యత్నముతో ఆపరిసరాలయందు భీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి కొంత ధనమునిచ్చి పంపించారు.అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుచున్న శంకరుని వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికెను.ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుని ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లిఖార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ కూర్చొని ఉండెను ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హటాత్తుగా ఈదృశ్యము కనిపించెను. వెంటనే అతడు మహోదృగ్గుడై శ్రీలక్షీనృసింహుని వేడనారంభించెను. ఇక్కడ శంకరును వధించుటకు ఉరికిన ఆదొంగలనాయకునిపై ఎటునుండొ హటాత్తుగా ఒక సింహము దాడి చేసినది అతడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది. తదనంతరము మిగిలిన శిష్యులకు ఈ విషయము తెలిసి పద్మపాదుని శక్తికి అతనికి శ్రీ శంకరులయందున్న భక్తికి అతనిని అభినందించారు.
కుమారిల భట్టు ను కలవడం
తన 15 వ ఏట, శంకరులు ప్రయాగలో ఉన్న కుమారిల భట్టును కలవాలని నిర్ణయించుకొని బయలుదేరారు. భట్టు వేదాలను తంతు లేదా ఆచార సంబంధమైన కార్యాలకు వినియోగించే వైదిక వృత్తికి చెందిన వ్యక్తి. ఒకప్పుడు తాను నేర్చుకున్న బౌద్ధమతసిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించి గురుద్రోహం చేసిన కారణంగా పశ్చాత్తాపంతో అగ్నిలో ప్రవేశించి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నాల్లో భట్టు ఉన్నాడు. శంకరులు ప్రయాగ చేరే సమయానికి భట్టు ఊకతో చేసిన అగ్ని గుండంలో నిలబడి ఉన్నాడు. భట్టు శంకరుని గుర్తించి, బౌద్ధానికి వ్యతిరేకంగా తాను చేసిన పనిని శంకరునికి వివరిస్తాడు. శంకరుడు రాసిన భాష్యాల గురించి తనకు తెలుసుననీ, వాటికి వార్తికలు (వివరణాత్మక వ్యాసాలు) వ్రాయాలన్న కోరిక తనకు ఉన్నదని కూడా వెల్లడిస్తాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న తన నిశ్చయం కారణంగా వార్తికలు వ్రాయలేనని, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుడు వ్రాస్తాడని చెప్పాడు. శంకరుని దర్శనంతో తన సర్వపాపాలు హరించాయని అన్నాడు. అప్పుడు శంకరుడు "శివుని పుత్రుడైన కుమారస్వామి గా నిన్ను నేనెరుగుదును. నీ చెంతకు పాపాలు చేరవు. అగ్ని నుండి నిన్ను రక్షిస్తాను, నా భాష్యాలకు వార్తికలు రచించు" అని కోరాడు. భట్టు అందుకు నిరాకరించి, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుని తర్కంలో ఓడించి, శిష్యునిగా చేసుకుని, ఆతనిచేత వార్తికలు వ్రాయించమని శంకరునితో చెప్పాడు.
భట్టిపాదుడు
భట్టిపాదుడు వేదవేదాంగాలు చదివిన జ్నాని. అతడు పుట్టేనాటికి భౌద్దమతం వ్యాప్తి జరిగి ఉన్నది. వైదిక ధర్మాలను హిందూ మత సిద్ధాంతాలను వ్యాప్తిచేయాలని అనుకొన్న భట్టిపాదుడు ముందు భౌద్దం గురించి తెలుకుంటే తప్ప దానిలో తర్కం చేయలేనని భౌద్ద బిక్షువుగా వేషం ధరించి ఒక భౌద్ద మతగురువు వద్ద భౌద్ద శాస్త్రాలను గురించి తెలుసుకోసాగాడు. ఒక నాడు ఒక భౌద్ద బిక్షువు హిందూ మతమును విమర్శించుచుండగా సహింపక వాదించుటతో వారతడిని మేడపైనుండి పడదోయగా ఒక కన్ను పోతుంది. దీనిపై ఆ రాజ్య రాజు విచారణ చేయగా భౌద్ద సన్యాసులతో ప్రసంగానికి పూనుకొని వారిని ఓడించి సభలో వేద ప్రభావం భోదించగా రాజు వేదప్రభావం గురించి చెప్పిన మిమ్ము పైనుంచి తోసివేసిన ఎలా పడినారు అని అడుగగా అది హఠాత్తుగా నేను ఏమరుపున ఉండగా జరిగినది. మీరు ఇపుడు పరిక్షీంచవచ్చు అని చెప్పగా రాజు మేడమీదనుండి త్రోయమని చెపుతాడు. భట్టిపాదుడు వేదపురుషుని ధ్యానిస్తూ వేదమే ప్రమాణమైతే నాకెటువంటి హానీ జరుగదు అనుకొంటూ దూకగా ఏ విధమైన దెబ్బలు తగలక వచ్చిన భట్టిపాడుని మరొక పరీక్షకు అహ్వానించి ఒక కాళీ కుండ తెప్పించి అందులో ఏమున్నది అని అడుగగా శ్రీమహావిష్ణువు ఉన్నడని చెపుతాడు. అందులో రాజుకు భోగశయనుడైన శ్రీమహావిష్ణువు దర్శనం ఇవ్వడంతో వేదాలను శాస్త్రాలను మాత్రమే ప్రమానంగా నమ్మి వైదిక కర్మలను ఆచరించని భౌద్ద బిక్షులను అందరినీ చంపమని ఆదేశిస్తాడు.దానితో అతని గురివుతో సహా అందరినీ చంపగా గురువును చంపినను, భౌద్దంలో ఉండగా ఈశ్వరుడే లేడని అన్నాను. ఇలా అనేక తప్పులు చేసిన నాకు చావే శరణ్యం అని తలచి చితి పేర్పించి కాల్చుకోడానికి తయారుకాగా శంకరుడు అక్కడకు వచ్చి వారిస్తాడు. తన సూత్ర భాష్యానికి వార్తికము రచించమి అడుగుతాడు. తనకు సాటికల మండన మిశ్రుడి ద్వారా ఆ కార్యము నెరవేర్చమని, శంకరుని చేతిమీదగా మోక్షము ప్రసాదించమని వేడుకొనగా శంకరుడు అంగీకరించి అతనికి బ్రహ్మ రహస్యాన్ని ఉపదేశించి ముక్క్తి ప్రసాదిస్తాడు
మండన మిశ్రునితో తర్క గోష్ఠి
మాహిష్మతిలో మండన మిశ్రుని ఇంటి వెళ్ళిన సమయానికి మండన మిశ్రుడు తన తపోశక్తితో వ్యాసభగవానుడిని, జైమినిమహా మునిని ఆహ్వానించి, వారికి అర్ఘ్యపాద్యాలు ఇస్తున్నాడు. శంకరుడు ఇంటికి రావడం గమనించి, తన ఇంటిలో సన్యాసులకు ప్రవేశం లేదని, అందువలన స్వాగతం పలకనని చెప్పాడు. అయితే, మహర్షుల ఆదేశంతో శంకరుని లోపలికి ఆహ్వానించాడు. తరువాతి రోజున చర్చ జరపాలని నిర్ణయించుకున్నారు. న్యాయనిర్ణేతలుగా వ్యాసుడు, జైమిని లను ఉండమని అభ్యర్థించగా,మండనమిశ్రుని భార్య అయిన ఉభయభారతి సాక్షాత్తూ సరస్వతీ స్వరూపమనీ, ఆమెను న్యాయనిర్ణేతగా ఉంచి గోష్ఠి జరపమనీ వారు చెప్పారు. ఉభయభారతి మధ్యవర్తి గా ఉండటానికి అంగీకరించి, వాళ్ల ఇద్దరి మెడలలోనూ రెండు పూలమాలలు ఉంచి, వాదనసమయంలో ఎవరి మెడలో పూలమాల ఒడిలి పోతే వాళ్లు ఓడిపోయినట్లు అని చెప్పింది. వాళ్లిద్దరూ వాదన ప్రారంభించిన తర్వాత కొంతసేపటి కి మండనమిశ్రుని మెడలోని మాల ఒడిలిపోయింది. కాని, భర్త శరీరం లో భార్య సగం కనుక తనను కూడా ఓడిస్తే కాని తన భర్త ఓడినట్లు కాదని ఉభయభారతి చెప్పింది. శంకరులు దానికి అంగీకరించారు. ఉభయభారతి ఎన్నో చిక్కు ప్రశ్నలను శరపంపరగా సంధించగా, శంకరులు అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పగలిగినా ఆమె చివరిగా డిగిన మన్మధ కళలెన్ని వాటి స్వరూపార్ధాలేమిటి,శుక్ల పక్షలందు స్త్రీ పురుషులలో జరిగే మార్పులేమిటి అని అడిగింది. బ్రహ్మచారియైన శంకరుడు వాటిని గురించి తెలుసుకొనే ఉద్దేశ్యంతో జవాబులు చెప్పేందుకు కొంత కాలం గడువు ఇమ్మని అడిగిగడు.
కామరూపవిద్య
శంకరుడు వందమంది భార్యలు కల అమరకుడు అనే రాజు చనిపోవుట గమనించి శిష్యులతో తన శరీరమును కాపాడమని చెప్పి రాజు శరీరంలో ప్రవేశించి అమరకునిగా నూర్గురు భార్యలతోనూ అనంగతంత్ర పాండిత్యంలో కల శ్రద్ద, ప్రీతి, రతి, దృతి, కీర్తి, మనోభవ, విమల, మోదిని, ఘోర, మధనోత్పాదిక, మద, దీసిని, వశకరి, రంజని,మోహిని అనే పదిహేను కళలూ నేర్చి తన శరీరంలో ప్రవేశించి ఆమెను పరాభూతురాలిని చేశాడు. చివరికి మండనమిశ్రుడు తన ఒటమిని అంగీకరించాడు. అప్పుడు అతనికి శంకరులు సన్యాసాన్ని ఇచ్చి, తన శిష్యునిగా స్వీకరించి, సురేశ్వరాచార్యుడుగా ప్రసిద్ధుడవుకమ్మని ఆశీర్వదించారు.
దిగ్విజయ యాత్రలు
తరువాత శిష్యులతో కలిసి శంకరులు మహారాష్ట్ర దేశంలోని పుణ్యక్షేత్రాలను, శ్రీశైలం వంటి ఇతర క్షేత్రాలను సందర్శించారు. శ్రీశైలంలో "శివానందలహరి" స్తోత్రాన్ని రచించారు. మాధవీయ శఁకర విజయం ప్రకారం ఒక కాపాలికుడు శంకరుని సంహరింపబోయినపుడు శంకరుని శిష్యుడు పద్మపాదుడు దేవుని ప్రార్ధించాడు. అపుడు శ్రీనృసింహుడు శంకరుని రక్షించాడు. ఆ సందర్భంలోనే శంకరుడు శ్రీలక్ష్మీనృసింహ స్తోత్రంతో దేవుని స్తుతించారు. ఈ స్తోత్రాన్నే కరావలంబస్తోత్రం అని కూడా అంటారు. [5]
తరువాత శంకరులు గోకర్ణంలో హరిశంకర మందిరాన్ని, కొల్లూరులోని మూకాంబిక మందిరాన్ని దర్శించారు. కొల్లూరులో మూగవాడనిపించిన ఒక యువకుడు హస్తామలకాచార్యుడనే పేరుతో శంకరుని శిష్యుడైనాడు. తరువాత శంకరులు శృంగేరిలో శారదా పీఠాన్ని స్థాపించారు. తోటకాచార్యుడు శంకరుని శిష్యుడయ్యాడు. పిదప శంకరులు దక్షిణ, ఉత్తర దేశాలలో తన "దిగ్విజయం" సాగించారు. హిందూ, బౌద్ధ పండితులను వాదాలలో ఓడించి అద్వైతాన్ని ఒప్పించారు. కేరళ, కర్ణాటక, సౌరాష్ట్ర దేశాలలో శంకర దిగ్విజయం సాగింది. గోకర్ణం, సోమనాధ, ద్వారక, ఉజ్జయినిలను దర్శించారు. బాహ్లిక దేశంలో జైనులను వాదంలో ఓడించారు. కాష్మీర, కాంభోజ దేశాలలో తాంత్రికులను కలుసుకొన్నారు.
సర్వజ్ఞపీఠం అధిరోహణ
కేదారనాధ్లో శంకరుని సమాధి మందిరం వద్ద ప్రతిమ
శంకరుడు కాష్మీర దేశంలో శారదాపీఠాన్ని సందర్శించారు. (ఇది ఇప్పుడు పాకిస్తాన్ అధీన ప్రాంతలో ఉంది[6] ఆ పీఠానికి నలుదిక్కుల ద్వారాలలో నలుగురు ఉద్ధండ పండితులు ఉన్నారు. కాని దక్షిణ ద్వారం అంతవరకు తెరువబడలేదు (అనగా దక్షిణ దేశంనుండి గొప్ప పండితులెవరూ రాలేదు). పండితులను మీమాంస వేదాంతాది తర్కాలలో ఓడించి శంకరులు దక్షిణ ద్వారాన్ని తెరిపించి అక్కడి సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు.
తన జీవితం చివరి దశలో శంకరులు కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించి విదేహ ముక్తుడయ్యారు. కేదారనాధ మందిరం వెనుక శంకరుని స్మృతి చిహ్నంగా ఒక సమాధి ఉంది. అయితే శంకరులు కేరళలోని త్రిస్సూర్లో దేహంవిడిచారని "కేరళీయ శంకర విజయం" చెబుతున్నది. [7] కాదు కంచి లో అని కూడా అంటారు.
శంకరుని జీవిత కాలము
శంకరుని జీవిత కాలం గురించి ప్రబలమైన అభిప్రాయాలున్నాయి.
క్రీ.పూ. 509 – 477 :ద్వారక, పూరి, కంచి మఠాల ఆచార్యుల గురించిన రికార్డుల ద్వారా ఈ కాలం నిర్ణయింపబడుతున్నది.[8]
అయితే శంకరుడు ధర్మకీర్తి అనే బౌద్ధ పండితునితో వాదం సాగించిన ఆధారం ప్రకారం ఈ కాలం గురించి సంశయాలున్నాయి. ఎందుకంటే ధర్మకీర్తి గురించి 7వ శతాబ్దంలో హ్యూన్త్సాంగ్ తన రచనలలో ప్రస్తావించాడు.[9] అంతే కాకుండా ఇంచుమించు శంకరుని సమకాలీనుడైన కుమారిలభట్టు 8వ శతాబ్దంవాడని భావిస్తున్నారు. దండయాత్రల కారణంగాను, మధ్యలో వచ్చిన అంతరాయాల కారణంగాను, ద్వారక మరియు పూరి రికార్డు కంటే శృంగేరి రికార్డులు మరింత పక్కాగా ఉండే అవకాశం ఉండవచ్చును.[9]
చతుర్మఠాల వ్యవస్థ
శృంగేరిలో విద్యాశంకర మందిరం
(జగద్గురు బోధలు,సాధన గ్రంథ మండలివారి శంకరుల జీవిత చరిత్ర ల నుండి)
మఠము-పీఠము. సన్యాసులు, బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్టించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరుడు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించాడనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని, మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుని వ్యవస్థా నైపుణ్యానికి, కార్యనిర్వహణా దక్షతకూ తార్కాణం. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి, సుస్థిరంచేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం, అప్పటి (వందల సంవత్సరాల)నుంచి నేటివరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నదంటే శంకరుడు ఏప్రాతిపదికపై ఎంత పటిష్టంగా నిర్మించాడో తెలుస్తుంది. చతుర్ధామాలు నిరంతరాయంగా నిర్వహించబడేందుకు శంకరుడు మఠామ్నాయము, మహాశాసనము అనే నిర్వహణ పద్ధతులను ప్రవేశ పెట్టాడు. మఠామ్నాయము, మహాశాసనము లు నేటి ఆధునిక కంపెనీలు తయారు చేసుకొనే, నిర్వహణ స్వరూపమైన, మెమొరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనే రెండు ప్రధాన పత్రాల వంటివి. ఒకటి సంస్థ యొక్క అంతర్గత నిర్వహణకు సంబంధించినది కాగా రెండవది సంస్థకు బయటి ప్రపంచంతో సంబంధాన్ని వివరిస్తుంది.నేటి ఆధునిక పద్ధతులను శంకరుడు ఆనాడే మఠాల నిర్వహణ కొరకు ప్రవేశపెట్టుట జరిగినది.
శంకరుడు మఠ నిర్వహణ కొరకు నియమింపబడే సన్యాసుల నామాంతరము యోగపట్టము అనే దానిని ప్రవేశపెట్టాడు.హిందూధర్మం ప్రకారం సన్యాసం తీసుకొన్న వ్యక్తి పాతపేరును తీసివేసి సన్యాసి అని సూచించే కొత్తపేరును తీసుకొంటాడు. అటువంటి ప్రత్యేక నామాన్ని యోగపట్టము అంటారు. అటువంటి పది పేర్లను శంకరుడు నిర్దేశించాడు. అవి .తీర్ధ, ఆశ్రమ, వన, గిరి, అరణ్య, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పురి అనేవి. హిందూ సన్యాసుల పేర్ల చివర ఇలాంటివి కనిపిస్తాయి. ఉదాహరణకు- ఆనందతీర్ధ, విద్యారణ్య, సత్యవృతసామాశ్రమి, విద్యాప్రకాశానందగిరి, చంద్రశేఖరసరస్వతి, నృసింహ భారతి, తోతాపురి అనే పేర్లు సుప్రసిద్దాలు. శంకరుడు నాలుగు మఠాల స్థాపనకు ప్రమాణంగా దిక్కులను, వేదాలను, సంప్రదాయాలను అనుసరించాడు.
మఠాల వివరాలు
శిష్యుడు మఠం మహావాక్యం వేదం సంప్రదాయం
హస్తామలకాచార్యుడు గోవర్ధన పీఠం
పూరి ప్రజ్ఞానం బ్రహ్మా ఋగ్వేదం భోగవార
సురేశ్వరాచార్యుడు శృంగేరి శారదాపీఠం
శృంగేరి అహం బ్రహ్మాస్మి యజుర్వేదం భూరివార
పద్మపాదాచార్యుడు ద్వారకాపీఠం
ద్వారక తత్వమసి సామవేదం కీటవార
తోటకాచాఱ్యుడు జ్యోతిర్మఠం
బదరీనాధ్ అయమాత్మా బ్రహ్మా అథర్వవేదం ఆనందవార
ఆమ్నాయాలు: ఆమ్నాయాలు ఏడు. పూర్వ, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వ, స్వాత్మ, నిష్కల ఆమ్నాయములు. వీటిలో మొదటి నాలుగు దృష్టికి గోచరించేవి కాబట్టి దృష్టి గోచరములు అని, చివరి మూడు దృష్టికి గోచరించనివి బుద్దికి మాత్రమే అందేవి కాబట్టి జ్ఞానగోచరములు అని వ్యవహరించారు.
వేదము- మహావాక్యము :వేదాలు నాలుగింటి లోను ఒక్కొక్కదానినుండి ఒక్కొక్క వాక్యము తీసుకొనబడినది.
ఋగ్వేదం నుండి ప్రజ్ఞానం బ్రహ్మ
యజుర్వేదం నుండి అహం బ్రహ్మస్మి
సామవేదం నుండి తత్త్వమసి
అధర్వణ వేదం నుండి అయమాత్మా బ్రహ్మ
అనేవాక్యాలు తీసుకొనబడినవి. ఈ వాక్యాలు ఒక్కొక్కటి సమస్త వేదసారాన్ని వేర్వేరు దృక్కోణాలలో వ్యక్తీకరించగలిగేది.
సాంప్రదాయాలు: సాంప్రదాయాలు నాలుగు విధాలైనవి. అవి కీటవార సాంప్రదాయం, భోగవార సాంప్రదాయం,ఆనందవార సాంప్రదాయం, భూరివార సాంప్రదాయం అనేవి. వీటిని ప్రామాణికంగా తీసుకొని శంకరుడు నాలుగు మఠాలను నిర్దేశించాడు.
పూర్తి వ్యాసం కొరకు చూడండి. - చతుర్ధామాలు (మఠాలు), పూరీ మఠం, ద్వారక మఠం, శృంగేరి, బదరీనాథ్ మఠం
మఠ నిర్వహణలో శంకరుని వ్యవస్థానైపుణ్యము
మఠామ్నాయము అని పిలువబడే మఠ నిర్వహణ వ్యవస్థలో కొన్ని విశేష లక్షణాలను శంకరుడు ఏర్పరిచాడు. వాటిలో
శంకరులు పీఠాలకు నారాయణుని, సిద్ధేశ్వరుని{శివుడు} అది దేవతలుగా నిర్ణయించాడు. దీని ద్వారా హిందూ ధర్మంలోని ఏ ఒక్క పంథా నో అనుసరించలేదు అని స్పష్టం చేసాడు.
వివిధ యోగ పట్టములు ధరించిన సన్యాసులకు వేర్వేరు బాధ్యతలను కేటాయించుటద్వారా హిందూ ధర్మావలంబులైన ప్రజల వివిధ ధార్మిక అవసరాలకు, వారుండే వేర్వేరు భౌగోళిక ప్రాంతాలకు ధర్మాచార్యులు అందుబాటులో ఉండే ఏర్పాటు చేసాడు.
పర్యటన, భిక్ష అనబడే వ్యవస్థలు సన్యాసులు అన్ని ప్రాంతాలను చుట్టివచ్చేందుకు, వైయుక్తికంగా ఆర్ధిక లంపటాలలో చిక్కుకొనకుండా సామాన్య ప్రజలపై ఆధార పడుతూ,"తమ ధర్మాన్ని తామే పోషించాలి"-అనే స్పృహను ప్రజలలో కలుగచేసేందుకే రూపొందించాడు.
ధర్మాన్ని కాపాడుకోవడంలో తమకూ భాధ్యత ఉందని ప్రజలకు తెలియ చెప్పేందుకు మరియు ప్రజల మధ్య ఉంటూ వారిలో ధర్మాన్ని వ్యాప్తిచేయడానికి తమ శక్తిని ఉపయోగించాలి అనే భావనను పీఠాధిపతులలో కలుగ చేయడానికి యోగ పట్ట వ్యవస్థను రూపొందించాడు.
శంకరుని రచనలు
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ · బృహదారణ్యక
ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ · కేన · ముండక
మాండూక్య ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూ మతము
ఉపనిషత్తులలోని విషయాలు ఆధారంగా అద్వైత వేదాంతాన్ని నిరూపించడం శంకరుని రచనలలో ముఖ్య విషయం. ఇందుకు వేదాలనుండి, ఇతర పురాణేతిహాసాలనుండి శంకరుడు ఉదాహరించాడు. స్వానుభవానికి శంకరుడు చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. అతని రచనలలో తర్కం చాలా బలమైన స్థానం కలిగి ఉంది. సాంఖ్య, బౌద్ధ, జైన, వైశేషిక వాదాలను, ఇతర వేదాంత విరుద్ధ హిందూ భావాలను ఖండించాడు. శంకరుని రచనలు మూడు విధాలుగా విభజింపవచ్చును - భాష్యాలు, ప్రకరణ గ్రంథాలు, స్తోత్రాలు.
భాష్యాలు
వేదాంత, పురాణేతి హాసాలను వివరంచే గ్రంథాలు. అద్వైత సిద్ధాంతాన్ని నిరూపించేవి. శంకరుడు తన భాష్యాలలో శ్వేతాశ్వర, కౌషీతకి, మహానారాయణ, జాబాల వంటి ఉపనిషత్తులనుండి విస్తృతంగా ఉదాహరించాడు. శంకరుడు క్రింది గ్రంథాల గురించి భాష్యాలు వ్రాశాడు.
బ్రహ్మసూత్రాలు
ఐతరేయోపనిషత్తు (ఋగ్వేదము)
బృహదారణ్యకోపనిషత్తు (శుక్ల యజుర్వేదము)
ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్తు) (శుక్ల యజుర్వేదము)
తైత్తరీయోపనిషత్తు (యజుర్వేదము)
ఛాందోగ్యోపనిషత్తు (అధర్వణ వేదము)
మాండూక్యోపనిషత్తు (అధర్వణ వేదము) మరియు గౌడపాదకారిక
ముండకోపనిషత్తు (అధర్వణ వేదము)
ప్రశ్నోపనిషత్తు (అధర్వణ వేదము)
భగవద్గీత
విష్ణు సహస్రనామ స్తోత్రము
గాయత్రీ మంత్రము
ఇప్పుడు లభించే కొన్ని (కౌషీతకి, నృసింహ తాపని, శ్వేతాశ్వర) ఉపనిషద్భాష్యాలు శంకరుడు వ్రాశాడా అన్న విషయం గురించి సందేహాలున్నాయి.[10]. బ్రహ్మ సూత్రాలకు శంకరుడు వ్రాసిందే మనకు లభించే మొదటి భాష్యం. కాని శంకరుడు ద్రవిడ, భర్తృప్రపంచ వంటి భాష్యాలను పేర్కొన్నాడు.[11]
ప్రకరణ గ్రంథాలు అనగా తత్వ, వేదాంత వివరణలు. గురువు శిష్యులకు వివరించి చెప్పే విధంగా ఉండేవి.
వివేక చూడామణి
ఉపదేశ సహస్రి
శతశ్లోకి
దశశ్లోకి
ఏక శ్లోకి
పంచ శ్లోకి
ఆత్మబోధ
అపరోక్షానుభూతి
సాధనా పంచకము
నిర్వాణ శతకము
మనీషా పంచకము
యతి పంచకము
వాక్య సుధ
తత్వబోధ
సిద్ధాంత తత్వవిందు
వాక్యవృత్తి
సిద్ధాంత తత్వవిందు
నిర్గుణ మానస పూజ
శంకరుడు వ్రాసాడని చెప్పబడే వాటిలో "ఉపదేశ సహస్రి" మాత్రం శంకరుడు వ్రాసాడని అధికుల అభిప్రాయం. మిగిలిన వాటిపై సంశయాలున్నాయి (వేరేవారు వ్రాసినా శంకరుని పేరు మీద ప్రసిద్ధమయ్యాయని)
భక్తి, లయ, కవితా సౌరభాలతో భగవంతుని అర్చించే సాధనాలు. శంకరుడు తన "గురు స్తోత్రం" ఆరంభంలో చెప్పిన "గురుర్బ్రహ్మా, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః, గురుఃసాక్షాత్ పరంబ్రహ్మా, తస్మై శ్రీ గురవే నమః" అనే స్తోత్రం ప్రార్ధనా గీతంగా చాలా ప్రసిద్ధమైనది. శంకరులు వ్రాశారని చెప్పబడే కొన్ని స్తోత్రాలు:
శివ పంచాక్షరీ స్తోత్రం
ప్రస్థానత్రయం
పాండురంగాష్టకం
సాధన పంచకం
వివేకచూడామణి
శివానందలహరి
మనీషాపంచకం
సౌందర్యలహరి
మీనాక్షీ పంచరత్న స్తోత్రం
ఆనందలహరి
గణేశ పంచరత్న స్తోత్రం
లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం
భజగోవిందం
కనకథారా స్తోత్రం
సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం
గంగా స్తోత్రము
వీటిలో కొన్ని శ్లోకాలు ఇతరులు వ్రాయగా అవి శంకరుల పేరుతో జగత్ప్రసిద్ధమయ్యాయని కొందరి భావన.
శంకరుడు బోధించిన తత్వం "అద్వైతం" - అనగా రెండు కానిది. ఆత్మ, బ్రహ్మము (పరమాత్మ) ఒకటే అనేది అద్వైతం మూల సూత్రం. ఇందుకు మౌలికమైన సూత్రాలను శంకరుడు ప్రస్థాన త్రయం (ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలు) నుండి గ్రహించాడు.
అద్వైతం అనే సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారి ప్రతిపాదించింది శంకరుడే. అతని "వివేక చూడామణి" అనే ప్రకరణ గ్రంథంలో అద్వైతం గురించి క్లుప్తంగా ఇలా చెప్పబడింది -
బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నఽ పరః
బ్రహ్మమే సత్యం, జగత్తు మిథ్య. జీవునకు, బ్రహ్మమునకు భేదం లేదు.
శాస్త్రం, యుక్తి, అనుభవం, కర్మలు అనే విషయాలు అద్వైత వేదాంతానికి మూలస్తంభాలు.[12] అద్వైతం ప్రకారం జీవన మార్గంలో జన్మం మొదలు మరణం వరకు సాధన ద్వారా "తత్వమసి" అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సాధన ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసికొన్నవారే జీవన్మిక్తులు, మహాత్ములు.
శంకరుని మాయావాదాన్ని తీవ్రంగా విమర్శించేవారున్నారు. అయితే బ్రహ్మమొక్కటే సత్యమనే విషయానికి ఫలితంగా సంసారం మిథ్య అనే నిర్ణయానికి రావలసి వస్తుందని అద్వైత వాదులు అంటారు.
శంకరుని ప్రభావం
బౌద్ధ, జైన మతాల ప్రాబల్యం కారణంగా శంకరుని కాలంనాటికి హిందూమతం క్షీణ దశలో ఉంది. అనేక శాఖలు వారిలో వారు తగవులాడుకొంటుండేవారు. మీమాంస, సాంఖ్య వాదులు దాదాపు దేవుడిని నమ్మరు. చార్వాకులు వేదాలను నిరసించారు.
ఆది శంకరుడు వివిధ శాఖలకు చెందిన పండితులను వాదంలో ఓడించి వారిచే తన సిద్ధాంతాన్ని ఒప్పించాడు. భగవంతుని నమ్మేవారినందరినీ షణ్మత వ్యవస్థలో ఏకీకృతులను చేశాడు. వేదాలకు తరిగిన గౌరవాన్ని తిరిగి సాధించి హిందువులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. దేశమంతటా తిరిగి వేద వేదాంగాలను ప్రచారం చేశాడు.
కేవలం 32 సంవత్సరాలు జీవించిన శంకరుని ప్రభావం హిందూమతంపై అనన్యమైనది. స్మార్తులు, సంతులు అతను నెలకొలిపిన సంప్రదాయాలను ఆచరిస్తారు.[13] దశనామి సంప్రదాయం, షణ్మత విధావం, పంచాయతన విధానం శంకరుడు నెలకొలిపినవే.
సంప్రదయాలతో సరిసమానంగా శంకరుడు స్వానుభవానికి ప్రాముఖ్యతనిచ్చాడు. వ్యాకరణం, మీమాంస వంటి అధ్యయనాలు వేదాంత విద్యార్ధులకు ముఖ్యమైన అధ్యయన రంగాలు.
శంకరుని గురించి ఒక ప్రసిద్ధ శ్లోకం
శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం
నమామి భగవత్పాద శంకరం లోక శంకరం
శంకరుని తరువాత రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు హిందూమతం పునరుద్ధరణలో ముఖ్యమైన పాత్ర వహించారు. ఇప్పటికీ ఈ ముగ్గురు ప్రారంభించిన తత్వ, వేదాంత, పూజాది నియమాలు, సంప్రదాయాలలో వేటినో కొన్నింటిని హిందువులలో అధికులు పాటిస్తున్నారు. వీరు మువ్వురి కృషివలన వేదాంతానికి సుస్థిరమైన స్థానం ఈ నాటికీ లభిస్తున్నది. (చూడండి - త్రిమతాలు)
అనంతర పరిణామాలు
శంకరుని అనంతరం అతడి శిష్యులు అద్వైత సిద్ధాంతాన్ని తత్సంబంధిత మతాచారాలను ముందుకు తీసుకొని వెళ్ళారు. అద్వైత సిద్ధాంతంలో పాండిత్యాన్ని సంపాదించిన పిదప ఎందరో పండితవర్యులు వ్రాసిన వ్యాఖ్యలను పరిశీలించిన మీదట నేడు అమలులో ఉన్న అద్వైత వ్యవస్థలను నాలుగు రకాలుగా విభజించవచ్చు.
నిర్గుణబ్రహ్మ వాదము
బ్రహ్మవివర్త వాదము
అనిర్వచనీయ ఖ్యాతివాదము
జీవన్ముక్తి వాదము
అద్వైత సిధ్ధాంతపు పునాదులపై ప్రతిపాదించ బడిన ఈ నాలుగు సిధ్ధాంతాలూ, ఒకదానికొకటి చక్కని పొంతన కలిగి ఉన్నాయనటంలో సందేహం లేదు.మొదటి రెండు సిద్దాంతాలకూ అధిభౌతిక భావార్థముంటే, మూడవ దానికి అధిభౌతిక మరియు జ్ఞానమీమాంసకు సంబంధించిన భావార్థాలున్నయి. నాలుగవ సిద్ధాంతానికి గొప్ప మౌక్తిక భావార్థమున్నది.[14]
రామానుజాచార్యుడు
రామానుజాచార్య లేదా రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి. రామానుజాచార్యుడు త్రిమతాచార్యుల లో ద్వితీయుడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవుని పై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిలేని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు.
ఈ ఆచార్యుడు తన జీవితంలో సాధించిదలచిన(సాధించిన) ముఖ్య ఉద్దేశ్యాలు:
మొదటిది, ప్రబలంగా కొనసాగుతున్న, బౌధ్ధ, జైన, శైవ, వైష్ణవ సాంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఈ మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ, వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించటం.
రెండవది, ఆదిశంకరుని అద్వైత సిద్ధాంతం లోని లొసుగులను సరిదిద్ది, విశిష్టాద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించటం.
ప్రస్థాన త్రయాన్ని సాధారణ జనానికి అందించడం.
విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన యతి. ఆయన క్రీస్తు శకం 1017 సంవత్సరంలో శ్రీపెరంబుదూరుగా ఇప్పుడు పేరున్న భూతపురిలో జన్మించారు. శ్రీపెరంబుదూరు చెన్నై పట్టణానికి సుమారు పాతిక కిలో విూటర్ల దూరంలో ఉంది. కలియుగం 4118 సంవత్సరం, శాలివాహన శకం ప్రకారం 930 సంవత్సరం అవుతుంది. ఆయన జనన కాలానికి, కుటుంబానికీ సంబంధించిన ఇతర వివరాలు : పింగళ నామ సంవత్సరం, చైత్ర మాసం. శుక్లపక్షం పంచమి తిథి, బృహస్పతి వారం, ఆర్ద్రా నక్షత్రం, కర్కాటక లగ్నం. ఆయన తల్లి కాంతమతి, తండ్రి కేశవా చార్యులు. హరీత గోత్రం. ఆపస్తంబ సూత్ర యజుశ్శాఖా ధ్యాయులు. తండ్రి వద్దా, కాంచీపురంలోని యాదవ ప్రకాశకుల వద్దా ఆయన విద్యాభ్యాసం జరిగింది. విద్యాభ్యాస కాలంలోనే ఆయనలోని విశిష్టాద్వైత సిద్ధాంత విశ్వాసాలు వికాసం పొందాయి. గురువు తోనే భేదించి తన విశిష్టాద్వైత వాదాన్ని నెగ్గించుకొన్న ప్రతిభాశాలి. ఆయనకు ముందు నుంచే విశిష్టాద్వైతం ఉంది. దానిని బహుళ వ్యాప్తిలోకి తీసుకొని రావడం రామానుజుల ఘనత. విద్యాభ్యాస కాలానికి విశిష్టాద్వైతం ఒక సిద్ధాంతంగా ఆయన విశ్వాసాలను తీర్చిదిద్దలేదు. ఆయనకు సహజంగా ఏర్పడిన విశ్వాసాలు అప్పటికే స్థిరపడి ఉన్న విశిష్టాద్వైతానికి అనుగుణంగా ఉన్నాయని, అప్పటికి విశిష్టాద్వైతంలో ఉన్నతుడుగా ఉన్న యామునాచార్యుడు రామానుజుడిని విశిష్టాద్వైత మత ప్రవర్తకుడుగా ప్రోత్సహించాడని అంటారు. రామానుజుడు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినవాడైనప్పటికీ, కొన్ని సంప్రదాయాలను ఆయన పాటించలేదు. ఉదాహరణకు పదునెనిమిది సార్లు తిప్పించుకొని ఎట్టకేలకు తిరుమంత్రాన్ని ఉపదేశించిన గోష్ఠీపూర్ణులనే తిరుక్కోట్టియార్ నంబి ఆదేశాన్ని కాదని ఒక విష్ణ్వాలయం గోపురం నుంచి తిరుమంత్రాన్ని అందరికీ వినపడేలా ప్రకటించారు. తిరుక్కోట్టి యార్ నంబి యామునాచార్యుల శిష్యులలో ఒకరు. పరమ పవిత్రమైన ఈ మంత్రాన్ని ఎవరికి పడితే వారికి ఉపదేశించ వద్దనీ, విన్నంత మాత్రాన్నే ముక్తి కలుగుతుందనీ నంబి చెపితే ‘‘నేనొక్కడినీ దాని దుష్ఫలితాన్ని అనుభవిస్తే నేమి, అందరికీ ముక్తి కలుగుతుంది గదా!’’ అనే ఉదార భావనతో ఆయన గుడి గోపరం ఎక్కి తిరు మంత్రాన్ని అందరికీ అందించారు. రామానుజులు బ్రహ్మ సూత్రాల శ్రీభాష్యం, వేదాంత సారం, వేదాంత దీపిక, వేదార్థ సంగ్రహం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, శరణాగత గద్యం మొదలైన గ్రంథాలను రచించారు. దేశ వ్యాప్తంగా విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేయడానికి పలువురు సింహా సనాధిపులను, జియ్యంగార్లను, పరమై కాంతులను నియమించారు. చాత్తాద వైష్ణవులూ, అమ్మం గార్లూ కైంకర్యం చేసే సంప్రదాయాలను ఏర్పరిచారు. అస్పృశ్యత లాంటి దురా చారాలను తొలగించడానికి సంస్కరణాత్మక పద్ధతులను ప్రవేశపెట్టారు. తన జీవితం ద్వితీయార్ధం శ్రీరంగంలో గడిపిన రామానుజులు నూట ఇరవై సంవత్సరాలు జీవించి పుట్టిన సంవత్సరమైన పింగళలోనే మాఘ శుద్ధ దశమి శనివారం నాడు దేహ త్యాగం చేశారు. ఆయన జీవితానంతరం విశిష్టాద్వైతం ‘‘ద్రావిడ, సంస్కృతాల ప్రాబల్యాన్ని బట్టి తెంగలై, వడగలై అని రెండు శాఖలు ఏర్పడ్డాయి’’ అని తిరుమల రామచంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన ‘
న జీవితం ద్వారా ఈ ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలు ఇవి:
ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో, మార్చటమో చేయటం బ్రాహ్మణుని లేదా ఆచార్యుని ప్రధమ కర్తవ్యం.
దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం.
మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది ఒప్పో, తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యపడవలసిన పనిలేదు.
ఒక పనివల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు, తమకు కీడు జరిగినా, పదిమందికి జరిగే మేలుకై, తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదు.
రామానుజుల జన్మసమయానికి దక్షిణభారత దేశాన ఉన్న రాజవంశాలు, వారి మతసంబంధిత రాజకీయాలను ఈ క్రింది విధంగా సంక్షిప్త పరచవచ్చు:
చోళులు - చోళులు శైవమత అనుచరులైనప్పటికీ, వైదికమత విధివిధానాలను వ్యతిరేకించలేదు. చోళరాజ ప్రముఖులలో ఒకడైన రాజరాజ నరేంద్ర చోళుడే వైదికమతకర్మలను, వర్ణాశ్రమాలనూ, ప్రోత్సహించి, పలు యజ్ఞయాగాదులు చేయించాడు. ఒకటవ కుళోత్తుంగ చోళుడు కూడా ఎందరో వైదిక బ్రాహ్మణులను ఆదరించి, దానధర్మాలు చేశాడని చరిత్రలో ఋజువులు ఉన్నాయి.[1]
చాళుక్యులు - చాళుక్యులు మొదట శైవులైనప్పటికీ, రానురాను జైనమతాన్ని ఆదరించారని చరిత్ర చెబుతోంది. తూర్పు, పశ్చిమ చాళుక్య రాణులు అనేకమంది జైనమత ప్రభావానికి లోనై తమ రాజులను ఆ మతాన్ని ఆదరించేటట్లుగా మార్చి ఉన్నారని శిలాశాసనాలద్వారా తెలుస్తోంది. వేంగీ ( ఏలూరు) ప్రాంతాధిక్యతకై చోళ చాళుక్యుల మధ్య జరిగిన యుద్ధాలలో అనేక మార్లు చోళులు చాళుక్య జైన ఆరామాలను, మందిరాలను ధ్వంసం చేశారని ఋజువులు ఉన్నాయి.[2]
హోయసళ రాజులు - నేటి ఉత్తర కర్ణాటక ప్రాంతాలైన బేలూరు, బాదామిలను రాజధానులుగా చేసికొని, కర్నాటక ప్రాంతాన్ని పరిపాలించిన హోయసళ రాజులు జైన, వీరశైవ మతాలను ఆదరించారు. బిత్తిదేవన్ లేక బిత్తిగ లేక విష్ణు అను పేరున్న హోయసళ రాజును రామానుజాచార్యుడు జైనమతానుసరణ నుంచి వైష్ణవానికి మరల్చినట్టుగా చారిత్రక ఆధారాలున్నాయి.[3]
ఇవియే కాక, ఈ క్రింది మతసంబంధిత విషయాలను కూడా మనసులో ఉంచుకోవటం వల్ల, రామానుజాచార్యుని జీవితాన్ని, ఆయన చేసిన సేవను మరింత హర్షించవచ్చు.
రామానుజుల కాలానికి మౌర్యరాజులు (ముఖ్యంగా అశోకుడు) ఆదరించిన బౌధ్ధమతం క్షీణదశలో ఉండినది. దీనికి ఆదిశంకరులవారి అద్వైత వేదాంతము కూడా కొంత కారణమై ఉండవచ్చు.
రాజాదరణ పొంది, ప్రాబల్యాన్ని పుంజుకొన్న జైన, శైవ మతాలు, స్థానిక ఆచారవ్యవహారాలతో కలసి అనేక శాఖలుగా విభజితమైనవి [4]. ఈ వేర్వేరు శాఖలు, వేర్వేరు సిధ్ధాంతాలను ప్రతిపాదిస్తూ, తమ తమ శాఖలే గొప్పవని ఉటంకిస్తూ, మూల ఉపనిషత్సారాన్ని ప్రజలకు అందించలేక పోయాయి.[5]
ఈ కాలంలో భక్తిమార్గానికి చాలా ప్రాబల్యం ఉండినది. భక్తిమార్గానికీ, విగ్రహారాధనకూ ఉన్న సంబంధం వలన పైన పేర్కొన్న రాజులందరూ, ఎన్నో దేవాలయాలు నిర్మించి, ఆ మార్గాన్ని ప్రోత్సహించటం జరిగింది. రాముడు, కృష్ణుడు, శివుడు (వేర్వేరు రూపాలలో) దేవుళ్ళుగా ఆరాధనలను అందుకోవటం ఈ కాలం యొక్క విశిష్టమైన మతసంబంధితమైన మార్పుగా చెప్పుకోవచ్చు.[6]
సాంప్రదాయక జీవితచరిత్రకారుల ప్రకారం, రామానుజాచార్యులు క్రీ.శ. 1017 - 1137 సంవత్సరాల మధ్య తన జీవితాన్ని కొనసాగించాడు. వీరి ప్రకారం ఆచార్యుల జీవితకాల వ్యవధి నూట ఇరవై సంవత్సరాలు (120 సం.). వంద సంవత్సరాలకు పైచిలుకు మనిషి బ్రతికే అవకాశం తక్కువ. కనుక ఈ నూట ఇరవై సంవత్సరాల వ్యవధి కొంత అనుమానాస్పదమౌతుంది. సాంప్రదాయక ఆధారాల ప్రకారం రామానుజాచార్యులు తమిళ 'పింగళ' సంవత్సరంలో జన్మించి, మరో 'పింగళ' సంవత్సరంలో పరమపదించారు.[7] తమిళ కాలమానం ప్రకారం ఒకే పేరుగల సంవత్సరం మళ్ళీ రావటానికి అరవై సంవత్సరాల కాలం పడుతుంది. దీన్ని బట్టి మనం రామానుజాచార్యుల జీవితం అరవై లేక నూట ఇరవై సంవత్సరాలు ఉండవచ్చని భావించవచ్చు.<
క్రీ.శ. 1917 లో టి.ఏ. గోపీనాథ్ , సాంప్రదాయక మూలాల ఆధారంగా, రామానుజాచార్యులను శైవమతాధిక్యతను ఒప్పుకొనేందుకు బలవంతం చేసిన రాజును, ఒకటవ కుళోత్తుంగ చోళునిగా గుర్తించి, ఆచార్యుల మేలుకోట ప్రవాసం క్రీ.శ. 1079 - 1126 ప్రాంతంలో జరిగినట్టుగా అనుమానించారు. ప్రవాస కాలం నలభై ఏడు సంవత్సరాలు కావటం, ఒకటవ కుళోత్తుంగ చోళుడు వైష్ణవమత ద్వేషి కాకపోగా వైదికమత ఆదరణలో భాగంగా ఎన్నో దానాలను చేసినట్టుగా చారిత్రక ఆధారాలుండటం, ఈ జీవితకాల నిర్ణయానికి ఆక్షేపాలని చెప్పుకోవచ్చు.
టి.యన్. సుబ్రమణియన్ అనే మద్రాసు ప్రభుత్వ ఉద్యోగి, 'రామానుజాచార్య దివ్య చరితై' అనే తమిళ సాంప్రదాయక జీవితచరిత్రలో ఉల్లేఖించిన శ్రీభాష్య రచనా సమాప్తి కాలం (క్రీ.శ. 1155-1156) ప్రకారం, రామానుజుల జీవితకాలం క్రీ.శ. 1077 - 1157 మధ్య ఉండవచ్చని అంచనా వేశారు. ఈ జీవితకాలం 80 సంవత్సరాలు కావటం, వైష్ణవ ద్వేషి ఐన రెండవ కుళోత్తుంగ చోళుడు ఇదే సమయంలో రాజ్యమేలటం, ఈ అంచనా సరియైనదేననటానికి ఋజువులుగా చెప్పుకోవచ్చు. 'విష్ణువర్ధనుడు' అనే పేరు గల హోయసళ రాజు (హోయసళ రాజులు) ఇదే సమయంలో కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించటం కూడా గమనించదగ్గ విషయం(ఇతడే పైన చెప్పుకొన్న భిత్తిగ దేవుడు అయి ఉండవచ్చు). ఐతే దేవాలయ శిలాశాసనాలు, రామానుజాచార్యుడు మరియు అతని శిష్యులు మేలుకోటలో క్రీ.శ. 1137 కు ముందే నివాసమున్నట్లు తెలుపుతుండటం ఈ జీవితకాల నిర్ణయానికి ఆక్షేపంగా చెప్పుకోవచ్చు.
ఈయన విశిష్టాద్వైత మతోద్ధారకుఁడు. ఈయన 800 సంవత్సరములకు ముందు అవతరించినట్టు తెలియవచ్చెడి. ఈయన తండ్రి ఆసూరి కేశవాచార్యులు. తల్లి కాంతిమతి. జన్మస్థానము చెన్నపురికి సమీపమున 26 మయిళ్ల దూరమున ఉండు శ్రీ పెరుంబూదూరు (భూతపురము). విద్యాభ్యాసము చేసినచోటు కాంచీపురము. సకల శాస్త్రములను యాదవ ప్రకాశులు అను అద్వైత మతావలంబి అగు సన్యాసివద్ద చదివి, వానికెల్ల విశిష్టాద్వైత పరముగా అర్థము సాధించి ఆమతమును స్థాపించి పిమ్మట త్రిదండసన్యాసి అయి యతిరాజు అనుపేరు పొంది, మేలుకోట (తిరునారాయణపురము)శ్రీరంగము తిరుపతి మొదలగు అనేక దివ్యస్థలములయందు మఠములను ఏర్పఱచి అచ్చటచ్చట వైష్ణవ మతమును స్థాపించెను. వెండియు ఈయన బహుదేశాటనము చేసి పలుమతముల వారిని జయించి శిష్య సంఘమును సంపాదించి తమ మతమును వృద్ధిపొందించెను. ఈయన వ్యాససూత్ర భాష్యము,గీతాభాష్యము, తర్కభాష్యము, వేదార్థసంగ్రహము, న్యాయామృతము, వేదాంత ప్రదీపము, వేదాంత తత్త్వసారము, నారదీయ పాంచరాత్రాగమము, రంగనాథస్తవము, గద్యత్రయము, మఱియు పెక్కు స్వరూప గ్రంథములను రచియించెను. కనుక ఈయనకు భాష్యకార్లు అనియు ఎంబెరు మానారు అనియు నామధేయములు కలిగెను. ఈ రామానుజాచార్యులు శేషాంశసంభూతుఁడు
మద్రాసు కు 30 మైళ్ళ దూరంలో ఉన్న శ్రీపెరుంబుదూరు లో శ్రీమాన్ ఆసూరి 'సర్వక్రతు' కేశవ సోమయాజి దీక్షితార్ మరియు కాంతిమతి అను పుణ్య దంపతులు ఉండేవారు. వేదాలలో చెప్పబడిన అన్ని యజ్ఞాలనూ పూర్తిచేసి 'సర్వక్రతు' బిరుదును పొందిన కేశవ సోమయాజి, ఎంతకాలానికీ తమకు సంతానం కలుగక పోవటంతో, భార్య కాంతిమతితో కలసి, తిరువళ్ళిక్కేణి (ట్రిప్లికేన్) ఒడ్డున ఉన్న పార్థసారథి స్వామి దేవాలయంలో యజ్ఞాల ద్వారా ఆ స్వామిని మెప్పించి సంతానం పొందే ఉద్దేశ్యంతో శ్రీపెరుంబుదూరు ను వదిలి వెళ్ళారు. ఆ స్వామి అనుగ్రహం వల్ల వీరిరువురికి ఒక సంవత్సరం అనంతరం జన్మించిన శిశువు రామానుజాచార్యుడు.[8] 'శ్రీ వైష్ణవ ఆచార్య పరంపర' అను సాంప్రదాయక గ్రంథం ప్రకారం, ఈ పుణ్యదినం కలియుగ సంవత్సరం 4118, పింగళ వర్షం, చైత్ర మాసం, తిరువాదిరై రాశి(ఆరుద్ర నక్షత్రం), శుక్లపక్ష పంచమి, శుక్రవారం. ఆంగ్ల కాలమానం ప్రకారం ఈ తేదీ క్రీ.శ. 1017, ఏప్రిల్ 13.[9].
శిశువు యొక్క జనన మాసం, మరియు రాశి దశరథ పుత్రులైన లక్ష్మణ శత్రుఘ్నుల జన్మ మాస రాశులతో సరితూగటం వల్ల, శిశువు మామ అయిన పెరియ తిరుమల నంబి (శ్రీశైలపూర్ణుడు), ఆ శిశువు ఆదిశేషు ని అవతారమని భావించి, "ఇళయ పెరుమాళ్" అనే నామధేయాన్ని నిర్ధారిస్తాడు.[10][11] శిశువు శరీరంపైన ఉన్న కొన్ని పవిత్రమైన గుర్తులను గమనించిన పెరియ తిరుమల నంబికి, నమ్మాళ్వార్ తన 'తిరువోయ్మోళ్ళి' అను గ్రంథంలో పేర్కొన్న శ్రీవైష్ణవ సాంప్రదాయాభివృధ్ధికి పాటుపడగల గొప్ప సన్యాసి, గురువు, ఈ శిశువేనన్న నమ్మకం కుదిరింది.[10]
ఇళయ పెరుమాళ్ చిన్నతనంలో 'కంచిపూర్ణుడు' అనే భక్తుడు రోజూ కాంజీవరం(నేటి కంచి) నుంచి శ్రీపెరుంబుదూరు మీదుగా 'పూణమ్మెల్లె' అను గ్రామంలో ఉన్న దేవాలయానికి పూజకై వెళ్ళేవాడు. అతడి శ్రధ్ధాభక్తులు చిన్ని ఇళయ పెరుమాళ్ను ఎంతగానో ఆకర్షించాయి. ఒకరోజు పూజ పూర్తి చేసుకుని తిరిగి వెడుతున్న కంచిపూర్ణుడిని ఇళయ పెరుమాళ్ తన ఇంటికి సాదరంగా అహ్వానించి, అతడి భోజనానంతరం అతడి కాళ్ళుపట్టడానికి ఉద్యుక్తుడైనాడు. కానీ, నిమ్నకులానికి చెందిన కంచిపూర్ణుడు తత్తరపాటుతో వెనక్కు తగ్గి, ఉత్తమ బ్రాహ్మణ కులంలో జన్మించిన ఇళయ పెరుమాళ్ సేవను నిరాకరించాడు. భగవంతునిపైనున్న అతడి భక్తిశ్రధ్ధలు కేవలం అలంకారప్రాయమైన జంధ్యానికంటే ఉన్నతమైనవని, అందుచేత 'కంచిపూర్ణుడు' తనకు గురుసమానుడని వాదించి, ఇళయ పెరుమాళ్ అతడిని ఆకట్టుకున్నాడు. ఆనాటి నుంచి వారిద్దరిమధ్య పరస్పర గౌరవమర్యాదలు, ప్రేమ ఏర్పడ్డాయి. భక్తిలోని మొదటి పాఠాలు ఇళయ పెరుమాళ్ కంచిపూర్ణుడి వద్దనే అభ్యసించాడని చెప్పుకోవచ్చు.[10][12]
ఇళయ పెరుమాళ్కు పదహారవ ఏట రక్షమాంబ లేక తంజమ్మాళ్తో వివాహం జరిగింది. వివాహానంతరం తండ్రి కేశవ సోమయాజి పరమపదించటంతో, కుటుంబ సమేతంగా, ఇళయ పెరుమాళ్ కాంచీ నగరానికి తరలివెళ్ళాడు. నాటికి కంచిలో పేరుపొందిన 'యాదవప్రకాశ' ఆచార్యుని వద్ద విద్యాభ్యాసం చేయసాగాడు. యాదవప్రకాశుడు అద్వైతం లోనూ భేదాభేద వేదాంతం లోనూ పాండిత్యాన్ని గడించి, అనేకమంది శిష్యులనాకర్షించి, వారికి విద్యనొసగుతుండినాడు. ఇళయ పెరుమాళ్ వంటి అసామాన్య ప్రతిభగల శిష్యుడు దొరికినందుకు పరమానందభరితుడైన యాదవప్రకాశుడు అనతి కాలంలోనే ఇళయ పెరుమాళ్ యొక్క 'భక్తి' పరమైన ఆలోచనావిధానాన్ని గమనించాడు. యాదవప్రకాశుని ఉపనిషద్వ్యాఖ్యలు అకర్మికము, అనాస్తికములుగా ఉండటం ఇళయ పెరుమాళ్ ను బాధించేది.[13] తత్కారణంగా అతడు తన గురువుతో తరచుగా వాగ్వాదానికి దిగేవాడు.
ఒకనాడు 'ఛాందోగ్యోపనిషత్తు' పై ఆదిశంకరుని వ్యాఖ్యానంలో 'కప్యాసం పుణ్డరీకమేవమక్షిణి' అనే వాక్యాన్ని ఆదిశంకరుడు 'ఎర్రనైన కోతి పిరుదులను పోలిన(కప్యాసం) కమలాలవంటి కన్నులుగలవాడు' అని అనువదించినట్లుగా యాదవప్రకాశుడు తన శిష్యులకు చెప్పాడు. అదివిన్న ఇళయ పెరుమాళ్ కన్నులలో ధారగా నీరుకారసాగింది. యాదవప్రకాశుడు కారణమడుగగా అది సరైన వ్యాఖ్య కాదని బదులిచ్చాడు ఇళయ పెరుమాళ్. ఆగ్రహించిన యాదవప్రకాశుడు వేరొక వ్యాఖ్యను చేయమని హేళన చేయగా 'కప్యాసం' అనే పదానికి 'కం జలం పిబతి ఇతి కపిః' (నీటిని గ్రహించువాడు, అనగా సూర్యుడు) అని నూతనార్థాన్ని చెప్పి 'కప్యాసం పుణ్డరీకమేవమక్షిణి' అనే వాక్యాన్ని 'నీటిని గ్రహించిన సూర్యుని కిరణాలతో పుష్పించిన(కప్యాసం) కమలాలవంటి కన్నులుగలవాడు' అని భావాధిక్యతనూ, ఆస్తికత్వమునూ ఉటంకించే అర్థాన్ని చెప్పాడు. మరొకమారు 'సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మా' అనే మహావాక్యంపై జరుగుతున్న వాదంలో సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మయొక్క గుణాలనీ, అవే బ్రహ్మ కాదనీ యాదవప్రకాశునితో వాదించాడు.[14]
ఈ వాదోపవాదాలలో ఇళయ పెరుమాళ్ యొక్క పాండిత్యం, ఆస్తికత్వంతో కూడిన ఆ ర్ద్రతాభావం, మరియు భక్తిపూరితమైన వ్యాఖ్యానం యాదవప్రకాశుడికి కంటగింపు కాసాగింది. అహంకారపూరితమైన మనస్సుతో, ఈర్ష్యతో, అతడు ఇళయ పెరుమాళ్ను హతమార్చటానికి పన్నాగం పన్నాడు. గోవిందుడనే శిష్యుని ద్వారా ఈ విషయాన్ని తెలుసుకొన్న ఇళయ పెరుమాళ్ సమయానికి తప్పించుకోగలిగాడు. సాంప్రదాయక గ్రంథాల ప్రకారం, ఈ తరుణంలో కంచిలో వెలసిన 'వరదరాజ స్వామి' దంపతులు మారువేషంలో వచ్చి ఇళయ పెరుమాళ్కు కంచి దారి చూపించి అతడిని రక్షించారని తెలుస్తుంది. తరువాత కొంత కాలానికి ఇళయ పెరుమాళ్ వాదనలను అంగీకరించలేని యాదవప్రకాశుడు, అతడిని తన శిష్యరికం నుంచి విముక్తుణ్ణి చేస్తాడు.
ఏది ఏమైనప్పటికి, బ్రహ్మసూత్రాలనూ, ఉపనిషత్తులనూ, పురాణగ్రంథాలను, ఎంత తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారో తెలుసుకోవటానికి యాదవప్రకాశుడి శిష్యరికం ఎంతగానో దోహదపడిందనటంలో అతిశయోక్తి లేదు. వేదాంతానికి కొత్త అర్థం చెప్పవలసిన సమయం ఆసన్నమైనదని నిర్ణయించుకోవటానికి, ఇళయ పెరుమాళ్కు యాదవప్రకాశుడి శిష్యరికం సహకరించింది.
'ఆళవందార్' అను నామధేయముతో ప్రసిద్ధుడైన యమునాచార్యుడు, వైష్ణవ సాంప్రదాయంలో పేరుగాంచిన గురువు. ఈయన తిరుచిరాపల్లి (నేటి తిరుచ్చి) జిల్లాలో ఉన్న శ్రీరంగం లో శ్రీరంగనాథస్వామి దేవస్థానంలో తన సేవలనందించేవారు. యాదవప్రకాశుని శిష్యరికంలో ఉన్న ఇళయ పెరుమాళ్ యొక్క గొప్పతనాన్ని, తెలివి తేటలను, భక్తి పరమైన వ్యాఖ్యలను చూసి, అతడిని తన శిష్యునిగా చేసుకోవాలని ప్రయత్నించాడు. ఈ విషయంగా ఇళయ పెరుమాళ్ను కలుసుకోవాలని ఈయన కాంచీపురాన్ని సందర్శించాడు కూడా. కానీ కారణాంతరాల వల్ల ఇళయ పెరుమాళ్ను కలవలేక, నిరాశతో వెనుదిరిగాడు. యాదవప్రకాశుడు తన శిష్యగణం నుంచి ఇళయ పెరుమాళ్ను తొలగించిన విషయం తెలియగానే, అతడిని తన శిష్యునిగా చేసుకోవాలనే ఉద్దేశ్యాన్ని 'మహాపూర్ణుడు' అనే శిష్యుని ద్వారా తెలియచేశాడు.
మహాపూర్ణుడు ఇళయ పెరుమాళ్ను కలుసుకొని శ్రీరంగం తీసుకువెళ్ళే లోపల యమునాచార్యుడు తన ఆఖరిశ్వాసను విడిచాడు. ఇళయ పెరుమాళ్ మరియు మహాపూర్ణుడు వచ్చే సమయానికి యమునాచార్యుల భౌతిక కాయం అంత్యక్రియలకు సిధ్ధపరచబడి ఉంటుంది. కాని ఆయన కుడి చేతి మూడు వేళ్ళు ముడుచుకొని ఉండటం ఇళయ పెరుమాళ్ గమనిస్తాడు. ఆ మూడు వేళ్ళూ తను చేయవలసిన మూడు పనులకు సంకేతమని భావించిన ఇళయ పెరుమాళ్ ఈ క్రింది మూడు శపథాలను చేస్తాడు.
వైష్ణవ సాంప్రదాయాలకు సంకేతమైన, పంచ సంస్కార కర్మ, నాలాయిర దివ్య ప్రబంధ బోధన, శరణాగతి తో కూడిన మత ప్రతిపాదన మరియు ప్రచారం, అనే ఈ మూడు కర్తవ్యాలను విధి తప్పక నిర్వర్తించటం.
వేదాంతానికి మూలస్తంభాలవంటి వేదాంత సూత్రాల కు సరిక్రొత్త వ్యాఖ్యానం వ్రాయటం.
భాగవత, విష్ణుపురాణాల ను రచించిన వేదవ్యాస, పరాశర మునుల అంశలతో జన్మించిన ఇద్దరు శిశువులను గుర్తించి, వారికా నామధేయాలను ప్రసాదించి, వ్యాస, పరాశరులకు నివాళులు అర్పించటం.
ఈయన తన గురువు తనకు ఉపదేశించిన అత్యంత గోప్యమైన అష్టాక్షరీ మంత్రాన్ని శ్రీరంగం లోని రాజగోపురం పైకి ఎక్కి, అందరికీ ఉపదేశిస్తాడు. గురువు 'నీవు నరకానికి వెడతావేమో' నని అంటే అందరూ స్వర్గానికి వెడతారని బదులిస్తాడు.[15]రామానుజులు తన జీవితకాలంలో విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని బలంగా ప్రతిపాదించడం, పలు ఆలయాల్లో మూర్తులను విష్ణు సంబంధమైన విగ్రహాలుగా నిరూపించడం, ఎన్నో ఆలయాలకు సుస్పష్టమైన ఆగమ విధానాలు, పరిపాలన పద్ధతులు ఏర్పరచడం వంటి కార్యకలాపాలు నిర్వహించారు. ఆ క్రమంలో విస్తృత పర్యటనలు, వాద ప్రతివాదాలు చేశారు.
తిరుమలలోని మూలవిరాట్టు(ధ్రువబేరం) విష్ణుమూర్తి విగ్రహం కాదని, శక్తి విగ్రహమో, శివ ప్రతిమో, సుబ్రహ్మణ్యమూర్తో కావచ్చని వివాదం చెలరేగింది. తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తున్న యాదవరాజు వద్దకు శైవులు ఈ వివాదాన్ని తీసుకువెళ్ళి వాదించి తిరుమలలో జరుగుతున్న వైష్ణవ పూజలు ఆపుచేయించి శైవారాధనలకు అవకాశం ఇమ్మని కోరారు. పలువురు వైష్ణవుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న రామానుజులు యాదవరాజు కొలువుకు వెళ్ళి వాదించారు. శైవులతో జరిగిన వాదనలో పలు పౌరాణిక ఆధారాలను, శాస్త్ర విధానాలను సాక్ష్యాలుగా చూపి ఓడించారు. శైవులు ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరారనీ, రామానుజులు వేంకటేశ్వరుని విగ్రహం ఎదుట బంగారంతో చేయించిన వైష్ణవాయుధాలు, శైవాయుధాలు, శక్తి ఆయుధాలు పెట్టి ఏ దైవానివైతే ఆ ఆయుధాలే స్వీకరించు అని ప్రార్థించి తలుపులు మూశారని ప్రతీతి. రాత్రి అత్యంత కట్టుదిట్టాల నడుమ గడవగా తెల్లవారి తలుపులు తెరిస్తే ధ్రువబేరానికి శంఖ చక్రాలు ఆయుధాలుగా కనిపించాయంటారు. మొత్తానికి తిరుమలలోని మూలవిరాట్టు శ్రీనివాసుడేనని వాదన ద్వారా నిర్ధారించడంతో తిరుమలపై వైష్ణవ ఆరాధనలకు యాదవరాజు అంగీకరించారు.
అనంతర కాలంలో తిరుమలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూసేందుకు రామానుజులు ఏకాంగి వ్యవస్థను ఏర్పరిచారు. తర్వాతి కాలంలో ఏకాంగి వ్యవస్థ జియ్యర్ల వ్యవస్థగా పరిణమించి స్థిరపడడంలోనూ రామానుజుల పాత్ర కీలకం. తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మింపజేసింది రామానుజులే. ఆ ఆలయం చుట్టూ ఆలయపూజారులకు అగ్రహారమిచ్చి, వీధుల నిర్మాణం చేపట్టి యాదవరాజు తన గురువైన రామానుజును పేరిట రామానుజపురంగా రూపకల్పన చేశారు. అదే నేటి తిరుపతి నగరానికి పునాది అయ్యింది. రామానుజాచార్యులు తాను స్వయంగా పాంచరాత్ర ఆగమాన్ని పాటించే వ్యక్తి అయినా తిరుమలలో పరంపరాగతంగా వస్తున్న వైఖానస ఆగమాన్ని కొనసాగించారు. ఐతే అప్పటికి ఉన్న వైదికాచారాలతోపాటుగా ద్రవిడవేదాలను, పాంచరాత్రాగమ ఆచారాలను కొన్నింటిని తిరుమల అర్చనా విధానంలో చేర్చారు. తిరుమలలోని పలు కీలకమైన వ్యవస్థల ఏర్పాటులో, మూర్తి స్వరూపనిర్ధారణలో, ఆగమ పద్ధతుల్లో తిరుమల-తిరుపతిపైన రామానుజాచార్యునిది చెరగని ముద్ర.[16]ఈయనకుముందు విశిష్టా ద్యైవతమును ప్రతిపాదించినవారు కొందఱు కలరు. వారిలో ముఖ్యులు పన్నిద్దఱు.
సరోయోగి(పొయ్హై యాళ్వారు) : ఈయన కంచియందలి పొయ్హై అను పుష్కరిణియందు ఒక బంగారు తామరపువ్వులో ద్వాపరయుగాంతమునందు పాంచజన్యాంశమున అయోనిజుఁడై జనించెను.
భూతయోగి(పూదత్తాళ్వారు) : ఈయన సరోయోగి అవతరించిన మఱునాడు మల్లాపురి (తిరుక్కడల్మల్లై) అను గ్రామమునందు ఒక సరస్సునందలి నల్ల కలువపూవునందు గణాంశమున అయోనిజుఁడు అయి అవతరించెను.
మహాయోగి (పేయాళ్వారు) : ఈయన భూతయోగి అవతరించిన మఱునాడు మాయారము (మామైలైనగరు) అను ఊరి యందు ఒక సరస్సునంది యెఱ్ఱకలువ పూవునందు నందకాంశమున అయోనిజుఁడు అయి అవతరించెను.
భక్తిసారుఁడు (తిరుమాళికై యాళ్వారు) : ఈయన మీఁదచెప్పిన మూవురును అవతరించిన మూడునెలలకు మహీసారక్షేత్రము (తుముపి) అనుచోట తపస్సు చేయుచున్న భృగు మహర్షికి ఇంద్రునిచే ప్రేరేపింపఁబడి ఆఋషిని మోహింపఁజేసిన అప్సరస వలన చక్రాంశ సంభూతుఁడు అయి జనించెను. భగవద్భక్తుఁడును బిడ్డలు లేనివాఁడును అగు ఒక మేదరవాఁడు వెదుళ్లకై అచ్చటికి వచ్చి ఆశిశువును తన యింటికి ఎత్తుకొనిపోయి పెంచెను.
శఠారి (నమ్మాళ్వారు) : ఈయన *** కురుకాపరి. (తిరుక్కు*** గ్రామమునందు కారి అను పేరుగల సచ్ఛూద్రునికి ఉడయనంగై అను భార్యయందు విష్వక్సేనాంశమున జనించెను. అట్లు అవతరించి ఎల్ల శిశువులవలె స్తన్యపానము చేయక అభివృద్ధి పొందెను.
పరాంకుశదాసుఁడు (మధురకవి ఆళ్వారు) : ఈయన ద్వాపరయుగాంతమున పాండ్యదేశమునందలి తిరుక్కోళూరు అను గ్రామమునందు ఒక పురశ్చూడుఁడు (ముందరి జుట్టువాఁడు) అగు బ్రాహ్మణునికి కుముదాంశమున జనించి సామవేదాధ్యాపకుఁడు అయి దివ్యదేశ యాత్రచేయుచు అయోధ్యకు పోయి ఉండెను. అప్పుడు ఇచ్చట దక్షిణ దేశమునందు నమ్మాళ్వారు అవతరించి ఆతేజస్సు తనకు కనఁబడఁగా అందుండి వచ్చి నమ్మాళ్వారువల్ల తత్వవిషయమును గ్రహించెను.
కులశేఖరాళ్వారు : ఈయన కలియుగాదియందు దృఢవ్రతుఁడు అను రాజునకు పుత్రుఁడు అయి కౌస్తుభాంశమున అవతరించి ధనుర్వేదాదివిద్యలు నేర్చి పరమజ్ఞానసంపన్నుఁడై భగవత్కటాక్షమును పొందెను.
విష్ణుచిత్తుఁడు (పెరియాళ్వారు) : ఈయన కలియుగాదియందు శ్రీవిల్లిపుత్తూరు అను గ్రామమునందు ఒక పురశ్చూడుఁడు అగు వైష్ణవునకు గరుడాంశమున పుత్రుఁడై అవతరించి వేదవేదాంగములెల్ల అభ్యసించి అచ్చటి వటపత్రశాయి అను విష్ణుమూర్తికి తులసి కైంకర్యము చేయుచు ఉండి పాండ్యదేశపు రాజునొద్ద పరతత్వ నిర్ణయము చేసి బహుమతి పడసి పిదప లక్ష్మీపతి అగు శ్రీమన్నారాయుణుని ప్రత్యక్షము చేసికొని తులసివనమునందు అయోనిజయై జనించి తన కొమార్తె అయిన ఆముక్తమాల్యదను (చూడికొడుత్త నాంచారును) ఆ దేవునికి భార్యగా సమర్పించి కృతార్థుఁడు అయ్యెను.
గోద (చూడికొడుత్తాళ్) : ఈమె కలియుగాదిని శ్రీవిల్లిపుత్తూరి యందు విష్ణుచిత్తునియొక్క తులసివనమునందు అయోనిజయై భూమ్యంశమున జనించి ఆపెరియాళ్వారుచే పెంపఁబడి ఆయన పెరుమాళ్లకు కట్టికొని పోయెడు తులసిమాలలు తాను ముందు ధరించి పిమ్మట పూలబుట్టలో పెట్టుచువచ్చి కడపట ఆపెరుమాళ్లకు భార్య అయ్యెను. కనుక ఈమె ఆఁడుది అయినను తక్కిన ఆళ్వారులలో చేర్చి ఎన్నఁబడెను.
భక్తాంఘ్రిరేణువు (తొండరడిప్పొడి యాళ్వారు) : ఈయన కలియుగము పుట్టిన ఇన్నూఱేండ్లకు పిమ్మట చోళదేశమునందు మండంగుడి అను గ్రామము నందు ఒక పురశ్చూడ వైష్ణవునకు పుత్రుఁడై వనమాలాంశమున జనియించి విప్రనారాయణుఁడు అనుపేరు వహించి భగవత్కైంకర్యపరుఁడై కాలము గడపెను.
మునివాహనుఁడు (తిరుప్పాణాళ్వారు) : ఈయన కలియుగము పుట్టిన మున్నూఱు ఏండ్లకు పిమ్మట చోళదేశము నందలి నిచుళాపురము (ఉరయూరు) అను గ్రామము నందు విడవలి గంటలలో అయోనిజుఁడు అయి శ్రీవత్సాంశమునందు జనియించి బిడ్డలులేనివారైన చండాల దంపతులచే పెంపఁబడి వీణాగానమునందు నిపుణుఁడై భగవన్నామస్మరణచేసి కృతార్థుఁడు అయ్యెను.
పరకాలుఁడు (తిరుమంగై యాళ్వారు) : ఈయన కలియుగము పుట్టిన నన్నూఱు సంవత్సరములకాలమున తిరువాలిత్తిరునగరు అను గ్రామమునందు నీలుఁడు అను ఒక శూద్రునికి పుత్రుఁడు అయి అవతరించి ధనుర్విద్య మొదలు అగు విద్యలనేర్చి చోళరాజునొద్ద కొంచెపాటి అధికారము ఒకటి సంపాదించుకొని తనకు తగిన నలుగురు మంత్రులను చేర్చుకొని మెలఁగుచు అయోనిజయై జనించిన కుముదవల్లి అను కన్యకను వివాహము అగుటకొఱకు దొంగిలించియు మోసపుచ్చియు ధనమును ఆర్జించి శ్రీరంగపు రంగనాథుని దేవాలయగోపుర ప్రాకారాదులను కట్టించి ఆమెను పెండ్లాడి పరమ భాగవత భక్తుఁడు అయి ముక్తుఁడు అయ్యెను. ఈచెప్పఁబడిన వారే పన్నిద్ద ఱాళ్వార్లు అనఁబడుదురు.
మధ్వాచార్యుడు
మధ్వాచార్యులు (కన్నడ:ಶ್ರೀ ಮಧ್ವಾಚಾರ್ಯರು) ద్వైత వేదాంతాన్ని బోధించిన మతాచార్యులు. మధ్వాచార్యులు నిలిపిన సాంప్రదాయాలను పాటించేవారిని మాధ్వులు లేదా మధ్వమతస్థులు అని పిలిస్తారు. మధ్వాచార్యుడు, హనుమంతుడు మరియు భీముడు అనంతరము వాయు దేవునకు తృతీయ అవతారమని నమ్ముతారు.
మద్వాచార్యులు ఉడిపి వద్ద నున్న పాజక గ్రామంలో 1238 సంవత్సరంలో విజయదశమి రోజున జన్మించారు. మధ్వాచార్యుని జీవిత కథను రచించిన నారాయణ పండితాచార్యులు ఆయన తల్లిదండ్రుల పేర్లను మధ్యగేహ భట్ట, వేదవతి లుగా పేర్కొన్నారు. ఆయనకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్వాచార్యులు అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు.
బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మిక విషయాలవైపు ఆసక్తి చూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవాడు. పదకొండేళ్ళ పిన్న వయసులోనే సన్యాసం వైపు ఆకర్షితుడయ్యాడు. ఉడుపి సమీపంలో నివసిస్తున్న, ఆకాలంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా పేరుగాంచిన అచ్యుతప్రజ్ఞ అనే గురువు ద్వారా సన్యాస దీక్షను స్వీకరించాడు. అప్పుడే ఆయన పేరు పూర్ణప్రజ్ఞుడు గా మారింది.
ఒక నెల తరువాత ఓ తర్క శాస్త్ర పండితుల బృందాన్ని తన వాదనా పటిమతో ఓడించాడు. ఆయన ప్రజ్ఞకు అబ్బురపడిన అచ్యుతప్రజ్ఞ ఆయన్ను వేదాంత పరమైన అంశాలపై అధిపతిగా నియమించి ఆనందతీర్థ అనే బిరుదు కూడా ఇచ్చాడు.
యుక్తవయస్సులో ఉండగానే మధ్వాచార్యుడు దక్షిణ భారతదేశమంతా పర్యటించాలని సంకల్పించాడు. అనంతశయన, కన్యాకుమారి, రామేశ్వరం, శ్రీరంగం మొదలైన క్షేత్రాలను సందర్శించాడు. ఎక్కడికి వెళ్ళినా తాను తెలుసుకున్న తత్వాన్ని ప్రజలకు ఉపన్యాసాల రూపంలో తెలియజెప్పేవాడు. మూఢనమ్మకాల్ని వ్యతిరేకించాడు. వాటిని ఆధ్యాత్మికతతో ముడిపెట్టకూడదని భావించాడు. అలా ఆయన ప్రబోధించిన తత్వం దేశవ్యాప్తంగా పండితుల్లో చర్చలు రేకెత్తించగా సనాతన వాదుల నుంచి వ్యతిరేకత కూడా ఎదురైంది. కానీ ఆయన వేటికీ చలించలేదు. యాత్ర పుర్తి చేసుకుని ఉడుపి చేరుకోగానే భగవద్గీత పై తన భాష్యాన్ని రాయడం ప్రారంభించాడు.
తన ద్వైత సిద్ధాంతాన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాలు వ్రాసాడు. ఇంకా ఋగ్వేదంలోని 40 సూక్తాలకు మరియు భారత భాగవతాలకు వ్యాఖ్యానం వ్రాసాడు. తర్కంతోపాటు మొత్తం 37 గ్రంథాలను రచించాడు. ఇందులో ప్రముఖమైనవి ప్రముఖమైనవి
గీతాభాష్యం
గీతాతాత్పర్యం
బ్రహ్మసూత్రభాష్యం
అణువ్యాఖ్యానం
న్యాయవివరణం
అణుభాష్యం
దేశోపనిషద్భాష్యం
మహాభారతతాత్పర్యనిర్ణయం
యమకభారతం
దశప్రకరణం
తంత్రసారం
ద్వాదశస్తోత్రం
కృష్ణార్ణవామృతం
సదాచారస్మృతి
జయంతినిర్ణయం
ప్రణవకల్పం
న్యాసపద్ధతి
తిథినిర్ణయం
కందుకస్తుతి
జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.
భక్తి ఒక్కటే ముక్తిదాయకం. అది జ్ఞానపురస్కృతమైన భక్తి అయి ఉండాలి. ముక్తి నాలుగు విధాలు:
సాలోక్యం - జీవాత్మ భగవంతుని లోకంలో భగవంతునితోపాటు నివసించడం
సామీప్యం - భగవంతుని సన్నిధానంలో నివసిస్తూ కామితార్థాలను అనుభవించడం
సారూప్యం - భగవంతుని రూపం పొంది ఇష్టభోగాలు అనుభవిస్తూ ఆనందించడం
సాయుజ్యం - భక్తుడు భగవంతునిలో లీనమైనా ఆయన కంటే వేరుగా ఉంటూనే ఆయన ఆనందంలో పాలుపంచుకోవటం.మధ్వాచార్యుడు ఆసేతుశీతనగ పర్యంతం దేశమంతా పర్యటించి తన మధ్వమతాన్ని ప్రచారం చేసినా శంకరుని అద్వైతం, రామానుజుని విశిష్టాద్వైతం అంతగా ద్వైతం ప్రచారంలోకి రాలేదనే చెప్పాలి. అయితే దేశంలో వైష్ణవమత వ్యాప్తికి, ముఖ్యంగా కృష్ణభక్తి వ్యాప్తికి మధ్వమతం ఎంతగానో తోడ్పడిందనటంలో సందేహం లేదు.
No comments:
Post a Comment