తారతమ్యాలకూ, తరతమ భేదాలకూ తావులేని పరాత్పరుడు ఆ పరంధాముడు. పశువులైనా, పక్షులైనా, పండితులైనా, పామరులైనా, చక్రవర్తులైనా, చండాలురైనా, పునీతులైనా, పాపాత్ములైనా అందరికీ ఆయనే ఆత్మబంధువు, అనురాగ సింధువు. క్షీరసాగరంలో శయనించి, సకల చరాచర సృష్టిపై తన కరుణామృత వర్షాన్ని కురిపిస్తున్న ఆ కమలలోచనుడి దృష్టిలో అందరూ ఒక్కటే! ఆ పరమార్థం తెలుసుకోలేని మానవులే కులమతాలనూ, గుణగణాలనూ ప్రమాణంగా చేసుకొని భేదభావాలు చూపుతున్నారు. ఒకరిని అభిమానిస్తున్నారు, ఇంకొకరిని అసహ్యించుకుంటున్నారు. నిజానికి ఆ దీన దయాళుడి సృజనలో హెచ్చుతగ్గులు లేవు, హీనాదికములు లేవు. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో బోధించిన ఆ పరమోత్కృష్ట సత్యాన్ని, తన పదాల అమృత వర్షినిలో రంగరించి అనుసృజించారు శ్రీనివాస భక్తాగ్రేసరుడు అన్నమయ్య.
విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని!
శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః!!
అన్న ఆ పరమాత్ముని జ్ఞాన బోధను తన పదంలో నడిపించాడు అన్నమయ్య. నిజమే పండితుడైనవాడు విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుడినీ, కుక్క మాంసాన్ని వండుకొని తినే చండాలుడినీ ఒకేలా చూస్తారు. చివరకు గోవు, కుక్క, ఏనుగు తదితర సమస్త జంతుజాలం పట్ల కూడా భేదాన్ని చూపదు. ఈ పరమ సత్యాన్నే 'బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే..' అన్న కీర్తనలో విశదపరుస్తున్నాడు వేంకటేశుడి ఈ పరమ భక్తుడు అయిన అన్నమయ్య.
No comments:
Post a Comment