What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 21 February 2015

ఛత్రపతి శివాజీ

ఛత్రపతి శివాజీ
ఛత్రపతి శివాజీ మహారాజ్ గా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి
19, 1630 - మార్చి 4, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా
సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించారు.
శివాజీ తండ్రి అయిన షాహాజీ నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్
రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవారు. నిజాంషాహీలపైన షాజహాన్
దండయాత్ర చేసినపుడు షాహాజి సైనికులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర
వహించారు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్రావ్ అనే మరాఠా
యోధున్ని నిజాంషాహీ ప్రభువు హత్య చేయించారు. ఇది నచ్చని షాహాజీ
నిజాంషాహీ ప్రభువు పైన తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర మరాఠా
సామ్రాజ్యానికి నాంది పలికారు.
శివాజీ క్రీ.శ. ఫిబ్రవరి 19, 1627వ సంవత్సరం వైశాఖమాసపు శుక్లపక్ష
తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో
శహాజీ, జిజాబాయి పుణ్యదంపతులకు జన్మించారు.జిజాబాయికి శంభాజీ తర్వాత
పుట్టిన కొడుకులు అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై
(పార్వతి) పేరు శివాజీకు పెట్టింది.
షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని
నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా, మొఘలులు ఆదిల్షాతో కలసి షాహాజీని
ఓడించారు. ఆదిల్షాతో సంధి ప్రకారం షాహాజి ప్రస్తుత బెంగుళూరు ప్రాంతాన్ని జాగీరుగా
పొంది, పూణే వదిలి వెల్లవలసి వచ్చింది. షాహాజీ పూణేలో తనకున్న
జాగీరును వదులుకోవలసిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకొన్నారు.
షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి
యువకుడయిన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య
అనుచరులతో కలసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళారు.
శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన, ప్రజల పైన ప్రేమ
కలుగునట్లు విద్యాబుద్దులు నేర్పింది. చిన్నప్పటినుండి భారత రామాయణ
గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింప చేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల
గౌరవం తన తల్లివద్దనే నేర్చుకున్నారు. తన తండ్రి పొందిన
పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ద
తంత్రాలలో నిష్ణాతుడయ్యారు. సకల విద్యలు తెలుసుకొన్న శివాజీ మరాఠా
సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలు పెట్టారు.
17 ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి యుద్దం చేసి బిజాపూర్
సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నారు. మరో మూడేళ్ళలో
కొండన, రాజ్ఘడ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి
తెచ్చుకున్నారు.
శివాజీ తమ కోటలను సొంత చేసుకోవడం చూసి ఆదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి
అయిన షాహాజీని బందీ చేసారు. తర్వాత శివాజీని, బెంగుళూరులో ఉన్న శివాజి
అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా
అన్నదమ్ములిరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ
విముక్తుడిని చేయించుకున్నారు. అప్పుడు ఆదిల్షా యుద్ద భయంకరుడుగా
పేరు పొందిన అఫ్జల్ ఖాన్ను శివాజీ పైకి యుద్దానికి పంపించారు.
శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ద పద్దతులు తెలుసుకొన్న అఫ్జల్ ఖాన్
అతడిని ఓడించడానికి యుద్దభూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి
శివాజీని రెచ్చకొట్టడానికి శివాజీ ఇష్ట దైవమయిన భవానీ దేవి
దేవాలయాలను కూల్చారు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్దానికి సిద్దముగా
లేనని చర్చలకు ఆహ్వానించారు. ప్రతాప్ఘడ్ కోట దగ్గర సమావేశమవడానికి
ఇద్దరూ అంగీకరించారు. అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల
దాచుకున్నారు. ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్ళి
చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి
చేసినపుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నారు. అంతలో అడ్డు వచ్చిన
వారిని శివాజీ అంగరక్షకుడు ఎదుర్కొని పోరాడుతుండగా, శివాజీ కత్తి దెబ్బ తిని
గుడారం బయట వెళ్ళిన అఫ్జల్ ఖాన్ను శివాజీ సైనికాధికారి కత్తివేటుతో నేల
కూల్చారు.
అఫ్జల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమయిన అడవుల్లో అటకాయించి
మెరుపుదాడులతో మట్టికరపించింది. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా
మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నారు. ఎలాగయినా శివాజీని అణచాలని
బీజాపూర్ సుల్తాన్ యుద్దవీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పస్థూన్
సైనికులను పంపించగా, శివాజీ సేన వేల సంఖ్యలో పస్థూన్లను చంపి
విజయం సాధించింది. ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశమంతా
వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచారు.
కొల్హాపూర్ యుద్దం
ఇది సహించలేని బిజాపూర్ సుల్తాన్ అరబ్, పర్షియా, ఆఫ్ఘన్ నుండి
మెరికల్లాంటి 10,000 మంది కిరాయి సైనికులను శివాజీని అంతమొందించడానికి
పంపగా శివాజీ తన వద్దనున్న 5,000 మరాఠా యోధులతో కలసి కొల్హాపూర్
వద్ద ఎదుర్కొన్నాడు. 'హర హర మహాదేవ ' అంటూ శివాజీ యుద్దరంగంలో
విజృభించి శతృవులను ఊచకోత కోశారు. ఈ విజయంతో కేవలం సుల్తానులే కాక
మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది.
శివాజీ నుండి ఎప్పటికయినా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబు భావించి
సన్నాహాలు మొదలు పెట్టారు.తన మేన మామ షాయైస్త ఖాన్ ను శివాజీ పై
యుద్దానికి పంపారు.
పవన్ఖిండ్ యుద్దం
రెండుసార్లు పరాజయాన్ని ఎదుర్కొన్న అదిల్షా మూడవసారి సిద్ది జోహార్ అనే
పేరు పొందిన సైన్యాధ్యక్షుడికి అపారమయిన సైనిక, ఆయుధ
బలగాలు అందించి కొల్హాపూర్ పంపించాడు. ఆ సమయంలో కొల్హాపూర్ దగ్గరలో
ఉన్న పన్హాలా కోటలో శివాజీ కొన్ని వందలమంది అనుచరులతో ఉన్నారు. సిద్ది
జోహార్ విషయం తెలుసుకొన్న శివాజీ ఎలాగయినా పన్హాలా కోట నుండి
తప్పించుకొని తన సైన్యం మొత్తం ఉన్న విశాల్ఘడ్ కోటకు చేరుకొంటే
యుద్దం చేయవచ్చు అనుకున్నారు. కానీ అప్పటికే పన్హాలా కోట
చుట్టూ శత్రుసైన్యం ఉండడంతో తాను యుద్దానికి సిద్దంగా లేనని
దయతలచవలసినదిగా సిద్ది జోహార్కు వర్తమానం పంపారు. అది తెలుసుకొన్ని
సిద్ది జోహార్ సైనికులు నిఘా సరళం చేసి విశ్రాంతి తీసుకొంటుంటే, శివాజీ తన
అనుచరులతో కోట నుండి తప్పించుకొని తన సైన్యం ఉన్న
కోటవైపు పయనించసాగారు.చివరిక్షణంలో ఇది తెలుసుకొన్న సిద్ది జోహార్ తన
బలగాలతో శివాజీని వెంబడించసాగాడు.
కోటకు చేరుకొనేలోపు శత్రువులు తమను సమీపించగలరు అన్ని విషయం గ్రహించి
బాజీ ప్రభు దేశ్పాండే అనే సర్దార్ 300 మంది అనుచరులతో కలసి
తాము శత్రుసైన్యాన్ని ఎదుర్కొంటామని, శివాజీని తన అంగరక్షకులతో
ఎలాగయినా కోట చేరుకోమని చెప్పి ఒప్పించారు. శివాజీ కోట వైపు వెళ్ళిన వెంటనే
బాజీ ప్రభు దేశ్పాండే రెండు చేతులా ఖడ్గాలు పట్టుకొని శత్రువులతో
యుద్దం చేశారు. 300 మంది సైనికులు తమ ప్రాణాలకు తెగించి అతి బలమయిన శత్రువులతో
పొరాడి నేలకొరిగారు. అప్పటికి శివాజీ తన కోట చేరుకున్నారు. కోటలో తన
అనుచరులతో చర్చించిన అనంతరం తాము సిద్ది జోహార్ సైన్యాన్ని
ఎదుర్కొనలేమని గ్రహించిన శివాజీ సంధికి అంగీకరించారు. సంధిలో భాగంగా శివాజీ
సామ్రాజ్యం స్వతంత్ర్య రాజ్యంగా గుర్తింపు పొందింది. సిద్ది జోహార్
విజయానికి బహుమతిగా పన్హాలా కోట లభించింది.
ఈ యుద్దమే సుల్తానులతో శివాజీ చేసిన ఆఖరి యుద్దం. ఆ తరువాతి కాలంలో
మొఘల్ సైన్యంతో యుద్దాలు చేయవలసి వచ్చింది.
మొఘలులతో యుద్దాలు
షైస్తా ఖాన్ తో యుద్దం
1660లో ఔరంగజేబు తన మేనమామ అయిన షాయిస్తా ఖాన్కు లక్షకు పైగా
సుశిక్షుతులయిన సైన్యాన్ని, ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్
ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని రమ్మని పంపించారు. బలమయిన షాయిస్తా ఖాన్
సేన ముందు శివాజీ సేన తల వంచక తప్పలేదు. శివాజీ ఓటమి అంగీకరించి పూణే
వదిలి వెళ్ళవలసి వచ్చింది. పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్లో
షాయిస్తా ఖాన్ నివాసం ఏర్పరుచుకొన్నారు.
ఎప్పటికయినా శివాజీ మెరుపుదాడి చేస్తాడని షాయిస్తా ఖాన్ పూణే నగరమంతా
చాలా కట్టుదిట్టమయిన భద్రతను ఏర్పాటు చేసాడు. 1663 ఏప్రిల్లో
నగరంలో ఒక పెళ్ళి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో
కలసి పెళ్ళికూతురు తరపున బంధువుల్లో కలసిపోయి లాల్ మహల్ చేరుకొన్నారు.
ఆ భవనం స్వయానా తన పర్యవేక్షణలో నిర్మించబడినది కాబట్టి,
సులువుగా లోపలికి చేరుకొని షాయిస్తా ఖాన్ గదిలోకి చేరుకొన్నారు. శివాజీ
కత్తివేటుకు షాయిస్తా ఖాన్ మూడువేళ్ళు తెగి కింద పడగా, షాయిస్తా ఖాన్
కిటికీలో నుండి దుమికి ప్రాణాలు రక్షించుకున్నాడు. అంతలో ఇది పసిగట్టిన
షైస్తా ఖాన్ అంగరక్షకులు షాయిస్తా ఖాన్ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళారు.
మొఘలులకు మచ్చ తెచ్చిన షాయిస్తా ఖాన్ను ఔరంగజేబు సుదూర బెంగాలీ
ప్రాంతానికి పంపించివేసాడు.
సూరత్ యుద్దం
1664 నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపారకేంద్రంగా ఉండేది. శివాజీ సూరత్ పైన
దాడి చేసి ధనాన్ని, ఆయుధాలను దోచుకున్నారు. అపారమయిన ఆ మొఘల్
సంపదతో కొన్ని వేలమందిని తన సైన్యంలో చేర్చుకొన్నారు. కొద్దిరోజుల్లో
మొఘలుల, బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన
సొంతం చేసుకోవడం మొదలు పెట్టారు.
ఇది చూసిన ఔరంగజేబు ఆగ్రహోద్రుడై తన దగ్గర పని చేస్తున్న
రాజపుత్రుడయిన రాజా జై సింగ్ను శివాజీ పైకి పంపించాడు. రాజా జై సింగ్ సంగతి
తెలిసిన శివాజి తాను యుద్దంలో ఓడిపోవడం ఖాయమని తెలుసుకొని సంధికి
ఒప్పుకున్నాడు. సంధిలో భాగంగా 23 కోటలను, 4,00,000
రూపాయలను మొఘలులకు చెల్లించారు.
శివాజీ తాను కూడా ఒక మొఘల్ సర్దార్గా ఉండడానికి అంగీకరించారు. మొఘల్
సైన్యాన్ని ఉపయోగించుకొని తన శతృవులయిన బిజాపూర్, గోల్కొండ
సుల్తానులను ఓడించడానికే శివాజీ మొఘల్ సర్దార్గా ఉండడానికి ఒప్పుకున్నారు.
ఆగ్రా కుట్ర
1666లో ఔరంగజేబు తన యాభయ్యవ పుట్టినరోజు సందర్భంగా శివాజీని,
అతని ఆరేళ్ళ కొడుకు శంభాజీని ఆగ్రాకు అహ్వానించాడు. సభలో శివాజీని
సైనికాధికారుల వెనుక నిలబెట్టి అవమానపరిచాడు. ఇది సహించలేని శివాజి
బయట వెళ్తుండగా భటులు చుట్టుముట్టి శివాజీ ఉంటున్న అతిధి గృహానికి
తీసుకెళ్ళి అక్కడే బందీ చేశారు.
ఔరంగజేబు మొదట శివాజీని చంపాలనుకున్నా, దానివల్ల మరాఠాలు ఒక్కసారిగా
చెలరేగుతారని తెలుసుకొని శివాజీని బందీగా ఉంచాలని నిశ్చయించాడు. తన కొడుకుతో
బందీగా ఉన్న శివాజీ ఎలాగయినా తప్పించుకోవాలని ప్రయత్నించసాగారు.
ప్రతిరోజు తాను ఏరికోరి సమకూర్చిన పళ్ళను ఆగ్రాలోని సాధువులకు, గుడులకు,
ఫకీర్లకు పంపించేలా అనుమతి తీసుకున్నారు. కొన్ని నెలలపాటు పళ్ళ
బుట్టలు పంపించిన తర్వాత తాను పనిమనిషిగా మారువేషం వేసుకొని
కొడుకును బుట్టలో పెట్టుకొని తప్పించుకున్నారు. శివాజీ, శంభాజీ
ఇద్దరూ పళ్ళబుట్టల్లో దాక్కుని తప్పించుకొన్నారని ఒక వాదన.
అప్పటికే శివాజీ ప్రాబల్యం తగ్గడం వల్ల, మొఘలులు మరిన్ని
యుద్దాలలో పాల్గొంటూ ఉండడంవల్ల ఔరంగజేబు శివాజీనుండి ముప్పు ఉండదని
భావించి పెద్దగా పట్టించుకోలేదు. శివాజీ ఎక్కువ ప్రాచుర్యంపోందేలా కాకుండా
రహస్యంగా తన కార్యకలాపాలు నిర్వహించడం మొదలుపెట్టారు. 1674
నాటికి లక్ష మంది సుశిక్షితులయిన సైన్యాన్ని, ఆయుధాలు, అశ్వాలు, నౌకా
వ్యవస్థను సమకూర్చుకున్నారు. 1670 జనవరి నుండి మొఘల్ కోటల పైన
దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలు పెట్టారు. అలుపెరగని యుద్దాలతో
అలసిపోవడం, సరి అయిన సైన్యం లేకపోవడం, ఖజానా ఖాళీ కావడంతో మొఘల్
సైన్యం శివాజీని ఎదుర్కొనలేకపోయింది. సింహగఢ్ యుద్ధం
శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్నా, పూణే దగ్గర ఉన్న కొండన
కోట స్వాధీనం కాలేదు. ఆకోటను ఉదయ్భాన్ రాథోడ్ అనే
రాజపుతృడు పరిరక్షిస్తుండడమే కారణం. దుర్భేధ్యమయిన ఆ కోట
చుట్టూ ఎప్పుడూ సైనికులు పహారా కాస్తుండడంతో శివాజీ తనదగ్గర అత్యంత
గొప్ప సైనికాధికారిగా పేరు తెచ్చుకొన్ని తానాజీ మలుసారేకి ఆ కోట
స్వాధీనం చెసుకొని బాధ్యత అప్పగించారు.
తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్దిరోజులపాటు క్షుణ్ణంగా
అధ్యయనం చేసాడు. అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమయిన
సైన్యం ఉంది. చివరగా కోటకు ఒకవైపు ఉన్న ఒక కొండ తానాజీని ఆకర్షించింది.
ఆ కొండ చాలా ఏటవాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం.
అప్పుడు తానాజీ 'యశ్వంతి ' అనే పేరుకల ఉడుముకు తాడు కట్టి కొండ పైకి
విసిరాడు. తాడు సహాయంతో పైకి వెళ్ళినవారు అందించిన తాళ్ళను పట్టుకొని
సైన్యం కోటలోకి చేరుకొంది. చరిత్రలో యుద్దంలో ఉడుమును ఉపయోగించడం ఇదే
ప్రథమం కావచ్చు.
అంతలో తానాజీ సోదరుడు సూర్యాజీ కోట ముఖద్వారంపైన దాడి చేసాడు.
మారాఠాలకు రాజపుత్రులకు జరిగిన భీకరపోరులో మరాఠాలు గెలిచినా తానాజీ
మరణించారు. ఈ వార్త విన్న శివాజీ 'కోటను గెలిచాము కానీ సింహాన్ని
పోగొట్టుకొన్నాము ' అన్నారు. సింహంవలె పోరాడిన తానాజీ గౌరవార్థం కొండన కోట
పేరును సింహఘడ్గా మార్చారు.
జూన్ 6, 1674న రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని
క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి ' అని
బిరుదును ప్రదానం చేసారు. కొన్నాళ్ళకు 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల
దండయాత్రచేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నారు.27
ఏళ్ళపాటు యుద్దాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా
సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజి మూడు వారాలు తీవ్ర జ్వరంతో
బాధపడి ఏప్రిల్ 3, 1680 న మధ్యాహ్నం 12 గడియలకు రాయఘడ్
కోటలో మరణించారు.
శివాజీ పెద్దకొడుకయిన శంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి
మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించారు.
యుద్దతంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ
రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం,పటిష్టమయిన
గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేసారు. ప్రజలకోసమే ప్రభువు అన్న
సూత్రం పాటించి, వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల
సంక్షేమం కోసమే పాటు పడ్డారు.
వ్యక్తిత్వం
సుధీర్ఘ యుద్ద కాలంలో లెక్కలేనన్ని యుద్దాలు చేసినా
ఎన్నడూ పవిత్రస్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్దంలో ఓడిపోయిన
శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్దం చేయలేనివారికి, స్త్రీలకు, పసివారికి
సహాయం చేసారు.
ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి
అందమయిన కోడలును తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు. శివాజీ ఆమెతో
"నా తల్లి కూడా మీ అంత అందమయినది అయిఉంటే నేను కూడా అందంగా
ఉండేవాడిని" అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి
పంపించారు.
నిస్వార్థంగా ప్రజలకు సేవచేయడం, తాను చేస్తున్న పనిపట్ల అంకితభావం,
మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా
నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులో ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని
గొప్పరాజుగా చేసాయి.
సైన్యం
మరాఠా సామ్రాజ్యం ముగిసేవరకు శివాజీ ఏర్పాటు చేసిన సైనిక వ్యవస్థ
నిలిచి ఉండేది. గెరిల్లా యుద్ద విధానం శివాజీతోనే మొదలయింది. కొత్త
ఆయుధాలను కనుగొని వాటితో యుద్దాలు చేయించడం శివాజీకి ప్రత్యేక
అభిరుచి. పటిష్టమయిన నౌకా దళాన్ని, ఆశ్వికదళాన్ని ఏర్పాటు చేసారు.
ఎనిమిది నెలలు పంటలు పండించే రైతులు కూడా నాలుగు నెలలు యుద్ద
నైపుణ్యాలను నేర్చుకోవడం శివాజీ విధానాలను అద్దం పడుతుంది. కేవలం సైనికులే
కాక సంఘంలోని అన్ని వర్గాలవారు కోటను పరిరక్షించేవారు.మరణించే నాటికి
శత్రువులందరూ వెనుకాడే విధంగా లక్ష సైన్యాన్ని తయారు చేసిన
సమర్థుడు శివాజీ.
మరణించేనాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. కొండలపైన ఉన్నత
సాంకేతిక విలువలతో దుర్భేధ్యమయిన కోటలను నిర్మింపచేయడంలో శివాజీ
ప్రపంచ ఖ్యాతి పొందారు. నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగీ
వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మించబడ్డాయి.
మతసామరస్యం
శివాజీ భవానిదేవి భక్తుడు. శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని
మతాలను సమానంగా చూసేవాడు. కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో
మసీదులు కట్టించాడు. శివాజీ సైన్యంలో మూడొంతులు ముస్లిములు. ఎందరో
ముస్లిములు ఉన్నత పదవులు నిర్వహించారు. హైదర్ ఆలీ ఆయుధాల
విభాగానికి , ఇబ్రహీం ఖాన్ నావికాదళానికి, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి
అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు.శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు
దౌలత్ ఖాన్, సిద్ధిక్ అనే ఇద్దరు ముస్లింలు!శివాజీ అంగ రక్షకులలో
అతిముఖ్యుడూ, అగ్రా నుంచి శివాజీ తప్పించుకోటానికి సహాయపడిన వ్యక్తి
మదానీ మెహ్తర్ కూడా ముస్లిమే!

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML