*కర్నూలు జిల్లా*
*అహోబలం -1*
బహుప్రాచీనమైన దివ్యస్థలం అహోబలం!
కర్నూలు మండలములోని నంద్యాల రైలు స్టేషనుకు ముప్పయి మైళ్ళ దూరంలో అహోూ బలం ఉంది. నంద్యాల నుండి అహోూబలానికి సమృద్ధిగా బస్సులున్నాయి. ఆంధ్రదేశంలోని మరికొన్ని ప్రధాన కేంద్రాల నుండి కూడ ఇచ్చటికి బస్సులున్నాయి.
అహోబలానికి వెళ్ళే మార్గాలు మూడు ఉన్నాయి. ఉత్తరాది నుండి వచ్చే యాత్రికులు నంద్యాలలో రైలు దిగి అచ్చటికి ముప్పయి మైళ్ళలో వున్న అహోబలానికి బస్సు మీద ఆళ్లగడ్డ మీదుగ వెళ్ళవచ్చు. రెండవది 'దోను'లో రైలు దిగి అచటి నుండి బనగానపల్లి, కోయిలకుంట్ల మీదుగా అహోబలం చేరవచ్చు. మూడవది సులభమైన మార్గం కడపలో రైలు దిగి అచ్చటికి నలభై మైళ్ళలో ఉన్న ఆళ్ళగడ్డ వచ్చి అక్కడి నుండి అహోబలానికి రావచ్చును.
ఈ ప్రదేశాన్ని 'సింగవేలు తుండ్రం' అని కూడా అంటారు. నరసింహ క్షేత్రం. శ్రీమన్నారాయణుడు ప్రహ్లాద సంరక్షణార్థమై హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి ఈ రూపం ధరించవలసి వచ్చింది. నారాయణుణ్ణి నరసింహ రూపంలో ప్రతిష్ఠించుకొన్న దివ్యస్థలాలు ఎన్నో ఉన్నాయి. కాని ఒక్క అహోబలంలోనే ఆ అవతారం యొక్క సమగ్ర వైభవాన్ని ఆరాధించుకొనే అవకాశం ఉన్నది. ఇక్కడ ఆ అవతారం యొక్క అన్ని రూపాలూ విజయం చేసి ఉన్నాయి. ఇచ్చట నవనారసింహులూ ఉన్నారు.
పర్వతపాదం సమీపించటంతోనే ప్రహ్లాద వరద నరసింహ దేవాలయం కనిపిస్తుంది. స్వామి ప్రహ్లాదుని అనుగ్రహించిన రూపం ఇది. ఈ ఆలయం మూడు ప్రాకారాల నడిమి భాగంలో ఉన్నది. ఇది విజయనగరం శిల్పశైలిలో నిర్మింపబడి ఉన్నది. ఈ ఆలయానికి ఫర్లాంగు దూరంలో ఆళ్వార్లు కోనేరు ఉన్నది. అది యీ క్షేత్రంలో పానీయ జలాన్ని ప్రసాదిస్తోంది. ఇక్కడికి మైలున్నర దూరంలో ఛత్రావిత నరసింహస్వామి వేంచేసి యున్నాడు. ఈ స్వామి చుట్టూ అన్నీ ముళ్ళ పొదలు! స్వామి విగ్రహం ఒక రావి చెట్టుక్రింద ప్రతిష్ఠితమై ఉన్నది. పర్వతపాదం నుండి ఎగువ అహోబలం చేరడానికి కొండ ఎక్కాలి. ఈ పర్వత మార్గం రమారమి 6 మైళ్ళు. ఇది కన్నె కొండల మీదుగా అడవుల మీదుగా అనేక జలపాతాలతో అతి మనోహరమైన ప్రకృతి
సౌందర్యంతో నిండి ఉంటుంది. అచ్చట అనేక నరసింహాలయాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి.
అందులో కరండ నరసింహస్వామి ఆలయం ఒకటి. ఇంకొకటి యోగానంద నరసింహస్వామి ఆలయం అంటారు. జనప్రచారంలో ఉన్న గాధ ఇలా చెబుతుంది. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ప్రహ్లాదుణ్ణి శిష్యుడుగా స్వీకరించి స్వామి అనేక యోగ విద్యా రహస్యాలు ఉపదేశించాడు. ఆ ఉపదేశ మూర్తిని యోగానంద నరసింహ మూర్తి అంటారు. ఈ పుణ్యస్థలంలోనే గోఖిల భరద్వాజ మహర్షులు తపస్సు చేసి పాపవిముక్తు లైనారని ప్రసిద్ధి.
📖
“ఈ స్తంభంలో కూడ విష్ణువు ఉన్నాడా?"
ఎగువ అహోబలం సముద్రతలానికి 2,800 అడుగుల ఎత్తున ఉంది. ఈ కొండయొక్క రెండు శిఖరాలకు వేలాద్రి అని గరుడాద్రి అని పేర్లు. ఈ శిఖరాల నుండి పావనమైన భవనాశిని తీర్ధం ప్రవహిస్తూంటుంది. ఈ తీర్థం రెండు పాయలై కుమద్వతీ నదిలో, పెన్నానదిలోను కలుస్తుంది. దీన్ని అంతర్వాహిని అంటారు. కొండ దక్షిణపు వాలులో స్వామి ఉగ్రనరసింహ రూపంలో సేవింపబడుతున్నాడు. ఈ ఆలయ ప్రాకారం గోపురాలతో బ్రహ్మాండంగా ఉంటుంది. దీనికి చాలా దగ్గరలోనే గుహనరసింహ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ ద్వారంలో పెద్ద స్తంభం ఉంటుంది. పురాణ ప్రసిద్ధమైన ప్రహ్లాదుని కథలో ఏ స్తంభాన్ని నిర్దేశించి హిరణ్యకశపుడు "ఈ స్తంభంలో కూడ విష్ణువు ఉన్నాడా?" అని దట్టించి అడిగాడో, ఆ స్తంభం యిదేనని ఈ స్తంభం లోంచే ఉగ్ర నరసింహాకారంలో స్వామి ఆవిర్భవించి హిరణ్యకశిపుణ్ణి చీల్చివేశాడని జనసామాన్యంలో ఉన్న గాఢ విశ్వాసం.
ఈ ఆలయానికి మూడు ఫర్లాంగుల దూరంలో ఉంది, కోట నరసింహుని దేవాలయం. స్వామి ఇచ్చట వరాహరూపంలో సేవింపబడుతున్నాడు. ఈ గుడిలో మూడు రోజులు నారాయణ శతాక్షరీజపం, వరాహకాండ పారాయణం చేసిన భక్తునికి అమితమైన ఆముష్మికాభ్యుదయం లభిస్తుందంటారు.
📖
*నవ నరసింహులు*
ఇక్కడికి రెండుమైళ్ళ దూరంలో ప్రసిద్ధమైన మాలోల నరసింహస్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామి శాంతరూపంలో లక్ష్మి అమ్మవారి తో ఎప్పుడూ వినోదిస్తూంటారు. ప్రసిద్ధుడైన కాకతీయ ప్రతాపరుద్ర మహారాజు బంగారంతో ఉత్సవ విగ్రహం చేయించి సమర్పించాడు. ఆ విగ్రహం ఆధ్యాత్మద్రష్టలైన అహోబలం జియ్యరు స్వాముల ఆరాధనలందుకొంటూ ఉన్నది. ఇంకా ఎగువకు వెడితే జ్వాలా నరసింహస్వామి దేవాలయం వస్తుంది. ఇచ్చట స్వామి యొక్క ఉగ్రకళ సాక్షాత్కరిస్తుంది. స్వామి యొక్క కోపరూపం పరాకాష్ట వహించి హిరణ్యకశిపుణ్ణి ముక్కలు ముక్కలుగా చీల్చిన ప్రదేశం సరిగ్గా యిదేనంటారు. దీని సమీపంలోనే పావన నరసింహస్వామి ఉన్నాడు. ఈ స్వామికి శాక్త సంప్రదాయానుసారంగా అర్చన చేయవలసి వుంటుందిట.
ఈ నవనరసింహుల పేర్లు ఇవి
1) ప్రహ్లాద నరసింహుడు లేక లక్ష్మి నరసింహుడు, 2) ఛత్రవాట నరసింహుడు,
3) కండర నరసింహుడు,
4) యోగానంద నరసింహుడు
5) గుహ నరసింహుడు,
6) క్రోడనరసింహుడు,
7 ) మాలోల నరసింహుడు,
8) జ్వాలా నరసింహుడు,
9) పావన నరసింహుడు

No comments:
Post a Comment