*"కాశీలో డుంఢి గణపతి"*
కాశీలోని డుంఢి గణపతిని *"డుంఢి రాజ్ గణపతి, డుంఢి మహారాజ్"* అని కూడా పిలుస్తారు. *ఒకానొకప్పుడు "దివోదాసు" అనే కాశీ రాజు వలన విశ్వనాధుడు కాశీ విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చింది. కాశీ వియోగాన్ని భరించలేని శివుడు, తను కాశీ రావడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించమని యోగినీ దేవతలను, భైరవులని, సూర్యు భగవానుని, బ్రహ్మ దేవుడిని వరుసగా పంపిస్తాడు! కానీ దివోదాసులో అధర్మం కనిపించక, ఏమీ చేయలేక, కాశీని విడిచిపెట్టలేక వారందరూ కాశీలోనే ఉండిపోతారు.*
అప్పుడు విశ్వనాధుడు గణపతిని కాశీ పంపిస్తే, విశ్వనాధుడు కాశీకు వచ్చే పరిస్థితులను కల్పిస్తాడు. శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో కలసి కాశీ వచ్చి, విశ్వనాధుడు కాశీ వచ్చేలా చేస్తారు. అప్పుడు కాశీలో ప్రవేశించిన విశ్వనాధుడు గణపతిని కౌగలించుకుని.. *'నేను కాశీ మళ్ళీ రావడానికి ఈ నా శిశువే కారణం! తండ్రికి అసాధ్యమైనది కొడుకు సుసాధ్యము చేస్తాడనడానికి ఇదొక దృష్టాంతము'* అని చెప్పి, విశ్వేశుడు గణపతిని ఇలా స్తుతించాడు ....
శ్రీకంఠ ఉవాచ....
"జయ విఘ్నకృతా మాద్య- భక్తనిర్విఘ్న కారక,
అవిఘ్న విఘ్నశమన- మహావిఘ్నైక విఘ్నకృత్.
.... ..... ....
- సర్వగణాలకు అధీశుడవైన నీకు జయము. సర్వగణాల ముందుండెడి నీకు జయము, అన్ని గణాలచే నమస్కరింపబడు పాదాబ్జములు కలవాడా నీకు జయము. ... ... ..." అని స్తుతించి, గణపతికి అనేక వరాలు ఇస్తాడు.
శివుడు గణపతితో *"అన్ని అర్ధాలను అన్వేషించువాడవు కావున నీకు డుంఢి అనే పేరు కలిగింది. డుంఢిరాజ వినాయకా, నీ సంతోషం లేనిదే ఎవడూ కాశీ ప్రవేశం పొందలేడు. డుంఢీరాజా! నీ పాదాలకు నమస్కరించిన తర్వాత నన్నెవడు నమస్కరిస్తాడో వాని చెవి వద్దకు చేరి ఉపదేశిస్తాను! నా ఉపదేశం వలన అతను మళ్ళీ జన్మ ఎత్తడు. మణికర్ణికయందు సచేలస్నానం చేసి, దేవ, ఋషి, పితృ తర్పణాలు ఇచ్చి, జ్ఞానవాపి తీర్ధాన్ని సేవించి, నిన్ను భజించాలి.* మోదకములు, దూపదీప పుష్పాలు, గంధంతో నిన్ను తృప్తి పరిచినా నీవు కాశీనగర నివాస ఫలాన్ని ఇస్తావు! నీకు ప్రతిరోజు నమస్కరించిన వారికి అనేక విఘ్నాలు తొలగి, వారికి దొరకని వస్తువే ఉండదు.
*డుంఢి వినాయకుడువైన నీ నామాన్ని, ప్రతిదినము జపించిన వారి హృదయంలో అష్ఠసిద్ధులు జనిస్తాయి. అనేక భోగాలు అనుభవించి చివరకు మోక్షాన్ని పొందుతారు. కాశీలో నీవు అనేక రూపాలలో ఉన్నావు. డుంఢిరాజువై నా దక్షిణభాగంలో ఉంటూ, నా భక్తులకు అనేక సంపదలను ఇస్తున్నావు! మంగళవారంతో కూడిన చతుర్ధినాడు మోదకాదులు, గంధమాల్యాదులతో నీకు పూజ చేసిన వారిని నా గణాల్లో చేర్చుకుంటాను. కాశీలో ప్రతి చతుర్ధినాడు నిన్ను పూజించేవారికి కలిగే ఆపదల శిరస్సున నీ వామపాదాన్ని మోపుతావు. వార్షికయాత్రను ఆచరించి, మాఘ శుక్ల చతుర్ధినాడు తెల్లని నువ్వుల లడ్డూలను నీకర్పించి, ఎవడు భుజిస్తాడో వారిని అనుగ్రహిస్తావు. ఆరోజు నువ్వులు, నెయ్యితో హోమం చేసిన వారికి మంత్రసిద్ధి కలుగుతుంది.*
*డుంఢిరాజు కాశీ రక్షణకై 56 రూపాలలో పిలవబడుతూ, కొలవబడుతున్నాడు. ఈ వినాయకులు ఏడు ఆవరణలలో ఉంటారు. కాశీ బయట ఉన్నవారు ఈ గణపతుల నామాలను స్మరించిన మరణోత్తరం జ్ఞానం పొందగలరు.* (శివుడు ఈ 56 గణపతుల నామాలను తెలిపాడు. స్థలాభావం వలన ఇక్కడ చెప్పడం లేదు. పైన ఉన్న "చప్పన్ యాత్రలోని గణపతుల పేర్లు చూడగలరు). ఎక్కడ ఉన్నవారైనా గణేశులను స్మరించవచ్చు. మహాఆపద సమయాల్లో గణేశుడు రక్షిస్తాడు" అని శివుడు తెలిపాడు.
(ఇది స్కంద పురాణాంతర్గత కాశీఖండం నుండి గ్రహించినది క్లుప్తంగా)
*అడ్రస్:* డుంఢి గణపతి ఆలయం కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణమ్మ ఆలయాలకు వెళ్ళే విశ్వనాథ్ గలీ గేట్ నెం.1 ప్రవేశం దగ్గరలో ఉంటుంది.
*
"భగవంతుడి నామాన్ని జపించడమే జపయజ్ఞం- జపయజ్ఞ సమితి"
"ఓం గం గణపతయేనమః"
"ఓం గం గణపతయేనమః"
"ఓం గం గణపతయేనమః"

No comments:
Post a Comment