వైశాఖ బహుళ దశమి శనివారం హనుమ జననం. మన దేశంలో ఆంజజనేయోపాసనకు ప్రాధాన్యం ఎక్కువ. అత్యధిక దేవాలయాలు ఈ స్వామికే ఉన్నాయి.
శివుని అష్టమూర్తుల్లో ఒకడైన వాయువు ద్వారా రుద్రతేజం అంజనీదేవిలో ప్రవేశించింది. ఆమె కారణ జన్మురాలైన అప్సరః కాంత. ఆ తల్లి తనయునిగా జన్మించాడు హనుమ. అతడు బాల్యంలోనే అలవోకగా సూర్యమండలం వరకు ఎగిరిన బలశాలి. వేదమూర్తి అయిన సూర్యుడికి శిష్యుడు. సూర్యుని నుంచి ఆయనకు వరంగా లభించిన దివ్య తేజశ్శక్తే సువర్చస్సు. ఈ శక్తినే స్త్రీ దేవతగా – ఉపాసనా సంప్రదాయంలో ‘సువర్చల’ అన్నారు.
రామాయణంలో తనకోసం కాక, పరులకోసం తన ప్రతాపాన్ని ప్రదర్శించిన వాడు ఆంజనేయుడే. రావణుని తాను సంహరించగలిగినప్పటికీ అది శ్రీరాముని అవతార కార్యమని, అందుకు తగిన సహకారం అందించాడు. “రాముని బాణంలా లంకలోకి వెళ్తాను’ అనడంలోనే తన వినయాన్నీ, భక్తిభావాన్నీ ప్రకటించాడు.
జ్ఞానం, వినయం, యోగం, బలం, ధైర్యం, చాతుర్యం, వాగ్వైభవం ఇన్నింటి కలబోత హనుమ.
అభయం, ఆనందం ఈ రెండూ హనుమ అందించే వరాలు. భయపడిన సుగ్రీవుడికి అభయమిచ్చి శ్రీరామ మైత్రిని అందించాడు. శోకంలో ఉన్న సీతకు శ్రీరామ సందేశాన్ని వినిపించి ప్రాణాలను నిలబెట్టి, సంతోషపరచాడు. సీత జాడను తెలిపి, లక్ష్మణుని ప్రాణాలు నిలిపి శ్రీరాముని ఆనందపరచాడు. ఇలా అభయాంజనేయునిగా, ఆనందాంజనేయునిగా భాసించాడు.
ఆదర్శవంతమైన వ్యక్తిత్వం, ఆరాధించదగిన దైవత్వం కలబోసిన పరమేశ్వర స్వరూపమే శ్రీ ఆంజనేయస్వామి.
No comments:
Post a Comment