*స్తంభ చతుష్టయం.*
*శైవాగమాలలో పూజ ప్రధానంగా రెండు విధములగా చెప్పబడింది అది ఒకటి ఆత్మార్ధపూజ రెండవది పరార్ధ పూజ.తనకోసం తాను చేయునది ఆత్మార్ధపూజనియు. అలాగే లోక కళ్యాణార్ధం, పరులకోసం విద్యుక్తముగా ఆగమోక్తంగా నిర్మించిన దేవస్థానములలో దైవాన్ని శిలారూపకంగా ప్రతిష్టించి పూజించు దానిని పరార్ధపూజనియు అందురు.*
*ఈవిధంగా పరార్ధ పూజార్ధం నిర్మించిన దేవస్థానాదులలో ధ్వజస్థంభాన్ని కూడా స్థాపిస్తారు.ప్రధాన దేవతను ఉద్దేశించి జరిగే మహోత్సవాది కైంకర్యములకు సర్వదేవతలకు ఆహ్వానము తెలుపుటకు ఆ దేవత యొక్క వాహనమును ధ్వజపటం గా చిత్రీకరించి అధివాస పూర్వక ప్రాణప్రతిష్ఠ గావించి ధ్వజారోహణ చేస్తారు. శివాలయములో వృషభాన్ని చిత్రీకరించి ధ్వజారోహణం చేస్తారు. ఇందుకుగాను దేవస్థానముల లో జరిగే పూజా కైంకర్యాలలో ధ్వజస్తంభానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతగలదు.*
*ఈ స్తంభము నాలుగు విధములుగా ఉండునని కపర్దీ సంహిత తెలియజేస్తున్నది.*
*శ్లోకం.*
*మేఖలాసహితంకుర్యాద్ధ్వజస్తంభముదాహృతమ్.*
*నన్దినాసహితంకుర్యా న్నాందికంస్తమ్భముచ్యతే.*
*శూలేనసహితంకుర్యాచ్ఛూలస్తమ్భముదాహృతమ్.*
*దీపార్ధం స్థాపనంకుర్యాద్దీపస్తమ్భముదాహృతమ్.*
*మేఖలా సహితంగా రూపోందింపబడినటువంటి స్తంభాన్ని ధ్వజస్తంభమనియు, నంది సహితంగా రూపోందింపబడినటువంటి స్తంభాన్ని నంది స్తంభమనియు,త్రిశూల సహితంగా రూపోందింపబడినటువంటి స్తంభాన్ని శూలస్తంభమనియు, దీపమును వెలిగించుట కొరకు స్థాపింపబడినటువంటి స్తంభమును దీపస్తంభమని అందురు.*
*కపర్దీ సంహిత (శైవాగమం).*
No comments:
Post a Comment