గీత...!
➖➖➖
కృష్ణుడు అర్జునకు ఆత్మ జ్ఞానమును బోధించి తన ధర్మాన్ని బోధించి .. మనతో ధర్మాన్ని ఆచరింపజేసి .. క్రిందపడిన గాండీవాన్ని మళ్ళీ అర్జునుడిచే సంధింపజేయించినట్లు మనల్ని కూడా
కర్తవ్యపరాయణులను చేస్తుంది. అందుకే "భగవద్గీత" అన్నది ఆత్మవిజ్ఞాన శాస్త్ర మహాగ్రంథం!
అది మనకు సత్య దర్శనం గురించీ మరి ధర్మాచరణం గురించీ విశేషంగా ప్రబోధిస్తూ ఉంటుంది.
"సత్యం" అన్నది "జ్ఞాతవ్యీయం" ..!
అంటే తెలుసుకోవలసినది ..!!
మరి "ధర్మం" అన్నది "ఆచరణీయం"
అంటే నిరంతరం ఆచరించవలసింది!!!
సత్యం తెలియకపోతే మనకు ధర్మాన్ని ఆచరించే విధివిధానం అర్థం కాదు.
దాంతో యుద్ధరంగం నుంచి పలాయనం చెందాలని అర్జునుడు ప్రయత్నించినట్లు మనం కూడా ప్రాపంచిక సంసారంలో కర్తవ్యాల నుంచి తప్పించుకోవాలని చూస్తూంటాం.
మన ముసలి తల్లితండ్రులనూ మరి ఇంట్లో ఉన్న ఇతర పెద్దలనూ చూసుకోవడానికి విముఖత చూపిస్తూ .. వారిని వృద్ధాశ్రమాలలో చేర్పించి .. అదే 'కర్తవ్యం'
అని చేతులు దులుపుకుంటాం. కానీ ..
"ఈ జన్మలో మనం మన కర్తవ్యాలను సరిగ్గా ఆచరించకపోతే మళ్ళీ మళ్ళీ అనేక జన్మలు ఎత్తి అవే కర్తవ్యాలను అవే పరిస్థితులలో మళ్ళీ మళ్ళీ నిర్వర్తించాల్సి వస్తుంది" అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి.
"తే త్వం భూంక్త్వా స్వర్గలోకం విశాలం
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి
ఏవం త్రయీధర్మమనుప్రపన్నా
గతాగతం కామకామా లభంతే"
– భ.గీ.|| 9-21
"ఆ విశాలమైన స్వర్గలోకాలలోగల భోగాలను అనుభవించిన తరువాత .. మరి పుణ్యం అయిపోగానే .. నువ్వు మళ్ళీ మర్త్యలోకాలకు ప్రవేశిస్తావు. ఈ ప్రకారంగా మూడు రకాల ధర్మ కర్మలను ఆచరిస్తూ .. భోగాలను ఆశిస్తూ .. స్వర్గ మర్త్య లోకాలకు మధ్య రాకపోకలను సాగిస్తూనే ఉంటావు"
అన్నారు శ్రీకృష్ణుల వారు.
పుణ్యం పెరగగానే స్వర్గలోకానికీ మరి పుణ్యం క్షీణించగానే మర్త్యలోకానికీ తిరుగుతూ .. మనలో ఉన్న "కామం" అన్నది "అకామం" అయ్యేంతవరకూ మనం రాకపోకలను సాగిస్తాం. ఎప్పుడయితే "త్రయీధర్మ పరాయణులుగా" మన దేహధర్మం, మన కుటుంబధర్మం మరి మన సంఘధర్మానికి చెందిన కర్తవ్యాలను ఆత్మజ్ఞానంతో సంపూర్ణంగా ఆచరిస్తామో .. అప్పుడు
ఇక మళ్ళీ ఈ భూమిమీదకు నేర్చుకోవడానికి రావలసిన అవసరం ఇక ఉండదు.
*"దేహధర్మం":* ఈ దేహం మనకు ప్రకృతి నుంచి లభించింది. ఇందులోకి మనం ప్రవేశించాం కనుక దీనిని జాగ్రత్తగా చూసుకోవడం మన ధర్మం. అశాస్త్రీయమైన తిండితో, అశాస్త్రీయమైన ఆలోచనలతో మరి అశాస్త్రీయమైన కర్మాచరణలతో దానిని పాడుచేసుకోకూడదు.
అద్దెకు తీసుకున్న కొంపను ఇష్టం వచ్చినట్లు "కొల్లేరు"లా చేస్తే దాని యజమాని ఊరుకోనట్లే .. ప్రకృతి నుంచి అద్దెకు తీసుకున్న మన ఈ శరీరాన్ని తినకూడని వాటితో మరి తాగకూడని వాటితో నింపేస్తూంటే ఆ శరీరానికి యజమాని అయిన ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? "నా ఇంటిని నీకు ఎలా ఇచ్చానో .. నువ్వు నాకు అలాగే అప్పచెప్పకపోతే నీ మీద
'దావా' వేస్తాను" అని ఇంటి యజమాని బెదిరించినట్లు .. ప్రకృతి కూడా క్యాన్సర్ రూపంలోనో, డయాబెటీస్ రూపంలోనో,
లివర్ సిర్రోసిస్ రూపంలోనో మన మీద
'దావా' వేస్తుంది!
చాలా మంది "మాకు అన్నీ తెలుసు" అనుకుంటూ .. "ఎవరో చంపిన జంతువులను మేము తింటే తప్పేంటి? మేము స్వయంగా చంపట్లేదు కదా?" అని అతితెలివిగా వాదిస్తూంటారు. ఎవడో వచ్చి మన క్రొత్త పెట్రోలు కారులో 'డీజిల్' పోస్తే పాడయి పోయేది మన కారే కదా! ఇది కూడా అంతే!
ప్రకృతిని మనం ఎంతగా నాశనం చేస్తామో అంతగా అది మనకు శిక్ష వేస్తుంది. కనుక 'నాగరికత' ముసుగులో శరీర ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించకుండా .. చేయవలసిన ధ్యానం చేసి విశ్వశక్తితో శరీరాన్ని వజ్రకాయంలా మార్చుకోవాలి.
*"కుటుంబ ధర్మం":* ఒకానొక తల్లిగా, ఒకానొక తండ్రిగా, ఒకానొక కొడుకుగా,
ఒకానొక కూతురుగా, ఒకానొక అన్నగా,
ఒకానొక తమ్ముడిగా .. ఇలా మనం కుటుంబంలో ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రకు తగ్గట్లు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ మన సకల కుటుంబసభ్యుల పట్ల విద్యుక్త ధర్మాలను నెరవేర్చాలి.
*"సంఘధర్మం":* మనకు ఉన్నదాంట్లో
కొంత వాడుకుని .. మిగతాది సంఘంలోని ఇతర సభ్యులతో పంచుకోవాలి. సంఘ నిర్వహణ కోసం ప్రకృతిపరంగా విధించబడిన కట్టుబాట్లను గౌరవిస్తూ .. రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తూ సంఘంలో ఒక సభ్యుడిగా సంఘం పట్ల మన కనీస ఆధ్యాత్మిక, ప్రాపంచిక ధర్మాలను నెరవేర్చాలి.
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment