*!*
➖➖➖
ఈ ప్రపంచంలో వ్యక్తులు పుట్టినరోజులు జరుపుకోవడం సర్వసాధారణం. కానీ, ఒక 'పాట' పుట్టినరోజు జరుపుకోవడం ఎక్కడైనా విన్నారా? ఆ పాట దేవుడే స్వయంగా పాడితే?! ఆ పాట పుట్టినరోజు కొన్ని వందల తరాలుగా జరుపుకునే గొప్ప సంఘటనగా మారుతుంది.
దాదాపు 5 వేల సంవత్సరాలకు పూర్వం శ్రీకృష్ణ భగవానుడు తన స్నేహితుడు, భక్తుడైన అర్జునుడిని ప్రోత్సహించడానికి పాడిన పాటనే *'భగవద్గీత'.*
*'శ్రీమద్ భగవద్గీత'* భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన, విస్తృతంగా అధ్యయనం చేయబడిన ఆధ్యాత్మిక గ్రంథాలలో ఒకటి. *'భగవద్గీత'* గంభీరమైన సిద్ధాంతానికి, రోజువారీ జీవితంలో ఆచరణాత్మక విలువలకు ఎంతో ప్రసిద్ధి చెందింది.
కురుక్షేత్ర యుద్ధభూమిలో సందిగ్ధంలో పడిన అర్జునుడికి సత్యాన్ని, తత్త్వాన్ని, వివేకాన్ని బోధించడానికి దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు పాడిన గొప్ప ఆధ్యాత్మిక గీతం 'భగవద్గీత'.
శ్రీకృష్ణుడు దీనిని మానవాళికి అందించిన రోజునే *'గీతా జయంతి'* గా భక్తులు స్మరిస్తారు.
జీవితసత్యాలను అర్థం చేసుకోవడానికి, మానవ జీవితాన్ని ఆదర్శవంతంగా గడపడానికి గీతాధ్యయనం అతిగొప్ప సాధనం.
'సంపూర్ణ విజ్ఞానం' అంటే, తాత్కాలికమైన ఈ భౌతిక ప్రపంచాన్ని, శాశ్వతమైన ఆత్మను, ఈ రెండిటికీ మూలమైన ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడమే.
'భగవద్గీత' మనకు అయిదు పరమ సత్యాలను బోధిస్తున్నది. *అవి:* అన్నిటికీ కారణభూతుడైన భగవంతుడు, ఆయన అంశలైన జీవులు, ఆయననుండి వెలువడిన ప్రకృతి (భౌతిక ప్రపంచం), అన్నిటినీ నియంత్రించే కాలం, కర్మ అంటే జీవుల మంచి-చెడు కార్యకలాపాలు. ఈ సత్యాల క్రమబద్ధమైన విశ్లేషణతోనే భక్తులకు భౌతిక, ఆధ్యాత్మికతలలోని సత్యం బోధపడి 'జ్ఞానోదయం' అవుతుంది.
గీతలోని 18 అధ్యాయాలను, 3 విభాగాలుగా విభజిస్తే కర్మ, భక్తి, జ్ఞాన యోగాలను ప్రధానంగా చూస్తాం. భగవద్గీత తొలి ఆరు అధ్యాయాల ప్రధానాంశం కర్మయోగం. స్వార్థపు కోరికలు లేకుండా (నిష్కామంగా) తమ కర్తవ్యాలను, విద్యుక్త ధర్మాలను బాధ్యతతో నిర్వర్తించడం కర్మయోగం. ఆత్మ తాలూకు శాశ్వత స్వభావాన్ని, భవబంధాలలో చిక్కుకోకుండా పనిచేసే ప్రక్రియలను శ్రీకృష్ణుడు వీటిలో వివరించాడు. మధ్యలోని ఆరు అధ్యాయాలలో ముఖ్యోద్దేశమంతా ఒక సారాంశంలా ఏర్పడిందే భక్తియోగం. 'భక్తి' అంటే భగవంతునికి నిస్వార్థంగా, నిరంతరాయంగా, ప్రేమపూర్వకంగా సేవ చేయడమే. దీనితో మనం భగవంతుని శాశ్వతధామాన్ని చేరుకోగలుగుతాం.
ఇక, భగవద్గీతలోని చివరి ఆరు అధ్యాయాలు జ్ఞానయోగం. మొదటి ఆరు అధ్యాయాలనే మరింత వివరంగా ఇవి విశ్లేషిస్తాయి. ఇందులో శ్రీకృష్ణుడు శరీరం, ఆత్మ, పరమాత్మల మధ్య వ్యత్యాసాన్ని, త్రిగుణాలు (సత్త్వ రజ స్తమో), వాటితో ప్రభావితమైన జీవుల ప్రవర్తన ఇందులో చదువుతాం.
'భక్తియోగం భగవద్గీత మధ్యలో ఎందుకు ఉంది?' అన్నది ఆసక్తికరమైన సందేహం. ఒక మహారాజు రథంలోనో, పల్లకీలోనో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన ముందు, వెనుక వేలాదిమంది సైనికులు, ప్రజలు, గుర్రాలు, ఏనుగులతోసహా సేవకులుకూడా ఉంటారు. రాజు వారందరిలో అతిముఖ్యమైన వ్యక్తి కనుక మధ్యలో ఉంటాడు. 'భక్తియోగం' ఎంతో ఉన్నతమైంది, నిగూఢమైంది. కాబట్టే, శ్రీ కృష్ణుడు గీత మధ్య అధ్యాయాలలో ప్రబోధించినట్టుగా అర్థం చేసుకోవాలి.
శ్రీ కృష్ణుడు చివరలో 'తనను సంపూర్ణంగా ఆశ్రయించి ఆరాధించే ప్రతీ ఒక్కరినీ అన్ని పాపాలనుండి సంపూర్ణంగా విముక్తులను చేస్తాను' (18-66) అని ప్రకటించాడు. 'గీతలోని ఈ బోధలను వ్యాప్తి చేసేవారు తనకెంతో ప్రియమైన వారనికూడా' ఆయన పేర్కొన్నాడు.
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment