What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 29 July 2015

శ్రీ నారసింహ క్షేత్రాలు - పాదమే దైవంగా పూజించబడే పెన్నహోబిలం


శ్రీ నారసింహ క్షేత్రాలు - 14
పాదమే దైవంగా పూజించబడే పెన్నహోబిలం
జయశ్రీ నరసింహేశ జయదైత్య విదారణ l

జయప్రహ్లాదవరద జయకుంధాభ విగ్రహ ll

ఇందుగలడందులేడని సందేహము వలదు .. అంటూ సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుని గురించి పూర్వం చిన్ని బాలుడు ప్రహ్లాదుడు మనస్పూర్తిగా నమ్మి ఆ భగవంతుని అనుగ్రహం పొందటమేగాక, నమ్మినవారిని కాపాడటానికి భగవంతుడు ఏ రూపంలోనైనా, ఏ స్ధలంలోనైనా ప్రత్యక్షమవుతాడని నిరూపించాడు. అది పురాణకాలం. నేటికీ భగవంతుడు శంఖ చక్రాలతో, నాలుగు చేతులతో ఎదురుగా ప్రత్యక్షం కాకపోయినా, నమ్మినవారికి తన ఉనికిని తెలియబరుస్తూనే వున్నాడు. అందుకే భక్తులు భగవంతుని పూర్తి రూపంతోనేకాదు, ఆయనదిగా చెప్పబడే దేనికైనా భక్తి శ్రధ్ధలతో నమస్కరిస్తారు, కొన్నిచోట్ల పూజిస్తారు. అలాంటి ఒక నరసింహ క్షేత్రం గురించి ఇప్పుడు చెబుతాను. ఇదే పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామి కుడి పాద ముద్ర పైన ఆలయం నిర్మింపబడింది. మరి నేను తెలుసుకున్న ఆ చరిత్రగురించి మీకు చెప్పాలికదా.
క్షేత్రం
బ్రహ్మాండ పురాణంలో, పద్మి పురాణంలో ప్రస్తావించబడిన ఈ క్షేత్రనికీ, శ్రీ నరసింహస్వామి నవనారసింహ రూపాలతో వెలుగొందే అహోబిల క్షేత్రనికీ అవినాభావ సంబంధం వున్నది. ఇక్కడకూడా నరసింహస్వామిది ఉగ్ర రూపం. కొండమీద వున్న ఈ ఆలయం గోపురం ప్రక్కనే నెలకొల్పిన పెద్ద నరసింహస్వామి విగ్రహం దూరంనుంచే కనిపిస్తాయి.
పురాణాలద్వారా తెలిసిన చరిత్ర
త్రేతా యుగంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అరణ్యం. ఋష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాదపి చిన్నతనంనుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తుడు. ఆయన ఈ కొండపై ఘోర తపస్సు చేశారట. ఆయన తపస్సుకి మెచ్చి స్వామి సాక్షాత్కరిస్తే ఆయన స్వామిని అక్కడ జ్వాల, అహోబిల నరసింహస్వామిగా కొలువుండమని ప్రార్ధించాడుట. స్వామి ఆయన కోరిక తీర్చాడుట. ద్వాపర యుగంలో ఉద్దాలక మహర్షి ఆశ్రమమిక్కడ వుండేదిట. ఆ ఆశ్రమానికి సమీపంలో ఒక పెద్ద బిలం వుండేది. ఆయన శిష్యులకు విద్యని బోధిస్తూ సమీపంలో వున్న బిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానిస్తూ చాలాకాలం గడిపేవాడు. ఆయన ధ్యాన నిష్టకు ప్రసన్నుడైన స్వామి ఒక రోజు ఆయన స్వప్నంలో సాక్షాత్కరించి అభీష్టమేమిటని అడిగాడుట. మహర్షి స్వామిని అక్కడ కొలువై వుండమన్నాడుట.

అందుకు స్వామి తన కుడి పాద ముద్రను ఆ బిల ముఖ ద్వారమున ప్రతిష్టిస్తానని చెప్పి అదృశ్య మయ్యాడట. మర్నాడు నిద్రలేచిన ఉద్దాలక మహర్షి ఆ బిల ద్వారం వద్దకు వెళ్ళి పరీక్షించగా, బిల ముఖద్వారంలో స్వామి కుడి పాద ముద్ర స్పష్టంగా దర్శనమిచ్చిందట. అప్పటినుంచీ ఆయన ఆ పాదానికి పూజలు చేస్తూ దానికి చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఈ పాద ముద్ర స్వామి స్వయంగా వేసినదిగనుక ఈ క్షేత్రం పవిత్ర క్షేత్రంగా అనతి కాలంలోనే ప్రసిధ్ధికెక్కింది. స్వామి పాదాన్ని పూజిస్తూ భక్తులు స్వామినే పూజించినట్లు భావించేవారు. స్వామి పాదానికి అభిషేకం చేసిన జలం కింద వున్న బిలంద్వారా వెళ్ళి దగ్గరలోనే వున్న పెన్నానదిలో కలుస్తుందని, ఆ నదిలో స్నానం చేసినవారి పాపాలన్నీ హరించిపోతాయనీ భక్తులు విశ్వసించేవారు. కాలగమనంలో కొంతకాలం ఈ క్షేత్రం మరుగున పడిపోయింది. కానీ స్వామి స్వయంభువుడిగా వెలిసి,ఎంతో మంది ఋషులచేత పూజించబడ్డ పుణ్య క్షేత్రాలు శాశ్వతంగా కనుమరుగు కావు. తిరిగి ఏదోవిధంగా వెలుగులోకి వస్తాయి. తర్వాత కాలంలో.....

క్రీ.శ. 7, 8 శతాబ్దాలలో ఈ క్షేత్రం తిరిగి వెలుగు చూసింది. అక్కడికి సమీపంలో వున్న గొల్లపల్లె అనే గ్రామం .. పేరుకు తగ్గట్లే పాడిపశువుల నిలయం. ఆ గ్రామంలో ఒక తెల్ల ఆవు కొండపైగల బిల ముఖద్వారము దగ్గర క్షీరమునిచ్చి వచ్చేది. దాని యజమాని ఆవు పాలివ్వకపోవటంతో ఏమయిందా అని దిగులుపడసాగాడు. ఒక రాత్రి అతని స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి ఆ పాలు తానే తాగుతున్నానని, ఆ కొండపై ఒక పుట్ట, దానిపక్కనే బిలము వున్నాయని, ఆ బిలము తవ్వితే తను కనబడతానని చెప్పాడు. ఆ ఆసామీ అమితాశ్చర్యంతో స్వామి చెప్పిన ప్రకారం చెయ్యగా అక్కడ జీర్ణస్ధితికి చేరిన ఆలయగోపురం, బిలము, బిలముఖద్వారమున స్వామి పాద ముద్ర, కొండకింద భాగంలో నైరుతి దిశలో శ్రీ లక్ష్మీదేవి విగ్రహం కనిపించాయట. ఆ ఆలయాలను పునరుధ్ధరించి, నిత్యపూజలు చేశారు. తర్వాత కాలంలో ఆ గొల్లపల్లె జాడ కూడా లేకుండా కాలగర్భంలో కలిసిపోయింది.

తర్వాత 9వ శతాబ్దంలో రాజేంద్రచోళుడనే చోళరాజు ఆ దోవలో వెళ్తూ, కాకతాళీయంగా ఈ దేవాలయాన్ని చూశారు. గోపురం, ప్రాకారాలతో వున్న ఈ ఆలయం పాదముద్రికపై ఆలయం వుండటం చూసి ఆశ్చర్యపోయాడట. అప్పటికే ఈ క్షేత్రం పునరుధ్ధిరంపబడిందిగానీ, దానికి కారకులెవరో తెలియదు. రాజేంద్రచోళుడు అప్పటికే తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఆయన, పెన్నహోబిలంలో కొండకిందవున్న లక్ష్మీదేవి ఆలయ గోపురాన్ని బాగుచేయించి, శ్రీ నరసింహస్వామి, లక్ష్మీదేవి, భూదేవిల పంచలోహ ఉత్సవ విగ్రహాలను ఆలయానికి సమర్పించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. 15వ శతాబ్దంలో ఈ పుణ్యక్షేత్రము చాలా వైభవంతో విలసిల్లినది. క్రీ.శ. 1565 విజయనగర రాజు, తుళువ సదాశివరాయలు తన దిగ్విజయ యాత్ర ముగించుకుని పెనుగొండనుంచి రాజధాని విజయనగరానికి వెళ్తూ ఈ క్షేత్రాన్ని దర్శించాడు. కొంత జీర్ణావస్ధకి చేరిన ఈ క్షేత్రాన్ని పునరుధ్ధరించమని తన సామంత రాజులని ఆజ్ఞాపించాడు.

అప్పుడు ఉరగాద్రి (ప్రస్తుతం ఉరవకొండ)ని పాలించే రాజ ప్రతినిధి అప్పలరాజు అయ్యంగార్, ఉదిరిపికొండ రాజప్రతినిధి ఉదిరప్పనాయుడు ఆలయ ప్రాకారాలని, రాజగోపురాలను, గర్భగుడి గోపురాన్ని ద్రావిడ వాస్తుకళా పధ్దతుల్లో తమ ప్రభువు సదాశివరాయలపేర పునరుధ్దిరింపచేశారు. అప్పుడే అప్పలరాజు అయ్యగారి భార్య అమ్మవారి ఆలయాన్ని పూర్తిగా పునరుధ్దరింపచేసినట్లు దేవాలయంలో వున్న శిలా శాసనంద్వారా తెలుస్తున్నది. రాజ ప్రతినిధులిద్దరూ నాలుగువైపుల గోపురాలకి మెట్లు ఏర్పాటు చేశారు. వీటిలో దక్షిణ దిశలోని గోపురం కొంచెం చిన్నదిగా వుంటుంది. ఈ గోపురం చిన్నదిగా వుండటానికి కారణం తెలియదు. దీనిని పాలగోపురం అంటారు. ఒక గొల్ల వనిత పాలు అమ్మగా వచ్చిన డబ్బుతో ఈ గోపురాన్ని నిర్మింపచేసినదని ప్రజలు చెప్పుకుంటారు.

ఉదిరప్పనాయుడు ఆలయ పునరుధ్దరణతోబాటు దాదాపు 50 అడుగుల ఎత్తున్న ఏకశిలా దీపస్తంభమును, సదాశివరాయల దిగ్విజయ యాత్రకు గుర్తుగా మరొక ఏకశిలా స్తంభమును స్వామి గర్భగుడికి ఎదురుగా ప్రతిష్టింపచేశాడు. ఇప్పటికీ వీటిని చూడవచ్చు. ఈ దీప స్తంభములో ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో అఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఈ క్షేత్రంలో స్వామి ధూప, దీప, నైవేద్యాలకు, పాలనా ఖర్చుకు, రెండువేల ఎకరాలున్న పెన్నహోబిల గ్రామాన్ని సదాశివరాయలు దానం చేసినట్లు ఆలయంలో వున్న శిలా శాసనంద్వారా తెలుస్తున్నది. క్రీ.శ. 1979లో శ్రీలక్ష్మీనరసింహస్వామి పాదముద్రకు పైభాగమున శ్రీ లక్ష్మీనరసింహస్వామి శిలా విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటినుంచి, ఈ క్షేత్ర మహిమలు ద్విగుణీకృతమయినాయని భక్తులు భావిస్తున్నారు.

విశేషాలు..

స్వామి కొండ కింద వున్న శ్రీ లక్ష్మీదేవి ఆలయంలో అమ్మవారి ముందు ఒక పుట్టు శిల వున్నది. దీనిని భక్తులు భూదేవిగా ఆరాధిస్తూంటారు. ఉగ్ర నరసింహస్వామి శాంతించి, చెంచు లక్ష్మితో వనవిహారం చేస్తుండగా భూదేవి ఖిన్నురాలై, భూగర్భాన కృంగిపోసాగిందిట. అప్పుడు స్వామి ఆమె శిగబట్టి బయటకి లాగాడట. పుట్టుశిలకు ఒకవైపు కొప్పున్నట్లు ఎత్తుగాకనబడుతుంది. ఇక్కడే ఎత్తయిన పీఠంపై లక్ష్మీదేవిని ప్రతిష్టించారు. స్వామి పాదముద్రకింద బిలం వున్నది. ఈ బిల మార్గము క్షేత్రానికి పడమటదిక్కులో ప్రవహిస్తున్న పెన్నానదిదాకా వున్నదని భావిస్తారు. స్వామి పాదానికి అభిషేకము చేసిన జలము ఆ బిలంద్వారా వెళ్ళి పెన్నానదిలో కలుస్తుందనీ, అందుకే ఈ నదీ స్నానం సకల పాపహరమని నమ్మకం.

ఈ జలం క్షేత్రానికి దిగువభాగంలో నైరుతి దిశలో వున్న జువ్విచెట్టు ఊడలలో ఊట జలరూపంగా ఎంతోకాలంనుంచీ ప్రవహిస్తూ బసవన్న కోనేరులో పడుతోంది. ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు ఈ కోనేటిలో స్నానంచేస్తే అన్ని రకాల రుగ్మతలూ పోతాయని నమ్ముతారు. ఈ క్షేత్రాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో ఇదివరకు జిల్లా కలెక్టరు శ్రీ సోమేష్ కుమార్ గారునృసింహావతారం ఆవిర్భావాన్ని తూర్పు ద్వారం పక్కన రహదారికి ఎదురుగా నిర్మింపచేశారు. ఈ విగ్రహాలు దూరంనుంచే దర్శించవచ్చు. క్రీ.శ. 2007లో జరిగిన ఒక సంఘటన స్వామి అనంతలీలలు తెలియజెయ్యటమేగాక భగవంతుడు కుల మతాలకు అతీతుడని తెలియజేస్తుంది. ఒక ముస్లిం వ్యక్తి కుమారుడికి హటాత్తుగా రెండుకాళ్ళు చచ్చుపడి ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితంలేకపోయింది. మిత్రుల సలహామీద ఆయన కొడుకుని ఎత్తుకుని, పెన్నహోబిల స్వామిని దర్శించి బసవన్న కోనేటి జలాన్ని నాలుగు వారాలు పిల్లవాడికి తాగించాడుట. ఐదవవారం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ పిల్లవాడు తనంతతాను మెట్లెక్కి స్వామి దర్శనం చేసుకున్నాడుట.

ఉత్సవాలు...

స్వామి అభిషేకజలం కలవటంవల్ల ఇక్కడ పెన్నానది మరింత పవిత్రతను సంతరించుకున్నదికదా. ప్రతి సంవత్సరం మాఘమాసంలో మూడవ ఆదివారం పెన్నేటి గంగమ్మ జాతర పెద్ద తిరనాళ్ళలాగా జరుగుతుంది. వేలకొద్దీ స్త్రీలు ప్రాతః కాలంలోనే పెన్నలో స్నానం చేసి ఒడ్డున వున్న శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేసి, అక్కడే వున్న గంగమ్మ విగ్రహానికి నారికేళాలను సమర్పించి, స్వామి దర్శనం చేసుకుంటారు. దీనివలన శ్రీఘ్రవివాహం, కలతలు లేని సంసారం ప్రాప్తిస్తాయని నమ్మకం. స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుధ్ధ ద్వాదశినుంచి వైశాఖ బహుళ సప్తమివరకు పన్నెండు రోజులు వైభవంగా బరుపబడతాయి.

మార్గము

అనంతపురం జిల్లాలో, ఉరవకొండకు 10 కిలోమీటర్లు, అనంతపురానికి 30 కి.మీ. దూరంలో వున్నది ఈ క్షేత్రం. అనంతపురంనుంచి క్షేత్రందాకా బస్సులు నిర్ణీత సమయాలలో వున్నాయి. బళ్ళారి, ఉరవకొండ వెళ్ళే బస్సులు చాలా వుంటాయి. వాటిలో వెళ్తే ఒక కిలోమీటరు నడిస్తే ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు.






No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML