రెండవ తిరుమల - నారాయణ తిరుమల ....
భక్తుడి సంకల్పం ఫలితంగా ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు పూర్వీకులు చెబుతుంటారు. వేదాంత ప్రవక్త అయిన గురుగుబెల్లి నారాయణదాసు అనే భక్తుడి కలలో శ్రీవేంకటేశ్వర స్వామివారు ప్రత్యక్షమై నారాయణ తిరుమల కొండపై ఆలయం నిర్మించమని ఆదేశించారట. స్వామివారి ఆదేశానుసారం నారాయణదాసు అనువైన కొండ కోసం గాలిస్తుండగా, నాగావళి నది కి పశ్చిమ దిశలోని ఒక కొండను ఎంపిక చేశాడు. ఈ కొండపైని స్వామివారి పాదాల గుర్తులను అనుసరించి, అక్కడ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు. 1961వ సంవత్సరంలో తిరుపతి లో తయారు చేయించిన భూనీలాసమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి విగ్రహాలను పాంచరాత్రాగమ ప్రకారం ప్రతిష్టించాడు. అనంతరం 1997 లో నారాయణదాసు మృతి చెందేదాకా ఆలయ ధర్మకర్తగా వ్యవహరించాడు.
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నారాయణ తిరుమల శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం పట్టణం లోని ఒక ప్రాచీన దేవాలయం. ఇక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి వారు చిరకాలంగా భక్తుల కోర్కెలను తీర్చుతూ కొలువైయున్నారు.ఈ ఆలయం తిరుమల తరువాత అంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. శ్రీకాకుళం పట్టణంలో భాగమైన గుజరాతీపేటలో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయం లోని వేంకటేశ్వర స్వామి ఉత్తరాంధ్ర భక్తజనకోటికి అభయప్రదాతగా విలసిల్లుతున్నారు.
తిరుమల వెళ్లలేని భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి, స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులను తీర్చుకుని వెళ్తుంటారు. ఇక్కడి కొండపైన ప్రకృతి సౌందర్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆలయం కొండపై ఉన్నది. ఈ ఆలయ ప్రవేశం వద్ద అతిపెద్ద గరుత్మంతుని విగ్రహం దర్శనమిస్తుంది. ఇది దేశంలోనే అత్యంత ఎత్తయిన గరుత్మంతుని విగ్రహం. ఆలయంలోనికి ప్రవేశించిన తర్వాత ఆలయ ప్రాకారంపై చుట్టుప్రక్కల విశేషమైన కళాకృతులు కలిగిన దేవతా శిల్పాలు దర్శనమిస్తాయి. వాటిలో అష్ట విధములైన లక్ష్మీదేవి విగ్రహాలు, విష్ణువు దశావతారాల విగ్రహాలు, మరియు అనేక దేవతా మూర్తుల విగ్రహాలు మనకు కనువిందు చేస్తాయి.
నారాయణ తిరుమల కొండపై నిర్మాణమైన శ్రీవేంకటేశ్వర ఆలయం ఎన్నో ప్రత్యేకతలతో అలరారుతోంది. ఆలయంలోని శ్రీరామానుజాచార్య, శ్రీనమ్మాళ్వార్ విగ్రహాలు, స్వామివారి దశావతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నర్సింహ, వామన, పరశురామ, రామ, శ్రీకృష్ణ, బలరామ, కల్కి అవతారాలతో కూడిన విగ్రహాలను భక్తులను పారవశ్యంలో ముంచెత్తుతాయి.
అలాగే అష్టలక్ష్మి వైభవాన్ని విశదీకరించే లక్ష్మీదేవి విగ్రహాలు ఈ ఆలయానికే ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఆలయంలో ఐదు అంతస్తుల గాలి గోపురం తిరుమలేశుని సన్నిధిని గుర్తుకు తెస్తుంది. ఆలయంలోని బేడా మండపం, కళ్యాణ మండపం, యాగశాల, పుష్కరిణి, ప్రాకారాలు ఆకట్టుకుంటాయి.
ఈ శ్రీవేంకటేశ్వర ఆలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం నిత్య పూజాదికాలను నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం స్వామివారికి కళ్యాణంతోపాటు, శ్రీకృష్ణాష్టమి, భీష్మ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి తదితర పండుగలను, పర్వదినాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆలయంలో ప్రతిరోజూ బ్రహ్మ ముహూర్తంలో విష్ణు సహస్ర నామపారాయణం జరుగుతుంటుంది.
No comments:
Post a Comment