What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 28 March 2015

రామాయణం (అయోధ్యకాండ )





రామాయణం


అయోధ్యకాండ -1



భరతుణ్ణి అతని మేనమామ వచ్చి తీసుకుపోయాడు. శత్రుఘ్నుడు వెంట లేనిదే ఎన్నిభోగాలు తనకు రుచించవు గనక, భరతుడు శత్రుఘ్నుణ్ణీ తన వెంట తీసుకుపోయాడు. భరతుడి మేనమామ ఇంట వారిద్దరికీ ఏ లోటూ లేకుండానే జరుగుతున్నది. అయితే, ముసలివాడైన తండ్రిని విడిచి వచ్చామే అన్నది అప్పుడప్పుడూ వారిని బాదించేది.


అయోధ్యలో దశరథ మహారాజుకూడా తన కొడుకులలో ఇద్దరు దూరమై పోయారే అని చింతించేవాడు. కాని నిజానికి ఆయన పంచప్రాణాలూ రాముడే. అతనిలోలేని సద్గణం లేదు. ప్రజలకు కూడా రాముడంటే ఎంతో అభిమానం. "నేను ముసలివాణ్ణి అయిపోయినాను. త్వరలో రాముణ్ణి రాజును చేసి అతడు చక్కగా రాజ్యాపాలన చేస్తుంటే చూడాలని నా మనసు ఉబలాట పడుతున్నది," అనుకున్నాడు దశరథుడు.


మంత్రులతో ఆలోచిస్తే వారు కూడా ఈ ఆలోచనను అమోదించారు. ఇందుకు ప్రజలూ, ఇతరరాజులూ ఏమంటారో తెలుసుకోవలిసి ఉన్నది . అందుచేత దశరథుడు రాజులందరికి ఆహ్వానాలు పంపాడు. చాలాదూరాన ఉన్న కారణంచేత కైకేయి తండ్రి అయిన కేకయ మహారాజుకూ, సీత తండ్రి అయిన జనక మహారాజుకూ ఆహ్వానాలు పంపక, ఈ శుభవార్త వాడికి పట్టాభిషేకం అయిన తరవాత తెలుపుదామనుకున్నడు.


ఆహ్యానాలు అంది రాజులందరూ వచ్చి దశరథుడి కోలువు కూటంలో ఉచితాసనాలపై కూచున్నారు. నగరం లోని పౌరులూ, పల్లెటూ ళ్ళవాళ్ళూ కూడా సభకు వచ్చారు. దశరథుడు వారితో తాను ఎంత శ్రద్దగా రాజ్యం చేసినదీ వివరించి, "ఇప్పుడు నేను ముసలివాణ్ణీ అయిపోయి విశ్రాంతి కోరుతున్నాను. మీ అందరూ సమ్మతిస్తే నాపెద్ద కొడుకైన రాముణ్ణి రాజుగా అభిషేకించాలని ఉన్నది.


రాముడు పరాక్రమశాలి; ఎందులోనూ నాకు తీసిపోడు. అతను మూడు లోకాలూ ఏలదగినవాడు. అతనికి పట్టం గట్టటం రాజ్యానికి గొప్ప మేలు చేయటమేనని నా నమ్మకం. నా ఆలోచన మీకు నచ్చిన పక్షంలో ఇందుకు సమ్మతించండి. సమ్మతించని పక్షంలో మీకు తోచిన మరొక మేలైన మార్గం చెప్పండి," అన్నాడు. ఈ మాటలు విని సభలో అందరూ పరమానందం చెంది, రాముడి పట్టాభిషేకానికి ఏకగ్రీవంగా ఆమోదించారు. "మాహారాజా, ఆ రామపట్టాభిషేక మహొత్సవం ఊరేగింపు త్వరగా జరిపించండి,"అన్నారు.


వెంటనే దశరథుడు అమాయకత్వం నటిస్తూ, "నేనింకా రామపట్టభిషేకం అనీ అనకూండానే మీరంతా సమ్మతిస్తూన్నారే ? ఏమిటి కారణం ? నాపరిపాలన మీకు నచ్చలేదా ? నేను ఎంతో న్యాయంగా పరిపాలిస్తున్నా మీరు రాముణ్ణీ రాజుగా కోరటానికి కారణమేమిటి ? మరేమీ లేదు, తెలుసుకోగోరి. అడుగుతున్నాను!" అన్నాడు.


ఆయన ఆ మాట అనగానే ఆయనకు కావలిసినది జరిగింది; సభికులు రాముణ్ణి తెగ పొగడేశారు. సుగుణ సంపన్నుడైన ఆయన్ను రాజుగా చేస్తే ఇక అంత కంటే ఘనమైన సంగతి ఉండబోదన్నారు. వారి మాటలన్నీ విని దశరథుడు, "మీరుకూడా నాలాగే భావిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది," అంటూ అప్పుడే తన పురోహితులైన వసిష్ఠ వామదేవాదులను పిలిపించి, "మహామునులారా, ఈ చైత్రమాసం శుభకార్యాలు చేయదగినది. అందుచేత రామపట్టాభిషేక యత్నాలు ఇప్పుడే సాగించండి. అందుకు కావలసిన సామగ్రి అంతా తెప్పించండి, " అని అందరూ వింటూండగా అన్నాడు. వసిష్ఠుడు అప్పటికప్పుడే పనివాళ్ళతో ఏయో సామగ్రి సిద్దం చేయాలో చెప్పేశాడు. పట్టాభిషేక మహొత్సవానికి కావలసిన సరంజామా అంతా సిద్దమయింది.


దశరథుడు రాముణ్ణి తన వద్దకు తీసుకురమ్మని తన సారథి అయిన సుమంత్రుడితో చెప్పాడు. సుమంత్రుడు వెళ్ళీ రథంలో రాముణ్ణి తెచ్చాడు. దశరథుడు రాముడితో " నాయనా, నీకు రాజ్యాభిషేకం చేస్తాను. ధర్మాన్ని పాలిస్తూ తగినవిధంగా నీవు రాజ్యం ఏలుకో," అని చెప్పి అతన్ని పంపేశాడు. తరవాత, దూరదేశాల నుంచి వచ్చిన రాజులూ, ప్రజలూ ఎవరి దారిన వారు వెళ్ళిపో యారు. రాముడి మిత్రులు కొందరు కౌసల్యకు ఈ శుభవార్త చెప్పారు. కౌసల్య ఆనందంతో వారికి బంగారమూ, ఆవులూ, రత్నాలూ బహూకరించింది.


అందరూ వెళ్ళాక దశరథుడు తన మంత్రులతో ఆలోచించి, "రేపు పుష్యమీ నక్షత్రం. పట్టాభిషేకానికి చాలా బాగుంటుంది. అందు చేత రేపే జరుపుదాం," అని నిశ్చయించి, రాముణ్ణి తీసుకురుమ్మని సారథి సుమంత్రుణ్ణి పంపాడు. సారథి వచ్చి తండ్రిగారు రమ్మంటున్నారని చెప్పాగానే రాముడు , "నే నిప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. మళ్ళి ఎందుకు రమ్మన్నారు?" అని అడిగాడు. "నిజమే. అయినా మహారాజుగారు తమరిని చూడాలన్నారు. వెంటనే తీసుకురమ్మ న్నారు," అన్నాడు సారథి.


రాముడు తత్తరపడి సారథి వెంట బయలుదేరాడు. పై వాళ్ళెవరూ లేరుగనక దశరథుడు ఈసారి తన కాళ్ళకు నమస్కరించే రాముణ్ణి లేవనెత్తి, ఆలింగనం చేసుకుని, ఉన్నతాసనంపై కూచోబెట్టి, "నాయనా, రామా!నేను ముసలివాణ్ణి కావటం అలా ఉంచి, నా జన్మనక్షత్రంలో దుష్టగ్రహాలు చేరాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. పీడకలలు వస్తున్నాయి. కనక నా దేహంలో ఊపిరి ఉండగానే పట్టం కట్టుకో. ఇవాళ పుష్యమి. రేపు పునర్వసు. శుభకార్యాలకు చాలా మంచిది. ఈ రాత్రికి నీవూ, నీ భార్యా దర్భలపై పడుకుని ఉపవాసం చెయ్యండి. నీ తమ్ముడు భరతుడు తన మేనమామ ఇంటి నుంచి తిరిగిరాక పూర్వమే ఈ పట్టాభిషేకం ముగించటం మంచిదని నాకు తోచింది. వాడైనా పెద్దలంటే భక్తిగల వాడే; ఈ పట్టభిషేకానికి ఎదురు చెప్పబోడు. అయినా మానవస్వభావం అమిత చంచలమైనది," అని చెప్పాడు.


రాముడు తండ్రి అనుమతితో అక్కడి నుండి బయలుదేరి తన తల్లి అయిన కౌసల్య మందిరానికి వచ్చేసరికి ఆమె మౌనంతో రాజ్యలక్ష్మిని ప్రార్థిస్తూ కనిపీంచింది. రాముడు రాక పూర్వమే పట్టాభిషేక వార్త తెలిసి సుమిత్రా లక్షణులు సీతను తమ వెంట కౌసల్య మందిరానికి తెచ్చారు. రాముడు తల్లికి నమస్కరించి తన పట్టాభిషేక వార్త తెలిపి, "అమ్మా, రెపటి పట్టాభిషేకానికి నేనూ, సీతా ఏమేమి అలంకారాలు చేసులోవాలో అవన్నీ చేయించు," అని కోరాడు.


రాముడు లక్ష్మణుడితో, "లక్ష్మణా, నాతో బాటు నీవుకూడా ఈ భూమినంతా పాలింతువుగాని. మనిద్దరమూ ఒకటేగదా. నేను రాజయితే నీవూ రాజువే. మనిద్దరమూ సమస్త సుఖాలూ ఒక్కటిగా అనుభవించుదాం," అన్నాడు. తరవాత అతను తల్లుల అనుమతి పొంది సీతతోసహా తన మందిరానికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రాముడిచేతనూ, సీతచేతనూ ఉపవాసవ్రతం సక్రమంగా చేయించ టానికి దశరథుడి కోరికపై వసిష్ఠుడు రథమెక్కి రాముడుండే నగరుకు వెళ్ళి ఆ పని పూర్తి చేసి తెరిగి వచ్చే సమయంలో వీధులన్నిటా జనంతండోపతండా లుగా కనిపించారు. రేపటి ఉత్సవం తాలూకు ఉత్సాహంలో వారు సంతోష ధ్వానాలు చేస్తున్నారు వీధులలో నీళ్ళు చల్లి, పూలదండలు కట్టారు. ప్రతి ఇంటిమీదా జెండా ఎగురుతున్నది. స్త్రీలూ, పిల్లలూ, వృద్దులూ ఇప్పటినుంచే పట్టాభిషేకానికి ఎదురుచూస్తునారు.


వసిష్ఠుడు వెళ్ళిపోయాక రాముడు స్నానం చేసి, సీతతో కూడా హొమం చేసి, హొమశేషం తిని, నిశ్చలమైన మనస్సుతో నారాయణాలయంలో భగవంతుణ్ణి ధ్వానం చేసి అక్కడే పడుకుని ఒక ఝాముసేపు నిద్రపోయి, వందిమాగధుల మేల్కొలుపులకు లేచాడు. ఆయన ఉదయం సంధ్యావందనం మొదలైనవి పూర్తిచేసేసరికి తెల్లవారింది. బ్రాహ్మాణులు వచ్చి పుణ్యాహావాచనం చేశారు. మంగళవాద్యాలతో అయోధ్య యావత్తూ మారుమోగిపోయింది.


తెల్లవారుతూనే మళ్ళీ పౌరులు తమ ఇళ్ళను అలంకరించసాగారు.






అయోధ్యకాండ -2






రాముణ్ణి అడవులని నెట్టి భరతుడికి రాజ్యాభిషేకం జరిగే ఉపాయం నేను చెబుతాను విను. విని నేను చెప్పినట్టు నడుచుకో. ఒకప్పుడు దెవాసుర యుద్దంలో ఇంద్రుడికి నీ భర్త సహాయం వెళ్ళాడు. ఆయన వెంట నీవూ వెళ్ళావు. దండకారణ్యాలలో మత్స్యధ్యజుడేలే వైజయంతం వద్ద శంబరుడనే మహా బలశాలి అయిన అసురుడితో నీ భర్త గొప్పగా యుద్దంచేసి గాయపడి మూర్ఛిల్లాడు. అప్పుడాయనను నీవు యుద్ధరంగం నుంచి దూరంగా తీసుకుపోయి, ఆయన ప్రాణాలు కాపాడావు. స్పృహ తెలిసినాక ఆయన నీ సేవకు సంతోషించి, నీకు రెండు వరాలిచ్చాడు. కాని వాటిని నీవు తరవాత కోరుకుంటానన్నావు. ఆ సంఘటన జ్ఞాపకం ఉన్నదికదా. చూశావా? ఇప్పుడా రెండు వరాలూ కోరుకునే సమయం వచ్చింది.


రాముణ్ణి పద్నాలుగేళ్ళు అడవులకు పంపమనీ, భరతుడికి పట్టభిషేకం చెయ్యమనీ నీవిప్పుడు నీ భర్తను కోరు!" అని మంధర కైకేయికి హితవు చెప్పింది. కైకేయి, పాపం, సహజంగా మంచి స్వభావం కలదేగాని, మంధర చేసిన బోధనతో ఆమె మనస్సు పెడదారి పడింది. ఆ మంధర తన తలలో ఒక చెడ్డ భావం ప్రవేశపెట్టడంతో బాటు ఆ ఆలోచన సానుకూలమయ్యే ఉపాయం కూడా చెప్పింది.


కైకేయి మంధరను, "నిజంగా నీ వెంత తెలివిగల దాననే! నామేలు నీవు కోరినట్టుగా మరెవరూ కోరరు గదా!" అని ప్రశంసించింది. ఆమె మంధర సలహాతో తన నగలన్నీ తీసివేసి, చిరిగిన కోక ఒకటి చుట్టుకుని, కోపగృహానికి వెళ్ళి, కటిక నేల మీద అలిగిన దానిలాగా పడుకున్నది.


"నీ భర్త నిన్ను చూడవచ్చినప్పుడు కంటికీ మంటికీ ఏకధారగా ఏడువు. నీ కోపంగాని, నీ శోకంగాని రాజు కొంచెమైనా భరించలేడు. వాటిని పోగొట్టటానికి ఆయన తన ప్రాణాలనైనా ఇస్తాడు. నేను చెప్పిన రెండు వరాలూ ఇచ్చినదాకా నీవు మెత్తబడకు! నీకు మణులూ, మాణిక్యాలూ, ముత్యాలూ, బంగారమూ ఇస్తానంటాడు. అక్కలేదని బెట్టు చెయ్యి. బాగా ఆలోచించులకో, భరతుడు పధ్నాలుగేళ్ళు రాజ్యపాలన చేసినాక అతన్ని ఎవరూ రాజ్యాధికారం నుంచి కదిలిందలేరు," అన్నది మంధర. "ఆ శంబరాసురుడి కన్న నీ కెక్కువ తంత్రాలు తెలుసు గదే!" అని కైకేయి మంధరను మెచ్చుకున్నది. తన భర్త తనకు వరాలివ్వని పక్షంలొ చచ్చిపో వటానికి కూడా అమె నిశ్చయించుకున్నది.


దశరథుడు రామ పట్టాభిషేక యత్నాలకాజ్ఞ ఇచ్చి, ఈ శుభవార్త కైకెయికి తానే స్వయంగా తెలిపే ఉద్దేశంతో కైకేయి శయన గృహానికి వచ్చి, అక్కడ ఆమె లేకపోవటం చూసి ఆశ్చర్యపడి, "కైకేయీ, ఎక్కడునావు?" అని పిలిచాడు. జవాబు లేదు. ఆయన అంతఃపుర ద్వారం దగ్గిరికి వచ్చి అక్కడి ద్వారపా లికను, "కైకేయి ఎక్కడ?" అని అడిగాడు. ద్వారపలిక భయంతో చేతులు జోడించి, "ప్రభూ,వారు కోపగృహంలో ఉన్నారు, అని చెప్పింది. దశరథుడు కలవరపడుతూ కోపగృహానికి వెళ్ళి, అక్కడ నేలపై పడుకుని ఉన్నకైకేయిని చూశాడు.


లక్షవరహాల విలువచేసే ముత్యాల హారాలూ, ఇతర ఆభరణాలూ నేలపై చెల్లా చెదురుగా పడి ఉండి, ఆకాశంలో నక్షత్రాల లాగా మెరుస్తునాయి. దశరథుడు కైకేయిని సమీపించి ఎంతో ప్రేమతో ఆమెను బుజ్జగిస్తూ, "దేవీ, నీ కెందుకిలా కోపం వచ్చింది? ఎవరుమీద? ఎవరన్నా నిన్ను తిట్టారా? అవమానించారా? ఒంట్లో సరిగా లేదా? వైద్యులను పెలిపించనా? ఎందు కేడుస్తావు? ఊరుకో! కావాలంటే నీ ఇష్టం వచ్చిన వాళ్ళను దండిస్తాను! నిర్దోషులైన సరే! నీ కోసం ఏ దరిత్రుణ్ణి అయినా ధనికుణ్ణి చేస్తాను. నీకు నాతో బాటు మిగిలిన వారంతా విధేయులై ఉండగా ఈ దుఃఖం దేనికి ? నీ కోరిక ఏమిటో చెప్పు ; నాప్రాణాలు ఒడ్డి అయినా సరే, ఆ కోరిక తీరుస్తాను! లే, కైకేయీ, లే!" అన్నాడు.


ఈ మాటలు విని కైకేయి, "నాకెవరూ అపకారం చెయ్యలేదు, అవమా నమూ చెయ్యలేదు. నా కొక కోరిక ఉన్నది. దానిని మీరు తీరుస్తానని ప్రమాణం చేసేటట్టయితే చెబుతాను," అన్నది. దశరథుడీ మాటలకు చిరునవ్వు నవ్వి, కైకేయి జట్టు చేతితో నిమురుతూ, తన ప్రాణంతో సమానమైన రాముడిపైన ఒట్టుపెట్టుకుని, ఆమె కోరిక తీర్చటానికి ప్రమాణం చేశాడు.


అప్పుడు కైకేయి దశరథుడికి శంబరాసురుడితో జరిగిన యుద్దాన్నీ, మూర్ఛి తుడై ఉన్న సమయంలో తాను ఆయనను రక్షించి దూరంగా తీసుకుపోయి పరిచర్యలు చేసిన విషయాన్నీ, ఆ సమయంలో ఆయన రెండు వరాలిస్తాను కోరమంటే తాను తరవాత కోరుకుంటానన్న సంగతీ జ్ఞాపకం చేసింది. తరవాత ఆ వరాలు రెండూ బయట పెట్టింది: రాముడికి జరగబోతున్న పట్టాభిషేకాన్ని భరతుడికి చెయ్యాలి, రాముడు నారబట్టలనూ, కృష్ణాజినాన్నీ, జడలనూ, మునివేషాన్నీ ధరించి పధ్నాలుగేళ్ళు దండకారణ్యంలో నివసించాలి! ఈ మాటలు వింటుంటే దశరథుడి కెదో భయం పుట్టుకొచ్చింది, స్పృహతప్పి నట్టయింది. కాళ్ళూ, చేతులూ వణికాయి. బాధతో నిట్టూర్పులు విడుస్తూ, ఆయన కైకేయిని నానాతిట్లూ తిట్టాడు.


"నీవు రాజకుమార్తె వనుకుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. కాని నీవు విషం కక్కేపామువు. నిన్ను తల్లిగా చూసుకుంటాడు గదా, ఆ రాముడికి ఇంత ద్రోహం ఎలా తలపెట్తావు? నేను నీకేం చేశాను? ఏమహాపాతకం చేశాడని రాముణ్ణి అడవికి పంపను? నా ప్రాణాలనైనా వదలగలను గాని రాముణ్ణి చూడకుండా బతకలేనే! ఈ దిక్కు మాలిన ఆలోచన మనుకో! నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను కరుణించి ఈ వరం అడగకు. భరతుడంటే నాకు ప్రేమ లేదేమోనని పరీక్ష చెయ్యటానికి ఇలా అని ఉంటావు. రాముడు చేసిన సేవలో నూరోవంతు కూడా భరతుడు నీకు చెయ్యలేదు. నీకు రాముడి కంటె భరతుడెక్కువ అంటే నేను నమ్మను. నీ మాటలతో నన్ను చాలా బాధపె ట్టావు. చూడూ, నేను ముసలివాణ్ణి. కాటికి కాళ్ళు చాచుకొని ఉన్నాను. కావలిస్తే భూమండలమంతా తీసుకో. కాని రాముడిపై మాత్రం ఆగ్రహించకు. నీకు చేతులు జోడించి నమస్కారం చేస్తాను," అని కైకేయిని దశరథుడు ఎంతో సేపు వేడుకున్నాడు.


దశరథుడు ఇల దిగజారిపోతున్న కొద్దీ కైకేయికి అగ్రహం రెచ్చింది. మొదట వరాలిస్తాననీ, కోరిక తీరుస్తాననీ ప్రమాణాలు చేసి ఇప్పుడు దశరథుడు బేలగా మాట్లాడటం రాజకులానికే కళంకమని ఆమె అన్నది. తన వరాలను ఉప సంహరించుకోననీ, రాముడి పట్టాభిషేకం జరిగే పక్షంలో తాను చచ్చిపో తాననీ అన్నది. దశరథుడు మానసిక వేదనతో దహీంచుకుపోయాడు. ఎటువంటి విషమపరిస్థితి ! "నాయనా, అడవికి పోరా!" అని రాముడితో ఎలా చెప్పటం? కైకేయి కోరిక ప్రకారం రామపట్టాభిషేకం మానేస్తే ఇతర రాజులంతా, "పట్టాభి షేకం చాలా బాగా చెశారే ?" అని హేళన చెయ్యారూ? కౌసల్య ముఖం ఎలా చూడటం? ఆయన తనలో తాను దుఃఖించాడు, కైకేయిని తిట్టాడు, బతిమాలాడు, మధ్య మధ్య మూర్ఛపోయాడు. ఆ రాత్రి ఆయనకు భయంక రమైన కాలరాత్రి లాగా గడిచి తెల్లవారింది.


వసిష్ఠుడు తన శిష్యులతో సహా రాచనగరుకు వచ్చి, దశరథుడి అంతఃపుర వాకిలి దగ్గిర సుమంత్రుడెదురుకాగా, తాను వచ్చిన సంగతి రాజుగారికి చెప్పమన్నాడు. పట్టాభిషేకం ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయనీ, రాజుగారు కదిలిరావటమే వ్యవధి అనీ వసిష్ఠుడు చెప్పగా సుమంత్రుడు స్వేచ్చగా అంతఃపురం ప్రవేశించాడు. సుమంత్రుడు వృద్దుడు కావటంచెతా, రాజుగారికి ఆబల్య మిత్రుడు గనకా, ఆయనను ఎవరూ అడ్డరు. ఆయన తిన్నగా రాజుగారున్న చోటికి వెళ్ళి, రాజుగారి మనస్థితి ఊహించక, ఆయన నిద్రపోతు న్నాడనుకుని, "మహారాజా, లేవండి సూర్యోదయం కూడా అయింది. రామపట్టభిషేకం జరిపించటానికి అందరూ తమ రాక కోసం చాలాసేపుగా ఎదురు చూస్తున్నారు," అని చెప్పాడు. దశరథుడు శోకంతో వాచి ఎర్రగా ఉన్న కళ్ళతో సుమంత్రుణ్ణి చూసి, "సుమంత్రా, నన్ను నీ మాటలతో ఇంకా ఎందుకు దుఃఖపెడతావు?" అన్నాడు.


దశరథుడు దుఃఖంలో ఉన్నాడని తెలియగానే సుమంత్రుడు చెతులు జోడించి, రెండడుగులు వెనక్కు వేశాడు. దశరథుడు సుమంత్రుడితో మాట్లాడేస్థితిలో లేనందున కైకేయి, "సుమంత్రుడా, తెల్లవార్లూ మహారాజుకు రామపట్టభి షేకమన్న ఆనందంతో నిద్రలేదు . ఇప్పుడే కాస్తా కునుకు పట్టింది. నీవు వెళ్ళి రాముణ్ణి పిలుచుకురా. ఇదే రాజుగారి అజ్ఞ అనుకో," అన్నది.


"రాముడు ఇక్కడికి వచ్చి పట్టభిషేకం చెసుకుంటాడు కాబోలు !" అనుకుంటూ సుమంత్రుడు అక్కడి నుంచి కదిలాడు. నగరమంతా ఉత్సవం లాగా కోలాహ లంగా ఉన్నది. రాజసభ జనంతో కిక్కిరిసి ఉన్నది. రాజులందరూ కానుకలు తెచ్చారు. వారు తమలోతాము, "రాజుగారు కనిపించరు. మనం వచ్చిన సంగతి వరికెలా తెలియడం ?" అనుకుంటున్నారు. సుమంత్రుడు మర్యాదగా వారిని పలకరించి, "తామంతా వచ్చిన సంగతి నేను మహారాజు గారికి తెలియజేస్తాను. వారి దగ్గిరికి రాముణ్ణి తీసుకుపోతున్నాను," అని చెప్పాడు. ఆయన మళ్ళీ వెనక్కు తిరిగి దశరథుడి అంతఃపురానికి వెళ్ళి, దశరథుడు పడుకుని ఉన్న చోటికిచేరి, "మహారాజా, విజయీభవ. రాత్రిగడిచి, తెల్లవారి, సూర్యోదయంకూడా అయింది. మీ కోసం బ్రహ్మణులూ సేనాపటులూ, పట్టణంలోని పెద్దలూ ఎదురు చూస్తున్నారు. నిద్రమెలుకుని జరగవలసిన కర్మకాండ జరిపించండి," అన్నాడు.


"రాముణ్ణి తీసుకు రమ్మని కైకేయి నీతో చెప్పనే? తీసుకురాకుండా ఎందుకు వచ్చావు? ఆమె అజ్ఞ నా ఆజ్ఞకాదా? నేను నిద్రపోవటం లేదు. మేలుకునే ఉన్నాను. వేగిరం రాముణ్ణి తీసుకురా!" అన్నాడు దశరథుడు.


సుమంత్రుడు చిత్తమని చెప్పి, రాజుకు నమస్కారంచేసి, "ఏదో గొప్ప ఏర్పటే జరగబోతున్నది!" అని తనలో తాను సంతోషపటుతూ, రాజవీథి వెంట జనం ఉత్సాహంగా పట్టాభిషేకం గురించి అనుకునే మాటలు వింటూ రాముడుండే నగరుకు రథం తోలుకుని వచ్చాడు. అక్కడ జనం గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు.


రాముడి అంతఃపురం చుట్టూ ఏనుగులూ, గుర్రాలూ, సైనికులూ, మంత్రులూ కిటకిట లాడుతున్నారు. సుమంత్రుడు వారి నందరినీ తోసుకుంటూ వెళ్ళి, రాముడుండే ఏడంతస్తులమేడ ప్రవేశించాడు. తాను వచ్చినట్టు రాముడికి కబురు పంపి, అతని అనుమతితో రాముడుండే చోటికి వెళ్ళాడు. రాముడు చక్కగా అలంకరించుకుని బంగారు చక్కీపై కూచుని ఉన్నాడు. సీత పక్కనే నిలబడి వింజామర వీస్తున్నది. సుమంత్రుడు అతన్ని సమిపించి, నమస్క రించి, "తండ్రిగారు కైకేయి అంతఃపురంలో ఉన్నారు. నిన్ను చూడాలంటు న్నారు," అని చెప్పాడు. ఈ మాటలువిని రాముడు ఆనందంతో పొంగిపో యాడు. అతను సీతను లోపలికి పంపి, పట్టాభిషేకానికి చేసిన అలంకారా లన్నిటితోనూ సుమంత్రుడి వెంట బయలుదేరాడు.


రాముడు పులితోలు పరిచిన రథం ఎక్కికూచోగానే, లక్ష్మణుడుకూడా వెనకగా ఎక్కి, ఒక చేత్తో అన్నగారికి ఛత్రం పట్టి, రెండవ చేత్తో చామరం వీచాడు. రాముడి వెనకగా గుర్రాలూ, ఏనుగులూ ఎక్కెన రౌతులూ, కోలాహలంగా వేలకొద్దీ జనమూ నడిచారు. రాముడి రథం దశరథుడి నగరు ప్రవేశించి, మూడు ప్రాకరాలు దాటి నిలిచి పోయింది. తన వెంట వచ్చిన బలగమూ, ప్రజలూ అక్కడ నిలిచిపోగా, రాముడు కాలినడకను మరి రెండు ప్రాకారాలు దాటి దశరథుడి అంతఃపురం ప్రవేశిందాడు.


ఒక అందమైన ఆసనంపైన దశరథుడూ, కైకేయి కూచుని ఉన్నారు. రాముడు తండ్రి కాళ్ళకు, తరవాత కైకేయి కాళ్ళకూ నమస్కరించాడు. "రామా," అంటూ ఏదో చెప్పబోయి, దశరథుడు గొంతు పెగలక, కళ్ళు మూత పడి, కన్నీరు కారుస్తూ దుఃఖంతో వివశుడయ్యాడు.










అయోధ్యకాండ -3






తండ్రిని ఆ స్థితిలో చూడగానే రాముడికి పామును తొక్కినట్టుగా భయం కలి గింది. అతను కళవళపడి కైకేయితో, "అమ్మా, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? తండ్రిగారు ఇలా కలవరపడగటానికి కారణమేమిటి? ఆయనను ఇలా ఎన్నడూ చూడలేదు. నాకేమో ఆందోళనగా ఉన్నది," అన్నాడు.కైకేయి కొంచెంకూడా బిడియం లేకుండా, "రాజుగారికి కోపమూ లేదు, తాప మూ లేదు. ఆయనకు ఒక కోరిక ఉన్నది. అది నీకు చెప్పటానికి జంకుతు న్నాడు. ఒకప్పుడీయన గారు నాకు ఒక వర మిస్తానన్నాడు. ఎందుకన్నానా అని ఇప్పుడు చెప్పరాని బాధతో కుళ్ళుతున్నాడు. ధర్మం జరగటం ప్రధానం కద. నీ తండ్రి ఆడినమాట తప్పకుండా చూసేభారం నీ మీద ఉన్నది. మంచో, చెడో ఆయన కోరిక తీర్చుతానని నీవు ముందు నాకు మాట ఇస్తే అసలు సంగతి చెబుతాను. ఆ సంగతి ఆయన నోటంట రాదు, అందుచేత నేనే చెప్పాలి మరి," అన్నది.


"అదేమిటమ్మా? నన్నలా శంకించవచ్చా? నా గురించి నీకు తెలియనిదే మున్నది? నాయనగారు కోరితే నిప్పులో దూకనా? ఆయన కోరిక ఏమితో చెప్పు, తప్పక చేస్తాను. నెను ఆడి తప్పను," అన్నాడు రాముడు. కైక రాముడితో దేవసుర యుద్ధం నాటి విషయాలుచెప్పి, ఆయన ఆ సమ యంలో ఇస్తానన్న వరం ప్రకారం రాముడు పధ్నాలుగేళ్ళు అరణ్యవసానికి పోవలసి ఉంటుందని చెప్పింది.


"ఈ పట్టాభిషేక యత్నం వృథాపోదులే. భరతుడు పట్టాభిషేకం చేసుకుని భుమి నాలుగు చెరగులూ పాలిస్తాడు. నీవు నారబట్టలూ, జడలూ ధరించి పధ్నాలుగేళ్ళూ అరణ్యవాసం వెళ్ళీనట్టయితే నీ తండ్రికి ఆడి తప్పాడన్న అపఖ్యాతి చుట్టుకోకుండ పోతుంది," అన్నదామె.


ఇంత దారుణమైనమాట, ఇంత పరుషంగా చెవిని పడినప్పుడు మరొకడైతే ఎంతో కలవరపడి, మధనపడి, కైకేయి మొహం చూడడానికి కూడా సిగ్గుపడి ఉండును. కాని రాముడటువంటి వికారలేమీ లేకుండా, "అమ్మా, అలాగే కాని, నేను నారబట్టలు కట్టి అరణ్యానికి పోతాను. భరతుడి కోసం వెంటనే కబురు పంపండి. తండ్రి గారి ప్రతిజ్ఞా, నీ కోరికా ఇదే అయినప్పుడు నేను భరతుడికి రాజ్యం ఇవ్వనంటానా? భరతుడికి పట్టంకట్టనిశ్చయించానని తండ్రిగారు నాతో అనకపోవటమే నన్ను బాధిస్తున్నది," అన్నాడు. ఈ మాటలకు కైకేయి సంతో షీంచి, "మరేం లేదులే. ఆయనమాట దక్కిస్తావో, దక్కించవో అనే జంకుచేతనే ఆయన నీతో ఈ సంగతి చెప్పలేదు. నువ్వు మాత్రం జాగుచేయక అడవికి బయలుదేరు. నీవు వెళ్ళెదాకా మీ తండ్రిగారు స్నాన భోజనాదులు చెయ్య డు," అన్నది.


కైకేయి అన్న ఈ మాటలకు దశరథుడు లోలోపల కుమిలిమూర్చపోయాడు. రాముడాయనను మెల్లగా లేవదీసి కూచోబెట్టి కైకేయితో, "అమ్మా, నాకు లోపల నిజంగా రాజ్యకాంక్షా, ధనకాంక్షాలేవు. నే నింకేమైనా చేయవలసినది ఉంటే చెప్పు. నీవు రాజు గారిని కోరిన వరాలు చాలా అల్పమైనవి. నీవు నిజం గా కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నావు," అన్నాడు.


దశరథుడు బావురుమని ఏడ్చి స్పృహతప్పి పడిపోయాడు. రాముడు తండ్రికీ, కైకేయికీ ప్రదక్షిణ నమస్కారంచేసి అంతఃపురం నుంచి బయటికి వచ్చి తన చెలికాళ్ళ కేసిచూసి, పట్టాభిషేక సంబారాలకు ప్రదక్షిణం చేసి బయలుదెరాడు. లక్ష్మణుడు ఆపుకోరాని దుఃఖంతోనూ, ఆగ్రహంతోనూ పెనుగులాడుతూ అన్న ను వెంబడించాడు. రాముడు రధమెక్కలేదు. ఛత్రచామరాలు నిషేధించాడు. సర్వసంగ పరిత్యాగం చేసిన యోగియొక్క మనస్థితి తెచ్చి పెట్టుకుని, ఈ దుర్వార్త చెప్పటానికి కౌసల్య మందిరానికి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళగానే దశరథుడి అంతఃపుర స్త్రీలు గొల్లున ఏడవటం వినపడింది.


రామలక్ష్మణులు కౌసల్య నగరుకు వచ్చెసరికి అక్కడ ఎవరికీ జరగ బోయేది తెలియదు. రాముడు మొదటి ప్రాకర ద్వారంనుంచి లోపలికి పోతూంటే, అక్కడ ఉండిన ఒక వృద్దుడూ, మరికొందరూ లేచి నిలబడి విజయధ్వానాలు చేశారు. రెండవ ప్రాకారం వద్ద ఉండే వృద్ధ బ్రాహ్మాణులకు నమస్కరించి, రాముడు మూడో ప్రాకారం చేరాడు. అక్కడి కావలివాళ్ళంతా స్త్రీలు. రామలక్ష్మణులను చూడగానే వారిలో కొందరు కౌసల్యతో రామలక్ష్మణుల రాక చెప్పటానికి పరిగెత్తారు. మిగిలినవాళ్ళు, "మహారాజుకు జయం కలగాలి!" అని అన్నారు.


రాముడు వచ్చేసరికి కౌకల్య అగ్నిలో హొమం చేస్తున్నది. ఆమె రాముడి కెదురు వచ్చి, కౌగలించుకుని, శిరస్సు ముద్దుపెట్టుకుని, "నాయనా, భోజనం చేద్దువుగాని పద!" అన్నది. తల్లికి ఈ విషాదవార్త ఎలా తెలపాలో తెలియక తికమకపడుతూ రాముడు, "అమ్మా, నీకింకా తెలియదులాగుంది. అంతారారుమారై పోయింది. నేను పధ్నాలుగేళ్ళు మునిలాగా, కందమూల ఫలాలు తింటూ దండకారణ్యంలో ఉండబోతున్నాను. నేను కూచునేది సింహాసణం మీద కాదు, దర్భల చాపమీద. నాన్న గారు భరతుడికి పట్టంగట్టబోతున్నారు, " అన్నాడు.


ఈ మాట విని కౌసల్య మొదలు నరికిన అరటి చెట్టులాగా పడిపోయి నేలపై దుఃఖంతో పొర్లింది. రాముడామెను లేవదీసి కూచోబెట్టి దుమ్మాంతా దులిపాడు. కౌసల్య రాముడితో, "నాయనా, నా జన్మకు సుఖంలేదు కాబోలు. నిన్ను కని ఈ బాధ భరించే కన్న గొడ్రాలుగానే ఉండిపోయినట్టయితే, పిల్లలు లేరన్న చింత ఒక్కటే బాధించేది. ఎన్నడూ నేను సుఖపడి ఎరగను; నీవు రాజువైతే సుఖపడదామనుకుంటున్నాను. కావటానికి నేను రాజుగారి పెద్ద భార్యనే కాని, సవతుల చేత పడరాని మాటలన్నీ పడ్డాను. ఏమంటే నా భర్తకు నేనంటే లక్ష్యంలేదు, నాకు స్వాతంత్ర్యమూ లేదు. ఇక నేను కైకేయి పరిచారికలకంటే హీనంగా బతకాలి. నీవు పుట్టిన ఈ పది హేడేళ్ళూ నీ వెప్పుడు రాజువవుతావా అని ఎదురు చూస్తూ వచ్చాను. ఆ ఆశ కూడా పోయింది. నాకు చావు వచ్చినా బాగుండును, కాని అది కావాలన్నప్పుడు రాదు. నాయనా, నేను కూడా నీ వెంటనే అడవులకు వస్తాను," అన్నది.


కౌసల్య మాటలు వింటుం టే లక్ష్మణుడికి ఒక ఆలో చన వచ్చింది. అతడు కౌసల్యతో, "అమ్మా, ఆ కైకేయి మాట విని అన్న అడవికి పోవటం నాకు సవ్యంగా కనపడలేదు. రాజు ముసలివాడు, ఆయన మనసు దుర్బలమైనది. ఆయన అన్యాయమైన పని చెయ్యామంటే కొడుకులమైన మేము చేయాలని ఎక్కడ ఉంది?" అని, రాముడితో, "అన్నా, రాజు నిన్ను అడవికి పొమ్మాన్న మాట అందరికీ తెలి యక ముందే మనం మన శౌర్యంతో రాజ్యాన్ని వశపరుచు కుందాం.


నేను విల్లుపట్టి మనని వాళ్ళందరినీ చంపుతాను. మన తండ్రి కూడా మనకు పగవాడే అయినాడు. వయోభారం కారణంగా న్యాయం తప్పి ప్రవర్తిస్తున్నాడు. మా అందరిలోనూ పెద్దవాడవు. ఈ రాజ్యం నీది? రాజు మాత్రం దీన్ని మరొక రికి ఎలా ఇస్తాడు? నీవేమి అపచారం చేశావని నిన్ను అడవులకు పంపుతా డు? నిన్ను అడవులకు పంపేటంత శక్తిమంతుడా ఈ రాజు? ఇదుగో నావిల్లు! నేను యుద్దానికి సిద్దంగా ఉన్నాను," అన్నాడు పట్టరాని ఆవేశంతో. కౌసల్య రాముడితో, "నాయనా, లక్ష్మణుడు చెప్పినట్టు చెయ్యి. అందులో ఎలాంటి తప్పూ లేదు. నీవు నీ తండ్రి మాటే వినాలని ఏమున్నది? నేను తల్లిని కానా ? నీవు అడవుల పాలు కావటానికి నేను ఒప్పను. ఓకవేళ వెళ్ళావో ఉపవాసాలు చేసి ప్రాణాలు విడుస్తాను. ఆ పాపం నీకు చుట్టుకుంటుంది," అన్నది.


రాముడు తల్లితో, "నేను నాన్నగారి మాట అబద్దం చేయలేను, జవదాటలేను. పితృవక్యం పాలించటానికి ఎందరో ఎన్నెన్నో కార్యాలు చేశారు. కండుడు అనే ముని గోవధ చేశాడు. పరసురాముడు కన్న తల్లినే చంపాడు. మామూల పురుషుడైన సగరుడి కొడుకులు తండ్రి ఆజ్ఞపై పాతాళానికి పోయి, అరవైవేల మందీ ఒక్క సారిగా మరణించారు. అమ్మా, నేను నిన్ను ధిక్కరించటానికి అరణ్యానికి పోతున్నానా?" అని , లక్ష్మణుడితో, "లక్ష్మణా, నీకు నాపైగల ప్రేమా, నీ పౌరుషమూ నేనెరగనా? అన్నిటికన్నా ధర్మం గొప్పది. దానిని మనం నిలబెట్టాలి. అందుచేత నా బుద్ధినను సరించే నీవు కూడా ఆలోచించు," అన్నాడు గంభీరంగా.


తల్లిన సమాధాన పరచటానికి రాముడు ఎన్నో దర్మాలు చెప్పాడు. కౌసల్య వృద్ధుడైన భర్తను విడిచి తన వెంట రావటం భావ్యం కాదన్నాడు. అతను లక్షమణుడితో కూడా, "ఇది దైవ నిర్ణయం. కాకపోతే, నే నంటే అంత ప్రేమగా ఉండే కైకేయి నన్ను అడవులకు పొమ్మంటుందా? పట్టభిషేకం నిలిచి పోయిందంటే నీ కింత బాధగా ఉన్నదే, పట్టభిషేకం జరుగుతున్నదని తెలిసి ఆమె ఎంత బాధ పడిందో? నేను ఇంతవరకు తండ్రిగారి మనసుగాని, అమె మనసుగాని నొప్పించినట్టు నాకు జ్ఞపకం లేదు. ఇప్పుడాపని చేయలేను," అన్నాడు.


రాముడు తండ్రి అజ్ఞ పాలించటానికి గాను అడవికి వెళ్ళే దృఢనిశ్చయం చేసుకున్నాడని గ్రహించి, కౌసల్య అతని క్షేమం కోసం బ్రాహ్మణులచేత హొమం చేయించి, ఆశీర్వదించి పంపింది.


రాముడు సీతయొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అతనికి సీతను చూడగానే కన్నీరు ఆగలేదు. పట్టాభిషేకం చేసుకునే ఉత్సాహం లేకపోగా, తల వంచి కన్నీరు కార్చుతూ, వెంట ఎవరూ లేకుండావచ్చే భర్తను చూసి సీత కూడా కంపించీంది. ఆమె అతని దిగులుకు కారణమడిగింది. జరిగినదంతా చెప్పి రాముడామెతో, "అనుకున్నవి జరిగి తీరాలని, అనుకోనివి జరగకూడదనీ చెప్పలెముకదా? విధినిర్ణయానుసారం ఏది జరిగినా ధర్మాన్ని వీడకూడదు. నేను అడవుల నుంచి తిరిగి వచ్చేవరకూ నీవు భరతుడి వద్ద ఉండి అతను చెప్పినట్టు నడచుకో . అతని ఎదట నన్నేప్పుడూ పొగడకు. బంధుత్వం తప్పిస్తే, భరతుడు నిన్ను పోషించవలసిన కారణం మరొకటి లేదు. అందుచేత నీవు అతను సంతోషించేట్టు మసలుకో. వృద్దులైన నా తల్లిదండ్రులను కనిపెట్టి ఉండు," అని చెప్పాడు.


ఈ మాటలు విని సీత, ప్రణయంతో కూడిన కోపంతో, "ఇవేం మాటలు?నన్ను తేలికజేసి పరాజకాలాడుతున్నావా? ఆడదానికి భర్తే కదా గతి! నిన్ను వనవా సం వెళ్ళమంటే నన్ను వెళ్ళమన్నట్టు కాదా? నీవు అడవిలో సంచరించటమే జరిగితే, ముళ్ళన్నీ నా కాళ్ళతో తొక్కి నీకు దారి చేస్తూ నేను ముందు నడవ నా? నీ వంటి పరాక్రమవంతుడి వెంట ఉండగా నాకు అరణ్యభయం ఉండబోదు. అడవిలోని వారందరిని కాపాడగల వాడివి నన్ను కాపాడలేక పోవు. అడవిలో నేను, అది కావాలి, ఇది కావాలి అని అడగబోను. నీవు లక్షచెప్పినా సరే నా మనసు మారదు, " అన్నది.


సీత తన వెంట అడవులకు వచ్చి కష్టాలు పడటం రాముడికి కొంచెం కూడా ఇష్టం లేదు. ఆ కష్టాలను వివరించి చెప్పాడు. కాని సీత వాటిని లక్ష్య పెట్టలేదు. "నిన్ను చూసి సాముద్రికవేత్తలు వనవాసయోగం ఉన్నదని చెప్పినట్టే, నన్ను చూసి కూడా జ్యోతిష్కులు నాకు వనవాసయోగం ఉన్నదని చెప్పారు. అందు చేత నేను నీ వెంట అరన్యానికి వచ్చి తీరుతాను," అన్నది. అప్పటికి రాముడు ఆమెను తీసుకుపోవటానికి సమ్మతించలెదు. సీతకు కోపమూ, దుఃఖమూ ముంచుకు వచ్చాయి."అయ్యో, మా నాన్న జనకమహారాజు, ఈ సంగతి తెలిస్తే ఏమనుకుంటాడు? నేనేం తప్పు చేశానని నన్ను విడిచి పెట్టి పోవాలనుకుం టున్నావు? నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు కదా! నేను నిన్ను విడిచిపెట్టి వంశానికి కళంకం తీసుకురావాలా? నీ వున్న చోటే నాకు స్వర్గమని చెప్పానే!" అంటూ భోరున ఏడ్చింది.


రాముడామెను రెండు చేతులా దగ్గిరికి తీసుకుని , సముదాయించి, తన వెంట తీసుకుపోతానని మాట ఇస్తూ, " వనవాసానికి సిద్దంకా! నీవద్ద ఉన్నదంతా దానం చెసెయ్యి. నీ వస్తుసామగ్రి యావత్తూ ముందు పనివాళ్ళ కిచ్చి, మిగిలి నది బ్రహ్మణులకియ్యి. సన్యాసులకు భోజనం పెట్టించు, బిచ్చగాళ్ళకు దానాలు చేయించూ," అన్నాడు ఎంతో ఆప్యాయంగా . సీత పరమానందంతో వెంటనే ఆ పనులన్నీ సాగించింది.






అయోధ్యకాండ -4













ఆ భార్యా భర్తల సంభాషణ అంతా వింటూ ఉండిన లక్ష్మణుడు, ``అన్నా! నీవు అరణ్యానికి వెళ్ళటానికే నిశ్చయించినట్టయితే నేను కూడా వస్తున్నాను,'' అన్నాడు. ఇందుకు రాముడు సమ్మతించక, ``నీవూ, నేనూ కూడా వెళ్ళిపోతే మన తల్లులు కౌసల్యా సుమిత్రలు బొత్తిగా దిక్కులేని వాళ్ళవుతారు. వాళ్ళను కనిపెట్టుకుని ఉండు,'' అన్నాడు. లక్ష్మణుడు ఒప్పుకోలేదు. ``నేను రాత్రీ, పగలూ నీకు కావలసిన పనులన్నీ చేస్తాను. నేను నీ వెంట వచ్చితీరాలి,'' అన్నాడు. రాముడు సంతోషించి సరే నన్నాడు. వసిష్ఠుడి వద్ద ఉండే దివ్యాయుధాలు తీసుకు రమ్మని లక్ష్మణుణ్ణి పంపాడు.


వాటిలో అక్షయతూణీరాలూ, ధనుస్సులూ, దుర్భేద్యమైన కవచాలూ, బంగారు పూతగల రెండు కత్తులూ ఉన్నాయి. లక్ష్మణుడు వెళ్ళి, తాను అడవికి పోతున్న సంగతి తన మిత్రులందరికీ చెప్పి, వసిష్ఠుడి వద్దవున్న ఆయుధాలు తెచ్చాడు. తరవాత రాముడు యాత్రాదానాలు చేశాడు. వసిష్ఠుడి కొడుకైన సుయజ్ఞుణ్ణి పిలిపించి, ఆయన భార్యకు సీతచేత ఆమె నగలూ, మంచమూ, పరుపులూ దానం చేయించి, తాను శత్రుంజయమనే ఏనుగునూ, అనేక ఇతర ఏనుగులనూ ఇచ్చి పంపాడు.


అగస్త్య కౌశికులనే బ్రాహ్మణులకూ, కౌసల్యను ఆశ్రయించుకుని ఉన్న ఒక వృద్ధ వేద పండితుడికీ, దశరథుడికి ఇష్టుడైన చిత్రరథుడనే సారథికీ, బ్రహ్మచారులకూ అంతులేని గోవులూ, బంగారమూ, బట్టలూ దానం చేశాడు. అయోధ్యకు సమీపంగా అరణ్యంలో ఒక ముసలి బ్రాహ్మణుడుండేవాడు. ఆయన పేరు త్రిజటుడు. ఆయనకు గంపెడు పిల్లలూ, పడుచు భార్యా ఉన్నారు.


ఆయన పరిగ ఏరుకునీ, కందమూలాలు తవు్వకునీ సంసారం నెట్టుకొస్తున్నాడు. రాముడు యాత్రాదానాలు చేస్తున్న మాట ఎలాగో తెలిసి త్రిజటుడు, చిరిగిన పైబట్ట కప్పుకుని రాముడి వద్దకు వచ్చి, ``రాజపుత్రా, నేను పేదవాణ్ణి. చాలామంది బిడ్డలు గలవాణ్ణి. ఇంత కాలంగా పరిగ ఏరుకు బతుకుతున్నాం. నన్ను కటాక్షించు,'' అన్నాడు. రాముడాయనతో, ``అయ్యా, నీవు నీ బలం కొద్దీ కర్ర విసురు.


అది ఎంత దూరాన పడుతుందో అంత బారున గోవుల నిస్తాను,'' అన్నాడు. త్రిజటుడు నడుము బిగించి, ఒక కర్ర తీసుకుని గిరగిరా తిప్పి విసిరే సరికి, అది సరయూనది అవతలి గట్టున వెళ్ళి పడింది. రాముడు త్రిజటుణ్ణి ఆప్యాయంగా కౌగలించుకుని, ``అయ్యా, నవు్వల కన్నాను, కోప్పడ వద్దు. నీ తపశ్శక్తి ఎంతో తెలుసుకుందామనిపించింది. అన్నప్రకారం గోవుల నివ్వటమేగాక ఇంకేమన్నా కావాలన్నా ఇస్తాను,'' అన్నాడు. త్రిజటుడు రాముణ్ణి దీవించి ఆవుల మందలను తోలుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.


ఈవిధంగా దానాలతో ఆబాలగోపాలాన్నీ తృప్తి పరచి రాముడు సీతా లక్ష్మణులతో తండ్రి నగరుకు బయలుదేరాడు. వారు ముగ్గురూ వీధులవెంబడి పోతుంటే మేడల మీది నుంచీ, మిద్దెల మీది నుంచీ చూసే పౌరులు బాధతో రకరకాలుగా తమలో తాము మాట్లాడుకున్నారు. ``చూడండర్రా, రాముడు కాలినడకను భార్యనూ, తము్మణ్ణీ వెంటబెట్టుకుని ఎలా పోతున్నాడో! కాకపోయినా ఈ దశరథుడికేదో అయింది. ఎంత దుర్మార్గుడైన కొడుకునైనా రాజైనవాడు అడవులకు పంపడుగదా, బంగారంలాటి రాముణ్ణి అడవికి పంపిస్తున్నాడే! మన మందరమూ కుటుంబాలతో సహా రాముడి వెంట పోతే సరిపోతుంది!'' పౌరులు అనుకునే ఈ మాటలన్నీ వింటూ సీతారామలక్ష్మణులు దశరథుడి నగరు చేరి, సుమంత్రుడి ద్వారా తాము ఆయనను చూడవచ్చినట్టు రాజుకు కబురు చేశారు.


దశరథుడు సీతా రామలక్ష్మణులను పిలుచుకురమ్మని సుమంత్రుడితో అన్నాడు. చేతులు జోడించి వచ్చే రాముడు కన బడగానే రాముడి కెదురు పోబోయి మధ్య దారిలోనే పడిపోయాడు. ఆయనను ఎత్తి పాన్పుపై పడుకోబెట్టారు.


స్పృహ వచ్చి దశరథుడు కళు్ళ తెరవగానే రాముడు, ``మహారాజా, నేను దండకారణ్యానికి పోతున్నాను. మీరు ప్రభువు గనక మీ అనుమతి కోసం వచ్చాను. నేనెంత చెప్పినా వినక సీతాలక్ష్మణులు నా వెంట బయలుదేరారు. వారి వనవాసానికి కూడా అనుమతి ఇవ్వండి,'' అన్నాడు. దశరథుడు రాముడితో, ``నాయనా, రామా! కైకేయికి వరమిచ్చి నేను మోసపోయాను. నీవు నా ఆనతి అతిక్రమించి పట్టాభిషేకం చేసుకో!'' అన్నాడు. ``మీరు అసత్యదోషం కట్టుకోకండి. అడవికి పోవటానికి నాకేమీ అభ్యంతరం లేదు.


పధ్నాలుగేళూ్ళ వనవాసం చేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తాము,'' అన్నాడు రాముడు. ``మీరు ఇవాళే వెళ్ళాలని ఏమిటి? ఈ రాత్రికి ఇక్కడ ఉండి నా వల్ల మీకు కావలిసినవన్నీ పొంది, ఈ ఒక్క రాత్రీ మమ్మల్నందరినీ సంతోష పెట్టి, రేపు ఉదయం అరణ్యానికి బయలుదేర వచ్చు,'' అన్నాడు దశరథుడు. ``తండ్రీ, మా కోరికలన్నీ మీరు తీర్చినట్టే భావించి మమ్మల్ని వెళ్ళ నివ్వండి. మాకు మీ ఆశీర్వాదం ఇచ్చి సంతోషంగా పంపండి.


అరణ్యంలో మా కేమీ కష్టాలుండవు. అనేక పర్వతాలూ, సరస్సులూ, వింతలూ చూస్తాం,'' అన్నాడు రాముడు. రాముడడవికి పోతున్నందుకు దశరథుడు పొందే సంతాపం చూసి సుమంత్రుడు పట్టరాని ఆగ్రహం వచ్చినవాడై, కైకేయితో, ``దుష్టురాలా! నిన్ను ప్రాణంకన్న ఎక్కువగా చూసుకునే మహారాజు కింత శోకం తెచ్చిపెట్టావే, నీ వింకేమి చెయ్యలేవు? నీ వాలకం చూస్తే భర్తను చంపుకునేదానివిగానూ, వంశనాశనం కలిగించే దానివిగానూ కనిపిస్తున్నావు. అందరిలోకీ పెద్ద కొడుకైన రాముడు పట్టాభిషేకం చేసుకోవటానికి నీ అభ్యంతర మేమిటి? భరతుడు రాజ్యం చేస్తే మేమంతా ఇక్కడ ఉంటామనుకుంటున్నావా? అయోధ్యలో ఒక్క బ్రాహ్మడుంటాడా? ఎందుకు చేస్తున్నావీ పాడుపని? మొత్తానికి ఆ తల్లి కూతురనిపించు కున్నావు! నీ తండ్రి అయిన అశ్వపతికి ఒక మునీశ్వరుడు ఒక అపూర్వమైన శక్తి ఇచ్చాడు.


దానితో ఆయన పశు పక్ష్యాదుల భాషలన్నీ నేర్చుకున్నాడు. ఒకనాడాయన మంచం మీద పడుకుని ఉండగా జృంభమనే ఒక చీమ ఏదో అనే సరికి ఆయన పకపకా నవ్వాడు. అది చూసి మీ అమ్మ, ఎందుకు నవ్వావో చెప్పు అన్నది. ఎందుకు నవ్వానో చెబితే నేను చచ్చిపోతాన న్నాడు మీ తండ్రి. నువు్వ చస్తావో, బతుకుతావో నాకు తెలీదు; నన్ను చూసి నవ్వలేదని నా కేమిటి నమ్మకం? అందుచేత నవ్విన కారణం చెప్పాలిసిందే నన్నది మీ అమ్మ.


అప్పుడు మీ నాన్న తనకు వరమిచ్చిన ముని దగ్గిరికి పోయి ఆయన సలహా అడిగాడు. నీ భార్య చచ్చిగీపెట్టినా చెప్పకు అన్నాడు ముని. అప్పుడు మీ నాన్న మీ అమ్మను వెళ్ళగొట్టి సుఖంగా ఉన్నాడు. నీ ధోరణి కూడా అలాగే ఉంది. తండ్రిని విడిచి రాముడు అడవికి వెళ్ళాడో గొప్ప ఆపద కలిగి తీరుతుంది. అందుచేత నీ వక్రబుద్ధి మాని రాముడి పట్టాభిషేకానికి ఒప్పుకో!'' అని హితవు చెప్పాడు. ఈ మాటలకు కైక సిగ్గు పడలేదు సరికదా, చలించను కూడా లేదు.


దశరథుడు మాత్రం సుమంత్రుడితో, ``రాముడి వెంట అడవికి చతురంగ బలాలనూ, విశేషమైన ధనాన్నీ, అందగత్తెలయిన స్త్రీలనూ, సంబారాలతో వర్తకులనూ పంపించు. బళు్ళ కూడా వెంట ఇచ్చి పంపించు. రాముడికి రాజ్యం లేదన్న లోపం ఏమాత్రం తెలియకుండా చూడు,'' అన్నాడు.


సుమంత్రుడి శాపనార్థాలకు చలించని కైకేయి ఈ మాటలు విని తెల్లబోయి, బెదిరి, గొంతు ఆర్చుకుపోయి, ``మహారాజా, అయోధ్యను పాడుబెట్టి అందరూ వెళ్ళిపోతే భరతుడు పాలించడు!'' అన్నది. ``ఓసి దుర్మార్గురాలా! నా మీద మొయ్య రానంత బరువు వేసింది చాలక, ఈ కొరడా దెబ్బలు కూడా ఏమిటి? ఇదంతా ఆ వరాల లోనే చేర్చి అడగక పోయావా?'' అన్నాడు దశరథుడు కోపంగా. కైకేయి అంతకన్న హెచ్చు కోపంతో, ``అది వేరే అడగాలా ఏమిటి? అరణ్యానికి పొమ్మంటే అన్నీ విడిచిపెట్టి పోవటం కాదా? మీ పూర్వీకుడు సగర చక్రవర్తి తన పెద్ద కొడుకైన అసమంజుణ్ణి వెళ్ళగొట్టినప్పుడు వాడి వెనకగా సైన్యాన్ని పంపాడా?'' అని అడిగింది. ఈ మాట విని సిద్ధార్థుడనే మంత్రి, ``అమ్మా, అసమంజుడి మాట ఇక్కడ దేనికి? వాడు పరమ దుష్టుడు.


వాడు వీధుల్లో ఆడుకునే పిల్లలను తీసుకుపోయి సరయూ నదిలో పడేసి ఆనందించే పాపాత్ముడు. అందుచేత పౌరులు కడుపుమంటతో రాజువద్దకు వెళ్ళి, `అయ్యా, తమరు అసమంజుణ్ణి వెళ్ళగొడతారా, మమ్మల్ని దేశం విడిచి వెళ్ళి పొమ్మన్నారా? ఏదో ఒకటి తేల్చి చెప్పండి!' అని అడగగా సగర మహారాజు జనద్రోహి అయిన తన కొడుకునూ, వాడి భార్యనూ, పరివారాన్నీ వెళ్ళగొట్టి, వాణ్ణి తిరిగి రాజ్యంలో అడుగు పెట్టనివ్వ వద్దని కట్టుదిట్టం చేశాడు.


జనద్రోహి అసమంజుడికీ జనప్రియుడైన రాముడికీ సాపత్యం చెప్పావే!'' అన్నాడు. ఈ మాటలకు కైక చలించక పోవటం చూసి దశరథుడు, ``ఓసి పాపాత్మురాలా! నిన్ను చూస్తే నీకు హితం తల కెక్కేటట్టు లేదు. నేను కూడా రాముడి వెంట అడవికి పోతాను. నీవూ, భరతుడూ సుఖంగా రాజ్య మేలండి,'' అన్నాడు. ఈ సంభాషణ అంతా వింటున్న రాముడు తండ్రితో, ``మహారాజా, అన్ని సుఖాలూ విడిచి, అడవిలో కందమూలాలు తినబోయే నా వెంట సేన కూడా దేనికి? ఏనుగును దానం చేసి కట్టుతాడు దగ్గిర లోభించే పద్ధతి మానండి. మాకు నారబట్టలూ, దుంపలు తవు్వకునే పరికరాలూ, ఒక బుట్టా ఇప్పించండి, చాలు,'' అన్నాడు.


మానాభిమానాలు విడిచిపెట్టిన కైకేయి, ``ఇదుగో, నారబట్టలు తెస్తున్నాను,'' అంటూ వచ్చింది. రామలక్ష్మణులు తమ మేలి వస్త్రాలు విప్పేసి, తండ్రి ఎదటనే నారబట్టలు ధరించారు. సీతకు మాత్రం అవి ఎలా కట్టుకోవాలో తెలియక రాముడి కేసి చూసింది. తరవాత ఒక బట్ట మెడకు చుట్టుకుని, మరొకటి చేత పట్టుకుని, సిగ్గుతో తల వంచి నిలబడింది. అప్పుడు రాముడు ఆమె వద్దకు వెళ్ళి, ఆమె చేతిలో ఉన్న నారచీరె పైన దానిని చుట్టాడు. ఇది చూసి దశరథుడి భార్యలు కన్నీరు కారుస్తూ, ``నాయనా, నీవు తండ్రిమాట ప్రకారం అడవికి వెళ్ళదలిచావు, వద్దన్నా మానవు. కాని సీతను కూడా ఎందుకు తీసుకు పోతావు? ఆమె వనవాసం చెయ్య లేదు. మా వద్ద విడిచిపెట్టి వెళు్ళ.


నీకు బదులుగా ఆమెను చూసుకుంటూ ఉంటాం,'' అన్నారు. ఈలోపల వసిష్ఠుడు సీతకు నారచీరెలిస్తున్న కైకేయితో, ``గుణ హీనురాలా, నీ సాహసానికి అంతు లేకుండా ఉన్నదే. సీత అడవికి వెళ్ళవలసిన అవసరమేమున్నది? రాముడి కోసం సిద్ధం చేసిన పట్టాభిషేకం ఆమెకు జరిపి రాజ్యం పాలించేటట్టు చేయవచ్చు, తెలుసా? సీత ఈ నార చీరెలు కట్టవలసిన అవసరం లేదు సరే కదా, ఆమె తన వెంట వాహనాలూ, వస్తువులూ, పరిచారికలూ, సమస్తమూ తీసుకు పోవచ్చును. భరతుడు సంతోషిస్తాడని నీవు చేసిన ఈ దుర్మార్గం అతనికి ఎంత మాత్రమూ రుచిం చదు.


అతను దశరథుడి కొడుకే అయితే, తన తండ్రి వ్యథకు కారణమైన రామ వనవాసానికి ఎంత మాత్రమూ సమ్మతించడు!'' అన్నాడు. చుట్టూ ఉన్నవారు, ``ఛీ,ఛీ!'' అనుకోవటం దశరథుడు విన్నాడు. ఆయన సీతను చూసి, ``సుకుమారి, చిన్న పిల్ల! ఆ సీత మునిపత్నిలాగా నారచీరె గట్టి ఎలా వెలవెల పోతున్నదో చూడండి! ఆమె నారచీరెలు కట్టటానికి వీల్లేదు,'' అన్నాడు.


రాముడు బయలుదేరే ప్రయత్నంలో తండ్రికి అప్పగింతలు చెప్పి, తన తల్లి అయిన కౌసల్యను కాపాడమని కోరాడు. దశరథుడు సుమంత్రుడితో, ``మంచి గుర్రాలను పూన్చిన మేలైన రథంలో వీళ్ళ నెక్కించి, నగరం బయట అరణ్యంలో విడిచి పెట్టిరా!'' అన్నాడు. ధనాధికారిని పిలిచి, ``పధ్నాలుగేళ్ళ పాటు సీతకు సరిపోయే మేలైన చీరెలూ, నగలూ తీసుకురా,'' అని ఆజ్ఞాపించాడు. సీత పెళ్ళికి పోతున్నదానిలాగా వికసించిన ముఖంతో తన కోసం తెచ్చిన నగలు పెట్టుకుంటూంటే కౌసల్య ఆమెను ఆలింగనం చేసుకుని, ``సీతా, నీ భర్త పేదవాడై పోయినాడని వనవాస కాలంలో అశ్రద్ధగా చూడకమ్మా!'' అంటూ నీతిబోధ చేసింది. రాముడు తల్లి దండ్రులకు ప్రదక్షిణ నమస్కారం చేసి, తల్లితో, ``అమ్మా, దిగులు పడక తండ్రిగారిని కనిపెట్టుకుని ఉండు. పధ్నాలుగేళ్ళంటే ఎంత? కన్నుమూసి తెరిచేసరికి గడిచిపోతాయి,'' అన్నాడు.


లక్ష్మణుడు కూడా తల్లి దండ్రులకు మొక్కి తన తల్లి అయిన సుమిత్ర వద్ద సెలవు తీసుకున్నాడు. ఆమె, ``లక్ష్మణా, ఇక నీకు రాముడే తండ్రి, సీతే తల్లి, అరణ్యమే అయోధ్య! అన్నను ఆపదరాకుండా చూసుకో, నాయనా!'' అని చెప్పింది. ముగ్గురూ బయటికి వచ్చారు. పెళ్ళి కూతురులాగా అలంకరించుకున్న సీత తాను వనవాసం వెళుతున్నాననే చింత కొంచెమైనా లేకుండా, ముందుగా రథమెక్కి కూచున్నది. తరవాత రామలక్ష్మణులెక్కి కూచున్నారు. సుమంత్రుడు రథంలో సీతకు దశరథుడిచ్చిన వస్త్రాభరణాలూ, ఆయుధాలూ, కవచాలూ, చిన్న గునపమూ, బుట్టా ఉంచాడు. రథం కదిలింది.














అయోధ్యకాండ -5






వీధిలో పౌరులందరూ దైన్యంతో నిలబడి చూస్తున్నారు. కొందరు రథం వెనక పరిగెత్తుతున్నారు. కొందరు రథం పక్కలు పట్టుకుని వేళ్ళాడుతున్నారు. కొందరు రథానికెదురుగా వచ్చి సుమంత్రుణ్ణి, ``మళ్ళీ ఎప్పటికి చూస్తామో, కాస్సేపు చూడనియ్యి. రథం మెల్లిగాతోలు, బాబూ!'' అని బతిమాలారు.

ఉన్నట్టుండి దశరథుడు, ``నేను రాముణ్ణి చూడాలి!'' అంటూ తన ఇంటి నుంచి బయటికి వచ్చి వీధిన పడ్డాడు. ఆయనతో బాటు ఆయన భార్యలు కూడా వీధి వెంట పరిగెత్తసాగారు. ``సుమంత్రుడా, రథం కాస్త ఆపు!'' అని కేక పెట్టాడు దశరథుడు.


ఆయన కొంత దూరం పరిగెత్తి పడిపోయాడు. వెనక్కు తిరిగి చూస్తున్న రాముడికీ దృశ్యం దుర్భరమయింది. అతను సుమంత్రుడితో, ``రథం వేగంగా తోలు. ఈ దుఃఖాన్ని ఎంతసేపు చూడగలను? ఎలా చూడటం? అంతగా మహారాజు అడిగితే, జనం చేసే గోలలో ఆయన కేక వినిపించ లేదని చెప్పు,'' అన్నాడు.


రాముడు రథాన్ని వెన్నంటి వచ్చేవారి వద్ద సెలవు పుచ్చుకున్నాక సుమంత్రుడు గుర్రాలను వడిగా తోలాడు. దశరథుడితో మంత్రులు, ``మహారాజా, వాళు్ళ త్వరగా రావాలనుకున్నట్టయితే వారిని ఎక్కువ దూరం సాగనంప గూడదు,'' అని చెప్పారు. దశరథుడు శరీర మంతా చెమటలు దిగ గారుతూ, భార్యలతో సహా అక్కడే నిలబడి, క్రమంగా దూరమై పోతున్న రథాన్ని చూశాడు. రాముడు వనవాసానికి బయలుదేరి వెళ్ళి పోవటంతో దశరథుడి అంతఃపురం రోదన ధ్వనులతో నిండి పోయింది.


దానితోబాటే అయోధ్యా నగరమంతా పాడు పడినట్టయి పోయింది. ఎక్కడి పనులక్కడ ఆగిపోయాయి. జనులంతా ఏదో ఉపద్రవం జరిగిపోయినట్టుగా విస్తుపోయారు. రాముడి వెనుక కొంతదూరం వెళ్ళి దారిలో పడిపోయిన దశరథుణ్ణి కౌసల్యా, కైకేయీ చెరొక చేయీపట్టుకుని నిలబెట్టారు. దశరథుడు కైకేయితో, ``నన్నంటకు. నేను నీ భర్తను కాను. నిన్ను విడిచి పెట్టేశాను. నీ కొడుకు నాకు తిలోదకాలిస్తే అవి నాకు ముట్టవు,'' అన్నాడు. ఆయన రాముడి కోసం ఇంకా విపరీతంగా ఏడుస్తూ కౌసల్య ఇంటికి వచ్చేశాడు.


ఆ రాత్రి రాముడి కోసం విలపించే కౌసల్యా దశరథులను సుమిత్ర తగిన విధంగా ఊరడించింది. ఈ లోపల సీతా రామలక్ష్మణులెక్కిన రథం సూర్యాస్తమయ వేళకు తమసా నదీ తీరం చేరింది. పురజనులు అక్కడిదాకా రథాన్ని వెంబడించి వచ్చారు. వారు రాముణ్ణి అరణ్యవాసం వెళ్ళవద్దని నిర్బంధం చెయ్యసాగారు. రాముడెన్ని చెప్పినా వారు ఏమాత్రం వినిపించుకోలేదు. సుమంత్రుడు గుర్రాలను విప్పి, కడిగి, నీరు తాగించి, నది ఒడ్డున తిరగనిచ్చి, తరవాత కట్టివేసి మేత పెట్టాడు. సుమంత్రుడూ, లక్ష్మణుడూ తయారుచేసిన ఆకుల పక్క మీద పడుకుని రాముడూ, సీతా నిద్రపోయారు.


సుమంత్రుడూ, లక్ష్మణుడూ రాత్రి అంతా కబుర్లతో గడిపారు. రాముణ్ణి వెంబడించి వచ్చిన పౌరులు కూడా నది ఒడ్డునే నడుములు వాల్చి నిద్రపాయారు. తెల్లవారుతూండగా రాముడు లేచి, ఇళు్ళ వాకిళు్ళ విడిచిపెట్టి చెట్ల కింద నిద్ర పోతున్న పౌరులను చూసి, లక్ష్మణుడితో, ``వీరంతా లేవకముందే మనం రథ మెక్కి సాగిపోవటం మంచిది. లేకపోతే వీరు మనని వదలరు. మనతోపాటే వచ్చేస్తారు,'' అన్నాడు. సుమంత్రుడు రథం సిద్ధంచేసి తెచ్చాడు. రాముడు సుమంత్రుడితో, ``రథాన్ని అన్ని వైపులా తిప్పి తీసుకురా. అప్పుడు జనం మనం వెళ్ళిన జాడ తెలుసుకోలేక పోతారు,'' అన్నాడు. సుమంత్రుడు రథాన్ని అలాగే తిప్పి తెచ్చినాక సీతా రామ లక్ష్మణులు దానిపై ఎక్కి కూర్చుని ఉత్తరంగా బయలుదేరారు.


తెల్లవారి జనం నిద్రలేచి చూస్తే రథం లేదు, సీతా రామ లక్ష్మణులు లేరు. తమను వంచించిన నిద్రనూ, దైవాన్నీ తిట్టుకుంటూ వారు అయోధ్యకు తిరిగి వెళ్ళారు. తెల్లవారే సరికే రాముడి రథం చాలా దూరం వెళ్ళిపోయింది. అది దక్షిణ కోసల దేశాన్ని గడిచి, కోసలకు దక్షిణంగా ప్రవహించే గంగానదిని చేరవచ్చింది. గంగా నది సమీపాన శృంగిబేర పురమనే చోట సుమంత్రుడు ఒక పెద్ద గార చెట్టు కింద రథాన్ని నిలిపి, గుర్రాలను విప్పి, వాటికి మేతపెట్టాడు. సీతా రామ లక్ష్మణులు చెట్టు కింద కూచున్నారు.


ఇంతలో గుహుడనే బోయరాజు, రాముడికి మంచి స్నేహితుడు, రాముడి రాక గురించి తెలిసి, తన మంత్రులతోనూ, కుల పెద్దలతోనూ చూడ వచ్చాడు. అతన్ని దూరాన చూస్తూనే రాముడు లక్ష్మణుడితో కూడా ఎదురు వెళ్ళి, గుహుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. గుహుడు విచారంతో, ``రామా, ఇదే అయోధ్య అనుకో! నీవు అతిథిగా రావటం నా అదృష్టం,'' అన్నాడు. తరవాత గుహుడు రాముడికీ, లక్ష్మణుడికీ, సీతకూ మంచి భోజనం సిద్ధంచేయించి, ``రామా, నీకు ఏ లోపమూ జరగదు. ఈ రాజ్యాన్ని నీవే ఏలుతూ ఉండిపో,'' అన్నాడు. రాముడు అతన్ని గాఢంగా ఆలింగనం చేసుకుని, ``గుహా, నా కోసం కాలి నడకన వచ్చావు.


అంతకన్న ఇంకేం కావాలి? నీ రాజ్యం నీవే ఏలుకో. నేను నారబట్టలు ధరించి అరణ్యవాసం చెయ్యక తప్పదు,'' అని నచ్చచెప్పాడు. ఆ రాత్రి రాముడూ, సీతా ఆ గారచెట్టు కిందనే పడుకుని నిద్రపోయారు. వారికి రక్షగా మేలుకుని ఉన్న లక్ష్మణుడితో గుహుడు, ``నాయనా, నీవుకూడా పడుకుని విశ్రాంతి తీసుకో. తెల్లవార్లూ మీకు మేము కాపు ఉంటాంలే. అరణ్యంలో ఉండే మాకిది పరిపాటే,'' అన్నాడు.


కాని లక్ష్మణుడు అలా చెయ్యక గుహుడితో తెల్లవార్లూ మేలుకుని కూచుని, జరిగినదాన్ని గురించీ, జరగబోయేదాన్ని గురించీ మాట్లాడాడు. అంతా విని గుహుడు చాలా దిగులుపడ్డాడు. ఆ రాత్రి గడిచి మర్నాడుదయం రాముడు కోయిల కూతలకూ, నెమళ్ళ కూతలకూ మేల్కొన్నాడు. అతను లక్ష్మణుడితో, ``సూర్యోదయం అవుతున్నది. మనం గంగానది దాటి వెళ్ళిపోదాం,'' అన్నాడు.


లక్ష్మణుడు వెళ్ళి బోయ రాజైన గుహుణ్ణీ, సారథి అయిన సుమంత్రుణ్ణీ పిలుచుకు వచ్చాడు. రాముడు గుహుడితో తాము గంగానది దాటాలని చెప్పాడు. గుహుడు తన మనుషులను పంపి గంగ దాటటానికి మంచి పడవనూ, నావికుణ్ణీ సిద్ధంచెయ్యమన్నాడు. రాముడు సుమంత్రుడితో, ``సారధీ, నీ విక నగరానికి తిరిగి వెళు్ళ. మా తండ్రిగారితోనూ, తల్లులతోనూ మా క్షేమం గురించి తెలిపి, పధ్నాలుగేళూ్ళ తీరగానే తిరిగి వస్తామని చెప్పు. తరవాత భరతుణ్ణి మేనమామ ఇంటి నుంచి తీసుకు వచ్చి రాజ్యాభిషేకం చేయించు,'' అన్నాడు.


సుమంత్రుడు, ``రామా, రణరంగంలో యోధుడు పడిపోగా సారధి ఉత్త రథాన్ని తీసుకుపోయినట్టుగా, మీరు ముగ్గురూ ఎక్కి వచ్చిన రథాన్ని ఖాళీగా అయోధ్యకు తీసుకుపోతే ప్రజల గుండెలు పగలవా? ఉత్త రథంతో తిరిగి వెళ్ళి మీ తల్లులకు నా మొహం ఎలా చూపించను? నేనుకూడా ఈ పధ్నాలుగేళూ్ళ మీ వెంటనే ఉండి మీకు అడవిలోని ఫలాలను తెచ్చి పెడుతూ ఉంటాను,'' అన్నాడు. ``అలా కాదు, సారధీ.


నీ విక్కడే ఉండి పోతే మేము అరణ్యానికి వెళ్ళినట్టు కైకేయికీ, తమ ఆజ్ఞ పాలించినట్టు తండ్రిగారికీ ఎలా తెలుస్తుంది? కనక, నీవు తిరిగి వెళ్ళి తీరాలి,'' అన్నాడు రాముడు. తరవాత రాముడి కోరికపై గుహుడు మర్రిపాలు తెచ్చాడు. దానితో రామలక్ష్మణులిద్దరూ మునులలాగా జడలు కట్టుకున్నారు. లక్ష్మణుడు సీతను ముందుగా పడవలోకి ఎక్కించి తరవాత తానుకూడా ఎక్కాడు.


రాముడు గుహుడికి వీడ్కోలు చెప్పి ఆఖరున పడవలో ఎక్కికూచున్నాడు. గుహుడి బంధువులు తెడ్లువేసి పడవను గంగకు అడ్డంగా నడిపారు. పడవ నడి ప్రవాహంలో ఉండగా సీత గంగకు నమస్కరించి, ``గంగాదేవీ, పధ్నాలుగేళ్ళ అనంతరం మేము క్షేమంగా తిరిగి వచ్చేటప్పుడు బ్రాహ్మణులకు లక్ష గోవులూ, వస్త్రాలూ దానం చేస్తాను, అన్నదానం చేస్తాను. నీకు నైవేద్యం పెడతాను. నీ గట్టున ఉండే అన్ని దేవాలయాలకూ మొక్కుతాను. మేము సుఖంగా తిరిగి వచ్చేటట్టు అనుగ్రహించు,'' అని భక్తితో మొక్కు కున్నది. త్వరలోనే పడవ గంగ యొక్క దక్షిణపు గట్టు చేరింది.


సీతారామలక్ష్మణులు వత్సదేశంలో అడుగుపెట్టి కాలినడకన బయలుదేరారు. ముందు లక్ష్మణుడూ, అతని వెనక సీతా, సీత వెనకగా రాముడూ-ఈ విధంగా వారు నడక సాగించారు. గంగ ఉత్తరపు గట్టున నిలబడి ఉన్న సుమంత్రుడు వారు కనపడకుండా వెళ్ళిన దాకా చూసి కంటతడి పెట్టుకున్నాడు. రామలక్ష్మణులు ఆ రోజు చుట్టుపక్కల చెట్లకు కాచిన సుమధుర ఫలాలను తిని ఆకలి తీర్చుకుని, ఆ రాత్రికి ఒక చెట్టు కింద చేరారు.


తన స్థితి తలుచుకుని రాముడు వశం తప్పి మాట్లాడసాగాడు. ఇదే అరణ్యవాసానికి మొదటిరాత్రి. ఇకనుంచీ సుమంత్రుడు కూడా తోడుండడు. నిద్రపోకుండా మేలుకుని ఉండి తానూ, లక్ష్మణుడూ సీతను జాగ్రత్తగా కాపాడు కోవాలి. ఇప్పుడు తండ్రి దశరథుడు పుట్టెడు దిగులుతో పడుకుని ఉంటాడు. ఆయనకు తీరని క్షోభకలిగించిన కైకేయికి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. భరతుడు హాయిగా, సుఖంగా రాజ్యమేలు తాడుగద! అసలు ఈ కైకేయి దాపరించింది దశరథుడి కీడుకూ తనను అడివికి పంపటానికీనూ! సుకుమారి అయిన సీత తన కారణంగా ఇడుమల పాలు కావలసివచ్చింది.


అమ్మ ఏ జన్మ లోనో తల్లీ కొడుకులకు ఎడబాటు కలిగించి ఉంటుంది. తాను తలుచుకుంటే, ఒక్క అయోధ్య ఏమిటి, భూమండలమంతా జయించ గలడు! తండ్రి మాటకు లోబడి, ధర్మం కోసం పట్టాభిషేకం మానుకున్నాడు గాని! అయినా, తానొకటి తలిస్తే విధి ఒకటి తలిచింది. ఇందులో ఎవరిని నిందించీ ప్రయో జనంలేదు. అంతా విధిప్రకారమే జరుగుతుంది.


ఎంతటి వారైనా విధికి తలవొగ్గక తప్పదు! రాముడికి నిద్ర రాలేదు. అతను కన్నీరు కారుస్తూ ఇదే ధోరణిలో మాట్లాడుకు పోతూ ఉండటం చూసి లక్ష్మణుడు అతన్ని ఊరడించాడు. ఆ మాటలతో రాముడి మనసు కాస్త స్థిమితపడి, వనవాస దీక్ష అతనిలో దృఢపడింది. పక్కనే ఒక మర్రిచెట్టు కింద లక్ష్మణుడు ఆకులు పరిచి పక్క సిద్ధం చేశాడు.


సీతారాములు ఆ రాత్రికి ఆ పక్కపైన పడుకున్నారు. తెల్లవారుతూనే ముగ్గురూ లేచి గంగా యమునా సంగమమైన ప్రయాగ కేసి నడిచారు. అక్కడ భరద్వాజముని ఆశ్రమం ఉన్నది. వారు ఆశ్రమం చేరేసరికి సూర్యాస్త మయమయింది. రాముడు భరద్వాజుడితో క్లుప్తంగా తన కథ చెప్పుకున్నాడు. ``అవును, నీ తండ్రి నిన్ను అకారణంగా అడవులకు పంపాడని విన్నాను. నీ విక్కడికి వచ్చావు గనక నిన్ను చూడగలిగాను. ఈ ఆశ్రమంలోనే ఒక పర్ణశాల వేసుకుని పధ్నాలుగేళూ్ళ ఇక్కడే ఉండిపోవచ్చు.


ఇక్కడ నీకు సుఖంగా ఉంటుంది. ఈ ప్రదేశం కూడా చాలా పవిత్రమైనది,'' అన్నాడు భరద్వాజుడు. దానికి రాముడు, ``మునీంద్రా, మేమీ ఆశ్రమంలో ఉన్నామని తెలిస్తే మా ప్రజలు నన్ను చూసి పోవటానికి సులువుగా వస్తూ పోతూ ఉంటారు. అందుచేత ఇంకా దూరంగా, మాకు వాసయోగ్యమైన ప్రదేశం ఉంటే చెప్పండి. సీత తండ్రి ఇంట ఎంతో సుఖంగా పెరిగినది. ఆమెకు చూడ ముచ్చటగా ఉండే చోటు చెప్పారంటే, అక్కడే ఆశ్రమం నిర్మించుకుని ఉండి పోతాము,'' అన్నాడు. ``ఇక్కడ ఉండటం ఇష్టంలేక పోతే ఇక్కడికి పదికోసుల దూరాన చిత్రకూట మనే కొండ ఉన్నది. అది చాలా రమ్యమైన ప్రదేశం.


ఆ పర్వతంమీద కొండ ముచ్చులూ, కోతులూ, ఎలుగుబంట్లూ ఉంటాయి. కొన్ని వేల ఏళు్ళగా ఋషులు అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. అది మీకు అనువైన ప్రదేశం. అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకోవచ్చు,'' అన్నాడు భరద్వాజుడు.










అయోధ్యకాండ -6






ఆ రాత్రి వారు ముగ్గురూ భరద్వాజుడు చెప్పిన కథలు అనేకం విని సుఖంగా నిద్ర పోయారు. మర్నాడు ఉదయం భరద్వాజుడు వారిని కొంతదూరం సాగనంపి, చిత్రకూటానికి తాను అనేక మార్లు వెళ్ళి వచ్చిన తోవ గుర్తులు చెప్పాడు. సీతారామ లక్ష్మణులు ఆయన వద్ద సెలవు పుచ్చుకుని ఆయన చెప్పిన దారినే నడుస్తూ యమునా నదిని దాటవలసిన రేవు వద్దకు వచ్చారు. అక్కడ లక్ష్మణుడు కొయ్యలమీద ఎండిన వెదుళ్ళతో ఒక విశాలమైన తెప్ప తయారు చేశాడు.


దానిపైన నేరేడు కొమ్మలతోనూ, పబ్బలి తీగలతోనూ ఒక సుఖమైన ఆసనం సీత కోసం అమర్చాడు. తెప్ప మీద తమ వస్తువుల నన్నిటినీ ఉంచి, తాము కూడా ఎక్కి నదిని దాటారు. ప్రవాహ మధ్యంలో సీత యమునా నదికి నమస్కరించి ఆవులూ, వెయ్యి కడవల పాలూ ఇస్తానని, గంగకు మొక్కుకున్నట్టే మొక్కుకున్నది.


వసంతకాలం కావటంచేత అడివి చెట్లు పుష్పించి మహాశోభగా ఉన్నాయి. మోదుగు చెట్లనిండా ఎరట్రి పూలున్నాయి. సీత ఇప్పుడు ఆ వసంత శోభను చూసి ఆనందించటం ప్రారంభించింది. లక్ష్మణుడు ఆమె ముందు నడుస్తూ, ఆమె కోరిన ప్రతి పువూ్వ, ప్రతి పండూ కోసి తెచ్చి ఇస్తూ, ఆమె చెట్లను గురించి అడిగే ప్రశ్నలన్నిటికీ వివరంగా సమాధానాలిచ్చాడు.


ఆ రాత్రికి వారు ఒక చదునైన చోటు చూసుకుని అక్కడ నిద్రపోయారు. తెల్లవారుతూనే రాముడు లేచి లక్ష్మణుణ్ణి లేపి చిత్రకూటానికి ప్రయాణం సాగించాడు. చిత్రకూట ప్రాంతంలో రాముడు ఒక స్థలం చూసి అక్కడ పర్ణశాల నిర్మిద్దామన్నాడు.


లక్ష్మణుడు మంచి గుంజలు నరికితెచ్చి, వాటితో దృఢమైన విభాగాలూ నిర్మించాడు. ఆ పర్ణశాలలో సీతారామలక్ష్మణులు శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసి, పక్కనే ప్రవహించే మాల్యవతీ నదిలో స్నానాలుచేస్తూ, చుట్టూ ఉండే అందమైన అరణ్య ప్రాంతంలో విహరిస్తూ, పట్టణ జీవితాన్ని మరిచి సుఖంగా కాలం గడపసాగారు. అక్కడ శృంగిబేరపురంలో గుహుడూ, సుమంత్రుడూ గంగ ఒడ్డున నిలబడి సీతారామ లక్ష్మణులు కనుమాటు అయినదాకా చూసి గుహుడి ఇంటికి వెళ్ళిపోయారు.


రాముడు మనసు మార్చుకుని తిరిగి వస్తాడేమోనని మూడు రోజులు చూసి సుమంత్రుడు ఖాళీ రథంతో అయోధ్యకు బయలుదేరి, రాముడు అయోధ్య విడిచి వెళ్ళిన అయిదు రోజులకు తిరిగివచ్చాడు. దారిలో పౌరులు ఖాళీగా రథం తిరిగి రావటం చూసి ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుకున్నారు. సుమంత్రుడు తిన్నగా కౌసల్య ఇంటికి వెళ్ళి, సింహాసంపైన కూర్చుని ఉన్న దశరథుడితో రాముడు చెప్పి పంపిన మాటలు చెప్పేశాడు. దశరథుడు అమితమైన శోకోద్రేకంతో స్పృహతప్పి కింద పడి పోయాడు. కౌసల్య, సుమిత్ర సహాయంతో దశరథుణ్ణి లేవదీస్తూ, ``మహారాజా, రాముణ్ణి అరణ్యంలో దింపి వచ్చిన సుమంత్రుడికి జవాబైనా చెప్పరేం? కైక ఏమన్నా అనుకుని పోతుందనా? ఆవిడగారిక్కడ లేదుగా!'' అని చెప్పింది.


దశరథుడితో బాటు కౌసల్యా, ఇతర అంతఃపురకాంతలూ రోదనాలు చేశారు. ``నా ఆజ్ఞకు ఎంత విలువ ఉన్నదో నాకు తెలియదు; నీవు మళ్ళీ వెళ్ళి రాముణ్ణి తీసుకురా! లేదా నన్ను ఆ రాముడి దగ్గిరికైనా తీసుకుపో,'' అన్నాడు దశరథుడు. కౌసల్యకూడా సుమంత్రుడితో గర్భశోకంతో తనను రాముడున్న చోటికి తీసుకుపొమ్మన్నది.


సుమంత్రుడు కౌసల్యను ఊరడిస్తూ, రామలక్ష్మణులు సులువుగా అరణ్య వాసవ్రతం పూర్తి చేయగలరనీ, ఆ సీతకు అది అరణ్యంలాగా ఉన్నట్టే లేదనీ, రాముడు లేని అయోధ్యే ఆమెకు అరణ్యమనిపించి ఉండేదనీ అన్నాడు. మర్నాడంతా కౌసల్య దశరథుడు చేసిన పనికి ఆయన్ను నిషూ్ఠరాలు పలికింది. ఆ విధంగా తాను పడుతున్న బాధను కొంత బయట పెట్టుకున్నది.


దశరథుడూ బాధ పడ్డాడు. కౌసల్య పుత్రశోకానికి తోడు పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. రాముడు వెళ్ళిపోయిన ఆరో రోజు రాత్రి, తన చావు కొన్ని ఘడియలలో ఉన్నదనగా దశరథుడికి తన చిన్ననాటి వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది. ఇంకా కౌసల్యను పెళ్ళాడక పూర్వమే దశరథుడు పుత్రశోకంతో మరణించేటట్టు ఒక మునివల్ల శాపం పొందాడు.ఇప్పుడాయన కౌసల్యకు ఆ సంఘటన గురించి చెప్పాడు: ఆ రోజులలో దశరథుడు యవ్వనంలో ఉన్నాడు.


ఆయనకు చప్పుడును బట్టి బాణం గురి చేసి కొట్టటంలో చాలా నేర్పుండేది. ఈ శబ్దవేధిత్వాన్ని అందరూ మెచ్చుకునేవారు. అందుచేత యువరాజై ఉన్న దశరథుడు తరుచు రాత్రివేళ సరయూ నదీ తీరానికి వెళ్ళి, అక్కడ వన్యమృగాలు నీరు తాగటానికి వచ్చే రేవు కనిపెట్టి సమీపంలో దాక్కుని, నీటి చప్పుడును బట్టి బాణం వేసి ఏనుగులనూ, సింహాలనూ, ఇతర మృగాలనూ వేటాడుతూ ఉండేవాడు.


ఇలా ఉండగా ఒకసారి, వానకాలంలో రాత్రివేళ దశరథుడు గాఢాంధకారంలో మృగాల కోసం నదీతీరాన పొంచికూచున్నాడు. ఆ సమయంలో నది నీటిలో బుడబుడ మని చప్పుడయింది. అడవి ఏనుగు అయి ఉంటుందనుకుని దశరథుడు చప్పుడుకు గురి చేసి తీవ్రమైన బాణం ఒకటి వదిలాడు. మరుక్షణమే మనిషి ఆక్రోశం వినిపించింది. ``అయ్యయ్యో, తపస్సు చేసుకునే మా బోటివాళ్ళ మీద ఈ బాణం పడట మేమిటి? నేను ఎవరికి అపకారం చేశాను? నన్ను చంపిన వాడిక ఏం లాభిస్తుంది? ఎవడోగాని, ఒక్క బాణంతో మూడు ప్రాణాలు తీశాడే! నేను పోతే, ముసలివాళూ్ళ, గుడ్డివాళూ్ళ అయిన నా తల్లిదండ్రులెంతకాలం బతుకుతారు? ఎలా బతుకుతారు?'' అన్న మాటలు దశరథుడి చెవులపడ్డాయి.


ఆయన దగ్గిరికి వెళ్ళి చూసేసరికి తన బాణం తగిలి ఒక ముని కుమారుడు కొలను ఒడ్డున బాధతో గిలగిల లాడిపోతున్నాడు. అతను నీటిలో ముంచిన పాత్ర పక్కనే పడి ఉంది. మతిపోయి, చెయ్యీ కాలూ ఆడక నిలబడి ఉన్న, దశరథుడితో ఆ ముని కుమారుడు, ``ఎందుకు చేశావీ పాడుపని? నేనిక్కడ ఉన్నట్టు నా తండ్రికి నీవే వెళ్ళి చెప్పు. లేకపోతే ఆయనకు తెలిసే మార్గం లేదు. తెలిసినా ఆయన రాలేడు.


దాహం జాస్తిగా ఉన్నదంటే నీరు తీసుకుపోదామని వచ్చి నీ బాణం వాత పడ్డాను. ఈ బాధ భరించలేను. ముందు ఈ బాణం లాగి మరీ వెళు్ళ,'' అన్నాడు. కురవ్రాడు బాధపడి పోతున్నాడు, బాణం లాగేస్తే చస్తాడేమోనని దశరథుడు మొదట తటపటాయించినా, చివరకు ఆ కురవ్రాడి ప్రోద్బలం మీదనే బాణం లాగేశాడు. వెంటనే మునికుమారుడు ప్రాణాలు వదిలాడు. తరవాత దశరథుడు ఆ కురవ్రాడి పాత్రలో నీరు ముంచుకుని, అతడు చెప్పిన దారినే అతని తల్లిదండ్రులుండే కుటీరానికి వెళ్ళాడు.


దశరథుడి అడుగుల చప్పుడు విని తన కొడుకే ననుకుని ఆ కుటీరంలో ఉండే వృద్ధుడు, ``నాయనా, ఎప్పుడో అనగా మంచినీటి కోసరం వెళ్ళిన వాడివి ఇంత ఆలస్యం చేశావేం? లోపలికి రా! త్వరగా నీరు ఇయ్యి!'' అన్నాడు.``నేను మీ అబ్బాయిని కాదు, దశరథుణ్ణి, క్షత్రియుణ్ణి,'' అంటూ, తడబాటుతో దశరథుడు తాను చేసిన ఘోరం కాస్తా ఆ వృద్ధ దంపతులకు చెప్పేశాడు. వారి దుఃఖానికి అంతు లేదు.


దశరథుడి సహాయంతో వారిద్దరూ తమ కొడుకు కళేబరం వద్దకు వెళ్ళి, దాని మీద పడి పెద్ద పెట్టున ఏడ్చారు. ముసలి ముని దశరథుడితో, ``మాకున్న ఒక్క కొడుకునూ అకారణంగా చంపి మాకు తీరని పుత్రశోకం కలిగించావు గనక నీవు కూడా పుత్రశోకంతోనే మరణించాలని నిన్ను శపిస్తున్నాను,'' అన్నాడు.


తరవాత ఆ వృద్ధ దంపతులు తమ కొడుకు చితిలోనే కాలి చనిపోయారు. ఎన్నడో జరిగిన ఈ సంఘటన దశరథుడికి ఇప్పుడు, తన ఆయువు తీరిపోయే దశలో, జ్ఞాపకం వచ్చింది. దానిని ఆయన కౌసల్యకు చెప్పాడు. కౌసల్యతో మాట్లాడుతుండగానే దశరథుడికి చూపు మందగించింది. క్రమంగా శ్రవణశక్తికూడా పోయింది. బుద్ధివికలమై పోసాగింది. ఆయన రాముణ్ణి కేకలు పెడుతూ, కైకేయిని తిడుతూ అర్ధరాత్రివేళ ప్రాణాలు వదిలాడు.


అది రాముడు బయలుదేరి వెళ్ళిన ఆరో రోజు అర్ధరాత్రి. ఆ సమయానికి అంతఃపుర స్త్రీలందరూ, కౌసల్యా సుమిత్రలు సహితం, నిద్రపోతున్నారు. రాజు మరణించిన సంగతి మర్నాడు తెల్లవారిగాని అంతఃపుర కాంతలకు తెలియ లేదు. అంతఃపురంలో శోకాలు సాగినాక పై వారికి జరిగిన సంగతి తెలిసింది. త్వరలోనే వసిష్ఠుడు మొదలైనవారు వచ్చారు. దశరథుడు అంత్యక్రియలు జరపటానికి ఆయన కొడుకులలో ఒక్కడైనా దగ్గిర లేడు.


రామలక్ష్మణులు అరణ్యానికి వెళ్ళారు.భరత శత్రుఘు్నలు భరతుడి మేనమామ అయిన కేకయరాజు ఇంట ఉన్నారు. అందుచేత దశరథుడి శరీరాన్ని తైలంలో ఉంచారు. సిద్ధార్థుడు, విజయుడు, జయంతుడు, అశోకుడు, నందనుడు అనే వారిని పిలిచి వసిష్ఠుడు వారితో, ``మీరు వేగంగల గుర్రాల పైన కేకయ రాజుండే రాజగృహానికి వెళ్ళండి. భరతుడితో ఇక్కడ ఒక ముఖ్య కార్యమున్నదనీ, మేము రమ్మన్నామనీ చెప్పండి.


తంగాని, రాజుగారు చనిపోయిన సంగతిగాని చెప్పనే వద్దు,'' అని చెప్పి, భరతుడికి మేలిమి వస్త్రాలూ, ఆభరణాలూ ఇచ్చి పంపాడు. వాళు్ళ అనేక నదులూ, పర్వతాలూ దాటి, దీర్ఘ ప్రయాణం చేసి, భరతుడి మేనమామగారి దేశం చేరి, వాటిని ఇచ్చి, అతని మేనమామకూ, తాతగారికీ కానుకలుగా తెచ్చిన వస్త్రాభరణాలు భరతుడికి అందించి, వసిష్ఠుడు చెప్పమన్న మాటలు అదే విధంగా చెప్పారు.


భరతుడు పెద్దవాళ్ళ అనుమతి తీసుకుని, అయోధ్య నుంచి తన కోసం వచ్చిన వారి వెంబడి, పెద్ద బలగంతో సహా బయలుదేరాడు. మిగిలిన పరివారాన్ని నింపాదిగా వెనక రానిచ్చి, భరత శత్రుఘు్నలు రథంలో ముందుగా అయోధ్యా నగరం చేరుకున్నారు. వారు ఏడు రోజులు ప్రయాణించారు. దూతలు అయోధ్య నుంచి వచ్చిన రాత్రే భరతుడికి ఒక పీడ కల వచ్చింది. అది వచ్చినప్పటి నుంచీ అతని మనుసులో ఏదో ఆందోళనగానే ఉన్నది. అయోధ్య ప్రవేశించగానే అతని ఆందోళన తిరిగి వచ్చింది. ఎందుకంటే నగరంలో సాధారణంగా ఉండే ఉత్సాహమూ, ఉల్లాసమూ లేవు.


జనం నీరసించి నట్టున్నారు, నగరం పాడుపడినట్టున్నది. భరతుడు ముందు తన తండ్రి నగరుకు వెళ్ళి అక్కడ ఆయన కనిపించక పోయేసరికి తన తల్లి ఇంటికి వచ్చాడు. కొడుకును చూస్తూనే కైకేయి ఆసనం మీది నుంచి లేచి, తన కాళ్ళకు నమస్కారం చేసిన భరతుణ్ణి తన చెంత కూచోబెట్టుకుని కుశల ప్రశ్నలు చేస్తూ, ``నీవు బయలుదేరి ఎన్నాళ్ళయింది, నాయనా? నీ మామా, తాతా క్షేమంగా ఉన్నారా? నీకక్కడ సుఖంగా జరిగిందా?'' అని ప్రశ్నించింది.


భరతుడు అన్నిటికీ సమాధాన మిచ్చి, ``అమ్మా, నాన్నగారెక్కడ? పెద్దమ్మ కౌసల్య ఇంట ఉన్నాడా? నే నాయన కాళ్ళకు మొక్కాలి!'' అన్నాడు. ``ఆయన పెద్దల్లో కలిసిపోయారు, నాయనా,'' అంటూ కైకేయి చావు కబురు చెప్పింది. ఈ మాట వినగానే భరతుడు కుప్పకూలి పోయాడు. కైకేయి అతన్ని ఊరడించ యత్నించింది.




అయోధ్యకాండ-7




కొంతసేపు భరతుడు తండ్రి కోసం శోకించి, ``అయితే, అమ్మా, ఆయన ఆఖరు క్షణంలో నాకేమన్నా చెప్పాడా? ఆయన ఆఖరు మాటలేమిటి?'' అని అడిగాడు. `` `ఓ రామా, ఓ లక్ష్మణా, ఓ సీతా,' అంటూ ప్రాణాలు వదిలారు, నాయనా,'' అన్నది కైకేయి. భరతుడు అమిత ఆశ్చర్యంతో, ``అదేమిటి? రాముడూ, సీతా, లక్ష్మణుడూ దగ్గిర లేరా?'' అని అడిగాడు.

``అరణ్య వాసానికి వెళ్ళారుగా, నాయనా? రాముడు నారబట్టలూ, జడలూ ధరించి అరణ్యానికి వెళుతుంటే, సీతా, లక్ష్మణుడూ కూడా వెళ్ళారు,'' అన్నది కైకేయి. భరతుడు మరింత ఆశ్చర్యపడి, ``ఏం? రాముడు ఏం పాపం చేశాడు? తను పాడుపనులేవీ చేయడే! భ్రూణహత్య చేసిన వాడికి విధించినట్టు అతనికి అరణ్యవాసశిక్ష ఎందుకు వేశారూ?'' అన్నాడు. ``అదేం కాదులే! మహారాజు రాముడికి పట్టాభిషేకం చేసే యత్నంలో ఉన్నట్టు విని, నేనాయనను రెండు వరాలు కోరాను: ఈ పట్టాభిషేకం నీకు చేసి, రాముణ్ణి పధ్నాలుగేళు్ళ అరణ్యవాసానికి పంపమన్నాను. మహారాజు సరే నన్నారు.

కనక వసిష్ఠుడు మొదలైన వారంతా చెయ్యవలిసిందంతా చేస్తారు. నీవు చక్కగా పట్టాభిషేకం చేసుకో!'' అన్నది కైకేయి. కైకేయి చెప్పిన ఈ మాటలు విని భరతుడు మండిపడి పెట్టవలసిన నాలుగు మాటలూ పెట్టాడు. ``నీవు భర్తను చంపావు, రాముణ్ణి అడవికి పంపావు, నీ ముఖం చూస్తే పాపం!'' అన్నాడు.

``జ్యేష్ఠుడికి రాజ్యాభిషేకం జరగటం క్షత్రియ వంశ ధర్మమని నీకు తెలి యదా? రామ లక్ష్మణులు లేకుండా నేనీ రాజ్యభారం ఎలా మోయగలననుకున్నావు?'' అని అడిగాడు. ``నే నిప్పుడే వెళ్ళి ఆ రాముణ్ణి పిలుచుకు వచ్చి రాజ్యాభిషేకం చేసి అతనికి దాస్యం చేస్తాను,'' అని తల్లితో చెప్పాడు. ఇంత పని చేసినందుకు కైకేయిని నిప్పుల్లో పడమన్నాడు, లేదా అరణ్యానికి వెళ్ళమన్నాడు, అదీ కాకపోతే గొంతుకు ఉరిపోసుకు చావమన్నాడు. ఇంతలో మంత్రులు వారున్న చోటికి వచ్చారు.

భరతుడు వారితో తనకు రాజ్యకాంక్ష ఏమీ లేదనీ, రాజ్యం కావాలని తాను తన తల్లితో చెప్పి ఉండలేదనీ, కైకేయి తన తండ్రిని వరాలు కోరటంగాని సీతా రామ లక్ష్మణులు అరణ్యానికి వెళ్ళిపోవటంగాని, దూరదేశంలో ఉన్న తనకూ, శత్రుఘు్నడికీ తెలియనే తెలియవనీ స్పష్టంగా చెప్పేశాడు. తరవాత భరత శత్రుఘు్నలు కౌసల్య వద్దకు వెళ్ళారు. ఆమెను ఆలింగనం చేసుకుని ఆమెతోబాటు తాముకూడా ఏడ్చారు. ఆమె భరతుడితో కైకేయి తనకు చేసిన ద్రోహం గురించి చెబుతూంటే, భరతుడికి తననుకూడా తన తల్లితో జతచేసినట్టు అనిపించింది.

రాముడి అరణ్యవాసానికి తాను సమ్మతించలేదని అతను ఘోరమైన ఒట్లు పెట్టుకుని వేదన పడ్డాడు. కౌసల్య అతన్ని ఊరడించింది. దుఃఖ సముద్రంలో ఉన్న భరతుడితో వసిష్ఠుడు, ``నాయనా, ఈ విచారం కట్టిపెట్టి దశరథ మహారాజుకు ఉత్తర క్రియలు చెయ్యి,'' అని హెచ్చరించాడు. తైల భాండం నుంచి పైకి తీసిన తండ్రి శవాన్ని చూసి భరతుడు, ``నాయనా, నీవు పోయావు. రాముడడవిలో ఉన్నాడు. ఈ రాజ్యభారం ఎవరు మోస్తారు?'' అంటూ కడుదీనంగా దుఃఖించాడు.

దశరథుణ్ణి పల్లకీలో ఎక్కించి నగరం బయటకి తీసుకుపోయారు. శవానికి ముందుగా పురజనులు, వెండి బంగారు నాణాలు వెదజల్లుతూ; చందనమూ, అగరూ, గుగ్గిలమూ, మొదలైన ధూపాలు వేస్తూ నడిచారు. దశరథుడి భార్యలు పల్లకీలలో వెళ్ళారు. శవాన్ని చితిపై పెట్టాక దశరథుడి భార్యలు భరతుడితో బాటు చితి చుట్టూ అప్రదక్షిణంగా తిరిగారు. భరతుడు తండ్రికి నిప్పు పెట్టాక అందరూ నగరానికి తిరిగి వచ్చారు. భరతుడు తండ్రికి పది దినాలు మైలపట్టి తరవాత రెండు రోజులపాటు శ్రాద్ధాలు చేశాడు.

బ్రాహ్మణులకు అన్న దానమూ, వస్త్ర దానమూ, ఇతర దానాలూ చేశాడు. పదమూడో రోజు అస్థిసంచయనం చేసేటప్పుడు భరతుడూ, అతనితోపాటు శత్రుఘు్నడూ తండ్రిని తలుచుకుని వివశులై విలపించారు. తరవాత ఒక చోట భరత శత్రుఘు్నలు జరిగినదాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు; తన అన్న అయిన లక్ష్మణుడు తన తండ్రికి ఎందుకు అడ్డుపడలేదా అని శత్రుఘు్నడు ఆశ్చర్యం వెలిబుచ్చుతూండగా, మంధర మహారాణీలాగా అలంకరించుకుని ఆట కోతిలాగా తయారై అటుగా వచ్చింది.

ద్వారపాలకులు దాన్ని పట్టుకుని శత్రుఘు్నడి దగ్గిరికి తెచ్చి, ``ఇదుగో! అన్ని పాపాలకూ మూలమైన మంధర!'' అన్నారు. శత్రుఘు్నడు కోపావేశంతో మంధరను పట్టుకుని దాన్ని హతమార్చే ఉద్దేశంతో జరజరా ఈడ్చుకు పోసాగాడు. మంధర వెంట ఉండే దాసీలు బెదిరిపోయి కౌసల్య దగ్గిరికి పరిగెత్తారు. మంధర కప్పు ఎగిరిపోయేటట్టు కేకలు పెట్టసాగింది. కైకేయి మంధరను విడిపించటానికి వస్తే శత్రుఘు్నడామెను నోటికి వచ్చినట్టు తిట్టాడు. అప్పుడు కైకేయి పరిగెత్తి వెళ్ళి భరతుణ్ణి పిలుచుకువచ్చింది.

భరతుడు శత్రుఘు్నడితో, ``ఆడదాన్ని చంపుతావా? ఈ మాట తెలిస్తే రాముడు మన ముఖం చూస్తాడా? రాముడి ఆగ్రహానికి గురికావలిసి వస్తుందని ఆగాను కాని, నేను కైకేయిని ఎప్పుడో చంపకపోయానా? ఆ గూనిదాన్ని వదిలిపెట్టు,'' అన్నాడు. దశరథుడు పోయిన పధ్నాలుగో రోజు ఉదయం పెద్దలందరూ భరతుడి వద్దకు వచ్చి, ``రాజపుత్రా, రాజ్యానికి నాయకుడు లేడు. అదృష్టవశాత్తూ జనంలో అరాజకం సాగలేదు.

ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీవు వెంటనే పట్టాభిషేకం చేసుకోవటం మంచిది,'' అన్నారు. భరతుడు వారితో, ``జ్యేష్ఠుడే రాజు కావటం మా వంశాచారం. అందుచేత నన్ను రాజు కమ్మని మీరు కోరటం ఉచితం కాదు. నా తల్లి కోరిందిగదా అని పట్టం కట్టుకోను. నేను అరణ్యానికి వెళ్ళి జ్యేష్ఠుడైన రాముణ్ణి రాజును చేసి తీసుకువచ్చి, అతనికి బదులుగా నేనే అరణ్యవాసం చేస్తాను.

రాజ్యాభిషేకం అరణ్యంలోనే జరుగుతుంది గనక, అభిషేక సంబారాలన్నీ నా వెంట తీసుకు పోవటానికీ, నాతోబాటు చతురంగబలాలతో కూడిన సేనను వెంట బెట్టుకు వెళ్ళటానికీ అవసరమైన ఏర్పాట్లు చేయండి,'' అన్నాడు. భరతుడి ప్రయాణానికి బ్రహ్మాండమైన ప్రయత్నాలు జరిగాయి. అరణ్యం మధ్యగా చెట్లు నరికి, భూమి చదును చేసి దారులు వేశారు. నదులపై వంతెనలు కట్టారు.

దారిలో అడ్డు వచ్చిన గోతులూ, చెరువులూ పూడ్చారు. దారి పొడుగునా అక్కడక్కడా బావులు తవ్వారు. విడిదికి తగిన స్థలాలు చూసి అక్కడ వీధులూ, ఇళూ్ళ గలిగిన శిబిరాలు నిర్మించారు. ఇలాటి శిబిరాలు సరయూనదీ తీరం నుంచి గంగాతీరం వరకూ ఏర్పాటు చేశారు. ఆ రాత్రి శంఖాలు మోగటమూ, భేరి వాయింపూ, వందిమాగధుల స్తోత్రాలూ విని భరతుడు నిద్ర లేచి, కంట నీరు పెట్టుకుని, ``నేను రాజునుగాను. నాకు స్తోత్ర పాఠాలూ, మంగళ వాద్యాలూ వద్దు,'' అని వాటిని నిలిపించాడు.

వసిష్ఠుడు తన పరివారంతో రాజసభకు వచ్చి, భరతుడి పట్టాభిషేకం జరిపించే ఉద్దేశంతో పురప్రముఖులనూ, మంత్రులనూ, గణనాయకులనూ, భరతుణ్ణీ, శత్రుఘు్నణ్ణీ, ఇతర ముఖ్యులనూ వెంటనే పిలుచుకు రమ్మని దూతలను పంపాడు. త్వరలోనే అందరూ వచ్చి సభను అలంకరించారు. దశరథుడు జీవించి ఉన్నప్పటిలాగే సభ కళకళలాడింది.

అప్పుడు అందరి సమక్షంలోనూ వసిష్ఠుడు భరతుణ్ణి రాజ్యాభిషేకం చేసుకోవలిసిందిగా కోరాడు. భరతుడు పెద్దలతో చెప్పిన మాటలే పేరోలగంలో మళ్ళీ చెప్పి, ``నేను మీ అందరి సమక్షంలోకి రాముణ్ణి తీసుకురావటానికి శాయశక్తులా యత్నిస్తాను. అతను రాకపోతే లక్ష్మణుడిలాగే నేను కూడా రాముడితోపాటు వనవాసం ఉండి పోతాను. నా ప్రయాణానికి ఏర్పాట్లు ఇది వరకే ఆరంభమయ్యాయి.

మార్గం వేసేవారూ, మార్గరక్షకులూ మొదలైనవారు ముందే వెళ్ళిపోయారు. ఇంక నేను బయలుదేరటమే తరువాయి,'' అన్నాడు. ఈ మాటలకు అందరూ సంతోషించారు. ప్రయాణానికి సేనలను ఆయత్తం చేయవల సిందిగా సుమంత్రుడు సేనాధ్యక్షులకు చెప్పాడు. అయోధ్యా నగరానికి మళ్ళీ ప్రాణం వచ్చినట్టయింది. మర్నాడు భరతుడు పెందలాడే లేచి ప్రయాణమయ్యాడు.

అతని వెంట తొమ్మిది వేల ఏనుగులూ, అరవైవేల రథాలూ, లక్ష గుర్రాలూ యోధులతో సహా కదిలాయి. కౌసల్యా, సుమిత్రా, కైకేయీ వాహనాలలో బయలుదేరారు. కైకేయికి పట్టిన దయ్యం దిగిపోయింది. తాను చేసినదానికి పశ్చాత్తాపపడుతూ ఆమె మిగిలినవారి కంటె ముందు కదిలింది. పౌరులు గుంపులు గుంపులుగా భరతుణ్ణి వెంబడించారు.

రాముడికి ఇష్టులైనవారూ, వర్తకులూ, ఇతరులూ రాముణ్ణి చూడటానికి తాము కూడా ప్రయాణం కట్టారు. అనేక వేలమంది బ్రాహ్మణులు ఎడ్లబళ్ళెక్కి భరతుడి వెంట ప్రయాణమయ్యారు. ఇంత పెద్ద బలగాన్నీ వెంటబెట్టుకుని భరతుడు గంగాతీరాన్ని శృంగిబేరపురం వద్ద చేరుకుని, తన సైన్యాన్ని నది వెంబడి అక్కడక్కడా విడియమని ఉత్తరు విచ్చాడు.

అతను మంత్రులతో, ``మనం ఈ రాత్రికి ఈ తీరాన విశ్రమించి రేపు ఉదయానే గంగ దాటుదాం. నే నిప్పుడు నదిలో దిగి మా తండ్రికి తర్పణాలు వదులుతాను,'' అన్నాడు. మహా సముద్రంలాటి సేన ఒకటి వచ్చి గంగ ఒడ్డు వెంబడి విడియటం గుహుడు గమనించాడు. రథంయొక్క టెక్కెం గమ నించి ఆ రథం భరతుడిది అయి ఉంటుందని తెలుసుకున్నాడు.

అతను తన ఆప్తులను చేరబిలిచి, ``భరతుడు ఇంత సేనతో ఎందుకు బయలుదేరి వచ్చి వుంటాడంటారు? రాముడు వనవాసం పూర్తిచేసి వచ్చి రాజ్యం అడుగుతాడేమో, అతన్ని అరణ్యం లోనే చంపేద్దామని వచ్చివుంటాడు. మనం రాముణ్ణి ఎలాగైనా రక్షించాలి. అతను నా మిత్రుడు. అందుచేత మన వాళ్ళను అయిదు వందల పడవలు సిద్ధం చెయ్యమనండి.

ఒక్కొక్క పడవలోనూ నూరేసిమంది యువకులను ఏర్పాటు చేసి, పడవలు గంగకు అడ్డంగా ఉంచి, అందులోనే మీకు అవసరమైన మాంసమూ, ఇతర ఆహారాలూ, ఉంచుకుని జాగ్రత్తగా ఉండండి. భరతుడికి రాముడి పట్ల ద్రోహబుద్ధి లేకపోతే అతన్నీ, అతని సైన్యాన్నీ నిరాటంకంగా నది దాటనిద్దాం, లేకపోతే మన పడవలతో అటకాయింతాం,'' అన్నాడు. గుహుడు ఈ కట్టుదిట్టాలు చేసిన అనంతరం రకరకాల ఫలాలూ, తేనే కానుకగా తీసుకుని భరతుడి వద్దకు వెళ్ళాడు.

గుహుడు వస్తూండటం ముందుగానే తెలుసుకుని సుమంత్రుడు భరతుడితో, ``నిన్ను చూడటానికి బోయ రాజైన గుహుడు వస్తున్నాడు. ఇతను బలవంతుడు, సమర్థుడు, రాముడికి మంచి స్నేహితుడు. అతన్ని తగిన విధంగా గౌరవించి నట్టయితే రామలక్ష్మణులు అరణ్యంలో ఎటు వెళ్ళారో వారి జాడకూడా తెలుస్తుంది,'' అన్నాడు. ``అయితే ఆ గుహుణ్ణి వెంటనే నా దగ్గిరికి తీసుకురా,'' అని భరతుడు సుమంత్రుణ్ణి పంపాడు. గుహుడు భరతుడి సమక్షానికి వచ్చి, తాను తెచ్చిన కానుకలు ఇచ్చి, ``తమరు వస్తారని ముందుగా తెలిసివుంటే మంచి ఆతిథ్యమూ, స్వాగతమూ ఏర్పాటు చేసి ఉండేవాణ్ణి. ఈ రాత్రికి మా ఆతిథ్యం స్వీకరించి రేపు ముందుకు సాగిపోదురు గాని,'' అన్నాడు.

భరతుడు గుహుడికి సంతోషం కలిగేటట్టుగా, ``రాజా, ఇంత సేనకు నీవు ఒక్కడివే ఆతిథ్యం ఇస్తానన్నావు. ఆ మాటకన్న మాకు నీ నుంచి హెచ్చు గౌరవం ఇంకేం కావాలి? మేము భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్ళాలి, దారి చెప్పగలవా? ఇక్కడి నుంచి దారి చాలా కష్టమని విన్నాను,'' అన్నాడు. ``బాణాలు ధరించి మా బోయలు మీ వెంట వస్తారు లెండి. నేను కూడా వెంట ఉంటాను. అందుచేత మీకు దారి వెతుక్కునేపని ఉండదు,'' అన్నాడు గుహుడు.










అయోధ్యకాండ-8










గుహుడు భరతుడికి సహాయం చేస్తానన్నాడేగాని, లోలోపల అతన్ని సందేహం ఇంకా బాధిస్తూనే ఉన్నది. అతడు భరతుడితో, ``అయ్యా, నీ సేనా, అట్టహాసమూ చూస్తే నాకేదో అనుమానంగా ఉన్నది. నీవు వెళ్ళేది రాముడికి ద్రోహం తలపెట్టి కాదు గద?'' అని అడిగాడు. ఈ మాటకు భరతుడు బాధపడి, ``నీకీ అనుమానం కలగటం కన్న పెద్ద కష్టం నా కేమి ఉంటుంది? పెద్ద అన్న అయిన రాముడు నాకు తండ్రితో సమానం కాదా? రాముణ్ణి తీసుకురావటానికే నేను పోతున్నాను.

నా మాట నము్మ,'' అన్నాడు. ``మంచిమాట అన్నావు, బాబూ. నీలాగా చేతికందిన రాజ్యాన్ని విడిచిపుచ్చే వాళు్ళ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. నీ కీర్తి శాశ్వతం,'' అన్నాడు గుహుడు. అస్తమయమై చీకటి పడింది. ఆ రాత్రి భరతశత్రుఘు్నలు పడుకుని నిద్రపట్టక చాలా సేపు రాముణ్ణి గురించి చాలా దుఃఖించారు. వారి వెంట ఉన్న గుహుడు వారిని ఓదార్చాడు. అతడు లక్ష్మణుణ్ణి గురించి గొప్పగా చెప్పాడు: ``రాముడు నిద్రపోతున్నప్పుడు తాను మేలుకునే ఉండి రాముడికి ఏ భయమూ లేకుండా కాపాడతాను, నిద్రపొమ్మని చెప్పాను.

కాని విన్నాడుకాడు. రాముడూ, సీతా కటిక నేలపై పడుకున్నందుకే తన ప్రాణాలు కొట్టుకుపోతూ ఉంటే ఇక నిద్ర ఎలా పడుతుందని అడిగాడు. రాముణ్ణి వదిలి దశరథుడు ఒక్క రోజు బతుకుతాడా అన్నాడు. పధ్నాలుగేళు్ళ వనవాసం చేసి మేము మళ్ళీ అయోధ్యకు తిరిగిపోతామా అని చింతించాడు. అదుగో, ఆ మర్రిచెట్టు కిందనే రామలక్ష్మణులు జడలు ధరించారు.

తెల్లవారినాక నేను వారి చేత గంగ దాటించాను.'' గుహుడు ఈ విధంగా చెప్పుకుపోతూ ఉంటే భరతుడికి దుఃఖం హెచ్చిపోయింది. కన్నీటి ధారలను ఆపుకోలేక పోయాడు. కౌసల్యా, సుమిత్రా, కైకా కూడా అతనున్న చోటికి వచ్చారు. వారి ఆసక్తి చూసి గుహుడు వారితో రాముణ్ణి గురించి ప్రతి వివరమూ చెప్పాడు. సీతారాములు గారచెట్టు కింద పడుకున్న చోటుకూడా చూపాడు.

దశరథ మహారాజు పెద్దకొడుకు ఆ చెట్టు కింద దర్భలు పరుచుకుని పడుకోవటం భరతుడు ఊహించనైనా లేకపోయాడు. ఆ రాత్రి గడిచినాక గుహుడు సూర్యోదయమవుతూండగా వచ్చి భరతుడికి నమస్కారంచేసి, ``రాత్రి సుఖంగా గడిచిందా? హాయిగా నిద్రపోయారా?'' అని అడిగాడు. ``మాకు ఏలోటూ జరగలేదు. మేము త్వరగా మా అన్న రాముణ్ణి చూడాలి.

మమ్మల్ని త్వరగా నది దాటించే ఏర్పాట్లు చేయించు,'' అన్నాడు భరతుడు. గుహుడు అయిదువందల పడవలూ, స్వస్తికాలనే పేరు గల మేలుజాతి ఓడలూ సిద్ధం చేయించాడు. తెల్ల కంబళి పరిచిన ఒక స్వస్తికంలో భరతశత్రుఘు్నలూ, వసిష్ఠుడూ, రాజభార్యలూ ఎక్కారు. భరతుడి సేనా, రథాలూ, బళూ్ళ, వాటినిలాగే జంతువులూ, సంబారాలూ, సమస్తమూ పడవలలోకి ఎక్కించారు. పడవలు నది దాటాయి. ఏనుగులు నదికి అడ్డంగా ఈదాయి. అలాగే కొందరు మనుషులుకూడా ఈదారు. మరి కొందరు తెప్పలమీదా, కుండల సహాయం తోనూ నది దాటారు.

తరవాత భరతుడు ప్రయాగవనానికి సపరివారంగా చేరుకుని, వసిష్ఠాదుల సల హాతో భరద్వాజ మహర్షిని చూడ బయలుదేరాడు. భరద్వాజాశ్రమం కోసు దూరంలో ఉందనగానే సైన్యమంతా ఆగి పోయింది. భరతుడు తన ఆయుధాలూ, ఆభరణాలూ తీసివేసి, పట్టుబట్టలు కట్టుకుని, వసిష్ఠుణ్ణీ, మంత్రులనూ వెంటబెట్టుకుని ఆశ్రమానికి వెళ్ళాడు. మంత్రులు ఆశ్రమంలో నిలిచిపోయారు. వసిష్ఠ భరతులు భరద్వాజుడి కుటీరానికి వెళ్ళారు. వారిని చూస్తూనే భరద్వాజుడు, ``అర్ఘ్యం తీసుకు రండి,'' అని కేక పెట్టి లేచి నిలబడ్డాడు.

భరతుణ్ణి వసిష్ఠుడు పరిచయం చేసినాక భరద్వాజుడు క్షేమసమాచారాలడిగి, ``నాయనా, నీవు హాయిగా రాజ్యపాలన చేసుకోక ఇలా ఎందుకు వచ్చావు?'' అన్నాడు. భరతుడు రామలక్ష్మణులకు ద్రోహం తలపెట్టి వచ్చాడన్న అనుమానం ఆయనకుకూడా కలిగింది. భరతుడిందుకు మనసులో ఎంతో నొచ్చుకుని, గుహుడికి చెప్పినట్టే భరద్వాజుడితో కూడా తన ఉద్దేశం చెప్పాడు. అంతా విని భరద్వాజుడు సంతోషించి, ``సీతారామలక్ష్మణులు చిత్రకూటంలో ఉంటున్నారు.

ఇవాళ ఇక్కడ ఉండి, రేపు పోదువుగాని,'' అన్నాడు. ఇందుకు భరతుడు సమ్మతించాడు. ``నీ సేనలకన్నిటికీ నేను విందు చేయాలనుకుంటున్నాను. వారి నందరినీ దూరాన ఎందుకు ఉంచి వచ్చావు? ఇక్కడికి వారిని కూడా నీ వెంట తేవలిసింది,'' అన్నాడు భరద్వాజుడు. ``మహాత్మా, ముని ఆశ్రమాలకు సేనలు దూరంగా తొలగివెళ్ళాలన్న నియమాన్ని బట్టి సేనను దూరంగా ఉంచాను,'' అని భరతుడు సవినయంగా చెప్పాడు. ``ఫరవాలేదు, నీ సేనను పిలిపించు,'' అని భరతుడితో చెప్పి భరద్వాజుడు తన అతిథులకు అపూర్వమైన ఆతిథ్యం ఏర్పాటుచేశాడు.

విశ్వకర్మ వచ్చి క్షణంలో అద్భుతమైన ఇళు్ళ ఏర్పాటుచేశాడు. నదులన్నీ వచ్చి నీరూ, మైరేయం అనే సుమధర పానీయం సిద్ధం చేశాయి. దిక్పాలకులు పిలిపించబడ్డారు. పాటలు పాడటానికి విశ్వావసువూ, హాహా, హూహూ, అనే గంధర్వులూ, అనేకమంది అప్సరసలూ పిలిపించబడ్డారు. చంద్రుడు వచ్చి చతుర్విధాన్నాలూ పుష్పమాలలూ, పానీయాలూ, సుమధుర ఫలాలూ సిద్ధంచేశాడు. మయుడు నిర్మించిన అద్భుతమైన భవనాలలో ఒక రాజగృహంలాటిది భరతుడికి ప్రత్యేకించబడింది. అందులో సింహాసనంతో కూడిన విశాలమైన రాజసభ ఉన్నది.

భరతుడు అక్కడి అందమైన సింహాసనం మీద కూచోక మంత్రుల ఆసనం పైన కూచుని, తన పరివారాన్నీ, గుహుణ్ణీ యథోచితస్థానాలలో కూచోబెట్టాడు. బ్రహ్మదేవుడూ, కుబేరుడూ, దేవేంద్రుడూ తలా ఒక ఇరవైవేల మంది అప్సరసలను పంపారు. భరతుడు కొలువుతీరి ఉండగా నారద తుంబుర గోపులనే గంధర్వ రాజులు గానం చేశారు. అలంబుస, మిశ్రకేశి, పుండరీక, వామన అనే అప్సరసలు భరతుడి ముందు నృత్యం చేశారు.

భరధ్వాజాశ్రమంలో గల చెట్లూ, పొదలూ, లతలూ స్త్రీ రూపాలు ధరించి భరతుడి సైనికులకు భక్తి శ్రద్ధలతో చక్కటి అతిథి మర్యాదలు చేశాయి. సైనికులు రుచికరమైన భోజనాలు చేసి ఆనందించారు. వారిచ్చిన అతిథిసత్కారాలతో మైమరిచి, ``మేము అయోధ్యకూ పోము, దండకారణ్యానికి పోము, ఇక్కడే ఉంటాము. రాముడూ, భరతుడూ క్షేమంగా ఉంటారుగాక!'' అన్నారు. కొందరు పూల మాలలు ధరించి అటూ ఇటూ పరిగెత్తారు, పాటలు పాడారు, నృత్యాలుకూడా చేశారు.

రకరకాల వంటకాలతో, పాయసంతో, మజ్జిగ పెరుగులతో దివ్యంగా తయారు చేసిన ఆహారాన్ని ఎంతతిన్నా వారికి తనివి తీరలేదు. ఆ రాత్రి అలా గడిచిపోయింది. మర్నాడు భరతుడు భరద్వాజుడి దర్శనం చేసుకుని, తమకు జరిగిన ఆతిథ్యానికి కృతజ్ఞత చెప్పుకుని, రాముణ్ణి చేరటానికి మార్గం అడిగాడు. చిత్రకూటానికి వెళ్ళటానికి దక్షిణంగా ఒక మార్గమూ, నైరృతీ దిశగా ఒక మార్గమూ ఉన్నాయనీ, సేనలు నడవటానికి ఏది యోగ్యమో చూసుకుని వెళ్ళమనీ భరద్వాజుడు సలహా ఇచ్చాడు.

దశరథుడి భార్యలు ముగ్గురూ మునికి మొక్కారు. భరతుడు తగిన రీతిగా వారిని మునికి పరిచయం చేశాడు. తన తల్లిని పరిచయం చేసేటప్పుడు అతను పరుషంగా మాట్లాడుతూ, కోపంతో దహించుకు పోయాడు. అనుకోకు. అందువల్ల ముందు ముందు చాలా లాభం కలుగుతుంది,'' అన్నాడు. తరవాత భరతుడు భరద్వాజముని వద్ద యథోచితంగా సెలవు తీసుకుని తన బలగంతో చిత్రకూటానికి బయలుదేరాడు.

వారు చివరకు మందాకినీ నదినీ, దానికి దక్షిణంగా ఉన్న చిత్రకూట పర్వతాన్నీ చేరవచ్చారు. రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నదీ జాడ తెలుసుకు రమ్మని భరతుడు సైనికులను పంపాడు. కొందరు సైనికులు అడవి ప్రవేశించి ఒక చోట పొగ వస్తూండటం గమనించి ఆ సంగతి భరతుడితో చెప్పారు. ఆ పొగ వచ్చేచోట ఎవరో ఉన్నారు. అయితే వారు రామలక్ష్మణులు కావాలి. లేదా రామలక్ష్మణుల జాడ ఎరిగిన మునులైనా కావాలి.

భరతుడు సేనను నిశ్శబ్దంగా ఉండమని హెచ్చరించి, సుమంత్రుణ్ణీ, వసిష్ఠుణ్ణీ మాత్రమే వెంట తీసుకుని సైనికులు చెప్పిన దిక్కుగా బయలుదేరాడు. రాముడు చిత్రకూటానికి వచ్చి అప్పటికి నెల అయింది. ఈ రోజే అతను తన పర్ణశాల విడిచి సీతతో సహా కొండ మీద విహరించటానికి బయలుదేరాడు. చిత్రకూటపర్వతం చాలా అందమైనది. అక్కడి చెట్లూ, పక్షులూ, మృగాలూ, చిత్రవిచిత్రమైన ధాతువులూ, పక్కనే గలగలా ప్రవహించే మందాకినీ నదీ, మనోహరమైన దృశ్యాలూ చూస్తూ వారిద్దరూ చాలాసేపు విహరించారు. రాముడు సీతతో, ``నీవూ, లక్ష్మణుడూ నా వెంట ఉంటే ఈ దృశ్యాలు చూసి ఆనందిస్తూ ఎన్ని ఏళ్ళయినా ఇక్కడే ఉండి పోగలను,'' అన్నాడు.

ఇలా చాలాసేపు విహరించిన పిమ్మట సీతారామలక్ష్మణులు ఒక చోట కూచున్నారు. రాముడు కులాసాగా కబుర్లు చెబుతూ సీత చేత సుమధుర ఫలాలు తినిపించాడు. అదే సమయంలో రాముడికి పరిగెత్తిపోతున్న అడవి ఏనుగులు కనిపించాయి. అవి చేసే అరుపులు వింటే భయపడి పరిగెత్తుతున్నట్టు కనబడ్డాయి. నిజానికవి భరతుడి వెంట ఉండే సేనను చూసి బెదిరినవే. అప్పటికి రాముడు లక్ష్మణుడితో, ``చూడు, లక్ష్మణా! ఏనుగులూ, ఎనుబోతులూ, సింహాలూ కూడా బెదిరి పారిపోతున్నాయి. అటువైపు ఎవరైనా రాజు వేటాడుతున్నాడా? లేక ఈ అడవి మృగాలను మించిన క్రూర మృగ మేదైనా వచ్చిందా? కారణ మేమిటో చూడు!'' అన్నాడు.

లక్ష్మణుడు ఎత్తయిన చెట్టెక్కి అన్ని దిక్కులా ఒకసారి కలయజూసే సరికి ఉత్తర దిక్కుగా పెద్ద సేన కనబడింది. అతను రాముడితో, ``ఏదో పెద్ద సేన మనకేసి వస్తున్నది వెంటనే అగ్ని చల్లార్చి, సీతను గుహలో భద్రంగా దాచి, కవచం తొడిగి, ధనుర్బాణాలు తీసుకో,'' అన్నాడు. ``సరిగా పరిశీలించి చూడు, లక్ష్మణా! అలా వస్తున్నది ఎవరి సేనలాగుంది?'' అన్నాడు రాముడు.

లక్ష్మణుడు సేన మధ్య కనిపించే రథాలకు కట్టిన ధ్వజాలను గుర్తించి, ``భరతుడు తల్లి ధర్మమా అంటూ రాజ్యాభిషేకం చేసుకుని, అంతటితో తృప్తిచెందక తన రాజ్యం నిష్కంటకం చేసుకోవటానికై మనని చంపటానికి సేనలతో వస్తున్నాడు-మనం పర్వతం మీద దాక్కుందామా? లేక యుద్ధ సన్నద్ధులమై ఇక్కడే ఉందామా?'' అని రాముణ్ణి అడిగాడు కోపంగా. అతను అంతటితో ఆగక, ``ఇప్పుడు భరతుడు మనకు చిక్కబోతున్నాడు. మనకీ కష్టాలన్నీ తెచ్చి పెట్టిన ఈ భరతుణ్ణి తప్పక చంపేస్తాను.

అందులో తప్పేమీ లేదు. పైగా భరతుడు చస్తే నీవు హాయిగా రాజువు కావచ్చు. కైకేయినీ, ఆ మంథరనూ, వాళ్ళవాళ్ళ నందరినీ కూడా చంపేస్తాను. అటువంటి పాపులు బతికి ఉండరాదు,'' అన్నాడు. ఈ మాటలు విని రాముడు తన తము్మణ్ణి మెత్తగా చివాట్లు పెట్టాడు: ``తనకుతానై భరతుడు మనను చూడవస్తూంటే యుద్ధం చేస్తానంటావేమిటి? తండ్రి మాట నిలబెట్టటానికి ఇక్కడికి వచ్చినవాణ్ణి, భరతుణ్ణి చంపేసి లోకనిందకు పాలుకమ్మంటావా? కొంచెం నష్టం కలగగానే తండ్రినీ, తము్మలనూ చంపుకుంటారా? భరతుణ్ణి ఎందుకు శంకిస్తున్నావు? అతను ఎన్నడైనా అనుమానించదగిన మాటలైనా నీతో అన్నాడా? అతను మామగారి ఇంటి నుంచి అయోధ్యకు వచ్చి, మన సంగతి విని మనని తిరిగి తీసుకుపోయే ఉద్దేశంతో వస్తూ ఉంటాడని నా నమ్మకం. నీకు నిజంగా రాజ్యకాంక్ష

ఉంటే చెప్పు, భరతుడు రాగానే రాజ్యం నీకిమ్మంటాను. అతను నా మాట కాదనడు.'' ఈ మాటలకు లక్ష్మణుడు సిగ్గుపడితల వంచుకుని, ``మన తండ్రే మనని చూడటానికి వస్తూ ఉండవచ్చు,'' అని మాట మార్చాడు. రాముడు లక్ష్మణుణ్ణి చెట్టు దిగి రమ్మన్నాడు. లక్ష్మణుడు దిగి వచ్చాడు.










అయోధ్యకాండ-9






లోపుగా భరతుడు రామాశ్రమాన్ని అంతదూరంలో చూసి, తన తల్లులను తీసుకు రమ్మని వసిష్ఠుడికి చెప్పి, సుమంత్రుణ్ణీ, శత్రుఘు్నణ్ణీ వెంటబెట్టుకుని ముందుకు వచ్చాడు. పర్ణశాల పరిసరాలలో మార్గం తెలిపే గుర్తులూ, ఎత్తుగా పేర్చిన కట్టెలూ, పిడకల పోగులూ, చెట్లకు గుర్తుగా కట్టిన పేలికలూ ఉన్నాయి. త్వరలోనే భరతుడు పర్ణశాలను సమీపించి, దానికి ఈశాన్యాన అగ్ని వేదికను చూశాడు. తరవాత పర్ణశాలలో తాపసి వేషంలో ఉన్న రాముణ్ణి చూశాడు. పక్కనే సీతా లక్ష్మణులున్నారు.

రాముణ్ణి చూడగానే భరతుడికి పుట్టెడు దుఃఖం వచ్చింది. అతను రాముడి దగ్గిరికి పరిగెత్తుకుపోయి, కన్నీరు కారుస్తూ, రాముడి పాదాలు కనబడక నేలపై బోర్లాపడ్డాడు. అతని నోట మాట రాలేదు. శత్రుఘు్నడు కూడా ఏడుస్తూ రాముడి కాళ్ళకు వందనం చేశాడు. రాముడు భరతశత్రుఘు్నల నిద్దరినీ కౌగలించుకుని కన్నీరు కార్చాడు. అతను భరతుడిపై ప్రశ్నల వర్షం కురిపించాడు: ``నాయనా, చాలా కాలానికి నిన్ను చూశాను. మారిపోయావు. గుర్తించ లేక పోయాను.

చాలా సంతోషం. ఇప్పుడెందు కిలా ఈ అరణ్యానికి వచ్చావు? నాయనగారు విచారం లేకుండా ఉన్నారా? తల్లులందరూ క్షేమమా? నీవు రాజధర్మాలు చక్కగా పాటిస్తూ పరిపాలన చేస్తున్నావా? నీ రాజ్యం ఎవరూ అపహరించలేదు గద? మంత్రులు అన్ని వేళలా తగిన సలహాలు ఇస్తూ నీకు సహాయంగా ఉంటున్నారా?''

భరతుడు రాజ్యాభిషేకం చేసుకున్నాడనుకుని రాముడు వేసిన ప్రశ్నలన్నిటికీ సమాధానంగా, ``అన్నా, మన వంశంలో పెద్ద కొడుకుండగా చిన్నవాడు అభిషేకించుకునే ఆచారం ఎన్నడన్నా ఉన్నదా? పెద్దవాడివైన నువు్వండగా చిన్నవాడినైన నేనెలా రాజ్యాభిషేకం చేసుకోగలను? నా వెంట అయోధ్యకు వచ్చి రాజ్యాభిషేకం చేసుకుని, మన వంశాన్ని తరింపజెయ్యి. ఇప్పుడు మన తండ్రి కూడా లేడు.

నే నింకా కేకయరాజు నగరంలో ఉండగానే ఆయన పోయాడు. నీవూ, సీతా, లక్ష్మణుడూ వెళ్ళిపోయిన దుఃఖం ఆయనను తన పొట్టన పెట్టుకున్నది. ముందు తండ్రిగారికి జల తర్పణాలు చెయ్యి. నిన్నే తలచుకుంటూ పోయిన ఆత్మకు నీ జలతర్పణాలే ఫల ప్రదమవుతాయి,'' అన్నాడు. తండ్రి మరణవార్త విని రాముడు మూర్ఛపోయాడు.

సీతా భరత లక్ష్మణ శత్రుఘు్నలు చన్నీరు చల్లి రాముడికి మూర్ఛ తెలిసేటట్టు చేశారు. రాముడి విచారానికి అంతులేదు. తన కోసం దుఃఖించి తండ్రి చనిపోయినందుకూ, ఆయనకు తాను ఉత్తరక్రియలు చెయ్యనందుకూ తనను తాను తిట్టుకున్నాడు. తరవాత అతను తండ్రికి ఉదకదానం చెయ్యటానికి బయలుదేరుతూ,స్త్రీలూ పిల్లలూ ముందు నడవాలి గనక, సీతనూ లక్ష్మణుణ్ణీ తనకు ముందుగా నదికి బయలుదేరమన్నాడు.

సీతారామలక్ష్మణులు మందాకినీ నది రేవులో స్నానాలుచేసి దశరథుడికి నీళు్ళ వదిలారు. తరవాత రాముడు తండ్రికి సపిండీకరణం చేశాడు. గార గానుగుపిండిని రేగుపళ్ళతో కలిపి ముద్దలుచేసి దర్భలపై ఉంచాడు. తరవాత వారు ముగ్గురూ పర్ణశాలకు తిరిగివెళ్ళారు. అంతవరకూ దూరాన ఉండిపోయిన జనం పర్ణశాల నుంచి రోదన ధ్వనులు వినగానే అటుకేసి పరిగెత్తుకుంటూ వచ్చి మునివేషంలో ఉన్న రాముణ్ణీ, అతని తము్మలనూ, సీతనూ ఒక్క చోట చూశారు.

రాముడికి కొందరు నమస్కారాలు చేశారు. కొందరిని రాముడాలింగనం చేసుకున్నాడు. ఈ లోపల దశరథుడి భార్యలు వసిష్ఠుడి వెంట మెల్లగా నడుచుకుంటూ మందాకిని ఒడ్డు మీదుగా పర్ణశాల కేసి వచ్చారు. వారికి స్నానాలరేవూ, దానికి ఎడంగా రాముడు తండ్రి నిమిత్తం పెట్టిన పిండాలూ కనిపించాయి. కౌసల్య సుమిత్రతో, ``మన వాళు్ళ ఇక్కడే స్నానం చేస్తారు కాబోలు.

నీ కొడుకు రాముడి కోసం ఇక్కడినుంచే నీళు్ళ తీసుకుపోతాడు కాబోలు. ఇక లక్ష్మణుడి కష్టాలు తీరాయిలే. భరతుడు రాముణ్ణి తీసుకువచ్చి రాజ్యాభిషేకం చేయిస్తున్నాడుగా! ఈ గార గానుగుపిండి ముద్దలు చూశావా? భూమండలమంతా ఏలిన దశరథ మహారాజుకు ఈ ముద్ద లేమిటి, ప్రారబ్ధంగాకపోతే? పాపం, రాముడిదే తింటున్నాడు కాబోలు.

తలుచుకుంటే నా గుండె పగి లిపోతున్నది!'' అన్నది వచ్చే దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంటూ. వారు పర్ణశాల చేరగానే రాముడు లేచి ముగ్గురు తల్లులకూ సాష్టాంగ నమస్కారం చేశాడు. సీత కూడా వారికి నమస్కరించి ఎదురుగా నిలబడింది. వనవాసంతో చిక్కి పోయి ఉన్న సీతను కౌసల్య కౌగలించుకుని, ``జనకమహారాజు కూతురూ, దశరథ మహారాజు కోడలూ అయి ఉండి నీకీ వనవాసం గతి పట్టిందా, తల్లీ?'' అని ఎంతగానో వాపోయింది. రాముడూ, వసిష్ఠుడూ దగ్గిరగా కూచున్నారు.

రాముడికి మరొక పక్కగా భరతుడూ, మంత్రులూ, పురప్రముఖులూ మౌనంగా కూచున్నారు. భరతుడు తాను వచ్చినపని బయట పెట్టే సమయం వచ్చింది. అతడు ఎలా మొదలు పెడతాడా అని అందరూ ఆత్రంగా వింటున్నారు. రాముడే విషయం కదిపాడు. ``భరతా, నీవు జడలూ, నారబట్టలూ, కృష్ణాజినమూ ధరించి మునికుమారుడిలా ఈ అరణ్యానికి రావటానికి కారణ మేమిటి? వినాలని ఉన్నది,'' అన్నాడతను. భరతుడిలా చెప్పాడు: ``మన తండ్రి నిన్ను అడవికి పంపి నీ వియోగం భరించ లేక కాలధర్మం చెందాడు.

ఆయన ఈ పాపపు పని చేయటానికి ప్రేరణ ఇచ్చినది నా తల్లి కైకేయి. అందుకామె ఘోరనరకం ఎలాగూ అనుభవిస్తుంది. ఆమె కొడుకునైన నన్ను నీవు అనుగ్రహించాలి. వచ్చి రాజ్యాభిషేకం చేసుకో. ఇందుకే మన తల్లులూ, ఈ ప్రజలూ కూడా నిన్ను వెతుక్కుంటూ నావెంట వచ్చారు. వారి కోరిక తీర్చు. ఇంతమంది కోరికను తోసిపుచ్చకు.'' ఈ మాటలు చెప్పి భరతుడు తన తల రాముడి పాదాలకు తగిలేలాగా సాష్టాంగ పడ్డాడు. రాముడు భరతుణ్ణి కౌగలించుకుని నిట్టూర్చుతూ, ``నాయనా, నీవు చిన్నతనం చేత నీ తల్లిని నిందించావు.

పెద్దవారికి చిన్నవారిని ఎలా శాసించటానికైనా అధికారం ఉన్నది. దశరథుడికి నన్ను అడవికి పంపే అధికారం ఉన్నది. తండ్రి మీద లాగే తల్లి మీదా గౌరవం ఉంచాలి. పెద్దలు నన్ను అడవికి పొమ్మంటే నేను రాజ్యం ఎలా చేస్తాను? నీవు అయోధ్యకు వెళ్ళి రాజ్యం చెయ్యాలి, నేను నారబట్టలు కట్టి వనవాసం చెయ్యాలి. ఇది మన తండ్రి ప్రజల సమక్షంలో ఏర్పరచిన నియమం. పధ్నాలుగేళూ్ళ వనవాసం ముగించినాక తిరిగివచ్చి తండ్రి ఆజ్ఞ ప్రకారం రాజ్యం చేస్తాను.

తండ్రి ఆనతి నెరవేర్చటంకంటె నాకు రాజ్యం ఏలటం ఎక్కువైనది కాదు,'' అన్నాడు. భరతుడి నోట మాటలు రాక అలాగే ఉండిపోయాడు. ఆ రాత్రి అలాగే గడిచిపోయింది. మర్నాడు అందరూ స్నానాలూ, జపహోమాలూ పూర్తిచేసి మళ్ళీ రాముడి చుట్టూ చేరారు. ఎవరూ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దం మధ్య భరతుడు రాముడితో, ``నా తల్లిని గౌరవించి, నాకు రాజ్యం ఇచ్చావు. దాన్ని నీకిస్తున్నాను, తీసుకుని సుఖంగా ఏలుకో.

ఈ రాజ్యభారం మొయ్యటానికి నీవే సమర్థుడవు. గుర్రంలాగా గాడిద నడవలేదు గదా! మన తండ్రి నీకు చిన్నతనం నుంచీ ఎంతో శ్రమపడి రాజుకు అవసరమైన శిక్షణ ఇచ్చాడు. నీవు రాజువు కాకుండాపోతే, ఆయన పడిన శ్రమ అంతా వృథా అవుతుంది,'' అన్నాడు. భరతుడు చెప్పిన ఈ మాటలకు చుట్టూ చేరినవారంతా ఎంతో సంతోషం వెలిబుచ్చి, ప్రశంసించారు.

అప్పుడు రాముడు భరతుడికి కొంత తత్వబోధ చేశాడు: ప్రాణులకు మరణం నిత్యం. మనిషి ఏ పని చేస్తున్నా ఒక్కొక్క క్షణమే మృత్యువు దగ్గిరపడుతూ ఉంటుంది. ముసలివాడై అసమర్థుడైనవాడు చేయగలది లేదు; యౌవనం ఉండగానే ఆత్మవిచారం చెయ్యాలి. గడచిన క్షణం మరి రాదు. చనిపోయినవారి కోసం ఎంత చింతించీ లాభంలేదు.

ఏ ప్రాణి కూడా తన ఇష్టంవచ్చినట్టు నడుచుకోలేదు. దశరథుడు ఎన్నో పుణ్యకార్యాలు చేసి స్వర్గానికి వెళ్ళాడు. అందుచేత భరతుడు మనోవైకల్యం మాని తండ్రి ఆజ్ఞను శిరసావహించి, తండ్రి జాడలలోనే నడుచుకుంటూ రాజ్యం చెయ్యటం ధర్మం. అలాగే రాముడు తండ్రి ఆజ్ఞ మీరక వనవాసం జరపటం ధర్మం. అంతా విని భరతుడు, ``నేను ధర్మానికి వెరిచే నా తల్లిని శిక్షించలేదు. తండ్రిని బహిరంగంగా దూషించలేదు.

కాని ఆయన తన భార్యకు దాసుడై, ఆమె విషం తాగుతానంటే బెదిరి, రాజ్యం చేయవలసినవాణ్ణి అరణ్యానికి పంపటం అధర్మం కాదా? తండ్రి చేసిన అన్యాయాన్ని సరిచేసి తండ్రికి నరకప్రాప్తి కలగకుండా కొడుకు చూడవద్దా? వచ్చి రాజ్యంచేసి, తండ్రి చేసిన అన్యాయాన్ని సరిచెయ్యి,'' అన్నాడు. రాముడు ఇందుకెంత మాత్రమూ ఒప్పుకో లేదు. కైకేయిని పెళ్ళాడేటప్పుడు దశరథుడు తన మామగారితో ఆమెకు పుట్టే కొడుకుకే పట్టం కడతానని మాట ఇచ్చిన సంగతి చెప్పాడు.

అప్పుడు అక్కడ ఉన్నవారిలో జాబాలి అనే బ్రాహ్మణుడు రాముడితో, ``వెర్రివాడా? ఎవరు తండ్రి? ఎవరు కొడుకు? చచ్చిపోయిన వారి తృప్తి కోసం తద్దినాలు పెట్టేవాళూ్ళ, ఈ లోకంలో కష్టాలుపడేవాళూ్ళ మూఢులు. పరలోకం ఎక్కడున్నది? నీవు వెళ్ళి హాయిగా రాజ్యంచేసి సుఖపడు. ప్రతి ప్రాణీ ఒంటరిగా పుట్టుతుంది, ఒంటరిగా చస్తుంది.

బతికున్నంత కాలమూ ఈ ప్రపంచం ఒక మజిలీ. ఇదే నిజం, మిగిలినదంతా భ్రమ,'' అన్నాడు. ``ఇవి నాస్తికులనవలిసిన మాటలు. నీవు నాస్తికుడవని తెలియక మా తండ్రి నిన్ను చేరదీశాడు,'' అని రాముడు జాబాలిని నిందించాడు. వసిష్ఠుడు అడ్డువచ్చి, ``నాయనా, జాబాలి నాస్తికుడు కాడు. నీచేత రాజ్యాభిషేకానికి ఒప్పించటానికే అతను అలా చెప్పాడు,'' అన్నాడు. వసిష్ఠుడు కూడా పట్టం కట్టుకోమని రాముడికి ఎంతగానో చెప్పాడు.

కాని రాముడు తన నిశ్చయాన్ని మార్చుకోలేదు. అప్పుడు భరతుడు సుమంత్రుడితో, ``వెంటనే వెళ్ళి దర్భలు తెచ్చి ఈ పర్ణశాల వాకిలికి అడ్డంగా పరు. రాముడు నా కోరిక తీర్చేదాకా నేను వాటిపై పడుకుని లేవను,'' అన్నాడు. సుమంత్రుడు, ``ఏం చెయ్యమంటావు?'' అన్నట్టు రాముడి కేసి చూశాడు. అది గమనించి భరతుడు తానే స్వయంగా వెళ్ళి దర్భలు తెచ్చి, వాటిని పర్ణశాల వాకి లికి అడ్డంగా పక్కవేసుకుని అలాగే పడుకున్నాడు. అది చూసి రాముడు భరతుడితో, ``నాయనా, ఈ పనిచేసేవారు అప్పులు వసూలు చేసుకోలేకపోయిన బ్రాహ్మణులు.

ఇది క్షత్రియులు చేసేపని కాదు. అదీగాక నేను నీకేమి ద్రోహం చేశానని వాకిలికి అడ్డం పడుకుంటావు? లే, నా మాట విని అయోధ్యకు తిరిగి వెళ్ళిపో,'' అన్నాడు. భరతుడు దర్భల మీది నుంచి లేవకుండానే చుట్టూ మూగిన జనాన్ని చూసి, ``మీరందరూ ఊరుకుంటారేం? రాముడికి చెప్పరేం?'' అని అడిగాడు. ``రాముడు తండ్రి ఆజ్ఞ పాలించి తీరాలని పట్టుపడుతున్నప్పుడు చేసేదేముందీ?'' అన్నారు వారందరూ.






అయోధ్యకాండ-10










భరతుడు రాముడి ఆజ్ఞానుసారం లేచి జలం స్పృశించి రాముణ్ణి తాకి అందరితోనూ ఈ విధంగా అన్నాడు : ``మీరంతా వినండి. నేను నా తండ్రిని రాజ్యం కోర లేదు, నా తల్లినీ కోరలేదు. రాముడడవికి వెళ్ళటం నాకు సమ్మతంకాదు. రాముడి బదులు నేను పధ్నాలుగేళూ్ళ వనవాసం చేస్తాను; నాకు బదులు రాముణ్ణి రాజ్యం చెయ్యమనండి.

తండ్రి ఆజ్ఞ పాలించినట్టవుతుంది.'' ఈ మాటలు విని రాముడు నిర్ఘాంత పోయి, ``ఇలా రాజ్యాన్ని, వనవాసాన్ని మార్పు చేసుకోవటం పితృవాక్య పరిపాలన ఎలా అవుతుంది? నేను వనవాసం చెయ్యటం మాని రాజ్యం ఏలటం కన్న ఘోరమైన తప్పు ఉండదు. ఈ పధ్నాలుగేళూ్ళ పూర్తికాగానే నేనూ, భరతుడూ కలిసి రాజ్యంచేస్తాం,'' అన్నాడు. చుట్టూ చేరిన వారు రాముడి మాటలకూ, భరతుడి మాటలకూ కూడా సంతోషించారు.

వారు భరతుడితో, ``నాయనా, రాముడు చెప్పినట్టు చెయ్యి, అతన్ని తండ్రి రుణం తీర్చుకోనీ!'' అన్నారు. రాముడు సంతోషించాడు గాని భరతుడి గుండెలో రాయిపడింది. చివర కతను రాముణ్ణి పాదుకలిమ్మని అడిగాడు. రాముడు ఆ పాదుకలను కాళ్ళకు వేసుకుని భరతుడికి ఇచ్చాడు.

భరతుడు రాముడితో, ``నువు్వ కాకపోతే నీ పాదుకలే లోకాన్ని రక్షిస్తాయి. నేను మునివేషంతో, ఫల మూలాలు తింటూ, రాజ్యభారం ఈ పాదుకలకు అప్పగించి, ఊరి బయట ఉండి నీ రాక కోసం నిరంతరం ఎదురు చూస్తూ ఉంటాను.

పధ్నాలుగేళూ్ళ దాటిన మర్నాడు నువు్వ రాకపోయావో, మరుక్షణమే తప్పక అగ్నిప్రవేశం చేస్తాను,'' అన్నాడు వినయంగా. రాముడిందుకు సరేనని, భరతుణ్ణి ఆప్యాయంగా కౌగలించుకుని, ``నీ తల్లిని రక్షించు. ఆమె మీద ఆగ్రహించావో నా మీదా, సీత మీదా ఒట్టు! ఇక వెళ్ళి రా,'' అంటూ కన్నీరు కార్చాడు. భరతుడు బంగారు అలంకారాలు గల రామపాదుకలను పూజించి, రాముడికి భక్తితో ప్రదక్షణం చేశాడు.

తరవాత రాముడు తన తల్లులనూ, ఇతరులనూ అక్కడి నుంచి సాగనంపి పర్ణశాలకు తిరిగివచ్చాడు. భరతుడు రాముడి పాదుకలను నెత్తిన పెట్టుకుని, శత్రుఘు్నడితో సహా రథ మెక్కాడు. వసిష్ఠ నామదేవ జాబాలి మొదలైన వారు ముందు సాగారు. భరతుడు సపరివారంగా తిరుగుప్రయాణంలో భరద్వాజాశ్రమానికి వచ్చాడు. ఆయనతో జరిగినదంతా చెప్పి, ఆయన వద్ద సెలవు పుచ్చుకున్నాడు. శృంగిబేరపురం మీదుగా ప్రయాణించి అతను చివరకు అయోధ్య చేరుకున్నాడు.

అయోధ్య వీధుల గుండా రథ మెక్కి వస్తూంటే అతనికి నగరం నిర్జీవంగా కనబడింది. అతను శత్రుఘు్నడితో, ``అయోధ్య కళ అంతా రాముడితోనే పోయింది,'' అన్నాడు. భరతుడు తన తల్లులను అయోధ్యకు తెచ్చి వసిష్ఠుడు మొదలైన వారితో, ``రాముడు లేని అయోధ్యలో ఉండలేను, నందిగ్రామానికి పోయి, అక్కడినుంచే రాజ్యం చేస్తూ రాముడి రాకకు ఎదురుచూస్తూ ఉంటాను,'' అన్నాడు.

ఈ ఏర్పాటుకు మంత్రులు కూడా సమ్మతించారు. భరతుడు తల్లుల దగ్గిర సెలవు పుచ్చుకుని, శత్రుఘు్నడితో బాటు రథమెక్కి, మంత్రులనూ, వసిష్ఠుణ్ణీ వెంటబెట్టుకుని నందిగ్రామానికి బయలుదేరాడు. తన వెంట రమ్మని అతను ఆజ్ఞాపించక పోయినప్పటికీ సేనకూడా అతని వెంట నందిగ్రామానికి కదిలింది. నందిగ్రామంలో పాదుకలకు శ్వేతచ్ఛత్రమూ ఇతర రాజమర్యాదలూ జరగాలని భరతుడు ఉత్తరు విచ్చాడు.

తన తల్లి మూలంగా తనకు కలిగిన అపకీర్తి పోగొట్టుకోవటానికి మహాత్ముడైన భరతుడు జడలు ధరించి, నారబట్టలు కట్టి, మునివేషం వేసుకుని నందిగ్రామంలో ఉండి కోసలదేశాన్ని పరిపాలించాడు. రాజతంత్రం ప్రతిదీ ఆ పాదుకలకు చెప్పుకునేవాడు. సామంతులు తెచ్చిన కానుకలను పాదుకలకు భక్తితో నైవేద్యం పెట్టేవాడు. రాముడికి జరగవలిసిన పట్టాభిషేకం ఈ విధంగా రామ పాదుకలకు జరిగింది.

భరతుడు వెళ్ళినాక రాముడు కొంత కాలం ఆ పర్ణశాలలోనే ఉన్నాడు. క్రమంగా అతనికి ఒక విషయం తెలిసివచ్చింది: ఆ ప్రాంతంలో ఉండే ఆశ్రమాలకు చెందిన మునులు రాముణ్ణి చూపించి ఏవో గుసగుసలాడుకుంటున్నారు. దీనికి తోడు వారంతా తమ ఆశ్రమాలు విడిచి వెళ్ళిపోబోతున్నారని కూడా తెలిసింది. ఇదంతా ఏమిటో తేల్చుకోవాలనుకుని రాముడు మునులకు కులపతి అయిన వృద్ధ ముని వద్దకు వెళ్ళి, ``మీరంతా ఆశ్రమాలు విడిచిపోతున్నారట.

నేనుగాని, నా తము్మడుగాని, నా భార్యగాని తెలియక చేయగూడని పని ఏదైనా చేయలేదు గద?'' అని అడిగాడు. దానికి కులపతి, ``మీరేమీ చెయ్యలేదు గాని, నీ కారణంగా రాక్షసులు మునులకు మహాభయం కలిగిస్తున్నారు. రావణుడి తము్మడు ఖరుడనే వాడు జనస్థానంలో చేరి అక్కడి మునులను పారదోలాడు. ఎప్పుడో మాకూ పీడ చుట్టుకుంటుంది. అందుచేత ఈ ప్రాంతం వదిలి పోవాలనుకుంటున్నాం. యోధుడివి, అందులోనూ భార్యతో ఉంటున్నవాడివి; నీకైనా ఈ చోటు వదలటమే మంచిది,'' అన్నాడు.

తరవాత అక్కడి మునులు చాలా దూరాన ఉండే మరొక ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళిపోయారు. రాముడు మాత్రం మరి కొంతకాలం అక్కడే ఉండి తాను కూడా ఆ ప్రాంతం విడిచిపెడితే మంచిదని నిశ్చయించుకున్నాడు. ఆ ప్రకారమే అతడు సీతాలక్ష్మణులతో బయలుదేరి అత్రిమహాముని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయన వారిని తన బిడ్డలలాగా ఆదరించి, తానే స్వయంగా వారికి అతిథి సత్కారాలు చేశాడు. తరవాత అత్రిమహాముని కుటీరం లోపల ఉన్న జగద్విఖ్యాతురాలైన తన భార్య అనసూయను పిలిచి, ఆమెకు రామలక్ష్మణులనూ, సీతనూ పరిచయం చేశాడు. అనసూయ ఇప్పుడు చాలా వృద్ధురాలు. జుట్టంతా బాగా తెల్లబడిపోయింది.

అవయవాలు సడలి పోయాయి. కాని ఆమె తపశ్శక్తి మాత్రం సాటిలేనిది. అత్రిమహాముని రాముడితో, ``అనసూయ తన తపశ్శక్తితో ఎన్నెన్నో మహిమలను చేసి చూపింది.ఒకప్పుడు వర్షంలేక పదేళ్ళపాటు కరువువస్తే ఈమె తన తపశ్శక్తితో గంగను ప్రవహింప జేసి మునులకు ఫల మూలాలు ఉత్పత్తి అయేటట్టు చేసింది. పది రాత్రులు ఒకే రాత్రిగా ఉండేలాగ మరొక సందర్భంలో చేసింది.

సీతను ఈమెకు నమస్కారం చెయ్యమను,'' అన్నాడు. రాముడు సీతతో, ``ఈ మహాత్ముడి మాట విన్నావు కదా. మహా తపస్సంపన్నురాలు అయిన అనసూయాదేవికి నమస్కరించు. అందువల్ల నీకు శ్రేయస్సు కలుగుతుంది,'' అన్నాడు. సీత అనసూయకు తన పేరు చెప్పుకుని అమిత గౌరవంతో నమస్కారం చేసి ఆమెను కుశల మడిగింది.

అనసూయ సీతను చూసి ఎంతో ముచ్చటపడి మందహాసం చేస్తూ, ``తల్లీ, నువు్వ బంధువులనూ, ఐశ్వర్యాన్నీ, అహంకారాన్నీ, సమస్తాన్నీ విడిచి భర్త వెంట పాతివ్రత్య ధర్మంగా అరణ్యాలకు వచ్చావే, నీ భాగ్యమే భాగ్యం! అమ్మా, నేను ఎంతగానో ఆలోచించి చూశాను, స్త్రీని సమస్తవేళలా భర్తలాగా రక్షించేవారు మరెవరూలేరు. నువ్విలాగే భర్తను అనుసరించి ఉంటూ పాతివ్రత్య ధర్మం నెరవేర్చు,'' అని చెప్పింది.

``నా భర్త గుణవంతుడు, దయామయుడు, ధర్మాత్ముడు, నా మీద అచంచలమైన ప్రేమగలవాడు, నాకు తల్లి వంటి వాడు, తండ్రి వంటివాడు, మోహనాకారుడు; అటువంటి భర్తను సేవించటానికేం? నేను చిన్నతనం నుంచీ పతివ్రతా ధర్మాలు తెలుసుకున్నాను. అడవికి వచ్చేటప్పుడు నా అత్త కౌసల్య కూడా నాకా ధర్మం బోధించింది. ఇప్పుడు మీ నోట కూడా అవే వింటున్నాను,'' అన్నది సీత ఎంతో వినయంగా.

సీత తియ్యగా మాట్లాడుతూంటే అనసూయకు ఎంతో ముచ్చట అయింది. ఆమె సీతతో, ``అమ్మా, నీకేమైనా కోరిక ఉంటే చెప్పు, నేను తీర్చుతాను,'' అన్నది. సీత ఈ మాట విని ఆశ్చర్యపడి, ``మీరా మాట అనటమే నాకు పదివేలు,'' అని సమాధాన మిచ్చింది. ``అయినా నా సంతోషం కొద్దీ ఇచ్చేది నువు్వ తీసుకోవాలి,'' అంటూ అనసూయ సీతకు ఒక దివ్యమైన పుష్పమాలా, ఒక చీరా, కొన్ని అందమైన ఆభరణాలూ, శరీరానికి పూసుకునే పూతా, మంచి పరిమళగంధమూ ఇచ్చింది.

తరవాత అనసూయ సీతతో, ``నీ భర్త నిన్ను స్వయంవరంలో పెళ్ళాడాడని విన్నాను. ఆ కథంతా చెబుతావా, అమ్మా?'' అని అడిగింది. సీత తన వృత్తాంతమంతా అనసూయకు చెప్పింది: ``మా తండ్రి జనకమహారాజు మిథిలకు రాజు. ఆయన యాగం కోసం నాగలితో భూమిని దున్నుతూ ఉండగా మట్టిలో నే నాయనకు దొరికాను. ఆయన కప్పటికి సంతానం లేకపోవటం చేత నన్ను తన కుమార్తెగా భావించి, పెంచమని తన పెద్ద భార్య కిచ్చాడు.

నాకు పెళ్ళియీడు వచ్చాక ఆయ నకు పెద్ద విచారం పట్టుకున్నది. ఎంత ఆలోచించినా నాకు తగిన భర్త ఆయనకు దొరకలేదు. అప్పుడాయన నాకు స్వయంవరం చేద్దామని నిశ్చయించి, తన ఇంటనున్న గొప్ప విల్లును ఎక్కుపెట్టిన వాడికి నన్నిచ్చి పెళ్ళిచేయ నిర్ణయించాడు. ఎందుకంటే, దైవాంశ ఉన్నవారు తప్ప మామూలు మనుషులు దానిని ఎత్తనైనా శక్తిలేని వారవుతారు.

ఎందరో రాజులు స్వయంవరానికి వచ్చి, ధనుస్సును ఎత్తలేక దణ్ణంపెట్టి వెళ్ళిపోయారు. అంతలో విశ్వామిత్రమహాముని రామలక్ష్మణులతో సహా యజ్ఞం చూడవచ్చాడు. విశ్వామిత్రుడు కోరగా మా తండ్రి ఆ ధనుస్సును తెప్పించి వారికి చూపాడు. రాముడా ధనువును అవలీలగా ఎత్తి, తాడు తగిలించి లాగేసరికి ధనుస్సు పెళపెళా నడిమికి విరిగిపోయింది.

వెంటనే నా తండ్రి కన్యాదానం చెయ్యటానికి జలకలశం తెప్పించాడు. కాని రాముడు తన తండ్రి అనుమతి లేకుండా నన్ను పెళ్ళాడనన్నాడు. తరవాత మా తండ్రి అయోధ్యకు కబురు చేసి దశరథ మహారాజును రప్పించిన తరవాత మాకిద్దరికీ పెళ్ళి జరిగింది.'' ఈ కథ విని అనసూయ ఎంతో సంతోషించింది. ఆమె సీతను తన ఎదుటనే అలంకరించుకోమని చెప్పి, తరవాత ఆమెను రాముడి వద్దకు పంపింది. రాముడు అందమైన ఆమె అలంకరణలన్నీ చూసి, ``ఇవన్నీ ఎక్కడివి?'' అని అడిగితే అనసూయ ఇచ్చిన కానుకలని సీత చెప్పింది. రామలక్ష్మణులు పరమానందం పొందారు.

సీతారామలక్ష్మణులు ఆ రాత్రి అత్రి మహాముని ఆశ్రమంలో గడిపి, మర్నాడు సూర్యోదయం వేళ అత్రిమహాముని వద్ద సెలవు తీసుకున్నారు. ``నాయనా, ఈ అరణ్యంలో కొందరు నరభక్షకులైన రాక్షసులు కూడా ఉన్నారు. మునులు ఫలాల కోసం అడవికి వెళ్ళి వచ్చేదారి చూపుతాను, ఆ దారినే వెళ్ళండి,'' అని అత్రి చెప్పాడు. ఆయన చూపిన మార్గాన బయలుదేరి సీతారామలక్ష్మణులు భయంకరమైన దండ కారణ్యం ప్రవేశించారు.

[అయోధ్యాకాండ సమాప్తం]
Read More

‘‘శ్రీరామ దూతం శిరసానమామి’



‘‘శ్రీరామ దూతం శిరసానమామి’

‘‘సత్యం’’ ఒక్కటే కాలానికి చిక్కక, లొంగక, కాలగర్భంలో కలయక, దివ్వప్రభలతో తేజరిల్లుతూనే ఉంటుంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు మన ‘‘రామాయణ, భారత, భాగవత’’ గ్రంధాలు. ఇవి కేవలం కథలు అయితే, ఏనాడో వాటికి కాలదోషం పట్టేది. అలా కాక, అవి ఇప్పటికీ కాలంతో సమానంగా పరుగులుతీస్తూ.. జాతిని జాగృతం చేస్తున్నామంటే.. వాటిలోని ప్రతిపాత్ర సత్యబలంతో జీవం పోసుకున్నవే. ధర్మసంకల్పంతో రూపం దాల్చినవే.

‘‘శ్రీరామ’’ అనగానే వెంటనే మనకళ్ళముందు కదిలే పాత్ర ‘‘హనుమంతుడు’’. ఏడుకాండల గ్రంధమయిన ‘‘రామాయణం’’లో.. .ఎప్పుడో నాల్గవకాండ అయిన ‘‘కిష్కింధాకాండ’’లో ప్రవేశించిన ‘‘హనుమంతుని పాత్ర’’ నేటికీ ఆబాలగోపాలాన్ని అలరిస్తూనే ఉంది. పలకరిస్తూనే ఉంది. ఎందుకంటే....
శివాంశ సంభూతుడు:

రామాయణం ‘‘హరి, హర తత్త్యాత్మకం
శ్రీరాముడు శిష్ణ్యాంశ సంభూతుడు. హనుమంతుడు శివాంశసంభూతుడు. దీనికి సంబంధించిన కథ రామాయణంలోనే ఉంది. శివపార్వతుల కళ్యాణం జరిగింది. వారిరువురు ఏకాంత శయ్యామందిరం చేరారు. వారికి జన్మించబోయే పుత్రునివల్లే తారకాసంహారం జరగాలి. అందుకోసమే శోభనమందిరం వెలుపల దేవతలతో కొండంత ఆశతో, వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నెలలు, మాసాలు దొర్లిపోతున్నాయి. శివ పార్వతులు శోభన మందిరం నుంచి బయటకు రాలేదు. లోపల ఏం జరుగుతోందో తెలియని సందిగ్ధస్థితి దేవలది. చూచి రమ్మని అగ్నిని, వాయువును లోపలకు పంపారు దేవతలు. అదే సమయంలో ‘శివతేజస్సు’ బహిర్గత మవుతోంది. లోపలకు ఎవరో వచ్చారన్న సందేహం పార్వతికి కలిగింది. వెంటనే శివునకు దూరంగా జరిగింది. శివుడు తన తేజస్సును భూపతనం కానివ్వకుండా బంధించి దానిని అగ్నికి, వాయువుకు చెరిసగం పంచి పంపాడు. తనకు చెందవలసిన శివతేజస్సును అగ్ని, వాయువులు తన్నుకు పోతూంటే పార్వతికి దుఃఖం ఆగలేదు. దేవతలు చేసిన కార్యభంగానికి కోపగించి ‘దేవతలకు స్వభార్యల వలన సంతానం పుట్టకుండుగాక’ అని శపించింది.

అగ్నిదేవుడు తన దగ్గరున్న ‘శివతేజస్సు’ను భరించలేక గంగానది గర్భంలో ఉంచాడు. గంగ కూడా శివతేజస్సును భరించలేక ఒడ్డుకు నెట్టింది. ఆ శివతేజస్సు రెల్లు పొదల్లో పడి ఆరుముఖలతో ‘షణ్ముణుడు’ జన్మించాడు
వాయువు తన దగ్గరున్న ‘శివతేజస్సు’ను, సంతానంకోసం తపస్సు చేస్తున్న ‘అంజనాదేవి’ గర్భంలో నిక్షిప్తంచేసాడు. అంజనాదేవి గర్భం ధరించింది. నవమాసాలు నిండాయి. అంజనాదేవికి ప్రసవవేదన మొదలైంది. ఆ రోజు వైశాఖ బహుళ దశమి తిధి: పుర్వాభాద్ర నక్షత్రం.ఆ శుభ ముహూర్తంలో శివాంశతో అంజనా గర్భసంభూతుగా ‘‘ఆంజనేయుడు’’ జన్మించాడు.

బాల ప్రాయంలోనే ఆంజనేయుడు తన శక్తి ఏమిటో లోకానికి చాటాడు. బాల భీమని పండుగా భావించి, దానిని మ్రింగాలనే ఉద్దేశ్యంతో ఆకాశానికి ఎగిరాడు. ఆరోజు అమావాస్య, సంపూర్ణసూర్యగ్రహణం. అదే సమయానికి సూర్యగ్రహణం చెయ్యడానికి రాహువు వచ్చాడు. ‘‘ఈ సూర్యుడు నాదంటే నాది’’ అని రాహువుకు, బాలాంజనేయునికి మధ్య ఘర్షణ జరిగింది. విసుకుచెందిన ఆంజనేయుడు తన తోకతో రాహువును చుట్టి బలంగా విసిరివేసాడు. రాహువు దేవేంద్రుని ముందుపడి జరిగినది చెప్పాడు. కృద్ధుడైన దేవేంద్రుడు వజ్రాయుధాన్ని పంపాడు. వజ్రాయుధ ఘాతానికి ఆంజనేయుని దవడ ఎర్రగా వాచిపోగా, స‌్పృహతప్పి నేలమీద పడ్డాడు. హనుమ (దవడ) వాచినవాడు కనుక ఆనాటి నుంచి ‘‘హనుమంతుడు’’ అని సార్ధక నామధేయుడయ్యాడు. తన కుమారుని దురవస్థ చూసి... వాయువు దేవతలపైన అలిగి స్తంభించాడు. సృష్టిమొత్తం సంక్షోభంతో అల్లకల్లోలమైంది. బ్రహ్మదిదేవతలు వాయువును ప్రస్నం చేసుకోవడం కోసం, అందరూ హనుమంతునికి తలోక వరం ఇచ్చారు. ఏ అస్త్రము హనుమంతుని బాధించవు, బంధించవు అని దీవించారు. సహజ బల సంపన్నుడైన హనుమంతుడు ఇప్పుడు వర బలసంపన్నుడయ్యాడు. అసలే కోతి... పైగా బాల్యం... దానికితోడు వరబలం హనుమంతుని అల్లరికి అంతేలేదు. అతని చిలిపిచేష్టలకు సహనం నశించిన ఋషులు ‘‘నీవు శక్తి హనుడవు అగుగాక’’అని శపించారు. ఆ తర్వాత అంజనాదంపతుల ప్రార్ధనకు ప్రసన్నులైన ఋషులు ‘‘ెవరైనా చెబితేనే అతని శక్తి అతనికి తెలుస్తుంది’’అని శాపాన్ని కాస్త మార్పు చేసారు.

ఆదిత్యుడే ఆచార్యుడు

హనుమంతునికి విద్యలు బోధించడానికి సాహసం చేసి ఎవరూ ముందుకు రాలేదు. హనుమంతుడు నిరుత్సాహం చెందక సూర్యుని దగ్గరకు వెళ్లి విద్యాదానం చెయ్యమని ప్రార్ధించాడు. ‘‘నాయనా.. క్షణకాలం కూడాఆగకుండా నిరాలంబపధంలో నిరంతరం సంచరించే నేను నీకేం విద్యాదానం చెయ్యగలను? నువ్వేం నేర్చుకోగలవు?’’ అన్నాడు సూర్యుడు. ‘‘గురుదేవా... మీతో సమానంగా సంచరిస్తూనే విద్యలు నేర్చుకుంటాను’’అని వినయంగా పలికాడు హనుమంతుడు. గురువు అంగీకరించాడు. శిష్యుడు అనుసరిస్తున్నాడు. విద్యాభ్యాసం మొదలైంది. అచిరకాలంలోనే సకల విద్యలు గ్రహించాడు హనుమ. ఇదీ హనుమంతుని బాల్య కథ. ఈ కథను... జాంబువంతుడు.... సాగర తీరంలో వానరులకు వినిపించాడు.

తొలికలయిక:

రామాయణంలో హనుమంతుని పాత్ర కిష్కింధ కాండలో పరిచయం అవుతుంది. తొలి పరిచయంతోనే ా పాత్ర స్వరూప, స్వభావాలు, పటిష్టతను పరిచయం చేస్తాడు ఆదికవి’’వాల్మీకి.
రావణాపహృత అయిన సీతాదేవిని అన్వేషిస్తూ రామలక్ష్మణఉలు ఋష్యమాకం చేరుకున్నారు. దూరం నుంచి వారిని చూస్తూనే ప్రాణభయంతో పరుగులు పరుగులు తీసాడు సుగ్రీవుడు. చెంతనున్న హనుమంతుడు... సుగ్రీవునికి ధైర్యంచెప్పి... యతిరూపం ధరించి రామలక్ష్మణఉల దగ్గరకు వచ్చాడు. ‘‘అద్యూ క్షత్రియవంశ సంజాతుల్లా కనిపిస్తున్న మీరు.. అందుకు విరుద్ధంగా నారబీరలు, జటాజూతాలు ధరించడం చూస్తూంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. పోనీ మహర్షులాని అనుకుందామంటే... మీ చేతిలోని ధనర్పాణ, కరవాలాలు చూస్తూంటే మీరు ఋషులు కాదనిపిస్తోంది. తమరెవరు? ఏ కార్యార్గమై యిలా వచ్చారు? ఓ... నాగురించి చెప్పలేదు కదూ.. నా పేరు హనుమంతుడు. వానరసార్వ భీముడైన వాలి, తన తమ్ముడయిన సుగ్రీవుని సందేహించి, అతని భార్యను అపహరించి, రాజ్యం నుంచి తరిమికొట్టాడు. నేను ా సుగ్రీవుని మంత్రిని’’ అన్నాడు.
విన్నరాముడు పరమానంద భరితుడై, లక్ష్మణునితో:
‘‘నా సృగ్వేద వినీతస్య నా యజర్వేద ధారణం:
నా సామవేద విదుష: శక్యమేవం విభాషితుయ్’’
లక్ష్మణా.. చతుర్వేదాలు, సమస్త శాస్త్రాలు, నవ వ్యాకరణాలు అధ్యయనం చేసినవాడు మాత్రమే ఇంత మఈదు మధురంగా మాట్లాడగలడు.
‘‘అవిస్తర మసందిగ్ధం అవిలంబితమనధ్యమ్
ఉర:స్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమస్వరమ్’’
చెప్పవలసిన విషయంలో సందిగ్ధం లేదు. సాగతీతలు లేవు. గొంతు చించుకోవడం, కనుబొమలు ఎగురవేయటం, తలతిప్పడం వంటి అవలక్షణాలు లేకుండా, తను చెప్పాల్సింది మృదుమధురంగా మధ్యమ స్వరంలో చెప్పాడు. ఇంతటి వాక్చాతుర్యంగల ఈ ధీమంతునితో చాలా జాగ్రత్తగా సంభాషించు’’అని లక్ష్మణుని హెచరిస్తాడు రాముడు. ఈ ఒక్కచోట తప్ప... రాముడు లక్ష్మణుని హెచ్చరించిన సందర్భం రామాయణంలో మరెక్కడా కనబడదు. మానవులు ఎలా మాట్లాడాలో మనకు ఈ సన్నివేశంలో నేర్పుతాడు ‘‘హనుమంతుడు’’

అగ్నిసాక్షిగా రామ, సుగ్రీవుల మధ్య మైత్రీ బంధం కల్పించాడు హనుమ. ధర్మభ్రష్టుడైన వాలిని సంహరించి, సుగ్రీవుని కిష్కింధాధిపతి చేస్తానని శ్రీరాముడు మాటిచ్చాడు. వాలి సంహారం జరిగింది. సకల వానర సంఘాలూ, వారి సేనాధిపతులు నల, నీల, గజ, గవయ, గవాక్ష, మైంద, ద్వివిదాది మహావీరులందరూ భయభ్రాంత హృదయులై నిలబడి పోయారు. వాలి మృతదేహం మీద పడి, తార విలవిల విలపిస్తూంటే, ఆమెను ఓదార్చేధైర్యం ఎవ్వరికీ చాలలేదు.

అప్పుడు హనుమంతుడు తారను సమీపించి ‘‘మహారాణీ.. ఇంతకాలం ీ సర్వ వానరకోటిని మీ కనుసన్నలలో నడిపించి, కిష్కింధను పాలించిన మీరు... వీర మరణం పొందిన భర్త గురించి ఇలా శోకించడం తగదు. ఇప్పుడు ఈ సమస్త వానరప్రజ మీ ఆదేశంకోసం ఎదురు చూస్తున్నారు. కనుక, శోకాన్ని ఆపి, నీ బిడ్డ అంగదుని ఈ కిష్కింధకు సామ్రాట్టుగా అభిషిక్తుని చెయ్యి’’ అన్నాడు.
శ్రీరాముడు వాలిని సంహరించినది సుగ్రీవుని కిష్కింధాధి పతిగా అభిషిక్తుని చెయ్యడానికి గానీ, అంగదుని కాదు. ఈసంగతి హనుమంతునకు తెలియక కాదు అలా అన్నది.. ఎందుకలా అన్నాడంటే....
వాలిమరణంతో సర్వవానరకోటి సుగ్రీవుని పట్ల ద్వేషంతో, పగతో ఉంటారు. నిజానికి కిష్కింధకు ఏలిక వాలి అయినా, తెరవెనుక నుంచి కిష్కింధను పాలించిన పట్టమహిషి తార. భర్త మరణం ఆమెలో ప్రతీకార జ్వాల రగిల్చితే వానరులంతా సుగ్రీవునకు ప్రతిపక్షం అవుతారు. అప్పుడు సుగ్రీవుడు కిష్కిందాధిపతి కావడం కల్ల... వానరులంతా సహకరిస్తేనే సుగ్రీవుడు సీతాన్వేషణ చేయగలడు. తార కోపాన్ని శాంతింపచేసి, సుగ్రీవుని పక్షానికి వచ్చేలా చెయ్యాలంటే... ముందు తార, సుగ్రీవుని కిష్కింధాధిపతిగా అంగీకరించాలి. తను అన్న మాటకు తార నుంచి ఏ సమాధానం వస్తుందో హనుమకు తెలుసు. అలాంటి సమాధానమే వచ్చింది.
‘‘హనుమా.. సుగ్రీవుడే సర్వవానరకోటికి ప్రభువు. అతనికే పట్టాభిషేకం జరగాలి’’ అంది తార. ఆమెచేత అలా పలికించగల ధీమంతుడు హనుమంతుడు. అదీ ఆయన రాజకీయనిఫుణత.

తిరుగులేని రామ ‘‘దూత’’
వానర వీరులంతా నీతాన్వేషణకు బయలు దేరారు.
దక్షిణ సాగరతీరానికి చేరారు అంగద, జాంబువంత, హనుమదాదులు. అనితర సాధ్యమైన శతయోజన విస్తీర్ణమయిన సాగరాన్ని లంఘించాడు. ఈ సాగర తరణంలో...
మైనాకుని మన్ననలందాడు
సురసను యుక్తితో జయించాడు
సింహకను సంహరించాడు
లంకిణిని ఓడించి, శత్రుదుర్వేధ్యమయిన లంకలో ఒంటరిగా సీతాన్వేషణ సాగించాడు. ఈ కార్యంలో ఎందరో దేవ, గంధర్వ కన్నర, గంధర్వాది సుందరాంగనలు నగ్నంగా, అర్థనగ్రంగా హనుమంతునికి దర్శనమిచ్చారు. హనుమ హృదయం చివుక్కుమంది. ‘‘పరస్త్రీని చూడడమే పానం... పైగా ఇలా నగ్నంగా చూడడం మరింత పాపం’’ అనుకుని
‘‘నహిమే పరదారాణాం దృష్టిర్విషయవర్తినీ
అయం చాత్ర మయాదృష్ట: పరదార పరిగ్రహ:’’
‘‘సీతాదేవి కనిపిస్తుందేమో నని చూసానేగానీ, నా మనస్సు కామవశీభూతం కానప్పుడు నేనెందుకు బాధపడాలి. సర్వ పాపపుణ్యాలకు ప్రధానమైన మనస్సు, నిర్మలంగా, నిశ్చలంగా ఉన్పప్పుడు నేను బాధపడక్కర లేదు’’ అనుకున్నాడు.. అది హనుమ స్త్రీ భక్తి. ాత్మపరిశీలన.
అశోక వనంలో సీతాదేవిని చూసాడు. ఆమెకు రామాంగుళి ఇచ్చి ధైర్యం చెబుతూ... ‘‘అమ్మా.. నా భుజాన్ని ఎక్కు. క్షణకాలంలో నిన్ను రామసన్నిధికి చేరుస్తాను’’ అంటాడు. అప్పుడు సీతాదేవి.. ‘‘అలా చేయడం నా రామునకు గౌరవంకాదు. అయినా, ఇంత చిన్న ాకారంగల నీవు, నన్నెలా రాముని దగ్గరకు చేర్చగలవు’’ అంది. అప్పుడు హనుమంతుడు తన విశ్వరూపాన్ని సీతాదేవికి చూపించి, ధైర్యం చెబుతూ...
‘‘మద్విశిష్టాశ్చ తుల్చాశ్చ సన్తి తత్ర వనౌకస:
మత్త: ప్రత్యవరం: కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిదే’’
‘‘అమ్మా.. సుగ్రీవుని సన్నిధానంలో నన్ను వానరవీరులందరిలోను అతి సామాన్యుడను నేనే. దూతల సామాన్యులనే తప్ప మహమహులను పంపరు కదా’’ అన్నాడు. అదీ హనుమంతునివినయం, నమ్రత.
ఒంటిచేత్తో అశోకవన ధ్వంసం చేసిన హనుమ.. సామాన్యుడా?
శత్రుసభలో నిర్భయంగా రావణునకు హితబోధ చేసిన హనుమ... సామాన్యుడా?
సుందర లంకానగరాన్ని క్షణకాలంలో అగ్నికి ఆహుతి చేసిన హనుమ... సామాన్యుడా?
‘‘సీతాదేవిని చూసాను’’ అని చెప్పి... ఇటు వానరుల ప్రాణాలు, అటు శ్రీరాముని ప్రాణాలు కాపాడిన హనుమ... సామాన్యుడా?
ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మస్త్ర ప్రయోగానికి రామలక్ష్మణులతో సహా సర్వవానరులూ మూర్చపోతే, సంజీవినీ పర్వతాన్ని తెచ్చి అందరికీ ప్రాణదానం చేసిన హనుమ... సామాన్యుడా?
అసలు హనుమలేని రామకథను మనం ఊహించగలమా? ఆస్వాదించగలమా? ఆనందించగలమా?
హనుమలేనిదే రాముడు లేడు. ఎందుకంటే...
రాముడు విష్ణ్వాంశ సంభూతుడు.
హనుమ ఈశ్వరాంశ సంభూతుడు.
శివకేశమవిద్దరూ ఒకరిని విడిచి ఒకరుండరు.
‘‘శఇవాయా విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణు: విష్ణోశ్చ హృదయంశివ:’’
అందుకే రామనాయం ఎక్కడుంటే హనుమ అక్కడుంటాడు
శివుడు.. అభిషేక ప్రియుడైన, బోళా శంకరుడు
హనుమ... రామనామాభిషేక ప్రియుడైన, బోళావానజుడు
సామాన్యులమైన మనం,ఆ మహావీరునకు ఏమివ్వగలం? జన్మదిన కానుకగా, భక్తిగా ఒక్క ‘‘రామనామాన్ని’’ ఇవ్వడంతప్ప... ఇంకేం చెయ్యగలం?
యత్ర యత్ర రఘునాధ కీర్తనమే
తత్ర తత్ర కృత మస్త కాంజవియ్
బాష్పవారి పరిపూర్ణలోచనమ్
మారుతిం నమత రాక్ష సాంతకమ్
Read More

రామాయణం (బాలకాండ)





రామాయణం




బాలకాండ -1

ఒకనాడు నారదమహాముని తమసా నదీతీరాన గల వాల్మీకి మహాముని ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి ఆయనను శాస్త్రోక్తంగా పూజించి, "మహాత్మా, ఈ యుగంలో ఈ లోకంలోసకల సద్గణ సంపన్నుడూ, మహాపరాక్రముడూ అయిన పురుషుడు ఎవడైనా ఉన్నాడా?" అని అడిగాడు.
అప్పుడు వాల్మీకికి నారద మహాముని రాముడి కథ సవిస్తరంగా చెప్పాడు. నారదమహాముని సెలవు తీసుకుని వెళ్ళిపోయే సరికి మధ్యాహ్న స్నానానికి వేళ అయింది. వాల్మీకి, శిష్యుడైన భరద్వాజుణ్ణి వెంటబెట్టుకుని తమసానదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఒక క్రౌంచపక్షుల జంట కనిపించింది. నారబట్ట కట్టుకుని నీటిలోకి దిగబోతూ వాల్మీకి ఆ పక్షుల ఆనందోత్సాహాన్ని చూస్తున్నంతలో ఒక బొయవాడు బాణంతో మగపక్షిని కొట్టాడు. అది కిందపడి గిలగిలా తన్నుకున్నాది. ఆడపక్షి ఆర్తనాదాలు చేసింది. వాల్మీకి హృదయంలో ఆ పక్షిపైన జాలీ, కిరాతుడిపైన ఆగ్రహామూ తన్నుకునివచ్చాయి. "ఓరి కటిక వాడా, ప్రేమోద్రేకంలో ఉన్న క్రౌంచపక్షుల జంటలో ఒకదాన్ని చంపిన నువ్వు చిరకాలం బాగా ఉండలేవు," అనే అభిప్రాయం అప్రయత్నంగా వాల్మీకి నోట శ్లోకం రూపంలో వెలువడింది.
తన నోట ఇలా శ్లోకం వెలువడటం చూసి వాల్మీకే విస్మయం చెందాడు. ఆశ్రమంలో కూడా వాల్మీకి తన నోట వెలువడిన శ్లోకం గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు.
అంతలో బ్రహ్మదేవుడు ఆయనను చూడ వచ్చాడు. వాల్మీకి చప్పున లేచి బ్రహ్మకు సాష్టాంగం చేసి, అర్ఘ్యపాద్యాలిచ్చి, స్తోత్రాలతో సన్నుతించి మౌనంగా నిలబడ్డాడు. అప్పుడు బ్రహ్మ, "వాల్మీకీ, నాఅనుగ్రహంచేతనే నీకు కవిత్వం అబ్బింది. నీవు ఇంతకు ముందే రాముడి కథ విన్నావు గదా. ఆ కథను మహాకావ్యంగా రచించు. అది భూమి ఉన్నంత కాలమూ నిలిచి ఉంటుంది. అది ఉన్నంతకాలమూ నీవు ఉతమ లోకాలలో సంచరించగలిగి ఉంటావు," అని చెప్పి అంతర్థానమయ్యడు. ఈ విధంగా బ్రహ్మయొక్క ప్రోత్సాహంతో వాల్మీకి రామాయణ కథను, అందరికీ ఆనందం కలిగించే విధంగా రచించాడు. వైవస్వతుడు సూర్యుడి కొడుకు. ఇక్ష్వాకు అనేవాడు వైవస్వతుడి కొడుకు. వైవస్వతుడు ఏడవ మనువు అయి శాశ్వత కీర్తి సంపాదించాడు. ఆయన ఆనంతరం ఇక్ష్వాకు సంతతి వారు ఇక్ష్వాకులనీ, సూర్యవంశం వారనీ పిలవబడి ప్రసిద్ధికెక్కారు. వీరిలో సగరుడు కూడా ఒకడు. ఈ సగరుడు షట్చక్రవర్తులలో ఒకడు. గంగను స్వర్గం నుంచి భూమికి తెచ్చిన భగీరథుడు ఈ సగరుడికి మనమడే.
సూర్యవంశపు రాజులు అయోధ్యా నగరం రాజధానిగా కోసలదేశాన్నిపాలించారు. అయోధ్యను వైవస్వత మనువు స్వయంగా నిర్మించాడు. శత్రువులకు దుర్భేద్యమైన ఈ అయోధ్యను సూర్యవంశపు రాజైన దశరధుడు పరిపాలిస్తూ ఉండేవాడు. దశరధుడు ఐశ్వర్యంలోఇంద్ర కుబేరులకు తీసిపోనివాడు,మహాపరాక్రమ సంపన్నుడు.
దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్దార్ధుడు, అర్ధసాదకుడు, అశోకుడు, మంత్ర పాలుడు, సుమంత్రుడు అనే ఎనిమిదిమందీ దశరధుడి మంత్రులు. వసిష్ట మహాముని ఆయనకు కులగురువు. వసిష్ఠుడూ, వామదేవుడూ ఆయన పురోహితులు. వేగులవాళ్ళ ద్వారా దేశంలో ఏమూల ఏమి జరుగుతున్నదీ తెలుసుకుంటూ, తన మంత్రుల సహాయంతో దశరధుడు న్యాయంగా రాజ్య పాలన చేస్తూ వచ్చాడు.
దశరధుడికి ఏలోటు లేదుగాని సంతానం లేని లోటు ఉండి, ఆయనను బాధించేది. ఒకనాడాయన అశ్వమేధయాగం చేసి దేవతలను మెప్పించి, వారి అనుగ్రహంతో సంతానం పొందుదామని ఆలోచించి, తన మంత్రులలో అగ్రగణ్యుడైన సుమంత్రుడి ద్వారా వసిష్ఠ వామదేవులనూ, సుయజ్ఞుడు, జాబాలి మొదలైన గురువులనూ, ఇతర బ్రాహ్మణ శ్రేష్ఠులనూ పిలిపించి, వారి సలహా అడిగాడు. అశ్వమేదాయాగం చేసే ఆలోచనను వారు మెచ్చుకున్నారు. వారందరూ వెళ్ళాక, దశరథుడితో సుమంత్రుడు, "మహారాజా, మీరు తలపెట్టిన అశ్వమేధయాగాన్ని జరిపించటా నికి ఋశ్యశృంగుణ్ణి మించినవాడు లేడు. అతని వృత్తాంతం చెబుతాను వినండి," అంటూ ఈ కథ చెప్పాడు:
అంగదేశాన్ని పరిపాలించే రోమపాదుడు దశరథుడి మిత్రులలో ఒకడు. అంగదేశంలో భయంకరమైన కరువు సాగింది. రోమపాదుడు ఈ కరువు చూసి దిగులు చెంది, బ్రాహ్మణులను పిలిపించి, కరువు తొలిగిపోయే ఉపాయం చెప్పమన్నాడు. "మహరాజా, విభండకమునికి ఋశ్యశృంగుడనే కుమారుడున్నాడు. అతను ఉండే చోట కరువు ఉండదు. అతనిని అంగదేశానికి రప్పించి, తమ కుమార్తె అయిన శాంతనిచ్చి పెళ్ళిచేసి, అంగదేశంలోనే ఉంచుకున్నట్లయితే, కరువు కాటకాలు పోయి దేశం సుభిక్షంగా ఉంటుంది," అని బ్రాహ్మణులు చెప్పారు. అప్పుడు రోమపాదుడు తన పురోహితుణ్ణి, మంత్రులనూ పిలిచి, "మీరు వెళ్ళి ఋశ్యశృంగ మహాము నిని ఇక్కడికి తీసుకు రండి," అని ఆజ్ఞాపించాడు.
ఈ మాట విని పురోహితిడూ, మంత్రులూ భయపడ్డారు. ఎందుకంటే ఋశ్య శృంగుడు సులువుగా అరంణ్యాలనూ, తన తపస్సునూ మాని, ఎవరో పిలవ గానే వచ్చే మనిషికాడు. ఆగ్రహించి శపించినా శపించగలుడు. అతన్ని రప్పిం చాలంటే ఏదో ఒక మాయోపాయం పన్నాలి. ఆ ఉపాయాన్ని రోమపాదుడికి పురోహితుడు ఈ విధంగా చెప్పాడు:
"మహారాజా, ఋశ్యశృంగుడు పసితనం నుంచి అరణ్యంలోనే ఉండి వేదాధ్యయనం లోనూ, తపశ్చర్యలోనూ జీవితం గడిపిన వాడు. అతనికి ఆడవాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు. మనం కొంతమంది నాట్య కత్తెలను పంపినట్లయితే వారు అతన్ని ఆకర్షించి తమ వెంట తీసుకురా గలుగుతారు."
రోమపాదుడిందుకు సమ్మతించి కొందరు నాట్యకత్తెలను చక్కగా అలంకరింపజే సి ఋశ్యశృంగుడి ఆశ్రమానికి పంపాడు. ఆ ఋశ్యశృంగుడు ఎప్పుడూ తండ్రికి శుశ్రూషలు చేస్తూ ఎన్నడూ ఆశ్రమం దాటి వెళ్ళేవాడు కాడు. అలాటిది ఒకనాడు అతను ఎందుకో ఆశ్రమం దాటివచ్చాడు.
వెంటనే నాట్యకత్తెలు పాటలు పాడుతూ అతన్ని సమీపించారు. వారి అందమైన ఆకారాలూ, అలంకరణలూ, పాటలు, శ్రావ్యమైన గొంతులూ విని ఋశ్యశృంగుడు ఆశ్చర్యపోయి ఆకర్షిం చబడ్డాడు. నాట్యకత్తెలు అతన్ని సమీపించి, "నీవెవరు? ఎందుకీ అరణ్యంలో ఒంటరిగా తిరుగుతున్నావు?" అని అడిగారు "నేను విభండక మహాముని కొడుకును. మీరు ఆశ్రమానికి వచ్చినట్లయితే మీకు విధ్యుక్తంగా పూజ చేస్తాను, "అన్నాడు. వారు అతని వెంట ఆశ్రమానికి వెళ్ళి, అతనిచ్చిన కందమూలాలూ, ఫలాలూ తిన్నారు. అతనికి తమ వెంట తెచ్చిన భక్ష్యాలిచ్చి, "ఇవి మా పళ్ళు. వీటిని రుచిచూడు! ఇకమేము వెళ్ళి తపస్సుచేసుకోవాలి, "అంటూ వెళ్ళిపోయారు. ఋశ్యశృంగుడు వారు పెట్టిన భక్ష్యాలు తిని అవీ పళ్ళే అనుకున్నడు. అయితే అవి తాను తినే పళ్ళుకంటే చాలా రుచిగా ఉన్నాయి. మర్నాడు, వారు కనిపించవచ్చునన్న ఆశతో, ఆశ్రమం వదిలి కిందటరోజు వారు కనిపించిన చోటికే వెళ్ళాడు.
అతన్ని చూడగానే, "అయ్యా, నీవు కూడా మా ఆశ్రమానికి రా. అక్కడ నీకు చక్కగా మర్యాద చేస్తాము," అన్నారు. ఋశ్యశృంగుడు అందుకు పరమా నందంతో సమ్మతించి, వారి వెంట బయలుదేరాడు. ఋశ్యశృంగుడి వెంటనే అంగదేశానికి వర్షంకూడా వచ్చింది. రోమపాదుడు ఋశ్యశృంగుడికి ఎదురు వచ్చి, సాష్టాంగపడి మొక్కి, తాము అతనిని ఈవిధంగా రప్పించినందుకు క్షమాపణ చెప్పుకుని, తన కూతురైన శాంత నిచ్చి శాస్త్రోక్తంగా పెళ్ళి చేసాడు. ఋశ్యశృంగుడు శాంతతో కూడా అంగదేశంలోనే ఉండిపోయాడు.
సుమంత్రుడు చెప్పిన ఈ కథ విని దశరధుడు ఎంతో సంతోషించి, వసిష్ఠ మహాముని అనుమతి పొంది, తన భార్యలనూ, మంత్రులనూ వెంటబెట్టుకుని అంగదేశం వెళ్ళాడు. రోమపాదుడు దశరధుడికి గొప్పగా ఆతిధ్యంఇచ్చి తన ఇంట వారం రోజులుంచుకుని, ఆయన వచ్చిన పని తెలుసుకుని, తన అల్లుడైన ఋశ్యశృంగిణ్ణీ, తన కుమార్తె అయిన శాంతనూ దశరథుడి వెంట పంపటానికి ఒప్పుకున్నాడు. ఋశ్యశృంగుడు అయోధ్యకు వచ్చి కొద్దిరోజులు గడిచాయి. వసంతరుతువు ప్రవేశించింది.
దశరథుడు ఋశ్యశృంగుడితో, "ఇక మీరు యాగం ఆరంభించి నడిపించండి," అన్నాడు. అశ్వమేధయాగం కోసం పెద్ద యెత్తున ప్రయత్నాలు సాగించారు. యజ్ఞాలు చేసే వారూ, వేదాలు చదివేటందుకు సుయజ్ఞుడూ, వామ దేవుడూ, జాబాలీ, కాశ్యపుడూ మొదలైన మునులూ, బ్రాహ్మణ శ్రేష్ఠులూ పిలిపించబడ్డారు. సరయూనది ఉత్తరపుగట్టున యజ్ఞ శాల నిర్మించారు.
మంచిరోజూ, మంచి ముహూర్తమూ చూసుకుని దశరథుడు యజ్ఞశాలకు బయలు దేరివచ్చాడు. యజ్ఞకర్మ ఆరంభమయింది. మొదటి హవిర్భాగం ఇంద్రుడికి అర్పించి హొమం సాగించారు.
అశ్వమేధం మూడురోజుల యాగం. అది శాస్త్రోక్తంగా ముగియగానే దశరథుడు తన చేత యజ్ఞం చేయించిన ఋత్విజులకు భూమి యవత్తూ, దానం చేశాడు. వారు రాజుతో, "మహరాజా, భూమిని పాలించటం మావల్ల అయ్యేపనికాదు. అందుచేత మాకు భూమి బదులు మణులో, బంగారమో, గోవులో, మరొకటో, ఏది సిద్ధంగా ఉంటే అది ఇప్పించు," అన్నారు.
దశరథుడు వారికి పదిలక్షల గోవులూ, నూరుకోట్ల బంగారమూ, నాలుగు వందల కోట్ల వెండీ దానం చేశాడు.
తమకు ముట్టిన ధనమంతా బ్రాహ్మణులు ఋశ్యశృంగుడికీ, వసిష్ఠుడికీ సమర్పించాడు. వసిష్ఠుడు మొదలైనవాళ్ళు దాన్ని వంతుల ప్రకారం పంచుకున్నారు.
ఇంతలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు వచ్చి దశరథుడి ముందు చెయ్యిచాచాడు. దశరథుడు వెంటనె తన చేతి కడియం తీసి ఆబ్రాహ్మడికిచ్చేశాడు. బ్రాహ్మణులందరూ దశరథుణ్ణి దీవించారు.
అశ్వమేధం పూర్తికాగానే ఋశ్యశృంగుడు దశరథుడి చేత పుత్రకామేష్టి చేయించాడు. ఆయన అగ్నిలో వేల్చే హవిస్సులు పుచ్చు కోవటానికి సమస్త దేవతలూ అక్కడికి వచ్చి తమ ఉచిత స్థానాలలో కూచున్నారు. అప్పుడు దేవతలు బ్రహ్మతో రావణాసురుడు తమను పెడుతున్న కష్టాల వివరించి చెప్పుకున్నారు.
దానికి బ్రహ్మ, "దుర్మార్గుడైన రావణుడు దేవ దానవ గంధర్వ యక్ష రాక్షసులచేత చావు లేకుండా వరం అడిగాడుగాని, మనుషుల మీదితేలిక భావంకొద్దీ వారి వల్ల చావులేకుండా వరం కోరలేదు. ఇడుగో మహావుష్ణువు, దసరధుడి
భార్యలలో ఒకరికి కొడుకుగా పుట్టి నరరూపంతో రావణాసురుణ్ణి సంహరిస్తాడు," అని దేవతలతో అన్నాడు. దేవతలు పరమా నందం చెందారు. ఇంతలో హొమగుండం నుంచి కళ్ళు జిగేలుమనే ఒక దివ్యస్వరూ పుడు పైకి వచ్చాడు. ఆ దివ్యస్వరూపుడు తన చేతులలో కలశాన్నిపట్టుకుని ఉన్నాడు. కలశం మేలిమి బంగారుతో చేసినది, దాని పై మూత వెండిది. ఆ దివ్యస్వరూపుడు దశరధుడితో, "ఓ రాజా, దేవతలు ఈ కలశంలో తాము వండిన పాయసాన్ని నింపి ఇచ్చారు. ప్రజాపతి ఆజ్ఞపై నేను దీన్ని తెచ్చాను. ఈ పాయసాన్ని నీ భార్యలకిచ్చినట్లయితే వారికి గర్భోత్పతి అయి, కొడుకులు కలుగుతారు," అన్నాడు. దశరథుడు పరమానందంతో ఆ కలశాన్నిఅందుకుని, దివ్య స్వరూపుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. మరుక్షణమే ఆ దివ్యస్వరూపుడు అదృశ్యమై పోయాడు.
దశరథుడు ఆ కలశంలోని పాయసంలో సగం కౌసల్య కిచ్చాడు. మిగిలిన దానిలో సగం సుమిత్ర కిచ్చాడు. సుమిత్ర కివ్వగా మిగిలిన దానిలో సగం కైకేయి కిచ్చి, ముగ్గురూ తీసుకోగా మిగిలిన పాయసాన్ని మరొకసారి సుమిత్రకే ఇచ్చాడు. త్వరలోనే కౌసల్యా, సుమిత్రా, కైకేయీ గర్బవతు లయ్యారు.
ఒక వంక మహావిష్ణువు మానవుడుగా అవతరించటానికి ప్రయత్నాలు సాగుతూంటే, ఇంకోవంక బ్రహ్మ ఆజ్ఞ చొప్పున దేవతలు కామరూపులైన వానరులను సృష్టించారు. దేవేంద్రుడికి వాలీ, సూర్యుడికి సుగ్రీవుడూ, బృహస్పతికి తారుడూ, కుబేరుడికి గందమాదనుడూ, విశ్వకర్మకు నలుడూ, అగ్నికి నీలుడు, అశ్వనీదేవతలకు మైందద్వివిదులూ, వరుణుడికి సుషేణుడూ, పర్జన్యుడికి శరభుడూ, వాయుదేవుడికి హానుమంతుడూ పుట్టారు. వీరందరు మహా బలులైన వానర శ్రేష్ఠులు. ఇతర దేవతలకు వేల సంఖ్యలో వానరమూక పుట్టింది. ఈవానరులు ఋష్యమూకం అనే పర్వతం దగ్గిర స్థిరపడి, వాలి సుగ్రీవులను రాజులుగా పెట్టుకుని, నలుడూ, నీలుడూ, హనుమంతుడూ మొదలైన వారిని మంత్రులుగా పెట్టుకుని జీవించసాగారు.
పుత్రకామేష్ఠి ముగిసిన పన్నెండవ నెలలో చైత్రశుద్ద నవమినాడు పునర్వసు నక్షత్రాన కౌసల్య రాముణ్ణి ప్రసవించింది. పుష్యమీ నక్షత్రంలో కైకేయికి భరతుడు పుట్టాడు.
అశ్లేషా నక్షత్రంలో మిట్టమధ్యాహ్నంవేళ సుమి త్రకు లక్ష్మణ శత్రుఘ్నులు కలిగారు. అయోధ్యానగరంలో పౌరులు ఉత్సవా లు చేసుకున్నారు. వీధులు జనంతోనూ, నాట్యం చేసేవాళ్లతోనూ, గాయకులతోనూ కిటకిట లాడిపోయాయి. దశరథుడు అంతులేని గోదానాలూ, అన్నప్రదానాలూ చేయించాడు.
నలుగురు పిల్లలూ క్రమంగా ఎదిగి పెద్ద వారవుతున్నారు. ఒక తల్లి బిడ్డలు కాకపోయినా, రామలక్ష్మణులు ఎప్పుడూ కలసి ఉండేవారు. అదేవిధంగా భరతశత్రుఘ్నులు ఎప్పుడూ జంటగా తిరిగేవారు. వారు నలుగురూ వేదశాస్త్రలు అధ్యయనం చేసి, విలువిద్యలో ఆరితేరి,తండ్రికి శుశ్రూషలుచేస్తూయౌవనంతులయ్యారు. దశరథుడు వారివివాహాలను గురించి మంత్రులతోనూ, పురోహితులతోనూ ఆలోచనలు ప్రారంభించాడు.
రాజూ, మంత్రులూ ఈ ఆలోచనలో ఉన్నసమయంలో ద్వారపాలకులు వచ్చి, "మహారాజా, కుశికవంశం వాడూ, గాధిరాజు కుమారుడూ అయిన, విశ్వామిత్ర మహాముని తమ దర్శనంకోరి వచ్చి ద్వారం వద్ద ఉన్నారు,"అనిచెప్పారు. వెంటనే దశరథుడు పురోహితుణ్ణి వెంటబెట్టుకుని, విశ్వామిత్రుడికి ఎదురు వెళ్ళి ఆర్ఘ్యపాద్యాలతో పూజించాడు.
విశ్వామిత్రుడు, "రాజా, నీవూ, నీ ప్రజలూ క్షేమంగా ఉంటున్నరా? శత్రు భయమేమీ లేదుగదా!" అని కుశల ప్రశ్నలు చేసి, వసిష్ఠాది మునులను పలకరించి రాజభవనం ప్రవేశించి ఉచితాసనంమీద కూర్చున్నాడు. "మహామునీ, మీ రాక నాకెంతో ఆనందాన్ని కలిగించింది. నా వల్ల మీకు కావలిసినదేమిటి?" అని దశరథుడు అన్నాడు.
విశ్వామిత్రుడు ఈ మాటకు సంతోషించి, "రాజా, నేను వచ్చిన పని నెరవేర్చి సత్యసంధుణ్ణి అనిపించుకో. నేనొక యాగం తలపెట్టి ఆరంభించేసరికి ఇద్దరు రాక్షసులు, బలపరాక్రమవంతులు, నా యజ్ఞవేదికపై రక్తమాంసాలు కుమ్మరించి అపవిత్రం చేసి, నా వ్రతసంకల్పం పాడుచేశారు. నా వెంట నీ పెద్దకొడుకైన రాముణ్ణి పంపించు. నా యజ్ఞాన్ని మారీచ సుబాహూలనే ఆ రాక్షసులు భగ్నం చెయ్యకుండా అతడు రక్షిస్తాడు," అన్నాడు.
ఈ మాటలు వినగానే దశరథుడి గుండెబద్దలయినట్టయింది, భయమూ దు:ఖమూ ముంచుకొచ్చాయి.
ఆయన సింహాసనం మీది నుంచి లేచి వణుకుతూ," మహామునీ, రాముడు పసివాడు. వాడికింకా పదహారేళ్ళయినా నిండలేదు. వాడికి విలువిద్య కూడా సరిగా రాదు. రాక్షసులతో ఎక్కడయుద్ధం చేస్తాడు. నా దగ్గిర ఒక అక్షౌహిణి సేన ఉన్నది. నేనే వచ్చి ఆ రాక్షసులను చంపేస్తాను. ఇంతకూ ఆ రాక్షసు లెవరు?" అన్నాడు.
దానికి విశ్వామిత్రుడిలా చెప్పాడు: "రావణుడనే రాక్షసరాజును నీ వెరుగు దువు కదా! అతడు బ్రహ్మను మెప్పించి గొప్ప శక్తులుపొందాడు. ఇంతకూ ఆ రావణుడు విశ్రవసుడి కొడుకు, కుబేరుడికి సాక్షాత్తూ తమ్ముడు. అతను స్వయంగా యజ్ఞభంగం చెయ్యలేనప్పుడు ఈ బలశాలులైన మారీచ సుబాహు లను పంపుతూ ఉంటాడు."
"హతవిదీ! రావణుడే? అతడి ముందునేనే నిలువలేను గదా. పసివాడు రాముడెలానిలుస్తాడు? ఆ మహా శక్తివంతుడి పైకి రాముణ్ణి పంపించటం ఎంత మాత్రమూ పొసగదు," అన్నాడు దశరథుడు.
కోపంతో విశ్వామిత్రుడి కళ్ళు ఎర్రబడ్డాయి. "మహారాజా, ఆడినమాట తప్పే వాడివనే అపకీర్తి మోస్తూ సుఖంగా ఉండు!" అంటూ ఆయన చివాలున లేచాడు.
అప్పుడు వసిష్ఠుడు దశరథుణ్ణి మందలిస్తూ, "రాజా, నీవు చేయరాని పని చేస్తున్నావు. ఆడినమాట తప్పి ఇక్ష్వాకు వంశానికి కళంకం తెస్తున్నావు. విశ్వామిత్రునికి తెలియని అస్త్రం లేదు, కొత్త అస్త్రాలు కూడా సృష్టించగలవాడు. ఆయన ఆ రాక్షసులను చంపలేక ఇంత దూరం వచ్చాడనుకున్నావా? నీ కొడుకులకు మేలు చేసేటందుకు వచ్చాడు. రాముణ్ణి నిశ్చింతగా ఆయన వెంట పంపు. ఆయన వెంట ఉండగా అతనికి ఏ ప్రమాదమూ రాదు," అని బోధిం చాడు. ఈ మాటలతో ధైర్యం తెచ్చుకున్నవాడై దశరథుడు రామ లక్ష్మణులను పిలిపించి, వారిని విశ్వామిత్రుడికి అప్పగించాడు. విశ్వామిత్రుడు ముందు నడుస్తుంటే చక్కగా అలంకరించబడిన రామ లక్ష్మణులు ఒకరి వెనుక ఒకరుగా ఆయనను అనుసరించారు. వారిద్దరి వద్దా విళ్ళున్నాయి. వారు చేతులలో కత్తులు పట్టుకుని విశ్వామిత్రుడి వెనకగా నడవసాగారు.




బాలకాండ -2




విశ్వామిత్రుడూ, ఆయన వెనకగా రామలక్ష్మణులూ ఒక కోసు దూరం నడచి వెళ్ళి నిండుగా ప్రవహిస్తూన్న సరయూనది దక్షిణపు గట్టు చేరుకున్నారు."నాయనా, రామా! నీవు వెంటనే ఆచమనంచేసి రా. నీకు బల, అతిబల అనే రెండు విద్యలిస్తాను. మంత్రాలతో కూడి ఉన్న ఈ విద్యలు నీకు అలసటా, జబ్బూ, రాకుండా చేస్తాయి. నీ రూపం చెక్కు చెదరకుండా ఉంచుతాయి. నిన్ను ఆపదల నుంచి కాపాడతాయి. ఆ మంత్రాలు జపిస్తూ ఉన్నంత కాలమూ నిన్ను మించిన అందగాడూ, తెలివిగలవాడూ, నేర్పరీ, వాదనలో నిన్ను మించగలవాడూ ప్రపంచంలో ఉండరు. ఆకలిదప్పు లుండవు. గొప్ప కీర్తి కలుగు తుంది," అన్నాడు విశ్వామిత్రుడు.
రాముడు సంతోషంతో ఆచమనం చేసి పరిశుద్ధుడై విశ్వామిత్రుడి నుంచి బల, అతిబలలను గ్రహించాడు. ఆ రాత్రికి వారు సరయూనది తీరాన విశ్రాంతి తీసుకున్నారు. తెల్లవారుతూనే విశ్వామిత్రుడు వారిని నిద్రలేపి, సరయూనదిలో స్నానాలు చేయించాడు. వారు తమ అనుష్ఠానాలు పూర్తిచేసుకుని విశ్వామిత్రుడి వెంట మళ్ళీ బయలుదేరి, సరయూనది గంగలో కలిసే చోటికి వచ్చారు.
అక్కడ ఒక ఆశ్రమం ఉన్నది. అక్కడ ఒకప్పుడు శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే మన్మధుడు ఆయన తపస్సుకు భంగం కలిగించటానికి వచ్చి, శివుడు తన మూడో కన్ను తెరిచేసరికి భస్మమైపోయాడు. అదిమొదలు ఆ ఆశ్రమంలో శివుడి శిష్యులైన మునులుంటున్నారు. మన్మధుడు తన అంగాన్ని-అంటే శరీరాన్ని-అక్కడ పోగొట్టుకున్నాడు గనక, ఆ ప్రాంతానికి అంగదేశమనే పేరు వచ్చింది.
రామలక్ష్మణులు ఈ విషయాలన్నీ విశ్వామిత్రుడి ద్వారా తెలుసుకుని, ఆ రాత్రి ఆ ఆశ్రమంలో గడిపి, మర్నాడు ఒకపడవలో గంగను దాటారు. ఆ తరవాత వారు కాలినడకను ఒక భయంకరమైన అరణ్యం ప్రవేశించారు. ఎక్కడా జనసంచారం లేచు. విడవకండా కీచురాళ్ళ అరుపులూ, సింహగర్జనలూ, పులుల గాండ్రింపులూ, అడవి పందుల గురగురలూ,ఏనుగుల ఘింకారాలూ వినవస్తున్నాయి. చండ్ర, మద్ది, మారేడు, తుమ్మ, రేగు మొదలైన చెట్లు దట్టంగా పెరిగి మనుషులు చొర రాకుండా ఉన్నది ఆ అరణ్యం.
రాముడా అరణ్యాన్ని చూసి ఆశ్చర్యపడి విశ్వామిత్రుణ్ణి, "మహామునీ, అతి భయంకరంగా కనిపిస్తున్న ఈ అరణ్యం పేరేమిటి?" అని అడిగాడు.
విశ్వామిత్రుడు ఆ అరణ్యం కథ అంతా రామలక్ష్మణులకు వివరంగా చెప్పాడు:
ఆ ప్రాంతంలో ఒకప్పుడు మలదమూ, కరూశమూ అని రెండు గొప్ప దేశాలుండేవి. ఈ ప్రాంతాలలో తాటక అనే యక్షినీ, దాని కొడుకు మారీచుడనేవాడూ చేరి రెండు దేశాలనూ నాశనం చేస్తున్నారు. వారికి భయపడి మనుషులెవరూ అటుకేసి రావటం లేదు. తాటక సామాన్యురాలు కాదు, వెయ్యి ఏనుగుల బలం కలది. అందుచేత అది సుభిక్షంగా ఉన్న రెండు దేశాలనూ మహారణ్యంగా మార్చగలిగింది.
ఈ మాట విని రాముడు, "స్వామీ, యక్షులు అల్పశక్తి గలవారంటారు గదా, ఈ తాటక అనే యక్షిణికి వెయ్యి ఏనుగుల బలం ఎలా వచ్చింది?" అని విశ్వామిత్రుణ్ణీ అడిగాడు.
"నాయనా, తాటకవృత్తాంతం కూడా చెబుతాను, విను. సుకేతుడనే గొప్ప యక్షుడుండేవాడు. ఆయన బిడ్డలను కోరి గొప్ప తపస్సుచేశాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు సంతోషించి, ఆయనకు కొడుకును ఇవ్వక, వెయ్యి ఏనుగుల బలంగల కూతురు కలిగే లాగుమటుకు వరమిచ్చాడు. బ్రహ్మవర ప్రభావం చేత సుకేతుడికి తాటక పుట్టి పెరగసాగింది. ఆమె యుక్తవయస్సు వచ్చి మంచి అందగత్తెగా తయారయింది. అప్పుడు సుకేతుడు ఆమెను సుందుడనే యక్షకుమారుడి కిచ్చి పెళ్ళి చేశాడు. వారిద్దరికీ కొన్నాళ్ళకు మారీచుడునే కొడుకు కలిగాడు.
వాడు పరాక్రమంలో ఇంద్రుణ్ణి పొలినవాడు, మితిమించిన గర్వం గలవాడు.
ఇలా ఉండగా ఒక సంగతి జరిగింది. ఈ ప్రాంతాలనే తపస్సు చేసుకుటున్న అగస్త్యుడు తాటక భర్త అయిన సుందుణ్ణి చంపాడు. అందుకని తాటకా, మారీచుడూ అగస్త్యుడిపై ఆగ్రహించి, గట్టిగా అరుస్తూ ఆయనను తినేసేటట్టుగా మీదికి వచ్చారు. ఆప్పుడగస్త్యుడు వారిద్దరినీ రాక్షసులు కమ్మని శపించాడు. మారీచుడు రాక్షసుడైపోయాడు. తాటక తన అందమంతా కోల్పోయి భయంకరాకారం ధరించి, నరభక్షిణిగా మారిపోయింది. తాటక అగస్త్యుణ్ణి ఏమీ చెయ్యలేక ఆయన సంచరించిన ఈ పుణ్య భూమిని పాడు పెట్టేస్తూ బీభత్సం కలిగిస్తున్నది. అందుచేత, ఓ రామా, నీవా తాటకను వధించు. ఆడదని సంకోచించకు. ఆమే చేస్తున్న దుర్మార్గానికి అంతులేదు. ఆమెను చంపినందువల్ల నీకు కొంచెమైనా పాపం రాదు," అని విశ్వామిత్రుడు చెప్పాడు.
రాముడు చేతులు జోడించి, "మహామునీ, మాతండ్రి మీరు చెప్పినదెల్లా చెయ్యమని ఆజ్ఞాపించి మీ వెంట పంపారు. అందుచేత మీ ఆజ్ఞ చొప్పున అలాగే తాటకను చంపుతాను," అన్నాడు.
ఆ తరవాత రాముడు బాణంచేత పట్టిదాని తాడును బలంగాలాడి ఖంగు ఖంగుమని మోగించాడు. ఈ చప్పుడు వినపడే సరికి తాటకా వనంలో ఉండేవారంతా ఉలిక్కి పడ్డారు. తాటక మండిపడి ఆ ధ్వని వినిపించిన వేపు అతివేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. తమకేసివచ్చే తాటకను చూసి రాముడు లక్ష్మణుడితో, "చూశావా, లక్ష్మణా, ఈమె ఎంత వికారాకారం కలిగి, ధైర్యవంతులకు కూడా భితి కలిగించేదిగా ఉన్నదో! అయినా, ఈ ఆడదాన్ని చంపడానికి నాకు చేతులు రావటంలేదు. దగ్గిరికి రానీ, ముక్కూ, చెవులూ కోసి, పొగరు అణచి తరిమేద్దాం!" అన్నాడు.
తాటక ఈ మాటలు విని మరింత ఉగ్రురాలై చేతులు పైకెత్తి రాముడు మీదికి వచ్చి, దుమ్ము చిమ్ముతూ రామలక్ష్మణులను కప్పేసి, వారిపై రాళ్ళవాన కురిపించ సాగింది. రాముడు దాని చేతులు రెండు చేతులు రెండూ తన బాణాలతో తెగగొట్టాడు. లక్ష్మణుడు అతి కోపంతో దాని ముక్కూ, చెవులూ కోసేశాడు. కాని మాయావి అయిన తాటక వాళ్ళపై మళ్ళీ రాళ్ళవాన కురిపీంచసాగింది.
అప్పుడు విశ్వామిత్రుడు, "రామా, ఈ పాపాత్మురాలిని దయతలుస్తావేమిటి? ఇది ప్రాణాలతో ఉంటే ఇంకా ఎన్ని మాయలైనా చెయ్యగలదు. సంధ్యాకాలం లోపల దీన్ని చంపెయ్యి. ఉదయవేళా, సాయం సమయానా రాక్షసులకు బలం హెచ్చు. ఆ సమయంలో వారిని జయించటం కష్టం," అని హెచ్చరించాడు.
ఈమాట విని రాముడు తాటక రొమ్ములోకి ఒక్క బాణం బలంగా కొట్టాడు. ఆ దెబ్బతో అది నేలమీద పడి, గిలగిలా తన్నుకుని ప్రాణాలు వదిలింది.
విశ్వామిత్రుడు పరమానందభరితుడై రాముణ్ణి దగ్గరికి తీసుకుని, తల వాసన చూసి, "నాయనా, ఈ దుష్టురాలిని చంపి చాలా మేలు చేశావు. ఈ రాత్రికి మనం ఇక్కడనే ఉండి, తెల్లవారి మన ఆశ్రమానికి పోదాం," అన్నాడు.
మర్నాడు వేకువజామునే ఆయన రాముణ్ణిలేపి, తాను శుచి అయి, తూర్పు ముఖంగా కూచుని రాముడికి అనేక అస్త్రాల తాలూకు మంత్రాలు ఉపదేశించి, జపం చేశాడు. అంతలోనే ఆ అస్త్రాలన్నీ రాముడి ఎదట తమ రూపాలతొ నిలబడి, చేతులు జోడించి, "మేము నీ భృత్యులం. ఏ పని చెబితే అది చేస్తాం," అన్నాయి. రాముడు ఆ అస్త్రాలను చేతితో తాకి, "ఇప్పటికి మీరంతా నా మనసులోచేరి ఉండండి," అని చెప్పాడు.
తరవాత రాముడు విశ్వామిత్రుడి నుంచి అస్త్రాలను ఉపసంహరించే మంత్రాలు కూడా అడిగి తెలుసుకున్నాడు. తరవాత వారు ముగ్గురూ ప్రయాణం సాగించారు.
వారు కొంతదూరం పోయేసరికి ఒక కొండ పక్కగా ఒక అందమైన వనం కనిపించింది. రాముడది చూసి, "స్వామీ, ఈ వనం చూస్తే నాకెంతో ఆనందంగా ఉన్నది. ఇది ఒక ఆశ్రమమనికూడా తోస్తున్నది. దీని కథ ఏమిటి?" అని అడిగాడు. విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్పాడు:
"నాయనా, పూర్వం విరోచనుడి కొడుకైన బలి మహా బలపరాక్రమశాలి అయి, మూడులోకాలనూ జయించి స్వర్గలోకం ఆక్రమించే సరికి, మహావిష్ణువు కశ్యపుడికి వామనుడుగా పుట్టి, బలి చేసే మహాయాగానికి వెళ్ళి బలిని మూడడుగుల భూమి యాచించాడు. బలి ఇచ్చాడు. వామనుడు మూడడుగులూ కొలిచి మూడు లోకాలూ పుచ్చుకుని బలిని అధో లోకానికి పంపేశాడు. ఆ వామనుడూ, ఆయన తండ్రి కశ్యపుడూ కూడా ఈ ఆశ్రమంలోనే దీర్ఘతపస్సు చేశారు. అందుచేత నేను కూడైక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాను. రాక్షసులు మాటి మాటికీ వచ్చి నన్ను చాలా క్షోభపెడుతున్నారు. వరందరినీ నీవు చంపాలి."
విశ్వామిత్రుడుంటున్న ఆశ్రమం పేరు సిద్దాశ్రమం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సహా ఆశ్రమం ప్రవేశించగానే అక్కడ ఉండే మునులందరూ సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి విశ్వామిత్రుణ్ణి పూజించి, రామలక్ష్మణులకు అతిథి సత్కారాలు చేశారు. రామలక్ష్మణులు కొంచెంసేపు విశ్రమించిప్రయాణపు బడలిక తీర్చుకుని, విశ్వామిత్రుడి వద్దకు వచ్చి నమస్కారం చేసి, "మహామునీ, ఇక మీరు యాగం సాగించే ప్రయత్నాలు చేయవచ్చు. మీ యాగాన్ని మేము రక్షిస్తాము," అని చెప్పారు.
విశ్వామిత్రుడు జవాబు చెప్పలేదు, కాని యజ్ఞవేదిక చుట్టూ చేరిన మునులు రామలక్ష్మణిలతో, "నాయనలారా, విశ్వామిత్రుడు యాగదీక్షలో ఉండటంచేత మౌనంగా ఉండాలి. ఇవాళ మొదలు ఆరు రోజులదాకా ఎలాంటి విఘ్నాలూ రాకుండా మీరు మమ్మల్ని కాపాడాలి," అని చెప్పారు.
రామలక్ష్మణులు పెద్ద పెద్ద బాణాలు ధరించి, ఎంతో జాగ్రత్త వహించి రాత్రివేళ నిద్రకూడా మాని అయిదు పగళ్ళూ, అయిదు రాత్రులూ ఆశ్రమాన్ని కాపాడారు. ఆరో రోజు వచ్చింది.
యజ్ఞశాలలో అగ్ని దేదీప్యమనంగా వెలుగుతున్నది. విధియుక్తంగా, మంత్రోక్తంగా యాగం నుడుస్తున్నది. ఆ సమయంలో ఆకాశం నుంచి పెడబొబ్బలు వినిపించాయి. సుబాహు మారీచులూ, వారి బలగానికి చెందిన రాక్షసులూ కారుమేఘాల లాగా ఆకశం ఆవరించి యజ్ఞ వేదికపై రక్తవర్షం కురిపించసాగారు.
రాముడు రాక్షసుల ఆర్బాటాలు విని, తల ఎత్తి ఆకశంలోని రాక్షసమూకను చూశాడు. అతను మానవాస్త్రం ఎక్కుపెట్టి మారీచుణ్ణీకొట్టాడు. ఆ దెబ్బకు వాడు వెళ్ళి సముద్రంలో పడ్డాడు. తరవాత రాముడు ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణీ, వాయవ్యాస్త్రంతో మిగిలిన రాక్షసులనూ చంపేశాడు. విశ్వమిత్రుడి యాగంపూర్తి అయింది. ఆయన రాముడితో, "నాయనా, నాకు చాలా గొప్ప ఉపకారం చేశావు," అంటూ అతన్ని ప్రశంసించాడు.




బాలకాండ -3




తాటకను సంహరించి, మారీచ సుబాహులను కొట్టి, విశ్వామిత్రుడి యాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగించిన నాటి రాత్రి రామ లక్ష్మణులు హాయిగా నిద్రపోయి వేకువతోనేలేచారు. వారు కాలకృతాలు తీర్చుకుని,విశ్వామిత్రుడూ ఇతర మునులూ ఉండేచోటికి వెళ్ళి, వారందరికీ నమస్కారాలు చేసి, విశ్వామిత్రు డితో, "మహామునీ, మీ ఆజ్ఞ నిర్వర్తించాము. ఇంకా చెయ్యవలిసిన పనులేవైనా ఉంటే సెలవియ్యండి," అని అడిగారు వినయంగా.
అప్పుడు మునులు రామలక్ష్మణులతో ఇలా చెప్పారు: "మిధిలానగరాన్ని పాలించే జనక మహారాజు ఒక గొప్పయాగం చెయ్యబోతున్నాడు. మేమంతా బయలుదేరి అక్కడికి వెళుతున్నాము. ఒకప్పుడా జనక మహారాజు ఒక యాగం చేసి దానికి ఫలితంగా దేవతల నుంచి ఒక అద్భుతమైన ధనుస్సు సంపాదించాడు. దేదీప్య మానంగా వెలిగిపోయే ఆ ధనుస్సును ఆ మహారాజు తన ఇంట ఉంచుకుని రోజూ సుగంధధూప దీపాలతో అర్చిస్తూఉంటాడు. ఆ ధనుస్సును దేవతలుగాని, రాక్షసులుగాని ఎక్కుపెట్టలేరంటే ఇక మనుషుల మాట చెప్పాలా? మహా బలశాలులైన రాజులూ, రాజకుమారులూ ఎందరో ప్రయత్నించి కూడా దాన్ని ఎక్కుపెట్టలేక పోయారు. కొందరయితే అసలు కదిలించలేక పోయారు. మీరు కూడా వచ్చినట్లయితే జనక మహారాజు చేసే యాగాన్నీ, ఆ అద్భుదమైన ధనుస్సునూ చూడగలుగుతారు."
అప్పుడే ప్రయాణ సన్నాహాలు జరిగాయి. విశ్వామిత్రుడు వనపాలకులతో, "నేను మిగిలిన మునులందరినీ వెంట బెట్టుకుని ఇప్పుడే బయలుదేరి గంగానదికి ఉత్తరంగా హిమాలయాలకేసి వెళుతున్నాను," అని చెప్పి, సిద్దాశ్రమానికి మూడుసార్లు ప్రదక్షిణంచేసి తిరిగి వచ్చాడు.
తరవాత మునులందరూ రామలక్ష్మణులతో ఉత్తరాభిముఖులైబయలుదేరారు. వారి వెనుక కొన్నివందల బండ్లమీద సమిధలూ, ఇంధనా లూ మొదలైన అగ్ని సాధనాలువచ్చాయి. వారు పగలల్లా చాలా దూరం నడిచి అస్తమయ వేళకు శోణానదీ తీరాన్ని చేరుకున్నారు.అక్కడ వారంతా స్నానసంధ్యానుష్ఠానాలన్నీ తీర్చు కున్నాక రామలక్ష్మణులు విశ్వామిత్రుడికి ఎదురుగా కూర్చుని, "స్వామీ, ఎటువైపుచూ సినా అందమైన వనాలుగల ఈ దేశం ఏదీ? దీని వృత్తాంతమేమిటి?" అని అడిగారు ఎంతో వినయంగా.
ఆ ప్రశ్నకు సమాధానంగా విశ్వామిత్రుడు ఆ దేశం గురించీ, తన వంశం గురించీ ఇలా చెప్పాడు: "పూర్వం బ్రహ్మయొక్క కుమారుడు కుశుడనే మహాతపస్వి ఉండేవాడు. ఆయన వైదర్భి అనే ఒక రాజకుమారైను పెళ్ళాడి, ఆవిడకు నలుగురు కుమారులను-కుశాంబుడు కుశనాభుడు, ఆధూర్తరజసుడు, వసువు అనేవారిని-కన్నాడు. ఆయన క్షత్రియధర్మాన్ని పెంపొందించగోరి తన నలుగురు కొడుకులనూ భూమిని పంచుకుని, న్యాయంగా ప్రజా పరిపాలన చేయవలిసిందిగా ఆజ్ఞాపించాడు. వారు కూడా ఆ విధంగానే నాలుగు గొప్ప నగరాలను తమ రాజధానులుగా చేసుకుని రాజ్యపాలన చేశారు.
కుశాంబుడి రాజధాని కౌశాంబి; కుశనాభుడి రాజధాని పేరు మహొదయం; ఆధూర్తరజసుడు ధర్మరణ్యమనే పట్టణన్ని రాజధాని చేసుకున్నాడు; వసువు అనేవాడు గిరివ్రజం రాజధానిగా పెట్టుకుని పాలించాడు. మనం ఇప్పుడున్నది ఆయన పాలించిన అందమైన వనాలుగల దేశంలోనే. "ఈ దేశంచుట్టూ అయిదు అందమైన పర్వతాలున్నాయి. ఈ శోణానది ఆ పర్వతాలలోనే పుట్టి ఈ ప్రదేశాన్ని సారవంతంగానూ, సస్యశ్యామలంగానూ చేస్తున్నది. ఇది తూర్పున పుట్టి పడమరకు ప్రవహీంచే నది.
కుశుడి కుమారులలో కుశనాభుడనే వాడో కడని చెప్పానుగద. ఆయనకు ఘృతాచి అనే భార్య ఉండేది. వారిద్దరికీ నూరుమంది ఆడ పిల్లలు కలిగారు. వారంతా చక్కని చుక్కలు. ఒకనాడు ఆ నూరుమంది కన్యలూ ఆడుతూ, పాడుతూ ఉల్లాసంగా వనవిహారం చేస్తూండగా వాయుదేవుడు వారిని చూసి తనను పెళ్ళాడ మని కోరుతూ, అలా చేసినట్టయితే వారిని ముసలితనమూ, చావూ లేని దేవతలుగా చేస్తానన్నాడు. కాని ఆ కన్యలు వాయుదేవుణ్ణి తిట్టి, తమ తండ్రి నిర్ణయించిన భర్తను తప్ప చేసుకోమన్నారు. వాయుదేవుడికి ఆగ్రహం వచ్చి వారందరినీ మరుగుజ్జులుగా చేసేశాడు. అప్పుడా కన్యలు ఏడుస్తూ తండ్రి దగ్గిరికి వెళ్ళి జరిగినదంతా చెప్పుకు న్నారు. "తన కుమార్తెలు ప్రదర్శించిన ఐకమత్యమూ, వంశాభిమానమూ చూసి కుశనాభుడు ఎంతగానో సంతోషించాడు.
వారిని ఇక పెళ్ళిలేకుండా ఉంచటం అంత క్షేమం కాదనుకుని ఆయన, కాంపి ల్యపురాన్ని పాలించే బ్రహ్మదత్తుడనే రాజుకు తన కుమార్తెలందరినీ ఇచ్చి పెళ్ళిచేశాడు. బ్రహ్మదత్తుడు తాకగానే వారందరికీ మరుగుజ్జుతనం పోయింది. కూతుళ్ళ కందరికీ పెళ్ళిచేశాక కుశనాభుడు కొడుకునుకోరి పుత్రకామేష్టి చేశాడు. ఆయనకు గాధి అనే ధర్మాత్ముడైన కొడుకు కలిగాడు. ఆ గాధి రాజు కొడుకునే నేను.
నాకు సత్యవతి అనే అక్క ఒకామె ఉండేది. ఆమెను ఋచీకుడి కిచ్చి చేశారు. ఆవిడ మహా పతివ్రత. మేము కుసుశికవంశం వాళ్ళం గనక మమ్మల్ని కౌశికులని కూడా అంటారు. మా అక్కపేరుతో కౌశికి అనేనది ఏర్పడింది. మా అక్కపైగల అభిమనం కొద్దీ నేను హిమవత్ర్పాంతంలో కౌశికీ నదీ తీరానే ఉంటున్నాను. అయితే యాగం నిమిత్తమై సిద్ధాశ్రమానికి వచ్చానన్న మాట. మన కబుర్లతో అప్పుడే సగం రాత్రి గడిచిపొయింది. రామా, ఇక మీరిద్దరూ పడుకుని నిద్రపొండి!" ప్రయాణపు బడలిక మూలాన రామ లక్ష్మణులు ఆ రాత్రి గాఢ నిద్రపోయి, తెల్లవారి విశ్వామిత్రుడు లేపినదాకా లేవలేదు. అప్పుడు వారు కాలకృత్యలు తీర్చుకుని శోణానదిని అందరూ దాటే రేపులో దాటారు. అది ఆటే లోతైన నదికాదు; ఇసుకతిన్నెలతో చాలా అందంగా ఉన్నది.
వారా నదిని దాటి మళ్ళీ నడక సాగించి మధ్యా హ్నం వేళకు గంగాతీరాన్ని చేరుకున్నారు. పవిత్రమైన గంగను చూడగానే అందరికీ అంతు లేని ఆనందం కలిగింది. అక్కడవారు స్నానం చేసి, దేవతర్పణలూ, పితృతర్పణలూ చేసుకుని, హొమం చేసి, భోజనాలు పూర్తిచేసుకుని గంగా తీరాన విశ్వామిత్రుడి చుట్టూ కూచున్నారు. అప్పుడా మహర్షి వారందరికీ గంగ వృత్తాంతం ఇలా చెప్పాడు:
హిమవంతుడనే పర్వతరాజుకు గంగ, ఉమ అని ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్దదైన గంగను దేవతలు పర్వతరాజును బతిమాలి స్వర్గానికి తీసుకుపోయారు. ఉమను పరమశివుడు పెళ్ళి చేసుకున్నాడు. కాలక్రమాన సగర చక్రవర్తి మనమడికి మనమడైన భగీరధుడు గంగను అతి ప్రయాసతో స్వర్గం నుంచి భూమికి తెచ్చి, భూమి నుంచి పాతాళానికి కూడా తీసుకుపోయాడు.
విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు గంగావతరణకధా, కుమారస్వామి జన్మవృత్తాంతమూ సవిస్తరంగా చెప్పాడు. ఆ రాత్రి వారందరూ గంగయొక్క దక్షిణపు గట్టున గడిపి, మర్నాడు తెల్లవారగానే దర్భాసనాలు పరిచిన పడవలలో ఉత్తరపు గట్టుకు చేరుకున్నారు. అక్కడ వారికి విశాలానగరం కనిపించింది. ఆ నగరాన్ని చాలాసేపు చూసినాక రాముడు విశ్వామిత్రుణ్ణి, "మహామునీ, ఈ నగరాన్ని పాలిస్తున్నది ఏ వంశపు రాజులు? వారి కధ ఏమిటి?" అని అడిగాడు.
ఆప్రశ్నకు సమాధానంగా విశ్వామిత్రుడు, దేవదానవులు క్షీరసాగరాన్ని మధించటమూ, అందులో పుట్టిన హాలాహలాన్ని శివుడు మింగటమూ, అమృతం పుట్టగా దానికోసం దేవదానవులు పోట్లాడుకుంటూంటే విష్ణువు మోహిని రూపంలో వచ్చి అమృతాన్ని హరించి, తనను ఎదిరించిన వారినందరినీ చంపి, తనను శరణు జోచ్చిన వారిని కాపాడటమూ మొదలైన విషయాలన్ని వివరంగా చెప్పి, ఇలా అన్నాడు:తన కొడుకులందరూ ఇంద్రుడి చేతిలో చనిపోయేసరికి దితి తన భర్త అయిన కశ్యపుడి వద్దకు వెళ్ళి, ఇంద్రుణ్ణి చంపగల కొడుకు తనకు కలిగేటట్టు వరమి య్యవలిసిందని వేడుకున్నది. "నీవు వెయ్యి సంవత్సరాలు నిష్ఠతో, ఎలాటిమై లకూడా సోకకుండా, తపస్సు చేసినట్టయితే, ఇంద్రుణ్ణి చంపి, ముల్లోకాలూ ఏలగల కొడుకు కలుగుతాడు," అని కశ్యపుడు దితికి వరమిచ్చాడు.దితి సంతోషించి కుశప్లవనమనే చోట చేరి కఠోరమైన తపస్సు ప్రారంభించింది.
ఇంద్రుడు ఆమె వద్దకు వచ్చి ఎంతో భక్తితో ఆమెకు సేవలు చేస్తూ, నీరూ, సమిధలూ, దర్భలూ, కందమూల ఫలాలూ తెచ్చి ఇస్తూ వచ్చాడు. తొమ్మిది వందల తొంబై సంవత్సరాలు గడిచాయి. ఇంకా పదేళ్ళు గడిస్తే దితి గర్బం నుంచి ఇంద్రుణ్ణి చంపగలవాడుబయటికి వస్తాడు. ఒకనాటి మధ్యాన్నం ఈ సంగతి దితి ఇంద్రుడితో చెప్పి, "నాయనా, నాకు విసురుతున్నావు, కాళ్ళు పిసుకుతున్నవు. అందుచేత నాకు పుట్టే కొడుకు నీతో సఖ్యంగా ఉండేటట్లు నేను చూస్తాలే!" అన్నది. అలా అంటూ ఆమె తలను కాళ్ళు పెట్టవలిసిన చోట ఉంచి పక్క మీద పడుకుని నిద్రపోయింది.
ఈ విధంగా ఆమెకు మైలసోకింది. ఇలాటి అవకాశం కోసమే వేచివున్న ఇంద్రుడు వెంటనే అమె గర్భంలో ప్రవేశించి, పిండాన్ని తన వజ్రాయుధంతో ఏడు ముక్కలుగా నరికాడు. వారే దేవతా సమానులైన సప్తమారుతాలు.
"రామా, ఆ సమయంలో దితి తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంద్రుడు ఈ ప్రదేశంలోనే ఆమెకు సేవలుచేశాడు. అటు తరవాత ఇక్ష్వాకు మహారాజుకు విశాలుడనే కుమారుడు కలిగాడు. అతనే ఈ మహానగరాన్ని నిర్మించాడు. అందుకే దీనికి విశాలా నగరమనే పేరువచ్చింది. ఇప్పుడీ నగరాన్ని వారి వంశానికి చెందిన సుమతి అనేవాడు పాలిస్తున్నాడు," అనివిశ్వాత్రుడు రాముడితో అన్నాడు.
ఈలోపల సుమతి కూడా విశ్వామిత్రాదుల రాక తెలిసి బంధు మంత్రి పురోహి తులు మొదలైనవారితో ఎదురువచ్చి స్వాగతం చెప్పాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను సుమతికి పరిచయం చేశాడు. వారందరూ ఆ రాత్రికి సుమ తి అతిధులుగా ఉండి, తెల్లవారగానే మిధిలానగరానికి ప్రయాణమయ్యరు.
వారు మిధిలను చేరవచ్చే సమయంలో దారిలో ఒక పాడుబడిన ఆశ్రమం కనబడింది. ఆ ఆశ్రమం అందంగా ఉన్నప్పటికీ అందులో జనసంచారం లేకపో వటానికి కారణమేమిటని రాముడు అడిగాడు. "నాయనా,ఒకప్పుడీ ఆశ్రమంలో గౌతమ మహాముని తన భార్య అయిన అహల్యతో కూడా సాటిలేని తపస్సు చేసాడు. ఆయనకు ఆగ్రహం తెప్పించి ఆయన తపశ్శక్తి నిర్మూలించాలనే ఉద్దేశంతో, ఇంద్రుడు గౌతముడుస్నానానికిగాను నదికి వెళ్ళి ఉన్న సమ యంలో గౌతముడి రూపం ధరించి అహల్య వద్దకు వచ్చాడు. అహల్య అతన్ని తన భర్తే అనిపొరబడింది.
తిరిగి వెళుతూన్న ఇంద్రుడికి గౌతముడు తడిబట్టలతో ఎదురై, ఇంద్రుడికి శాపమిచ్చి, ఆశ్రమానికి వచ్చి తన భార్యను కూడా శపించాడు. ఆ శాపం ఫలితంగా ఆమెగాలి తప్ప మరొక ఆహారం లేక, ఎవరికీ కనబడకుండా ఈ ఆశ్రమంలో తపస్సమాధిలో ఉండిపోయింది. నిన్ను చూడగానే ఆమెకు శాపవిమోచనం కలిగేలాగు గౌతముడు అనుగ్రహించాడు గనక, మనం ఈ ఆశ్రమం ప్రవేశించి, ఆ అహల్య అందరికీ తిరిగి కనబడేలాగు చేద్దాం," అన్నాడు విశ్వామిత్రుడు. వారు లోపలికి వెళ్ళేసరికి రాముడి కళ్ళకు సూర్యుడి కాంతితో వెలిగిపోతూ, దేవతను బోలిన అందంగల అహల్య కనిపించింది.
ఆమె రాముణ్ణి చూడగానే ఆమెను మిగిలినవారు కూడా చూడగలిగారు. రామలక్ష్మణులు వంగి ఆమె కాళ్ళుతాకి నమస్కరించారు. తన భర్త చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకుని అహల్య రామలక్ష్మణుల కాళ్ళుతాకి, వారికి అర్ఘ్యపాద్యాలిచ్చింది. ఆ సమయానికే గౌతముడు కూడా తిరిగి వచ్చాడు. విశ్వామిత్రుడు అక్కడి నుంచి బయలుదేరి, రామలక్ష్మణులను వెంటబెట్టుకుని మిధాలినగరం ప్రవేశించాడు.




బాలకాండ -4




రామలక్ష్మణులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు ఈశాన్య దిక్కుగా వెళ్ళి జనక మహరాజు యజ్ఞం చేస్తున్న చోటికి చేరాడు . యజ్ఞశాల చుట్టూ అనేక ఋషి నివాసాలున్నాయి. విశ్వామిత్రుడు కాడా ఒక నివాసం తమకై ఏర్పాటు చేయించాడు .

ఈ లోపల జనకమహరాజుకు విశ్వామిత్రుడు వచ్చినట్టు తెలిసింది . ఆయన తన పురోహీతుడైన శతానందుడితో సహా వచ్చి విశ్వామిత్రుడుకి అర్ఘ్యపాద్యా లిచ్చి పూజించాడు. జనక మహరాజు విశ్వాముత్రుడితో తన యజ్ఙంపూర్తి కావటానికి ఇంకా పన్నెండు రోజులున్నవని చెప్పి , రామలక్ష్మణులను చూసి, " ఈ రాజపుత్రులెవరు? ఎవరి కుమారులు" అని అడిగాడు. విశ్వామిత్రుడు జన కుడికి రామలక్ష్మణులను పరిచయం చేసి, " మీ వద్ద ఉండే వింటిని ఎక్కుపె ట్టటం సాధ్యమవుతుందేమో చూడడానికి, ఈ రాకుమారులు ముఖ్యంగా ఇక్క డికి వచ్చారు," అని తెలియపరిచాడు.

జనకుడి వద్ద పురోహితుడుగా ఉంటున్న శతానందుడు అహల్యా గౌతముల పెద్ద కుమారుడు.రాముడి వల్ల తన తల్లికి శాపవిమోచనం జరిగిందనీ, తన తల్లిని శపించి వెళ్ళిపోయిన తంద్రి ఆశ్రమానికి తిరిగి వచ్చాడనీ విని శతానం దుడు ఎంతో సంతోషించాడు.అతను రాముడి కేసి తిరిగి, " రామా, ఈ విశ్వా మిత్ర మహముని అనుగ్రహం సంపాదించటం వల్ల నీవు ధన్యుడవయ్యావు. ఈ మహనీయుడి విచిత్రగాధ చెబుతాను విను," అంటూ,విశ్వామిత్రుడి జీవిత వృత్తాంతం ఈ విధంగా చెప్పసాగాడు:

బ్రహ్మదేవుడికి కుశుడనే కుమారుడు పుట్టాడు. ఆయనకు కుశనాభుడు పుట్టాడు. కుశనాభుడి కొడుకైన గాధికి విశ్వామిత్రుడు కొడుకైపుట్టి, చాలా కాలం రాజ్యం చేశాడు. ఆ కాలంలో ఆయన ఒక అక్షౌహిణి సేవను వెంట బెట్టుకుని పర్యటన చేస్తూ వసిష్ట మహిముని ఆశ్రమానికి వచ్చాడు. తపస్సు లో నిమగ్నులై ఉండే ఋషులతో అ ఆశ్రమం రెండో బ్రహ్మలో కంలాగా ఉన్నది.

తన అశ్రమంలోకి వచ్చిన విశ్వామిత్రుడికి వసిష్ఠుడు అతిథీ సత్కారాలు చేశాడు. ఇద్దరూ కుశలప్రశ్నలు చేసుకున్నారు. కొంచెంసేపు ఇష్టాగోష్ఠి జరిగాక వసిష్ఠుడు తన అతిథికీ ఆయన పరివారానికి విందు చేస్తానన్నాడు. " తమ దర్శనమే నాకు గొప్ప విందు. వేరే విందు లెందుకు?" అంటూ విశ్వామిత్రుడు బయలుదేరబోయాడు. కాని వసిష్ఠుడాయనను బలవంతాన ఆపి, శబల అనే తన కామధేనువును పిలిచి, భక్ష్యభోజ్యలేహ్య చోష్య పానీయాలోతో అందరికీ షడ్రసోపేతమైన విందు ఏర్పాటు చేయమన్నాడు. శబల అలాగే చేసింది. విశ్వా మిత్రుడీ విందుకు ఎంతో ఆనందించి, " మహర్షీ, నాకు శబలను ఇప్పించండి. దీనికి మారుగా లక్షగోవులను ఇచ్చుకుంటాను. శ్రేష్టమైన వస్తువులన్నీ రాజుకే చెందాలి గనక, న్యాయంగా ఈ కామధేనువు నాకే చెందాలి," అన్నాడు.

"మహారాజా, లక్షగోవులు కాదు, నూరుకోట్ల గోవుల నిచ్చినా నేను శబల నివ్వను. ఇదే నాకున్న ధనం. మా ఆశ్రమం యావత్తూ దీనిపైనే ఆధారపడి ఉన్నది," అన్నాడు వసిష్ఠుడు.
విశ్వామిత్రుడు వసిష్ఠుడికి అడిగినంత బంగార మిస్తానన్నాడు. రత్నరాసులి స్తానన్నాడు. శబలను ఎలాగైనా తన కివ్వమన్నాడు. వసిష్ఠుడు నిరాకరిం చాడు. అప్పుడు విశ్వామిత్రుడు శబలను బలాత్కారంగా తీసుకుపోవటానికి ఉద్యమించాడు. శబల తనను పట్టవచ్చిన రాజభటులను కుమ్మి, రంకెలు వేస్తూ, కన్నీరుకారుస్తూ వచ్చి వసిష్ఠుడి కాళ్ళపై బడి, "ఏమిటీ అన్యాయం?" అన్నది. వసిష్ఠుడు శబలతో, "విశ్వామిత్రుడు అక్షౌహిణిసేనతో వచ్చిన బలశాలి. నాకాబలం లేదు. నేనేం చేసేది?" అని అడిగాడు.

"తమ తపశ్శక్తి ముందు ఈ విశ్వామిత్రుడి బలం ఏమిటి? ఈ సేనలను సర్వ నాసనం చేయగల బలాలను, నేనే సృష్టిస్తాను, నాకు అనుమతి నివ్వండి," అన్నది కామధేనువు.కామధేనువు రంకెలు వేస్తూంటే పప్లవులూ, మ్లేచ్చులూ అనంతంగా పుట్టుకొచ్చి విశ్వామిత్రుడి సేనలను నుగ్గు చెయ్యసాగారు. విశ్వామిత్రుడు రథమెక్కి తనకు తెలిసిన దివ్యాస్త్రాలను ఈ సేనలపై ప్రమోగించసాగాడు. కామధేనువు ఇంకా శకులనూ, కాంభోజులనూ, హరీతులనూ, కిరాతులనూ సృష్టిస్తూనే ఉన్నది. వారు విశ్వామిత్రుడి సేనను మట్టు పెట్టేస్తున్నారు. ఇది చూసి విశ్వామిత్రుడి కొడుకులు నూరుమంది ఆయుధాలతో వసిష్ఠుడిపైకి వెళ్ళారు.

ఆయన ఒక్కసారి హుంకారం చేసేసరికి నూరుగురూ భస్మమై పోయారు. తన సేన అంతా పోయింది, నూరుగురు కొడుకులు క్షణంలో చచ్చారు. విశ్వామిత్రుడికి తీరని పరాభవం జరిగింది. ఆయన రెక్కలు విరిచిన పక్షిలాగా అయిపోయి, చావగా మిగిలిన ఒక కొడుకుపై రాజ్యభారం వేసి, హిమాలయానికి వెళ్ళీ అక్కడ శివుణ్ణి గురించి తపస్సు చేశాడు.కొంత కాలానికి శివుడు ప్రత్యక్షమై ఏమివరం కావాలో కోరుకోమన్నాడు.

దేవతలూ, గంధర్వులూ,యక్షులూ, రాక్షసులూ అధిదేవతలుగా గల అస్త్రాలన్నీ తనకు వశం కావాలనీ, సాంగోపాంగంగా ధనుర్వేదమంతా తనకు కరతలా మలకం కావాలనీ విశ్వామిత్రుడు కోరాడు. శివుడు ఆయన కోరిక తీర్చి అంతర్థానమైనాడు. ఈ విధంగా సాధించిన అస్త్రాలతో వసిష్ఠుణ్ణి నిర్మూలించదలిచి విశ్వామిత్రుడు వసిష్ఠాశ్రమం ప్రవేశించి, తన అస్త్రాలతో ఆశ్రమాన్ని దహించసాగాడు. అక్కడి ఋషులు చెల్లాచెదరుగా పరిగెత్తారు. పక్షులూ, మృగాలూ పారిపోయాయి. క్షణంలో ఆశ్రమం శూన్యమైపోయింది.

వసిష్ఠుడు ఆగ్రహావేశంతో తన బ్రహ్మదండం ఎత్తి విశ్వామిత్రుడి కెదురు వచ్చాడు. విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. వసిష్ఠుడి బ్రహ్మదం డాన్ని తగలగానే అది కాస్తా చల్లారిపోయింది.

విశ్వామిత్రుడు కొన్నివందల అస్త్రాలను ప్రయోగించాడు. కాని వసిష్ఠుడి బ్రహ్మదండం అన్నిటినీ దిగమింగేసింది. వసిష్ఠుడి బ్రహ్మదండం నుంచీ, ఆయన శరీరం నుంచీ జ్వాలలు చిమ్ముతున్నాయి, రవ్వలు లేస్తున్నాయి. ఇతర మునులు వసిష్ఠుణ్ణీ సమీపించి, "ఓ మహర్షీ, విశ్వామిత్రుణ్ణి జయించావు. ఇక శాంతించు!" అని వేడారు.

"బ్రహ్మతేజోబలం ముందు క్షత్రియ బలం ఎంత? నేను తపస్సు ద్వారా బ్రహ్మ త్వం సంపాదిస్తాను," అనుకుని విశ్వామిత్రుడు భార్యాసమేతంగా దక్షిణదిశకు వెళ్ళి, అక్కడ ఘోరమైన తపస్సు చేశాడు. ఆ సమయంలో ఆయనకు హవి ష్యందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారధుడు అనే నలుగురు కొడుకులు కలిగారు. కొంతకాలానికి బ్రహ్మప్రత్యక్షమై విశ్వామిత్రుడితో," నీ తపస్సు చేత నీకు రాజర్షిలోకాలు స్వాధీనమైనాయి. ఇక ముందు అందరిచేతా నీవు రాజర్షివని పిలవబడతావు," అని చెప్పాడు. రాజర్షి అనే బిరుదుతో విశ్వామిత్రుడు తృప్తి చెందలేదు. ఆయనకు బ్రహ్మర్షి అనిపించుకోవాలని ఉన్నది. అందుచేత ఆయన మళ్ళీ తపస్సు సాగించాడు.

ఆ కాలంలో ఇక్ష్వాకు వంశపు రాజు త్రిశంకు అనే వాడు బొందితో స్వర్గానికి పోవాలనుకున్నాడు. ఈ కోరికను తన కులగురువైన వసిష్ఠుడితో చెబితే, అది అసాధ్యమని ఆయన అన్నాడు. దక్షిణాన ఉంటున్న వసిష్ఠకుమారులు తనకు శాయపడతారేమోనని త్రిశంకు వారి వద్దకు వెళ్ళాడు. వాళ్ళు కోప్పడి త్రిశం కును వచ్చినదారి పట్టమన్నారు. అంతటితో బుద్దిరాక త్రిశంకు వాళ్ళను దెప్పి, మరెవరినైనా ఆశ్రయిస్తానన్నాడు. వసిష్ఠుడి నూరుగురు కొడుకులు మండి పడి, చండాలుడివి కమ్మని అతణ్ణీ శపించారు.

శాపం చేత త్రిశంకు నల్లటి ఆకారమూ, నల్లటి బట్టలూ, ఇనప సొమ్ములూ కలిగిన వడై వసిష్ఠుడి గర్భశత్రువైన విశ్వామిత్రుణ్ణి అశ్రయించాడు. విశ్వా మిత్రుడు త్రిశంకు చెప్పినదంతా విని, "నిన్ను ఈ ఆకారంతోటే స్వర్గానికి పంపుతాను, " అని మాట ఇచ్చాడు. ఆయన యజ్ఞం తలపెట్టి, అందుకు ఋషుల నందరినీ పిలుచుని తన శిష్యులను పంపాడు. ఆహ్వానాలు అందుకుని అందరూ వచ్చారు గాని, మహోదయుడనే వాడూ, వసిష్ఠుడి కొడుకులూ రాలేదు. రాని వరిని విశ్వామిత్రుడు ఘోరంగా శపించాడు. యజ్ఞం ఆరంభమయింది. కాని హవిస్సులు తీసుకోవటానికి దేవతలు రాలేదు. విశ్వామిత్రుడికి మండిపోయింది. ఆయన త్రిశంకుతో, "నే నింతకాలం తపస్సు చేసిసంపాదించిన శక్తితోనే నిన్ను స్వర్గానికి పంపుతాను," అన్నాడు.

మునులందరూ చూస్తుండగానే, త్రిశంకు తన శరీరంతోనే పైకి లేచి స్వర్గానికి వెల్లి పోయాడు. అయితే అక్కడున్న ఇంద్రాది దేవతలు త్రిశంకును స్వర్గానికి రానివ్వక, అతన్ని కిందికి తోసేశారు. త్రిశంకు తలకిందుగా పడిపోతూ, " మహాత్మా, రక్షించు!" అని అరిచాడు. విశ్వామిత్రుడు కోపావేశంతో దక్షిణ దిక్కున మరొక సప్తర్షి మండలాన్నీ, కొత్త నక్షత్రాలనూ సృష్టించి,"ఇంకొక స్వర్గాన్నీ, కొత్త దేవతలనూ కూడా సృష్టిస్తాను, " అన్నాడు. అప్పుడు దేవతలూ, ఋషులూ భయపడి విశ్వామిత్రుడి వద్దకు వచ్చి, "మహానుభావా, శాపగ్రస్తుడైన త్రిశంకును స్వర్గంలో ఎలా ఉంచటం?" అని అడిగారు.

" ఇతణ్ణీ బొందితో స్వర్గానికి పంపుతానని మాట ఇచ్చాను. అది జరిగితీరాలి," అన్నాడు విశ్వామిత్రుడు. త్రిశంకు కొత్తగా సృష్టి అయిన నక్షత్రాల మధ్య తలకిందులై శాశ్వతంగా ఉండి పోయేటట్టూ, విశ్వామిత్రుడు కొత్త దేవతలను సృష్టించే ప్రయత్నం మానుకునేటట్టూ ఏర్పాటు జరిగింది.

తరవాత విశ్వామిత్రుడు దక్షిణాన్ని వదిలి పెట్టి, పడమరగా ఉన్న పుష్కరమనే పెద్ద తపోవనానికి వెళ్ళి అక్కడ తపస్సు ప్రారంభించాడు. ఈ సమయంలో అయోధ్యలో అంబరీష మహారాజు ఒక యజ్ఞాన్ని ప్రారంభింగా, ఇంద్రుడు యజ్ఞపశువును ఎత్తుకుపోయాడు. అప్పుడు రాజపురోహితుడు యజ్ఞప శువును ఎలాగైనా సంపాదించాలనీ, అది దొరక్కపోతే నరపశువును బలి ఇవ్వవలిసి ఉంటుందనీ రాజుతోచెప్పాడు. యజ్ఞపశువు దొరక్కపోవటంచేత అంబరీషుడు నరపశువు కోసం బయలుదేరాడు.

భృగుతుంద మనే కొండ ప్ర్రాంతంలో ఋచీకుడనే ముని తన భార్యా బిడ్డలతో ఉంటున్నాడు. అంబరీషుడు ఆయన వద్దకు పోయి తన కథ చెప్పి, "లక్షగో వులిస్తాను, మీ కొడుకులలో ఒకణ్ణి యజ్ఞపశువుగా ఇవ్వండి," అని ప్రార్థిం చాడు. పెద్దవాణ్ణి ఇవ్వనన్నాడు ఋచీకుడు. ఆఖరువాణ్ణీ ఇవ్వనన్నది ఋచీకుడి భార్య. శునస్సేపుడనే వాడు రెండోవాడు. వాడు రాజుతో, "మా అమ్మా, నాన్నా నన్ను అమ్మటానికి సిద్దంగా ఉన్నారని వేరే చెప్పనవసరం లేదు. నన్ను మీ వెంట యజ్ఞపశువుగా తీసుకుపోండి," అన్నాడు. అంబరీ షుడు శునశ్శేపుణ్ణి వెంటబెట్టుకుని మిట్టమధ్యాన్నానికి ఎండదెబ్బ తిని విశ్వామిత్రుడి ఆశ్రమం చేరుకున్నాడు. శునశ్శేపుడు విశ్వామిత్రుణ్ణి చూస్తూనే ఆయన పాదాలపై పడి, తన కథ చెప్పుకుని, తనను కాపాడమని ఏడ్చాడు.

విశ్వామిత్రుడు వాణ్ణీ చూసి జాలిపడి తన నలుగురు కొడుకులతో, "వీడికి బదులుగా మీరు యజ్ఞపశువులై వీణ్ణి కాపాడండి," అన్నాడు. వాళ్ళు తండ్రిని లక్ష్యపెట్టక ఆయన మాట నిరాకరించారు. విశ్వామిత్రుడు మండిపడి తన కొడుకులను కూడా వసిష్ఠుడి కొడుకులను శపించినట్టే శపించాడు. తరవాత విశ్వామిత్రుడు శునశ్శేపుడికి రెండు మంత్రాలు ఉపదేశించి, "నిన్ను యజ్ఞప శువును చేసి యూపస్తంభానికి కట్టినప్పుడు ఈ మంత్రాలు చదివితే అగ్నిహొ త్రుడు నీకు సుముఖుడవుతాడు," అని చెప్పాడు.
అలాగే జరిగిందికూడా. అంబరీషుడి యజ్ఞంలో శునశ్శేపుడికి ఎర్రగంధం పూసి, ఎర్రబట్టలు కట్టి, దర్భలతో యూపస్తంభానికి కట్టారు. అప్పుడు వాడు తన మనసులో రెండు మంత్రాలు జపించుకున్నాడు. ఇంద్రుడు వాడికి ప్రత్యక్షమై దీర్ఘాయువునిచ్చాడు.






బాలకాండ -5






విశ్వామిత్రుడు పుష్కరంలో చేసిన తపస్సుకు మెచ్చి ఒకనాడు బ్రహ్మప్ర త్యక్షమై ఆయనకు ఋషి అనే బిరుదు ఇచ్చాడు. దానికి కూడా తృప్తిపడక విశ్వామిత్రుడు మరింత దీక్షగా తపస్సు సాగించాడు. ఈ సమయంలో ఆయనకు ఒకనాడు ఒక తీర్థంలో స్నానం చేస్తున్న మేనక అనే అప్సరస కనిపించి మనస్సు చలించింది. ఆయన తన తపస్సు విడిచిపుచ్చి మేనకను తన ఆశ్రమానికి పిలుచుకుపోయి, ఆమెతో పదేళ్ళు సుఖంగా గడిపాడు.
ఆ తరవాత ఆయనకు తన పొరపాటు తెలిసివచ్చింది. తన తపస్సు భంగం చెయ్యటానికి దేవతలు మేనకకు పంపారేమోననుకున్నాడు. ఆయనలో మార్పు గమనించి, తను శపిస్తాడేమోనని మేనక భయపడింది. కాని విశ్వామిత్రుడామెను ఏమీ అనక, "ఇందులో నీ తప్పేమీ లేదు, తప్పంతా నాదే. ఇక నీవు వెల్లిపో!" అన్నాడు.
ఆ తరవాత ఆయన ఉత్తర దిక్కుగా బయలుదేరి హిమాలయాలలో కౌశికీ నదీ తీరాన నివసిస్తూ, మహాదారుణమైన తపస్సు చేశాడు. చివరకు బ్రహ్మతో సహా పలువురు దేవతలు వచ్చి ఆయనకు మహార్షి అనే భిరుదు నిచ్చారు.
విశ్వామిత్రుడు బ్రహ్మను, "ఇప్పుడు నేను ఇంద్రియాలను జయించిన వాణ్ణేనా?" అని అడిగాడు. "ఇంకా నీవు జితేంద్రియుడవు కావు," అన్నాడు బ్రహ్మ. జితేంద్రి యుడు కావాలనే ఆశతో విశ్వామిత్రుడు వాయుభక్షణ చేస్తూ మహాఘోరమైన తపస్సు చేశాడు. ఈ తపస్సు చూసి చాలా దేవతలకూ, ఇంద్రుడికీ భయం పుట్టింది.
ఇంద్రుడు రంభను పిలిచి, "నీవు వెళ్ళి విశ్వామి త్రుడి తపస్సు భంగం చెయ్యాలి. మన్మథుణ్ణీ వెంటబెట్టుకుని నేను కూడా నీకు తోడు వచ్చి, కోయిల రూపం ధరించి కూస్తాను," అన్నాడు. రంభ భయపడుతూనే అందుకు ఒప్పుకున్నది. విశ్వామిత్రుడు తపస్సులో ఉండగా కోయిలకూత వినిపించింది. కళ్ళు తెరిచే సరికి ఎదురుగా రంభ కనిపించింది. ఇదంతా దేవతల పన్నాగమని తెలుసుకుని ఆయన రంభను రాయికమ్మని శపించాడు. ఇంద్రుడూ మన్మథుడూ పారిపోయారు..
మరుక్షణమే ఆయన, "ఆయ్యో, ఎందుకు శపించాను? కోపాన్ని ఎందుకు నిగ్రహించుకోలేక పోయాను?" అని పశ్చాత్తాప పడ్డాడు. ఎవరేమిచేసినా కోపపడరాదని ఆయన తీర్మానించుకున్నాడు. తపశ్శక్తిచేత బ్రాహ్మాణత్వం సాధించితీరాలని నిశ్చయించుకున్నాడు. ఈ ఉద్దేశంతో ఆయన ఉత్తరాన్ని విడిచి తూర్పు దిక్కుకుపోయి, మౌనవ్రతం అవలంబించి, తపస్సు సాగించాడు. ఆ తపస్సు యొక్క వేడికి మూడు లోకాలూ దగ్థమయ్యేటట్టు కనిపించింది. ఆ స్థితిలో ఎంతగానో భయపడి పోయిన దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకోగా , ఆయన వచ్చి విశ్వామిత్రుణ్ణి, "బ్రహ్మర్షీ, నీకు బ్రాహ్మాణత్వం వచ్చింది," అన్నాడు.
విశ్వామిత్రుడు చాలా సంతోషించి, "నేను బ్రహ్మర్షినని వసిష్టుడు ఒప్పుకుంటేనే తృప్తి పడతాను," అన్నాడు. దేవతలు వసిష్ఠుణ్ణి ప్రార్థించి ఆయన చేత విశ్వా మిత్రుడు బ్రహ్మర్షి అని ఒప్పించారు. వసిష్ట విశ్వామిత్రులకు కలహంపోయి స్నేహం ఏర్పడింది. ఈ విధంగా శతానందుడు విశ్వామిత్రుడి కథ పూర్తి చేసేసరికి అస్తమయ మయింది. జనక మహారాజు విశ్వామిత్రుడి రాకకు తన సంతోషం తెలుపుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు తెలుపుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు తెల్లవార గానే ఆయన విశ్వామిత్రుణ్ణీ, రామలక్ష్మణులనూ యజ్ఞశాలకు పిలిపించాడు.
జనకుడు తన వద్ద ఉండే ధనువును గురించి విశ్వామిత్రుడికి చెప్పాడు. దక్షయజ్ఞం నాడు పరమశివుడు ఆ ధనువును ఎత్తి దేవతలను చంపబో యాడు. చివరకు వారి మొర ఆలకించి, ఆ ప్రయత్నం మాని, ఆ ధనువును దేవతలకే ఇచ్చేశాడు. దేవరాతుడనే వాడి కాలం నుంచీ ఆ ధనువు జనక మహారాజు వంశంలోనే ఉంటున్నది. దాన్ని ఎవరూ ఎక్కుపెట్టలేరు; కదిలిం చను కూడా లేరు.
ఒకప్పుడు జనకడు యజ్ఞం కోసం భూమి దున్నుతూ ఉండగా చాలులో నుంచి ఒక ఆడశిశువు పైకి వచ్చింది. ఆమెకు సీత అని పేరు పెట్టుకుని, జనకుడు తన కుమార్తెలాగే పెంచుతూ వస్తున్నాడు. శివధనువును ఎక్కు పెట్టినవారికి సీత నిచ్చి పెళ్ళీ చెయ్యటానికి ఆయన నిశ్చయించాడు. ఆ సంగతి తెలిసి ఎందరో రాజకుమారులు వచ్చి, ఆ ధనువును ఎక్కుపెట్టలేక పోయారు.
చివరకు ఈ ఓడిపోయిన రాజులు ఏకమైదండెత్తి వచ్చి ఒక ఏడాదిపాటు మిథిలకు ముట్టడివేశారు. జనకుడు ఏమి చెయ్యటానికీ శక్తిలేక దేవతలను ప్రార్థించగా వారు సేనలను పంపి, నగరాన్ని ముట్టడించిన రాజకుమారులను పారదోలారు. ఈ వృత్తాంతం విన్న మీదట విశ్వామిత్రుడు జనకుడితో, ఆ ధనువును రాముడికి చూపమన్నాడు. దాన్ని తీసుకురావటానికి జనకుడు మనుషులను నగరంలోకి పంపాడు. ఎనిమిది చక్రాలు గల ఇనప పెట్టెలో ఉండే ఆ శివధనువును నగరం నుంచి యజ్ఞశాల వద్దకు తెచ్చారు.
"దీన్ని ఎత్తటానికీ, ఎక్కు పెట్టటానికీ నాకు శక్తి ఉందేమో చూస్తాను," అంటూ రాముడు పెట్టె తెరిచి, ధనువును మధ్య భాగం పట్టి పైకెత్తి, అవలీలగా తాడు తగిలించాడు. దానికి అతను బాణం పెట్టటానికి ప్రాయత్నించగా అది ఉరుములాంటి పెళపెళారావంతో నడిమికి విరిగి పోయింది. అందరూ నిర్ఘాంతపోయారు. జనకుడు పరమానందం చెంది, "సీతను శౌర్య వంతుడికే ఇవ్వాలనుకున్నాను. ఇప్పటికి నా ఆశయం ఈడేరనున్నది. ఈ కుర్రవాడు సీతకు అర్హుడు. వీరద్దరి వివాహం విషయం ఇప్పుడే అయోధ్యకు కబురు చేస్తాను," అన్నాడు.
జనకుడి దూతలు మూడు రోజులు ప్రయాణం చేసి, నాలుగోరోజు ఉదయానికి అయోధ్య చెరి, దశరధుడితో శివధనుర్భంగ వృత్తాంతం చెప్పి, సీతారాముల వివాహానికి తరలిరమ్మని కోరారు. దశరథుకు ఆవార్తవిని ఎంతగానో సంతోషించి తన మంత్రులతో సంప్రతించి, జనక మహారాజుతో సంబంధం ఉచితమని తెలుసుకున్నాడు. వసిష్ఠ, వామదేవ, జాబాలి, కాశ్యప, మార్కండేయాదులను ముందుగా ప్రాయాణం చేసి, తాను తన బలగంతో వెనకగా ప్రాయాణమై, నలుగోరోజుకు దశరథుడు జనకుడి యజ్ఞశాల చేరాడు.
అప్పటికి యజ్ఞం పరిసమాప్తి అయింది సీతను పెళ్ళికూతుర్ని చేశారుకూడా. జనకుడూ, దసరథుడూ ఒకచోట చేరారు. జనకుడివెంట ఆయన తమ్ముడు కుశధ్వజుడు కూడా ఉన్నాడు. దశరథుడి తరపున వసిష్ఠుడు జనకుడితో దశరథుడి వంశావళి అంతా సమగ్రంగా చెప్పాడు. తరవాత జనకుడు తనవం శావళిని తానే దశరథుడికి తెలుపుకున్నాడు రెండూ గొప్పవంశాలు. వియ్యం పొందదగినవి.
జనకమహారాజుకు సీత గాక ఊర్మిళ అనే కుమార్తె ఉన్నది. ఆయన తమ్ముడు కుశధ్వజుడికి మాండవి,శ్రుతకీర్తి అని ఇద్దరు కూతుళ్ళున్నారు. సీతా రాముల వివాహముహూర్తానికే లక్ష్మణుడికి ఊర్మిళనూ, భరతుడికి మాండవినీ, శత్రుఘ్నుడికి శ్రుతకీర్తినీ ఇచ్చి చేస్తే బాగుంటుందని జనకుడు సూచించాడు. ఉత్తర ఫల్గునీ నక్షత్రంలో ముహూర్తం నిశ్చయమయించి. పెళ్ళికి ముందే దశరథుడు నాలుగు లక్షల గోవులను దానం చేశాడు. ఆ రోజునే భరతుడి మేనమాన అయిన యుధాజిత్తుకూడా మిథిలకు వచ్చాడు. అగ్నిసాక్షిగా నలుగురి వివాహాలూ జరిగిపోయాయి. దశరథుడి కొడుకులు నలుగురూ తమ భార్యలను వెంటబెట్టుకుని తమ విడిదికి వచ్చేశారు.
పెళ్ళీ కాగానే విశ్వామిత్రుడు తన దారిన తాను హిమాలయానికి వెళ్ళిపో యాడు. దశరథుడుకూడా తన బలగంతో అయోధ్యకు బయలుదేరాడు. అలా వారంతా ప్రయాణం చేస్తూండగా దారిలో అకస్మాత్తుగా చీకటికమ్మింది. ధూలి లేచింది. పెనుగాలి వీచింది. అదే సమయంలో ప్రళయకాల రుద్రుడి లాగా పరశురాముడు వారికి ఎదురు వచ్చాడు. ఆయన భుజాన గండ్రగొడ్డలీ, చేతిలో కాంతి వంతమైన ధనుర్బాణాలూ ఉన్నాయి. ఆయన రాముడితో, "ఓరామా, నీవు శివుడి విల్లువిరిచావట, విన్నాను.
చాలా ప్రజ్ఞగలవాడవు. దానికన్న శక్తివంతమైన ఈ విష్ణుధనువు ఎక్కుపెట్టగలవేమో చూడు. అంతశక్తి నీకున్న ట్టయితే నాతో ద్వంద్వయుద్దం చేతువు గాని!" అన్నాడు. పరుశురాముడు రాముడితో విష్ణుధనువు గురించి ఇలా చెప్పాడు: దీనినికూడా విశ్వకర్మ స్వయంగా నిర్మించాడు. శివుని విల్లులాగే ఇదీ ధనుస్సులలో శ్రేష్ఠమైనది. దీనిని దేవతలు విష్ణువుకు ఇచ్చారు. శివవిష్ణువుల బలాబలాలు తెలుసుకు నేటందుకు వారు బ్రహ్మద్వారా ఇద్దరికీ కలహం పెట్టించారు. ఇద్దరికీ చెరొక గొప్ప విల్లూ ఉన్నది. వారు మహా భయంకరమైన యుద్ధం చేశారు.
ఆ యుద్ధంలో విష్ణువుదే పైచెయ్యి అయింది. శివకేశవులలో కేశవుడే ఎక్కువ ని దేవతలు గ్రహించి, యుద్దం మానవలసిందిగా ఇద్దరు దేవుళ్ళనూ ప్రార్థించారు. తనకన్న విష్ణువు ఎక్కువగా నిర్ణయం జరిగినందుకు శివుడు ఆగ్రహించి, తన ధనువునూ, బాణాలనూ విదేహదేశపు రాజైన దేవరాతుడి కిచ్చేశాడు. విష్ణువు తన ధనుస్సును భృగువంశంవాడైన ఋచీకుడి వద్ద దాచి పెట్టాడు. అది ఋచీకుడి కొడుకైన జమదగ్నికీ, ఆయన కొడుకైన పరశురా ముడికీ సంక్రమించింది. దశరథుడు భయంతో వణికిపోతూ, పరశురాముడి కాళ్ళపైపడి, "స్వామీ, ఇరవై ఒక్కసారి క్షత్రియులను నాశనంచేసి, అస్త్రం పట్టనని ఇంద్రుడి వద్ద ప్రతిజ్ఞచేశావు. ఈనా కొడుకును కాపాడు. లేకపోతే మేమంతా నాశనమైపోతాం," అన్నాడు.
పరశురాముడు ఆయన మాటలు పెడచెవి పెట్టాడు. రాముడికి మండిపో యింది. అతను పరశురాముడి నుంచి విష్ణుధనువు తీసుకుని, అవలీలగా వంచి ఎక్కుపెట్టి, బాణం సంధించి, "ఓ బ్రాహ్మాడా, ఈ బాణంతో నీ ప్ర్రాణం తీయగలను. కాని బ్రాహ్మణ హత్య నా కిష్టంలేదు. అందుచేత దీనితో నీ కాళ్ళు విరగగొట్టమన్నావా? నీవు తపస్సు చేసిన ఉత్తమలోకాలు ధ్వంసం చెయ్య మన్నావా?" అని అడిగాడు.
పరశురాముడు నిర్వీర్యుడైపోయి తన ఉత్తమలోకాలను పోగొట్టుకోవటానికి సిద్దపడ్డాడు. రాముడు బాణం వదిలాడు. తరవాత పరశురాముడు మహేం ద్రగిరికి వెళ్ళి పోయాడు. రాముడు మూర్ఛపోయిన తన తండ్రిని లేపిన అనంతరం అయోధ్యకు వచ్చేశారు. కొద్దిరోజులు గడిచాయి. యుధాజిత్తు తన మేనల్లుడైన భరతుణ్ణి తన ఇంటికి తీసుకుపోతానన్నాడు. ఇందుకు దశర థుడు సమ్మతించాడు. భరతుడు శత్రుఘ్నుణ్ణి వెంటబెట్టుకుని తన మేనమామ వెంట వెళ్ళిపోయాడు.
సీతారాములు అన్యోన్య ప్రేమతో దాంపత్య జీవితం గడుపుతున్నారు. వారు తమ ప్రేమను పైకి చూపకపోయినా ఒకరి మనసు నొకరు బాగా అర్థం చేసు కుంటున్నారు. రాముడు రాచకార్యాలలో తండ్రికి సహాయపడుతున్నాడు. రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి.
(బాలకాండ సమాప్తం)
Read More

Powered By Blogger | Template Created By Lord HTML