వసంత పంచమి
సరస్వతీ దేవిని ఆరాధించే దినమే వసంత పంచమి. సరస్వతీదేవి నాలుగు చేతులతో అలరారుతుంటుంది. కుడి చేతిలో పుస్తకం, ఎడమ చేతిలో తామరపువ్వునీ, మిగతా రెండు చేతుల్తో వీణను వాయిస్తుంటుంది. సరస్వతీ బంగారు రథంపై కూర్చుని ధవళకాంతులతో మెరిసిపోతుంటుంది.
అందమైన తెల్లని పద్మం సరస్వతికి సింహాసనం. మధురమైన పలుకులు పలికే చిలుక ఆమెకు చెలికత్తె. వాక్కులకు సంకేతములైన వేదములు వాగ్దేవినే ఆశ్రయించి ఉంటాయి. అమ్మ మాటలకు తోడుగా మోగేది వీణ. బ్రహ్మదేవుని ముఖాలు నాలుగు వేదాలకు ప్రతీకలు. కాబట్టి బ్రహ్మ ముఖంలో సరస్వతి ఉంటుందని శాస్త్రోక్తి.
సరస్వతి అంటే జ్ఞానాన్ని కల్గించే కిరణమనే అర్థం కూడా ఉంది. సరస్వతిని వేదమాతగా, భారతిగా, వాగేశ్వరిగా, శారదగా మన పూర్వీకులు అభివర్ణించారు. ఇంతటి సర్వశక్తిమయమైన జగదంబను వాగ్బుద్ధి జ్ఞాన స్వరూపిణిగా భావిస్తారు. అందుచేత వసంత పంచమి నాడు విద్యాభ్యాసం మొదలెడితి జ్ఞానులవుతారు. విద్యాభ్యాసమే కాకుండా శుభకార్యాలకు వసంతపంచమి మంచి రోజు అవుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
బాసర ప్రత్యేకత
బాసర ఆదిలాబాదు జిల్లాలోని పుణ్యక్షేత్రం మరియు ముధోల్ మండలానికి చెందిన గ్రామము. బాసర, నిర్మల్ పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. ఇది దేశంలోని పురాతన ఆలయాలలో ఒకటి.
హిందూ మతం పురాణాల ప్రకారం, వేదవ్యాస మహర్షి తపస్సు చేస్తే అప్పుడు జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్టించాడు. వారు సరస్వతి, లక్ష్మీ మరియు కాళి. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానం, జ్ఞానము లభిస్తుందని ఘాడంగా విశ్వసిస్తారు.
ఈ ఆలయమును చాళుక్య రాజులు నిర్మించారు.శ్రీ పంచమి మరియు నవరాత్రి పండుగలు ఆలయం వద్ద పెద్ద ఎత్తున జరుపుకుంటారు. సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్టితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుము వుంటుంది.
మాఘ శుక్ల పంచమి. దీనికే వసంత పంచమి, శ్రీ పంచమి అని పేర్లు.
అజ్ఞానము మానవుని దానవునిగా రూపొందిస్తుంది. జ్ఞానమును ప్రసాదించి మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము, విద్య, చదువు పర్యాయపదాలు. విద్యకు అధిదేవత జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవిని స్మరించి, పూజించే రోజే శ్రీపంచమి. మాఘశుద్ధ పంచమి శ్రీ సరస్వతి జన్మదినంగా భావిస్తారు. యావద్భారతావనిలో ప్రజలంతా, ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే వసంతపంచమి.
సకల విద్యాస్వరూపిణి పరాశక్తి సరస్వతిగా ఆవిర్భవించిన తిథి. ‘యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా’’ అంటూ దేవీ భాగవతం ప్రస్తుతించింది. బ్రహ్మవైవర్త పురాణం ఆదిగా ఎన్నో పురాణాలు సరస్వతీదేవిని అర్చించాలని శాసిస్తున్నాయి.
మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపి చ
పూర్వేహ్ని సమయం కృత్యా తత్రాహ్న సంయుతః రుచిః॥
మాఘ శుద్ధ పంచమినాడు ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్ర వచనం. ఈరోజునే క్షీరసాగర మథన సందర్భంగా మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా శ్రీపంచమిగా పేర్కొనడంతో, ఈరోజు మహాగణపతిని, శ్రీలక్ష్మిని, శ్రీ సరస్వతిని షోడశోపచారాలతో పూజించాలనీ, శ్రీ సరస్వతిదేవి ప్రతిమతోపాటు, జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను, లేఖినులను పూజాపీఠంపై ఉంచి అర్చించాలి. శ్రీ సరస్వతీదేవిని తెల్లని కుసుమాలతో, సుగంధ ద్రవ్యాలతో, చందనంతో, అర్చించి శుక్లవస్త్రాన్ని సమర్పించాలి. అనంతరం పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తే, ఆ తల్లి కరుణాకటాక్షాలవల్ల అపారమైన జ్ఞానం లభించి, నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం. పూర్వం రాజాస్థానాలలో ఈరోజు దర్బారులు నిర్వహించి, కవితా ఘోష్టులు జరిపి కవులను, పండితులను, కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా ఉండేది.
బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి, ఆరాధించి ఆమె కృపవల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడంటారు. గాయత్రీదేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవి దొకటి. యాజ్ఞవల్క్యుడు గురుశాపం వలన విద్యలను కోల్పోవడంతో, సూర్యుని ఆరాధించగా, ఆతడు యాజ్ఞవల్క్యునికి సరస్వతీ ఉపాసనను ఉపదేశించాడు. సరస్వతీదేవి కృపవలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకుని మహావిద్వాంసుడయ్యాడు.
వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్రామాయణ రచనను చేసేడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే వ్యాసమునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహంవల్లనే వేద విభజన గావించి, పురాణాలను ఆవిష్కరించాడని, మహాభారత, భాగవత, బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మవ్యవస్థకు మూలపురుషుడుగా నిలిచాడనీ ప్రతీతి. తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమేకాక, ఆ గ్రంథాన్ని పొట్టకూటికోసం నరులెవ్వరికి అంకితమివ్వనని వాగ్దానం చేసినట్లు చెప్పుకున్నాడు.
పరాపర విద్యలకు అధిష్ఠాత్రి సరస్వతి. ఆమె అనుగ్రహంవలన ఉలుకూ, పలుకూ, బుద్ధి, శక్తి లభిస్తాయి. మతిమరుపు, మాంద్యం తొలగుతాయి. మేథాశక్తి పెంపొంది, సరియైన జ్ఞానం కలిగి ఇహమూ, పరమూ, మోక్షమూ లభిస్తాయి. జ్ఞాన లబ్ధికి ఆటంకాలైన సకల అవరోధాలను తొలగించే తల్లి సరస్వతి. అందుకే ‘‘నిశే్శష జాడ్జాపహా’’ అన్నారు. శృతులలో సరస్వతీదేవిని ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా కీర్తించడం జరిగింది. ‘అమ్మలగన్నయమ్మ’ ఆమె. నదులలో గొప్పది. దేవతలలో శ్రేష్టురాలు. అందుచేతనే ‘‘యాబ్రహ్మాచ్యుత శంకరః ప్రభృతిః దైవైః’’ సదా పూజలనందుకుంటున్నది. శ్రీ శంకర భగవత్పాదులు శారదాదేవి కృపచేతనే అపారమైన వేద వేద వాఙ్మయాన్ని పొంది, భారతీయ సనాతన ధర్మ వ్యవస్థను పునఃప్రతిష్ఠించినట్లు విజ్ఞులు చెబుతారు. శారదామాత పట్ల తన శరణాగతికి ప్రతీకగా శృంగేరీ క్షేత్రంలో ఆ తల్లిని ప్రతిష్ఠించారు. మనందరికీ మార్గనిర్దేశం చేసేరు.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment