అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించడానికి ధర్మరాజు, భీముడు మొదలైనవారు ప్రోత్సహించి "పద్మవ్యూహం ఎలా చేధించాలో మాకు తెలియదు. నీకు ప్రవేశించడం తెలుసు. కనుక నువ్వు పద్మవ్యుహాన్ని చేధిస్తూ వెళ్ళు. మేము నీవేనకే వచ్చి వారి సంగతి చూస్తాం. అని చెప్పగా, అభిమన్యుడు తనదైన శైలిలో దూసుకుంటూ వెళ్ళాడు. ఐతే వెనుకే వెళుతున్న పాండవులను సైంధవుడు శివుడు ఇచ్చిన "జీవితంలో ఏదైనా ఒక్కరోజు మాత్రమే ఆర్జునుడిని తప్ప మిగిలినవారిని నిలబెట్టగలవు" అనే వరం వలన అర్జునుడు లేని పాండవులను అడ్డగించి నిలిపెస్తాడు. వీరిమధ్య కూడా తీవ్రాతి తీవ్రమైన పోరాటం జరుగుతుంది. అయినా ఎవరు ఓడిపోలేదు. అలాగని గెలవలేదు. సాయంత్రం వరకు జరిగిన పోరాటంలో వేలమందిని సంహరించిన అభిమన్యుడు మరణించిన తరువాత సైంధవుడు వెళ్ళిపోతాడు.
ఈవిషయం అర్జునుడికి తెలిసి అడ్డుపడిన సైంధవుడిని రేపు సాయంత్రం సూర్యుడు అస్తమించేలోపు సంహరిస్తాను అని శపథం చేస్తాడు. ఇది విన్న శ్రీకృష్ణుడు "ఎవరిని అడిగి శపథం చేసావు? అని ప్రశ్నిస్తే "నువ్వు ఉన్నావనే ధైర్యంతో అన్నాడు.
తెల్లారింది. యుద్ధానికి సిద్ధమై దాదాపుగా 25 కిలోమీటర్ల దూరం లక్షమందికి పైగా ఉన్న శత్రు సేనలను చీల్చి చెండాడుతూ నాలుగు వ్యూహాలను భేదిస్తూ సాయంత్రానికి అంటే సూర్యుడు మరొక్క గంటలో అస్తమిస్తాడు అనగా వ్యూహం లోపలి భాగాన్ని చేరుకున్నాడు అర్జునుడు. సైంధవుడు ఎక్కడా కానరాలేదు. అర్జునుడు డీలా పడిపోతున్నాడు. ఇంతలో శ్రీకృష్ణుడు "అర్జునా! నేను ఒక తిమిరాన్ని ఏర్పాటు చేస్తాను. దీంతో సైంధవుడు బయటికి వస్తాడు. అప్పుడు వాడిని నువ్వు సంహరించు అన్నాడు. అప్పుడు అర్జునుడు "మోసం చేసి గెలవడమా! నాకు ఇష్టంలేదు. అనగా! శ్రీకృష్ణుడు నవ్వి. నువ్వు ప్రతిజ్ఞ చేసావు. సూర్యాస్తమయం అయ్యేలోపు సైంధవుడిని సంహరిస్తాను అని. ఎలా కుదురుతుంది అని అడిగితే నామీద భారం వేశావు. మరి నేను చెప్పింది చేయడమే నీ కర్తవ్యం. నేను చెప్పినట్లు నడుచుకో అని తిమిరం ఏర్పాటు చేసి చీకటి పడిందని భ్రమపడేలా చేసాడు. సూర్యుడు అస్తమించాడు అని సైంధవుడు పడమటి దిక్కువైపు చూడడానికి పైకి లేవగానే అర్జునుడు సైంధవుడి తల నరికేస్తాడు. ఇక్కడే అసలు ఘట్టం ప్రారంభం అయింది.
తల కింద పడకూడదు. బాణం సంధించు అనగా సంధిస్తాడు. అలా నాలుగైదు బాణాలు వేస్తాడు. తల కిందపడకుండా అలా ఆకాశంలోనే నిలబెట్టు అన్నాడు శ్రీకృష్ణుడు. ఎంతసేపు నిలబెట్టాలి? ఎందుకు నిలబెట్టాలి? అని అడిగాడు.
అర్జునా! యితడు వృద్ధక్షత్రుడు యొక్క కుమారుడు. ఒకప్పుడు బిడ్డలు లేని వృద్ధక్షత్రుడు తపస్సు చేసి జయద్రథుడు అనే బిడ్డని పొందాడు. అప్పుడు ఆకాశవాణి "ఇతడు యుద్ధంలో తల తెగి మరణిస్తాడు" అనగా ఎవరైనా ఇతడి తలని నేల కూల్చుతారో అతడి తల నూరు వ్రక్కలై మరణిస్తాడు" అని శపించాడు. అందువలన ఇతడి తల కిందపడకూడదు. శివుడు నీకు ఇచ్చిన పాశుపతాస్త్రం తో ఈతల వెళ్లి జపం చేస్తున్న వృద్ధక్షత్రుడి ఒడిలో పడేలా చెయ్యమనగానే వెంటనే పాశుపతాస్త్రం అభిమంత్రించి ప్రయోగించాడు. పాశుపతాస్త్రం వృద్ధక్షత్రుడిని వెదుక్కుంటూ వెళ్లి ఒడిలో పడేసింది. ఉలిక్కిపడిన వృద్ధక్షత్రుడు వెంటనే దానిని నేలపై పడేయగానే తల నూరు వ్రక్కలై మరణించాడు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? భక్తి ఉంటె సరిపోదు. అలాగే మనం కోరిన కోర్కేకి తగుదుమా! అని కూడా ప్రశ్నించుకోవాలి. అదే ఇప్పుడు జరిగింది. అర్జునుడు శ్రీకృష్ణుడిని అండ చూసుకొని ప్రతిజ్ఞ చేసాడు. అంతే కాకుండా అతడు మహావీరుడు. ఎలాంటి ప్రతిజ్ఞ చేసినా నెరవేర్చగల ధీరుడు. శ్రీకృష్ణుడు అండ చూసుకున్నా ఆ తరువాతి పరిణామాలు అర్జునుడికి కూడా తెలియదు. ఒకవిధంగా ఆర్జునుడిని ఎవరిని అడిగి ప్రతిజ్ఞ చేశావు? అని అడిక్షేపించడం ఎందుకంటే చంపడం వరకు బాగానే ఉంది కానీ తదనంతర పరిణామాలు (తల నేల కూలితే కూల్చినవాడి తల వంద ముక్కలు అవుతుంది అని) అర్జునుడికి కూడా తెలియదు. పొరబాటున కిందపడితే బ్రతికించడం శ్రీకృష్ణుడి వల్ల కూడా కాదు. ఎందుకంటే అది బ్రాహ్మణ శాపం. దానికి తిరుగులేదు. శాపాన్ని తిప్పలేరు. ఇది సృష్టి ఆరంభంలో బ్రాహ్మణులకు దేవతలు ఇచ్చిన వరం. అయినా తల తీసిన అనంతరం దాన్ని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చగల సత్తాకూడా ఉంది.
అలాగే మనం ఒక కోరిక కోరినా, ప్రతిజ్ఞ చేసినా దానివలన తదనంతరం ఎదురయ్యే పరిణామాలు కూడా ఎదుర్కొనే శక్తి మనదగ్గర ఉండాలి. అప్పుడే దేవుడు సహకరిస్తాడు. ఎదో కోరిక కోరాం. అది నెరవేరితే దేవుడు ఉన్నట్లు, లేకపోతె లేనట్లు జనాలు తయారయ్యారు. ఎందుకు నేరవేరడంలేదు అంటే నువ్వు దానికి తగినవాడివా? తదనంతర పరిణామాలు ఎదుర్కొనే శక్తి ఉందా? అనేది నువ్వు చూడకపోయినా దైవం చూస్తుంది. అందుకే మనకి ఏది ఇవ్వాలో ఇవ్వకూడదో దైవానికి బాగా తెలుసు. కనుక మన మితిమీరిన కోరికలు, వాటికి మితిమీరిన అంచనాలు వదిలేసి భవిష్యత్తులో జరగబోతే మంచి చెడు ఆలోచించగలిగితే సగం పైనే సమాధానం దొరికినట్లే.ఉదాహరణకి ప్రేమ విషయాలు తీసుకోండి. ఇలా చేసుకొని మంచిది/మంచివాడు అనుకున్నాను కానీ ఇలా చేస్తారనుకోలేదు అని విడిపోవడం, నిరంతరం కొట్టుకుచావదం చూస్తూనే ఉన్నాం. ఉద్యోగం, వ్యాపారం ప్రతి విషయంలో ఇలాగె చేస్తున్నాం. కనుక అలోచించి అడుగు వేయండి. దైవబలం తప్పకుండా ఉంటుంది. ఇలా ప్రతి ప్రశ్నకి భారతంలో సమాధానం దొరుకుతుంది. వెదికితే! వేదకగలిగే జ్ఞానం ఉంటే!
No comments:
Post a Comment