What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 17 February 2016

మాఘశుద్ధ సప్తమి. రథసప్తమి



మాఘశుద్ధ సప్తమి. రథసప్తమి
ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్యనారయణ స్వామిని విశేషంగా ఆరాధించే పర్వదినం. ఈ రోజు చేసే మాఘస్నానానికి చాలా విశేషత ఉంది. రథసప్తమి నాటి ఉదయం సూర్యోదయానికి ముందే 7 తెల్లజిల్లేడు ఆకులను, రేగు ఆకులను తలపై ఉంచుకుని స్నానం చేయడం ఆరోగ్యకరం.
ఈ స్నానం చేసే సమయంలో ఈ క్రింది శ్లోకాన్ని చెప్పుకోవాలి
యద్యజ్జన్మకృతం పాపం మయాసప్తమ జన్నసు
త న్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ
ఏ తజ్జన్మ కృతం పాపం యచ్చ జనాంతరార్జితం
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః
ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర సప్తమి మే హరః ||
ఏతన్మంత్రమయం జప్త్వా స్నాత్వా పాదోదకే నరః
కేశవాదిత్య మాలోక్య క్షణా న్నిష్కల్మషో భవేత్ ||
అంటే జన్మ మొదటి నుండి చేసిన పాపం, జన్మాంతరాలలో చేసిన పాపం, రోగ రూపంలో, శోక రూపంలో వేదించే పాపమంతా మకరంలో ఉండే సప్తమి హరింపజేయాలనీ, సూర్య ప్రియమైన ఈ మకరసప్తమి ఈ జన్మలోనూ, జన్మాంతరాలలోనూ మనసుచేత, వాక్(మాట) చేత, ఇంద్రియాల చేత తెలిసీ తెలియక చేసిన పాపమంతా ఈ స్నానంతో నశించాలనేది అర్ధం.
ఈ రోజు స్నానం చేసే ముందు ఆకులను దొన్నెలుగా చేసి అందులో దీపాలను వెలిగించి, సూర్యున్ని ధ్యానిస్తూ ఆ దీపాన్ని నీటిలో వదలాలి.
సాధారణంగా పుణ్యస్నానం సూర్యోదయానికి గంటన్నర ముందు చేస్తాం. కాని మాఘస్నానం ప్రత్యేకత ఏమిటంటే సూర్యోదయానికి కొద్ది సమయం ముందు స్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించని వారు వేడి నీటి స్నానం చేయచ్చు. స్నానం చేయగానే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి.
రాగి చెంబులో నీరు తీసుకుని అందులో ఎర్రని పూలు, ఎర్ర గంధం, ఎర్రని అక్షతలు, లేత జిల్లేదు ఆకులు, గరిక ఇవన్నీ కొద్దిగా ఆ నీటిలో వేసి సూర్య భగవానుడికి చూపించి వదలాలి. దీనిని అర్ఘ్యం అంటారు. నీరు వదులుతూ ఈ శ్లోకం చెప్పుకోవాలి.
సప్తసప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర
ఈ విధంగా చేయడం వలన ఆరోగ్యం చేకూరుతుంది. తర్వాత సూర్యభగవానుడికి నమస్కరించాలి. మాఘస్నానానికి కార్తీక స్నానానికి ఉన్నంత విశేషం ఉంది. ఈ స్నానం ఆచరించడం ఎంతో పుణ్యం, పదిమంది ఈ మాఘస్నానం గురించి చెప్పడం వలన కూడా పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెప్తోంది. ఈ మాఘస్నానం ఈ మాఘమాసమంతా చేయాలి.
రధసప్తమి రోజు శ్రీ సూర్యనారాయణ మూర్తికి దేశీ ఆవుపాలతో చేసిన పరమాన్నం నివేదన చేస్తారు. ధనుర్మాసంలో ప్రతి రోజు ఇంటిముందు పెట్టిన గోబ్బెమ్మలను పిడకలుగా చేసి, ఆ పిడకలను ఉపయోగించి పరమాన్నం చేయాలి. ఇంటిలో చిక్కుడుచెట్టు ఉంటే దాని దగ్గర సూర్యబింబానికి ఎదురుగా కూర్చుని పరమాన్నం వండాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మొదట పాలు పొంగించాలి. పాలు పొంగు వచ్చిన తరువాతే పరమాన్నం వండాలి.

పుణ్య తిథి రథ సప్తమి
మాఘ శుద్ద సప్తమినే రథ సప్తమి అంటారు. రథ సప్తమి అంటే, సూర్య భగవానుడి పుట్టినరోజు.
సూర్యుడు ఏడు అశ్వాలతో కూడిన రథాన్ని అధిరోహించి వస్తాడన్నది మనకు తెలిసిందే. మన్వంతర ప్రారంభంలో మాఘ శుద్ధ సప్తమినాడు, సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడట. అందుకే రథ సప్తమిని పూజ్యమైన రోజుగా భావిస్తారు. సూర్యుడే లేకపోతే లోకమే చీకటిమయంగా ఉంటుంది. సూర్యభగవానుని ప్రసన్నం చేసుకోడానికి ఈ ప్రత్యేక దినాన ఆదిత్యహృదయం చదువుతూ పూజలు చేయాలి.
కోణార్క్ లోని సూర్య దేవాలయంలో రథ సప్తమిని పురస్కరించుకుని మహా వైభవోపేతమైన ఉత్సవం జరుగుతుంది. కోణార్క్ లో జరిగే ఈ రథోత్సవాన్ని చూట్టానికి దేశం నలుమూలల నుండీ భక్తులు తండోపతండాలుగా వస్తారు.
రథ సప్తమినాడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రథ సప్తమి రోజున మనం స్నానం చేసే నీటిలో కొన్ని రేగి పండ్లను వేసుకుని చేస్తే మంచిది.
భాస్కరునికి ఇష్టమైన రథసప్తమినాడు స్నానం ఆచరిస్తూ, సూర్య భగవానుడికి మనసు అర్పణ చేసుకుంటూ నమస్కరించాలి. ఇలా చేయడంవల్ల శారీరక, మానసిక బాధలన్నీ తొలగిపోతాయి.
ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేయడం మంచిది. ముఖ్యంగా రథ సప్తమినాడు చేస్తే మరీ మంచిది.
ఆవు నేతితో దీపం వెలిగించి సూర్య భగవానుడికి నమస్కరించుకుంటూ నది లేదా చెరువులో వదిలితే మంచిది.
సూర్యుని ఎర్రటి పూలతో పూజించడం శ్రేష్టం.
రథ సప్తమి రోజున ఆదిత్య హృదయం పఠిస్తూ భక్తిగా ప్రార్ధించాలి.
రవితేజునికి రేగిపళ్ళు ఇష్టం. కనుక రేగిపళ్ళను, పరమాన్నాన్ని ఆదిత్యునికి నైవేద్యంగా సమర్పించాలి.

పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ భగవానుడిని రథ సప్తమి విధానాన్ని గురించి వివరించమని కోరాడు. అప్పుడు కృష్ణుడు వ్రత కధతో సహా వ్రత విధానాన్ని వివరించాడు.
పూర్వం కాంభోజ దేశాన్ని యశోవర్తనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు లేక లేక ముసలితనంలో ఓ కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టాడన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే ఆ రాజుకు దక్కింది. పుట్టిన బిడ్డ ఏదో ఒక రోగంతో బాధ పడుతూ ఉండేవాడు. జబ్బున పడ్డ కొడుకును చూసి రాజుకు ఎంతో దిగులు వేసింది. ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయే సరికి క్రాంతధర్శనులైన ఋషులను పిలిపించి తన కుమారుడికి కలిగిన అనారోగ్యాన్ని గురించి చెప్పి దానికి విరుగుడు తెలియచేయమన్నాడు. త్రికాల వేదులైన ఆ ఋషులు రాజకుమారుడిని చూసి ఆ బిడ్డ గత జన్మనంతటినీ అవగతం చేసుకున్నారు. గత జన్మలో ఎంతో సంపన్నుడైనా ఎవరికీ కద్దిపాటి దానం కూడా చేయలేదు. అయితే అతడు జీవితం చివరిదశలొ ఒకసారి ఎవరో చేస్తూ వున్న రథ సప్తమి వ్రతాన్ని చూసాడు. అలా ఆ వ్రతాన్ని చూసిన పుణ్య కారణంగా రాజు ఇంట బిడ్డగా జన్మించాడు. సంపదలుండి దానం చెయ్యని పాపానికి రాజ కుటుంబంలో జన్మించినా నిరంతరం రోగగ్రస్తుడై ఉంటున్నాడని ఋషులు చెప్పారు. తన బిడ్డ ఆ విషమ పరిస్ధితి నుండి బయట పడటానికి ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రాజు. అప్పుడు ఆ ఋషులు రధ సప్తమీ వ్రతాన్ని శాస్త్ర విధిగా చెయ్యమని, అలా చేస్తే రాజకుమారుడి రోగాలు నశిస్తాయని చెప్పారు.
మాఘ శుద్ద షష్టి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో వున్న నది, చెరువు, నుయ్యి ఇలా ఏదో ఒక చోట స్నానం చేయాలి. ఆ తరువాత సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి. ఆ మర్నాడు అంటే సప్తమి తిధిన సూర్యోదయానికి ముందే నెత్తి మీద లోహపు ప్రమిదలో దీపం పెట్టుకుని స్నానం చేయాలి. ఆ తర్వాత శక్తి కొద్దీ బంగారంతో కాని, వెండితో కాని రధాన్ని చేయించి దానికి ఏడు గుర్రాలను, సూతుడిని అమర్చాలి. అందులో సూర్య ప్రతిమను పెట్టాలి. ఒక కొత్త గుడ్డను పరిచి దాని మీద ఈ రధాన్ని ఉంచాలి. సాయంకాలం వరకూ ఉపవాసం ఉండి పూజలు చేసి రకరకాల పండ్లను నివేదించి ఆ రాత్రికి జాగారం చేయాలి. ఆ వ్రతం అంతా నది, సరోవర తీరాలలో చెయ్యడం మేలు. ఆ మరునాడు సూర్యుడికి మళ్ళీ పూజలు చేసి దానధర్మాలు, వ్రతపారాయణ అనంతరం రధాన్ని, సూర్యప్రతిమను ఉత్తములూ, అర్హులూ అయిన వారికి దానమివ్వాలి. ఇలా చేస్తే సర్వరోగ విముక్తి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయి అని కాంబోజరాజుకు పూర్వం ఎప్పుడో ఋషులు చెప్పిన విషయాన్ని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు.
ప్రస్తుతం ఈ వ్రతానికి సంబంధించి కాలానుగుణంగా బంగారు రధం లాంటివి లేకపోయినా చిక్కుడు కాయలతో రధాన్ని చేయడం కనిపిస్తుంది.
యద్యజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు
తన్మే రోగం చ శోకంచ మాకరీ హంతు సప్తమీ
ఏటా మాఘశుద్ధ సప్తమినాడు తలమీదా, భుజాల మీదా , మోచేతి మడతల మీద , అరచేతుల్లోనూ ( మొత్తం ఏడు) జిల్లేడాకులు ఉంచుకుని పై పద్యం చదువుతూ సూర్యుడికి నమస్కరించి స్నానం చేయడం మన సంప్రదాయం . ' గత ఏడు జన్మలలోనూ నేను చేసిన పాపాలను, రోగాలను, శోకాలనూ, మకర రాశిలోని సప్తమి హరించు గాకా' అని దీనర్ధం. ఆ రోజున హిందువులంతా సూర్యుణ్ణి పూజించి ఆరు బయట సూర్యకాంతి పడే ప్రదేశంలో పిడకల మంట మీద పరమాన్నం వండి దాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి నైవేద్యం పెడతారు. చిక్కుడు కాయలతో రధం తయారు చేసి దినకరుడికి సమర్పించుకుంటారు. ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే....
పురాణాల ఆధారంగా...
ఈ రోజు సూర్య జయంతి. ఏడు గుర్రాలు పూంచిన ఏకచక్ర రథం పై రెండు చేతులా తెల్లటి పద్మాలు ధరించి ఉషస్సమయాన ఉదయించే ప్రత్యక్ష నారాయణుడి పుట్టిన రోజు. రామాయణ , భారతాలకు సూర్యుడితో గట్టి సంబంధమేం ఉంది.
రాముడిది రఘువంశం. అంటే ఆయన సూర్యవంశజుడన్నమాట! అగస్త్యుడు శ్రీ రాముడికి బోధించిన మంత్రాలే ' ఆదిత్య హృదయం 'గా ప్రాచుర్యం పొందాయి. తనను పండుగా భావించి మింగేయబోయిన చిన్నారి హనుమంతుడికి గురువుగానూ రామాయణంలో కనిపిస్తాడు సూర్యుడు.
అటు భారతం లోనూ కర్ణుడి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దుర్వాస మహాముని నుంచి మంత్రోపదేశం పొందిన కుంతికి ముందుగా గుర్తొచ్చింది సూర్యుడే. సత్రాజిత్తుకు శమంతకపణిని , ధర్మరాజుకు అక్షయపాత్రనూ, ఇచ్చింది భాస్కరుడే.

ఆదిత్యకశ్యపులకు పుట్టిన సూర్యభగవానుడి జన్మదినం రథసప్తమి. ఇతర మాసాలలోని సప్తమి తిథులకన్నా మాఘమాసంలో వచ్చే సప్తమి ఎంతో విశిష్టమైనది ఎందుకంటే సూర్యుడి గమనం ప్రకారం ఉత్తరాయణం, దక్షిణాయణం. ఆషాఢమాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయణం. ఏడు గుర్రాలు పూన్చిన సూర్యని రథం దక్షిణాయణంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభం అవుతుంది, సూర్యుడు తన దిశానిర్దేశాన్ని ఈ రోజునుండే మార్చుకుంటాడు. సూర్యుడు ఉదయం వేళ బ్రహ్మ స్వరూపంగానూ, మధ్యాహ్న సమయంలో ఈశ్వరుడిగానూ, సాయంత్రం విష్ణు స్వరూపుడిగానూ ఉంటాడు కాబట్టి మనం సూర్యుడిని త్రిసంధ్యలలో ప్రార్థించినంత మాత్రమునే త్రిమూర్తులకు పూజ చేసినంత ఫలితం ఉంటుంది. శీతాకాలం నుండి వేసవి కాలపు సంధిస్థితిలో వచ్చే పండుగ ఇది. అందుకే ఈ పండుగ వసంత, గ్రీష్మ ఋతువుల మధ్యలో వస్తుంది. సూర్యుడికి ఏడవ సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే, సూర్యుడి రథానికి పూన్చినవి ఏడు గుర్రాలు, వారంలో రోజులు ఏడు, వర్ణాలలో రంగులు ఏడు, తిథులలో ఏడవది సప్తమిరోజు. మాఘ శుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానం. సప్తమి రోజున సూర్యోదయానికి పూర్వమే మేల్కొని స్నాన, జప, అర్ఘ్యం, తర్పణ, దానాలు అనేక కోట్ల పుణ్యఫలాలను, ఆయురారోగ్యాలను, సంపదలను ఇస్తుంది. సప్తమిరోజున షష్ఠి తిథి ఉన్నట్లయితే షష్టీ సప్తమీ తిథుల యోగానికి పద్మం అని పేరు. ఈ యోగం సూర్యుడికి అత్యంత ప్రీతికరం. సూర్యుడికి 'అర్కః' అనే నామం కూడా వుంది. అర్క అంటే జిల్లేడు ఆకు అందుకే సూర్యుడికి జిల్లేడు అంటే అమిత ప్రీతి. రథసప్తమి రోజున ఏడు జిల్లేడు ఆకులను తలపై, భుజాలపై పెట్టుకుని
జననీ త్వంహి లోకానాం సప్తమీ సపసప్తికే !
సప్తంయా హ్యదితే దేవి నమస్తే సూర్యమాతృకే !!
అని జపిస్తూ నదీస్నానం చేసినట్లయితే ఏడు జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని గర్గమహాముని ప్రభోదించాడు. స్నానం అయిదు రకాలు నదీ స్నానం కలిగి ఉంటుందని పండితులు చెబుతున్నారు. అవి సూక్తము, సంకల్పము, మార్జనము, అఘవర్షనము, తర్పణము. తెల్లవారు ఝామున నాలుగు నుండి ఐదు గంటల లోపల స్నానం అది ఋషిస్నానం అంటారు. ఐదు నుండి ఆరు లోపల చేస్తే అది దైవస్నానం, ఆరు నుంచి ఏడు గంటల మధ్య చేస్తే అది మానుష స్నానఫలం, అటు తరువాత చేసేదే రాక్షస స్నానం. భార్యాభర్తలు నదీ స్నానం చేసే సమయంలో కొంగును ముడివేసుకుని స్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత నాలుగు గుప్పిళ్ళ మట్టిని నదిలోనుంచి తీసి గట్టుపై వేయాలి. దీనివల్ల మనం చేసిన స్నాన ఫలం ఆ నది త్రవ్వించిన వారికీ కొంత చెందుతుంది, పూడిక తీసిన ఫలితం మనకు దక్కుతుంది. రథసప్తమిరోజున సూర్య వ్రతాన్ని ఆచరించేవారు నెత్తిమీద లోహపు ప్రమిదలో దీపం పెట్టుకుని స్నానం చేయాలి. బంగారు, వెండి, రాగి, వీటిలో దేనితోనయినా చేసిన దీపప్రమిదలో దీపం వెలిగించి, ఆ దీపాన్ని నెత్తిపై పట్టుకొని, నది లేదా చెరువు దగ్గరకు వెళ్ళి సూర్యుణ్ణి ధ్యానించి, ఆ దీపాన్ని నీళ్ళలో వదలి, ఎవరూ నీటిని తకకకుందే స్నానం చేయాలి. స్నానం చేసే సమయంలో ఏడు జిల్లేడు ఆకులు కానీ, ఏడు రేగు ఆకులుగానీ తలపై పెట్టుకోవాలి. సూర్యుడి ముందు ముగ్గు వేసి, ఆవుపిడకలపై ఆవుపాలతో పొంగలి చేసి, చిక్కుడు ఆకులపై ఆ పొంగలిని పెట్టి సూర్యుడికి నివేదించాలి. ఈ రోజునుండి పగటి సమయం ఎక్కువగానూ, రాత్రి సమయం తక్కువగానూ ఉంటుంది. సూర్యుడు జన్మించిన ఈ మాఘమాసంలో రథసప్తమి రోజున సూర్యుడిని పూజించే అవకాశం లేనివారు ఎదో ఒక ఆదివారం రోజున పూజించినా సత్ఫలితం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు.
రథసప్తమి రోజున సూర్యుడికి పూజలు, దానధర్మాలు, వ్రత పారాయణ, ఉత్తములు, అర్హులైన వారికి దానం ఇవ్వాలి అని ఇలా చేస్తే సర్వరోగ విముక్తి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని కాంభోజరాజుకు పూర్వం ఎప్పుడో ఋషులు చెప్పిన విషయాన్నీ కృష్ణుడు, ధర్మరాజుకు చెప్పాడట. ఆ కాంభోజ రాజు కథ ఏమిటంటే …
పూర్వకాలం కాంభోజ దేశాన్ని యశోవర్తుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు లేకలేక ముసలితనంలో ఒక కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టాడు అన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే దక్కింది. పుట్టిన బిడ్డ ఎప్పుడూ ఎదో ఒక రోగంతో బాధపడుతూ ఉండేవాడు. అలా జబ్బుపడిన కొడుకునుచూసి రాజుకు ఎంతో దిగులు వేసింది. ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయే సరికి ఋషులను పిలిపించి తన కుమారుడికి కలిగిన అనారోగ్యాన్ని గురించి వివరించి దానికి విరుగుడు తెలియచేయమన్నాడు. త్రికాల వేదులైన ఆ ఋషులు రాజకుమారుడిని చూసి ఆ బిడ్డ గతజన్మను వీక్షించారు. గతజన్మలో ఎంతో సంపన్నుడు అయినా ఎవరికి కూడా ఎటువంటి దానం కూడా చేయలేదు. అయితే అతడి జీవితం చరమాంకంలో ఒకసారి ఎవరో చేస్తూ ఉన్న రథసప్తమి వ్రతాన్ని చూశాడు కాబట్టి ఆ పుణ్యఫలం కారణంగా రాజు ఇంట జన్మించాడు. సంపదలు ఉండి దానం చెయ్యని పాపానికి రాజకుటుంబంలో జన్మించినా నిరంతరం రోగగ్రస్తుడై ఉంటున్నాడని ఋషులు తెలియజేశారు. తన బిడ్డ ఆ విషమ పరిస్థితి నుండి బయటపడడానికి ఏదైనా ఉపాయం చెప్పమని మహారాజు ఋషులను వేడుకున్నాడు. అంతట ఋషులు రథసప్తమీ వ్రతాన్ని శాస్త్ర విధిగా చెయ్యమని, అలా చేస్తే రాజకుమారుడికి సంక్రమించిన రోగాలు నశిస్తాయని చెప్పారు. ఈ వ్రతం కారణంగా ఆరోగ్యంతో పాటు సకల సంపదలు లభిస్తాయని చెప్పారు. స్త్రీ పురుషులు ఎవరైనా ఈ వ్రతం ఆచరించవచ్చు అంటూ విధివిధానాలను వివరించారు. కాంభోజ మహారాజు కూడా తన బిడ్డతో రథసప్తమి వ్రతాన్ని చేయించిన తరువాత ఆ బిడ్డ సర్వ రోగాలనుండి విముక్తి పొంది తరువాతి కాలంలో రాజ్యానికి రాజయ్యాడు. ఈ వ్రతాన్ని మాఘశుద్ధ సప్తమినాడు నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయాన్నే లేచి తలపై జిల్లేడు ఆకులు, రేగిపళ్ళు పెట్టుకుని నదీస్నానం చేసి దగ్గరలోని సూర్యదేవాలయానికి వెళ్ళి అర్చనలు చేయించుకోవాలి. శక్తిమంతులు సూర్యుడి విగ్రహాన్ని చేయించి ఇంటివద్దనే ఆరాధించుకోవచ్చు. ఈ వ్రతానికి ఉద్యాపన అంటూ ఏమీ లేదు. నిత్యజీవితంలో ప్రతీ ఏటా ఆచరించదగినది.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML