అగస్త్యమహర్షి
పూర్వము ఒకసారి తారకాదులు (రాక్షసులు) దేవతలను బాధించుచుండగా వారిని సంహరించమని అగ్నికి మరియు వాయుదేవులకు మహేంద్రుడు ఆజ్ఞాపించెను. అగ్నివాయువులు యిరువురు రాక్షసజాతిని నాశనం చేయుచుండిరి కొందరుభయపడి సముద్రమున దాగికొనిరి. కొంత కాలమున వారు పగటివేళ సముద్రమున దాగి, రాత్రివేళ దేవతలను ఇబ్బంది పెట్టసాగిరి. అంతట మహేంద్రుడు ఆగ్రహముతో అగ్నివాయువులను పిలచి నా ఆజ్ఞను పూర్తిగా అమలు చేయని కారణంగా నేడు, మరల రాక్షసులతో దేవతలకు యిబ్బందులు ప్రారంభమైనవి మీరు సముద్రమును యింకించి అయినా రాక్షససంహారం చేయండి అని ఆజ్ఞాపించెను. అపుడు మహేంద్రా! సముద్రమును ఎండబెట్టుట ద్వారా అందుండ జీవరాశి నశించును అది మహా దోషము. వేరొక మార్గము ఆలోచింపమని వేడుకొనిరి. అందుకు ఆగ్రహించిన దేవేంద్రుడు అగ్నివాయువులతో "మీరు నా ఆజ్ఞను ధిక్కరించిరి కాన మీరు భూలోకములో అచేతన పదార్దముల నుండి మునులై పుట్టండి అని శపించిరి. అటుపిమ్మట విష్ణువు ధర్మిని సుతులగు నరనారాయన అవతారం ఎత్తి గంధమాదన పర్వతమున ఉగ్రతపస్సు చేయసాగెను. నరనారాయణుల అపూర్వ తపోవైభవమునకు అసూయపడిన యింద్రుడు వారి తపము విఘ్నము చేయసంకల్పముతో మన్మధునికి ఆ కార్యము అప్పగించెను. మహేంద్ర ఆజ్ఞతో రతీమన్మధులు పెక్కు అప్సరసలతో వెళ్ళి వారి కళానైపుణ్యాలతో పదర్శించసాగిరి. అంతట నారాయణ మహర్షి తన తొడనుండి ఒక జగదేక సుందరిని సృష్టించెను. నారాయణుని ఊరువునుండి పుట్టినది కావున ఆమెకు "ఊర్వశి" అని పేరువచ్చినది.
ఆమె అందానికి సూర్యుడు మోహించి ఆమెను తనతో సఖింప తనతో రమ్మనెను. ఆమె సరియని వెళ్లసాగెను. వరుణదేవుడు ఆమెను చూచి మోహించి ఆయన తన కోరికను వెళ్లబుచ్చెను. అంతట ఆమె వరుణునితో నేను యింతకు ముందే సూర్యునిచే ఆహ్వానించబడితిని అని చెప్పెను. అందుకు వరుణుడు నీ మదిలో నా గురించి ఆలోచించుము అని కోరగా ఆమె అటులనే చేసెను. అందుకు ఆగ్రహించిన సుర్యుడు ఓసీ మనసు వేరొక పురుషుని చింతించుచూ నా దగ్గరకు వత్తువా, నీవు స్త్రీలు ఎవరూ చేయని అపరాధము చేసితివి కావున నీవు భూలోకములో బుధపుత్రుడగు పురంరవునికి పత్నివిగా జన్మింపుము" అని శపించెను. అయినను ఆ సూర్యభగవానునికి, వరుణదేవులకు కామోపశమనము కాదయెనను వారిరువురికి వీర్యపతనము కాసాగెను, దీనికి వారిరువురూ ఆశ్చర్యపడి యిది మహేంద్రుడు అగ్నివాయువులకు యిచ్చిన శాపప్రభావము అయివుండవచ్చునని గ్రహించి అగ్నియందు సూర్యుడు వాయువు యందు వరుణుడు ప్రవేశించి వారిరువురూ లోక సంరక్షణార్దం వారి వీర్యము ఒక పూర్ణ కలశము నందు విడిచి వెళ్ళిపోయిరి. కాలక్రమమున ఆకలశమునుండి అద్భుత తేజస్సుకలిగిన అగస్త్య, వశిష్టులు ఉద్భవించిరి. అందులకే వారికి "కలశజు"లు అని "కుంభసంభవులు" అని "ఔర్యశేయులు" అని "మిత్రావరుణులు" అని "వహ్నిమారుతసంభవులు" అని పేరు వచ్చినది.
అగస్తుని బాల్యావస్థనుండి మహా నిష్ఠాగరిష్టినిగా కాలక్షేపం చేయసాగాడు ఆయనకు దేవతలే బాల్యంలో ఉపనయనాది సంస్కారము చేశారు. ఉపనయనానంతరము ఆయన నిష్టాతిశయనమున బ్రహ్మచర్యా పాలనకు ఉగ్రతపస్సు చేశారు. నిరాహారుడై తపస్సు చేయు అగస్త్యుడు దివ్యతేజస్సంపన్నుడు అయినారు. బ్రహ్మచర్యాశ్రమంలోనే గడుపు అగస్త్యునికి ఒకనాడు పితృదేవతలు కనిపించిరి. నీవు నీవు పుత్రపౌత్రులను పొందినచో మాకు ఊర్ద్వలోకములు పొందు అవకాశం వచ్చును కావున నీ బ్రహ్మ చర్య దీక్షవలన మాకు భరింపరాని వేదన కలుగుతున్నది. నీవు గృహస్తుడవై మాకు ఉత్తమ లోక ప్రాప్తి కలుగ చేయమని ప్రార్ధించిరి వారికోరికను తీర్చెదను అని తెలిపి వారి ఆశీస్సులు పొందెను.
అగస్త్యుడు విదర్భరాజుకు ఒక చక్కని పుత్రికలుగునటుల ఆశీర్వదించెను. ఆ వరము వలన "లోపాముద్ర" అను పుత్రిక కలిగినది. ఒక నాడు అగస్త్యుడు విదర్భరాజు దగ్గరకు వచ్చి లోపాముద్రను తనకిచ్చి వివాహం చేయమని అడుగగా అందుకు విదర్భరాజు భీతిచెందెను. అప్పుడు లోపాముద్ర విదర్భరాజు కడకు వచ్చి అగస్త్యుని వివాహమాడుట తన అభీష్టమని తెలిపెను. వారివివాహము అత్యంత వైభవముగా జరిగినది. ఆ వివాహము జరిగిన ప్రదేశమునకు "సిద్దతీర్దం" అనే పేరుతో లోక ప్రశిద్దమయినది. అనంతరం అగస్త్యలోపాముద్రలు గంగాతీరమున ఒక ఆశ్రమం ఏర్పాటుచేసుకొని "గార్హస్థ్య"ధర్మములు పాటించుచూ తపోవృత్తి సాగించుచుండెను.
ఒక నాడు అగస్త్య్యుడు లోపాముద్రను సంభోగింపదలచగా ఆమె తనకు సమస్తాభరణములు సన్నిత వస్త్రములు అడిగెను. అందుకు అగస్త్యుడు తపోధనము దుర్వినియోగమ్ చేయకూడదనే కోరికతో శ్రుతర్వుడను రాజు దగ్గరకు వెళ్ళిరి. ఆకార్యము అక్కడ తీరకపోయే సరికి యిరువురూ కలసి బ్రధ్నశ్వుని దగ్గరకు వెళ్ళిరి. అక్కడా కార్యము కాకపోయే సరికి ముగ్గురు కలసి త్రసదస్యుడు అను రాజుదగ్గరకు పోయిరి అక్కడ పనుకాకపోయే సరికి నలుగురు కలిసి ఇల్వలుడు అనే రాక్షసుని దగ్గరకు పోయిరి.
వాతాపి,యిళ్వలురు యిరువురుసోదరులు ఆరిలో వాతాపిని మేకను చేసి వధించి బ్రహ్మణునికి భోజనం పెట్టి తర్వాత యిళ్వలుడు వాతాపిని పిలవసాగెను. వాతాపి కామరుపి అందువలన ఆయన మేకరూపము పొందుట మరియు యిళ్వలుడు పిలువగానే పొట్టచీల్చుకొని బయటకు వచ్చుట తేలికపని అయిపోయినది. అలా వీరు ఎందరినో చంపివేసిరి. అగస్త్యుడు మువ్వురు రాజులతో కలసి అక్కడకు రాగా రాజులు అగస్త్యునికి వాతాపి యిళ్వలను గురించి తెలిపిరి అయితే యధాప్రకారం వాతాపి మేకగా మారి అగస్త్యునికి భోజనం పెట్టగా భోజనానంతరం అగస్త్యుడు "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం" అనెను. అంతటితో భీతి చెందిన యిళ్వలుడు రాజులకు అమితమైన ధనమును యిచ్చెను. అగస్త్యుడు యిళ్వలుని కూడా మర్ధించెను. అగస్త్యుడు లోపాముద్ర అడిగిన వస్త్రభూషణాదులు అందించి ఆమెద్వారా "దృధస్యుడు" అను పుత్రుడిని కనెను. ఆ తర్వాత దృడస్యునికి తేజస్వి అను పుత్రుడు కలిగెను. ఈ ప్రకారం పుత్రపౌత్రులు కలుగుట ద్వారా పితృదేవతలకు ఉత్తమలోక ప్రాప్తి కలిగినది. శ్రీమన్మహాభారతం అరణ్యపర్వంలోనిది ఈ కధ.
ఒక నాడు అగస్త్యమహాముని ఆశ్రమానికి బ్రహ్మదేవుడు వచ్చారు. ఆయనకు అర్ఘ్యపాద్యములు యిచ్చి రాకలోని ఆంతర్యం అడిగితెలుసుకున్నారు అగస్త్యమహర్షి. పూర్వము కవేరరాజు ముక్తి కొరకు ఘోర తపము చేసెను. అంతట శివుడు ప్రత్యక్షమై బ్రహ్మగూర్చి తపము చేయుము నీ కార్యం సిద్దించును అని చెప్పెను. అతడు బ్రహ్మనుగురించి తపము చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై నీ కోరిక సిద్దించుటకు గాను నా కుమార్తె అగు "విష్ణుమాయ"ను నీ కూతురుగా జన్మించు అవకాశము కల్పించెదనని చెప్పెను. అలాగే విష్ణుమాయ కవేరరాజు పుత్రిక అయినది. ఆమె అంశయే లోపాముద్ర, కవేరరాజుకు మోక్షము కొరకు ఆమె ఘోరతపస్సు చేయుచున్నది. ఈ కధ బ్రహ్మ అగస్త్యునికి తెలిపి ఆమెను వివాహము చేసుకోవలసినదిగా ఆజ్ఞాపించెను. అందుకు అంగీకరించిన అగస్త్యుడు ఆమె తపము చేయు ప్రదేశమునకు పోయి జరిగినది చెప్పి ఆమెను వివాహమాడెను. ఆమె అగస్త్యుని అనుమతితో నదీరూపము దాల్చెను. అగస్త్యుడు తన కమండలములోనే ఆమెను భద్రము చేసుకొనెను.
కృతయుగమున ఒకప్పుడు వృత్రాసురుడు అనే రాక్షసుడు కాలకేయుదులతో కలసి దేవతలను భాధింపసాగెను. అంతట బ్రహ్మయొక్క ఆదేశముతో యింద్రాదులు దధీచి యొక్క అస్తికలను ఆయుధములుగా చేసి వాటితోనే వృత్రాసుర సంహారం చేసిరి. కాలకేయాదులు సముద్రంలో దాగికొని రాత్రివేలయందు లోకములో బ్రహ్మణసంహారం చేయసాగిరి. అపుడు దేవతలు విష్ణువును ప్రార్థింపగా అగస్త్యునకు సముద్రజలం మొత్తం తాగివేయగలశక్తి ఉన్నది. అతనిని ప్రార్దించి సముద్రపానానంతరం రాక్షససంహారం చేయండి అని చెప్పెను. వారట్లే చేసిరి. అయితే రాక్షస సంహారం అనంతరం దేవతలు ఆ సముద్రము ఎన్నో జీవరాశులకు ఆశ్రయము అందువలన తిరిగి పూరింపమనగా ఆ సముద్రనీరు నాకు ఇదివరకే జీర్ణమయినది నేనిప్పుడు కేవలము మూత్రముద్వారానే పూరింపగలను అని చెప్పి సముద్రమును పునఃనిర్మించెను.
శ్రీరాముడు అరణ్యవాసారంభంలో అగస్త్యుని ఆశ్రమమునకు రాగా అగస్త్యుడు శ్రీరామునికి వైష్ణవమైన విల్లు, అక్షయ తూర్గీరం, దివ్యఖడ్గం యిచ్చి గౌతమ నదీ తీరంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకోమని సూచనలు ఇచ్చెను. రామరావణ యుద్ద సమయంలో రాములవారికి అగస్త్యుడు కనిపించి యుద్దం జయం కోసం "ఆదిత్య హృదయం"ను ఉపదేశించెను. యుద్దానంతరం పట్టాభిషేక సమయాన అగస్త్యుడువచ్చి ఆశీర్వదించెను. అంతేకాక రాముని కోరికపై రావణుని వృత్తాంతము తెలియ జేసెను.
సహ్రుషుడనే రాజు తన యజ్ఞఫల ప్రభావంగా యింద్ర పదవి పొందెను. ఆ తర్వాత భోగలాలసుడై శచీదేవితో పొత్తు కావలననే కాంక్ష తెలుపగా ఆమె ఆత్మసంరక్షణార్దం ఒక కోరిక కోరినది. "మునివాహనుడవై నాకడకు రమ్ము" అనెను అతడు ఆకోరికను అమలు చేయు సందర్భంలో అగస్త్యుని కాలితో తన్నెను. అంతట ఉగ్రుడై అగస్త్యుడు సహ్రుషుని శపించెను. వెంటనే సహ్రుషుడు యింద్రాసనమునకు పోయి పాము రూపము ధరించెను యిలా శచీదేవికి రక్షణచేసెను.
అగస్త్యుడు తారక బ్రహ్మోపదేశము పొందుటకై అవిముక్త క్షేత్రము చేరి తపస్సుచేయసాగెను. సూర్యచంద్రుల గమ్యమునకు అవరోధము కలిగించుచూ వింధ్యపర్వతము పెరిగిపోయినది. దానికి మేరు పర్వతము మీద ఉన్న అసూయ, కోపమే కారణము. సూర్యచంద్రగమనము సరిలేక సృష్టి అవకతవకలు అవ్వసాగెను. బ్రహ్మ ఆనతితో అగస్త్యుని కడకు చేరిరి. బృహస్పతి అగస్త్యుని ప్రార్దించి వింధ్యవిషయమును తెలిపెను. అందుకు సమ్మతించిన అగస్త్యుడు లోపాముద్రతో కలసి బాధతో కాశీని విడచి వింధ్యపర్వత ప్రాంతము చేరెను. అగస్త్యుని రాకతో వింద్యపూర్వాకృతి పొందెను అంతే కాకుండా పర్వదుడు పురుషాకృతుడై వచ్చి వంగి అగస్త్యునికి నమస్కరించెను. అంతట అగస్త్యుడు వింధ్యపర్వతముతో మేము దంపతులము ఇరువురుమూ దక్షిణదేశ యాత్రకై వెళ్ళుచుంటిమి. మేము వయోభారముచే పర్వతం ఎక్కిదిగుట కష్టము కావున మేము వచ్చువరకు యిటులనే వంగివుండమని తెలిపిరి. అలా వింధ్యపర్వతం ద్వారా దేవతల కష్టాలుతీర్చి లోపాముద్రతో కలసి దక్షిణదేశీయము చేసిరి. యిలా ఎన్నో విశేషగాధలు అగస్త్యునిగూర్చిగలవు.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment