ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం !!
పరమ శివుడు తన పూర్తీ శక్తి ప్రపత్తులతో పవిత్ర భారత భూమిలో 12 ప్రదేశాల్లో స్వయంభువుగా వెలిశాడు. ఈ పన్నెండు ప్రదేశాలను ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వ్యవహరిస్తారు. ఈ పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒక్కోదాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వం దేవగిరి సమీపంలో సుధర్ముడు – సుదేహ అనే దంపతులుండేవారు. వీరికి ఎంతకాలమైనప్పటికీ సంతానభాగ్యం కలుగలేదు. ఒకరోజు ఆ ఇంటికి బ్రహ్మతేజోవిరాజితుడైన ఒక యతీశ్వరుడు భిక్ష కోసం వచ్చాడు.అతనిని సాదరంగా ఆహ్వానించిన దంపతులు ఆ యతీశ్వరునికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. భోజనం చేస్తున్న సమయంలో ఆ దంపతులకు సంతాన భాగ్యం లేదన్న విషయాన్ని తెలుసుకున్న యతీశ్వరుడు, సంగంలోనే భోజనాన్ని వదిలేసి వెళ్ళసాగాడు. సంతానంలేనివారి ఇంట్లో భోజనం చేయకూడదన్నది ఆ యతీశ్వరుని నియమం. ఆ దంపతులు యతీశ్వరుని కాళ్ళపైబడి ప్రార్థించగా, త్వరలోనే సంతాన భాగ్యం కలుగుతుందని దీవించాడు. పెళ్ళికి ముందు సుదేహ జాతక చక్రాన్ని పరిశీలించిన పండితులు, ఆమెకు సంతానప్రాప్తి లేదని చెబుతారు. ఆ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్న సుదేహ, తన చెల్లెలు ఘుశ్మను పెళ్లి చేసుకోమని భర్తకు చెబుతుంది. సుధర్ముడు ఒప్పుకోకపోయినప్పటికీ, సుదేహ పట్టుబట్టి భర్తకు రెండవ పెళ్లి జరిపిస్తుంది. అలా కొంతకాలం సుఖంగా ఉన్నారు. పరమపతివ్రతియైన ఘుశ్మ, అక్క సుదేహను తల్లిలా, భర్తను దైవసమానునిగా భావించి సేవిస్తుండేది. అచిరకాలంలోనే ఘుశ్మ గర్భవతి అయింది. ఒక శుభదినంలో ఆమె మగబిడ్డను ప్రసవించింది. ఆ పిల్లవాడు దినదినప్రవర్ధమానంగా పెరగసాగాడు. అయితే సుదేహ మనసులో అసూయాజ్వాలలు రేగాయి. తన చెల్లెలు, చెల్లెలి కొడుకుపై ఈర్ష్వాద్వేషాలను పెంచుకొసాగింది. ఒకరోజు రాత్రి సుదేహ, పసివాని గొంతు కోసి, తలను మొండేన్ని వేరువేరుగా చెరువులో విసిరేసింది. ఇదంతా తెలియని ఘుశ్మ ఉదయాన్నే లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసేందుకు సరోవరానికివెళ్ళింది. అక్కడ ఆమె కుమారుడు తల్లి పాదాల దగ్గరకు ఈదుకుంటూవచ్చి, ‘అమ్మా! నేనొక పీడకల కన్నాను. అందులో నేను చచ్చి బ్రతికినట్లు కనిపించింది.’ అని చెప్పాడు. కొడుకు చెప్పిన సంగతిని విన్న ఘుశ్మ దిగ్ర్భమ చెంది,ఎందుకిలా జరిగింది? ఇది కలా? నిజమా? అని ఆలోచించసాగింది. అలా ఆమె దీర్ఘాలోచనాలోనుండగా, శివుడు ప్రత్యక్షమై సుదేహ చేసిన ఘోరకృత్యాన్ని చెప్పి,ఆమెను శిక్షిస్తానని పలుకుతాడు. ఆప్పడు శివుని కాళ్ళపై బడిన ఘుశ్మ, తన అక్కకు ఎటువంటి దండన వద్దని, మారుగా ఆమెకు మంచి బుద్ధి, సౌశీల్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించింది. ఆమె ప్రార్థనను విని సంతసించిన శివుడు, ‘తల్లీ! నీ కోరిక ప్రకారమే జరుగుతుంది ఘృష్ణేశ్వరనామంతో ఇక్కడె కొలువై ఉండగలవాడను. నీవు దీర్ఘసుమంగళెవై చిరకాలం వర్థిల్లి, చివరకు నా లోకాన్ని చేరుకుంటా’ వని ఆశీర్వదించి అంతర్థానమయ్యాడు.
No comments:
Post a Comment